-
కుట్రపూరితం! పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వేటిని ఆమోదించాలి, వేటిని తిరస్కరించాలని స్పష్టమైన నిబంధనలు కేంద్ర ఎన్నికల సంఘం తన నిబంధనల పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ వాటిని సవరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారనున్నాయంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజా సవరణల వల్ల దొంగ ఓట్లకు ఆస్కారం కల్పించడమే కాకుండా నిజమైన ఓట్లు చెల్లకుండా పోయే అవకాశం ఉందంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఓటరు తన వివరాలు, బ్యాలెట్ నంబర్తో డిక్లరేషన్ ఫాం13ఏ సమర్పించాలని, ఈ ఓటరు తనకు తెలుసని ఒక గెజిటెడ్ అధికారి ధృవీకరించి సంతకం చేస్తూ.. పొడి అక్షరాలతో ఆ అధికారి పేరు, హోదా వివరాలు, చిరునామాతో పాటు సీల్ వేయాలని స్పష్టంగా ఉంది. మన రాష్ట్రం విషయానికి వస్తే గెజిటెడ్ అధికారి సంతకం ఉండి, అధికారి హోదా వివరాలు లేదా సీల్.. ఏదో ఒకటి ఉన్నా.. ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా టీడీపీ అడిగిన వెంటనే మోమో జారీ చేయడం తెలిసిందే. దాన్ని ఎండార్స్ చేయడంతో పాటు మరికొంత సడలింపు ఇస్తూ గెజిటెడ్ అధికారి హోదా వివరాలు, సీల్ లేకపోయినా.. కేవలం సంతకం ఉంటే చాలు ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈవోకు లేఖ రాయడం వెంట వెంటనే జరిగిపోవడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జారీ చేసిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానంలో ఉపసంహరించుకోవడం అంటే.. ఆ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లుగా అంగీకరించినట్లే. ఈ కేసులో టీడీపీ ఇంప్లీడ్ పిటీషన్ వేయడం ద్వారా పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారాన్ని మరింత గందరగోళ పరచాలనే ఉద్దేశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.సంతకంలో వ్యత్యాసాలుంటే..టీడీపీ వినతికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసి దొంగ ఓట్ల బెడదను సృష్టించిన సీఈవో ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం తందానా అనడం అనుమానాలకు తావిస్తోందని ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారం లెక్కింపు సమయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని మాజీ ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కేవలం సంతకంతో అతను అటెస్టేషన్ అధికారే అని నిర్ధారించడం ఎలా సాధ్యమవుతుందని వీరు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం దొంగ ఓట్లను ప్రోత్సహించే విధంగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి సలహాదారునిగా వ్యవహరించిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వివరాలు లేకుండా కేవలం సంతకంతో రిటర్నింగ్ ఆఫీసర్ ఎలా ఆమోదం తెలుపుతారని, అధికారుల సంతకాల్లో వ్యత్యాసాలు ఉండటం అత్యంత సహజమని వివరించారు. ఈ నేపథ్యంలో స్పెసిమెన్ సంతకంతో సరిపోల్చి చూడటం ఎలా సాధ్యమని రిటైర్డ్ ఆర్డీవో ఒకరు ప్రశ్నిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన గెజిటెడ్ అధికారుల సంతకాలు అన్నీ కౌంటింగ్ సెంటర్లలోని ఆర్వోలకు పంపిస్తామని, సంతకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తే వాటితో సరిపోల్చి చూసుకొని నిర్ణయం తీసుకోవాలనడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఇన్ని స్పెసిమెన్ అధికారుల సంతకాలతో వాటిని ఆ సమయంలో సరిపోల్చి చూడటం సాధ్యమయ్యే పనేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి లబ్ధి కోసం ఆగమేఘాల మీద ఇటువంటి నిర్ణయాలు తీసకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.ఈసీ నిష్పాక్షికతపై అనుమానాలకు మరింత బలంపోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన అటెస్టింగ్ ఆఫీసర్లు కొంత మంది సీల్ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నుంచి ఇలా విజ్ఞాపనలు రాగానే ఎన్నికల సంఘం వెంటనే పలు నిర్ణయాలు తీసుకుంటూ మొత్తం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియనే పూర్తి గందరగోళంగా మార్చింది. టీడీపీ ఫిర్యాదు చేయగానే ముఖేష్ కుమార్ మీనా ఈ నెల 25న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డిక్లరేషన్ ఫారం మీద అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, పేరు, హోదా (డిజిగ్నేషన్) పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలని.. ఇవి ఉండి స్టాంప్ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని ఉంది. ఒకవేళ ఏమైనా అనుమానం వస్తే దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తాజాగా గురువారం కేంద్ర ఎన్నికల సంఘం మీనాకు రాసిన లేఖలో మరో ముందడుగు వేసి అటెస్టింగ్ ఆఫీసర్ సీల్ వేయకపోయినా, అతని హోదా వివరాలు లేకపోయినా సంతకం ఉంటే చాలు అని పేర్కొంది. ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల సంఘం ఇలాంటి గందరగోళ నిర్ణయాలు తీసుకుంటోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్కే సడలింపునిస్తూ సీఈవో ఆదేశాలు జారీ చేయడమే విడ్డూరమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ మరో అడుగు ముందుకేసి వివరాలు రాయకపోయినా, సీల్ వేయకపోయినా పోస్టల్ బ్యాలెట్ను పరిగణనలోకి తీసుకోవాలనడం తొలి నుంచి ఈసీ నిష్పాక్షికతపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
‘‘మేము ఏకగ్రీవంగా చెబుతున్నాము. మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో.. దానికి సరిగ్గా ఆపోజిట్గా మరొక వేదిక ఏర్పాటు చేసి, అదే రోజు నారా లోకేశ్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి. ఇది మా డిమాండ్.’’ఈ డిమాండ్ చేసింది ఎవరో తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్త కాదు! ఇటీవల చంద్రబాబు కటౌట్ను రక్తంతో కడిగిన ఆ పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న!! నాయకుడు అధినాయకుడిని డిమాండ్ చేయటం ఏంటి? పైగా లోకేష్ను పార్టీ అధ్యక్షుడిగా చేయమని డిమాండ్ చేయటం ఏంటి? అందునా.. ఏక కాలంలో ఎదురెదురుగా రెండు వేదికలను ఏర్పాటు చేసి – ఈ వేదికపై చంద్రబాబు ప్రమాణ స్వీకారం, ఎదురు వేదికపై చినబాబు పార్టీ అధ్యక్ష ప్రమాణ స్వీకారం జరగాలని కోరటం ఏమిటి? ఎందుకు ‘బుద్ధన్న’ అలా అన్నారు. అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది?లోకేశ్ ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన్నిప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని బుద్ధా వెంకన్న డిమాండ్. అంటే.. ఇండైరెక్టుగా లోకేశ్ను సీఎంను చేయాలని సూచించటమా? లేక చినబాబుకు దగ్గర కావాలన్న వ్యూహమా? లేదంటే, చంద్రబాబు సూచన మేరకే అలా డిమాండ్ చేసి ఉంటారా? ఇవేవీ కాదంటే.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా ఆయన అలా ఏమైనా అన్నారా? ఏదేమైనా టీడీపీలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఆసక్తికరమైన పరిణామం... బుద్ధా వెంకన్న డిమాండ్.టీడీపీ అధికారంలోకి వస్తుందా, రాదా అన్నది అటుంచి.. అసలు బుద్ధన్న ఇలాంటి ప్రకటన ఎందుకు చేసినట్లు అని ఆ పార్టీలోని నాయకులే అయోమయంగా ముఖాలు చూసుకుంటున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఏదైనా గందరగోళం మొదలైందా అనే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.నిజానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం ఆలోచిస్తున్నది లోకేశ్ బాబు అధ్యక్షుడు అవుతాడా కాడా అని కాదు. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందా రాదా అని. ఓటమి అంటే చంద్రబాబుకు భయం. అందుకే ఆయన ఒంటరిగా పోటీ చేయరు. పొత్తు కోసం చూస్తారు. పొత్తు కుదరకపోతే కొత్త ఎత్తులు ఏవైనా వేస్తారు. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో కూటమిని కట్టారు కనుక... ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఎలా ముందుకు వెళ్లాలా అని ఆయన ఇప్పుడు ఆలోచిస్తుండవచ్చు. కొత్తగా ఏర్పడే జగన్ ప్రభుత్వంలో తొలి 100 రోజుల్లో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించటానికి రామోజీ తో కలసి ఏదైనా వ్యూహాన్ని ఆలోచిస్తూ కూడా ఉండొచ్చు. చెప్పలేం. గెలుపు కోసం చంద్రబాబు ఏమైనా చేయగలరు. ఓడిపోయినా కూడా... ఏమైనా చేయించగలరు!ఈ నేపథ్యంలో గత 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఆయన్ని ఓడించిన స్వయంకృతాపరాధాలు, ఆయన్ని గెలిపించిన ఎత్తులు, పొత్తులు; గెలుపు వంటి ఓటములు, ఓటమి వంటి గెలుపుల గురించి చూడటం అవసరం.చంద్రబాబుకు మొదటి అతి పెద్ద ఓటమి 2004లో ఎదురైంది. అంతకు ముందు 1999లో జరిగిన ఎన్నికలు ఆయన్ని పార్టీలో తిరుగులేని నేతగా నిలబెట్టాయి. అక్కడి ఉంచి నేరుగా, మళ్లీ లేవలేనంతగా 2004లో కిందికి పడేశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనంలో సైకిల్ కొట్టుకుపోయింది. స్కూల్ టీచర్లు, ప్రభుత్వోద్యోగులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేయటం మాత్రమే కాదు, చంద్రబాబుకు వ్యతిరేకంగా కూడా పనిచేశారు. జన్మభూమి కార్యక్రమాలకు తమను ఉపయోగించుకోవటం వారికి ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వోద్యోగుల పని విధి విధానాలలో కొత్తగా తెచ్చిన మార్పులు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభావం చూపెట్టాయి.ఇంతకన్నా ముఖ్యం.. విద్యుత్ చార్జీలు, నీటి చార్జీల పెంపు. దీనిపై రైతులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేస్తే... హైదరాబాద్ బషీర్బాగ్లో జరిగిన ధర్నాలో నిరసనకారులైన రైతులపై చంద్రబాబు పోలీసుల చేత కాల్పులు జరిపించారు. పోలీస్ కాల్పులలో రామకృష్ణ, విష్ణువర్థన్ రెడ్డి, బాలస్వామి అనే ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు. బాబు పాలనలో మాయని మచ్చగా మిగిలిన ఉదంతం అది. ఇక 1995–2004 మధ్య రాష్ట్రంలో ఒక్క నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు. అప్పుడే తెలంగాణ ఉద్యమం, అప్పుడే వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్ర! 2004 ఎన్నికల్లో ఆ రెండూ తమదైన ప్రభావం చూపి, బాబు ఓటమికి కారణం అయ్యాయి.ఇవికాక, మరికొన్ని కారణాలు కూడా ఆనాటి చంద్రబాబు ఘోర పరాజయానికి ఆజ్యం పోశాయి. తూర్పు ఆసియా దేశాల పద్ధతులను ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు కనిన స్వర్ణాంధ్ర ప్రదేశ్, విజన్ –2020 కలలు బెడిసికొట్టాయి. కేవలం సమాచార సాంకేతిక విజ్ఞానం మీద, బయో టెక్నాలజీ మీదా ఆధారపడి ఆయన ఆ కలలు కన్నారు. అవి సమాచార సాధనాలను, విదేశీ అధినేతలను, విదేశీ వాణిజ్యవేత్తలను ఆకట్టుకుని ఉంటే ఉండొచ్చు. కానీ కేవలం వాటి ద్వారానే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు భ్రమ పడ్డారు. గెలుపై ధీమాగా ఉన్నారు. చివరికి బోర్లా పడ్డారు. వ్యవసాయ రంగం అభివృద్ధి మీద, పేదరికం నిర్మూలనపైనా ఆయన దృష్టి సారించకపోవటం కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.అంతకు ముందు 1999 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన మాట నిజమే అయినా అది ఏమాత్రం చంద్రబాబు ఘనత కాదు. కార్గిల్ యుద్ధ ప్రభావం గెలుపునకు దోహదపడింది. పాకిస్థాన్తో కార్గిల్ యుద్ధంలో గెలిచిన అనంతరం.. సాధారణ సమయానికి భిన్నంగా, కొన్ని నెలల ఆలస్యంగా సార్వత్రిక ఎన్నికలు ఆ ఏడాది సెప్టెంబరులో జరిగాయి. వాటితో పాటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా. ఆ ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో టై–అప్ అయ్యారు. తాము గెలిస్తే, కేంద్రంలో బీజేపీకి బయటి నుండి మద్ధతు ఇస్తామన్న హామీతో ఆయన ఆ ఎన్నికలకు వెళ్లారు.కార్గిల్ యుద్ధంలో గెలుపు వాజ్పేయిని గొప్ప నాయకుడిగా నిలబడితే ఆ నాయకుడితో చేయి కలపడం చంద్రబాబుకు గొప్పగా కలిసొచ్చింది. మొత్తం 294 సీట్లలో తెలుగుదేశం 269 సీట్లకు, బీజేపీ 24 సీట్లకు పోటీ చేస్తే తెలుగు దేశం 180 సీట్లలో గెలిచింది. అయినప్పటికి మునుపటి కన్నా 36 సీట్లు తగ్గాయి. బీజేపీకి మాత్రం అంతకుముందు కన్నా 9 సీట్లు పెరిగాయి. అంటే.. వాజ్పేయి ఆధ్వర్యంలోని జాతీయ పార్టీ బీజేపీ ప్రభావంతోనే చంద్రబాబు నాయకత్వంలోని ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఎక్కువ సీట్లు సాధించింది తప్ప అది చంద్రబాబు చరిష్మా కాదు. ఇంకా చెప్పాలంటే కేవలం కార్గిల్ ప్రభావం.2004 ఎన్నికల తర్వాత వరుసగా 2009లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అందుకు కారణంగా చంద్రబాబు ఎలాంటి సాకులు చెప్పినా.. అసలు కారణం మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకుడు, స్వర్గీయ గాలి ముద్దు కృష్ణమ నాయుడు విశ్లేషణలో కనిపిస్తుంది.‘‘2009లో మా పార్టీ ఓడిపోవటానికి ప్రధాన కారణం పీఆర్పీ పార్టీ, లోక్సత్తా పార్టీలు కొత్తగా రావటం. దాంతో యాంటీ కాంగ్రెస్ ఓటు చీలటం జరిగింది. రెండవది – టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నందు వల్ల ఈ హైదరాబాద్లో గానీ, రంగారెడ్డి జిల్లాలో గానీ మాకు ఏం సీట్లు కూడా రాలేదు. ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డిలో వాళ్లు, రాష్ట్రం సపరేట్ కాకూడదని ఎక్కువమంది జనం అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మాకు ఒకే ఒక్క సీటు రావటం జరిగింది. అందువల్ల మేము ఘోరంగా ఓడిపోవటం జరిగింది. యాంటీ కాంగ్రెస్ ఓటు చిరంజీవి, జయప్రకాష్ నారాయణ్ చీల్చుకోవటం కూడా మా ఓటమి కారణం. అప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఓట్ బ్యాంకు దాదాపు 13 శాతం తగ్గింది. 2004లో 51 శాతం ఉన్న ఓట్ బ్యాంకు వాళ్లకు 38 శాతం అయింది. మేము 37 శాతంతో ఓడిపోయాం. ఒక్క పర్సెంట్ ఓట్ల తేడాతోనే మేము 2009 ఎన్నికల్లో ఓడిపోవటం జరిగింది. గెలుపు అంచుకు వచ్చి ఓడిపోయాం. 92 సీట్లు గెలిచాం మేము. కాంగ్రెస్ 155 మాత్రమే గెలిచింది. వాళ్లకు 35 సీట్లు తగ్గినయ్. మాకు దాదాపు 45 సీట్లు పెరిగాయి. రాజశేఖర రెడ్డి విజృంభించి ప్రచారం చేయటం కూడా జనంలో కొంత భయం కల్పించింది’’ అన్నారు ముద్దు కృష్ణమ నాయుడు.2014లో తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లోనూ చంద్రబాబు బీజేపీతో చేతులు కలిపారు. వారి పొత్తు ఫలించి తెలుగుదేశానికి 25 సీట్లు, బీజేపీకి 7 సీట్లు పెరిగినప్పటికీ, వైఎస్సార్సీపీ ప్రభావంతో తెలుగు దేశం పార్టీ 117 సీట్లుకు మించి సాధించలేకపోయింది. ఆ మాత్రమైనా మోదీ హవాతో కొట్టకొచ్చిన సీట్లు, ఓట్లు మాత్రమే అవి.2019 గురించి ఇక చెప్పేదేముంది? వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 175కి 151 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. తెలుగుదేశం పార్టీ 23 సీట్లు మాత్రమే సాధించగలిగింది. అందుకు అనేక కారణాలున్నాయి. పార్టీలో అంతర్గత కలహాలు, స్పెషల్ స్టేటస్పై యు–టర్న్, అమరావతి నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా మెల్లిగా నడిపించటం, కాపు ఓట్లు చీలుస్తాడని అనుకున్న పవన్ కల్యాణ్ హీరో ఫ్యాక్టర్ పని చేయకపోవటం, అవినీతి.. వీటన్నిటితో పాటు రాష్ట్రానికి అందవలసిన నిధుల విషయంలో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంబించి ఎన్.డి.ఎ. నుంచి బయటికి రావటం కూడా టీడీపీని దెబ్బకొట్టేసింది. దానికి మించి పార్టీలో చంద్రబాబు ‘వన్ మ్యాన్ షో’ పార్టీని ఒంటరిని చేసింది.ఈ అనుభవం రీత్యా మళ్లీ ఈ తాజా ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అయితే ఆ పొత్తు ఫలిస్తుందా, మొదటికే మోసం తెస్తుందా అని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేతలో, ఆయన్ని బలపరుస్తుండే మీడియాలో కలవరం రేకెత్తిస్తోంది. అందుకే ఎన్నికలు ముగిసి, ఫలితాలు ఇంకా రాకముందే తెలుగు దేశం నాయకులు, రామోజీ రావు.. ‘గెలుపు కూటమిదే’ అని నినదిస్తున్నాయి. ఒకటి గమనించారా? ‘గెలుపు తెలుగుదేశానిదే’ వారు అనటం లేదు. – మాధవ్ శింగరాజు -
ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30న తన పదవీకాలం ఐదేళ్లు సంపూర్ణంగా పూర్తి చేసుకున్నందుకు ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలాగే ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా 2014లో ఎన్నికయ్యాక ఐదేళ్లు పాలన చేసినట్లే అయినా, సాంకేతికంగా చూస్తే ఆయన ఎనిమిది రోజులు ముందుగానే పదవి కోల్పోయారు. ఎందుకంటే చంద్రబాబు 2014 జూన్ 8న పదవీ చేపట్టగా, ఎన్నికల్లో ఓడిపోయి 2019 మే 30 కంటే ముందే సీఎం పదవిని వదలిపెట్టవలసి వచ్చింది. కానీ వైస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు ఆ ఇబ్బంది రాలేదు. చంద్రబాబునాయుడు 1995లో తన మామ ఎన్టీఆర్ను కూలదోసి సీఎంగా అధికారం చేపట్టారు. 1999 అక్టోబర్ లో రెండోసారి అధికారంలోకి వచ్చినా, 2003లో అసెంబ్లీని రద్దు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఓటమి కారణంగా 2004 మే నెలలోనే పదవిని కోల్పోయారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిగిలిన సీఎంల కన్నా విభిన్నమైన రాజకీయవేత్త అని చెప్పాలి. వైఎస్సార్సీపీను స్థాపించడం, ఆ తర్వాత ఆయన అనేక కష్ట, నష్టాలు ఎదుర్కోవడం అంతా ప్రజలు గమనించారు. అక్రమ కేసులలో ఆయన జైలులో ఉన్నప్పుడు, ఆయన కోసం రాజీనామా చేసిన వారి నియోజకవర్గాలలో జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ సంచలనాత్మకమైన రీతిలో గెలుపొందడం కూడా విశేషమే.2014 సాధారణ ఎన్నికలలో YSRCP అధికారంలోకి రాలేకపోయినా, గౌరవనీయ సంఖ్యలో విజయాలు సాధించింది. విపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో పోరాట పటిమ తగ్గలేదు. తదుపరి సైతం అనేక పోరాటాలు చేయవలసి రావడం వంటి ఘట్టాల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో చరిత్రాత్మకమైన రీతిలో విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఎవరికి సాధ్యం కానీ రీతిలో దాదాపు 50 శాతం ఓట్లు సాధించి 151 సీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగలగడం ఒక రికార్డు. ఉమ్మడి ఏపీలో NTR, KCR, YS జగన్మోహన్ రెడ్డిలే సొంత పార్టీ పెట్టుకుని అధికారంలోకి రాగలిగారు. తెలుగు రాష్ట్రాలలో తండ్రులు ముఖ్యమంత్రులు అయ్యాక, వారి కుమారులు పలువురు రాజకీయాలలోకి వచ్చి మంత్రులు కాగలిగారు తప్ప, ముఖ్యమంత్రి అయింది మాత్రం YS జగన్మోహన్ రెడ్డి ఒక్కరే.వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో 2009 లోనే ఎంపీగా గెలుపొందిన మాట నిజమే. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఒకరకంగా చెప్పాలంటే గందరగోళంలో పడింది. మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చినా, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీ మాత్రం అప్రజాస్వామికంగా వ్యవహరించి అవకాశం ఇవ్వలేదు. అదే ఆయనకు ఛాలెంజ్గా మారింది. సొంతంగా పార్టీ పెట్టుకున్నారు, తనదైనా పంథాలో ముందుకు సాగారు, గెలిచినా, ఓడినా సొంత రాజకీయం సాగించారు. సోనియాగాంధీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నందున కేసులు పెడుతుందన్న భయంతో వైఎస్ సన్నిహితులు సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి భయపడినా, తాను మాత్రం తిరుగుబాటు వీరుడుగానే జనంలోకి వెళ్లి వారి హృదయాలను గెలుచుకున్నారు.మామ ఎన్టీఆర్నే కుట్ర పూరితంగా సీఎం పదవిని లాగిపడేసిన వ్యక్తి చంద్రబాబు. ఎప్పుడు ఎవరితో అవసరమైతే వారితో పొత్తు పెట్టుకోగల వ్యక్తి, ఆచరణ సాద్యం కానీ హామీలు ఇచ్చే వ్యక్తిగా పేరొందిన చంద్రబాబు వంటి నేతను ఢీకొట్టడం అంటే తేలిక కాదని చాలామంది భావిస్తారు. కుట్ర రాజకీయాలలో ఘనాపాటిగా పేరొందిన చంద్రబాబును ఓడించడం ద్వారా రాజకీయాలలో విశ్వసనీయతకు ప్రాధాన్యం ఉందని మొదటిసారిగా రుజువు చేసిన నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. అనైతిక రాజకీయాల జోలికి వెళ్లకుండా, ప్రజలకు తాను ఏమి చెప్పానో, అవి చేయాల్సిందే అనే పట్టుదలతో కృషి చేసిన ముఖ్యమంత్రిగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తింపు పొందారు.చంద్రబాబు 2014 లో తాను ఇచ్చిన మానిఫెస్టోని మాయం చేస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో తాను ప్రకటించిన మానిఫెస్టోని మంత్రులు, ఐఎఎస్ అధికారులకు ఇచ్చి అమలు చేయాల్సిందేనని చెప్పి కొత్త సంస్కృతికి నాంది పలికారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత సాహసోపేతంగా సంక్షేమ పథకాలు చేయలేదని చెప్పాలి. అంతేకాదు... తన టరమ్ పూర్తి అవుతున్న తరుణంలో మానిఫెస్టో కాపీలతో పాటు, ఏ కుటుంబానికి ఎంత మేలు చేసింది వివరిస్తూ ప్రతి ఇంటికి అభివృద్ది నివేదికలను తన ఎమ్మెల్యేల ద్వారా అందించి కొత్త ట్రెండ్ సృష్టించిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. మనిషిని చూస్తే ఈయన నిజంగానే ఇన్ని చేశారా అనిపిస్తుంది. ఇంతమంది ఆయనపై కక్ష కడితే వారందరిని ఒంటి చేత్తో ఎదుర్కున్నారా? అనే భావన వస్తుంది. బక్కపలచగా ఉండి, సింపుల్ డ్రెస్లో కనిపించే ఈయన ఏపీలో ఇన్ని వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రజల ముందుకు పరిపాలనను తెచ్చి రాష్ట్రాన్ని సరికొత్తగా మార్చగలరని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు.ప్రభుత్వంలోని దాదాపు అన్నీ రంగాలలో తనదైన మార్కును వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపించగలిగారు. పేదలు vs పెత్తందార్లు అనే నినాదాన్ని చేపట్టినప్పటికీ, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వ్యవస్థలను ఆయన తెచ్చారంటే అతిశయోక్తి కాదు. కరోనా సంక్షోభ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చొరవ, వ్యాధి పాలిట పడిన వారికి అందించిన వైద్యసేవలు మొదలైనవి ప్రశంసనార్హం. ఆ టైమ్లో సైతం స్కీములను అమలు చేసి ఆదుకున్న నేతగా ప్రజల గుండెల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారంటే ఆశ్చర్యం కాదు. ఓ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఆయన రోల్ మోడల్ ప్రభుత్వాన్ని నడిపారు. దేశంలోనే ఎవరూ చేయని సరికొత్త ప్రయోగాలు చేశారని చెప్పాలి. అందులో అనేకం కీలకంగా ఉన్నాయి.వలంటీర్ల వ్యవస్థను పెడతానని ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినప్పుడు ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. ప్రభుత్వంలోకి రాగానే వలంటీర్లను పెడుతుంటే వీరంతా ఏమి చేస్తారో అనే అభిప్రాయం ఉండేది. రెండున్నర లక్షల మంది స్వచ్చంద సైన్యాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తయారు చేశారన్న సంగతి ఆ తర్వాత కానీ జనానికి అర్దం కాలేదు. వలంటీర్లు ఇళ్లకు వచ్చి కుశల సమాచారం అడగడం కాదు.. వారి పరిపాలనకు సంబంధించిన అవసరాలను తీర్చే వ్యవస్థగా మారారు. ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు. ప్రభుత్వమే ప్రతి ఒక్కరి గడప వద్దకు వెళ్లి సేవలందించడం అని పరిపాలనకు కొత్త నిర్వచనం ఇచ్చి అమలు చేయడం అతి పెద్ద విజయం అనిపిస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రజలకు అవసరమైన పనులన్ని జరిగిపోవడం కొత్త అనుభూతి. ఒకప్పుడు ఏ సర్టిఫికెట్టు కావాలన్నా, వేరే ఏ పని ఉన్నా, మండల ఆఫీస్ల చుట్టూనో, ఆ పైన ఉండే అదికారుల చుట్టూనో తిరిగే పరిస్థితిని తప్పించి తమ ఇళ్లకే అవన్ని చేరే ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా అభినందనీయుడు.ఈ సచివాలయాల కోసం ఏకంగా లక్షన్నర ఉద్యోగాలను ఒకే ఏడాదిలో ప్రభుత్వ పరంగా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతులు ఒకప్పుడు ఎరువులు, విత్తనాల కోసం తమ చెప్పులను ఆయా షాపుల వద్ద, ప్రభుత్వ గౌడౌన్ల వద్ద క్యూలో పెట్టవలసి వచ్చేది. ఇప్పటికి తెలంగాణలో అదే పరిస్థితి కొనసాగుతోంది. ఆదిలాబాద్లో జరిగిన రైతుల ఆందోళన ఇందుకు ఉదాహరణ. ఏపీలో ఆ ఇబ్బంది లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయగలిగారు. రైతులు తమ గ్రామంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలనుంచి అన్నీ సేవలు పొందగలుగుతున్నారు. అందువల్లే ఈ ఐదేళ్లలో ఎక్కడా ఒక్క రైతు ఆందోళన చూడలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హామీలు అమలు చేస్తామని చెబుతూ అంతా వచ్చి దరఖాస్తు చేసుకోమన్నారు. అప్పుడు బారీ క్యూలు తెలంగాణ వ్యాప్తంగా కనిపించాయి. అదే ఏపీలో ఆ అవసరమే లేదు. వలంటీర్లే ఇళ్లకు వెళ్లి అర్హత ఉంటే వారే నమోదు చేసుకుని స్కీమ్ అమలు చేశారు. ఇది ఉదాహరణ మాత్రమే.ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో జరిగిన మార్పులు ఒక విప్లవం అని చెప్పాలి. స్కూళ్లు బాగు చేయడం మొదలు, ఆంగ్ల మీడియం, వారికి మంచి ఆహారం, డ్రెస్, పుస్తకాలు మొదలైనవి స్కూల్ తెరిచిన మొదటి రోజుల్లోనే ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. గతంలో ఇలా జరిగిన సందర్భాలు దాదాపు లేవని చెప్పాలి. ఆంగ్ల మీడియం, ఐబీ సిలబస్, టోఫెల్ మొదలైన వినూత్న మార్పులు జరిగింది ఏపీలో మాత్రమే. వైద్య రంగంలోకూడా గణనీయమైన మార్పులు తెచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులను మార్చారు. ప్రజల వద్దకే డాక్టర్లను పంపించే విధానం తెచ్చారు. ఊళ్లలో ఆరోగ్య శిబిరాలు పెట్టారు. ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య పెంచారు. తను చెప్పిన సంక్షేమ స్కీములను యధాతధంగా అర్హులైన వారందరికి అమలు చేసి చూపించారు. ప్రాంతం చూడలేదు. కులం చూడలేదు. మతం చూడలేదు. పార్టీ చూడలేదు. ఇది చాలామందికి నమ్మశక్యం కానీ విషయమే.అంతకుముందు టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల అవినీతి తతంగాలు చూసినవారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చిన ఈ మార్పు ఆశ్చర్యాలను కలిగించింది. అమ్మ ఒడి, చేయూత, కాపు నేస్తం, రైతు భరోసా, చేనేత నేస్తం.. ఇలా ఒకటేమిటి సుమారు ముప్పైకి పైగా స్కీములను ఒక్క రూపాయి అవినీతి లేకుండా లబ్దిదారుల ఖాతాలలోకి వెళ్లేలా డిబిటి పద్దతి అమలు చేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. పేదలకు 31లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఒక సంచలనం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. విపక్ష టీడీపీ తొలుత వీటన్నిటిని విమర్శించినా, తదుపరి తామూ అమలు చేస్తామని చెప్పడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజన్ను తెలియచేస్తుంది. అభివృద్ది వైపు చూస్తే స్కూళ్లు, ఆస్పత్రులు బాగు చేయడం అన్నిటికన్నా పెద్ద ప్రగతి అని వేరే చెప్పనవసరం లేదు. తీర ప్రాంతంలో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఫిషరీస్ యూనివర్శిటీ, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి, 700 కోట్లతో 800 గ్రామాలకు నీటి స్కీము, పదిహేడు మెడికల్ కాలేజీలు, పలు కొత్త పరిశ్రమలు, పార్మాహభ్, రెండున్నర లక్షల కోట్ల విలువైన పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు, నలభై వేల కోట్ల విలువైన సోలార్ పానెల్ పరిశ్రమ.. బద్వేలు వద్ద సెంచరీ ప్లైవుడ్, కొప్పర్తి ఎలక్ట్రానిక్ పారిశ్రామికవాడ.. ఇలా అనేకం టేక్ ఆఫ్ అయ్యాయి. విశాఖ నగరాన్ని ఒక సూపర్ సిటీగా తీర్చిదిద్దే ప్రక్రియ చేపట్టారు. ఆదాని డేటా సెంటర్, ఇన్ ఫోసిస్ తదితర కంపెనీలు రావడం.. ఇలా ఒకటేమిటి వివిధ రంగాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకునేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసింది. ఇదేదో పొగడడానికి చెప్పడం లేదు. అలా అని విమర్శలు లేవని కాదు. ఏ ప్రభుత్వంలో అయినా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఒక్క మద్య నిషేధం హామీని అమలు చేయలేకపోయామని పార్టీనే అధికారికంగా చెప్పింది.శాంతి భద్రతలు ఐదేళ్లుగా పూర్తి అదుపులో ఉన్నా, ప్రతిపక్షం, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా దారుణమైన అబద్దాలు ప్రచారం చేశాయి. వీటిని ఎదుర్కోవడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికు పెద్ద సవాల్ అయింది. ఒకేసారి వివిధ రంగాలలో సంస్కరణలు చేపట్టడం, ఆయా వర్గాలలోని పెత్తందార్లకు ఆగ్రహం తెప్పించింది. ఉదాహరణకు ప్రభుత్వ స్కూళ్లు బాగు చేయడం కార్పొరేట్ విద్యా సంస్థల యజమానులకు నచ్చలేదు. ప్రభుత్వ సేవలన్ని ప్రజల ఇళ్ల వద్దకు చేర్చడం, తద్వారా తమ ప్రాధాన్యత తగ్గిందన్న భావన, ముడుపులు దక్కకుండా పోతున్నాయన్న ఆక్రోశం అందరిలో కాకపోయినా కొంతమంది ఉద్యోగులలో ఏర్పడిందని అంటారు. ప్రభుత్వ స్కూళ్లు బాగు చేసి టైమ్కు టీచర్లను రావాలని చెబితే వారిలో కొందరికి కోపం వచ్చిందని చెబుతారు. ఏపీలో సినిమా షూటింగ్లు చేయాలని, ఇతరత్రా పేదలకు ధరలు అందుబాటులో ఉంచాలని, దానిని బట్టి టిక్కెట్ల రేట్లు నిర్ధారిస్తామని చెప్పడం బడా సినిమా పెట్టుబడిదారులకు నచ్చలేదు.ఆస్పత్రులను బాగు చేసి, డాక్టర్లను పేదల ఇళ్లకు పంపడం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అంతగా ఇష్టం ఉండదు. భూముల రీసర్వే, ఈ స్టాంప్ విధానం, లాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూ వివాదాలు తగ్గించడం, బడా భూస్వాములు, రియల్ ఎస్టేట్ దందాలు చేసేవారికి అసంతృప్తి కలిగించింది. అందుకే లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ వంటివారు పచ్చి అబద్దాలను ప్రచారం చేశారు. ఆయా వ్యవస్థలను చంద్రబాబు బాగా ప్రభావితం చేస్తూ ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టారు. అందులో న్యాయ వ్యవస్థ ద్వారా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికు బాగా తలనొప్పి తెప్పించారని చెప్పవచ్చు. మూడు రాజధానుల వ్యవహారం ఒక కొలిక్కి రానీవ్వకుండా విపక్షం వ్యవస్థల ద్వారా అడ్డుపడింది.ఇన్ని జరిగినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ పెత్తందార్ల ప్రతినిధిగా ఉండడానికి ఇష్టపడలేదు. పాదయాత్రలో సామాన్యుల కష్టాలు ఎలా తెలుసుకున్నారో, ఆ విధంగానే పేదల ప్రతినిధిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారు. అదే శ్రీరామరక్ష అవుతుందని ఆయన నమ్మారు. అందుకే ధైర్యంగా తను మంచి చేసి ఉంటేనే ఓటు వేయండని ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు. ఇలా చేసిన ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. ఎంత ఆత్మ విశ్వాసం లేకుంటే ఆయన ఆ మాట చెప్పగలుగుతారు! అదే ఆత్మ స్థైర్యంతో, ప్రత్యర్ధులు ఎంతగా వేధించినా తొణకకుండా, బెణకకుండా ఐదేళ్లు పూర్తి చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సగర్వంగా ప్రజల ముందు నిలబడ్డారు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు విజయానికి సంకేతంగా కనిపిస్తుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తతతో వ్యవహరించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్ల వర్క్షాప్, జూమ్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల సందేహాల నివృత్తికి కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. ఎటువంటి సమస్య ఉన్నా కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో గుంటూరులో వేల ఓట్లు మన పార్టీ నష్టపోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ప్రతి ఓటూ విలువైనదేనని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని, దానికి సంబంధించి ఆదేశాలు రాగానే తెలియజేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వ్యవస్ధలను మేనేజ్ చేస్తూ వారికి అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా చేస్తున్నారని అన్నారు. ఇటీవలి కాలంలో ఈసీ తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నందున, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల నియమ నిబంధనల పట్ల పూర్తి అవగాహనతో ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని, మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని, ఇందులో ఎటువంటి అనుమానమూ లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విస్పష్టంగా చెప్పారు. వచ్చే నెల 9వ తేదీన వైఎస్ జగన్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. సమావేశానికి హాజరైన వారికి విశ్రాంత ఆర్డీవో ముదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఏజెంట్ల సందేహాలు నివృత్తి చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్చార్జి, శాసన మండలి విప్ లేళ్ళ అప్పిరెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.పోస్టల్ బ్యాలెట్ లెక్కించే విధానం⇒ ఎన్నికల అధికారి నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో మొదట విధిగా పోస్టల్ బ్యాలెట్లని లెక్కించాలి⇒ మొదటి కవరు–బి పైన నియోజకవర్గం పేరు, ఎన్నికల అధికారి అడ్రెస్సు, ఓటరు సంతకం ఉండాలి. (ఓటరు సంతకం తప్పనిసరికాదు).⇒ మొదటి కవరు–బి (ఫారం – 13సి) తెరిచి చూసినప్పుడు అందులో 13 – ఏ డిక్లరేషన్, ఫారం 13–బి (కవరు – ఏ) విడివిడిగా ఉండాలి. లేకపోతే అది చెల్లుబాబు కాదు. అందులో కవరు – ఏ లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ మీద ఓటరు సంతకం లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ మీద పోస్టల్ బ్యాలెట్ క్రమ సంఖ్య నమోదు చేయకపోయినా, నమోదు చేసినట్లయితే అది 13–బి (పోస్టల్ బ్యాలెట్ కవరు) మీద ఉన్న క్రమ సంఖ్యతో సరిపోలక పోయినా, 13 – ఏ డిక్లరేషన్ మీద గజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా, ఒకవేళ సంతకం ఉండి హోదా తెలియజేసే స్టాంప్ లేదా హోదా తెలియజేసే విధంగా చేతితో రాసి కాని లేకపోతే ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లనిదిగా పరిగణించాలి.⇒ 13– ఏ డిక్లరేషన్లో అన్ని అంశాలు సరిగా ఉన్నట్లయితే, ఫారం 13 – బి పోస్టల్ బ్యాలెట్ కలిగి ఉన్న కవరు(కవరు – ఏ)ను పరిశీలించాలి. 13– ఏ డిక్లరేషన్లో పేర్కొన్న బ్యాలెట్ పేపర్ క్రమసంఖ్య, 13 – బి పోస్టల్ బ్యాలెట్లో ఉన్న క్రమసంఖ్య ఒకటి కాకపోయినా, ఓటరు ఎవ్వరికీ ఓటు వేయకపోయినా, ఓటరు తమ ఓటుని ఒకరికంటే ఎక్కువ మందికి వేసినా, బ్యాలెట్ పేపరు చిరిగిపోయి పూర్తిగా సమాచారం కనిపించకపోయినా, ఓటరు ఓటుని ఎవరికి వేశారో పూర్తి సందిగ్ధంగా ఉన్నప్పుడు, ఓటరు తనే ఓటు వేసినట్లుగా గుర్తించినప్పుడు (ఉదాహరణకు ఓటరు పేరు రాసినా, సంతకం చేసినా) దానిని చెల్లని ఓటుగా పరిగణించాలి. ప్రతి బ్యాలెట్ పేపర్లో నమోదు చేసిన అంశాలను పోటీ చేసే అభ్యర్థుల ప్రతినిధిగా ఉన్న ఏజెంట్/అభ్యర్థికి విధిగా సంబంధిత ఎన్నికల అధికారి చూపించి నిర్ణయం తీసుకోవాలి. బ్యాలెట్ పేపరు లెక్కించిన తరువాత రిజల్ట్ షీట్ (ఫారం–20)లో నమోదు చేయాలి. -
సరిగ్గా ఐదేళ్ల క్రితం.. ప్రజా పరిపాలనకు శ్రీకారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడి.. ప్రజాపరిపాలనకు సీఎం వైఎస్ జగన్ నాంది పలికి నేటికి సరిగ్గా ఐదేళ్లు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ చారిత్రక విజయం సాధించింది. కేవలం 23 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాలకు పరిమితమైన టీడీపీ ఘోర పరాజయం పాలైంది. వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడంతో 2019, మే 30న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసి.. ప్రజాపరిపాలనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచి్చన హామీల్లో 95 శాతం అధికారం చేపట్టిన తొలి ఏడాదే అమలుచేశారు. మొత్తమ్మీద 99 శాతం హామీలు అమలుచేసి మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. సువర్ణాక్షరాలతో లిఖించేలా గత ఐదేళ్లుగా సంస్కరణలు, వికేంద్రీకరణ, సంక్షేమం, అభివృద్ధి పథకాలతో రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా సీఎం జగన్ సుపరిపాలన అందించారు. నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా.. వివక్ష చూపకుండా.. లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా పేదల ఖాతాల్లో డీబీటీ రూపంలో నేరుగా రూ.2.70 లక్షల కోట్లు జమచేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. దేశ చరిత్రలో ఐదేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చిన దాఖలాలు ఎక్కడాలేవు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. ఇంటిగుమ్మం వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు.మంచి చేసిన ప్రభుత్వానికి దన్నుగా..ఈ నేపథ్యంలో.. ఇప్పటికే అమలవుతున్న పథకాలను కొనసాగిస్తూ.. ఏటా అమ్మఒడి పథకం కింద ఇస్తున్న సొమ్మును రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతామని.. రైతుభరోసా కింద ఇస్తున్న రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచుతామంటూ కొత్తగా హామీలిచ్చిన సీఎం జగన్.. మీ బిడ్డ ప్రభుత్వంవల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే.. ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓటువేసి ఆశీర్వదించాలని ప్రజలకు వినమ్రంగా విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ వినతికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు.. రాష్ట్రం రూపురేఖలను మరింతగా గొప్పగా మార్చేందుకు వైఎస్సార్సీపీకి ప్రజలు దన్నుగా నిలిచారు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లోనూ అధిక స్థానాలు చేజిక్కించుకుని వైఎస్సార్సీపీ చారిత్రక విజయం సాధించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు స్పష్టంచేస్తున్నారు. -
పిన్నెల్లిపై పచ్చ కుట్రలు.. విర్రవీగితే నష్టం తప్పదు..
ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖలో ఏమి జరుగుతోంది. అధికారంలో ఉన్న పార్టీ కొద్దిమంది పోలీసుల నుంచి ఇబ్బందులను ఎదుర్కోవడం ఏమిటి? ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి ఆ పోలీసులపై పెత్తనం చెలాయించడం ఏమిటి? గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని చెప్పాలి. ఎన్నికల సమయంలో ఎవరిపైన అయినా నిర్దిష్ట ఆరోపణలు వస్తే ఆ పోలీసు అధికారులను బదిలీ చేయడం సహజమే. ఇదేమి కొత్త విషయం కాదు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ వేరే అధికారులను నియమిస్తుంది. ఇక్కడే ఈసీ పెద్ద తప్పు చేసింది. ఏపీలో తెలుగుదేశం కూటమికి సాయం చేయడానికి నడుం కట్టినట్లు ఉంది. వెంటనే కూటమి నేతలు కొరుకున్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను, కింది స్థాయి పోలీసు అధికారులకు కొత్తగా పోస్టింగులు ఇచ్చేసింది. దాని ఫలితమే మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి మొదలైన చోట్ల హింసాయుత ఘటనలకు అవకాశం ఏర్పడింది. చివరికి ఈసీ తాను నియమించిన కొందరు అధికారులనే సస్పెండ్ చేయవలసి వచ్చింది.దాంతో ఈసీకి అప్రతిష్ట వచ్చింది. అయినా కొందరు పోలీసు ఉన్నతాధికారుల తీరు మారినట్లు లేదు. ఇప్పటికీ టీడీపీ ట్రాప్లోనే కొనసాగుతూ వైఎస్సార్సీపీని ఇబ్బందిపెట్టాలని ఆ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ హైకోర్టులో వెల్లడైన అంశాలు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను కిందపడేశారనో లేక ద్వంసం చేశారన్న కేసులో బెయిల్ పొందగానే, అంతకు ముందు జరిగిన ఘటనలలో పనికట్టుకుని ఈయనపై కేసులు పెట్టారట. అందులో సీఐపై దాడి వంటి కేసులు కూడా ఉన్నాయి. ఘటనలు జరిగి పది రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేపై కేసు పెట్టడం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. కానీ ఏపీలో ఆ పోలీసు అధికారులకు మాత్రం ఆ ప్రశ్న రాలేదు.ఎలాగైనా పిన్నెల్లిని ఏదో ఒక కేసులో అరెస్టు చేసి ఆయనను కౌంటింగ్ వద్దకు రాకుండా చేయాలన్నది వారి కుట్ర అట. లేకుంటే డీజీపీ హైకోర్టుకు ఇచ్చిన రిపోర్టులో పిన్నెల్లిపై ఈ నెల 22 న కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పిన్నెల్లి న్యాయవాదులు కింది కోర్టులో ఉన్న సంబంధిత డాక్యుమెంట్లు తీసుకు వచ్చి ఈ నెల 23న అంటే ఈవీఎం కేసులో ముందస్తు బెయిల్ రాగానే కొత్త కేసులు పెట్టారని హైకోర్టుకు చూపించారు. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు పెట్టి ప్రతిపక్ష నేత చంద్రబాబు అవినీతి కేసులో బెయిల్ పొందారు. ఇక్కడ అందుకు బిన్నంగా పోలీసులే తప్పుడు సమాచారం ఇచ్చి ఒక ఎమ్మెల్యేని అక్రమంగా అరెస్టు చేయాలని తలపెట్టారు. ఇది సిగ్గు చేటైన విషయం. ఇదంతా పిన్నెల్లిపై కక్షతో ఉద్దేశపూరితంగానే తప్పుడు కేసులు పెట్టారన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది.ఒక సీఐ స్థాయి అధికారి ప్రైవేటు లాయర్ను పెట్టుకోవడం ఏమిటో తెలియదు. నిజానికి ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడుల కేసులలో ప్రభుత్వమే లాయర్లను పెడుతుంది. లేదా నిర్దిష్ట అనుమతి తీసుకుని వ్యక్తిగత లాయర్లను నియమించుకోవచ్చు. అలాకాకుండా నేరుగా ఇలా చేశారంటే ఆ సీఐని ఏమనుకోవాలి. ఆయన వెనుక మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. చిత్రమేమిటంటే ప్రతిపక్ష టీడీపీ కూటమి ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన ఈసీ, అధికార వైఎస్సార్సీపీ ఫిర్యాదులను పట్టించుకోకపోవడం. చివరికి ఒక సీఐ స్థాయి అధికారి తప్పుడు కేసులు పెడుతుంటే వైఎస్సార్సీపీ నిస్సహాయంగా మిగిలిపోవడం. దీనిని దృష్టిలో ఉంచుకునే ఎన్నికల సంఘం రిఫరీ మాదిరిగా కాకుండా, కూటమిలో బాగస్వామిగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వచ్చాయి.పోలీసు అధికారులు ఎన్నికల సమయంలో అత్యంత నిష్పక్షపాతంగా ఉండాలి. అలా కాకుండా వ్యవహరిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అవుతుంది. 2009 లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఎస్.ఎస్.పి యాదవ్ అనే అధికారి డీజీపీగా ఉన్నారు. ఆయనపై విపక్షం ఆరోపణలు చేస్తే ఈసీ బదిలీ చేసింది. ఆ తర్వాత ఎ.కె మహంతి అనే సీనియర్ అధికారిని డీజీపీగా నియమించింది. ఆయన నిజాయితీగా తన సేవలు అందించారు. దాంతో ఏ పార్టీ కూడా ఆయనపై ఆరోపణలు చేయలేదు. కానీ ఇప్పుడు ఈసీ తీరే అభ్యంతరకరంగా ఉంటే, ఈసీ నియమించిన తాత్కాలిక అధికారులు మరింత చెలరేగిపోతున్నారన్న విమర్శ ఎదుర్కుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి వస్తే తమ పరిస్థితి ఏమిటన్నది ఆలోచించకుండా కొద్ది మంది పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు వారి తెంపరితనాన్ని సూచిస్తుంది.డీజీపీగా వచ్చిన హరీష్ గుప్తపై తొలుత ఆరోపణలు రాలేదు. కానీ ఎవరి ఒత్తిడికి లొంగారో కానీ పిన్నెల్లిని అరెస్టు చేయడం కోసం హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. హైకోర్టు సీరియస్ గా తీసుకుంటే ఇలా చేసిన పోలీసులకు ఇక్కట్లు తప్పవు. 2009 లో ఏ అధికారిని మార్చినా వైస్ రాజశేఖరరెడ్డి పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు కూడా ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే మాదిరి వ్యవహరిస్తూ ఏ అధికారిని మార్చి, ఎవరిని పెట్టుకున్నా ప్రత్యేకించి స్పందించకపోవడం విశేషం.గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎంత రచ్చ చేసింది అందరికి తెలుసు. కేవలం టీడీపీ కూటమికి సాయపడడం కోసం ఈ అధికారులు తమ కెరీర్ ను దెబ్బతీసుకుంటున్నారనిపిస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక ఈవీఎంను కింద పడేసిన ఘటనకు సంబంధించి ఈసీ స్పందించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఎడిట్ అయి టీడీపీ నేత లోకేష్ వద్దకు చేరడం, దానిని ఆయన తన ఎక్స్ ఖాతాలో పెట్టడం, కేవలం దానిపై ఆధారపడి ఈసీ పిన్నెల్లిపై కేసు పెట్టాలని నిర్ణయించడం వివాదాస్పదం అయింది. అదే టైమ్ లో పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్లను బూత్ నుంచి టీడీపీ వారు బయటకు తోసేసి దౌర్జన్యం చేసిన వీడియోలను వైఎస్సార్సీపీవారు ఈసీకి పంపినా ఎలాంటి చర్య తీసుకోకపోవడం అనుమానాలకు తావిచ్చింది.మరో సంగతి చెప్పాలి. టీడీపీ నేతలు చింతమనేని ప్రభాకర్, అస్మిత్ రెడ్డి, ప్రభాకరరెడ్డిలు వేర్వేరు కేసుల్లో చిక్కి పోలీసులకు దొరకకుండా పారిపోతే కనీసం ఒక్క ముక్క రాయని ఎల్లో మీడియా, పిన్నెల్లిపై మాత్రం కక్ష కట్టి పరార్ అంటూ పెద్ద, పెద్ద కథనాలు వండి వార్చింది. అంతేకాదు. తమకు అనుకూలంగా ఉండరని భావించిన అధికారులపై నిర్దిష్ట ఆరోపణలు లేకుండా ఈసీ వారిని బదిలీ చేయడం కూడా తప్పే అని చెప్పాలి. ఈనాడు వంటి పత్రికలు మరీ అథమ స్థాయికి దిగజారి డీజీపీని బదిలీ చేసినా, ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఎందుకు బదిలీ చేయలేదంటూ పెద్ద, పెద్ద స్టోరీలు అల్లింది. అంటే ఈయనను కూడా తొలగిస్తే కౌంటింగ్ సమయంలో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చన్నది టీడీపీ, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారి భావన కావచ్చు.రాధాకృష్ణ తీరు మరీ విడ్డూరం. ఆయనేమో రాజకీయ రొచ్చులో, అవినీతి బురదలో నిండా మునిగి ఉంటారు. జవహర్ రెడ్డి వంటి అధికారులపై మరకలు పూస్తున్నారు. లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు జవహర్ రెడ్డి పంచాయతీరాజ్ సెక్రటరీగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారట. జగన్ దగ్గరకు వచ్చాకే పాడయ్యారట. ఇంత చెత్తగా వార్తలు రాసే ఆంద్రజ్యోతిని ఎవరైనా నమ్ముతారా? కౌంటింగ్ సమయంలో జవహర్ను తప్పించి తమకు కావల్సిన అధికారిని ఎవరినైనా పెట్టించుకుని అవకతవకలకు పాల్పడాలన్న లక్ష్యంతో ఉన్నారేమో తెలియదు కానీ, చెత్త వార్తలు రాయడానికి పోటీపడుతున్నారు. జవహర్ రెడ్డి బదిలీ ఒక్క విషయాన్ని మాత్రం ఈసీ ఇంకా అంగీకరించలేదు. దాంతో ఈనాడు, ఇతర ఎల్లో మీడియా జవహర్ రెడ్డి పై కక్ష కట్టి చోటా, మోటా నేతలతో ఆయన మీద ఆరోపణలు చేయించి, వాటిని తమ మీడియాలో పెద్ద ఎత్తున కవర్ చేస్తున్నాయి. బహుశా గతంలో ఇంత నీచమైన రాజకీయం, జర్నలిజం చూడలేదు. పరిస్థితులు ఎప్పుడూ ఒకే మాదిరి ఉండవు. ఆ సంగతి మరిచి విర్రవీగితే వారికే నష్టం.మరో సంగతి చెప్పాలి. పోస్టల్ బాలెట్ కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దేశం అంతటికి ఇచ్చిన గైడ్ లైన్స్ ను కాదని ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి మీనా కొత్త ఆదేశం ఇవ్వడం వివాదం అయింది. మీనా తప్పును సరిచేసుకోకపోతే ఆయనపై కూడా సందేహాలు వస్తాయి. గతంలో 2009లో ఎన్నికలు ఫలితాలు వచ్చి మరోసారి ప్రభుత్వం రాగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తిరిగి ఎస్.ఎస్.పీ యాదవ్ ను డీజీపీగా నియమించారు. ఇప్పుడు కూడా తనపై ద్వేషంతో టీడీపీ కూటమి బదిలీ చేయించిన అధికారులందరిని తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి కాగానే మళ్లీ పదవులలోకి తీసుకుంటారన్నది కూడా నిజం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
జాకీలు పెట్టి లేపినా.. లోకేష్కు అంత సీను లేదబ్బా!
తెలుగుదేశం పార్టీలో ఏదో అంతర్మథనం ఆరంభమైనట్లుగా ఉంది. శాసనసభ ఎన్నికలలో వచ్చే ఫలితాలపై టీడీపీలో టెన్షన్ ఏర్పడిన నేపథ్యంలో కౌంటింగ్ తర్వాత పార్టీలో ఏమి జరిగే అవకాశం ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న ఒక ప్రకటనలో నారా లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలలో గెలుస్తామని చెబుతూనే ఆయన ఈ వ్యాఖ్య చేయడంతో పార్టీ క్యాడర్లో కన్ప్యూజన్ ఏర్పడింది. టీడీపీ గెలిచే అవకాశం ఉంటే లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేయవలసిన వెంకన్న ఇలా అనడంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. వెంకన్న ప్రకటనకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నా, ఇది అంత చిన్న విషయం కాదన్న భావన ఉంది.చంద్రబాబు జాతీయ అద్యక్షుడు అని చెప్పుకుంటున్నా, అది నామమాత్రమే అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా కింజారపు అచ్చన్నాయుడు ఉన్నారు. ఆయన పట్ల లోకేష్కు అంత సదభిప్రాయం లేదు. అచ్చెన్నను తప్పించాలని గతంలో కూడా ఆలోచన చేశారు. దానిని దృష్టిలో ఉంచుకుని ఏమైనా మాట్లాడారా? అనే సంశయం వస్తుంది. చంద్రబాబు వయసు రీత్యా ఇక పార్టీ అధ్యక్ష బాధ్యతలను కుమారుడికి అప్పగించాలని ఏమైనా అనుకుంటున్నారా? ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే చంద్రబాబుపై పార్టీలో నమ్మకం బాగా తగ్గుతుంది. అలాగని లోకేష్ నాయకత్వ పటిమపై కూడా క్యాడర్లో ఇంకా విశ్వాసం ఏర్పడలేదు.ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిను ఎదుర్కోగల సత్తా లోకేష్ కు ఉందా అనే సంశయం ఉంది. లోకేష్ స్వయం ప్రకాశిత నేత కాదు. తండ్రిచాటు బిడ్డగానే రాజకీయంలోకి వచ్చారు. అలాగే ఇప్పటికీ కొనసాగుతున్నారు., అప్పడప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తున్నా, వాటికి గ్యారంటీ లేదని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కొన్నిచోట్ల చంద్రబాబు నాయుడు కొందరికి టిక్కెట్ హామీ ఇస్తే, లోకేష్ మరికొందరికి టిక్కెట్ హామీ ఇచ్చారట. వారి నుంచి డిపాజిట్ కూడా తీసుకున్నారని చెబుతారు. కానీ టిక్కెట్ పొందలేకపోయిన వారికి కొందరికి లోకేష్ డబ్బు తిరిగి ఇవ్వలేదని ప్రచారం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధికారంలోకి రాలేకపోతే ఇవి గొడవలుగా మారే అవకాశం ఉంటుంది.లోకేష్ ప్రసంగాలలోకానీ, పార్టీ నిర్వహణలో కానీ అంత సమర్థత చూపలేకపోతున్నారని చెబుతారు. అందుకే చంద్రబాబు ఇప్పటికీ పార్టీ పగ్గాలు వదలి పెట్టలేకపోతున్నారన్నది వారి అభిప్రాయం. మరో సంగతి ఏమిటంటే పోలవరం కాంట్రాక్టర్గా గతంలో వ్యవహరించిన రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు ఒక ఆరోపణ చేస్తూ చంద్రబాబు, లోకేష్ లు తమ వద్ద పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారని అనేవారు. దీనిపై ఇంతవరకు వీరు నోరు విప్పలేదు. డబ్బు లావాదేవీల సంగతి పక్కనబెడితే లోకేష్ గట్టివాడైతే 2014 ఎన్నికలలో పోటీచేసి ఉండేవారు. అప్పట్లో అధికారం రావడంతో పెత్తనం చేయడం ఆరంభించారు. తదుపరి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిల ద్వారా తండ్రి చంద్రబాబుపై ఒత్తిడి చేసి ఎమ్మెల్సీ పొంది, ఆ వెంటనే మంత్రి కూడా అయిపోయారు. అయినా తన శాఖలను నిర్వహణలో అంత పేరు తెచ్చుకోలేకపోయారు.కానీ అన్నీ శాఖలపై ఆధిపత్యాన్ని చెలాయించడం వివాదాస్పదం అయింది. చంద్రబాబు కూడా ఆయా సందర్భాలలో లోకేష్ ను కలిసి వచ్చారా అని అడిగేవారట. అంటే దాని అర్ధం ఏమిటో తెలుసు కదా! అంత అధికారం ఎంజాయ్ చేసినా, 2019 శాసనసభ ఎన్నికలలో ఆయన ఓటమి చెందడం బాగా అప్రతిష్ట అయింది. అయినా ఎమ్మెల్సీగా ఉండడంతో కౌన్సిల్ లో కొన్నిసార్లు అనుచితంగా ప్రవర్తించడం ద్వారా ప్రజల దృష్టి ఆకర్షించాలని ప్రయత్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియావారు ఆయనకు భారీ ఎలివేషన్ ఇచ్చి ప్రచారం చేశారు. అయినా ఆశించిన రీతిలో పార్టీలో నమ్మకం కలిగించలేకపోయారు.ఉపన్యాసాలలో తడబడడం, భాష సరిగా రాకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇవేమీ పెద్ద సమస్యలు కావు. కానీ ఒక విధానం లేకపోవడం, తండ్రి మాదిరి అబద్ధాలు చెప్పడం, అధికారులను బెదిరించడం, రెడ్ బుక్ అంటూ బ్లాక్ మెయిల్కు పాల్పడడం, కార్యకర్తలు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పోస్టు ఇస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వంటివి చేయడంతో ఈయనలో నాయకత్వ లక్షణాలు కొరవడ్డాయన్న భావన ఏర్పడింది. తన తండ్రి చంద్రబాబు బాటలోనే నడిచి అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం, తానేదో చాలా గొప్పనాడిని అయిపోయినట్లు మాట్లాడడం చేస్తుడడంతో విశ్వసనీయత తెచ్చుకోలేకపోయారు. యువగళం పేరుతో పాదయాత్ర చేసినా, అందులో ఒక చిత్తశుద్ది కనిపించలేదు. పేద ప్రజలతో పూర్తిగా కలవలేకపోయారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోల్చి చూస్తే ఈయన దరిదాపులో కనిపించలేకపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయం ప్రకాశిత నేతగా ఎదిగితే, లోకేష్ ఏమో ఇంకా చంద్రబాబు కుట్ర రాజకీయాలపైనే ఆధారపడవలసి వస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అండతోనే రాజకీయాలలోకి వచ్చినా, ఆ తర్వాతకాలంలో ఒంటరిగా ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కున్నారు. పోరాటాలు చేశారు. సోనియాగాంధీ, చంద్రబాబుల కుట్రలను ఎదుర్కున్నారు. 2014 ఎన్నికలలో పార్టీ అధికారంలోకి రాకపోయినా, 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. జనంలోకి వెళ్లి పాదయాత్ర చేసి, పేద ప్రజలకు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తానో చెప్పడానికి ప్రాధాన్యత ఇచ్చారు.చంద్రబాబు, లోకేష్ లు మాత్రం ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిను దూషించడం, అసభ్య భాష వాడడం చేశారు. ఆ తేడాను జనం గమనించి 2019 ఎన్నికలలో టీడీపీని ఘోరంగా ఓడించారు. లోకేష్ మంగళగిరిలోనే ఓటమిచెందారు. ఆ తర్వాత ఆయన అక్కడ కేంద్రీకరించి భారీ వ్యయం చేస్తూ, ఈసారి ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు రాయలసీమకు చెందినవారు. ఆయన చంద్రగిరి వదలి కుప్పం నుంచి గత మూడున్నర దశాబ్దాలుగా పోటీచేస్తున్నారు. లోకేష్ ధైర్యవంతుడు అయి ఉంటే తన తండ్రి పుట్టిన ప్రాంతమైన చంద్రగిరి నుంచి పోటీచేసి ఉంటే ఆయనపై టీడీపీలో విశ్వాసం పెరిగేది. కానీ ఆ పని చేయలేకపోయారు.ఈ పరిస్థితిలో లోకేష్ పార్టీ అధ్యక్షుడు కావాలని వెంకన్న వంటివారు కోరుకున్నారంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఇంకా అర్హత సంపాదించలేకపోయారని అనుకోవాలా? యూపీలో సమాజవాది పార్టీ నేత మూలాయం సింగ్ జీవించి ఉన్న రోజులలో ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ సైకిల్ యాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆ ఎన్నికలలో అఖిలేష్ యాదవే ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేలంతా ఓపెన్ గానే చెప్పారు. ఆ స్థితి లోకేష్ కు లేకపోవడం ఒక బలహీనతగా కనిపిస్తుంది.టీడీపీలో 2009 లో జూనియర్ ఎన్.టీ.ఆర్ సేవలను చంద్రబాబు వాడుకుని ఆ తర్వాత వదిలివేశారు. ఆయనను కనీసం మహానాడుకు కూడా ఆహ్వానించలేదు. జూనియర్ ఎన్.టీ.ఆర్ పార్టీలో ఉంటే లోకేష్ అవకాశాలు పోతాయని చంద్రబాబు భయపడ్డారు. నిజానికి లోకేష్ రాజకీయాలలోకి వస్తారా అని అంతకుముందు రోజుల్లో ఎవరైనా చంద్రబాబును అడిగితే ఆ ప్రశ్న వేసినవారిపై రుసరుసలాడేవారు. ఆ దశ నుంచి ఇప్పుడు కుమారుడిని జాకీలుపెట్టి లేపే పనిలో చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా యజమానులు పడ్డారు. పార్టీని నడపడం తప్పుకాదు. ఆ స్థాయికి ఎదగాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ రాజకీయాలను ఒక స్టాండర్డ్లో చేయలేకపోతే ప్రజలలో విశ్వసనీయత రాదు. ఇప్పుడు అదే సమస్యను లోకేష్ ఎదుర్కుంటున్నారు.ఏతావాతా చెప్పేదేమిటంటే వెంకన్న వంటివారికి టీడీపీ గెలుపు మీద సంశయాలు ఉండి ఉండాలి. అంతేకాక లోకేష్ సమర్థత మీద అనుమానాలు ఉండాలి. అందుకే ఆయనను పార్టీకి పరిమితం చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు. కానీ లోకేష్ను ఒక్కసారి పార్టీ అధ్యక్షుడిగా చేస్తే పార్టీలో ఎలాంటి పరిణామాలు వస్తాయో చెప్పలేం. అప్పుడు కూడా చంద్రబాబు చాటు మనిషిగానే ఉంటే పెద్ద ఉపయోగం ఉండదు. స్వతంత్రంగా పనిచేసేంత శక్తి ఉందా అనే భయం పార్టీలో ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే ఒకరకంగా, రాకపోతే మరోరకంగా ఈ పరిణామాలు ఉంటాయి. వివిధ సర్వేలను గమనిస్తే టీడీపీ శాసనసభ ఎన్నికలలో గెలిచే అవకాశం కనిపించడం లేదు. అందువల్ల ఫలితాల తర్వాత టీడీపీ సంక్షోభంలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
వామ్మో వీళ్లే.. పీఎస్! వీళ్లదే.. కోర్టు తీర్పు!!
ఆంధ్రప్రదేశ్లోని మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఒక ఘటనకు విశేష ప్రచారం వచ్చింది. అక్కడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్లో ఈవీఎంను కిందపడేసినట్లు చెబుతున్న ఉదంతానికి సంబంధించిన వీడియో సహజంగానే వైరల్ అవుతుంది. అలాంటి వాటిని ఎవరూ సమర్థించరు. కానీ అదే సమయంలో అక్కడ జరిగిన ఇతర గొడవలు, టీడీపీవారి దౌర్జన్యాలను కప్పిపుచ్చుతూ ఈ వీడియో మాత్రమే లీక్ అయిన తీరు ఆశ్చర్యంగానే ఉంటుంది. మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పిన్నెల్లి తప్పు చేశారో, లేదో కానీ, దానితో పోల్చితే ఎన్నికల సంఘం చేసిన తప్పే పెద్దదిగా కనిపిస్తుంది.ఎన్నికల సంఘం వద్ద రహస్యంగా ఉండవలసిన వెబ్ కాస్ట్ వీడియో ఫుటేజీ బయటకు వచ్చిన వైనం, అది కూడా టీడీపీ నేత లోకేష్ కు దగ్గరకు చేరడం, దానిని ఆయన ఎడిట్ చేసి తమకు అనుకూలమైన మేర ఎన్నికల కమిషన్ కు పంపడం, వెంటనే కమిషన్ స్పందించడం.. ఇవన్ని చూస్తుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఏదో పెద్ద కుట్రే జరుగుతోందన్న అనుమానం వస్తుంది. లోకేష్ వద్దకు ఆ వీడియో ఎలా వెళ్లిందో తెలియదని సీఈఓ మీనా చెప్పడాన్ని బట్టే ఇందులో కుట్ర స్వభావం కనిపిస్తుంది. దీనిపై లోకేష్ ను విచారిస్తారా? లేదా? అనేది చూడాలి.మే పదమూడో తేదీన జరిగిన ఈ ఘటన వీడియో ఎనిమిది రోజుల తర్వాత ఎలా వెలుగులోకి వచ్చిందన్నది ఒక ప్రశ్న. అలా అనధికారికంగా ఎన్నికల సంఘం నుంచి వీడియోలు లీక్ కావచ్చా? అది నిజమైన వీడియోనా? కాదా? అనే దానిని దృవీకకరించుకోకుండా ఎన్నికల సంఘం చర్యకు ఉపక్రమించవచ్చా? వీడియో లీక్ పై విచారణ జరగదా? సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోరా? పరిస్థితి ఇలాగే ఉంటే ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ప్రజలకు అనుమానాలు రావా? ఇప్పటికే ఏపీలో టీడీపీ, బీజేపీలు జత కట్టాక ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా లేదని, కూటమి నేతలు ఏది కోరితే అది చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. దానికి తగినట్లే ఇలా రహస్య సమాచారం కూడా బయటకు వెళ్లితే కౌంటింగ్ అయినా సజావుగా జరుగుతుందా? లేక కూటమికి ఉపయోగపడేలా ఈసీ నిర్ణయాలు తీసుకుంటుందా? అనే సందేహాలు వచ్చే అవకాశం ఉంది.ఈవీఎంలను కిందపడేసి పాడు చేసే యత్నాలకు సంబంధించి అనే ఈ వీడియోలను ఈసీ అధికారికంగా విడుదల చేసి ఉండవచ్చు. అప్పుడు ఎమ్మెల్యే అయినా, మరొకరు అయినా తప్పు చేస్తే చర్య తీసుకోవచ్చు. అలాకాకుండా సెలెక్టివ్ గా వీడియో లీక్ కావడంలో ఆంత్యర్యం ఏమిటి? దానిని ఎవరైనా ఈసీ వర్గాల నుంచి తస్కరించి బయటపెట్టారా? లేక అధికారులు ఎవరైనా లీక్ చేశారా? లేదా పిన్నెల్లి లాయర్ అనుమానించినట్లు అదేమైనా ఫేక్ వీడియోనా? అనేది తేలాలి.పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబందిత పాల్వాయి గ్రామం వద్ద టీడీపీ వారు రిగ్గింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు శ్రద్ద చూపలేదట. ఈసీకి ఫిర్యాదు చేసినా వారు సీరియస్గా చర్య తీసుకోలేదు. అక్కడ వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్ను కూడా తరిమేసి దొంగ ఓట్లను వేయించుకోవడం, బలహీనవర్గాలవారిని ఓటింగ్ కు రాకుండా భయపెట్టడం వంటి సంఘటనలు ఏమి చెబుతాయి! ఆ సమాచారం తెలిసిన పిన్నెల్లి అక్కడకు వెళ్లి ఆవేశపడి ఉండవచ్చు. కానీ దానివల్ల ఈవీఎం. ఏమీ పాడుకాలేదు. అక్కడ రీపోలింగ్ కూడా అధికారులు పెట్టలేదు. అలాంటటప్పుడు ఈవీఎం ద్వంసం అని ప్రచారం చేయడం అర్దరహితం. టీడీపీ వారు కూడా ఇలాగే మరో ఆరేడు, చోట్ల పల్నాడు ప్రాంతంలో ఈవీఎంలను పాడు చేయడానికి యత్నించారు. అక్కడ కూడా రీపోలింగ్ జరగలేదు.ఆ ఘటనలలో కొందరు టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేయగా, మరికొందరు పరారీలో ఉన్నారు. అయినా టీడీపీ వారు చేసిన తప్పులను మాత్రం కప్పిపుచ్చుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా వైఎస్సార్సీపీపై మాత్రం విపరీత ద్వేషపూరిత ప్రచారం చేస్తోంది. ఈసీ ఈవీఎంలను ద్వంసం చేయడానికి జరిగే ప్రయత్నాల వీడియోలన్నిటిని బహిరంగపరచి ఉండాల్సింది. అలాగే పాల్వాయి వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్ ను కొట్టి బయటకు లాగడం, తదితర దృశ్యాలను కూడా విడుదల చేయాల్సింది. అలా చేయకపోవడం వల్ల ఈసీ తీరుపై అనుమానాలు పెరుగుతున్నాయి.తాజాగా గుంటూరు ఐజీ త్రిపాఠి కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుపై వచ్చిన కథనం సంచలనంగా ఉంది. ఇదంతా చూస్తే ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పటికీ, అధికారం మాత్రం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చెలాయిస్తున్నదన్న అభిప్రాయం వస్తుంది. 2019 ఎన్నికల సమయంలో బీజేపీకి దూరంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈసీ పై ఆరోపణలు చేస్తూ సిఈఓ ఆఫీస్ వద్ద ధర్నా కూడా చేశారు. తన మనిషిగా భావించి ఇంటెలెజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఈసీ బదిలీ చేయడానికి వీలు లేదని నానా రచ్చ చేశారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఫలానా అధికారి కావాలని కానీ, ఫలానా అధికారులను ఎందుకు బదిలీ చేశారని కానీ ఈసీని ప్రశ్నించలేదు.చంద్రబాబు మాదిరి గొడవలకు దిగకుండా హుందాగా వ్యవహరిస్తున్నారు. పార్టీపరంగా ఏదైనా అవసరం వస్తే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తున్నారు. ఈ రకంగా చంద్రబాబుకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఉన్న తేడాను గమనించవచ్చు. అంతేకాక జరుగుతున్న పరిణామాలు చూస్తే చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఎందుకు అంటకాగడానికి విశ్వయత్నం చేసింది అందరికి అర్ధం అయిపోతోంది. ఇక్కడ కొన్ని సంగతులు చెప్పుకోవాలి. ఓటుకు నోటు కేసు సమయంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పట్లో అరెస్టు అయ్యారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు మనవాళ్లు భ్రీఫ్ డ్ మి అంటూ చేసిన వ్యాఖ్యల ఆడియో బయటకు వచ్చింది. అప్పుడు చంద్రబాబు వాదన ఏమిటంటే తన ఫోన్ టాపింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించేవారు. పైగా అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఏపీలో ఎదురు కేసులు రిజిస్టర్ చేయించారు. ఆ కేసులో ముప్పైసార్లు చార్జీషీట్ లో చంద్రబాబు పేరు వచ్చినా, ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకుండా మేనేజ్ చేసుకోగలిగారు. దానిని అంతటిని కుట్రగా ప్రచారం చేశారే కానీ, జరిగింది తప్పు అని చెప్పకుండా తప్పించుకునే యత్నం చేశారు.అదే కాదు. కొద్ది నెలల క్రితం పుంగనూరు, అంగళ్లు వద్ద జరిగిన గొడవలలో చంద్రబాబు స్వయంగా తన కార్యకర్తలను రెచ్చగొడుతూ తన్నండి.. కొట్టండి.. అంటూ దూషణలకు దిగారు. దానిపై కేసు అయితే, అదంతా పోలీసుల తప్పు గా ఈనాడు, జ్యోతి ప్రచారం చేశాయి. పుంగనూరులో అయితే చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని దగ్దం చేయడం, రాళ్లు విసరడం చేస్తే ఒక పోలీస్ కానీస్టేబుల్ కు కన్ను కూడా పోయింది. అయినా ఈనాడు మీడియా పోలీసులదే తప్పన్నట్లు, టీడీపీ నేతలను అరెస్టు చేయడం అక్రమం అనేట్లుగా దారుణ ప్రచారం చేసింది.ఏపీలో ఎల్లో మీడియా ఎంత నీచంగా వ్యవహరిస్తున్నదనడానికి ఇవన్ని ఉదాహరణలే. అలాగే ఇతర చోట్ల ఈవీఎం లను కింద పడేస్తే టీడీపీ వారిపై పెట్టిన కేసులకు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై పెట్టిన కేసుల సెక్షన్లకు చాలా తేడా ఉందట. ఎమ్మెల్యేపై అతి కఠినమైన సెక్షన్లు పెట్టడం కూడా కుట్రగానే చూస్తున్నారు. హైకోర్టు ఈ కేసులో తాత్కాలిక స్టే ఇచ్చింది. అది వేరే విషయం. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, నేతలు కానీ కొందరు ఇలాంటి నేరాలకు పాల్పడకపోలేదు. ఉదాహరణకు గతంలో ఒక టీడీపీ ఎమ్మెల్యే బాంబుల శివారెడ్డిగా పేరొందారు. వేరేప్రాంతానికి చెందిన ఆయన హైదరాబాద్ స్థానిక ఎన్నికలలో బూత్ల వద్ద బాంబులు విసిరారు. మరో టీడీపీ ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రాలలోకి వెళ్లి బాక్స్లలో నీళ్లు పోశారు. ఈవీఎం లకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్న రోజుల్లో ఆయన మద్దతుదారుడు ఒకరు ఏకంగా ఒక ఈవీఎం నే అపహరించుకుని వచ్చారన్న కేసు నమోదు అయింది.గతంలో 1999 ఎన్నికల సమయంలో టీడీపీ ప్రముఖ నేత కోడెల శివప్రసాదరావు ఆస్పత్రిలో బాంబులు పేలి నలుగురు మరణిస్తే, ఆయనపై కేసు విచారణే జరగకుండా చంద్రబాబు అప్పటి కేంద్ర హోం మంత్రి అద్వాని ద్వారా మేనేజ్ చేయగలిగారు అప్పుడు ఆ కేసును బీజేపీ సహకారంతో కప్పిపుచ్చగలిగారు. ఇప్పుడు బీజేపీ సహకారంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చికాకు సృష్టిస్తున్నారు. తమకు కావల్సిన పోలీసు అదికారులను ఈసీ ద్వారా పోస్టు చేయించుకుని గందరగోళం చేస్తున్నారు. ఈసీ ఇంతగా దిగజారిపోవడం ఇటీవలికాలంలో ఇదే అని చెప్పాలి. ఇలాంటి ఘటనలు టీడీపీ హయాంలో అనేకం జరిగినా, బలహీనవర్గాలవారు ఓట్లు వేయకుండా పోలీసు అధికారులే ఇప్పుడు అడ్డుకున్నా అదంతా ప్రజాస్వామ్యమని ఈనాడు రామోజీరావు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మాత్రం ఘోర అపచారానికి పాల్పడినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. టీడీపీ వారు ఏమి చేసినా భుజాన వేసుకోవడం, అదే ఎదుటివారిది చిన్న తప్పు అయినా గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేయడం ఈ మీడియాకు అలవాటు అయింది.దీనికి తోడు ఈనాడు రామోజీరావు రాజ్యాంగానికి ఏదో జరిగిపోయిందంటూ దిక్కుమాలిన సంపాదకీయం రాసి మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. ఇలాంటి తప్పులు ఎవరు చేసినా మంచిదికాదని చెప్పవలసిన ఈ పెద్ద మనిషి టీడీపీ నేతల తప్పులను మాత్రం ఎంతదూరం అయినా వెళ్లి కాస్తున్నారు. మాచర్ల టీడీపీ అభ్యర్ధిపై పలు కేసులు ఉన్న విషయాన్ని కప్పిపుచ్చే యత్నం జరుగుతోంది. ఎన్నికల రోజున ఆయన ఆధ్వర్యంలో కొన్ని బూత్ల వద్ద జరిగిన అల్లర్లపై పలు వార్తలు వచ్చాయి. వాటి మీద ఏ చర్యలు తీసుకుంది తెలియదు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో పోలీసులు జరిపిన విధ్వంసంపై ఎన్నికల సంఘం ఏ చర్య తీసుకుందీ కూడా తెలియరాలేదు. పల్నాడుతో సహా వివిధ ప్రాంతాలలో సిట్ ఏర్పడిందే ప్రధానంగా టీడీపీవారి అరాచకాలపైన అనే సంగతి మర్చిపోకూడదు. దారుణాలకు పాల్పడి బలహీనవర్గాలవారిని ఓట్లు వేయనీయకుండా టీడీపీకి చెందినవారు చేసిన ప్రయత్నాలకు ఈనాడు కొమ్ముకాస్తున్న తీరు పెత్తందారులకు ఎలా వత్తాసు పలుకుతోంది అర్దం చేసుకోవచ్చు.పిన్నెల్లి పరార్ అనే బ్యానర్ కథనాలు రాసే ఈ పెద్దలు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పీఎస్ గా ఉన్న వ్యక్తి విచారణకు హాజరుకాకుండా అమెరికాకు పరారైతే మాత్రం సమర్థిస్తూ వార్తలు ఇస్తారు. చంద్రబాబుపై అవినీతి కేసు వస్తే నిర్లజ్జగా అది అక్రమ కేసు అని డబాయించడానికి రామోజీరావు బృందం చేసిన ప్రయత్నం చూశాక, వారు ఇంతేలే అని సరిపెట్టుకోవడం తప్ప ఏమి చేయగలం. ఆ రోజుల్లో చంద్రబాబును అరెస్టు చేస్తారా అని గగ్గోలు పెట్టిన ఈనాడు అర్జంట్ గా పిన్నెల్లిని తీసుకువెళ్లి జైలులో పెట్టాలని, ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని వీరే తీర్పు ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు దొంగ మెడికల్ సర్టిఫికెట్లతో బెయిల్ పొందేవరకు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తప్పుడు వార్తలు రాసిన ఈనాడు రామోజీరావు నుంచి ఇంతకన్నా ప్రమాణాలతో కూడిన జర్నలిజాన్ని ఆశించడం తప్పే అనుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో..
సాక్షి, నరసరావుపేట: పోలింగ్ రోజు, ఆ తర్వాత టీడీపీ నేతలు పల్నాడులో విధ్వంసం సృష్టించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారన్న అక్కసుతో వారిపై దాడులకు తెగబడ్డారు. ఎలాగైనా వారిని ఓటింగ్కు దూరం చేసి ఏకపక్షంగా రిగ్గింగ్కు పాల్పడేందుకు అరాచకాలు సృష్టించారు. ఓటింగ్ తరువాత సైతం బడుగు, బలహీన వర్గాలపై ప్రతాపం చూపారు. బలహీన వర్గాలపై సాగిన వరుస దాడులను అడ్డుకోవాల్సిన పోలీసు యంత్రాంగం పట్టించుకున్న పాపానపోలేదని వైఎస్సార్సీపీ నేతలు వాపోతున్నారు. పోలింగ్ రోజు, తరువాత పల్నాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడుల పరంపర కొనసాగింది. ఓటేసేందుకు వెళ్తున్న ఎస్సీ, ఎస్టీలపై దాడి రెంటచింతల మండలం తుమృకోటలో మే 13న ఓటు వేసేందుకు వెళ్తున్న ఎస్సీ, ఎస్టీ మహిళలపై టీడీపీలోని అగ్రకుల నాయకులు విచక్షణారహితంగా దాడి చేశారు. అప్పటికే క్యూలైన్లలో ఉన్న మహిళల్ని కొట్టడంతోపాటు వారిని బయటకు తరిమేసిన టీడీపీ నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారు. పోలింగ్ బూత్లో ఏజెంట్లను బయటకు గెంటేశారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తున్న మహిళల తలలు పగులగొట్టారు. దీంతో బాధిత మహిళలు ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీశారు. ఆ ఒక్క కులమే గ్రామంలో బతకాలా.. దళితులకు ఓటు వేసే హక్కులేదా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. రెంటచింతల మండల పరిధిలోని గోలి గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన మూఢావత్ మల్లయ్య నాయక్, కొండానాయక్, ఆర్.నాగేశ్వరరావు నాయక్, నాగేశ్వరరావు నాయక్లపై టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. పాలువాయిగేటు బూత్లలో అరాచకం పాలువాయిగేటు గ్రామంలో టీడీపీ గూండాలు ఈ నెల 13న ఉదయం 6.30 గంటల సమయంలో ప్రవేశించి గ్రామంలోని 201, 202 పోలింగ్ బూత్లలో వైఎస్సార్సీపీకి చెందిన వారిని ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నంబూరి శేషగిరిరావు బరితెగించి ఓటర్లపై దౌర్జన్యానికి దిగారు. 202 బూత్లోకి వెళ్లి ఓటర్లను భయాందోళనకు గురిచేసి రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్కు, నియోజకవర్గ రిటరి్నంగ్ అధికారికి, ఎస్పీ బిందుమాధవ్, జేసీ శ్యామ్ప్రసాద్ తదితర ఉన్నతాధికారులకు పిన్నెల్లి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు. ఈ సమయంలో టీడీపీ గూండాలు ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో వచ్చి వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడులకు తెగబడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు గౌతమ్రెడ్డి, డ్రైవర్ అంజిరెడ్డి, శ్రీను, మరికొందరికి గాయాలయ్యాయి. అక్కడితో ఆగకుండా టీడీపీ వర్గీయులు పిన్నెల్లి కాన్వాయ్లోని వాహనాన్ని ధ్వసం చేశారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడు నంబూరి శేషగిరిరావు. అతనిపై పోలీసులు ఏ1గా కేసు నమోదు చేశారు. అయితే.. ఆయనేదో ప్రజాస్వామ్యాన్ని రక్షించాడంటూ చంద్రబాబు ఫోన్లో పరామర్శించడంపై పాలువాయిగేటు గ్రామ ప్రజలు ఛీదరించుకుంటున్నారు. పోలింగ్ ముగిశాక బుడగ జంగాలపైనా దాడి కారంపూడి మండలం పేటసన్నెగండ్ల శివారు బాలచంద్రనగర్ (పోతురాజుగుట్ట)లో నివాసం ఉంటున్న బేడ బుడగ జంగాలు తమకు ఓటు వేయలేదని ఆగ్రహించిన టీడీపీకి చెందిన సుమారు 70 మంది పోలింగ్ ముగిశాక వారి ఇళ్లపై దాడి చేశారు. కనిపించిన ప్రతి ఒక్కరినీ కర్రలు, రాళ్లతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. మహిళలు, పిల్లలని కూడా చూడకుండా చావబాదారు. ఇళ్లలోని సామాన్లు, చివరకు ఫ్యాన్లు, బల్బులను కూడా పగులగొట్టారు. వైఎస్సార్సీపీ నాయకుడు పెల్లూరి కోటయ్యకు చెందిన స్కార్పియో కారును ధ్వంసం చేశారు. గొర్ల సైదులు చేయి, కాలిపై కర్రలతో బాదారు. కత్తెర లక్ష్మి చేయి విరగ్గొట్టారు. రాళ్ల దాడితో పోతురాజుగుట్టలోని వారంతా ప్రాణభయంతో పారిపోయి వేరేచోట తలదాచుకున్నారు. ‘ఏరా.. టీడీపీకి ఓటు వేయకుండా వైఎస్సార్సీపీకి ఓట్లు వేస్తారా. నా కొడకల్లారా..’ అంటూ తీవ్రంగా దూషిస్తూ అరాచపర్వాన్ని కొనసాగించారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తామని బెదిరించారన్నారు. ఊరొదిలి పారిపోయిన బడుగు జీవులు గురజాల నియోజకవర్గ పరిధిలోని మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకి చెందిన కుటుంబాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్ల వేశారన్న అక్కసుతో యరపతినేని శ్రీనివాస్ వర్గీయులు పక్క గ్రామాల నుంచి పెద్దఎత్తున టీడీపీ రౌడీలు, గూండాలను తీసుకొచ్చి పోలింగ్ రోజు రాత్రి దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల్ని లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లపై దాడులకు పాల్పడి ధ్వంసరచన సాగించారు. బైక్లు, జేసీబీలు, ఆటోలను, ఇళ్లలోని సామగ్రితోపాటు టీవీలు ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. మహిళలు, పిల్లలు అనే కనికరం కూడా లేకుండా బూతులు తిడుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలోని వైఎస్సార్సీపీ నేతలు పొలాల్లోకి పారిపోయి అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపారు. మహిళలు, చిన్న పిల్లలు, మహిళలు గంగమ్మ గుడిలో తలదాచుకున్నారని తెలిసి రాళ్లు విసురుతూ భయకంపితుల్ని చేశారు. పోలీసులకు విషయం తెలిసినా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి కల్పించారు. ఇప్పటికీ ఆ గ్రామానికి చెందిన బాధితులు అజ్ఞాతంలో ఉండగా, వారిపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం కొసమెరుపు. బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అనిల్కుమార్, కాసు మహేష్రెడ్డిపై కూడా టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయంటే వారి అరాచకం ఏ స్థాయిలో ఉందో ఆర్థం చేసుకోవచ్చు. చివరకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి నాయకుల్ని గ్రామాలు దాటించాల్సిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముప్పాళ్లలో మైనార్టీలపై దాడులు సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ల మండలం తొండపిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ముస్లింల ఇళ్లలోకి టీడీపీ సానుభూతిపరులు మూకుమ్మడిగా చొరబడ్డారు. మహిళలను, చిన్నారులను భయబ్రాంతులకు గురిచేస్తూ దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలోని పురుషులంతా ప్రాణాలు కాపాడుకునేందుకు పొలాల్లోకి పరుగులు తీశారు. మహిళలు, చిన్నారులు తలుపులు వేసుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు. ముస్లిం వర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారులు గ్రామం వదిలి వెళ్లిపోయారు. కంభంపాడులో విధ్వంసకాండ పెదకూరపాడు నియోజకవర్గం కంభంపాడులో పోలింగ్ రోజున వైఎస్సార్సీపీకి పట్టున్న ఎస్సీ, బీసీ కాలనీలపై కత్తులు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీరంగం వేశారు. మహిళలపైనా దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ ఆర్తిమళ్ల నాగేశ్వరరావు (నాగయ్య), సతీమణి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు అంజిమ్మ లక్ష్యంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు దాడులకు పాల్పడ్డారు. పలుమార్లు ఎస్సీ, బీసీ కాలనీలకు టీడీపీ రౌడీ మూక వెళ్లి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. ఎస్సీలపై దాష్టీకం చిలకలూరిపేట మండలం కావూరు ఎస్సీ కాలనీలో పోలింగ్ సందర్భంగా మే 13వ తేదీ రాత్రి వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ నాయకుల దౌర్జన్యం చేశారు. వైఎస్సార్సీపీకి ఎస్సీలు ఓటు వేశారన్న అక్కసుతో వారిపై టీడీపీ నేతలు దాడి చేశారు. పోలింగ్ మరుసటి రోజు నుంచి కాలనీకి చెందిన ఎస్సీలు గ్రామంలోని ప్లాంట్నుంచి మంచినీరు తీసుకువెళ్లకుండా టీడీపీ నేతలు తమ దాష్టీకాన్ని చాటుకున్నారు. ఓటేయకుండా అడ్డుకున్నారు ఓటేద్దామని పోలింగ్ బూత్కు వెళితే టీడీపీ నేతలు బెదిరించి అడ్డుకున్నారు. కర్రలతో దాడులు చేస్తుండటంతో ప్రాణభయంతో ఇంటికి పారిపోయా. అధికారులకు చెప్పినా చూస్తూ నిలబడిపోయారు. ప్రాణాలు కాపాడుకోవడం మేలని ఓటేయకుండా తిరిగొచ్చేశా. –కర్రా ఏసుపాదం, ఎస్సీ మహిళ, తుమృకోట ఓటు వేయలేకపోయా ఓటు వేయాలని రెండుసార్లు పోలింగ్ బూత్కు వెళ్లాను. అక్కడ యుద్ధ వాతావరణం చూసి భయపడి ఇంటికి వచ్చేశా. టీడీపీకి చెందిన వారు దాడులు చేస్తూ బడుగులను భయపెట్టి ఇళ్లకు పంపించారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి నేను చూడలేదు. – నందిగం పున్నమ్మ, ఎస్సీ మహిళ, తుమృకోట నా భర్తను కొట్టారు ఓటు వేయడానికి వెళ్లిన నా భర్త దీపావత్ స్వామినాయక్ను టీడీపీ గూండాలు దారుణంగా కొట్టారు. నన్ను కూడా ఓటు వేయకుండా బెదిరించారు. పోలింగ్ బూత్ల వద్ద దాడులు చేయడంతో మా కాలనీలో ఎవరూ ఓటు వేయలేదు. అధికారులు మాకు రక్షణ కలి్పంచలేకపోవడం వల్ల ప్రాణ భయంతో ఓటు వేయడానికి వెళ్లలేదు. – దీపావత్ రమణ, ఎస్టీ మహిళ, తుమృకోట ప్రాణభయంతో పరుగులు పెట్టా ఓటు వేయవద్దని.. వేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని టీడీపీ నేతలు బెదిరించారు. గ్రామస్తులు లెక్కచేయకపోవడంతో రిగ్గింగ్ చేయాలనే తలంపుతో దళితులపై కర్రలు, రాళ్లతో దాడులు చేయడంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు పెట్టా. – కత్తి భూలక్ష్మి, ఎస్సీ మహిళ, పాలువాయిగేటు, రెంటచింతల మండలం వైఎస్సార్ సీపీకి ఓటు వేశామని దాడి టీడీపీ నేతలు పోలింగ్ రోజు మా ఇళ్ల మీద పడి కనపడిన వారిని కనపడినట్టు కొట్టారు. మా ఆస్తులను ధ్వంసం చేశారు. నా చేయి, కాలుపై కర్రలతో కొట్టారు. నాతో మరో నలుగురిని కొట్టారు. ముసలోళ్లమని కూడా చూడలేదు. బీభత్సం చేశారు. – గొర్ల సైదులు, జంగాల కాలనీ, పేటసన్నెగండ్ల , కారంపూడి -
ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణ
సాక్షి, అమరావతి: ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులకు హైకోర్టు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చెయ్యొద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో వారికి హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లయింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. కౌంటింగ్ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండరాదని.. తాడిపత్రి బయట ఉండాలని జేసీ అస్మిత్రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సోమశేఖర నాయుడులను హైకోర్టు ఆదేశించింది. నలుగురు కంటే ఎక్కువ మందితో తిరగరాదని.. ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని అస్మిత్రెడ్డి, పెద్దారెడ్డిలతో సహా మిగిలిన అభ్యర్థులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్ తదితరులనూ ఆదేశించింది. పోలీసులు ఎన్నికల సంఘం నియంత్రణలో పనిచేస్తున్నారని, అందువల్ల అభ్యర్థుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలని ప్రధాన ఎన్నికల అధికారికి స్పష్టంచేసింది. అంతేకాక.. ఆయా కేసులకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేయడంగానీ.. దర్యాప్తులో జోక్యం చేసుకోవడంగానీ చేయరాదని ఆదేశించింది. కేసు పూర్వాపరాల ఆధారంగా ఎలాంటి అభిప్రాయం వ్యక్తంచేయడం లేదన్న హైకోర్టు, ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.అరెస్టుకు అవకాశం ఉంది.. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వండి..ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలకు సంబంధించి నమోదైన కేసుల్లో పోలీసులు తమను అరెస్టుచేసే అవకాశముందని, అందువల్ల తమకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్సార్సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి, దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్లతో పలువురు స్వతంత్ర అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు టి. నిరంజన్రెడ్డి, పి.వీరారెడ్డి, ఓ.మనోహర్రెడ్డి, పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాదులు ఎస్.రామలక్ష్మణరెడ్డి, చుక్కపల్లి భానుప్రకాశ్.. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) యర్రంరెడ్డి నాగిరెడ్డి తమ తమ వాదనలను వినిపించారు.సుప్రీంకోర్టుకన్నా తామే ఎక్కువని ఈసీ భావిస్తోంది..పిటిషనర్లపై నమోదైన కేసులన్నీ కూడా ఏడేళ్ల కంటే తక్కువ శిక్షపడే కేసులని, అందువల్ల వారికి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించాల్సి ఉంటుందని నిరంజన్రెడ్డి తెలిపారు. అర్నేష్కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షపడే కేసుల్లో అరెస్టుచేయడానికి వీల్లేదన్నారు. అయితే, ఎన్నికల సంఘం మాత్రం రామకృష్ణారెడ్డిని అరెస్టుచేసి తీరుతామని ప్రకటనలు ఇచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టు కన్నా తామే ఎక్కువన్న విధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని తెలిపారు. అలాగే, టీడీపీ నేత నారా లోకేశ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్చేసిన వీడియో ఆధారంగా ఎన్నికల కమిషన్ రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఆదేశించిందన్నారు. వాస్తవాలు విచారించకుండా ఇలాంటి వీడియోల ఆధారంగా అరెస్టుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇలా వ్యవహరించిన ఉదంతాలు గతంలో ఎక్కడా లేవన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది పోలీసు బృందాలు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల వెంటపడ్డాయన్నారు. తాము కౌంటింగ్ పూర్తయ్యే వరకు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కోరుతున్నామని సీనియర్ న్యాయవాదులు తెలిపారు. ఇప్పుడు అరెస్టుచేస్తే కౌంటింగ్ రోజున ఏజెంట్లను నియమించుకునే అవకాశం కూడా ఉండదన్నారు. దీనివల్ల పిటిషనర్లు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ సమయంలో పీపీ నాగిరెడ్డి జోక్యం చేసుకుంటూ.. మధ్యంతర బెయిల్ ఇస్తే మొన్న జరిగిన ఘటనల వంటి వాటిని పునరావృత్తం చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ మధ్యంతర బెయిల్ ఇవ్వాలనుకుంటే షరతులు విధించాలని కోర్టుకు విన్నవించారు. ఎలాంటి ఘటనలు జరిగినా వారినే బాధ్యులుగా చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి, హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేశారు. అప్పటివరకు పిటిషనర్లను అరెస్టు చెయ్యొద్దని పోలీసులను ఆదేశించారు.ఆ పిటిషన్ల విచారణ 30కి వాయిదా..ఇదిలా ఉంటే, ఎన్నికల సమయంలో, ఎన్నికల తరువాత జరిగిన ఘర్షణలపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పలువురు వ్యక్తులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. -
కూటమి సేవలో 'ఘనాపాఠి'
సాక్షి, అమరావతి: సర్వ శ్రేష్ఠుడు అంటే అందరికంటే సమర్థుడు అని అర్థం. కానీ ఆ సమర్థత విధి నిర్వహణలో కాకుండా చంద్రబాబు కుట్రలకు వత్తాసు పలకడంలో చూపించిన ఘనాపాఠి గుంటూరు ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి! ఎన్నికల సందర్భంగా పల్నాడులో టీడీపీ మూకలు బరితెగించి సాగించిన విధ్వంసకాండకు ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు ఓటింగ్లో పాల్గొనకుండా భయానక వాతావరణం సృష్టించిన టీడీపీ గూండాలకు పోలీసు లాఠీని అందించారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్లలో లేకుండా దాడులకు తెగబడ్డ పచ్చ ముఠాలకు ఈ ఖాకీ కొమ్ము కాశారు. పోలింగ్ అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ రౌడీమూకలు రోడ్లపై దర్జాగా తిరుగుతున్నా వారిని అరెస్ట్ చేయకుండా పోలీసు యంత్రాంగం చేతులు కట్టేశారు. ఓట్ల లెక్కింపు రోజు టీడీపీ గూండాలు మరోసారి అరాచకం సృష్టించేందుకు రంగం సిద్ధం చేయిస్తున్నారు. ఎన్నికల అక్రమాలకు సహకారం అందించేందుకు చంద్రబాబు, పురందేశ్వరి పక్కా పన్నాగంతో పల్నాడులో ప్రవేశపెట్టిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వారిద్దరి నమ్మకాన్ని వమ్ము చేయలేదనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసు వ్యవస్థ రాజకీయ బురద పులుముకుంటే ప్రజాస్వామ్యానికి ఎంత చేటు కలుగుతుందో చెప్పేందుకు ఈ ‘పచ్చ’ ఖాకీ కథే నిదర్శనం!పోలింగ్కు ముందు పల్నాడులో పచ్చ జట్టు పల్నాడులో టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉందని గుర్తించిన చంద్రబాబు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కుట్రకు తెరతీశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైన పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని పావులు కదిపారు. గుంటూరు డీఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ శివశంకర్రెడ్డితోపాటు క్షేత్రస్థాయిలో కీలకమైన డీఎస్పీలు, సీఐలపై అసత్య ఆరోపణలతో ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదులు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ద్వారా కథ నడిపించారు. టీడీపీ ఆరోపణలు చేసిన పోలీసు అధికారులపైనే ఆమె ఫిర్యాదు చేయడం గమనార్హం. అంతేకాదు.. ఆ అధికారుల స్థానాల్లో ఎవర్ని నియమించాలో సూచిస్తూ ఆమె ఏకంగా జాబితా సమర్పించడం గమనార్హం. అంటే ఈసీ అధికార పరిధిలో పురందేశ్వరి జోక్యం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. టీడీపీ, బీజేపీ ఒత్తిడికి ఈసీ తలొగ్గినట్టు అనంతరం పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో గుంటూరు డీఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవిశంకర్రెడ్డిని ఈసీ ఆకస్మికంగా బదిలీ చేసింది. వారి స్థానాల్లో టీడీపీ అనుకూలురైన పోలీసు అధికారులు నియమితులయ్యారు. గుంటూరు ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠీ, ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్ బాధ్యతలు చేపట్టారు.జాబితా పంపిన నిమ్మగడ్డ, వర్లచంద్రబాబుకు నమ్మిన బంటు అయిన వివాదాస్పద ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అత్యంత సన్నిహితుడు. ఎస్పీగా నియమించిన గరికపాటి బిందు మాధవ్ నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులుకు బంధువు. ఐజీగా రాగానే త్రిపాఠి టీడీపీ కుట్రలను అమలు చేశారు. పోలింగ్కు కేవలం రెండు రోజుల ముందు మాచర్ల టౌన్ సీఐ పి.శరత్బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, గురజాల సీఐ పల్లపురాజు, ఎస్సై ఎం.రామాంజనేయులును బదిలీ చేయడం గమనార్హం. వారి స్థానాల్లో నియమించాల్సిన అధికారుల జాబితాను సైతం ఆయనే పంపించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్, టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఇచ్చిన జాబితాలనే ఆయన పంపడం గమనార్హం. టీడీపీకి అనుకూలురైన కోటేశ్వరరావు మాచర్ల టౌన్ సీఐగా, కారంపూడి సీఐగా నారాయణస్వామి నియమితులయ్యారు. రెంటచింతల మండలానికి చెందిన నారాయణస్వామి టీడీపీ గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుకు సన్నిహితుడు.పోలీసులను కట్టడి చేసి..పల్నాడు అంతా టీడీపీ అనుకూల పోలీసు అధికారుల ద్వారా తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన రెండో దశ కుట్రను అమలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, పేద వర్గాలకు చెందిన ఓటర్లను బెంబేలెత్తించి వారు ఓట్లు వేయకుండా అడ్డుకోవాలన్న పచ్చ పన్నాగానికి ఐజీ త్రిపాఠి కొమ్ము కాశారు. జిల్లాలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తనకు చెప్పకుండా కాలు కదపటానికి వీల్లేదని ఆదేశించారు. ఎక్కడైనా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నట్లు సమాచారం అందినా సరే తాను అనుమతిస్తేనే వెళ్లాలని స్పష్టం చేశారు. టీడీపీ మూకలు దౌర్జన్యాలకు పాల్పడ్డ ప్రాంతాల వైపు పోలీసులు కన్నెత్తి చూడకుండా ఉండేందుకే త్రిపాఠి ఇలా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.అరాచకాలకు అండదండలు⇒ పోలింగ్కు మూడు రోజుల ముందు మాచర్ల వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి, మాజీ ఎంపీపీ వెల్దుర్తిలో ప్రచారం నిర్వహిస్తుండగా టీడీపీ మూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. విధి నిర్వహణలో ఉన్న ఎస్సై, కానిస్టేబుళ్లపై కూడా పచ్చమూకలు దాడి చేయడం గమనార్హం. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దాడికి పాల్పడిన వారిని కనీసం స్టేషన్కు పిలిచి కూడా మాట్లాడలేదు.⇒ నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విద్యా సంస్థలకు చెందిన బస్సులో టీడీపీ కార్యకర్తలు హోలోగ్రామ్లు ముద్రించిన ఓటర్ల స్లిప్పులు, డబ్బులు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఐజీ త్రిపాఠి ఆదేశాలతో వాటిని జప్తు చేయకుండా వదిలేశారు. ⇒ పోలింగ్కు రెండు రోజుల ముందు అంటే మే 11న రెంటచింతలలో టీడీపీ వర్గీయులతో సమావేశమైన సీఐ నారాయణస్వామి.. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినా తాము పట్టించుకోబోమని భరోసానిచ్చారు. అదే రోజు కారంపూడి మండల వైఎస్సార్సీపీ జేసీఎస్ కన్వీనర్ వెంకటేశ్వరరెడ్డిని ఆయన కాలితో తన్నారు. వెంకటపల్లిలో టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేసినట్లు సమాచారం అందినా ఒక్క కానిస్టేబుల్ను అక్కడకు పంపారు. అనంతరం ఆయనే ఆ గ్రామానికి వెళ్లి బాధితుడైన మహేశ్ను ఓ విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. ⇒ మే 12న సీఐ నారాయణస్వామి టీడీపీ వర్గీయులతో కలసి రెంటచింతల వెళ్లారు. దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీకి చెందిన మోర్తల ఉమామహేశ్వరరెడ్డి, ఆయన అనుచరులపై దాడికి తెగబడ్డా నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఐజీ త్రిపాఠి ఆదేశాలతో ఉదాశీనంగా వ్యవహరించారు. తద్వారా దాడులకు తెగబడ్డా, ఓటర్లను బెదిరించినా పట్టించుకోబోమని టీడీపీ శ్రేణులకు సంకేతాలిచ్చారు.కుట్రలకు సహకారం..కీలకమైన పోలింగ్ రోజు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తానో పోలీస్ ఉన్నతాధికారిననే విషయాన్ని విస్మరించి టీడీపీ కార్యకర్త తరహాలో చెలరేగిపోయారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాల్సిన ఆయన ఓ వర్గానికి వత్తాసు పలికారు. స్వయంగా పల్నాడులో తిష్ట వేసి మరీ టీడీపీ రిగ్గింగ్కు కొమ్ము కాయడం విభ్రాంతి కలిగిస్తోంది. మాచర్లలోని కేసీపీ సిమెంట్స్ గెస్ట్ హౌస్, జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా టీడీపీ కుట్రలకు సంపూర్ణ సహకారం అందించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామం కండ్లకుంటతోపాటు పరిసర గ్రామాల్లో టీడీపీ ఏజెంట్లను ఐజీ త్రిపాఠీనే నియమించడం గమనార్హం. అంతేకాదు.. ఆయనతోపాటు ఎస్పీ బిందుమాధవ్ ఆ గ్రామాల్లోనే ఉన్నారు. ఒక అదనపు ఎస్పీ, ఒక ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీ, ఇద్దరు సీఐలను అక్కడ నియమించారు. అదే త్రిపాఠీకి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి స్వగ్రామం వెల్దుర్తిలో అన్ని పార్టీల ఏజెంట్లు ఉన్నారో లేదో చూడాలని కూడా అనిపించలేదు.రిగ్గింగ్ నిరోధించాలని పిన్నెల్లి మొర పెట్టుకున్నా.. టీడీపీ వర్గీయులు కొత్తూరు, కంభంపాడు, భైరవునిపాడు, రెంటాల, జెట్టిపాలెం, పాల్వాయి గేటు, గోలి, మిట్టగుడిపాడు, కారంపూడి, ఒప్పిచర్ల, పేట సన్నెగండ్ల, చింతపల్లి, ముటుకూరు, అడిగొప్పుల, పోలేపల్లి, వెల్దుర్తి, లోయపల్లి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సపెంట గ్రామాల్లో రిగ్గింగ్కు కుట్ర చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆ 20 గ్రామాల్లో సక్రమంగా పోలింగ్ జరిగేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఆ కాపీని ఐజీ త్రిపాఠీకి అందచేసి టీడీపీ రిగ్గింగ్కు పాల్పడకుండా కట్టడి చేయాలని కోరినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. వెల్దుర్తితోపాటు ఆ 20 గ్రామాల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై టీడీపీ గూండాలు దాడి చేసి చితకబాది బూత్ల నుంచి వెళ్లగొట్టినా స్పందించలేదు. టీడీపీ రౌడీమూకలు ఆరు కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశాయి. దీనిపై సమాచారం అందినా ఆ పోలింగ్ కేంద్రాల వద్దకు ఒక డీఎస్పీని కూడా పంపలేదు. త్రిపాఠి ఆ పోలింగ్ కేంద్రాలను కనీసం సందర్శించ లేదు.పదేపదే ఫోన్లు చేసినా..పల్నాడు అంతటా టీడీపీ శ్రేణులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినా పట్టించుకోవద్దని సంకేతాలిచ్చి ఐజీ త్రిపాఠి పోలీసుల చేతులు కట్టేశారు. అదే అదనుగా అల్లరి మూకలు కర్రలు, కత్తులు, రాడ్లు పట్టుకుని స్వైర విహారం చేస్తున్నా పోలీసు యంత్రాంగం చోద్యం చూస్తుండి పోయింది. పోలింగ్ రోజు ఉదయం 9 గంటలలోపే యథేచ్చగా రిగ్గింగ్ పాల్పడాలన్న టీడీపీ కుట్రకు త్రిపాఠి కొమ్ము కాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం వర్గాలు అత్యధికంగా ఉన్న పోలింగ్ బూత్ల వద్ద టీడీపీ విధ్వంసకాండ సృష్టించింది. మాచర్ల, రెంటచింతల, వెల్దుర్తి, కారంపూడి, దుర్గి, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, పెదకూరపాడు... ఇలా పల్నాడు అంతటా పచ్చ ముఠాలు బరితెగించి అక్రమాలకు పాల్పడ్డాయి. పోలింగ్ బూత్లలో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడి చేసి బయటకు వెళ్లగొట్టినా, ఓటర్లను బెదిరించి పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకున్నా, టీడీపీ కార్యకర్తలు రిగ్గింగ్ చేస్తున్నా పోలీసులు మౌనముద్ర దాల్చారు. దీనిపై ఐజీ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్లకు వైఎస్సార్సీపీ నేతలు పదేపదే ఫోన్లు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఎన్నికల కమిషన్, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ల మీద ఫోన్లు చేయడంతో ఉదయం 9 గంటల తరువాత వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను అనుమతించారు.కౌంటింగ్ రోజు అక్రమాలకు అభయం!ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దన్నుతో పల్నాడులో భయానక వాతావరణం సృష్టించిన పచ్చ ముఠాలు ఓట్ల లెక్కింపు రోజైన జూన్ 4న మరోసారి దాడులకు తెగబడాలని పథకం రచిస్తున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు లేకుండా చేసి ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడాలని పన్నాగం వేశాయి. దీనిపై నిఘా వర్గాలు స్పష్టమైన నివేదిక ఇచ్చినా ఐజీ త్రిపాఠి నిర్లిప్తంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. పోలింగ్ సందర్భంగా దాడులకు పాల్పడిన రౌడీమూకలను ఇప్పటివరకు గుర్తించకపోవడం గమనార్హం. పల్నాడు జిల్లాలో 581 మంది దాడుల్లో పాల్గొన్నట్టు నిర్థారించగా ఇప్పటివరకు 274 మందినే గుర్తించారు. మరో 307 మందిని ఇంతవరకు గుర్తించలేదు. వీరిలో అత్యధికంగా మాచర్ల నియోజకవర్గానికి చెందినవారే 245 మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నరసరావుపేట నియోజకవర్గానికి చెందినవారు 62 మంది ఉన్నారు. ఇప్పటివరకు గుర్తించిన వారిలో కేవలం 19 మందినే పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా గురజాల నియోజకవర్గానికి చెందినవారే. మాచర్ల, నరసరావుపేట నియోకజవర్గాల్లో పోలింగ్ రోజు దాడులకు పాల్పడ్డ వారిలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదంటే ఐజీ త్రిపాఠి నేతృత్వంలో పోలీసు యంత్రాంగం ఎంత చేష్టలుడిగి చూస్తోందో అర్థమవుతోంది. టీడీపీ గూండాల దాడులపై వీడియోలతో స్పష్టమైన ఆధారాలున్నా అరెస్ట్ చేయకపోవడం వెనుక టీడీపీ ఒత్తిళ్లు ఉన్నట్లు వెల్లడవుతోంది. ఓట్ల లెక్కింపు రోజు వరకూ ఆ నిందితులను అదుపులోకి తీసుకోకూడదన్నది పోలీసుల ఉద్దేశంగా ఉంది. తద్వారా మరోసారి దాడులు, దౌర్జన్యాలతో భయానక పరిస్థితి సృష్టించేందుకు పోలీసు యంత్రాంగం కొమ్ము కాస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
మళ్లీ అధికారం వైఎస్సార్సీపీదే.. అంచనాలు ఇవే
రెండు రోజుల క్రితం జంగారెడ్డి గూడెం నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశారు. ఆయన ఆసక్తికరమైన విషయం చెప్పారు. అక్కడ ఒక గ్రామానికి చెందిన నలుగురైదుగురు యువకులు ఐఏఎస్ పరీక్షల కోసం సిద్ధం అవుతున్నారట. ఏపీలో శాసనసభ ఎన్నికలపై ఆసక్తితో వారు తమంతట తాము సర్వే చేపట్టారట. వారికి ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయట. వారి పరిశీలన ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఏభైఎనిమిది శాతం ఓటర్లు మద్దతు ఇస్తున్నారని తేలిందట. వారు ఆయా ప్రాంతాలలో ఈ స్టడీ చేశారట. వారు ప్రత్యేకంగా ఏ పార్టీపై అభిమానం ఉన్నవారు కాదు. ఇండిపెండెంట్ గా పరిశీలన చేశారు.⇒ ఇది విన్న నాకు కొద్ది రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రభంజనం వస్తుందని 151 సీట్లు మించి వస్తాయని అన్న విషయం గుర్తుకు వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వివిధ వర్గాలలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీలతో కూటమి కట్టిన తర్వాత వారి పరిస్థితి మెరుగైందని టీడీపీ అభిమానుల భావన కావచ్చు. కానీ ప్రజలు కూటమిని స్వీకరించారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అని చెప్పడం లేదు కానీ, దాదాపు అదే తరహాలో జరిగిన స్టడీలలో అత్యధిక భాగం వైఎస్సార్సీపీ విజయాన్ని అంచనా వేస్తున్నాయి. అందులో అంకెలు కొంచెం అటు, ఇటుగా ఉండవచ్చు కానీ, గెలుపుపై తేడా ఉండడం లేదు.⇒ ఈ నేపథ్యంలో కొన్ని ఫేక్ పోల్స్ సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి. అలా చేసిన వాటిలో అత్యధికం తెలుగుదేశం పార్టీవే ఉండడం గమనించదగ్గ అంశం. ఉదాహరణకు హిందుస్తాన్ టైమ్స్ లో ఏదో సర్వే వచ్చిందని, అందులో టీడీపీ కూటమికి అనుకూల ఫలితాలు ఉన్నాయని ప్రచారం చేశారు. ఆ సంగతి తెలిసిన ఆ మీడియా తాము అలాంటి సర్వే ఏదీ ప్రచురించలేదని ఖండన ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు ఒక తెలుగు వార్తా చానల్ ఇచ్చిందంటూ ఇలాగే టీడీపీ గెలవబోతోందంటూ ప్రచారం చేస్తే, అది కూడా వాస్తవం కాదని వెల్లడైంది.వైఎస్సార్సీపీకి అనుకూలంగా వచ్చిన సర్వేలలో అత్యధిక భాగం కాస్త, కూస్తో అందరికి తెలిసిన సంస్థలవే కావడం విశేషం.⇒ ఇండియా టుడే సీనియర్ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ ఆ మధ్య ఏపీలో పర్యటించారు. నాయకుల ఇంటర్వ్యూలతో పాటు జనంలో కూడా తిరిగారు. చివరిగా విశాఖ తీరంలో కూర్చుని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. మహిళలు, పేదలు ఎటు ఎక్కువ ఓట్లు వేస్తే వారిదే గెలుపు అని వ్యాఖ్యానించడం ద్వారా ఒక స్పష్టమైన పరోక్ష సంకేతం ఇచ్చారు. మహిళలు అత్యధికంగా ఓట్లు వేయడం, వారిలో పలువురు వైఎస్సార్సీపీ పట్ల సానుకూల ధోరణితో ఉండడం వంటి అంశాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్సీపీ విజయాన్ని సూచిస్తున్నాయన్న భావన ఏర్పడింది.⇒ అలాగే మరో సీనియర్ పాత్రికేయుడు ఇండియా టుడే లో ఒక వ్యాసం రాస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు బాగా ప్రభావితం చేస్తున్నాయని, అవే ఎన్నికల ఫలితాలను నిర్దేశించనున్నాయని అభిప్రాయపడ్డారు. పివిఎన్ శర్మ అనే సీనియర్ జర్నలిస్టు డిల్లీ నుంచి ఒక పోస్టు పెడుతూ వలంటీర్ల వ్యవస్థ వైఎస్సార్సీపీకి బాగా ఉపకరించిందని పేర్కొన్నారు. టీడీపీ సృష్టించిన వివాదంతో రాజీనామా చేసిన వేలాది మంది వలంటీర్లు తమ పరిధులలోని వివిధ వర్గాల ప్రజలను ఉదయం, సాయంత్రం ఓటింగ్ నిమిత్తం సమీకరించారని తెలిపారు. సాయంత్రం వేళ పోలింగ్ పెరగడానికి వారే కారణమని ఆయనతో పాటు మరికొందరు విశ్లేషించారు.⇒ వివిధ ప్రాంతాల నుంచి కార్లలో వచ్చిన టీడీపీ మద్దతుదారుల హడావుడిని గమనించిన మీదట అప్పటి వరకు ఓటు వేయకుండా వేచి ఉన్న మహిళలు, పేదవర్గాల వారు సాయంత్రం పోలింగ్ బూత్లకు వెళ్లి ఓట్లు వేశారని, దానివల్లే ఓట్ల పోలింగ్ శాతం పెరిగిందని చెబుతున్నారు. ఒక సీనియర్ అధికారి అంచనా ప్రకారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దు పోయేవరకు జరిగిన పోలింగ్ శాతం పన్నెండు శాతం వరకు ఉండవచ్చట. ఇది కూడా నిర్ణయాత్మకంగా ఉండవచ్చని భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీ కూటమి పోటాపోటీగా ఓటింగ్ శాతం పెంచడానికి యత్నించాయి. కాగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారికన్నా పేద, బలహీనవర్గాలు అధికంగా ఉండడం వైఎస్సార్సీపీకి ప్లస్ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.⇒ కాగా కొన్నిచోట్ల పోలింగ్ అధికారులలో కొంతమంది వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఉన్నారని, వారు కావాలని పోలింగ్ను ఆలస్యం చేస్తున్నారని గమనించిన ఓటర్లు ఎంతో ఓపికతో రాత్రి పొద్దు పోయేవరకు నిలబడి మరీ ఓట్లు వేసి వెళ్లారని కొందరు చెప్పారు. ఉదాహరణకు తెనాలి నియోజకవర్గంలో గుదిబండివారి పాలెంలో అర్ధరాత్రి అయినా ఒక్కరు కూడ కదలకుండా ఓట్లు వేసి మరీ వెళ్లారని ఆ గ్రామానికి చెందిన వ్యక్తి తెలిపారు. ఇక బెట్టింగ్ల వారిది మరో కథ. వారు కావాలని పందాలకు పలువురిని ఆకర్షించడానికి రకరకాల వ్యూహాలు అమలు చేశారని సమాచారం వస్తోంది. ఉదాహరణకు కొద్ది నెలల క్రితం ఈ బెట్టింగ్ నిర్వాహకులు వైఎస్సార్సీపీకి ఏభైమూడు సీట్లు వస్తాయని అంచనా వేస్తే, అది నిజమేనని నమ్మి టీడీపీకి చెందినవారు పందాలు కాయడానికి ఉత్సాహపడ్డారట. ⇒ ఆ తర్వాత క్రమేపి ఆ సంఖ్యను మార్చుతూ వైఎస్సార్సీపీకి 86-88 సీట్లు వస్తాయని వారు పేర్కొన్నారట. అంటే ఏమిటి దీని అర్ధం. వైఎస్సార్సీపీకి అధికారం వస్తుందని చెప్పడమే కదా! కడప జిల్లాలోని ఒక నియోజకవర్గంకు చెందిన మిత్రుడు ఒకరు కొద్ది రోజుల క్రితం కలిశారు. ఆయన ఇంకో విషయం చెప్పారు. ఆ నియోజకవర్గంలో పోటీ చాలా తీవ్రంగా ఉందని ప్రచారం జరిగింది. అక్కడ పరిస్థితి ఏమిటని అడిగితే అతను జవాబిస్తూ చాలా చోట్ల ఇలాగే ప్రచారం జరుగుతోందని, ఇదంతా బెట్టింగ్ రాయళ్ల పని అని అన్నారు.⇒ తమ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఇరవైవేలకు పైగా మెజార్టీ వచ్చే అవకాశం ఉందని, కానీ టైట్ అని ప్రచారం చేస్తే రెండు పార్టీలకు చెందినవారు పందాలు కాస్తారన్న ఉద్దేశంతో ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు. అది నిజమేనని అనిపించింది. ఎందుకంటే ఏపీలో పలు నియోజకవర్గాలపై ఇలాంటి పందాలు సాగుతున్నాయి. కాగా కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా? లేదా అన్నదానిపై కూడా బెట్టింగులు జరుగుతున్నాయని చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక నియోజకవర్గంలో ఓటు వేసిన ఒకరు మాట్లాడుతూ కాపు సామాజికవర్గం ఏకపక్షంగా టీడీపీ కూటమికి ఓటు వేశారన్న ప్రచారం వాస్తవం కాదని అబిప్రాయపడ్డారు.⇒ జనసేనను టీడీపీ అధినేత చంద్రబాబు కాళ్ల వద్ద పవన్ కల్యాణ్ పడేశారని బాధ పడుతున్నవారు కూడా గణనీయంగా ఉన్నారని అన్నారు. టీడీపీ నేతలు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజులు టీడీపీ గెలుపు ఖాయమని చెబుతున్నా, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి ఆ విషయాన్ని ఎందుకు ప్రకటించలేకపోయారని వైఎస్సార్సీపీవారు అడుగుతున్నారు. అంతేకాదు టీడీపీకి సలహాదారుగా పనిచేసిన రాబిన్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన సర్వే గురించి సోషల్ మీడియాలో వస్తున్న కధనాలను టీడీపీ ఎందుకు ఖండించలేకపోతోందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈయన బృందం టీడీపీ గెలుపుపై సందేహాలు వ్యక్తం చేసిందని ప్రచారం జరుగుతోంది. అది నిజమో, కాదో తెలియదు.⇒ ఇంతవరకు సుమారు ముప్పైకి పైగా పోస్ట్ పోల్ అంచనాలను ఇచ్చాయి. వాటిలో ఒకటి, రెండు తప్ప మిగిలినవన్నీ వైఎస్సార్సీపీనే గెలుస్తుందని చెబుతున్నాయి. అయినా పందాలు కాయవద్దని, అది చట్టరీత్యా నేరమని ఎవరైనా చెబితే తెలుగుదేశంకు చెందిన కొంతమంది బెట్టింగులు వద్దంటే టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లే కదా అని వితండ వాదన తెస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల జనం నష్టపోతారు. గతంలో 2009లో ఒక వర్గం, 2014 లో మరో వర్గం, 2019 లో ఇంకో వర్గం బోగస్ సర్వేలను నమ్మి పందాలు కాసి కోట్ల రూపాయల మేర కోల్పోయారు. వీటిని దృష్టిలో పెట్టుకుని పందాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది.⇒ ఏది ఏమైనా ప్రజాభిప్రాయం వైఎస్సార్సీపీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికు అనుకూలంగా ఉందన్నది ఎక్కువమంది నమ్మకం. బలహీనవర్గాలు, మహిళలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఓటు బ్యాంకు అయ్యారని వారు చెబుతున్నారు. ఎక్జిట్ పోల్ను పర్యవేక్షించిన ఒకరిని దీని గురించి ప్రశ్నిస్తే అలాంటి సమాధానమే ఇచ్చారు. కాగా తాము ఇచ్చిన సూపర్ సిక్స్ కు జనం కొంతైనా ఆకర్షితులు అయి ఉంటారని, అంతేకాక తాము లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చేసిన అబద్దపు ప్రచారం కొద్దిగానైనా ప్రభావితం చేసి ఉండకపోతుందా అని టీడీపీ మద్దతుదారుడు ఒకరు పేర్కొన్నారు. ఈ మొత్తం ఎన్నిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలా? వద్దా? అనే దానిపైనే జరిగిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి vs చంద్రబాబు కాదని ఆయనే అభిప్రాయపడడం విశేషం. దీనిని బట్టి ఈ ఎన్నికలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా జరిగాయని, ఆయన స్కీములు, ఇతర కార్యక్రమాల చుట్టూనే జరిగాయని తేలుతోంది. అందుకే వైఎస్సార్సీపీ వర్గాలు గెలుపుపై అంత ధీమాతో ఉన్నాయని అనుకోవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఆ వీడియో ఫేకా? ఒరిజినలా?: మంత్రి అంబటి
సత్తెనపల్లి: ‘పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో దారుణాలు జరిగాయి. అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ మూకలు పేట్రేగిపోయాయి. బూత్ క్యాప్చరింగ్ చేశారు. దొంగ ఓట్లు వేసుకున్నారు. ఈవీఎంలను పగులగొట్టేందుకు యత్నించారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారనుకున్న ఓటర్లను అడ్డుకున్నారు. కొట్టి బయటకు పంపించారు. వీటన్నింటిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అటు అధికారులకు, ఇటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి స్పందనా లేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉన్నట్లుండి చిత్రంగా ఒక వీడియో రిలీజ్ అయ్యింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్లో ఈవీఎం పగలకొడుతున్నట్లు అందులో ఉంది. దీన్ని ఎవరు లీక్ చేశారు? ఇది ఫేకా, ఒరిజినలా తేల్చాలి’ అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వీడియో ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో అర్థం కావడం లేదన్నారు. వాస్తవంగా ఇలాంటిదేదైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయాలని చెప్పారు. ‘దీన్ని లోకేశ్ ఎక్స్ (ట్విటర్)లో పెట్టారంట! ఎలా చేరింది లోకేశ్ ట్విటర్లోకి? ఈ వీడియో ఫేకా? ఒరిజినలా? కన్క్లూజన్ ఎవిడెన్సా.. కాదా.. ఆలోచించాలి కదా.. కలెక్టర్ అన్న రిలీజ్ చేయాలి, ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన వారన్నా రిలీజ్ చేయాలి. వీరెవరూ కాకుండా ఇది డైరెక్ట్గా తెలుగుదేశ«ం అధినేత కొడుకైన లోకేశ్ ట్విట్టర్లోకి ఎట్లా వెళ్లింది?’ అని ప్రశ్నించారు. అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరిగిందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. అధికారులు, ఎన్నికల కమిషన్లో ఉన్న అధికారులు, తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారనే అనుమానం కలగటం సహజం అని స్పష్టం చేశారు. ఒక వేళ అది నిజంగా జరిగి ఉంటే, సంబంధిత అధికారులు విడుదల చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకునేదన్నారు. ఇప్పుడు జరిగింది చూస్తుంటే ఇది ఫేక్ అనిపిస్తోందని చెప్పారు. అంబటి ఇంకా ఏమన్నారంటే..ఆ వీడియోలన్నీ రిలీజ్ చేయాలి‘పాల్వాయిగేట్ బూత్లో టీడీపీ మూకలు ఎంత దారుణంగా వ్యవహరించారో పిన్నెలి రామకృష్ణారెడ్డి చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ. అది నేను కూడా మీకు చూపిస్తా (వీడియో ప్రదర్శించారు). వైఎస్సార్సీపీకి చెందిన వారని భావిస్తున్న ఓటర్లు ఆ బూత్లోకి వెళ్లి స్వేచ్ఛగా ఓటు వేస్తే ఒప్పుకోనటువంటి పరిస్థితి. బూత్ బయట హింసించి తరిమేస్తున్నటువంటి సందర్భం. దీని మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిపోర్టు చేశారు. అయితే ఎవరూ పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీకీ అనుకూలమైనటువంటి బూత్ల దగ్గర గొడవ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకుండా ఉండే పరిస్థితి. ఇది వాస్తవం. చాలా నియోజకవర్గాల్లో బూత్ క్యాప్చరింగ్ జరిగాయి. నా నియోజకవర్గంలో కూడా బూత్ క్యాప్చరింగ్ జరిగి టీడీపీ వాళ్లు ఓట్లు వేసుకున్నారు. వెట్ క్యామ్ ఓపెన్ చేయండి అంటే పట్టించుకోలేదు. ఎలాంటి చర్యలూ లేవు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టారని ప్రచారంలో ఉన్న వీడియో ఫేక్ వీడియోనా? కరెక్ట్ వీడియోనా? కరెక్ట్ వీడియో అయితే లోకేశ్ దగ్గర ఎలా రిలీజ్ అయ్యింది. దీనిపై ఎన్నికల కమిషన్ ఏం యాక్షన్ తీసుకుంది? నేరం చేసినట్టుగా భావించేలా అలా ఫేక్గా చేయడం తప్పు. నిజంగా నేరం చేసిన వారిని శిక్ష నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మేం ఆందోళన చెందుతున్నాం. ఎక్కడైతే బూత్ క్యాప్చరింగ్ జరిగిందో ఆ వీడియోస్ను ఎలక్షన్ కమిషన్ బయట పెట్టాలి. ఒక చోట కాదు.. అనేక చోట్ల మేం ఫిర్యాదు కూడా చేశాం. ఆ వీడియోలన్నీ రిలీజ్ చేయాలి’ అని మంత్రి అంబటి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అక్రమాలపై తాము ఈసీకి అనేక రకాలుగా ముందస్తుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తుదకు ఆ అక్రమాలను అందరూ కళ్లారా చూడటంతో కొందరు అధికారులను సస్పెండ్ చేశారని, మరికొందరిని మార్చారని చెప్పారు. తద్వారా తప్పు జరిగిందనే భావన సర్వత్రా వ్యాపించిందన్నారు.రీ పోలింగ్ పిటిషన్పై నేడు విచారణపల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం నార్నెపాడులో 236, 237 పోలింగ్ కేంద్రాలు, దమ్మాలపాడులోని 253, 254 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నాయకులు రిగ్గింగ్కు పాల్పడ్డారు. వెబ్ కెమెరాలను పరిశీలించి రీ పోలింగ్ జరపాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. వారు పట్టించుకోక పోవడంతో రీ పోలింగ్ జరపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈసీ, సీఈఓ సహా ఐదుగురిని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై హైకోర్టులో గురువారం విచారణ జరగనుంది. -
‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్
సాక్షి, నరసరావుపేట / రెంటచింతల: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేటులోని పోలింగ్ బూత్లో ఆ రోజు అసలు ఏం జరిగిందన్నది కీలకంగా మారింది. మే 13న రెంటచింతల మండలం పాల్వాయిగేటు 201, 202 పోలింగ్ బూత్లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలను బెదిరించి టీడీపీ గూండాలు భయానక వాతావరణం సృష్టించారు. పోలింగ్ సజావుగా జరగకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారితోపాటు పల్నాడు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసేందుకు పిన్నెల్లి పలుసార్లు ఫోన్ చేసినా వారు స్పందించలేదు. తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు లాక్కొచ్చి దాడులు చేయడంతోపాటు టీడీపీ నేతలు రిగ్గింగ్ చేస్తున్నారనే సమాచారం అందడంతో పిన్నెల్లి అక్కడకు చేరుకున్నట్లు చెబుతున్నారు. యథేచ్ఛగా జరుగుతున్న రిగ్గింగ్ను ఆయన ప్రతిఘటించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పచ్చ ముఠాలు పల్నాడు ప్రాంతంలో దాదాపు ఏడు చోట్ల ఈవీఎంల విధ్వంసాలకు తెగబడగా దీన్ని అడ్డుకున్న పిన్నెల్లి వీడియోను మాత్రమే బహిర్గతం చేయడం వెనుక కుట్రకోణం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈసీకి మొర పెట్టుకున్నా... పాల్వాయిగేట్, తుమృకోట, ఒప్పిచర్ల, చింతలపల్లి పోలింగ్ కేంద్రాలలో గతంలో పలుమార్లు టీడీపీ నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఆయా కేంద్రాలలో పటిష్ట బందోబస్తు కల్పించి ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని పిన్నెల్లి పలు దఫాలు ఈసీ, కలెక్టర్, ఎస్పీలను అభ్యరి్థంచినా స్పందించలేదు. పోలింగ్ రోజు కూడా రెండుసార్లు ఈసీకి మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ అరాచకాలకు సహకరించేందుకు 50 ఏళ్లకు పైగా వయసున్న పోలీసు కానిస్టేబుల్కే విధులు కేటాయించారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను చితకబాది.. పాల్వాయి గేట్ కేంద్రంలో వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్లుగా ఉన్న చింతా సుబ్బారావు, డేరంగుల శ్రీను, చల్లా సుబ్బయ్యలను టీడీపీ నేతలు కొట్టి బయటకు ఈడ్చేశారు. ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డ మహిళలను భయకంపితుల్ని చేసి తరిమేశారు. అనంతరం అక్కడ టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్కు పాల్పడ్డారు. స్థానికులతో కలసి మరోసారి దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలింగ్ ఏజెంట్లపై విచక్షణారహితంగా దాడి చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పిన్నెల్లి రిగ్గింగ్ను ప్రతిఘటించారు. దీన్ని అడ్డుకోవాలని పోలింగ్ అధికారులను అభ్యరి్థంచారు. టీడీపీ మూకల అరాచకాలను ఎన్నికల అధికారుల దృష్టికి తెచి్చనా స్పందించలేదు. పిన్నెల్లి కుమారుడు గౌతమ్రెడ్డి, డ్రైవర్ అంజిరెడ్డి, మరికొందరిపై టీడీపీ నేతలు దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. పిన్నెల్లి కాన్వాయ్లోని వాహనాలను ధ్వంసం చేశారు. ఓటర్లు, ఏజెంట్లను భయపెట్టి రిగ్గింగ్ చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఆ వీడియో ఒక్కటే.. వారం తరువాత మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు మొత్తం ఏడు ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. ఒక్క పాల్వాయి గేటు వీడియో మినహా మిగతావి ఏవీ బయటకు రాలేదు. అది కూడా వారం తరువాత తాపీగా విడుదల చేయడంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈవీఎంలు ధ్వంసమైన మిగిలిన ఆరు వీడియోలను ఎన్నికల సంఘం ఇప్పటికీ బయట పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియోను తాము రిలీజ్ చేయలేదని పోలీసులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడిన తరువాత విదేశాల్లో గడుపుతున్న నారా లోకేష్ ‘ఎక్స్’ ఖాతా నుంచి వీడియో పోస్టు కావడం గమనార్హం. ఈసీ ఆదీనంలో ఉండాల్సిన వీడియో లోకేష్ చేతికి ఎలా వచి్చందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈసీ వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో టీడీపీ మూకలు రిగ్గింగ్ చేస్తుంటే ఎందుకు స్పందించలేదు? ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నా ఏమి పట్టనట్లు వ్యవహరించడం ఏమిటి? ఫిర్యాదులు అందినా ఎందుకు పట్టించుకోలేదు? అనే ప్రశ్నలకు ఈసీ జవాబు చెపాల్సి ఉంది. మాచర్ల నియోజకవర్గంలో వంద శాతం వెబ్ కాస్టింగ్ జరుగుతోంది. 202 పోలింగ్ బూత్లో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలిసినా ఉదాశీనంగా ఉండటంపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. తుమృకోటలో దాడులు.. ఈవీఎంలు ధ్వంసం రెంటచింతల మండలం తుమృకోటలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన ఎస్సీ, ముస్లిం మైనార్టీలపై టీడీపీ నేతలు దాడి చేశారు. 203, 204, 205 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. రీపోలింగ్ జరపకుండా సాయంత్రం 4 గంటల సమయంలో కొత్త ఈవీంఎలతో తిరిగి పోలింగ్ కొనసాగించారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేకుండా రిగ్గింగ్ చేశారు. ఈ వీడియోలను ఎన్నికల సంఘం బయటపెట్టలేదు. కారంపూడి మండలం ఒప్పిచర్లలో వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్ పాలకిర్తి శ్రీనివాసరావుపై టీడీపీ అగ్రవర్ణ నేతలు దాడి చేసి పోలింగ్ కేంద్రం నుంచి ఈడ్చేసి అక్రమ కేసు బనాయించారు. ఈసీ డేటా భద్రమేనా?సాక్షి, నరసరావుపేట: పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో ఈవీఎం «ధ్వంసం వీడియోపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా అది సీసీ ఫుటేజేనా? లేక మార్ఫింగ్ చేసిన వీడియోనా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీడియో కుడివైపు పైభాగంలో మొబైల్ 5జీ సిగ్నల్, 65 శాతం బ్యాటరీ పర్సంటేజ్, అలారం ఇండికేషన్స్ కనిపించడం గమనార్హం. వీడియోలో మొత్తం నిడివి 23.52 గంటలు ఉండగా 12.06 గంటల వద్ద తమకు అవసరమైన మేరకు రెండు నిమిషాల పాటు మొబైల్లో రికార్డు చేసినట్టు స్పష్టమవుతోంది. ఎంతో భద్రంగా ఉండాల్సిన పోలింగ్ వెబ్ కాస్టింగ్ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు అలుముకుంటున్నాయి. ఈ వీడియో తొలుత నారా లోకేష్ ఎక్స్ ఖాతా, టీడీపీ సోషల్ మీడియా గ్రూప్లలో కనిపించింది. అంటే వారి ద్వారానే బయటకు వచి్చనట్టు తేలిపోతోంది. గ్రాఫిక్స్కు పెట్టింది పేరైన పచ్చ ముఠాల వీడియోను నిర్థారించుకోకుండా, ఎలా బయటకు వచి్చందనే విషయాన్ని పట్టించుకోకుండా ఈసీ కేసు నమోదుకు ఆదేశించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 53 గ్రామాల్లో దాడులుసాక్షి, ప్రత్యేక ప్రతినిధి / సాక్షి, నరసరావుపేట: పల్నాడులోని 53 గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై, ఇళ్లపై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయి. ఆస్తులను ధ్వంసం చేశాయి. పోలింగ్ నాడు టీడీపీ నాయకులు హింసాకాండకు పథకం రూపొందించినట్లు మంత్రి అంబటి, పిన్నెల్లి తదితరులు ఎన్నికల యంత్రాంగానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా స్పందించలేదు. వీడియోను మొబైల్లో రికార్డు చేశారని చెప్పడానికి గల ఆధారాలు.. ఆ వీడియో వెనుక అసలు నిజాలు..⇒ మే 13న పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా ఓటర్లను టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. ⇒ పాల్వాయి గేట్లోని అన్ని బూత్లను ఆక్రమించి పచ్చ ముఠాలు రిగ్గింగ్కు పాల్పడ్డాయి. ⇒ బ్రహా్మరెడ్డి కుట్రలను ముందే పసిగట్టి మే 11న పిన్నెల్లి ఈసీకి లేఖ రాశారు. ⇒ సమస్యాత్మక ప్రాంతమైన మాచర్లలో భారీగా పోలీసులను మోహరించాలని పిన్నెల్లి కోరారు. ⇒ టీడీపీ అరాచకాలకు పాల్పడినందున రీ పోలింగ్ నిర్వహించాలని లేఖలో పిన్నెల్లి కోరారు.⇒ ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ఖూనీ చేసినందున రీ పోలింగ్ జరపాల్సిందేనని అభ్యరి్థస్తూ పిన్నెల్లి మరో లేఖ రాశారు. ⇒ టీడీపీ కుట్రలపై మే 11న ఒక లేఖ, పోలింగ్ జరిగిన మే 13న రెండు లేఖలను పిన్నెల్లి ఈసీకి రాశారు. ⇒ 11 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయినట్లు ఎన్నికల అధికారి ప్రెస్ మీట్ నిర్వహించి మరీ చెప్పారు. ⇒ టీడీపీ గూండాలు 10 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసే ఆ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదు?⇒ నారా లోకేష్ ఫిర్యాదుతో 8 రోజుల తరువాత ఒక వీడియో విడుదల చేసి అరెస్టుకు ఆదేశాలిచ్చారు.దాడి చేసి.. రిగ్గింగ్202 పోలింగ్ బూత్లోకి టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో ప్రవేశించి నాతో పాటు డేరంగులు శ్రీను, చల్లా సుబ్బయ్యలపై దాడి చేశారు. చితకబాది పోలింగ్ బూత్ బయటకు లాక్కొచ్చారు. అనంతరం టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. అక్కడున్న పోలీసులు, పోలింగ్ అధికారులు ఏమాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో మేం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాం. అక్కడకు వచి్చన పిన్నెల్లి, ఆయన అనుచరులపై పచ్చమూకలు దాడులకు పాల్పడ్డాయి. –చింతా సుబ్బారావు, ఇన్చార్జి సర్పంచి,వైఎస్సార్సీపీ ఏజెంట్, పాల్వాయి గేట్పల్నాడు గ్రామాల్లో టీడీపీ దురాగతాలు..⇒ మాచర్ల రూరల్ మండలం: కొత్తూరు, కంభంపాడు, భైరవునిపాడు ⇒ రెంటచింతల: రెంటాల, జెట్టిపాలెం, పాలవాయిగేటు, గోలి, మిట్టగుడిపాడు ⇒ కారంపూడి: ఒప్పిచర్ల, కారంపూడి, పేటసన్నెగండ్ల, చింతపల్లి ⇒ దుర్గి: ముటుకూరు, అడిగొప్పల, పోలేపల్లి ⇒ వెల్దుర్తి: లోయపల్లి, వెల్దుర్తి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సపెంట ⇒ గురజాల: కేసానుపల్లి, మాదినపాడు, ఇరిగేపల్లి, తంగెడ, కొత్తగణేశునిపాడు, మాచవరం, బ్రాహ్మణపల్లి, పెదఅగ్రహారం, జానపాడు. ⇒ నరసరావుపేట: నరసరావుపేట పట్టణం, దొండపాడు, పమిడిపాడు. ⇒ సత్తెనపల్లి: పాకాలపాడు, మాదల, తొండపి, చాగంటివారిపాలెం, నార్నెపాడు, గణపవరం, చీమలమర్రి, రూపెనగుండ్ల, గుండ్లపల్లి, కుంకలగుంట, చేజర్ల. ⇒ వినుకొండ: నూజెండ్ల, రెడ్డికొత్తూరు, బొల్లాపల్లి, కొచ్చర్ల, గంటావారిపాలెం. ⇒ పెదకూరపాడు: ఎర్రబాలెం, లగడపాడు, చండ్రాజుపాలెం, మాదిపాడు. ⇒ చిలకలూరిపేట: అప్పాపురం -
చంద్రబాబు పాలనలో ప్రశాంతత ఎక్కడిది?
ఆంధ్రప్రదేశ్లో కీలకమైన పోలింగ్ ఘట్టానికి రంగం సిద్దమైంది. ఒక రకంగా ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు అని చెప్పాలి. ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిమోహన్ రెడ్డికి మళ్లీ ఓటు వేయవలసిన అవసరం ఉందా? లేదా? అన్నదే కీలకమైన చర్చ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లు చేసిన కార్యక్రమాలు, విపక్ష నేతగా చంద్రబాబు అనుసరించిన విధానాలు, ఇద్దరి మధ్య ఉన్న వత్యాసాలు, ప్రజల పట్ల వీరికి ఉండే నిబద్దత, చెప్పిన మాటపై నిలబడే తత్వం మొదలైనవన్నీ ప్రజల ముందుకు పరీక్షకు వస్తాయి. వీటన్నిటిని ఆలోచించి ఓటర్లు ఒక నిర్ణయానికి వస్తే సముచితంగా ఉంటుంది.⇒ బహుశా ఏపీలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు గురించి చర్చించుకుంటున్నారు. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుల మధ్య ఉన్న తేడా గురించి ఆలోచిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విశ్వసనీయతకు నిలువుటద్దంగా కనిపిస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు విశ్వసనీయత అన్న పదమే తన నిఘంటువులో లేనట్లు ప్రజల ముందు నిలబడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికు అబద్దాలు చెప్పడం చాతకాదు.. చంద్రబాబుకు నిజాలు చెప్పడం చాతకాదు అంటే ఆశ్చర్యం కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి వచ్చిన మనిషి అయితే చంద్రబాబు నాయుడు మానిప్యులేషన్స్, మానేజ్మెంట్ నైపుణ్యం ద్వారా ఎదిగిన వ్యక్తి.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డికు పేదల పట్ల అపారమైన అనురక్తి ఉందని పలుమార్లు రుజువైంది. తన పాదయాత్రలో కానీ, ముఖ్యమంత్రి అయ్యాక తన టూర్లలో కానీ ఆయన పేదలు, వృద్దులు, అనారోగ్యానికి గురైనవారిని దగ్గరకు తీసుకునే తీరు ఇందుకు అద్దం పడుతుంది. అదే చంద్రబాబు నాయుడు అయితే పెత్తందార్లకు ప్రతినిధిగా పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత పేదలకు ఇవ్వరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల పట్ల ఎప్పుడూ, ఎక్కడా అనుచితంగా వ్యవహరించలేదు. వ్యాఖ్యలు చేయలేదు. పైగా వారందరిని నా.. నా.. నా.. అని పిలుచుకుంటారు. అదే చంద్రబాబు నాయుడు ఎస్సీలలో ఎవరైనా పుడతారా? అంటూ ప్రశ్నించారు.⇒ నాయి బ్రాహ్మణులు సచివాలయానికి వస్తే పవిత్ర ఆలయంలోకి వచ్చి ప్రశ్నిస్తారా అని మండిపడ్డారు. మత్స్యకారుల తోకలు కట్ చేస్తానని హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాగ్దానం ఇస్తే నిలబెట్టుకోవడానికి తాపత్రయపడతారు. చంద్రబాబు అయితే ఎన్నికల తర్వాత అసలు ఆ వాగ్దానం తానెప్పుడు చేశానన్నట్లు మాట్లాడతారు. అవసరమైతే అన్ని హామీలు ఎక్కడ అమలు చేస్తామని ప్రశ్నిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను మంచి చేశానని అనుకుంటే ఓటు వేయండని ధైర్యంగా ప్రజలకు పిలుపు ఇస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటర్లను బెదిరించి ఓటు అడుగుతారు. తాను వేసిన రోడ్డు మీద నడుస్తారు.. తాను ఇచ్చిన టాయిలెట్ వాడతారు.. ఇంకొకరికి ఎలా ఓటు వేస్తారు? అని ప్రశ్నించి అందరిని ఆశ్చర్యపరుస్తారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు కోట్ల మంది ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో ఉన్న రాజధాని 29 గ్రామాలలోని తన వర్గం వాళ్లకు, తన పార్టీ వారికి ఎలా ఉపయోగపడాలా? అని ఆలోచిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిది రియల్ డెవలప్ మెంట్ విజన్ అయితే చంద్రబాబుది రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ విజన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముప్పై ఒక్క లక్షలమందికి ఇళ్ళ స్థలాలు, ఇరవై లక్షల ఇళ్లునిర్మించడం ద్వారా సుమారు పది లక్షల కోట్ల సంపదను పేదవారికి సృష్టిస్తే, చంద్రబాబు అమరావతిలో కొద్దివేల మందికి ఇన్ సైడ్ ట్రేడింగ్ ద్వారా కోట్ల రూపాయల సంపద సృష్టించి, అదంతా ఏపీకోసమే అని బుకాయిస్తారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత' రాష్ట్రం కష్టాలలో ఉంది.. నేను అది చేయలేను.. ఇది చేయలేను.. నేను చాలా కష్టపడుతున్నాను.." అంటూ ఇలాంటి సానుభూతి మాటలు చెప్పలేదు. తాను చేయగలిగింది చేసుకుంటూ ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపారు. అదే చంద్రబాబు విభజిత ఏపీలో తన ఐదేళ్ల పాలనలో నిత్యం రాష్ట్రం ఆర్ధిక కష్టాలలో ఉంది.. తాను ఇరవైనాలుగు గంటలు శ్రమిస్తున్నాను.. ప్రజలు సహకరించాలి.. విరాళాలు ఇవ్వాలి. రాజధానికి ఇటుకలు కొనాలి.. అంటూ ఎప్పుడూ ఆయన ఏడుపుకొట్టు మాటలు మాట్లాడి ప్రజలను విసిగించేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అభివృద్ది ద్వారా మూడు ప్రాంతాలు వికసించాలని చెబుతారు. చంద్రబాబు ఒక్క అమరావతి గ్రామాలలోనే లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని అంటారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా రాజధానులపై తన అభిప్రాయాన్ని ఒకే రకంగా చెబుతారు. అదే చంద్రబాబు అయితే ఒక్కోచోట ఒకరకంగా వ్యవహరిస్తారు. ప్రధాని మోదీ వచ్చినప్పుడు కలల రాజధాని అమరావతిని రక్షించడానికే వచ్చారని చంద్రబాబు విజయవాడ పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. విశాఖ, తిరుపతి ప్రాంతాలలో మాత్రం అమరావతి ఊసే లేకుండా జాగ్రత్తపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వలంటీర్ల వ్యవస్థను తెచ్చి దానిపైనే కట్టుబడి ఉండి ప్రజలందరికి ఇళ్ల వద్దే సేవలు అందించారు. చంద్రబాబు వలంటీర్లపైన నీచమైన విమర్శలు చేశారు. ఇప్పుడు అదే వలంటీర్ల వ్యవస్తను కొనసాగిస్తానని అంటారు. పైగా పదివేల రూపాయల వేతనం ఇస్తానని మభ్య పెట్టే యత్నం చేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చే హామీలకు ఎంత వ్యయం అవుతుందో స్పష్టంగా వివరించారు. చంద్రబాబు పొరపాటున కూడా తన హామీలకు ఎంత వ్యయం అయ్యేది చెప్పకుండా జనాన్ని మాయ చేయాలని చూస్తారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానిఫెస్టోని అమలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేస్తారు. ఎన్నికల సమయం వచ్చేసరికి తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినదానికన్నా మూడు రెట్లు అదనంగా ఇస్తానని ప్రజలను నమ్మించాలని చూస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 2019 మానిఫెస్టో, కొత్త మానిఫెస్టో చూపించి తాను ఏమి చేసింది వివరించుతారు. చంద్రబాబు ఎప్పుడూ 2014 నాటి మానిఫెస్టో ఊసే ఎత్తరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరిని దూషించరు. ఉదాహరణకు చంద్రబాబుతో కుమ్మక్కై సోనియాగాంధీ దారుణమైన అక్రమ కేసులు పెట్టించినా ఎన్నడూ ఆమెను ఒక్క మాట అనలేదు. అలాగే ప్రధాని మోదీతో కూడా సత్సంబంధాలే కోరుకుంటారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యం అని అంటారు. చంద్రబాబు మాత్రం తాను జాతీయ నాయకుడనని భ్రమపడుతుంటారు.⇒ ఆయా రాష్ట్రాలు ప్రత్యేక విమానాలలో తిరిగి మోదీకి పోటీగా కాంగ్రెస్ తో కలిసి కూటమి కడతారు. కూటమి ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ను గాలికి వదలివేస్తారు. మోదీని టెర్రరిస్టు అని, భార్యను ఏలుకోలేనివాడు దేశాన్ని ఎలా ఎలుతాడని అంటారు. విదేశాలలో సైతం మోదీ వల్ల పరువు పోయిందని చెపబుతారు. కానీ మోదీనే మళ్లీ ప్రధాని అయ్యేసరికి యుటర్న్ తీసుకుని కాళ్లావేళ్లపడి ఆయనతో పొత్తు పెట్టుకుంటారు. అప్పుడు మోదీ విశ్వగురు అయ్యారని పొగుడుతారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను చేసిన అభివృద్దిని పూర్తి స్థాయిలో చెప్పుకోరు. ఉదాహరణకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాలుగు ఓడరేవులు, పది ఫిషింగ్ హార్బర్లు, కొప్పర్తి పారిశ్రామికవాడ, శ్రీసిటీలో ఏసీ తయారి ప్లాంట్, బద్వేల్ లో సెంచరీ ప్లై వుడ్ ప్లాంట్, విశాఖలో అదానీ డేటా సెంటర్.. ఇలా అనేక పరిశ్రమలు వచ్చినా ఆయన రోజూ ప్రచారం చేసుకోరు. కానీ చంద్రబాబు మాత్రం అసలు పరిశ్రమలే రాలేదని, అభివృద్ది లేదని డబాయించి ప్రచారం చేస్తుంటారు.⇒ ఆయన టైమ్లో వచ్చిన ఒక్క కియా ప్లాంట్నే ఎల్లవేళలా ప్రచారం చేసుకుంటారు. చంద్రబాబు టైమ్ లో ఉద్దానం కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపే యత్నం జరగలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ఆస్పత్రి, నిపుణుల నియామకం, పరిశోధనతో పాటు 700 కోట్లతో శుద్ది చేసిన సురక్షిత నీరు సరఫరా స్కీమ్ అమలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తానిచ్చిన వాగ్దానాలకు కొనసాగింపుగా మరికొన్ని హామీలు ఇస్తే, చంద్రబాబు ఆకాశమే హద్దుగా ఎన్నికల ప్రణాళికను ప్రకటించి దానికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టారు. అందులో కూడా అత్యధికం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన స్కీములనే కొనసాగించి అదనంగా మరింత ఇస్తానని చెబుతారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల విద్యకు, ప్రభుత్వ స్కూళ్ల బాగుచేతకు ప్రాధాన్యం ఇస్తుంటే, చంద్రబాబు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు సరఫరా చేస్తానని చెబుతారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చి దిద్దితే, చంద్రబాబు వాటిని పట్టించుకోలేదు. విద్య, వైద్యం ప్రైవేటు రంగానికి అప్పగించి వారికి లాభాలు సమకూర్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినన్ని స్కీములు, కొత్త వ్యవస్థలు మరే ముఖ్యమంత్రి తీసుకు రాలేకపోయారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, ఆరోగ్య శిబిరాలు, ఫ్యామిలీ డాక్టర్ విధానం వంటివి తీసుకువస్తే చంద్రబాబు ఎన్నడూ ఆ దిశగా యోచించలేదు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అంత విజన్ ఉంది.. ఇంత విజన్ ఉంది అని గొప్పలు చెప్పుకోకపోయినా, అనేక వ్యవస్థలను సృష్టించి తన విజన్ ఏమిటో ప్రజలకు తెలియచేశారు. చంద్రబాబు తనకు 2020 విజన్, 2037 విజన్ అంటూ ఆయా చోట్ల కాపీ కొట్టిన విషయాలను తనవిగా ప్రచారం చేసుకుంటూ తాను చాలా గొప్పవాడినని భ్రమపడుతుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను తీసుకు వచ్చిన స్కీములన్నిటిని ఆయనే చెప్పలేరు. ఎందుకంటే ఆ స్థాయిలో, అంత సంఖ్యలో పథకాలు తెచ్చి అమలు చేసి తన సమర్థత ఏమిటో ఏపీ ప్రజలకు చూపించారు. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, తదితర స్కీముల ప్రస్తావన వస్తే ఠక్కున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తుకు వస్తారు. కానీ చంద్రబాబు తనది ఫలానా స్కీము అని చెప్పుకునే పరిస్థితి లేదు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్లపాటు ప్రశాంతంగా పాలన సాగితే, చంద్రబాబు కక్షపూరిత పాలన అని, విధ్వంసం అని, వినాశనం అని దుర్మార్గ ప్రచారం చేస్తుంటారు. తన టైమ్లో అమరావతి పేరుతో ముప్పై ఐదు వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని విధ్వంసం చేస్తే మాత్రం అది గొప్ప విషయం అని ఊదర గొడుతుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరకంగా స్వయం ప్రకాశం అయితే చంద్రబాబు ఎవరో ఒకరిపై ఆధారపడి పదవిలోకి వస్తుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టాలు, నష్టాలకు ఓర్చి, పెద్ద, పెద్ద రాజకీయ తిమింగలాలను ఎదుర్కుని నిలబడితే, చంద్రబాబు కుట్రలు, కుయుక్తులు, కూటమి ఎత్తులు, జిత్తులపై ఆధారపడి రాజకీయం చేస్తుంటారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కష్ట జీవి అయితే, చంద్రబాబు కష్టపడుతున్నట్లు నటించే జీవి అని చెప్పాలి. అబద్దాలు ఆడడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇష్టపడరు. చంద్రబాబు అలవోకగా అబద్దాలు ఆడగలరు. అసత్యాలను సృష్టించగలరు. అందుకు ఉదాహరణే లాండ్ టైటిలింగ్ చట్టంపై లేనిపోని ఒక మోసపూరిత కల్పిత వదంతులను సృష్టించి జనంలోకి వదిలారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థులను కూడా దూషించరు. చంద్రబాబు ప్రతి చోట తన ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నేతలను నోటికి వచ్చినట్లు దూషిస్తుంటారు. అదే టైమ్లో తనను ఎవరైనా ఏదైనా అంటే ప్రజల కోసం పడతానంటూ కొత్త డ్రామా ఆడుతారు. రాజకీయ అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు. ఎవరితో నైనా కలవడానికి, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడానకి సిగ్గుపడరు. అంతకు ముందు బండబూతులు తిట్టుకున్నా, ఏ మాత్రం ఫీల్ కారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు, లేదా వ్యక్తుల మేనేజ్మెంట్ తెలియని వ్యక్తి అయితే, చంద్రబాబు అచ్చంగా వ్యవస్థలు, మీడియాను మేనేజ్ చేసే నిపుణుడుగా పేరొందారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి.. చంద్రబాబు మీడియాపై ఆధారపడే మనిషి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిను ఓడించలేమని భయపడే చంద్రబాబు నాయుడు జనసేన, బీజేపీలతో పొత్తుపెట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ధైర్యంగా తన పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని జనంతోనే తన పొత్తు అని ధైర్యంగా ప్రకటించి ఎన్నికల బరిలో నిలబడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య వయస్కుడైతే, చంద్రబాబు 75 ఏళ్ల వృద్దుడు. ప్రజలు తమకు ఎవరు కావాలో నిర్ణయించుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మీ ఓటు.. విశ్వసనీయతకా? మోసానికా?
వైఎస్సార్సీపీ 2019 మేనిఫెస్టో..హామీ: వైఎస్సార్ ఉచిత పంటల బీమా, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు కలి్పంచి.. రైతులకు దన్నుగా నిలుస్తాం. అమలు: రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని నీతి ఆయోగ్ అత్యుత్తమ పథకంగా ప్రశంసించింది. ఐదేళ్లలో పంటలు దెబ్బతిన్న 54.76 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల పరిహారాన్ని అందించారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసి.. మార్కెట్లో ధరలేని పంటల ఉత్పత్తులు 21.73 లక్షల టన్నులను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు రూ.7,796 కోట్లను వెచ్చించి, రైతులకు అండగా నిలిచారు. తుఫాన్లు, అధిక వర్షాల వల్ల తడిచిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. పంట నష్టపోయిన 34.41 లక్షల మంది రైతులకు అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.3,261.61 కోట్లు అందించారు.హామీ: వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న వారందరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తాం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. చికిత్సల అనంతరం విశ్రాంతి సమయానికి వైఎస్సార్ ఆరోగ్య ఆసరాగా కింద ఆర్థిక సహాయం అందిస్తాం. అమలు: ఆరోగ్యశ్రీ కింద చికిత్స విధానాలను 1059 నుంచి 3,257కు పెంచారు. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటిన అందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపజేశారు. ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్సల కోసం రూ.13,421 కోట్లు ఖర్చు చేశారు. విశ్రాంతి సమయంలో రోగులకు ఆరోగ్య ఆసరా కింద 24.59 లక్షల మందికి రూ.1,465 కోట్లను అందించారు. ఈ రెండు పథకాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినప్పటికీ మరో అడుగు ముందుకేసి ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షల వరకూ పెంచారు. గతంలో ఇది రూ.5 లక్షల వరకే ఉండేది.హామీ: పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ.20 వేలు అందిస్తాం. అమలు:ఇచ్చిన మాట మేరకు జగనన్న విద్యా దీవెన పథకం 29.65 లక్షల మంది విద్యార్థులకు రూ.12,609.68 కోట్లను ఫీజురీయింబర్స్మెంట్గా చెల్లించారు. 2017–19 మధ్య చంద్రబాబు 16.73 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,778 కోట్లను సీఎం జగన్ చెల్లించారు. జగనన్న వసతి దీవెన కింద 25.17 లక్షల మంది విద్యార్థులకు రూ.4,275.76 కోట్లను అందించారు. 2022–23 విద్యా సంవత్సరంలో గరిష్టంగా 1.80 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువు పూర్తిచేసుకున్న వెంటనే క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు.హామీ: వైఎస్సార్ ఆసరా పథకం కింద ఎన్నికల రోజు వరకూ అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా వారి చేతికే అందిస్తాం. మళ్లీ సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తాం. అమలు: 2019, ఏప్రిల్ 11 నాటికి పొదుపు సంఘాల మహిళలు 78.94 లక్షల మందికి ఉన్న రూ.25,570.90 కోట్లను నాలుగు విడతల్లో నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశారు. సున్నా వడ్డీ కింద పొదుపు సంఘాల మహిళలకు రూ.4,969.04 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు.హామీ: జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. పోలవరాన్ని పూర్తి చేస్తాం. సాగునీటి కలను నిజం చేస్తాం. అమలు: కరోనా మహమ్మారి ప్రభావం వల్ల లాక్డౌన్తో రెండేళ్లు పనులు చేయలేని పరిస్థితి. మిగతా మూడేళ్లలో రూ.35,268.05 కోట్లతో ఆరు ప్రాజెక్టులు (సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్, లక్కవరం ఎత్తిపోతల, అవుకు సొరంగం, కుప్పం బ్రాంచ్ కెనాల్, వెలిగొండ జంట సొరంగాలు–తొలి దశ) పూర్తి చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించి పులిచింతల, సోమశిల, కండలేరు, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్.. డయాఫ్రమ్ వాల్తో మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేసి బ్రహ్మంసాగర్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. పోలవరంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతూ.. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్పిల్ వే, స్పిల్ చానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు పూర్తి చేసి.. గోదావరి వరదను మళ్లించారు. చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్లే దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్పై కేంద్రం నిర్ణయం వెల్లడించడమే తరువాయి.. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఏటా ఖరీఫ్, రబీలలో కోటి ఎకరాలకు నీళ్లందించి రైతుల సాగునీటి కలను నిజం చేశారు.హామీ: ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఆ స్థలాలను అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. ఇళ్లు కూడా కట్టిస్తాం. అమలు: ఇచ్చిన మాట మేరకు 31 లక్షల మందికిపైగా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు పంపిణీ చేసి.. వాటిపై సర్వహక్కులు కల్పిస్తూ వారి పేరుతోనే రిజి్రస్టేషన్ చేసి ఇచ్చారు. ఈ స్థలాల మార్కెట్ విలువ రూ.76 వేల కోట్లకుపైగానే పలుకుతోంది. అంతే కాకుండా 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించి.. ఇప్పటికే 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇవ్వడంతోపాటు రూ.35 వేలు పావలా వడ్డీకే రుణంగా అందించారు. ఉచితంగా ఇసుక, సబ్సిడీపై ఇతర నిర్మాణ సామగ్రిని సరఫరా చేసి.. ఒక్కో లబి్ధదారుకు రూ.55 వేల చొప్పున ప్రయోజనం చేకూర్చారు. స్థలం, ఇంటి రూపంలో ఒక్కో లబ్ధిదారుకు రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ స్థిరాస్థితిని సమకూర్చారు.హామీ: బీసీల అభ్యున్నతికి ఏడాదికి రూ.15 వేల కోట్లు చొప్పున 5 ఏళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తాం. బీసీల్లోని అన్ని ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వైఎస్సార్ చేయూత ద్వారా ఎంత అవసరమైతే అన్ని నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి తోడుగా ఉంటాం. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కలి్పస్తూ చట్టం తెస్తాం. బీసీ జనగణన చేసి.. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ కలి్పంచాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తాం. అమలు: బీసీల అభ్యున్నతికి చెప్పిన దాని కంటే అధికంగా నిధులు ఖర్చు చేశారు. డీబీటీ రూపంలో రూ.1.28 లక్షల కోట్లను బీసీ లబి్ధదారుల ఖాతాల్లో నేరుగా జమా చేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.52 వేల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్డీబీటీ కలిపి మొత్తం రూ.1.80 లక్షల కోట్లను బీసీల అభ్యున్నతి కోసం ఖర్చు చేశారు. బీసీల్లోని ఉప కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఆ వర్గాల వారినే చైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించారు. నామినేటెడ్ పనుల్లో, పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు ప్రయోజనం చేకూర్చారు. బీసీ జనగణన చేయించి.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడంతోపాటు ఇదే అంశంపై పార్లమెంట్లో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. శాశ్వత బీసీ కమిషన్ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించారు. వెనుకబడిన వర్గాలను సమాజానికి వెన్నెముకగా తీర్చిదిద్దుతానంటూ ఆ వర్గాలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు.హామీ: షాపులు ఉన్న నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఏడాదికి రూ.పది వేలు ఆర్థిక సహాయం చేసి తోడుగా ఉంటాం. అమలు: చెప్పిన మాట మేరకు ఐదేళ్లలో 3.37 లక్షల మందికి జగనన్న చేదోడు పథకం కింద రూ.1,260.17 కోట్లను సహాయంగా అందించి, తోడుగా నిలిచారు.హామీ: మగ్గం ఉన్న చేనేత కారి్మకుల కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలను ప్రోత్సాహకంగా ఇస్తాం. అమలు: వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద 82,130 మంది మగ్గం ఉన్న చేనేత కారి్మకులకు ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.982.98 కోట్లను ప్రోత్సాహకంగా అందించారు.హామీ: కులవృత్తిదారులు, చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకే రూ.పది వేలు ఇస్తాం. అమలు: జగనన్న తోడు పథకం కింద 15.87 లక్షల మందికి సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చారు. సున్నా వడ్డీ కింద వారికి రూ.88.33 కోట్లు ఇచ్చారు.హామీ: వైఎస్సార్ చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేలు ఇస్తాం. అమలు: చెప్పిన మాట మేరకు 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలు 33.15 లక్షల మందికి రూ.19,189.59 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. వాటిని సద్వినియోగం చేసుకున్న మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ.. ఆదాయం పొందుతూ ఆర్థిక సాధికారత సాధిస్తూ సొంత కాళ్లపై నిలబడే దిశగా అడుగులు వేస్తున్నారు.హామీ: పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకంగా ఇస్తున్న రాయితీల (భూమి, పన్ను, విద్యుత్)తోపాటు ఏపీఐడీసీని పునరుద్ధరించి.. నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాం. అమలు: అధికారం చేపట్టినప్పటి నుంచి పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక సంస్కరణల ద్వారా సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ఏటా రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్గా నిలుపుతున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఏటా సగటున రూ.14,896 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఏపీఐడీసీని పునరుద్ధరించారు. ప్రభుత్వం ఇచ్చిన తోడ్పాటుతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) 1.9 లక్షల నుంచి ఏడు లక్షలకు చేరుకున్నాయి. 22.07 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. పరిశ్రమల స్థాపనతో గత 59 నెలల్లోనే కొత్తగా 28.92 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేట్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ అన్నీ కలిపి ఏకంగా 6,48,087 మందికి ఉద్యోగాలు, ఉపాధి లభించింది. హామీ ఇవ్వకున్నా నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, పది ఇండ్రస్టియల్ నోడ్స్ నిర్మాణంతో పారిశ్రామికాభివృద్ధిని పరుగులెత్తిస్తున్నారు.హామీ: పార్లమెంటు నియోజకవర్గం యూనిట్గా ఒక జిల్లాను ఏర్పాటు చేసి.. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తా. అమలు: 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిరి్మస్తున్నారు. 2023–24లో ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. 2024–25లో మరో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన ఏడు 2025–26లో ప్రారంభించనున్నారు.హామీ: ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి.. అదే ఊరిలోని పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించి ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే ప్రజలకు అందిస్తాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అమలు: రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను సీఎం జగన్ ఏర్పాటు చేశారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.35 లక్షల మంది ఉద్యోగులను నియమించారు. సగటున 50 నుంచి 75 ఇళ్లకు ఒకరు చొప్పున 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించి.. ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి గుమ్మం వద్దకే అందించి.. గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. వివిధ శాఖల్లో 2.31 లక్షల ఉద్యోగులను నియమించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. ఈ 59 నెలల్లోనే 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగులను నియమించడం గమనార్హం. ప్రభుత్వ, ప్రైవేట్, ఎంఎస్ఎంఈలు, స్వయం ఉపాధితో కలిపి 58.22 లక్షల మందికిపైగా ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు.హామీ: ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తాం. విద్యా ప్రమాణాలు పెంచుతాం. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతాం. పుస్తకాలు, యూనిఫాంలు సరైన సమయానికి ఇస్తాం. మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచుతాం. అమలు: నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేసే పనులను రెండు దశల్లో చేపట్టారు. తొలి దశ ఇప్పటికే పూర్తయింది. రెండో దశ పనులు వేగంగా సాగుతున్నాయి. కోర్టులకు వెళ్లి టీడీపీ అడ్డుకున్నా సరే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టారు. పాఠశాలలు ప్రారంభమైన రోజే జగనన్న విద్యాకానుక పథకం కింద పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, యూనిఫాంలు, బూట్లు సాక్స్లు అందిస్తున్నారు. జగనన్న గోరుముద్ద పథకం కింద మధ్యాహ్నం నాణ్యమైన భోజనంతోపాటు చిక్కీ ఇస్తున్నారు. సీబీఎస్ఈ సిలబస్ను అమలు చేస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్ను ప్రవేశపెట్టనున్నారు. మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవుతున్న పిల్లలు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), వైట్హౌస్ వేదికలపై రాష్ట్రంలో అమలవుతున్న విద్యా విధానం, సంస్కరణలపై అనర్గళంగా ప్రసంగించడం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. హామీ: వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ఏడాదికి రూ.12,500 అందిస్తాం. అమలు: మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే అధికంగా.. ఏడాదికి ఒక్కో రైతు కుటుంబానికి రూ.13,500 రైతు భరోసా కింద ఇచ్చారు. ఐదేళ్లలో రూ.67,500 రైతు భరోసా కింద ఇచ్చారు. ఈ పథకం కింద ఐదేళ్లలో 53,58,366 మంది రైతులకు రూ.34,378.16 కోట్లను వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు.హామీ: వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రూ.4 వేల నుంచి రూ.పది వేలకు పెంచుతాం. మత్స్యకారులకు ఇచ్చే డీజిల్ సబ్సిడీని డెడికేటెడ్ పెట్రోల్ బంక్ల ద్వారా డీజిల్ పట్టుకునేటప్పుడు వారి చేతికి అందేటట్టు అమలు చేస్తాం. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.పది లక్షలను పరిహారంగా చెల్లిస్తాం. అమలు: వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రూ.పది వేలకు పెంచారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద ఐదేళ్లలో 2.43 లక్షల మందికి రూ.538.06 కోట్లను అందించారు. డీజిల్ సబ్సిడీని అమలు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.పది లక్షలను పరిహారంగా అందిస్తున్నారు.హామీ: అవ్వాతాతలకు పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించి.. పెన్షన్ను రూ.3 వేల వరకూ పెంచుకుంటూపోతాం. అమలు: ఇచ్చిన మాట మేరకు వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద వృద్ధాప్య పెన్షన్ను రూ.2,000 నుంచి రూ.2,250కు పెంచే ఫైలుపై 2019, మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక జగన్ తొలి సంతకం చేశారు. దశలవారీగా పెన్షన్ను రూ.3 వేలకు పెంచి వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దే వృద్ధులకు పంపిణీ చేస్తున్నారు. అర్హతే ప్రామాణికంగా ఎలాంటి వివక్ష చూపకుండా 66.34 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. గత 59 నెలల్లో పెన్షన్ రూపంలో రూ.90,590.6 కోట్లను పంపిణీ చేశారు.టీడీపీ కూటమి 2014 మేనిఫెస్టో..హామీ: అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తా. అమలు: రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీపై తొలి సంతకం చేయకుండా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే 2014, జూన్ 8న చంద్రబాబు మోసం చేశారు. వ్యవసాయ రుణాల మాఫీపై కోటయ్య కమిటీని వేసి.. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో కోతలు పెట్టి రూ.15,297 కోట్లను మాత్రమే మాఫీ చేశారు. మిగతా రూ.72,315 కోట్లు మాఫీ చేయకుండా రైతులకు చంద్రబాబు టోపీ పెట్టారు.హామీ: డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా. అమలు: టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చే నాటికి రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల మహిళలు బకాయిపడ్డారు. ఆ రుణాల్లో ఒక్క పైసా కూడా మాఫీ చేయకుండా మహిళలను చంద్రబాబు వంచించారు.హామీ: ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తా. అమలు: 2014, జూన్ 8 నుంచి 2019, మే 29 వరకూ కేవలం 32 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారు. రాష్ట్రంలోని కోటికిపైగా ఇళ్ల(కుటుంబాలు)కు ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి కింద పైసా కూడా ఇవ్వలేదు. ఒక్కో ఇంటికి నెలకు రూ.2 వేల చొప్పున 60 నెలలకు రూ.1.20 లక్షలు ఇవ్వకుండా ఎగ్గొట్టి చంద్రబాబు మోసం చేశారు.హామీ: ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ చేస్తా. అమలు: ఐదేళ్లలో పుట్టిన ఒక్క ఆడబిడ్డ పేరుతో ఒక్క పైసా కూడా డిపాజిట్ చేయకుండా చంద్రబాబు మోసం చేశారు.హామీ: అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం ఇచ్చి.. పక్కా ఇళ్లు కట్టిస్తాం. అమలు: మూడు సెంట్లు స్థలం మాట దేవుడెరుగు.. కనీసం ఏ ఒక్కరికీ సెంటు స్థలం కూడా ఇవ్వకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేశారు.హామీ: ఏటా రూ.పది వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ను అమలు చేస్తా. అమలు: ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికి రూ.పది వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లను బీసీ సబ్ ప్లాన్ కింద ఆ వర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేయాలి. కానీ.. ఐదేళ్లలో రూ.36 వేల కోట్లను మాత్రమే ఖర్చు చేసి, అందులోనూ అవినీతికి పాల్పడి బీసీలను మోసం చేశారు.హామీ: చేనేత, పవర్లూమ్స్ రుణాలు మాఫీ చేస్తా. అమలు: ఒక్క రూపాయి రుణాన్ని కూడా మాఫీ చేయకుండా చేనేత, పవర్లూమ్స్ కారి్మకులకు చంద్రబాబు టోపీ పెట్టారు.హామీ: సింగపూర్ను మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా. ప్రతి నగరంలో, జిల్లా కేంద్రంలో హైటెక్ సిటీ నిర్మిస్తా. అమలు: సింగపూర్ను మించి అభివృద్ధి మాటేమోగానీ అడ్డగోలు, అవినీతి, అక్రమాలకు పాల్పడి రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు. జిల్లా కేంద్రాల మాట దేవుడెరుగు కనీసం ఏ ఒక్క నగరంలో కూడా హైటెక్ సిటీ నిర్మాణానికి పునాదిరాయి కూడా వేసిన పాపాన పోలేదు.హామీ: మహిళల భద్రతకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తా. ఆపదలో ఉన్న మహిళలకు సెలఫోన్ల ద్వారా 5 నిమిషాలలో సహాయం అందించే వ్యవస్థ ఏర్పాటుచేస్తా. అమలు: ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటుకు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విజయవాడలో కాల్మనీ సెక్స్ రాకెట్ మహిళల మానప్రాణాలతో చెలగాటమాడటం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇసుక దోపిడీకి అడ్డుతగిలిన తహసీల్దార్ వనజాక్షిని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని లాగి, దాడిచేసినా చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.హామీ: పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య, కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు తెస్తా. అమలు: విద్యా విధానంలో మార్పుల మాట దేవుడెరుగు కనీసం ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను పెంచేందుకు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్లు ఇవ్వకుండా మోసం చేశారు. ఫీజు ఎంత ఉన్నారూ.35 వేలు మాత్రమే ఫీజురీయింబర్స్మెంట్ కింద ఇవ్వడం వల్ల విద్యార్థుల తల్లితండ్రులపై తీవ్ర ఆర్థిక భారం పడింది.హామీ: ఆరోగ్యశ్రీ కంటే మెరుగైన వైద్య సేవలు అందిస్తా. అమలు: ఆరోగ్యశ్రీ పేరును ఎనీ్టఆర్ వైద్య సేవగా మార్చిన చంద్రబాబు.. బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేయడం వల్ల ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులకు చికిత్స అందించడానికి యాజమాన్యాలు నిరాకరించాయి. దాంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఆరోగ్యశ్రీని చంద్రబాబు నీరుగార్చారు. ఆరోగ్యశ్రీ కింద చంద్రబాబు పెట్టిన రూ.600 కోట్ల బకాయిలను సీఎం జగన్ చెల్లించారు.హామీ: రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తా.. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్ట నివారణకు రైతుల వారీగా బీమా సౌకర్యం కలి్పస్తా. అమలు: ధరల స్థిరీకరణ నిధి కింద ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. గిట్టుబాటు ధరలు దక్కక ధాన్యం, అపరాలు, ఉల్లి, టమాటా, మామిడి, బత్తాయి తదితర రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను మోసం చేశారు.హామీ: ప్రతి జిల్లాకూ, పట్టణానికి, మండలానికి, గ్రామానికి ఒక దార్శనిక పత్రం (విజన్ డాక్యుమెంట్)ను తయారుచేసి అభివృద్ధి చేస్తాం. అమలు: ప్రతి జిల్లా, పట్టణం, మండలం, గ్రామం అభివృద్ధి మాటేమోగానీ.. అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడిన చంద్రబాబు బ్యాచ్ అధోగతిపాలు చేశాయి.హామీ: అవినీతిరహిత సుపరిపాలన, పాలనలో పారదర్శకత తెస్తా. పెరుగుతున్న నిత్యావసరాల ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా. అమలు: అక్షర క్రమంలో ముందున్న ఆంధ్రప్రదేశ్ను అవినీతిలోనూ చంద్రబాబు అగ్రగామిగా నిలిపారు. చంద్రబాబు మానసపుత్రిక అయిన జన్మభూమి కమిటీల్లోని టీడీపీ నేతలు లంచాల కోసం ప్రజలను పీడించాయి.హామీ: కొత్తగా కళింగపట్నం, నరసాపురం ఓడరేవు, నిజాంపట్నం, రామాయపట్నం, దుగరాజపట్నం పోర్టులను నిరి్మంచి, పాత పోర్టులతో అనుసంధానం చేస్తూ ఇండ్రస్టియల్ క్లస్టర్స్ను అభివృద్ధి చేస్తా. అమలు: ఐదేళ్లలో కొత్తగా ఒక్కటంటే ఒక్క పోర్టు నిర్మాణ పనలు కూడా చంద్రబాబు ప్రారంభించలేదు. ఇండ్రస్టియల్ క్లస్టర్స్ను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.హామీ: వివిధ జిల్లాలను అనుసంధానం చేస్తూ బుల్లెట్ ట్రైన్స్ (ర్యాపిడ్ రైల్వే ట్రాన్స్పోర్టు వ్యవస్థ)ను ప్రవేశపెడతాం. అమలు: బుల్లెట్ ట్రైన్స్ పేరుతో ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఎన్నడూ ఆ మాట ఎత్తడానికి కూడా సాహసించలేదు.హామీ: పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తా. గాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేస్తాం. అమలు: కమీషన్ల కక్కుర్తితో జాతీయ పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు. పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారంటూ 2019, ఏప్రిల్ 1న రాజమహేంద్రవరంలో ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం. గాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై భారీ ఎత్తున నిధులు దోచేశారు. దాంతో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు.హామీ: కేంద్రం రాజధాని లేకుండా విభజించి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టింది. సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని రాజధానిగా ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తా. అమలు: ప్రపంచస్థాయి నగరం మాటేమోగానీ.. ఆ ముసుగులో ఓత్ ఆఫ్ సీక్రసీని తుంగలో తొక్కి.. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి అంతర్జాతీయ స్థాయి భూ కుంభకోణానికి చంద్రబాబు పాల్పడ్డారు. అమరావతిలో ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనాన్ని నిరి్మంచలేకపోయారు. కనీసం రహదారి సౌకర్యాన్ని కూడా కలి్పంచలేకపోయారు. -
'విద్యావంతుడినంటావ్'..! ఇదేనా తెలివి.. శ్రీభరత్!!
సాక్షి, విశాఖపట్నం: విద్యావంతుడినంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్.. ఎన్నికల్లో గెలవలేనని తెలిసి రోజురోజుకీ దిగజారిపోతున్నారు. అక్రమాలకు కేరాఫ్గా మారిన దివంగత తాత అడుగు జాడల్లోనే నడుస్తూ.. తన సొంత వర్సిటీ కోసం దేవాలయంలాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు కేంద్రంగా మారిన ఏయూలో ఈవీఎంలు భద్రపరచొద్దంటూ ఎన్నికల కమిషన్కు లేఖ రాయడం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈవీఎంల రక్షణ వలయం గురించి తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ విశ్వసనీయతనే తప్పుపడుతున్న ఆయన వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఏయూపై ఈసీకి లేఖతో కలకలం!తాజాగా రిటర్నింగ్ అధికారికి రాసిన ఒక లేఖ భరత్ బేలతనాన్ని, అవివేకాన్ని, తేటతెల్లం చేస్తుంది. భారత ఎన్నికల సంఘంపై కానీ, భారతదేశ ఎన్నికల ప్రక్రియపై కానీ భరత్కు ఎలాంటి నమ్మకం, విశ్వాసం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిస్తే వాటిని ట్యాంపరింగ్ చేస్తారని, వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఈవీఎంలను మార్పు చేసేస్తారంటూ ఏకంగా రిటర్నింగ్ అధికారికి లేఖ రాయడం కలకలం రేపుతోంది.ఈ విషయం తెలుసా? అసలు పూర్వాపరాలేవీ తెలియకుండా ఇష్టంవచ్చినట్లు మాట్లాడటం భరత్కు వారసత్వంగా వచ్చినట్లుందని అందరూ నవ్వుతున్నారు. వాస్తవానికి ఈనెల 13న జరిగే ఎన్నికల తరువాత ఈవీఎంలను ఏయూలో భద్రపరచాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. దీనికోసం ఏయూ ప్రాంగణాన్ని వారు తమ ఆ«దీనంలోకి తీసుకున్నారు. ఈవీఎంల భద్రపరిచే భవనంలోకి ఈగ కూడా చొరబడే వీలు లేకుండా అవసరమైన అన్ని చర్యలను దాదాపు నెల రోజుల నుంచి ఎన్నికల అధికారులు పకడ్బందీగా నిర్వహించారు.ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లాకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలు ఏయూలోనే భద్రపరుస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా అక్కడే సజావుగా నిర్వహిస్తున్నారు. ఇన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ ఏ ఒక్క ఓటు గానీ, ఈవీఎం, బ్యాలెట్ బాక్సు కానీ ట్యాంపరింగ్ జరగలేదు. అందుకే ఎన్నికల కమిషన్ ఎప్పుడూ ఏయూనే ఎంపిక చేస్తుందన్న విషయం తెలియకుండా చేసిన ఆరోపణలతో భరత్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈసీపై విశ్వాసం లేదా..?ఎన్నికల సంఘాన్ని దాని విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా శ్రీ భరత్ లేఖ రాశారు. ఈవీఎంల భద్రతకు పటిష్టమైన రక్షణ వలయంలో చుట్టూ సీసీ కెమెరాల నిఘా కూడా ఉంటుంది. ఈవీఎంలు భద్రపరిచిన ప్రాంతం.. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కానీ, రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆధీనంలో కానీ ఉండవు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ప్రత్యేక బలగాల ఆధ్వర్యంలో ఈవీఎంలను భద్రపరుస్తారు.వీటి జోలికి వెళ్లడం గానీ, వాటిని చూడడం కానీ, వాటిని ముట్టుకోవడం కానీ, వాటిని ట్యాంపరింగ్ చేయడం కానీ ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా.. ఎంపీ బరిలో రెండో సారి ఎలా పోటీ చేస్తున్నారంటూ విశాఖ వాసులు, విద్యావంతులు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వారికి ఓటేస్తే తమ ఓటు వృథాగా మారినట్లేనని భావిస్తున్నారు. భరత్ రాసిన లేఖపై టీడీపీ నాయకులే మండిపడుతున్నారు.టీచర్లనీ మార్చేయ్యాలంట.?ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్ని మారిస్తే సరిపోదు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని కూడా మార్చేయాలి అని భరత్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న టీచర్లందరినీ కించపరిచేవిధంగా మాట్లాడటం కూడా భరత్ దిగజారుడు తనానికి నిదర్శమని చెప్పవచ్చు. మరో విషయం ఏమిటంటే.. గీతం విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఆచార్యులను భరత్ బలవంతంగా భీమిలి, విశాఖ తూర్పు, గాజువాక నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో పాఠాలు చెప్పుకునే మమ్మల్ని ఇలా ప్రచారానికి తిప్పడంపై వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇవి చదవండి: ఏపీలో కాంగ్రెస్, టీడీపీ ములాఖత్.. బండారం బద్దలైంది -
అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
తెలుగుదేశం కూటమి డబుల్ గేమ్ అనాలా? లేక దొంగ నాటకాలని అనలా? అమరావతి రాజధాని అంటే ఇతర ప్రాంతాల ప్రజలలో వ్యతిరేకత వస్తుందని భయపడుతున్నారా? బుధవారం నాడు తెలుగుదేశం కూటమి వివిధ పత్రికలలో ప్రచార ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడ, కలికిరి రాక సందర్భంలో ఈ అడ్వైర్టైజ్ మెంట్ ఇచ్చారు. కేవలం విజయవాడ ప్రాంత ఎడిషన్లలో మాత్రం అమరావతి రాజధాని అని ప్రస్తావించి, ఇతర ప్రాంత ఎడిషన్లలో మాత్రం రాష్ట్ర వికాసానికి అని పేర్కొన్నారు. అంటే దీని అర్ధం ఏమిటి? అమరావతి రాజధాని అంటే ఉత్తరాంధ్రలో, రాయలసీమలలో ప్రజలలో వ్యతిరేకత బహిర్గతమై, ఓట్ల రూపంలో ప్రభావితం చేస్తుందని భయపడడమే కదా!విజయవాడ పత్రికలలో ఇచ్చిన ప్రకటన ఇలా ఉంది. 'మన కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీగారు పాల్గొంటున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు లక్షలాదిగా తరలిరండి' అని ఉంది. అదే విశాఖపట్నం ఏరియాలో ఇచ్చిన ప్రకటనలో మాత్రం అందుకు భిన్నంగా 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి మోదీ గ్యారంటీ...' అని రాశారు. అంటే విజయవాడకు మోదీ వస్తున్నది కేవలం అమరావతి గురించేనని అనుకోవాలా? రాష్ట్ర వికాసం కోసం కాదా? విశాఖకు అమరావతి కలల రాజధాని కాదని చెప్పడమే కదా! ఒకపక్క అమరావతితోనే అభివృద్ది అంటూ సొల్లు పురాణం చెప్పే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఎందుకు ఇలా డ్రామా ఆడుతున్నారంటే వారికి తమపై తమకే నమ్మకం లేదనే కదా?ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా స్పష్టంగా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని, తద్వారా వికేంద్రీకరణ జరిగి అభివృద్దికి బాటలు వేస్తుందని చెబుతున్నారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అని ఆయన మానిఫెస్టోలో కూడా చెప్పారు. విశాఖ ఎక్జిక్యూటివ్ కాపిటల్ అయితే లక్షల కోట్లు ఖర్చు పెట్టనవసరం లేదని, రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.విశేషం ఏమిటంటే ప్రముఖ నటుడు, చంద్రబాబు వియ్యంకుడు అయిన బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్ కూడా విశాఖ రాజధాని అయితే బెటర్ అంటూ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. శ్రీభరత్ విశాఖ నుంచి టీడీపీ పక్షాన పార్లమెంటుకు పోటీచేస్తున్నారు. ఆయన అమరావతి ఇప్పటికిప్పుడు అభివృద్ది కాదని, ఇరవై ఏళ్లయినా పడుతుందని, విశాఖ అయితే ఆ ఇబ్బంది ఉండదని అన్నారు. అంటే తెలుగుదేశం కూటమి అభ్యర్ధులు ఒక్కోచోట ఒక్కోరకంగా ప్రచారం చేస్తున్నారని తేలిపోతోంది. నిజానికి అమరావతి రాజధాని అని గతంలో హడావుడి చేసినా తెలుగుదేశంను ప్రజలు ఓడించారు. చివరికి అమరావతి గ్రామాలు ఉన్న తాడికొండ నియోజకవర్గంలోను, మంగళగిరి నియోజకవర్గంలోను టీడీపీ ఓడిపోయింది.స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ మంగళగిరిలో ఓటమిపాలయ్యారు. దానికి కారణం అమరావతి రాజధాని పేరుతో టీడీపీ నేతలు జరిపిన భూదందానే. ఈ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం పలు కేసులు కూడా పెట్టింది. ఇదంతా ఒక కులం వారికోసం, ముందస్తు సమాచారం ఆధారంగా భూములు కొని లాభపడ్డవారి కోసమేనని ఇక్కడి ప్రజలు కూడా అనుమానించారు. దాంతో అమరావతి రాజధాని అన్న కాన్సెప్ట్కు ప్రజామోదం లేకుండా పోయింది. అయినా 2019 తర్వాత కూడా రాజధాని రైతుల పేరుతో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా అండతో కల్పిత ఉద్యమాలను టీడీపీ నడిపింది. అయినా ఇప్పుడు అమరావతి అంటే జనం నమ్మడం లేదని గ్రహించి ఈ రకంగా డబుల్ గేమ్ ఆరంభించారని భావించాలి.అమరావతికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రచారం చేసేవారు. బీజేపీతో చెడ్డాక ప్రధాని మోదీ అమరావతికి ఏమీ ఇవ్వలేదని, చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి ఇచ్చి వెళ్లారని కూడా ఆయన విమర్శించేవారు. అలాంటిది ఇప్పుడు కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి గాను ప్రజలు మోదీ రోడ్షో కు రావాలని కోరారు. గతంలో బీజేపీ నేతలు కూడా అమరావతి భూ స్కామ్ చాలా పెద్దదని విమర్శించేవారు. ఇప్పుడు మోదీ అమరావతికి ఏమైనా లక్ష కోట్ల నిధులు ఇస్తానని కూటమి నేతలకు హామీ ఇచ్చారా? అసలు ఏపీలో ఫలానా అభివృద్ది చేస్తానని మోదీ గ్యారంటీ ఇవ్వడం లేదు. అయినా వీరు మాత్రం ప్రజలను రకరకాలుగా మోసం చేయడానికి యత్నిస్తున్నారు.రాజమండ్రి, అనకాపల్లిలలో జరిగిన ప్రధాని సభలలో ఎక్కడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. ఆయనపై నేరుగా అనివీతి ఆరోపణలు చేయలేదు. కాకపోతే జనరల్గా ఏవో కొన్ని విమర్శలు చేయాలి కాబట్టి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవినీతి అంటూ ఇంతకాలం టీడీపీ ఏమి ఆరోపిస్తుందో వాటినే ఆయన కూడా చెప్పి వెళ్లారు. విశేషం ఏమిటంటే మోదీ కానీ, అమిత్ షా కానీ చంద్రబాబు ఉపన్యాసం వినకుండానే నిష్క్రమించడం. బహుశా చంద్రబాబు మాటల మీద వీరికి నమ్మకం పోయిందేమో తెలియదు. మోదీని ఏపీకి తీసుకు రావడం ద్వారా తమకు పలుకుబడి ఉందని, ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచుతున్నట్లు కనిపిస్తోంది.కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను సహేతుక కారణాలు చూపకుండానే బదిలీ చేయడం, నాలుగేళ్లుగా అమలు అవుతున్న స్కీముల ద్వారా లబ్ది దారులకు డబ్బు విడుదల చేయకుండా ఆదేశాలు ఇవ్వడం, వలంటీర్ల వ్యవస్థను నిలుపుదల చేయడం, చంద్రబాబు ఎంత నీచంగా ఉపన్యాసాలు చేస్తున్నా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవడం ఇందుకు ఉదాహరణలుగా కనిపిస్తాయి. బీజేపీకి ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా గత ఎన్నికలలో రాలేదు. అయినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ద్వారా రాయబేరాలు సాగించి కాళ్లా, వేళ్ల పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం ద్వారా తమ పనులు చక్కబెట్టుకోవడానికే అని అర్దం అవుతుంది.తమపై ఉన్న కేసులు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు జాగ్రత్తపడడానికే అని ప్రజలంతా భావిస్తున్నారు. అమరావతి రాజధాని విషయంలోనే కాదు. పలు విషయాలలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు డబుల్ గేమ్ ఆడుతున్నారు. వలంటీర్ల వ్యవస్థ వల్ల అంతా వినాశనమేనని గతంలో ప్రచారం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ దారుణమైన ఆరోపణలు ఆ చిన్నస్థాయి వలంటీర్లపై గుప్పించారు. తదుపరి ఎన్నికల సమయానికి తాము కూడా వలంటీర్లను కొనసాగిస్తామని, ఇంకా ఎక్కువ వేతనం ఇస్తామని ప్రకటించారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం శ్రీలంక అవుతోందని చంద్రబాబు, పవన్ లు విమర్శించేవారు. కానీ వారి ఎన్నికల మానిఫెస్టోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వాటికన్నా మూడు రెట్ల వ్యయంతో సంక్షేమ స్కీములు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అసెంబ్లీలో మద్దతు ప్రకటించారు. ఎన్నికల వేళ మాత్రం అదేదో ప్రమాదకరమైనదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేంద్రానికి సంబంధించిన ఈ చట్టం గురించి మోదీ, అమిత్ షా సభలలో మాత్రం నోరు విప్పరు.ఇన్ని రకాలుగా డ్రామాలు ఆడుతున్న, అబద్దాలు చెబుతున్న టీడీపీ కూటమికి ఎవరైనా ఓటు వేస్తే, వారి అబద్దాలకు ఆమోద ముద్ర వేసినట్లే అవుతుంది. చివరిగా ఒక మాట. పవన్ కల్యాణ్ పెద్ద కవి మాదిరిగా పర్వతం ఎవరికి తలవంచదు. సముద్రం ఎవరి కాళ్ల వద్దకు వెళ్లదు.. అంటూ సినిమా డైలాగులు చెబుతుంటారు. కానీ మోదీ పాల్గొన్న సభలో ఈయన వంగి, వంగి ప్రవర్తించిన తీరు మాత్రం అందరిని విస్తుపరిచింది. ఈయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అచ్చం చంద్రబాబు స్టైల్ లోనే పవన్ ఉన్నారని ప్రజలకు క్లారిటీ వచ్చింది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
బాబు–మోదీ ఇద్దరూ తోడు దొంగలే..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికల సాక్షిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాని మోదీ ఇద్దరూ తోడు దొంగలేనని స్పష్టమైంది. ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో టీడీపీ, బీజేపీలు జట్టుకట్టి.. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల్ని మోసగించారు. హోదాను అటకెక్కించారు. హోదా వస్తే రాయలసీమ భవిత బంగారం అవుతుందనుకున్న ఆ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు. ప్రత్యేక ప్యాకేజీ అంటూ కొత్త రాగం అందుకున్న చంద్రబాబు హోదాను మోదీకి తాకట్టు పెట్టారు. 2019 ఎన్నికల ముందు కేంద్రం మోసం చేసిందంటూ దొంగ ఏడుపులు ఏడ్చారు.ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ కూటమిగా జట్టుకట్టిన ఆ రెండు పారీ్టలు మళ్లీ రాయలసీమ ప్రజల్ని మోసగిస్తున్నాయి. ప్రధాని బుధవారం రాయలసీమలో ఎన్నికల ప్రచారానికి వచ్చి, ఆ ప్రాంత అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. ప్రత్యేక హోదాపై, రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీపై మోదీని చంద్రబాబు కనీసం ప్రశ్నించలేదు. హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని అప్పుడు గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు మోదీతో కలిసి ప్రచారానికి ఎలా వచ్చారని రాయలసీమ వాసులు ప్రశ్నిస్తున్నారు.రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. గుండెకాయ లాంటి రాజధాని పోయింది. హైదరాబాద్ను కోల్పోవడంతో కనీసం ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమల స్థాపన వేగం పుంజుకుని రాష్ట్రం గాడిన పడుతుందని రాష్ట్ర ప్రజలు భావించారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయంపై మొరపెట్టుకుంటే ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీనిచ్చారు. ప్రత్యేక హోదా వస్తే.. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలో పరిశ్రమలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయితే రాష్ట్ర ప్రజల ఆశల్ని చంద్రబాబు.. కేంద్రం వద్ద తాకట్టుపెట్టి తన స్వార్థం చూసుకున్నాడు. చివరికి ప్రత్యేక ప్యాకేజీ కూడా లేకుండా చేసి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలను మోసగించారు. ‘ప్రత్యేక హోదా సంజీవని కాదు. హోదాతో ఏం మేలు జరుగుతుంది. అంతకంటే ప్యాకేజీతోనే మేలు.. అవగాహన లేనివాళ్లే హోదా గురించి మాట్లాడుతున్నారు’ అని 2017లో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు వ్యాఖ్యానించడం అందరికీ గుర్తుండే ఉంటుంది.2014లో కేంద్రంలో టీడీపీ మిత్రపక్షం బీజేపీ అధికారంలో ఉండడంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని అంతా ఆశపడ్డారు. ఆ సమయంలో కేంద్రంపై ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తేవాల్సిన చంద్రబాబు పూర్తిగా కేంద్రానికి లొంగిపోయారు. హోదాతో ఒరిగేదేమీ లేదని, ప్యాకేజితో అంతకంటే మేలు చేస్తుందని కొత్తపల్లవి ఆలపించారు. ఆ ప్రకటనతో ఏపీ ప్రజలు అవాక్కయ్యారు. అతన్ని వ్యతిరేకించిన వారిని జైల్లో పెడతానని బెదిరించారు.సీమకు తీరని అన్యాయం.. రాయలసీమలో 69 శాతం భూమి సాగు ప్రాంతం కాగా.. మిగతా 31 శాతం భూమి పరిశ్రమలు స్థాపనకు అనుకూలం.1. పరిశ్రమల స్థాపనకు తక్కువ ధరలో భూములు అందుబాటులో ఉన్నాయి. 2. సమీపంలో బెంగళూరు, కర్నూలు, కడప, తిరుపతి ఎయిర్పోర్టులు ఉన్నాయి. 3. ఎగుమతులు, దిగుమతులకు చెన్నై, గోవా, కృష్ణపట్నం పోర్టులు అందుబాటులో ఉన్నాయి. 4. కృష్ణా, తుంగభద్ర నదుల్లో పుష్కలంగా నీరు ఉంది. హంద్రీ–నీవాతో వైఎస్సార్ రిజర్వాయర్లు నిర్మించారు.పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ‘హోదా’ వచ్చుంటే ‘సీమ’ రూపరేఖలే మారిపోయేవి. ‘సీమ’ అభివృద్ధితో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేవి. నిజానికి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలో కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు, గరుడ స్టీల్స్, కియా మినహా పరిశ్రమల జాడ లేదు. ఇవి మినహా 2019 వరకూ వెయ్యి మంది ఉద్యోగులు పనిచేసే ఒక్క పరిశ్రమ కూడా లేదు. ప్రస్తుత ప్రభుత్వం చొరవతో గ్రీన్కో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతి పెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంటు నిర్మిస్తోంది. దీంతో 25 వేల ఉద్యోగాలు రానున్నాయి.ప్రత్యేక హోదా వచ్చుంటే..1. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల్లో పూర్తి మినహాయింపు ఇస్తారు. 2. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్80(సి) కింద కార్పొరేట్ ఆదాయపు పన్ను పూర్తి మినహాయింపు ఉంటుంది. కేంద్రం కూడా 25–30 శాతం రాయితీ ఇస్తుంది. 3. పరిశ్రమల కోసం తీసుకునే వర్కింగ్ కేపిటల్పై 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. 4. 20 ఏళ్లకు తగ్గకుండా విద్యుత్చార్జీలపై 50 శా>తం రాయితీ ఇస్తారు. 5. పరిశ్రమలకు రవాణా సబ్సిడీ లభిస్తుంది. ముడిసరుకు తీసుకెళ్లేందుకు, తయారీ వస్తువుల ఎగుమతి ఖర్చును కేంద్రం భరిస్తుంది.పరిశ్రమల ప్లాంట్లు, యంత్రాలపై పెట్టుబడిలో 30 శాతం రాయితీ వస్తుంది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలతో పాటు ఇప్పటికే ఉన్న పాత పరిశ్రమలకు ఇది వర్తిస్తుంది. పరిశ్రమలు స్థాపించినవారికి 25–55 శాతం వెసులుబాటు ప్రత్యేక హోదాతో లభిస్తుంది. ఇలాంటి అవకాశాలతోనే ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ వంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. హోదా ప్రకటిస్తే భూములు, పారిశ్రామికీకరణకు యోగ్యంగా ఉన్న ‘‘సీమ’లో పదుల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పడతాయి. లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు కూడా అభివృద్ధి చెందేవి. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలోనూ మోసమే.. విభజన చట్టంలో రాయలసీమతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజి ఇస్తామని విభజన చట్టంలో 46(ఏ), 46(బి)లో పేర్కొన్నారు. ఈ లెక్కన రూ.22,400 కోట్లు ఈ ప్రాంతాలకు 2014–2019లో మంజూరు చేయాలి. సెక్షన్ 46లో బుందేల్ఖండ్ అనే మాట తీసేసి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి పేరుతో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఏటా రూ.350 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మనకు హక్కుగా రావల్సిన బుందేల్ఖండ్ ప్యాకేజీ ఇస్తే ప్రత్యేక ప్యాకేజితో పనిలేకుండా సీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి బాట పట్టేవి. ఈ విషయంలో కూడా చంద్రబాబు కేంద్రంతో రాజీపడ్డారు. అపారమైన ఖనిజం ‘సీమ’ సొంతం!రాయలసీమలో డోలమైట్, ఐరన్ఓర్, గ్రానైట్, యురేనియం, సిలికా, బైరెటీసీ, లైమ్స్టోన్, క్వారŠట్జ్తో పాటు ఎన్నో విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయి. రామగిరి, జొన్నగిరి ప్రాంతంలో గోల్డ్ మైన్స్, వజ్రకరూరల్, తుగ్గలి మండలాల్లో వజ్ర నిక్షేపాలున్నాయి. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే సీమలో ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటయ్యేవి. తాడిపత్రి, బేతంచెర్ల, కొలిమిగుండ్లలో నాపరాయి గనులు ఉండడంతో సిమెంట్ పరిశ్రమల స్థాపన పెరిగేది. హోదాతో వ్యవసాయాధారిత పరిశ్రమలకూ ఊతం..‘సీమ’కు హంద్రీ–నీవాతో ఏటా 40 టీఎంసీల జలాలు వస్తాయి. దీంతో వ్యవసాయాధారిత పరిశ్రమలు ఎక్కువ స్థాపించే అవకాశం ఉంది. వేరుశెనగ, పత్తి, పొద్దుతిరుగుడుతో పాటు హారి్టకల్చర్ అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. ఆపిల్ మినహా అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. దీంతో ప్రాసెసింగ్ ప్లాంటు, కాటన్ పరిశ్రమలు, చీనీ జ్యూస్ తయారీ పరిశ్రమ, వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు వ్యవసాయ, ఉద్యానపంటల ఆధారిత పరిశ్రమలు ఎక్కువగా స్థాపించే అవకాశం ఉంది. దీంతో రైతులు పండించే పంట సులభంగా మార్కెట్కు చేరుతుంది. ధర్మవరం, హిందూపురం, పెనుగొండ, నగరి, ఎమ్మిగనూరు, ఉరవకొండ, మాధవరం ప్రాంతాల్లో నేత కారి్మకులు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతాల్లో టెక్స్టైల్ పార్కులు నిరి్మస్తే, చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హోదా వస్తే సంబంధిత పరిశ్రమలకు ఎక్కువగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మానవ వనరులు పుష్కలం!రాయలసీమలో జేఎన్టీయూతో పాటు ఎస్కేయూ, ఎస్వీ, రాయలసీమ, యోగి వేమన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటితో పాటు పుట్టపర్తి సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ ఉంది. ఈ వర్సిటీల ద్వారా ఏటా వేలాదిమంది విద్యార్థులు ఉద్యోగాల వేటలో ఉంటున్నారు. వీరికి వృతినైపుణ్య శిక్షణ ఇస్తే పరిశ్రమలకు అవసరమైన మానవవనరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.రాయలసీమకు బాబు ద్రోహం!2014–19 మధ్య కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా ఆ ఐదేళ్లలో ప్రత్యేక హోదా వాణి విని్పంచలేదు. చంద్రబాబు ఏం చెబితే దానికి సీమకు చెందిన ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తలూపారు. ‘సీమ’ భవిష్యత్తును బలిపెట్టారు. హోదా వస్తే పరిశ్రమలు స్థాపించిన వారికి మేలు జరుగుతుంది, నిధుల స్వాహాకు అవకాశం తక్కువ! ప్యాకేజీ వస్తే అంతా స్వాహా చేయొచ్చు! ఇదే సూత్రాన్ని చంద్రబాబు నమ్మి హోదాను కేంద్రం ముందు తాకట్టుపెట్టి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. -
మహిళలంటే పవన్కు గౌరవం లేదు..
‘మహిళల్ని అన్ని విధాలుగా దోచుకోవడం... పై నుంచి కిందివరకూ అన్ని స్థాయిల్లో ప్యాకేజీలు తీసుకోవడం... తెలుగుదేశం పార్టీని గెలిపించడం తప్ప మరో సిద్ధాంతాలేవీ జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్కు లేవు. ఆ పార్టీలో ఎంతో ఉన్నతాశయంతో చేరిన నేను ఎంతగానో నష్టపోయా. అందులో పనిచేశాక ఆయన మనస్తత్వం తెలుసుకుని ఇక ఉండలేక బయటకు వచ్చేశా.’ అని ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ఇటీవలే వైఎస్సార్సీపీలో చేరిన ఎన్ఆర్ఐ చిట్టె సుభాషిణి అన్నారు. జనసేన వల్ల తాను ఏవిధంగా నష్టపోయిందీ సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...అమెరికా నుంచి వచ్చి అగచాట్లు..తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు దగ్గర సింగవరం గ్రామం మాది. నా భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఆయన ఉద్యోగరీత్యా 2011లో అమెరికా వెళ్లాం. నా భర్తకు మొదటి నుంచీ పవన్కల్యాణ్ అంటే పిచ్చి. ఆయన గురించి గొప్పగా ప్రచారం చేసే కొన్ని చానళ్లు, కొన్ని వీడియోలు నాకూ చూపించేవారు. నెమ్మదిగా నేను కూడా ఆయన అభిమానిగా మారాను. ఆ పిచ్చితోనే ఉద్యోగం సహా అన్నీ వదిలేసుకుని ఇండియా వచ్చేసి జనసేన పార్టీలో చేరిపోయాను.పేరుకే జనసేన... టీడీపీ గెలుపే దాని లక్ష్యం!తూర్పు గోదావరి జిల్లాలోని ముఖ్య నియోజకవర్గమైన గోపాలపురం వేదికగా జనసేన పార్టీతో నా అనుబంధం మొదలైంది. నియోజకవర్గం మొత్తం తిరిగి పార్టీ తరపున ప్రచారం చేశాను. ఆ క్రమంలోనే నాకు ఆ పార్టీలో పరిస్థితులు అర్థమయ్యాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీడీపీ కోవర్టు. అతడే కాదు జనసేన ముఖ్యనాయకులందరూ అంతే. నాలా జనసేన కోసం నిస్వార్థంగా, చిత్తశుద్ధితో పనిచేసే వారిని అడ్డుకోవడమే వారి ధ్యేయం. ఐదేళ్లు పార్టీకోసం నిరంతరం పనిచేసినా ఏ చిన్న పదవి కూడా నాకివ్వలేదు.దళితులంటే చిన్నచూపు..ఆ పార్టీలో ప్రతి ఒక్కడూ నాయకుడే అన్నట్టు ప్రవర్తించేవారు. నేను పవన్తో ఫొటో దిగాలంటే రూ.2 లక్షలు డొనేషన్ అడిగారంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీలో దళితుల్ని ఎదగనీయకుండా చేయడమే వారి ఆలోచన. అందుకే నా లాంటి దళిత మహిళ అభ్యర్థి ని ప్రోత్సహించాలనే ఆలోచన చేయ లేదు.వీర అంటూనే... వేధిస్తారు!వీరమహిళ అనే గొప్ప పేర్లు పెడతారు. కానీ అదంతా మోసం. అయినా వీర మహిళలమేమిటి? ఇలాంటి పైపై మెరుగులు ఆపాదిస్తే ఏమీ ఆశించకుండా అలా పడి ఉంటారనీ, మొగుళ్లని ఇళ్లను వదిలేసి తమ వెనుక తిరుగుతారని భ్రమలు కల్పిస్తారు. అంతేగాదు పవన్కి ఎంత మహిళాదరణ ఉందో అంటూ అందరూ అనుకోవాలని మాత్రమే తప్ప మహిళలకి ఎటువంటి ఆదరణ లేదు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం కూడా లేని మహిళకి అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. నన్ను ఎన్నో రకాలుగా వేధించారు. శారీరకంగా, ఆరి్థకంగా దోచుకో వాలని చూశారు.రియల్ లీడర్ వైఎస్ జగన్..అమాయకుల అభిమానాన్ని అడ్డం పెట్టు కుని పవన్లా పావలా.. పరకా పోగేసుకోవడం నాయకత్వం అనిపించుకోదు. నాయకుడు అంటే సామాన్యులను కూడా నాయకులుగా మార్చాలి. ఆ సత్తా వైఎస్ జగన్కు మాత్రమే ఉంది. చిన్న చిన్న వారిని కూడా ఆయన గెలిపించుకున్నారు. అప్పట్లో నేను చేసిన తప్పు ఏమిటంటే వైఎస్సార్సీపీని అసలు గమనించలేనంతగా జనసేన పిచ్చిలో కూరుకుపోవడం. వీరుడైనా, శూరుడైనా ప్రజానాయకుడు అన్నా జగన్కు మాత్రమే నప్పుతుంది. ఆయన నాయకత్వంలోనే మహిళలకు మంచి జరుగుతుంది.కుటుంబాన్ని వదిలేసి పార్టీకోసం పాటుపడ్డా..నా సొంత ఖర్చులు పెట్టుకుని పిలల్ని, భర్తని హైదరాబాద్లో వదిలేసి తూర్పు గోదావరి జిల్లాలో కాళ్లరిగిపోయేలా తిరిగాను. అవసరమైన సమయంలో పిల్లల్ని సరిగా పట్టించుకోకపోవడం వల్ల వారికి మాటలు కూడా సరిగా రాలేదు. గుండె పగిలిపోయేంత ఆవేదనతో చెబుతున్నా. నా ఉసురు తప్పకుండా పవన్కి తగులుతుంది. రూ.కోటిన్నరకి పైగా డబ్బు కోల్పోయాను. అయినా పవన్ పిచ్చి వదలని నా భర్తతో కూడా గొడవలు పడాల్సి వచ్చింది. జనసేన పార్టీలో నేనెన్ని అవమానాలు భరిస్తున్నానో విడమరిచి చెప్పాను. ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యారు. -
Modi-CBN: దొందూ దొందే!
సాక్షి, అమరావతి: అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు.. ఇదీ చంద్రబాబు నైజం.. అయిదేళ్ల కిందట ప్రధాని మోదీని ఇష్టానుసారం తిట్టారు... ఆయన కుటుంబం గురించీ వ్యక్తిగత విమర్శలు చేశారు.. ప్రధాని మోదీ సైతం చంద్రబాబు వైఖరికి భిన్నం కాదని ఇప్పుడు నిరూపించుకున్నారు.. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని రాజమండ్రిలో తన హావభావ విన్యాసాలతో కాస్త వ్యంగాన్ని జోడించి నాడు ఎగతాళి చేశారు.. ఎద్దేవా చేశారు.. చంద్రబాబు అక్రమాలకు అంతులేదన్నారు. చంద్రబాబు అవినీతిని మోదీ దుమ్మెత్తి పోస్తే.. మోదీపై టెర్రరిస్టు ముద్ర వేసి, అలాంటి వ్యక్తిని ఇంకా అరెస్టు చేయకుండా ఎందుకు వదిలేశారని... చంద్రబాబు గతంలో తెగ రంకెలేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు 2024 ఎన్నికల సమయం.. వీరిద్దరూ కలిసిపోయారు.. గతాన్ని మరిచిపోయారు.. లేక మరిచిపోయినట్లు నటిస్తున్నారు కాబోలు. చంద్రబాబు స్క్రిప్టులో ఓ ముక్కను మోదీ నోట పలికిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు జాప్యానికి చంద్రబాబే కారణమని తెలిసినా.. అదే రాజమండ్రి వేదికగా జనం నవ్వుకునేలా ఆ నెపాన్ని ప్రధాని మోదీ జగన్ ప్రభుత్వంపై వేయడం హాస్యాస్పదం. ఐదేళ్ల వెనక్కి వెళ్తే.. రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబును ఉద్దేశించి ప్రధాని మోదీ తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. 2014–19 మధ్య ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న కాలంలో అమరావతి నుంచి పోలవరం వరకు ఆయా కార్యక్రమాలను కేవలం తన ఆస్తులు పెంచుకోవడానికి కోసం ప్రయతి్నంచారని బాబును మోదీ దుమ్మెత్తిపోశారు.... ప్రతిగా చంద్రబాబు సైతం మోదీపై ఇప్పటి దాకా దేశంలో మరే రాజకీయ పార్టీ సైతం చేయనంతగా వ్యక్తిగత స్థాయిలో విమర్శలకు దిగారు.2018లో చంద్రబాబు ఏన్డీఏ నుంచి ని్రష్కమించాక ప్రధాని మోదీ అప్పట్లో రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వస్తే, చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండీ తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో నల్ల చొక్కాలు వేయించి, గో బ్యాక్ నినాదాలు చేయించారు. ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ అప్పట్లో టీడీపీ నేతలు నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసనలు తెలిపారు.ఆ సందర్భంగానే మోదీ చంద్రబాబును ఉద్దేశించి చేసిన ప్రసంగాల వీడియోలు సోషల్మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూ వారిద్దరి ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేస్తున్నాయి. చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. వ్యక్తిగత అభివృద్ధిలో బిజీ అయిపోయారనీ అప్పట్లో ప్రధాని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియను తమకు కావాల్సినప్పుడు డబ్బులు డ్రా చేసిపెట్టే ఏటీఎం లాగానే చంద్రబాబు ఉపయోగించుకున్నారని ప్రధాని ఆరోపించారు.ప్రధాని నరేంద్ర మోదీ వివిధ సందర్భాల్లో చంద్రబాబుపై చేసిన విమర్శలు, ఆరోపణలు.. ‘లోకేష్ తండ్రి చంద్రబాబు నాకు సంపదను సృష్టించడం తెలియదని అన్నారు. అవును నిజమే. నాకు సొంత ఆస్తులు పెంచుకోవడం రాదు. అమరావతి నుంచి పోలవరం వరకు తన ఆస్తులు పెంచుకోవడానికి చంద్రబాబు ప్రయతి్నస్తున్నారు. సొంత ఆస్తులు పెంచుకునే ఆశ నాకు లేదు. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి (చంద్రబాబును ఉద్దేశించి) వాస్తవాలను వదిలిపెట్టి అసత్యాలు మాట్లాడుతున్నారంటే ఆయన ప్రజల మద్దతు కోల్పోయారని అర్ధం. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ వ్యక్తి ఏదో పెద్ద తప్పు చేశారనే అర్ధం...’‘ప్రజలారా మీరే చెప్పండి.. ఎన్టీఆర్ వారసత్వాన్ని తీసుకున్నాయన (చంద్రబాబును ఉద్దేశించి) ఎన్టీఆర్ కలలను సాకారం చేస్తానని మాటిచ్చారా లేదా...? ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తామని హామీ ఇచ్చారా లేదా?.. ఈ రోజు ఆయన ఎన్టీఆర్కు గౌరవమిస్తున్నారా?... సోదర సోదరీమణులారా మీకు ఈ విషయం అర్ధమవుతుంది. ఆయనలాంటి(బాబు) సీనియర్ నాయకుడికి ఎందుకు అర్ధం కావడం లేదు. పార్టీ చరిత్రనే ఆయన మరిచిపోయేంతటి ఒత్తిడి ఏం వచి్చంది. ఇదంతా యువత తెలుసుకోవాల్సిన అవసరముంది.. ఎన్టీఆర్ ఏపీకి కాంగ్రెస్ నుంచి విముక్తి కావాలనుకున్నారు. అందువల్లే తెలుగుదేశం అవిర్భవించింది. ఈ రోజు ఆ వారసత్వపు అహంకారాన్ని ఎదుర్కోవాల్సిన తెలుగుదేశం అధినేత అదే వంశపారంపర్య కుటుంబం ముందు మోకరిల్లారు. అప్పట్లో ఏపీని అవమానించిన కాంగ్రెస్ను దుష్టకాంగ్రెస్ అని ఎన్టీఆర్ అన్నారు. ఇప్పుడు చంద్రబాబు అదే కాంగ్రెస్తో దోస్తీ కట్టారు...’2019 ఫిబ్రవరి 10... గుంటూరు సభలో ప్రధాని మోదీ..‘చంద్రబాబుకు ఏమైంది. ఆయన నా కంటే చాలా సీనియర్నని మళ్లీ మళ్లీ నాకు గుర్తు చేస్తుంటారు. ఇందులో వివాదం ఏముంది. మీరు (చంద్రబాబు) సీనియర్. అందువల్లే గౌరవమిచ్చే విషయంలో ఎప్పుడూ తక్కువ చేయలేదు.. అవును మీరు సీనియర్ కూటములు మార్చడంలో.. కొత్త కూటములు కట్టడంలో.. మీ సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో.. ఈ రోజు ఎవరినీ తిడతారో.. రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో.. నేనైతే ఈ విషయాల్లో సీనియర్ను కానే కాదు...’‘కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను చేపట్టిన పథకాలపై.. చంద్రబాబు తన స్టిక్కర్ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. అద్భుతమైన అమరావతి నిర్మాణమంటూ వ్యక్తిగత అభివృద్ధిలో బిజీ అయిపోయారు. చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. కూలిపోతున్న తన పార్టీ నిర్మాణం...’2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు మోదీని ఉద్దేశించి వివిధ సందర్భాల్లో చేసిన తీవ్ర విమర్శలు... –మార్చి 29, 2018న అసెంబ్లీలో చంద్రబాబుబీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే ఇంకా 15 సీట్లు వచ్చేవి.. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం ఎన్డీఏ నుండి బయటకు వస్తే.. అది రాజకీయ ప్రయోజనాల కోసం అని మాట్లాడుతున్నారు. నిజంగా నేను రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనుకుని ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే.. ఇంకో 15 సీట్లు ఎక్కువ వచ్చేవి...’ఫిబ్రవరి 8, 2019 తన ట్విట్టర్లో చంద్రబాబు‘దేశ రక్షణ రంగంలో అతి పెద్ద కుంభకోణంగా పేర్కొంటున్న రూ. 59,000 కోట్ల రఫెల్ ఒప్పందం, అందుకు సంబంధించిన నివేదికలు, ఇందులో నేరుగా ప్రధాని కార్యాలయ ప్రమేయం ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటుంటే, దానిపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వ విధ్వంసక నిర్ణయాలను తెలియజేస్తుంది. మోదీజీ... మీరు దేశాన్ని మోసం చేస్తే ఆ సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేరు...’ –2019 ఫిబ్రవరి 2న అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు..‘మీకూ, బ్రిటిష్ వాళ్లకూ తేడా ఏమిటి? వాళ్లే నయం. కాటన్ దొర ఇచి్చన నీళ్లయినా తాగుతున్నాం. మేము మీ బానిసలమా? రాజధానిని 50 ఏళ్లకు నిరి్మస్తారా ? నాలాంటి సీనియర్ నాయకుడు నల్ల చొక్కా వేసుకున్నానంటే వీళ్లు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ప్రజలు అర్ధం చేసుకోవాలి. 2002లో మోదీ, నిన్న అమిత్షా రాకీయాల్లో వచ్చారు. నేను 1978లోనే నేను ఎమ్మెల్యేనయ్యా. ప్రధాని మోదీని సార్ అంటూ గౌరవిస్తే అమరావతికి మట్టి, నీరు ముఖాన కొట్టిపోతారా?..’‘రాష్ట్రం కోసం 29 సార్లు తలవంచుకుని ఢిల్లీ వెళ్లా. కేంద్రం ముందు చేయి చాచా. ఎలాంటి కనికరం లేదు. ప్రజలుగా మీరు చెప్పండి...’ –2018 జూన్ 9న నెల్లూరులో సభలో చంద్రబాబు‘బీజేపీకి ఒకటే చెబుతున్నా, తెలుగుదేశంతో పెట్టుకుంటే ఖబడ్డార్.. మీ కుట్రలు ఏ రాష్ట్రంలోనైనా చెల్లుతాయోమో... ఆంధ్రప్రదేశ్లో మాత్రం సాగవు...’ –2018లో శృంగవరపుకోటలో జరిగిన నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు‘నేను ఎవరికీ భయపడేది లేదు, నరేంద్ర మోదీ, ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బందులు పెడితే భయపడే పిరికి పందను కాను. ఒక్కో రాష్ట్రంలో ఉండే నాయకత్వాన్ని బలహీన పరచడానికి, ఇష్టమొచి్చనట్లు ఆడుకోవడం వీళ్లకు అలవాటైంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను చూశాను. ఎప్పుడూ భయపడలేదు. భయమనేది నా జీవితంలేదు. –2018లో మార్చి 6 న విజయవాడలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు...’2019 మార్చి 2వ తేదీన విశాఖపట్నం సభలో ప్రధాని మోదీ..‘దేశం కోసం మేం గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామంటే మాకెటువంటి బెరుకూ లేదు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే వెనుక ఎవరైనా వచ్చి మా ఫైళ్లు తెరుస్తారనో, అవినీతి ఆరోపణలు చేస్తారనో భయం నాకే మాత్రం లేదు. ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు (చంద్రబాబును ఉద్దేశించి) భయపడాలి. ఎందుకంటే వారు చేసిన అవినీతి వారిని ఎప్పుడూ వెంటాడుతుంది. ఈ విషయం వారికి తెలుసు. అవినీతి చేయడంలో, ముఖ్యమంత్రిగా ఉంటూ తన కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేసి తప్పు చేశారని వారికి తెలుసు...’ఏప్రిల్ 1, 2019న రాజమండ్రిలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో మోదీ..‘కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందించినప్పటికీ, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే చిత్తశుద్ధి మాత్రం ఈ టీడీపీ ప్రభుత్వానికి లేదు. ఎప్పుటికప్పుడు పోలవరం ప్రాజెక్టు ఖర్చు అంచనాలను పెంచుతూ, ఎక్కువ డబ్బు పొందుతూ చంద్రబాబుకు ఈ ప్రాజెక్టు ఒక ఏటీఎంలా మారింది. అందులో నుంచి డబ్బులు తీసేసుకోవడమే. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు అంచనాలను పెంచడం ద్వారా ఎవరికి మేలు చేయాలని యూ టర్న్ బాబు అనుకుంటున్నారో మీ అందరికీ తెలుసు. రాష్ట్ర రైతుల క్షేమం కాదు, ఎవరి క్షేమం కోసం ఆయన ఆలోచిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ అర్ధం చేసుకోగలరు.’ ‘యూ టర్న్ బాబు (చంద్రబాబును ఉద్దేశించి) పరిస్థితి ఎలా ఉందంటే బాహుబలి సినిమాలో రాజు భల్లాలదేవుడి పాత్ర మాదిరే. తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని తిరిగి దాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలకైనా వెనుకాడడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించేవారైతే.. ఇక్కడి యూ టర్న్ బాబు మాత్రం తన కుటుంబం మొదట, ఆ తర్వాత తన అనుయాయులు అన్నట్టు పాలన సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హెరిటేజ్ (సంస్కృతి) మంచి పాలనతో రాస్ట్ర ప్రజలందరూ అభివృద్ధి చెందాలన్నదైతే... యూ టర్న్ బాబు నైజం మాత్రం తన సొంత హెరిటేజ్ (చంద్రబాబు కుటుంబీకుల వ్యాపార సంస్థ పేరు) కంపెనీ బాగుంటే చాలన్న తీరు...’పోలవరం ఆలస్యానికి బాబే కారణం..పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి కారణం ముమ్మాటికీ నాటి సీఎం, నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబే. కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు మ్యాన్యువల్ను తుంగలో తొక్కి.. వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేయకుండానే– ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ను నిరి్మంచారు. గోదావరికి 2019, 2020లలో వచి్చన భారీ వరదలు.. ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడం వల్ల డయాఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది.ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతం కోతకు గురై విధ్వంసం చోటుచేసుకుంది. పోలవరాన్ని కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారంటూ గత ఎన్నికల ప్రచారంలో 2019, ఏప్రిల్ 1న రాజమహేంద్రవరం సభలో ప్రధాని నరేంద్ర మోదీ కన్నెర్ర చేయడం అప్పట్లో సంచలనం రేపింది. పోలవరం జాప్యానికి చంద్రబాబు తప్పిదమే కారణమని ఫిబ్రవరి 6న రాజ్యసభలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటించారు.వాస్తవాలు ఇలా ఉంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్లే పోలవరం పనులు ఆగిపోయాయంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీసత్యసాయిజిల్లా ధర్మవరంలో నిర్వహించిన సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. సోమవారం రాజమహేంద్రవరం సభలో ప్రధాని నరేంద్ర మోదీ అదే మాటను వల్లె వేయడం గమనార్హం. అయితే డయాఫ్రమ్వాల్పై కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను రీయింబర్స్ చేయకుండా ఇలా ఆరోపణలు తగవని నీటిపారుదల రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.‘విభజన హామీలను నాలుగు బడ్జెట్లలోనూ పట్టించుకోలేదు. చివరి బడ్జెట్లోనూ ఏపీ పేరు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రయత్నం చేయలేదు. ఈ రాష్ట్రం ఒకటి ఉందన్న ఆలోచన లేదా? ఏం ప్రధాని ఓ గంట సమయం ఇవ్వలేరా? మిత్రపక్షంగా రండి. కూర్చుందాం అని అన్నారా...? మీరొక్కరే దేశాన్ని కాపాడతారా. ఏం మీకొక్కరికే దేశభక్తి ఉందా?..’ –2018 మార్చి 7న ఓ సమావేశంలో చంద్రబాబు..‘భార్యనే చూసుకోని వాడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు?....’ – అసెంబ్లీలో చంద్రబాబు తన ప్రసంగంలో..‘నరేంద్ర మోదీ కరుడుకట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు...’ – 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం నాయకుల సమావేశంలో చంద్రబాబు -
తోడేళ్ళను తరిమే రోజు!
ఒక్కసారి మనం డెబ్బయ్యేళ్లు వెనక్కు వెళ్లాలి. వర్తమాన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనల్ని ఆ జ్ఞాపకం వైపు బలవంతంగా నెడుతున్నాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి 1953లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. తెలంగాణతో కలిసి ఇంకా ఆంధ్ర ప్రదేశ్గా అవతరించకముందు 1955లో శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. నాటి ఆంధ్ర రాష్ట్రం, నేటి ఆంధ్ర ప్రదేశ్ల భౌగోళిక స్వరూపం ఒక్కటే!ఆ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రభంజనం కనిపించింది. అప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా కూడా కమ్యూనిస్టులు బ్యాలెట్ ద్వారా అధికారంలోకి వచ్చిన ఉదంతాలు లేవు. ఆ విషయంలో ఆంధ్ర రాష్ట్రం రికార్డు సృష్టించ బోతున్నదనే అంచనాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రిగా సుందరయ్య, హోంమంత్రిగా చండ్ర రాజేశ్వరరావు, ఆర్థిక మంత్రిగా మాకినేని బసవపున్నయ్య వగైరా పేర్లతో కేబినెట్ కూర్పుపై కూడా ప్రచారం జరిగింది. సరిగ్గా ఈ దశలోనే పెత్తందారీ ముఠా, వారి అజమాయిషీలోని మీడియా రంగప్రవేశం చేశాయి.అప్పట్లో దున్నేవానికే భూమి అనేది కమ్యూనిస్టుల నినాదం. ఆ మేరకు భూసంస్కరణలు అమలు చేస్తామని వారు వాగ్దానం చేశారు. ఇది చాలు పెత్తందార్లకు! వారి చేతుల్లో వున్న ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి ఆనాటి ప్రముఖ పత్రికలు ఆయుధాలు బయటకు తీశాయి. కమ్యూనిస్టులు గెలిస్తే రైతుల భూములను లాక్కుంటారు. కమ్యూనిస్టులు గెలిస్తే ప్రజల ఇళ్లలో ఉన్న డబ్బును, బంగారాన్ని ఎత్తుకుపోతారు. వృద్ధులు పని చేయలేరు కనుక వారిని ప్రత్యేక క్యాంపుల్లో పెడతారు లేదా చంపేస్తారు. రష్యాలో, చైనాలో ఇలాగే చేస్తున్నారు. చివరికి మీ భార్యల్ని కూడా జాతీయం చేస్తారు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్న మవుతుంది... ఈ రకమైన అభాండాలను అచ్చేసి అడ్డగోలుగా ప్రచారంలో పెట్టారు.ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేంత పబ్లిసిటీ దన్ను ఆనాడు కమ్యూనిస్టులకు లేదు. వాళ్లకున్నది ‘విశాలాంధ్ర’ ఒక్కటే. పార్టీ ముద్ర కారణంగా దానికీ పరిమితులున్నాయి. ఇటువంటి నిస్సహాయ స్థితిలోనే మహాకవి శ్రీశ్రీ గుండెలోంచి తన్నుకొచ్చిన ఆక్రోశం చాలామందికి గుర్తున్నది. ‘పెట్టుబడికీ కట్టుకథకూ పుట్టిన విషపుత్రిక ఆంధ్రపత్రిక’ అని ఈసడించుకున్నారు. నాటి ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ల అరాచకాన్ని ఒక లక్షతో హెచ్చ వేస్తే నేటి ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’, ‘టీవీ5’, ‘ఏబీఎన్’, ‘ఈటీవీ’ల అరాచకం విలువెంతో తెలుస్తుంది. ఆ ప్రత్యేక సందర్భం తర్వాత∙నాటి పత్రికలు మళ్లీ తటస్థ స్థితికి చేరు కున్నాయి. కానీ మన యెల్లో మీడియా మాత్రం గత పదేళ్లుగా ఆదే యజ్ఞంలో తలమునకలై ఉన్నది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పెత్తందారీ వర్గాల ప్రతినిధిగా, ప్రయోక్తగా, ప్రవక్తగా గడిచిన మూడు దశాబ్దాల్లో చంద్రబాబు ఇంతింతై అన్నట్టుగా ఇనుమడించడం మనకు తెలిసిన సంగతే. ఇదే కాలంలో మన యెల్లో మీడియా చంద్రబాబు తరఫున గ్రామ సింహాల పాత్రను పోషిస్తే, బదులుగా ఆయన వారికి సెక్యూరిటీ గార్డు పాత్రను పోషిస్తూ వస్తున్నారు. ఈ ముప్ప య్యేళ్లలో పధ్నాలుగేళ్లపాటు బాబు ముఖ్యమంత్రి పాత్రను పోషించారు. ఆయనకు వాలతుల్యుడనదగ్గ కిరణ్కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరఫున నాలుగేళ్లు గద్దె మీద కూర్చున్నారు. రాష్ట్రంలోని పేదల అభ్యున్నతి కోసం, సాధికారత కోసం అమలైన కార్య క్రమాలన్నీ వీరి కాలం మినహా మిగిలిన సమయంలోనే జరగడం ఎవరైనా గమనించవచ్చు.ప్రజలందరికీ విద్య, వైద్యసేవలు అందజేయడం ప్రభుత్వ బాధ్యతగా నాగరిక సమాజం గుర్తిస్తున్నది. ఆ రంగాల్లో సేవలు ప్రభుత్వం బాధ్యత కాదని బాహాటంగా ప్రకటించి, వాటిని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు నర్తనశాలగా మార్చిన అనాగరిక రాజకీయవేత్త చంద్రబాబు. ఫలితంగా ప్రభుత్వ బడులు కునారిల్లిపోయాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల్ని ప్రైవేట్ బడులకు పంపి అప్పులపాలయ్యారు. నిరు పేదల బిడ్డలు చదువుకు దూరమయ్యారు. ఒక తరం పేద, మధ్యతరగతి వర్గాల కలలను కాటేసిన చరిత్ర చంద్రబాబుది. అలాగే ప్రైవేట్ వైద్యసేవల బలిపీఠాన్నెక్కి లక్షలాది కుటుంబాలు కృశించి, నశించిపోయాయి.వ్యవసాయం దండగనేది ఆయన చేసిన ఒక క్రూర పరిహాసం. ఫలితంగా రైతులు పిట్టల్లా రాలిపోవడం బాబు జమానాలోనే ప్రారంభమైంది. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు, నకిలీ మందులకు వ్యవసాయం వేదికైంది. రైతులను భూముల నుంచి వెళ్లగొట్టి వేల ఎకరాల భూములను కార్పొరేట్ శక్తులకు కైంకర్యం చేసే విధానాలను బాబు అవలంబించారు. ఈ క్రమంలోనే ఫిలిం సిటీ పేరుతో రామోజీ దాదాపు మూడువేల ఎకరాలు పోగేశారు. అన్నిరకాల భూచట్టాలూ రామోజీ భూదాహం ముందు చట్టుబండలయ్యాయి. వేలాది ఎకరాల్లో వ్యవసా యాన్ని అటకెక్కించి కార్పొరేట్ సంస్థలు కంచెలు వేసు కున్నాయి. పేదల జీవితాలను కాల్చుకుతింటున్న చంద్ర బాబులో పచ్చమీడియాకు ఓ విజనరీ కనిపించాడు.ఐదేళ్ల కింద ఆంధ్రప్రదేశ్లో ఒక తేడా వచ్చింది. చంద్రబాబుకూ, యెల్లో మీడియాకూ అది చిన్న తేడా ఏమీ కాదు. యెల్లో ‘విజనరీ’ విధానాలను కొత్త ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి తలకిందులు చేశారు. ప్రజలిచ్చిన అధికారం గుప్పెడుమంది పెత్తందార్ల కోసం కాదు, పురోగ మనం కోసం పోరాడుతున్న విశాల ప్రజానీకం కోసం అనేది ఆయన విధానం. జగన్మోహన్రెడ్డి విధానాలకు, మన పెత్తందారీ ఏజెంట్ల విధానాలకు ఘర్షణ ఏర్పడింది. పెత్తందార్ల కూటమి జగన్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించింది. జగన్ ప్రభుత్వ విధానాల వల్ల ఊపిరి పీల్చుకున్న పేదవర్గాల ప్రజలు ఆయన వెనుక సైన్యంగా మోహరించారు. పేదలు – పెత్తందార్ల మధ్య మహాయుద్ధానికి ముహూర్తం ఖాయమైంది.ఈ అయిదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వంపై యెల్లో మీడియా సాగించిన దుష్ప్రచారం అన్ని రికార్డులనూ బద్దలు కొట్టింది. గోబెల్స్ బతికి వుంటే సిగ్గుపడి ఉండేవాడు. శ్రీశ్రీ బతికి ఉంటే ఏమని కామెంట్ చేసేవాడో ఊహించుకోవలసిందే. తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా ప్రచారం చేయని రోజు ఈ అయిదే ళ్లలో ఒక్కటీ లేదు. అయినా ప్రజాభిప్రాయాన్ని యెల్లో మీడియా పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నది. దీంతో వారిలో నిస్పృహ ఆవరించింది. అన్ని విలువల్నీ వదిలేశారు. వస్త్రవిసర్జన చేసి దిగంబర వీధినర్తనం మొదలుపెట్టారు. పోలింగ్ పది రోజులుందనగా తయారుచేసిన రెండు వింత కథల మీద ప్రాణం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ఇందులో మొదటిది ఏమాత్రం క్రియేటివిటీ లేకుండా అల్లిన ఓ కట్టుకథ. ‘మీ భూమి మీది కాదు’ అనే పేరుతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ‘బాధితుల’ కథనాలను ‘ఈనాడు’ అచ్చేసింది. చట్టం పేరులోనే దాని ప్రాముఖ్యత ఉన్నది. భూమిపై రైతుకున్న యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం హామీ పడి ధ్రువీకరించే చట్టం. ఒకసారి ఈ చట్టం అమలులోకి వస్తే భూ వివాదాలు శాశ్వతంగా పరిష్కారమవుతాయి. దొంగ కాగితాలు సృష్టించి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే చార్మినార్కు కూడా సేల్ డీడ్ ఇచ్చే అధ్వాన్నమైన పరిస్థితులు ఎన్నిసార్లు ఎదురు కావడం లేదు? నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకులను కొల్లగొట్టే దళారీల వృత్తాంతాలు ఎన్ని బయటకు రావడంలేదు? ఎన్ని వేల భూతగాదాలు కోర్టు వ్యాజ్యాల్లో దశాబ్దాల తరబడి నలిగి పోవడం లేదు? గొడవలతో ఎంత రక్తం పారి ఉంటుంది? ఎన్ని హత్యలు జరిగి ఉంటాయి? ఇదిగో ఇటువంటి వివాదాలను పరిష్కరించే సమగ్ర హక్కులను యజమానికి కల్పించి, అందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. ఇందులో భాగంగా మొదట భూముల సమగ్ర సర్వే జరుగుతోంది. గ్రామ ప్రజల సమక్షంలో సరిహద్దులను నిర్ధారించి రైతుకు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. వందేళ్ల తర్వాత సర్వే జరిపి యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం ఇస్తున్న పాస్బుక్ ఇది. ఆ హక్కుకు ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీకి గుర్తుగా సర్వే జరిగిన కాలపు ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి ఫోటోను కూడా పాస్బుక్పై ముద్రిస్తున్నారు. దీన్ని కూడా టీడీపీ – యెల్లో మీడియా వివాదం చేయడం చూస్తున్నాము.అన్ని గ్రామాల్లో సర్వే పూర్తిగా జరిగిన తర్వాత చట్టం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసి, వాటిపై గ్రామసభల్లో చర్చలు జరిగిన తర్వాత తుది మార్గదర్శకాలు జారీ అవుతాయి. ఆ తర్వాతనే చట్టం అమల్లోకి వస్తుంది.ఇదంతా జరగడానికి ఇంకో ఏడాది పట్టవచ్చు. రెండేళ్లు పట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వంలోని ‘నీతి ఆయోగ్’ సూచనలకు అనుగుణంగా ఈ చట్టం రూపకల్పన జరుగుతున్నది. అన్ని రాష్ట్రాల్లోనూ భూయజమానికి మేలు చేసే ఈ చట్టం వచ్చి తీరుతుంది. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను ముందుకు కదిలించింది. దీన్ని వ్యతిరేకిస్తున్న యెల్లో కూటమి పార్టీ ఎన్డీఏలో భాగంగా ఉన్నది. కానీ ఇంత వరకు ఈ చట్టంపై తమ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తావించకపోవడం తెలుగుదేశం అవకాశవాద వైఖరికి పరాకాష్ఠ. పచ్చమీడియా కూడా ఈ చట్టంపై ఒక్క మాటయినా కేంద్రం ప్రస్తావన చేయకపోవడం వెనకనున్న రహస్యమేమిటి?ఇక శనివారం నాడు ‘ఈనాడు’ రాసిన ‘మీ భూమి మీది కాదు’ అనే కల్పిత కథ జర్నలిజం ప్రమాణాలను పాతాళంలోకి తొక్కేసింది. ఇందులో ముగ్గురు బాధితుల పేర్లు రాశారు.అందులో అమలాపురం సుబ్బారావు ఒకరు. ఆయన భూమి ఎక్కడో చెప్పలేదు. సర్వే నెంబర్ తెలియదు. ఆయన భూమి తనదంటూ ఎవరో అధికారులకు దరఖాస్తు చేసుకున్నారట! ఆయనెవరో చెప్పలేదు. ఎవరికి దరఖాస్తు చేశాడో చెప్పలేదు. రెండేళ్ల తర్వాత సుబ్బారావు స్పందించలేదంటూ దరఖాస్తు చేసుకున్న వారి పేరు మీద భూమిని రాసేశారట! ఇదంతా ల్యాండ్ టైట్లింగ్ చట్టం మహత్యమట. అమల్లోకే రాని చట్టం రెండేళ్ల కిందనే పనిచేయడం ప్రారంభించిందని ‘ఈనాడు’ ఉవాచ!ఇక సాంబశివుడిది శ్రీకాకుళం జిల్లాలోని ఒక పల్లెనట! ఈ పల్లె పేరు చెబితే రామోజీ తల వెయ్యి ముక్కలవుతుంది కాబోలు. చెప్పలేదు! ఆయన భూమిని అమ్మడానికి వెళితే, ‘కొత్త రిజిస్టర్లో నీ పేరు లేద’ని అధికారులు చెప్పారట. అసలటు వంటి కొత్త రిజిస్టరు తమ దగ్గర ఏదీ లేదని అధికారులు ప్రకటించారు. గోవిందరెడ్డిది కర్నూలు జిల్లా. ఏ ఊరో చెప్పలేదు. ‘ఈనాడు’ ఆంధ్రా ఎడిషన్లోనే ఆయన గోవిందరెడ్డి. తెలంగాణ ఎడిషన్లో మాత్రం గోవిందయ్య. అంటే తెలంగాణకు వెళ్లిన ప్పుడల్లా ఆయన కులం తోకను కత్తిరించుకుంటాడు కాబోలు. ఆయన తన భూమిని తనఖా పెట్టాలనుకున్నాడట! బ్యాంకులో ఉండే డిస్ప్యూట్ రిజిస్టర్లో ఆయన పేరు ఉన్నదట! టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర క్లియరెన్స్ సర్టిఫికెట్ తెమ్మని బ్యాంకు వారు చెప్పారట. దాంతో గోవిందరెడ్డి ఉరఫ్ గోవిందయ్య ఆంధ్రాలో ఒకసారి, తెలంగాణలో ఒకసారి గొల్లుమన్నాడట! అసలు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనే పోస్ట్ అమల్లోకే రాలేదు. డిస్ప్యూట్ రిజిస్టరూ లేదు. చదివేవాడు వెర్రి వాడయితే... రాసేవాడు రామోజీ!పెన్షన్ల వ్యవహారంపై తెలుగుదేశం – యెల్లో మీడియాలు నడిపిస్తున్న వ్యవహారంలో మరో వింతకథ. వలంటీర్ వ్యవస్థకే ఈ పెత్తందార్లు వ్యతిరేకం. తమ వ్యతిరేకతను వాళ్లు దాచుకోనూ లేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్లు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు గమనించారు. ఇంటి దగ్గరే ఒకటో తారీఖు పొద్దున్నే వలంటీర్లు గత ఐదేళ్లుగా పింఛన్లు అంద జేస్తున్నారు. దాంతో అవ్వాతాతలు, దివ్యాంగులు భరోసాతో బతుకుతున్నారు. వలంటీర్లు విధుల్లో పాల్గొనకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ తరఫున వారి ఏజెంటు నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి యెల్లో మీడియా వంత పాడింది. దాంతో వలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.ఈసీ సూచనల మేరకు ఏప్రిల్లో విలేజ్ సెక్రటేరియట్లలో పెన్షన్లు అందజేశారు. దీనిపై వృద్ధుల్లో వ్యతిరేకత వచ్చింది. గాభరాపడ్డ తెలుగుదేశం బృందం మళ్లీ నిమ్మగడ్డను పంపించి బ్యాంకు ఖాతాల్లో జమ చేయించాలని ఈసీకి దరఖాస్తు పెట్టారు. ఈసీ సూచనలకు అనుగుణంగా మే నెలలో బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేశారు. ఇక వృద్ధుల బాధలు వర్ణనాతీతం. వారి శాపనార్థాలతో కంగారు పడిన యెల్లో ముఠా వృద్ధుల బాధలకు జగన్ ప్రభుత్వమే కారణమనే విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. దొంగతనం చేసినవాడే ‘దొంగా దొంగా’ అని అరిచినట్టు! జగన్మోహన్రెడ్డి సభలకు మండుటెండల్లో కూడా వెల్లువెత్తుతున్న జనప్రవాహంతో కూటమి వణికిపోతున్నది. ఈ రెండు అంశాలపై అబద్ధాలను ప్రచారం చేసి గట్టెక్కాలన్న దింపుడు కల్లం ఆశ దానిలో కనిపిస్తున్నది.ఇంకో వారం రోజుల్లో పోలింగ్ జరగబోతున్నది. ఇది పేద వర్గాలకు అందివచ్చిన అద్భుతమైన అవకాశం. పేద బిడ్డల ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తున్న, వారి నాణ్యమైన చదువు లను వ్యతిరేకిస్తున్న పెత్తందార్లను చావచితక్కొట్టడానికి ఇదో అవకాశం. పేదల సాధికారతను, మహిళల సాధికారతను సహించలేకపోతున్న పెత్తందార్లను పరుగెత్తించడానికి ఇంకో వారం రోజుల్లో అమూల్యమైన అవకాశం ఉన్నది. బలహీన వర్గాలకు ఉన్నత పదవులు ఇస్తే, ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే టిక్కెట్లు, ఎంపీ టిక్కెట్లు కేటాయిస్తే ఓర్వలేకపోతున్న పెత్తందార్లకు బుద్ధి చెప్పడానికి ఇదో గొప్ప అవకాశం. అబద్ధాలనూ, అభూత కల్పనలనూ, కట్టుకథలనూ ప్రచారంలో పెడుతూ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే గాక సమాజంలో అశాంతిని రేకెత్తి స్తున్న పెత్తందారీ తోడేళ్లను తరిమి తరిమి కొట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది?వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
'పవర్'లెస్.. భ'జనసేన' మాకొద్దు!!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తాను ఎదగాలని ఏ రోజూ కోరుకోలేదని మొన్న కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఇంద్రపాలెం, సామర్లకోట సభల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా వల్లె వేశారు. తాను కులాలకు అతీతమంటూనే కాపులకు ప్రాధాన్యమేదని ప్రశ్నిస్తారు. రాష్ట్రమంతా జల్లెడ పట్టి ఆ సామాజిక ఓటర్లు అధికంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇతర కులాల పట్ల విద్వేష పూరితంగా మాట్లాడతారు. గతంలో టీడీపీని పలుమార్లు తూర్పారబట్టిన పవన్.. ఇప్పుడు అదే పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ తన ఫ్యాన్స్ నుంచే ప్యాకేజీ స్టార్గా గుర్తింపు పొందారు. బీజేపీని తీవ్రంగా నిందించిన ఆ నోటితోనే అత్యద్భుతమని పొగుడుతారు. మాటలో నిజాయితీ, వ్యవహారంలో స్థిత ప్రజ్ఞత, మనిíÙలో స్థిరత్వం మచ్చుకైనా కనిపించని పవన్ నాయకత్వంలోని భ‘జనసేన’లో ఇక కొనసాగలేమని పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు.నేను ప్రశ్నిస్తాను.. నిలదీస్తాను.. ఎదిరిస్తాను.. అంతు తేలుస్తాను.. ప్రజల పక్షాన నిలుస్తాను... అంటూ నిత్యం ఊగిపోతూ డాంబికాలు పలికే జనసేనాని పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ నాయకులు, క్యాడర్ ప్రశ్నలకు కనీస స్థాయిలో సమాధానం చెప్పుకునే స్థితిలో లేరనే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతల నుంచి తమకు ఎదురవుతున్న తీవ్ర అవమానాలు, అసహనాలు, ఈసడింపులు, ఛీత్కారాలను తట్టుకోలేకపోతున్నామని జన సైనికులు ఆవేదన చెందుతున్నారు.జనసేనాని తీరుతోనూ వరుసగా పార్టీని వీడిపోయే వారే తప్ప కొత్తగా వచ్చి చేరేవారు మచ్చుకు ఒక్కరూ కనిపించడం లేదంటున్నారు. జనసేన ఆవిర్భావ సమయంలో ఏదో సాధించేస్తారనే అంచనాలతో పవన్ పక్కన చేరిన మేధావులు, మాజీ ఉన్నతాధికారులు, సీనియర్ నాయకులకు ఆయన తత్వం త్వరగానే బోధపడి తమ దారి చూసుకున్నారు.రాజకీయాలపై ఆసక్తితో, ఏదో ఒకటి చేయకపోతారా, పార్టీని ముందుకు తీసుకెళ్లకపోతారా, మంచి రోజులు రాకపోతాయా? అనే ఆశతో ఇటీవలి వరకు కొనసాగిన వారికి మాత్రం తమ దింపుడు కల్లం ఆశలు ఆవిరై జనసేనకు జెల్లకొట్టి ఇతర పార్టీల్లోకి చేరిపోతున్నారు. కొందరేమో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేంటన్న భావనతో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ తాజా పరిస్థితులను గమనిస్తున్నారు. ఇంకొందరు పదవులపై ఆశలు వదులుకుని రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.కూటమిలో సీట్ల సర్దు‘పాట్ల’ను చూసిన తర్వాత దాదాపు రోజూ జనసేనలో రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి హోదా కలిగిన నాయకులు ‘పవన్.. నీకో నమస్కారం..’ అంటూ గుడ్ బై చెబుతూనే ఉన్నారు. చివరకు తోక పార్టీగా మారి సైకిల్ వెనుక తిరిగేలా, టీడీపీకి సేవ చేసుకునే ‘సేన’లా జనసేనాని చేసేశారని, కనీస గౌరవ మర్యాదలూ దక్కడం లేదని జనసేన శ్రేణులు మధన పడుతున్నాయని ఆ పార్టీని వీడిన వారు వివరిస్తున్నారు. ప్రతి అడుగులోనూ తొట్రుపాటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తామనే అంచనాలతో కొణిదెల చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవిచూశారు. కాలక్రమంలో జెండా ఎత్తేసి కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పదవిని అనుభవించారు. అన్నకు తోడుగా ప్రజారాజ్యంలో యువరాజ్యం చీఫ్గా చలామణీ అయిన పవన్ కళ్యాణ్.. 2014 ఎన్నికలకు ముందు ‘జనసేన’ను స్థాపించినప్పటికీ ప్రతి అడుగులోనూ తొట్రుపాటే కనిపిస్తోందనేది రాజకీయ విశ్లేషకుల మాట.పార్టీ ఆవిర్భావంలో టీడీపీ, బీజేపీలతో జత కట్టిన పవన్, ఏ ఎండకా గొడుగు అన్నట్లు ఎక్కడి మాటలు అక్కడ మాట్లాడుతూ తన అవసరాలు కానిచ్చేసుకుంటూ వచ్చారు. 2019 నాటికి టీడీపీకి మేలు చేసేలా ‘రహస్య ఒప్పందాలు’తో తన జనసేనే ప్రత్యామ్నాయమనే రీతిలో ఎన్నికల బరిలోకి దిగి.. గాజువాక, భీమవరంలో పోటీచేసి ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీలతో కూటమి కట్టిన పవన్.. చంద్రబాబు కోసం నానా ప్రయాసలకు లోనవుతూ తన నటనానుభవాన్ని రంగరించారు.చివరకు 21 అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాలకు అంగీకరించి ప్రత్యక్ష రాజకీయాల్లో తలపడాలనుకున్న అనేక మంది ఆశావహులపై నీళ్లు చల్లారు. పిఠాపురం నుంచి స్థానికేతరుడిగా బరిలో నిలిచి .. స్థానికురాలు, విద్యావంతురాలు, సీనియర్ రాజకీయవేత్త అయిన వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీతతో పోటీ పడటానికి కిందామీదా పడుతున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మేధావి వర్గం ముందే మేల్కొని.. తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పని చేసిన ఆర్.ఆర్.రామ్మోహన్రావు, సీబీఐ మాజీ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి జె.డి.లక్ష్మీనారాయణ, ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి, మాదాసు గంగాధరం, ముత్తంశెట్టి కృష్ణారావు, రాఘవయ్య, బైరా దిలీప్, ఆకుల చంద్రశేఖర్ లాంటి వారెందరో పవన్ రాజకీయ పరిజ్ఞానాన్ని, వ్యవహార శైలిని పసిగట్టి పక్కకు తప్పుకున్నారు.రాజకీయాలపై ఆశలున్న వారు పలువురు పార్టీలోకి అడుగిడి రూ.కోట్లు, లక్షలు పోగొట్టుకున్న తర్వాత మేల్కొని దూరమయ్యారు. తాము ఏ విధంగా మోసపోయిందీ ఏకరువు పెట్టారు కూడా. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పవన్ ఓడిపోయినా, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ గెలుపొందారు. çపలు నియోజకవర్గాల్లో గౌరవప్రదమైన ఓట్లను పొందిన జనసేన అభ్యర్థులకు తాజా ఎన్నికల్లో కూటమి తరఫున సీట్లు సాధించుకోవడంలోనూ పవన్ పూర్తిగా విఫలమయ్యారు.విజయవాడ వెస్ట్లో బీసీ వర్గానికి చెందిన పోతిన మహేష్ ఉమ్మడి కృష్ణాలో బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ, గుంటూరు జిల్లాలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, చిల్లపల్లి శ్రీనివాసరావు, అప్పారావు, నేరెళ్ల సురేష్ దర్శికి చెందిన ఎన్ఆర్ఐ వెంకట్, తూర్పుగోదావరికి చెందిన తుమ్మల బాబు, శెట్టిబత్తుల రాజబాబు, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, పాతంశెట్టి సూర్యచంద్ర తదితరులు జనసేన బాధిత వర్గంగా మిగిలిపోయారు. అవనిగడ్డ సీటు ఆశించిన వారిదీ అధోగతేనని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.కొన్ని జిల్లాలకే పరిమితం..రాష్ట్ర స్థాయి పార్టీగా ఆవిర్భవించిన జనసేనను పవన్ కళ్యాణ్ తన అపరిపక్వతతో అతి తక్కువ సీట్లతో కొన్ని జిల్లాలకే పరిమితం చేశారని పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు. ఆ సీట్లు కూడా చాలా మంది టీడీపీ నేతలకే ఇచ్చారు. జనసేన ఆవిర్భవించి దశాబ్ద కాలమైనా సంస్థాగతంగా కనీస స్థాయిలో బలపడలేదు. చివరకు పార్టీ గుర్తునూ సక్రమంగా దక్కించుకోలేని స్థితిలోకి జనసేన దిగజారింది. ‘జనసేన అధినేత పవన్కళ్యాణ్ మాటలను, ఆయన బంధం వ్యవహారాలను అంచనా వేసుకోలేక అమెరికా నుంచి కుటుంబం మొత్తం వచ్చి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయాం.కోట్ల రూపాయలు పోగొట్టుకుని నష్టపోయాం. సీటు ఇస్తామంటూ మోసం చేశారు’ అని దళిత మహిళ సి.సుభాషిణి ఆవేదనలో జనసేన చేతిలో దెబ్బతిన్న వారందరి గుండె ఘోష వినిపిస్తోంది. జనసేన నాయకులు, కార్యకర్తలు తమ వెంట నడవడానికి, వేదికను పంచుకోవడానికి కూడా పలువురు టీడీపీ నాయకులు అంగీకరించడం లేదంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదని జనసేన నేతలు వాపోతున్నారు. పవర్ లెస్!పిఠాపురంలో పని చేయని పవన్ మానియా అందుకే మెగా ఫ్యామిలీని దింపుతున్నారని చర్చ పలువురు బుల్లితెర నటులు సైతం ప్రచారం ఇంత మంది వస్తే గానీ నెగ్గలేనని అనుమానం! తానొక్కడిని గెలిస్తే చాలనుకుంటున్న వైనంజనసేన అభ్యర్థుల గెలుపుసంగతేమోగానీ, పిఠాపురంలో తాను గెలిస్తే చాలనే స్థితికి వచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నాయకుడిగా తాను నిలబెట్టిన వారి గెలుపు సంగతి పక్కనబెట్టి, అధిక సమయం తన కోసమే కేటాయించుకున్నారని ఆ పార్టీ నేతల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తానొక్కడే గెలిచి అసెంబ్లీకి వెళితే చాలన్నట్టుగా ఉంది ఆయన శైలి అని జనసేన శ్రేణులు వాపోతున్నాయి.పవన్ అన్న నాగబాబు నెల రోజులుగా పిఠాపురంలోనే తిష్ట వేశారు. నాగబాబు తనయుడు వరుణ్తేజ్ ఇప్పటికే ఇక్కడ ప్రచారం చేశారు. నాగబాబు భార్య సైతం మరిది కోసం ప్రచారంలో పాలు పంచుకున్నారు. పవన్ మేనల్లుడు వైష్ణవ తేజ్ కూడా పిఠాపురంలో తిరగాల్సిన పరిస్థితి. వీరికితోడు జబర్దస్త్ టీం మొత్తం ఇక్కడ వాలిపోయింది. అయినప్పటికీ పిఠాపురంలో ప్రచారం సరిపోదనుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అందువల్లే మెగాస్టార్ చిరంజీవిని పిఠాపురంలో ప్రచారానికి రప్పిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.పదుల సంఖ్యలో తారలు దిగి వస్తున్న తీరు చూస్తుంటే పిఠాపురంలో తన గెలుపుపై పవన్కు నమ్మకం లేదనేది స్పష్టమవుతోందంటున్నారు. ప్రచార ఆర్భాటం, మద్యం, డబ్బు లేని ఎన్నికలు రావాలని తెగ గొప్పలు చెప్పిన పవన్.. ఇప్పుడు రూ.కోట్లు వెదజల్లడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ దఫా ఎమ్మెల్యే కాకపోతే ఇక తన రాజకీయ జీవితం ముగిసినట్టే అని అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాలనే నిర్ణయానికి వచి్చనట్టు చెబుతున్నారు. ఇందులో మెగా హీరోలు, జబర్దస్త్ ఆరి్టస్టుల స్పెషల్ ఫ్లైట్ చార్జీలు, ఇతర ఏర్పాట్లకు అవుతున్న ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయంటున్నారు.ఒక పాన్ ఇండియా సినిమా బడ్జెట్ అంత ఖర్చుకు సిద్ధమయ్యారని ఇక్కడి ఏర్పాట్లు చూస్తుంటే ఇట్టే అర్థమవుతోంది. ఇంత ఖర్చు పెడుతున్నా అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను ఎదుర్కోవడం కష్టంగా ఉందని జనసేన నేతలు ఒప్పుకుంటున్నారు. కాగా, పిఠాపురంలో చక్రం తిప్పుతున్నానని చెప్పుకుంటున్న టీడీపీ నేత ఖర్చే భారీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకే రోజూ పెద్ద మొత్తంలో చెల్లించుకుంటున్నారని జనసేన నాయకులు చర్చించుకుంటున్నారు. -
మనిషి బీజేపీ.. మనసు టీడీపీ : ముత్యాలనాయుడు
నర్సీపట్నం: సీఎం రమేష్ను జిల్లా ప్రజలు ఎలాగూ నమ్మరని.. మనిషి బీజేపీ, మనసు టీడీపీ కావడంతో ఇరు పార్టీల కార్యకర్తలు సైతం ఆయనను విశ్వసించడం లేదని డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్గణేష్తో కలిసి గురువారం క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రమేష్లా తాను బ్యాంకులను మోసం చేయలేదన్నారు. దోపిడీలు చేయటం తనకు చేతకాదన్నారు.అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు చంద్రబాబు అనుమతితో ఆయన బీజేపీలో చేరారని, రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా ఏనాడూ స్టీల్ప్లాంట్ గురించి నోరు మెదపలేదన్నారు. స్థానికులకే ఎంపీ టికెట్ కేటాయించాలని తొలుత గట్టిగా మాట్లాడిన అయ్యన్నపాత్రుడు డబ్బుల కోసం సీఎం రమేష్కు సాగిలపడ్డారని విమర్శించారు.ఇక్కడి ప్రజలు విజ్ఞత కలిగినవారని, స్థానికేతర్లకు ఇక్కడ ప్రజలు పట్టం కట్టిన దాఖలాలు లేవన్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి డబ్బు సంచులతో దిగిన సీఎం రమేష్ ఓటర్లను కొనేయాలనుకుంటే.. ఆయన ఆటలు చెల్లవన్నారు. టీడీపీ నాయకులు అమ్ముడు పోతారేమో కాని ఓటర్లు మాత్రం డబ్బులకు లొంగిపోయే వారు కాదన్నారు.ప్రజల కలలకు వాస్తవ రూపం..సీఎం రాష్ట్ర ప్రజల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోకు రూపకల్పన చేశారని, వారి కలలకు వాస్తవ రూపం ఇచ్చారని ముత్యాలనాయుడు అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం అప్పులు పాలవుతుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. అవే సంక్షేమ పథకాలను అమలు చేస్తానని సిగ్గు లేకుండా మేనిఫెస్టో విడుదల చేశారని విమర్శించారు.ఆచరణ సాధ్యం కాని హామీలతో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతన్నకు మంచి చేసే ఆలోచనతో జగనన్న ఉంటే, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు ఉపయోగపడే ఏ పథకమైనా తీసుకోచ్చారా అని ప్రశ్నించారు. నేడు రైతు భరోసా, రైతులకు రుణాలు, కౌలు రైతుల చట్టం తదితర పథకాలను జగనన్న అమలు చేస్తుంటే ఓర్వలేని చంద్రబాబు ఆసత్యప్రచారం చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, రుత్తల యర్రాపాత్రుడు పాల్గొన్నారు.ఇవి చదవండి: టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి -
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
చిత్తూరు: చంద్రబాబు బూటకపు హామీలను ప్రజలు నమ్మరని, టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. గురువారం మండలంలోని వనదుర్గాపురం, తొట్టికండ్రిగ, కృష్ణజమ్మపురం, శ్రీకావేరిరాజుపురం, పాలసముద్రం పంచాయతీల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిప్యూటి సీఎం మాట్లాడుతూ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 99.5 శాతం అమలు చేశారన్నారు. సచివాలయాల ద్వారా 1.35 లక్షల మందికి ఉద్యోగావకాశం కల్పించారని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో 54 వేల పోస్టుల భర్తీ, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం తీసుకువచ్చారని వెల్లడించారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్తో కలసి ఐదేళ్లలోమొత్తం 6.48 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు వివరించారు. ప్రజలకు మేలు చేశామనే పెద్దసంఖ్యలో ఇతర పార్టీల నుంచి వైఎస్సార్సీపీలోకి వస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో గెలవలేమని భావించే చంద్రబాబు జనసేన, బీజేపీతోపాటు రహస్యంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. ఒకప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని హీనంగా తిట్టిన చంద్రబాబు కేసుల భయంతో బీజేపీకి సాష్టాంగం పడ్డారని విమర్శించారు.అధికారం కోసం కుట్రలకు పాల్పడుతున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించామని, ఈ ఎన్నికల్లో తన కుమార్తె కృపాలక్ష్మిని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడానికే పీసీసీ అధ్యక్షులు షరి్మల విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.రాజన్న రాజ్యం తెస్తానని తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల అక్కడి ప్రజలు తిరస్కరించడంతో ఏపీకి వలస వచ్చారని విమర్శించారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైనామళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టడం ఖాయమన్నారు.కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.శివప్రకాష్ రాజు, సింగిల్విండో చైర్మన్ గాలి జ్యోతి, వైస్ ఎంపీపీ శేఖర్ యాద్, పార్టీ మండల కన్వీనర్ తులసియాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు అన్భళగన్, సినీ నిర్మాత షణ్ముగం, ఆర్బీకే చైర్మన్ పోలయ్య, పుత్తూరు మార్కెట్ డైరెక్టర్ రమాదేవి, కో–ఆప్షన్ మెంబర్ వేలు, సర్పంచ్ గాలి మహేష్ బాబు, అయ్యప్ప, నరసింహరాజు, భాష్కర్రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, పుత్తూరు కేశవరెడ్డి, మురళి, నరసింహన్, ప్రేమ్కుమార్, ఆనందన్, ప్రకాశ్, కుమార్, చంద్రశేఖర్రాజు, షణ్ముగరెడ్డి, వరదరాజు, చిన్నవరదరాజు, సిద్దమందడి, శరవణన్, కుట్టి, చిన్నపయ్యన్, లక్ష్మణన్, రాజామణి, అరుల్, బాబు, మనోహర్, దనంజయన్, వాసురాజు, కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు షణ్ముగం పాల్గొన్నారు.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Advertisement