చెరువులో పడి వ్యక్తి మృతి

17 Mar, 2023 01:56 IST|Sakshi
సురేందర్‌ (ఫైల్‌)

రామగిరి(నల్లగొండ): చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన తిప్పర్తి మండలంలోని పజ్జూరు గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పజ్జూరు గ్రామానికి చెందిన పేరపాక సురేందర్‌(35) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సురేందర్‌ భార్య గతేడాది అనారోగ్యంతో మృతిచెందింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసైన సురేందర్‌ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కాగా గురువారం తెల్లవారుజామున పజ్జూరు సమీపంలోని ఎర్రకుంట చెరువులో సురేందర్‌ మృతదేహం గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రి తరలించారు. మృతుడి బావ కదిరి వీరేందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తిప్పర్తి ఎస్‌ఐ వాస ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

మహిళను వేధించిన

వ్యక్తి రిమాండ్‌

శాలిగౌరారం: మహిళను లైంగికంగా వేధించిన వ్యక్తిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ సతీష్‌ గురువారం విలేకరులకు వెల్లడించారు. మండలంలోని రామాంజాపురం గ్రామానికి చెందిన మహిళను అదే గ్రామానికి చెందిన వేల్పుల వెంకన్న బుధవారం లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. సదరు మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి నిందితుడు వెంకన్నను గురువారం అరెస్ట్‌ చేసి నకిరేకల్‌ కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు. మెజిస్ట్రేట్‌ ఆదేశానుసారం నిందితుడిని రిమాండ్‌ కోసం నల్లగొండ జైలుకు తరలించనట్లు వివరించారు. బాధిత మహిళను నిందితుడు గతంలో కూడా లైంగిక వేధింపులకు గురిచేయడంతో కేసు నమోదు కాగా కోర్టు విచారణలో ఉన్నట్లు ఎస్‌ఐ వివరించారు.

రోడ్డు ప్రమాదంలో

వ్యక్తి దుర్మరణం

దేవరకొండ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం దేవరకొండ పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సతీష్‌ తెలిపిన ప్రకారం.. పట్టణానికి చెందిన నీలా మల్లేశ్‌(32) మేసీ్త్ర పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పట్టణంలోని మహబూబ్‌నగర్‌ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. గురువారం తన బైక్‌లో పెట్రోల్‌ అయిపోవడంతో ముదిగొండ ఎక్స్‌రోడ్డు వద్ద పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్‌ పోయించుకొని అదే ఇంటి వద్దకు బయల్దేరాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న మరో బైక్‌ మల్లేశ్‌ ద్వికచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య వజ్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు