-
కాల్చిన మునక్కాయల కూర
మునక్కాయలను ఇష్టపడని వారు ముల్లోకాల్లో వెదికినా దొరకరు. సాంబారులో ఎన్ని కూరగాయలు వేసినా మునగ వేస్తేనే గౌరవం. మునగను రకరకాలుగా వండటం చూశాం. కాని పల్లె వంటల్లో ప్రసిద్ధం అయిన ఈశ్వరి అవ్వ మునక్కాయలను కాల్చి చేసిన కూరను అందరూ నోరెళ్లబెట్టి చూస్తున్నారు. పొగడ్తలతో ఆమెను ముంచెత్తుతున్నారు. తమిళనాడుకు చెందిన ఈశ్వరి అవ్వకు ‘కంట్రీ ఫుడ్ కుకింగ్’ అనే యూ ట్యూబ్ చానల్ ఉంది. సబ్స్క్రయిబర్స్ ఎంతమందో తెలుసా? పది లక్షల మంది. తమిళనాడు గ్రామీణ వంటలను ప్రయోగ వంటలను అద్భుతంగా చేయడంతో ఈశ్వరి అవ్వకు విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. పచ్చి బొ΄్పాయి పచ్చడి, ఆరిటాకుల హల్వా ఇలాంటి వాటితో ΄ాటు నల్ల మాంసం కూర, అరటికాయతో వెజ్ ఫిష్ ఫ్రై లాంటివి నోరూరిస్తాయి. తాజాగా అవ్వ కాల్చిన మునక్కాయల కూర చేసి నెటిజెన్ల మెచ్చుకోలు పొందింది. మునక్కాడలను మంట మీద కాల్చి వాటిని కడిగి, చీరి, లోపల గుజ్జును వొలిచి పక్కన పెట్టుకుందామె. తర్వాత చట్టిలో నూనె ΄ోసి జిలుకర, వెల్లుల్లి, టొమాటో, ఉల్లి΄ాయలు, పసుపు, కారం, పచ్చిమిర్చి వేసి, ఆఖరున మునగగుజ్జును వేసి దోరగా వేయిస్తే మంచి ఫ్రై కూరలా తయారయ్యింది. దానిని తెల్లన్నంతో తింటూ మనకు వీడియో కనిపిస్తుంది అవ్వ. ఈ రెసిపీని చూసి నెటిజన్లు చాలా కొత్తగా ఉందంటున్నారు. మేమూ ట్రై చేస్తామని బజారుకు మునక్కాయల కోసం వెళుతున్నారు. -
మస్తానమ్మకు గుడ్ బై: వీడియో వైరల్
తన వంటకాలతో గ్లోబల్గా అభిమానులను సంపాదిస్తున్న ఇంటర్నెట్ సంచలనం కంట్రీ ఫుడ్స్ మస్తానమ్మ (107) ఇకలేరు. నిండు నూరేళ్ల జీవితాన్ని చలాకీగా, స్ఫూర్తిదాయకంగా కొనసాగించిన మస్తానమ్మ ఇక సెలవంటూ కన్నుమూశారు. పసందైన వంటకాలతో యూట్యూబ్ వీడియోల ద్వారా దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందారు మస్తానమ్మ. అయితే గత ఆరు నెలలుగా కంట్రీ ఫుడ్స్ వెబ్సైట్ బామ్మ వంటకాల వీడియోలు లేక వెల వెల బోయింది. దీంత ప్రపంచంలోని ఆమె అభిమానులంతా ఆకలితో మలమలలాడినంతగా విలవిల్లాడిపోయారు. చివరకు ఆమె ఇక లేరన్న వార్త వారిని బాధించింది. కంట్రీఫుడ్స్ వెబ్సైట్లో గతంలో పోస్ట్ చేసిన ‘ది స్టోరీ ఆఫ్ గ్రాండ్మా ’ వీడియో ఇపుడు వైరల్గా మారింది. మస్తానమ్మ జీవిత ప్రస్తానంలోని సాధక బాధకాలను ఈ వీడియోలో పొందుపర్చారు. (ఆ ఘుమఘుమలు ఇకలేవు) అయితే ఇలా అర్ధాంతరంగా అందనంత దూరం వెళ్ళిపోయిన మస్తానమ్మకు అభిమానులు నివాళులు ప్రకటించారు. తన బామ్మ మస్తానమ్మ చిన్నప్పటినుండి తమ కుటుంబానికి ఎంతో చేదుడువాదోడుగా ఉండేదని ఆమె మనుమడు లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు. కష్టించి పనిచేసి చివరి శ్వాసవరకూ కుటుంబాన్ని ఆదుకున్న తమ పెద్దదిక్కు ఇలా అకస్మాత్తుగా తమను వీడిపోవడం తీరని లోటని కన్నీరు మున్నీరయ్యారు. వెజ్, నాన్ వెజ్ ఇలా ఏదైనా.. ఆమె వంటకాల వీడియోలు లక్షల వ్యూస్ను సాధించడం విశేషమని ఆయన పేర్కొన్నారు. బామ్మ అండతో తాను ప్రారంభించిన యూ ట్యూబ్ ఛానల్కు విశేష ఆదరణకు నోచుకుందన్నారు. 106 ఏళ్ళ వయసులో కూడా ఎంతో శ్రమకోర్చి యూట్యూబ్ వంటల వీడియోల ద్వారా ఆర్థికంగా ఎంతో సాయపడిన బామ్మ ఇలా ఒక్కసారిగా తమను వదిలి వెళ్లిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. -
ఘుమఘుమల ‘గూగులవ్వ’ ఇకలేరు
సాక్షి, తెనాలి: తన చేతివంటతో పాకశాస్త్ర ప్రపంచంలో సంచలనం రేపిన ‘గూగుల్’ బామ్మ ఇకలేరు. పంటచేల పక్కన సంప్రదాయ కట్టెల పొయ్యిలో గుడ్డు ఆమ్లెట్ నుంచి రొయ్యల వేపుడు వరకు, గుత్తి వంకాయ నుంచి ములక్కాయ పులుసు వరకు తన వంటకాల ఘుమఘుమలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది వీక్షకుల నోరూరించిన ఆ అవ్వ కర్రె మస్తానమ్మ 107 ఏళ్ల వయసులో అస్వస్థతకు గురై కన్నుమూసిన విషయం ఆలస్యంగా తెలియవచ్చింది. గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండల గ్రామం గుడివాడలోని తన స్వగృహంలో ఆమె ఆదివారం సాయంత్రం మృతిచెందారు. సోమవారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తిచేసినట్టు మనుమడు లక్ష్మణ్ తెలియజేశారు. (సాహోరే గుడివాడ బామ్మ..యూ ట్యూబ్ సెన్సేషన్) మస్తానమ్మ సొంతూరు తెనాలి దగ్గర్లోని కోపల్లె. అత్తిల్లు సమీపగ్రామం గుడివాడ. పెళ్లయిన కొన్నేళ్లకే భర్త నాగభూషణం చనిపోయారు. ఏకైక కుమారుడు ఇంట్లో ఉండే అవకాశమున్నా, అదే ఆవరణలో ఓ పాకలో నివసిస్తూ వచ్చారు. కాలూచేయీ ఆడేంతవరకూ ఒకరిపై ఆధారపడకూడదన్న భావనతో అన్ని పనులు స్వయంగా చేసుకుంటూ వచ్చారు. పొలం పనులు చేసే శక్తి సన్నగిల్లినా, పొలం వెళ్లటం మాత్రం మానలేదు. హైదరాబాద్లో వీడియో ఎడిటరైన ఆమె మనుమడు లక్ష్మణ్, తన స్నేహితుడు శ్రీనాథ్రెడ్డితో కలిసి ఆమె వంటలను యూ ట్యూబ్ ద్వారా అందరికీ నేర్పించాలనుకున్నారు. ‘కంట్రీ ఫుడ్స్’ పేరుతో ఛానల్ను 2016 ఆగస్టులో ప్రారంభించారు. గుడ్డు ఆమ్లెట్ నుంచి మటన్ బిర్యానీ, చేపల పులుసు, పుచ్చకాయ చికెన్, రొయ్యల వేపుడు, పీతల కూర, గోంగూర చికెన్, వంకాయ మసాల, గుత్తివంకాయ వంటి వంటకాలకు సంబంధించిన 40 పైగా వీడియోలను అప్లోడ్ చేశారు. ఈ ఛానల్కు 2.30 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చేశారు. మొత్తంమీద 43 మిలియన్లకు పైగా మస్తానమ్మ చేతివంటను వీక్షించారు. బీబీసీలోనూ రెండు నిముషాల కథనం ప్రసారమైందని మనుమడు లక్ష్మణ్ చెప్పారు. గూగుల్ సంచలమనయ్యాక 2017 ఏప్రిల్లో మస్తానమ్మ పుట్టినరోజును మనుమడు, బంధువులు ఘనంగా జరిపారు. వివిధ దేశాల సబ్స్కైబర్లు బహుమతులు, డబ్బును పంపారు. -
ఘుమఘుమల గూగులవ్వ
స్టార్ కుక్ ఇది కృష్ణా జిల్లా గుడివాడ కాదు. గుంటూరు జిల్లా గుడివాడ. ఆంధ్రాప్యారిస్ తెనాలికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. పాడిపంటలతో ప్రకృతిలో ఒదిగినట్టుండే ఆ ఊరు ఇప్పుడో 106 ఏళ్ల అవ్వ కారణంగా ప్రపంచానికంతా పరిచయమైంది. తన ఊరి వంటలతో, దేశీ ప్రావీణ్యంతో ఆన్లైన్లో సంచలనం సృష్టిస్తోందీ అవ్వ. ‘కంట్రీఫుడ్స్‘ఛానల్లో ఆమె వంటకాలను మిలియన్లమంది వీక్షిస్తున్నారు. ఆమె కథను బీబీసీ కూడా ప్రసారం చేయనుంది. ఆ అవ్వ–మస్తానమ్మ పరిచయం ఇది. ‘నా మనవడు హైదరాబాదులో పెద్ద సదువు సదూకున్నాడు... పొటోలు, సినిమాలు తీస్తాడు... గూగుల్ అంట అదేంటో... దాంట్లో పెడితే పెపంచకమంతా చూసేత్తదంట. నాచేత వంటలూ అయీ చేయిస్తన్నడు. సినిమాల్లాగా తీసి గూగూల్లో పెట్టేత్తన్నడు. నా వంట పెపంచకమంతా పాకిందంట... ఎవరెవరో వత్తన్నారు... నన్ను పొటోలు తీత్తన్నారు. అందరూ నన్ను బతికిత్తారు అనుకుంటున్నా’... తన చేతివంటలతో ఆన్లైన్ పాకశాస్త్ర ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తున్న అవ్వ కర్రె మస్తానమ్మ మాటలివి. ఆమె చేతివంటల ఘుమఘుమలు యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాయి. ప్రతి వంటను లక్షలాది వీక్షకులు తిలకిస్తూ, వహ్వా అంటున్నారు. అవ్వకు జేజేలు పలుకుతున్నారు. ఇటీవల ఆమె పుట్టినరోజుకు దేశవిదేశాల వీక్షకులు బహుమతులను పంపి శుభాకాంక్షలనూ తెలియజేశారు. ఆమెను పలకరిస్తే... ‘నాకు నూట ఆరేళ్లు. పోయిన్నెల్లోనే పుట్టిన్రోజు చేశాడు నా మనవడు. చుట్టుపక్కల పిల్లల్ని పోగేసి, పండగలాగ చేశారంతా. నా వంటలకు మెచ్చుకుని ఎవరెవరో పంపారంటూ చీరలు, డబ్బులు ఇచ్చాడు. నాకు శానా నవ్వొచ్చింది. నా వంటలు నన్ను బతికిత్తాయని భరోసా వచ్చింది. చిన్నప్పుడు కూరా నారా చేయటం తెలుసుకున్నందుకు, ఇన్నాళ్లూ నేను, నావాళ్లూ తిన్నాం అనుకుంటే, ఇప్పుడు ఎక్కడెక్కడి దేశాలోళ్లకో పనికొత్తందంట. అంతా చెబుతుంటే చిత్రంగా అనిపిత్తంది. ఏదోలో నాలుగు డబ్బులొత్తే నాకు అక్కరకొచ్చినట్టే గదా అనుకుంటుంటా...’అన్నారావిడ. ‘‘అసలు మా పుట్టింటోళ్ల ఊరు కోపల్లె. తెనాలికి నాలుగైదు మైళ్లు ఉంటుంది. తోడబుట్టినోళ్లంతా అబ్బాయిలే. ఆడపిల్ల పుడితే బాగుంటుందని అమ్మాఅయ్య ఆరోజుల్లో అనుకున్నారంట. అందుకని దేవుడికి మొక్కున్నారంట. చివరికి నేను పుట్టాను. మస్తానమ్మ అని పెట్టారు. బాగా గారాబంగా సాకారు నన్ను. ఇంటిపనులు, బువ్వ వండటం, కూరలు చేయటం అమ్మ నుంచే తెలుసుకున్నా. అప్పుడు నాకు పదకొండేళ్లు ఉంటాయోమే... మా ఊరుపక్కనే గుడివాడ అని ఉంది. అక్కడో సంబందం చూసి పెళ్లి చేశారు. నాగభూషణం మా పెనిమిటి. కట్నంగా పదకొండు రూపాయలిచ్చారు ఆ కాలంలో. అప్పట్లో రింగులు జట్టుతో సక్కంగా ఉండేదాన్ని... వంద కిలోల బస్తా కోపల్లెలో ఎత్తుకుంటే గుడివాడలో పడేసేదాన్ని. మద్రాస్ (బకింగ్హామ్) కాలువలో బల్లకట్టు ఎక్కానొకనాడు. ఒకాయన నా ఎనకాల ఎక్కాడు... ఎక్కుతూ నా చెయ్యి పట్టుకోవటమే కాదు, జడ కూడా పట్టుకున్నాడు. అన్నదమ్ముళ్లిద్దరూ బల్లకట్టుపైన కూచున్నారు. ఇట్టే పట్టుకొని ఎత్తి కాల్వలో పడేశాను. ‘ఆడు చచ్చిపోయేట్టున్నాడే...’ అని చెప్పబోయాడొకడు...‘వాడికీ నీకూ చిండ పగిలిపోద్ది... భోషడీకే.. నా జడ పట్టుకొంటాడా...? నిన్ను కూడా పడేత్తాను’ అన్నా...! మారుమాట్లాడలేదు. ఆయన పడవలో ఉండేవాడు. ఎండ్రకాయలు, తాబేళ్లు కూడా పట్టి, తినేవాళ్లం. మద్రాస్ కాలవ ఈదేదాన్ని. పాతికేళ్లలోపే ఆయన పోయాడు. మాకు అయిదుగురు పిల్లలు. తర్వాత నలుగురు కాలం చేశారు. ఇప్పుడు ఒక్కడే కొడుకు. కోడలు, మనుమసంతానం ఉన్నారు. పెళ్లయ్యాక ఇంటిదగ్గరే అందరికీ బువ్వ వండిపెట్టేదాన్ని. మా అత్త, ఆయన నన్ను పొలం పనికి పంపలేదు. బాగా చూసుకున్నారు నన్ను. ఏనాడూ దెబ్బకొట్టింది లేదాయన. ఒంటినిండా నగలే నాకు. బాగుండేదాన్ని. ఒకరోజున మంచాన పడుంటే ‘ఏంటయ్యా...అయిదుగురు పిల్లల్నిచ్చావ్... ఎట్టా బతకాల...?’ అంటే, ‘నువ్వు తెలివిగల్ల దానవే... ఎలాగైనా బతికేత్తవు’ అన్నాడు. నా మాటే నిజం అన్నట్టు పెందలాడే పోయాడు పెనిమిటి. ఆయన చచ్చాక అన్నీ పోయాయ్. ఎవరి బతుకు వారే బతకాలంటాను నేను. ఆయన పోయినా ఉస్సూరుమని ఉరేసుకోలేదు. కాయకట్టం చేసి, పొలంపనులకు ఎల్లా. కొడుకు ఇంటో ఉండొచ్చుగానీ, ఓపిక ఉన్నంతవరకు ఒక్కతెనే ఉండాలనుకున్నా. కాలూచేయీ ఆడేంతవరకూ ఇంకొకరిపై ఎందుకు పడాలా? ఇంటి మెల్లాలో పాక వేసుకొని గడుపుతున్నా. నా తిండీ తిప్పలూ నావేనయ్యా. ఇప్పుడంటే కొంత ఓపిక తగ్గింది. ఊతకర్ర అవసరం లేదుగానీ, ఇదివరలా పొలంపనులకు ఎల్లటం లేదు గానీ, పరిగ ఏరుకుని నాలుగు డబ్బులు సంపాయిత్తనా. ఒక కన్ను చూపు కొంత మసక అనిపిత్తంది. ఇక ఏమీ పర్వాలేదు. వంటల సంగతి అడిగారుగా... కూరలు చేయటం బాగా వచ్చు. గుడ్డు అట్టు నుంచి రొయ్యల పలావ్, మాంసం బిరియానీ, చేప బిరియానీ, పుచ్చకాయ బిర్యానీ, గుత్తి వంకాయ నుంచి ములక్కాయ పులుసు, కాకరకాయ వేపుడు... అన్నీ చేసేత్తా. నా మనవడు లక్ష్మణ, ఆయన సావాసగాడు శీనాధరెడ్డి కలిసి మా ఊరొత్తుంటారు. వచ్చినపుడల్లా మా ఇంటికి దగ్గర్లోని చేలపక్కన, రాళ్ల పొయ్యిల, కట్టెపుల్లలతో వంట చేయిస్తారు. ఏ వంటకైనా తగినన్ని సంబారాలు, దినుసులు వేయటం ముఖ్యం. సరిపోయేటంతగా ఉడికించుకుని దించేసుకుంటే రుచిగా ఉంటాది. అవన్నీ చెబుతూ వంటలు చేత్తుంటా. అవన్నీ నా మనవడు సినిమాలా తీత్తాడు. వాటిని గూగూల్ అంట... అందులో పెడుతున్నాం... లచ్చలమంది చూత్తన్నారని చెబుతున్నారు. కానుకలు వచ్చాయని తెచ్చి ఇత్తన్నారు. వాళ్ల సరదాని నేనెందుక్కాదనాలి అని వచ్చినపుడల్లా కూరలు, పలావులు చేత్తున్నా. ఇవన్నీ చెపుతుంటే సంతోసంగా ఉంది’’. బీబీసీ ఛానల్లో కథనం..? మా అవ్వ చేతిలో ఏ మహత్తు ఉందోగానీ, ఏ వంట చేసినా రుచికరంగా ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేనూ, మా స్నేహితుడు శ్రీనాథ్రెడ్డి ‘కంట్రీఫుడ్స్’ పేరుతో ఛానల్ను గతేడాది ఆగస్టులో ప్రారంభించాం. ఇద్దరూ వీడియో ఎడిటర్లుగా చేస్తున్నాం. గుడివాడ రావటం, సంప్రదాయ పొయ్యిలో కట్టెపుల్లలతో రకరకాల వంటలు చేయించటం, వాటిని వీడియో తీసి, ఛానల్లో అప్లోడ్ చేస్తూ వస్తున్నాం. 40 వీడియోలను అప్లోడ్ చేశాం. మా ఛానల్కు 2.30 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మొత్తంమీద 43 మిలియన్ల మంది మా అవ్వ చేతివంటను వీక్షించారు. బీబీసీ ఆన్లైన్లో అడిగిన ప్రశ్నావళికి సమాధానాలు, అవసరమైన వీడియో ఫుటేజిలు పంపాం. అతి త్వరలోనే ప్రసారం చేస్తారు. అవ్వచే వెజ్/నాన్వెజ్ పచ్చళ్లు తయారుచేయించి ఆన్లైన్లో అమ్మకాలకు ఏర్పాట్లు చేస్తున్నాం. – లక్ష్మణ్, మస్తానమ్మ మనుమడు వంటల తయారీకి సహకరిస్తాం... వంటకు కావాల్సిన సరంజామాను మేం సిద్ధం చేస్తాం. కూరగాయలు/ చికెన్/ మాంసం ముక్కలు కోయటం నుంచి మస్తానమ్మే స్వయంగా కూర తయారుచేస్తుంది. అన్నీ సమపాళ్లలో అమరాయో? లేదోనని రుచి చూస్తేగాని ఆమెకు తృప్తి అనిపించదు. – అన్నమ్మ, రజని, కోడలు, మనుమరాలు – బి.ఎల్. నారాయణ, సాక్షి, తెనాలి
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కేయూ వైస్ చాన్స్లర్ రమేశ్పై సమగ్ర విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
చెట్టు మీదపడి కూలీ మృతి
నిజ బృందావన దర్శనం
సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
ఊరంతా సుంకులమ్మ, ముత్యాలయ్యలే
‘బలగం’తో మంచి గుర్తింపు
గిరిజన గురుకులాల దరఖాస్తుకు నేడు ఆఖరు
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
మిద్దైపె నుంచి పడి యువకుడి మృతి
ఖాదర్లింగ స్వామి ఉరుసు ప్రారంభం
తప్పక చదవండి
- జనసేన నాయకుడి దౌర్జన్యం
- బైక్పైనే ముద్దుముచ్చట
- ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం
- Warangal Murder: కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు
- బాలాజీ నాయుడు టార్గెట్ రాజకీయ ప్రముఖులే...
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- కొండెక్కిన చికెన్ ధర
- ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అండమాన్కు ‘నైరుతి’.. రానున్న మూడ్రోజులూ వానలే
Advertisement