పరుగుల చిరుత.. శిక్షకుడిగా సత్తా చాటి..

21 Oct, 2021 23:36 IST|Sakshi
సాధించిన మెడల్స్‌తో తోళ్ల సాయి

నేలకొండపల్లి: అతనిలో చిరుతలోని వేగం ఉంది. పరుగు మొదలు పెడితే గమ్యం చేరే దాక విశ్రమించడు. పలు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని తన సత్తా చాటాడు.  ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని సుర్దేపల్లి గ్రామానికి చెందిన తోళ్ల స్థాయి. అతనికి చిన్న తనం నుంచే పరుగు పందేలు అంటే ఆసక్తి.  దమ్మపేట గురుకుల పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశం పొంది రాధాకృష్ణ వద్ద అథ్లెటిక్స్‌లో శిక్షణ పొందారు.

యూనివర్సిటీ స్థాయిలో ప్రతిభను ప్రదర్శించారు. రాజీవ్‌ గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కర్ణాటక ఆధ్వర్యంలో 2016లో నిర్వహించిన అఖిలభారత విశ్వ విద్యాలయం తరపున క్రాస్‌ కంట్రీ 12 కిలో మీటర్ల పరుగు పందెంలో కాకతీయ విశ్వవిద్యాలయము తరుపున పాల్గొన్నారు. కాకినాడలో నిర్వహించిన సౌత్‌ జోన్‌ పోటీలో పాల్గొని సత్తా చూపారు. అలాగే జాతీయ క్రీడా సంస్థలు నిర్వహించిన పోటీలో పాల్గొని బహుమతులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

శిక్షకుడిగా సత్తా చాటి..
జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న సాయి అథ్లెటిక్స్‌ కోచ్‌ గా గుర్తింపు పొందారు . పటియాల నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జాతీయ క్రీడా సంస్థ స్పోర్ట్స్‌  శిక్షకుడిగా ట్రైనింగ్‌ తీసుకున్నారు. దోమలగూడా ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయ కాలేజీ నుంచే డిప్లమా  ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్స్‌ లో శిక్షణ పొందారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ టెక్నికల్‌ అఫీషియల్స్‌ 2019 లో చోటు సాధించారు.

గ్రామస్థాయి యువతకు శారీరక దృఢత్వం క్రీడాస్ఫూర్తిని అందించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.వేసవి శిబిరాలు నిర్వహిస్తూ. ప్రతి ఏటా వేసవికాలంలో జిల్లాలోని విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని పెంచేలా శిక్షణ ఇచ్చారు. శిబిరాలను నిర్వహిస్తున్నారు. పాల్గొన్న యువతకు అథ్లెటిక్స్‌ లో శిక్షణ ఇస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. జుంప్స్‌ అండ్‌ త్రోస్‌ విభాగంలో విద్యార్థులకు మార్గనిర్దేశం  చేస్తున్నారు. పలుమార్లు 2కే, 3కే రన్‌లు నిర్వహించారు.

ప్రతిభావంతులను తయారు చేయడమే లక్ష్యం
గ్రామస్థాయిలో చాలామంది క్రీడాకారులు ఉంటారు. వారికి సరైన అవకాశాలు  లేక , శిక్షణ లేక ఎందరో క్రీడాకారులు మరుగున పడుతుంటారు.పాఠశాల స్థాయి నుంచి క్రీడా శక్తిని పెంపొందించి ప్రతిభావంతులైన క్రీడాకారుల ను తయారు చేయడమే నా లక్ష్యం.  -తోళ్ల సాయి, అథ్లెటిక్స్‌ కోచ్‌

మరిన్ని వార్తలు