ఆమెకు 20 చేతులు ఐదు తలలు..!

22 Oct, 2021 18:36 IST|Sakshi
20చేతులు, ఐదు తలలు ఉన్న మహామాత ఎల్లమ్మ విగ్రహాం

ఆసిఫాబాద్‌ జిల్లాలో అరుదైన శిల్ప కళ వెలుగులోకి..

చాళుక్యుల కాలం నాటి మహామాత ఆలయంగా గుర్తింపు

సాక్షి, మంచిర్యాల: తెలంగాణ కొత్త చరిత్ర పరిశోధన బృందం ఇన్నాళ్లు మరుగున పడిన చరిత్రను వెలుగులోకి తీసుకొస్తున్నారు. తాజాగా ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలం కేంద్రంలో పురాతన ఆలయ గొప్పతనాన్ని గుర్తించారు. చాళుక్యుల (6–12శతాబ్దం) కాలం నాటి అద్బుతమైన ప్రాచీన దేవాలయ విశిష్టతను తెలియ జేస్తున్నారు. ఇక్కడి విగ్రహాలు ఎంతో ప్రత్యేకతను కనబరుస్తున్నాయి.

ఆలయం 

ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వాంకిడిలోని గుడిలో కొలువై ఉన్న ప్రధాన దేవత మహా మాత ఎల్లమ్మ. ఈ దేవతా శిల్పాన్ని పరిశీలిస్తే... ఉమాలింగనమూర్తి శిల్పంలో ఉన్నట్టే సుఖాసనంలో కూర్చుని ఉంది. ఆమెకు 20 చేతులున్నాయి. తల మీద తల ఐదు తలలున్నాయి. 
(చదవండి: పాపం చిట్టితల్లి.. రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వస్తేనే వైద్యం)

ఆలయంలోని పూరతన విగ్రహాలు

ఇద్దరికి కింద వాహనంగా రెండు చేతులు, కాళ్లు నేల మీద మోపి వంగి వున్న రాక్షసుడున్నాడు. ఈ గుడిలో సప్తాశ్వరథారుఢుడైన ఆదిత్య శిల్పం మనోహరం, సర్వాంగ సుందరంగా తోరణాదులతో హళేబీడు శిల్ప శైలిలో ఉంది. ఖజురహోలోని సూర్య శిల్పాన్ని పోలి వుంది. గర్బగుడి ద్వారం చాళుక్య పూర్వ శైలిలో కవాట పద్దతిలో కడప, శేరెల మీద స్తంభోప స్తంభాలున్నాయి. 

ఉత్తరాశి మీద ప్రస్తరం ఉంది. లలాటబింబంగా గణపతి ఉన్నాడు. గర్బగుడిలో క్షితిజసమాంతరంగా ఉన్న వర్తులాకార పానపట్టంలో సమతల శివలింగం ప్రతిష్టించబడి ఉంది. ఇది చాళుక్య శైలి లింగం. ఈ దేవాలయం కాలాముఖ శైవులది. ఇక్కడ శాక్తేయమతం కూడా ఉందని శిల్పాల వల్ల తెలుస్తున్నది. ఇటువంటి శిల్పాలున్న దేవాలయం తెలంగాణలోనే చాలా అరుదు. మధ్య భారత దేవాలయ వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించిన గుడి ఇది. ఈ వివరాలన్నీ యువ పరిశోధకుడు సముద్రాల సునీల్‌ వెలుగులోనికి తెచ్చాడు. 
(చదవండి: మీకు తెలుసా? పోలింగ్‌ సమయంలో ‘సెక్షన్‌ 49పీ’ అంటే ఏంటో)

ఆలయ అభిముఖం

గుడిలోని విడి శిల్పాలు...
లోహకారుల దేవత మహామాయ ( శిల్పం మీద పేరు చెక్కి ఉంది ) శాంకరి, చాముండ ఉమాలింగనమూర్తి (ఈ శిల్పం మీద దేవాలయ నిర్మాత రాజు ప్రతిమ ఉంది). లక్ష్మీ నారాయణ స్వామి, అనంతశయనుడు, గరుత్మంతుడు, త్రై పురుష మూర్తి, విష్ణువు, పాశుపతయోగులు, భైరవులు, వీర భద్రులు, గణపతి ప్రతిమలున్నాయి. ఇందులో కొన్ని చాళుక్య శైలి శిల్పాలు, గుడి బయట వీరగల్లులున్నాయి. 

ఆలయంలోని పూరతన విగ్రహాలు

గుడి జగతి మీద శిల్పాలు...
వాంకిడి శివాలయం ఎత్తైన జగతి మీద నిర్మితమైంది. జగతి మీద గజధార, అశ్వధారలతో పాటు కొన్ని పౌరాణిక కథా దృశ్యాలు చెక్కి ఉన్నాయి. వాటిలో అశ్వ, గజసైన్యాలు, గజాల యుద్ద దృశ్యాలున్నాయి. పాశుపతయోగుల శిల్పాలున్నాయి. గోపికా వస్త్రాపహరణం, అశ్వమేథాశ్వం కొరకు వచ్చిన రామ సోదరులతో లవకుశులు యుద్ద దృశ్యం, పాండవులు, పెండ్లి, మంగళస్నానాలు, చతుష్పాద నటత్రయం (రామప్ప పూర్వ శిల్పం ), నాట్య కత్తె, సింహవ్యాళి, ఒక చోట ఇద్దరు పరిచారికల చేత సేవింపబడుతున్న శైవ గురువు సుఖాసనంలో కూర్చుని వున్నాడు. చివరలో ఇద్దరు అప్సరలు చేతులు పట్టుకొని కొనిపోతున్న వీరుడున్నాడు. ఇదొక ఆత్మాహుతి వీరగల్లు దృశ్యం.
(చదవండి: తోబుట్టువులతో మేటర్‌ చెప్పిన యువతి.. ప్రియుడు మాట దాటవేస్తుండటంతో..)

మరిన్ని వార్తలు