‘ప్రియమైన ఎస్‌బీఐ వినియోదారు డా! మీ ఖాతా బ్లాక్‌ అవుతుంది...

16 Mar, 2023 01:30 IST|Sakshi

పార్వతీపురంటౌన్‌: భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ వినియోదారులపై సైబర్‌ నేరగాళ్లు వల విసురుతున్నారు. ముఖ్యంగా ఎస్‌బీఐ యోనో యాప్‌ వాడుతున్న వారిని టార్గెట్‌ చేస్తున్నారని వినియోదారులు అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్‌ సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన స్థానిక డీఎస్పీ కార్యాలయంలో స్టేట్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రవిశంకర్‌తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోనో విషయంలో వచ్చే సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.

‘ప్రియమైన ఎస్‌బీఐ వినియోదారు డా! మీ ఖాతా బ్లాక్‌ అవుతుంది. పాన్‌ నంబరును అప్‌డేట్‌ చేసుకోవడానికి ఈ కింద లింక్‌ను క్లిక్‌ చేయండి’ అంటూ మోసపూరిత సందేశాలను పంపుతూ ఎస్బీఐ వినియోగదారులను సైబర్‌ మోసగాళ్లు టార్గెట్‌ చేస్తున్నారని వాటిని నమ్మవద్దని స్పష్టం చేశారు. ఇటువంటి సందేశాలు, ఈమెయిల్స్‌కు స్పందించవద్దన్నారు. సైబర్‌ నేరగాళ్లు పంపే ఈ సందేశాల్లోని లింక్స్‌ ఓపెన్‌ చేస్తే ఖాతాలో డబ్బులు మాయమవుతాయని తెలిపారు. ఇటువంటి సందేశాలు వస్తే వెంటనే ’రిపోర్ట్‌.ిపిషింగ్‌ ఎట్‌ ఎస్‌బీఐ కో.ఇన్‌’లో రిపోర్ట్‌ చేయాలని ప్రజలకు సూచించారు.

ఎటువంటి పరిస్థితుల్లోనూ ఖాతానంబర్‌, పాస్‌వర్డ్‌, ఓటీపీ సహా ఇతర సున్నిత, వ్యక్తిగత సమాచారాన్ని మెసేజ్‌ రూపంలో పంపవద్దన్నారు. సైబర్‌ నేరగాళ్లు తమ లింక్స్‌ ద్వారా ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి మోసం చేస్తారని, ఏదైనా సైబర్‌ నేరం గురించి నేరుగా ఫిర్యాదు చేయాలంటే 1930 నంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పవచ్చని సూచించారు.

మరిన్ని వార్తలు