ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ కేంద్ర కారాగారంలో ఓ ఖైదీ మరో ఖైదీపై దాడి చేసిన సంఘటనపై గురువారం ఆరిలోవ పోలీస్ స్టేషన్లో జైలు అధికారులు ఫిర్యాదు చేశారు. జైల్ సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మీర్ ఖానా కడప జైల్లో శిక్ష అనుభవించేవాడు. అక్కడ అతని ప్రవర్తన బాగాలేకపోవడంతో జైల్ శాఖ అధికారులు రెండేళ్ల క్రితం విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. తాను నమాజ్ చేసుకుంటానని గోల చేయొద్దంటూ ఇతర ఖైదీలకు తరచూ చెప్పేవాడు. బుధవారం సాయంత్రం అతనికి సమీపంలో ఉన్న ఓ ఖైదీ బిగ్గరగా మాట్లాడడంతో కర్రతో పొట్టపై పొడిచాడు. దీంతో వెంటనే జైల్ అధికారులు గాయపడిన ఖైదీని కేజీహెచ్కు తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి స్వల్ప గాయం కావడంతో వైద్యం చేసి వెంటనే జైల్కు పంపించేశారు. ఈ ఘటనపై గురువారం జైల్ అధికారులు.. మీర్ఖానా తోటి ఖైదీపై దాడి చేసినట్లు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా మీర్ఖానా కిటికీ నుంచి తీసిన సన్నని ఇనుప ఊచతో దాడి చేసినట్టు విశ్వసనీయ సమాచారం.