తప్పతాగి..కారులో దూసుకెళుతూ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి నిర్వాకం
నాలుగు ప్రాంతాల్లో ప్రమాదాలు
ఒకరి మృతి, 9 మందికి గాయాలు
హైదరాబాద్: తప్ప తాగిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కారులో దూసుకెళుతూ గంట వ్యవధిలోనే నాలుగు ప్రాంతాల్లో ప్రమాదాలు చేయడమేగాక ఒకరి మృతికి కారకుడయ్యాడు. ఆయా ఘటనల్లో తొమ్మిది మందికి గాయాలు కావడమే కాకుండా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ వెంకన్న కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
నిజాంపేట్లో నివాసం ఉంటున్న క్రాంతి కుమార్ సాప్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఫుల్లుగా మద్యం తాగిన అతను కారులో వెళుతూ ఐకియా సమీపంలో ఓ కారును ఢీ కొట్టాడు. అనంతరం శిల్పా ఫ్లైఓవర్ వద్ద మూడు బైక్లను ఢీ కొట్టాడు. అక్కడి నుంచి వెళుతూ సైబరాబాద్ కమిషనరేట్ సమీపంలోని పిస్తా హౌస్ వద్ద గుర్తు తెలియని పాదచారిని ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
అనంతరం మల్కం చెరువు సమీపంలోని షేక్పేట్ ఫ్లై ఓవర్పై ఆటోను ఢీ కొట్టగా, కారు టైరు పేలి పోవడంతో పోలీసులకు చిక్కాడు. అతడిని అదుపులోకి తీసుకుని బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా 550బీఏసీగా నమోదైంది. ఆయా ప్రమాదాల్లో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. కారు, ఆటోతో పాటు మూడు బైక్లు ధ్వంసమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.