కరోనా.. జంతువులతోనా?

19 Nov, 2020 08:39 IST|Sakshi

 ఇప్పటికే గబ్బిలాలు, కుక్కలు, పిల్లులు తదితరాల్లో సారూప్య వైరస్‌ల గుర్తింపు

వీటితో పాటు చిట్టెలుకలు, పందులు, ముంగీస, చుంచు జాతులపై పరీక్షలు

 ఈ జంతువులతో మిగతా జంతువులకు సోకితే వైరస్‌ రిజర్వ్‌లుగా మారే చాన్స్‌

 వీటి ద్వారా మనుషులకు సోకే అవకాశాలు.. పరిణామాలపై సమగ్ర పరిశీలన

 ప్రపంచ వ్యాప్తంగా 500 జంతుజాతులపై అధ్యయనానికి డబ్ల్యూహెచ్‌వో శ్రీకారం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ సంక్రమణ భవిష్యత్తులో పెను ప్రమాదంగా పరిణమించకుండా నియంత్రించే చర్యలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పూనుకుంటోంది. గత 10 నెలలుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్‌ వ్యాప్తికి మానవాళి ద్వారా కూడా అడ్డుకట్ట వేయలేకపోతున్న పరిస్థితుల్లో జంతువుల ద్వారా భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకారి కాకుండా ఉండేందుకు అధ్యయనాలు ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని జంతుజాతులు కరోనా సంక్రమణకు కారణమవుతున్నాయని పరిశోధనల్లో వెల్లడైన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 500 రకాల జంతుజాతులపై పరిశీలన జరపాలని నిర్ణయించిన డబ్ల్యూహెచ్‌వో.. ఇందుకోసం రెండు దశల ప్రణాళికలను తయారుచేసింది. ఈ పరిశోధనల్లో 194 సభ్య దేశా లు భాగస్వాములు కావాలని పిలుపునిచి్చంది. చదవండి:(కరోనాపై కథనాలు.. ఐదేళ్ల జైలు)

మానవులకు ఎంత ముప్పు? 
ఇప్పటికే గబ్బిలాలు, పిల్లులు, కుక్కలు, సింహాలు, పులులు, ప్యాంగోలిన్‌ (అలుగు)లలో కరోనా సారూప్య వైరస్‌లను అనేక పరిశోధనలు గుర్తించాయి. ముఖ్యంగా గబ్బిలాల్లో మార్చిలో గుర్తించిన ఆర్‌ ఏటీజీ13, ఆర్‌ ఎంవై?ఎన్‌02 జీనోమ్‌లలో సార్స్‌ కరోనా వైరస్‌తో 96.2, 93.3 శాతం సారూప్యత ఉందని నిర్ధారించారు. చైనా, హాంకాంగ్, బెల్జియం దేశాల్లో కుక్కలు, పిల్లుల్లో, అమెరికాలోని ఓ జూలో పులులు, సింహాలకు కూడా ఈ వైరస్‌ సోకినట్టు తేలింది. అలాగే నెదర్లాండ్స్, డెన్మార్క్, స్పెయిన్‌ దేశాల్లోని ముంగీస జాతిలో కూడా గుర్తించారు. దీంతో మానవులతో నిత్య సంబంధాలుండే అన్ని రకాల జంతుజాతులపై అధ్యయనానికి రెండు దశల ప్రణాళికను డబ్ల్యూహెచ్‌వో సిద్ధం చేసింది. ఇప్పటికే వైరస్‌ను గుర్తించిన వాటితో పాటు చిట్టెలుకలు, పందులు, ముంగీస, చుంచు తదితర జాతులకు చెందిన 500 రకాల జంతువులపై పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆయా జంతుజాతులపై సీరో ప్రివలెన్స్‌ అధ్యయనాలకు ప్రయత్నాలు ప్రారంభించనుంది.

భవిష్యత్‌ కోసమే..
ఈ జంతువుల ద్వారా ఇతర జంతువులకు సోకడంతో పాటు వైరస్‌ రిజర్వ్‌లుగా మారే ప్రమాదముందనే అంచనాతో పాటు, వీటి ద్వారా మనుషులకు వైరస్‌ సోకే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి.. ఏ జంతువు ఏ స్థాయిలో వైరస్‌ వ్యాప్తి చేయగలదు.. మానవుల విషయంలో ఈ జంతువుల ద్వారా, భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే కోణంలో స్వల్ప, దీర్ఘకాలిక పరిశోధనలు, సమగ్ర పరిశీలన జరపనుంది. అయితే కోడి, సీమకోడి, బాతుల ద్వారా కరోనా వైరస్‌ సంక్రమించబోదని మరోసారి డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు