-
Telangana Rains Photos: తెలంగాణలో అకాల వర్షం కారణంగా ఆవేదనలో అన్నదాత (ఫొటోలు)
-
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
కడెం(ఖానాపూర్): రబీ సీజన్లో సాగు చేసిన పంటలకు నీరందించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయాలని కడెం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు నచ్చన్ఎల్లాపూర్ వద్ద నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై గురువారం బైఠాయించారు. వారం రోజులుగా సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయకపోవడంతో కడెం మండలంలోని లింగాపూర్, మాసాయిపేట్, నచ్చన్ఎల్లాపూర్, పెద్దూర్తండా, చిట్యాల్, ధర్మాజీపేట్, తదితర గ్రామాల్లోని సుమారు 13 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. రైతులు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే వెడ్మ సదర్మాట్ రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, కాలువ నీళ్లు వస్తాయ ని రైతులు ఆందోళన చెందవద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హామీ ఇచ్చారు. సదర్మాట్ చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేయాలని ఈఎన్సీ నుంచి ఎస్ఈకి గురువారమే ఆదేశాలు వచ్చాయని ఆయన వెల్లడించారు. -
భగీరథ ప్రయత్నం!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆరుగాలం శ్రమించి వేసుకున్న పంటలను కాపాడుకొనేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. కళ్ల ముందే ఎండిపోతున్న పంటలను బతికించుకొనేందుకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. కరువు కారణంగా భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వట్టిపోవడంతో పంటలను ఎలాగైనా కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో ఇప్పటికే వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోగా సాగర్ బ్యాక్ వాటర్ కింద సాగు చేసుకుంటున్న రైతులు పంటలను కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బత్తాయి, మామిడి వంటి పండ్ల తోటలతోపాటు వేరుశనగ, వరి పంటలను బతికించుకొనేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. ముఖ్యంగా సాగర్ జలాశయం డెడ్ స్టోరేజికి చేరడంతో బ్యాక్ వాటర్ కిలోమీటర్ల మేర తగ్గిపోయింది. దీంతో నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలంలోని నంభాపురం, పెద్దగట్టు, పుట్టంగండి తదితర ప్రాంతాల్లో గిరిజన రైతులు పంటకు నీరందించేందుకు కిలోమీటర్ల పొడవునా పైపులైన్లు వేసుకొని మోటార్లు పెట్టి నీటిని తరలిస్తున్నారు. పెద్దవూర మండలం పాత్తితండా, పర్వేదుల తదితర గ్రామాల రైతులు పదుల సంఖ్యలో సాగర్ వెనుక జలాశయంలోని లోతట్టు ప్రాంతాల్లో కొద్దిపాటి నీళ్లు ఉన్న ప్రదేశాలకు దూరంగా బావులు తవ్వి అక్కడి నుంచి 7–8 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసుకుంటున్నారు. పంటల కోసం తంటాలు పడుతున్నాం పంటలు ఎండిపోకుండా నానా తంటాలు పడుతున్నాం. అప్పులు చేసి మరీ పంటలను కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నాం. నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజికి చేరడంతో బ్యాక్ వాటర్ నుంచి పంటలకు నీటిని అందించేందుకు కిలోమీటర్ల పొడవునా పైప్లైన్లు వేస్తున్నాం. – రమావత్ పత్తి, నంభాపురం -
ఆశలు..అడుగంటి.. గణనీయంగా పడిపోయిన భూగర్భ జలమట్టాలు
సాక్షి ప్రతినిధులు మహబూబ్నగర్/ కరీంనగర్/ ఖమ్మం: రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటం, భూగర్భ జలాలు అడుగంటడంతో పలు జిల్లాల్లో పంటలు ఎండి పోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. నీటి కొరత మామిడి లాంటి పంటల దిగుబడిపై ప్రభావం చూపిస్తోందని రైతులు చెబుతున్నారు. అప్పులు చేసి వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్లో బోర్లు వట్టి పోవడంతో నీరందక ఇప్పటివరకు లక్షకు పైగా ఎకరాల్లో పంటలు ఎండినట్లు అంచనా. ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మండే ఎండలు,అడుగంటిన భూగర్భ జలాలతో పంటలు ఎండిపోతున్నాయి. నిజానికి 2022–23 యాసంగిలో మొత్తం 5,15,375 ఎకరాల్లో పంటలు సాగైతే ఈ ఏడాది 3,55,827 ఎకరాల్లోనే సాగు చేశారు. పాలేరు రిజర్వాయర్ పరిధిలోని పాత కాల్వ కింద కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో సుమారు5 వేలకు పైగా ఎకరాల్లో వరి ఎండింది. భగీరథ ప్రయత్నం చేసినా.. ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన శీలం విష్ణు ఈ ఏడాది యాసంగిలో వైరా నది కింద11 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాడు. మరో 20 రోజుల్లో వరి చేతికి అందనుండగా వైరా రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గిపోయింది. దీంతో వైరా నదిలో పొక్లెయినర్తో గుంతలు తవ్విం చి మోటారు ద్వారా పైరుకు నీరందించే ప్రయత్నం చేశాడు. అయినా ఫలితం లేక 80 శాతం మేర పంట ఎండిపోయింది. పెట్టిన పెట్టుబడి అంతా నేల పాలైందని విష్ణు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగావరి పంటపై రైతాంగం ఆధారపడుతుంది.పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఈసారి మార్చి 31 వరకు వేసంగి పంటకు నీరందింది. కానీ గతేడాదితో పోలిస్తే ఆశించినంత మేరకు అందలేదు. ఫలితంగా వేలాది ఎకరాల్లో వరి ఎండిపోయింది. పలుచోట్ల పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. కరీంనగర్ జిల్లాలో దాదాపు 25వేల ఎకరాల వరకు వరి పంట సాగునీరు అందక ఎండిపోయిందని అనధికారిక అంచనా. పెద్దపల్లి జిల్లాలో ఎండలు దంచికొడుతుండటంతో చెరువులు, బావులు వట్టిపోతున్నాయి. మంథని, ముత్తరాం, రామగిరి, కాల్వ శ్రీరాంపూర్, ఓదెలా మండలాల్లో సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. వీర్నాపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో మాత్రం కొంతమేర వరి పంట ఎండిపోయింది. ఇక జగిత్యాల జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్ అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కింద కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందక జిల్లావ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాల వరకు పొలాలు ఎండిపోయాయి. ఈనిన వరి ఎండిపోయింది.. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు లకావత్శ్రీనివాస్. ఊరు సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్మండలం సేవాలాల్ తండా. యాసంగిలోమూడెకరాల్లో వరి పంట వేశాడు. 3 బోరు బావులు నమ్ముకుని పంట సాగు చేస్తే భూగర్భజలాలు కాస్తా అడుగంటిపోయాయి. దీంతో బోర్లు వట్టిపోయి 3 ఎకరాల్లో ఈనిన పంటఎండిపోయింది. ఇటీవల రూ.లక్ష వెచ్చించి550 ఫీట్ల లోతులో బోరు వేయించాడు.కానీ నీళ్లు పడక పోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు. బకెట్తో నీళ్లు పోస్తూ.. ఈమె రైతు బోయ అంజమ్మ.నారాయణపేట జిల్లా మరికల్ మండలంఅప్పంపల్లికి చెందిన ఈమె పదేళ్లుగా కూరగాయల సాగు చేస్తోంది. ఈ ఏడాది అరఎకరంలో బెండతో పాటు ఇతర కూరగాయలు సాగు చేసింది. ఎండల తీవ్రత కారణంగా బోర్లల్లో నీటిమట్టం దాదాపుగా అడుగంటి పోయింది. వచ్చే కొద్దిపాటి నీటిని బిందెలు,బకెట్ల ద్వారా పోస్తూ పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. 5 బోర్లువేశాడు మక్తల్ మండలం ఉప్పర్పల్లికి చెందిన రవీందర్రెడ్డికి 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.ఈ యాసంగిలో బోరుబావి కింద రెండు ఎకరాల్లో వరి, మిగతా మిరప తోట సాగు చేశాడు.భూగర్భజలాలు అడుగంటడంతో సుమారు రూ.1.20 లక్షలు వెచ్చించి ఐదు బోర్లు వేశాడు. రెండింటిలో నీరు పడలేదు. మూడింటిలో అంతంత మాత్రంగా నీరు పడింది. మిరపతోటకు నీరు సక్రమంగాఅందకపోవడంతో రూ.40 వేల వ్యయంతో స్ప్రింక్లర్లు వేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చేసిన అప్పు ఎలా తీర్చాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
‘కరువు’ సాగు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. కాలువల ద్వారా సాగునీటి సరఫరా అందడం లేదు. బోర్లు, బావుల్లో నీళ్లు అడుగంటిపోయాయి. దీనితో చాలాచోట్ల సాగునీటికి కొరత ఏర్పడింది. దీనితో ముఖ్యంగా వరి పంట దెబ్బతింటోంది. పొట్టదశకు వచ్చిన వరి ఎండిపోతుంటే రైతులు ఆందోళన పడుతున్నారు. ఎలాగోలా పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీటిని తెచ్చి పొలాల్లో పోస్తున్నారు. ఇలా చేయలేనివారు కన్నీటితో పంటలను అలాగే వదిలేస్తున్నారు. పశువుల మేతకు వినియోగిస్తున్నారు. కొందరు రైతులు ఎండిన పంటలకు ఆవేదనతో నిప్పు పెడుతున్నారు. మూడో వంతు పంటలకు దెబ్బ వర్షాభావంతో కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని రిజర్వాయర్లు నిండలేదు. దీనితో యాసంగి సీజన్లో ప్రాజెక్టుల నుంచి సాగుకు నీటిని విడుదల చేయలేదు. దీనికితోడు భూగర్భజలాలు పడిపోవడం మరింత కష్టం తెచ్చిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మిగతా పంటలనూ కలుపుకొంటే యాసంగిలో సాగుచేసిన పంటల్లో దాదాపు 30 శాతం మేర ఎండిపోయాయని పేర్కొంటున్నారు. దీనితో గ్రామాల్లో రైతులతోపాటు కూలీలకు కూడా పనులు లేకుండా పోయాయి. ఉపాధి హామీ పనులే జీవనాధారంగా మారాయి. ఇది కరువు పరిస్థితేనని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం దీనిని కరువుగా భావించడం లేదని పేర్కొంటున్నాయి. అడుగంటిన భూగర్భ జలాలు.. గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో భూగర్భ జలాలు సగటున 7.34 మీటర్ల లోతులో ఉండగా.. ఈసారి ఫిబ్రవరి నాటికి 8.70 మీటర్ల లోతుకు పడిపోయాయి. కామారెడ్డి జిల్లాలో 10.64 మీటర్ల లోతు నుంచి.. ఈసారి 12.92 మీటర్ల లోతుకు తగ్గిపోయాయి. ఖమ్మం జిల్లాలో 5.11 మీటర్ల నుంచి 6.22 మీటర్ల లోతుకు.. మేడ్చల్ జిల్లాలో 8.97 మీటర్ల నుంచి 11.45 మీటర్ల లోతుకు.. నాగర్కర్నూల్ జిల్లాలో 6.57 మీటర్ల నుంచి 9.52 మీటర్ల లోతుకు పడిపోయాయి. మహబూబ్నగర్, నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో 6.93 మీటర్ల నుంచి ఏకంగా 10.19 మీటర్ల లోతుకు.. నల్లగొండ జిల్లాలో 6.15 మీటర్ల నుంచి 10.86 మీటర్ల లోతుకు.. వికారాబాద్ జిల్లాలో 13.07 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. తగ్గిన పంటల సాగు విస్తీర్ణం సాగు నీటి వసతులు తగ్గడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి యాసంగి సీజన్లో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గత యాసంగిలో 72.58 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా.. ఈసారి 66.30 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. సుమారు 6.28 లక్షల ఎకరాలు తగ్గినట్లు వ్యవసాయశాఖ తేలి్చ, ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది. గత యాసంగిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగైతే.. ఈసారి 50.69 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే 5.75 లక్షల ఎకరాల సాగు తగ్గింది. పప్పుధాన్యాల సాగు గత యాసంగిలో 4.33 లక్షల ఎకరాలు అయితే.. ఇప్పుడు 3.18 లక్షల ఎకరాలకు తగ్గింది. ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏది? ఒకవైపు పంటల సాగు విస్తీర్ణం తగ్గడం, మరోవైపు వేసిన పంటలు ఎండిపోతుండటం ఆందోళనకరంగా మారింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా వ్యవసాయశాఖ స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంటలు ఎండిపోతుంటే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. కనీసం తమకు భరోసా కల్పించే ప్రయత్నాలైనా చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. పంట నష్టంపై సర్వే చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తోందని.. సర్వే చేసి కరువు తీవ్రతను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తే.. పరిహారమో, సాయమో అందే పరిస్థితి ఉండేదని వాపోతున్నారు. మూడు జిల్లాల్లో ‘సాగు’ గోస! ► ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో యాసంగి కింద ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, ఇతర పంటలు సాగు చేశారు. మొత్తం 7,25,345 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 4,71,047 ఎకరాల్లో సాగైనట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. కానీ సాగునీరు అందక, బోర్లు వట్టిపోవడంతో ఇప్పటివరకు సుమారు 88,752 ఎకరాల్లో వరి, 2,605 ఎకరాల్లో వేరుశనగ, మొక్కజొన్న పంటలు ఎండిపోయినట్టు ప్రాథమిక అంచనా. ► ఖమ్మం జిల్లాలో గత నాలుగేళ్లుగా యాసంగిలో మూడు లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగవుతున్నాయి. నాగార్జునసాగర్ జలాలు అందుబాటులో ఉండటంతోపాటు బోర్లు, బావులు, చెరువుల కింద సాగు కొనసాగింది. కానీ ఈసారి కృష్ణా పరీవాహకంలో వర్షాభావంతో సాగర్ నిండలేదు. పంటల సాగుకు జలాలు విడుదల కాలేదు. దీనితో వరి, ఇతర పంటల సాగు తగ్గింది. చాలా మంది చెరువులు, బోర్లపై ఆధారపడి పంటలు వేశారు. దీంతో ఈ ఏడాది సాగు 1,47,389 ఎకరాలకే పరిమితమైంది. ఇందులో వరి 80,025 ఎకరాల్లో, మొక్కజొన్న 57,342 ఎకరాల్లో వేశారు. సాగైన చోట కూడా పంటలు ఎండిపోతున్నాయి. ► ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయి. నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ కాల్వల కింద ఏడాది నుంచి సాగునీరు అందలేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో వందల సంఖ్యలో బోర్లలో నీరు రావడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లో వరి ఎండిపోయినట్టు అంచనా. పంటలను కాపాడుకోవడానికి రైతులు నానా యాతనా పడుతున్నా ప్రయోజనం ఉండటం లేదు. కొన్ని గ్రామాల్లో చేసేదేమీ లేక పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్నారు. పంట పశువుల మేతకు వదలాల్సి వచ్చింది నాకు ఊరు చెరువు వెనకాల రెండెకరాల పొలం ఉంది. యాసంగిలో వరిసాగు చేసేందుకు చెరువు నుంచి నీరు వదలడం లేదు. దీనితో జనవరిలో పొలంలో బోరు వేయించాను. నీరు బాగానే పడటంతో నా రెండెకరాలకు తోడు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశా. కానీ నెలన్నర రోజుల్లో బోరు ఎండిపోయింది. పంటను దక్కించుకునేందుకు 400 అడుగుల లోతుతో మరో బోరు వేయించా. అందులోనూ నీరు అడుగంటింది. దీనితో మరో రెండు బోర్లు వేయించినా ఫలితం లేకపోయింది. పొలం ఎండిపోవడంతో పశువుల మేతకు వదిలిపెట్టా. నాలుగు బోర్లు, పంట పెట్టుబడికి ఏడు లక్షలదాకా అప్పులు అయ్యాయి. ప్రభుత్వమే ఆదుకోవాలి. – చిన్నయ్య, రైతు, గాధిర్యాల్ గ్రామం, మహమ్మదాబాద్ మండలం, మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వం ఆదుకోవాలి నందిగామ బ్రాంచి కెనాల్ కింద రెండెకరాల వరి వేశా. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు అందక ఎండిపోయింది. మునుపెన్నడూ లేనంతగా నష్టపోయాను. ప్రభుత్వం ఆదుకోవాలి. – మల్లెబోయిన సైదులు, రైతు, భైరవనిపల్లి గ్రామం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా నాలుగెకరాల పంటంతా ఎండి పోయింది నాకున్న నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాను. సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి అయింది. ఉన్న ఒక్క బోరులో నీళ్లు అడుగంటాయి. నీళ్లు సరిపోక పంటంతా ఎండిపోయింది. ఎస్సారెస్పీ నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేక పంటను వదలివేసిన. – ధరావతు సోమాని, రైతు, పాశ్చ్యానాయక్ తండ, చివ్వెంల మండలం, సూర్యాపేట జిల్లా రెండు బోర్లూ అడుగంటాయి రెండున్నర ఎకరాల భూమిలో వరి వేశాను. ఉన్న రెండు బోర్లలో నీళ్లు అడుగంటాయి. 15 రోజులైతే పంట చేతికి వస్తుందనుకున్న సమయంలో పొలం ఎండిపోయింది. పంటకు పెట్టిన రూ.50 వేలు పెట్టుబడి నష్టపోయాను. – దొంతినేని జగన్రావు, వెంకటాద్రిపాలెం, తిప్పర్తి మండలం, నల్లగొండ జిల్లా -
రైతును మరిచి రాజకీయమా?
కాంగ్రెస్ ప్రభుత్వ ఖడ్గం మొదటి వేటు రైతన్న మీదనే పడ్డది. ఘనత వహించిన కాంగ్రెస్ సోకాల్డ్ ప్రజా పాలనలో రైతన్నల బతుకులు గాలిలో దీపాలు అయిపోయినయి. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా అన్నదాతల ఆక్రందనలు, ఆర్తనాదాలే వినిపిస్తున్నయి. మొన్నటి దాకా పొలాల్లో నీళ్లు పారితే, ఇప్పుడు రైతుల కళ్లల్లో కన్నీళ్లు కారుతున్నయి. మూడు నెలల్లోనే పరిస్థితి ఎందుకు తలకిందులైంది? బీఆర్ఎస్ పరిపాలనలో ఆత్మవిశ్వాసంతో మెరిసి పోయిన రైతన్నల ముఖాల్లో ఎందుకు ఇప్పుడు నిస్సహాయత, ఆందోళన కనిపిస్తున్నది? అటు ఎండిపోయి దెబ్బతిన్న పంటలకు, ఇటు వడగండ్లతో నష్టపోయినపంటకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలి. ఆరు గ్యారెంటీల్లో చెప్పిన 13 అంశాలను చిత్తశుద్ధితో త్వరగా అమలు చేయాలి. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న బాధలు ఒకవైపు, కొద్దోగొప్పో పండిన పంట వడగండ్ల వానకు సర్వనాశనమై పోయిన ఘోష మరొకవైపు... రైతన్న బతుకు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా అయిపోయింది. వడ గండ్ల వాన దెబ్బకు రాష్ట్రంలో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేయొచ్చు. నేల రాలిన పంటను చూసి రైతులు భోరుభోరున ఏడుస్తున్న దృశ్యాలు హృదయాలను కలచి వేస్తున్నాయి. అంత దుఃఖంలోనూ కేసీఆర్ ఉండగా, మా పరి స్థితి ఇంత అగాథంగా లేకుండేనని చెబుతూ మరి కంటతడి పెట్టుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో చలనమే లేదు. ఏమీ జరగనట్లుగానే ఎన్నికల ప్రచారాల్లో, రాజకీయ ప్రసంగాలను దట్టించి కొడుతున్నరు కాంగ్రెస్ పాలకులు. రైతు గుండె చీరుకపోయి విలవిల లాడుతుంటే, ముఖ్యమంత్రి గారు మాత్రం పక్క పార్టీ నాయకుల చేరికల మీద పూర్తి దృష్టిని కేంద్రీకరించారు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తే సౌభాగ్యం లేని సర్కారు, పార్టీ గేట్లు ఎత్తి నాయకులను చేర్చుకుంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో తాగునీరు గతిలేక మహిళలు ఖాళీ బిందెల ప్రదర్శనలు చేశారు. ముఖ్యమంత్రి అటువైపు తొంగి చూసిన పాపాన కూడా పోలేదు. పేగులు మెడలో వేసుకుంటా అనే రాక్షస వ్యాఖ్యలే తప్ప, పొలాలకు నీళ్లు మలుపుతా, ప్రజల గొంతు తడుపుతా అనే మానవీయ వ్యాఖ్యలు ఈ ముఖ్యమంత్రి నోటి వెంట రావడం లేదు. రైతులు విధిలేని పరిస్థితుల్లో వేల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్నరు. సాగునీళ్లు లేక,కరెంట్ సరిగా రాక రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఎండిన పంట చేలల్లో పశువులను మేపుతున్న దీనస్థితి కనిపిస్తున్నది. తెలంగాణ పల్లెల్లో మాయమైన బోరు బండ్లు మళ్లా దర్శనమిస్తున్నవి. పూడిక తీసే క్రేన్లకు గిరాకీ పెరిగింది. లో ఓల్టేజీ కరెంట్తో మోటార్లు కాలిపోతున్నయి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతు న్నయి. మోటారు వైండింగ్ మెకానిక్ల షాపులు కళకళలాడుతుంటే, మునుపటి కాంగ్రెస్ రాజ్యం మళ్లా కళ్లకు కడుతున్నది. బీఆర్ఎస్ పరి పాలనలో ఎండాకాలంలో సైతం చెరువు, చెక్ డ్యాంకులు మత్తళ్లుదుంకిన మంచిరోజులను ప్రజలు పదే పదే గుర్తు చేసుకుంటున్నరు. ఆ రోజు నిండుగా పారిన కాల్వలు ఈ రోజు ఎండిపోయి ఎక్కిరిస్తు న్నయి. బీఆర్ఎస్ 24 గంటల కరెంట్తో రైతు ఇంట్ల కాలు మీద కాలేసుకొని కూర్చొన్నా పొలం పారింది. నేడు అర్ధరాత్రి కరెంట్ పెట్టేందుకు బాయి కాడికి పోవాల్సిన బాధ మళ్లా మొదలైంది. బీఆర్ఎస్ పరిపాలనలో రైతులు నిరందిగ ఉన్నరు. ఇప్పుడు కరెంట్ కోత మల్లా ఒక సమస్యగా వ్యవసాయం వాకిట్లో నిలిచింది. బీఆర్ఎస్ పరిపాల నలో స్థిరపడ్డ వ్యవసాయం కాంగ్రెస్ పుణ్యమా అని మెల్లమెల్లగా చెదిరిపోతున్నది. ఇప్పటి వరకు అందుతున్న లెక్కల ప్రకారం,కాంగ్రెస్ తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం మూడు నెలల వ్యవధిలో 180 మంది రైతుల ఉసురు తీసింది. ఇటీవల కురిసిన వడగండ్ల వాన పంట నష్టాన్ని అంచనా వేసే పని కూడా కాంగ్రెస్ ఇప్పటికీ ప్రారంభించలేదు. అదే పనిగా బీఆర్ఎస్ వెంట పడితే, అప్పుడు సోయి తెచ్చుకొని అయిష్టంగానే ఎకరాకు రూ. 10 వేల పంట నష్టపరిహారం ఇస్తామని గాలి మాటలు చెబుతున్నరు. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, అధికారానికి రాగానే మాట మార్చారు. వంద రోజులు దాటినా రుణమాఫీ ఊసెత్తకుండా కాలం గడిపేస్తు న్నారు. నమ్మి రుణాలు తెచ్చుకున్న రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. రైతు బంధును రైతు భరోసాగా మార్చి, ఎకరాకు ఇచ్చే పెట్టుబడిని రూ. 15 వేలకు పెంచుతామని బడాయిలు చెప్పిన ప్రభుత్వం, పెంచడం మాట అటుంచి అసలు పెట్టుబడి సాయం ఇప్ప టికీ ఎంతోమంది ఖాతాల్లో జమ చేయనేలేదు. పెంచేదెప్పుడో చెప్పడం లేదు. రైతు బంధు సాయాన్ని కౌలు రైతులకు కూడా అంది స్తామని అబద్ధపు హామీలు గుప్పించారు. అసలు ఇప్పటి వరకు కౌలు రైతులను ఎలా గుర్తిస్తారో, వాళ్లకు పెట్టుబడి సాయం ఏ విధంగా చేస్తారో మార్గదర్శకాలు రూపొందించే పనికి కూడా పూనుకోవడం లేదు. ఇగ రైతులను, కౌలు రైతులను మోసగించిన కాంగ్రెస్ పార్టీ, రైతు కూలీలను మాత్రం విడిచి పెడుతుందా? వాళ్లకు ఇచ్చిన హామీకి అదే గతి పట్టిచ్చింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వ్యవ సాయ కూలీలకు 12 వేలు అందించే పథకం ప్రారంభిస్తామని చెప్పి, ఆ పథకం అమలు గురించిన ప్రస్తావన కూడా చేయడం లేదు. అంటే రైతు కూలీలకు ఇచ్చిన హామీకి కూడా ఎగనామం పెట్టిందనే అను మానాలకు తావిస్తున్నారు. ఈ పథకం అమలు కోసం బడ్జెట్లో కేటాయింపులే లేకపోవడం ఈ అనుమానాలను మరింత బలపర్చు తుంది. రాతపూర్వకంగా ఇచ్చిన గ్యారెంటీలకే దిక్కు లేకుండాపోతుంటే, పంట నష్టం పదివేలు ఇస్తాననే నోటి మాటకు విలువె క్కడిది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విధంగా అకాల వర్షాలతోపంట నష్టపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా పంటలు దెబ్బతిన్న ఊర్లు పర్యటించారు. అప్పటికప్పుడు ఎకరాకు రూ. 10 వేల నష్టపరిహారాన్ని ప్రకటించి, వేగంగా అమలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అటువంటి ప్రయత్నమేది కనిపించడం లేదు. అసలు కాంగ్రెస్ అంటేనే ఒక చెడగొట్టు వాన లాంటిదని రైతులు మాట్లాడుకుంటున్నరు. సమైక్య పాలనలో విధ్వంసమైపోయిన తెలంగాణ వ్యవసా యాన్ని తిరిగి నిలబెట్టడానికి బీఆర్ఎస్ ఎంతో శ్రమించింది. పదేండ్లలో వ్యవసాయాన్ని పండుగగా మార్చింది. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించింది. 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్ సరఫరా చేసింది. కొత్త ప్రాజెక్టులు నిర్మించి నీటిని ఎత్తిపోసి చెరువులు, కుంటలు నింపింది. భారీ రిజర్వాయర్లు నిర్మించి నిండుగా నింపింది. వాగుల్లోకి, వంకల్లోకి నీళ్లు వదిలితే భూగర్భ జలాలు మిక్కుటంగా పెరిగినయి. దుక్కి దున్ని నాటిన నుంచి పంట కొనుగోళ్ల దాకా అడుగడుగునా రైతుకు అండగా నిలిచింది. రైతు బంధుతో పెట్టుబడికి పైకమిచ్చింది. పండిన పంటనంతా మద్దతు ధరనిచ్చి కొనుగోలు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీన్ రివర్సై పోయింది.ఎండాకాలం రాకముందే చెరువులు ఎండిపోయినయి. భూగర్భ జలాలు పడిపోయినయి. బోర్లు ఎత్తి పోయినయి. రైతు బతుకు దిగ జారడం మొదలైంది. ఇదీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు. మార్పు మార్పు అని చెప్పి రైతుల బతుకుల్లో మంట పెట్టిన్రు. రైతులు హాహాకారాలు చేస్తుంటే, భ్రష్ట రాజకీయాలతో పొద్దు పుచ్చడం ప్రమాదకరం. కాంగ్రెస్ ప్రభుత్వ నైజాన్ని ప్రజలు గుర్తిస్తు న్నారు. ఆదిలోనే హంసపాదులా తయారైన విధానాన్ని తిట్టుకుంటున్నారు. ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలి. అటు ఎండి పోయి దెబ్బతిన్న పంటలకు, ఇటు వడగండ్లతో నష్టపోయిన పంటకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలి. చిత్తశుద్ధితో ఆరు గ్యారెంటీల్లో చెప్పిన 13 అంశాలను త్వరగా అమలు చేయాలి. ధైర్యం కోల్పో తున్న రైతు గుండెల్లో భరోసాను నింపాలి. రాక్షస వ్యాఖ్యలు చేయడం మాని రైతులను రక్షించుకునే విధానాన్ని చేపట్టాలి. లేని పక్షంలో తెలంగాణ రైతాంగం ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ మరొక మహోద్య మానికి శ్రీకారం చుట్టడం ఖాయం. - వ్యాసకర్త మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే -తన్నీరు హరీశ్ రావు -
‘గ్యాప్’ పంటలకు ధరహాసం
సాక్షి, అమరావతి: మంచి వ్యవసాయ పద్ధతులు (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్–గ్యాప్) సర్టిఫికేషన్ రైతులకు రెట్టింపు కంటే ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పండించిన పంటలకు మార్కెట్లో ప్రీమియం ధర లభిస్తోంది. పంట ఉత్పత్తుల్ని నచ్చినచోట నచ్చిన వారికి అమ్ముకునే వెసులుబాటు లభించడంతో రైతుల ఆనందం అవధులు దాటుతోంది. నాణ్యమైన ధ్రువీకరణ వ్యవస్థ ఏర్పాటు సమగ్ర పంట నిర్వహణ పద్ధతుల్ని పాటించడం ద్వారా సాగు వ్యయాన్ని నియంత్రిస్తూ నాణ్యమైన ఉత్పాదకతను పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా కృషి చేస్తోంది. ఇందుకోసం పొలం బడులు, తోట బడులæను నిర్వహిస్తూ ఉత్తమ యాజమాన్య పద్ధతుల్ని రైతుల ముంగిటకు చేరుస్తోంది. ఫలితంగా సాగు వ్యయం 6 నుంచి 17 శాతం ఆదా అవుతుండగా.. దిగుబడులు 9 నుంచి 20 శాతం పెరిగి రైతులకు గణనీయమైన ఆదాయాన్ని ఇస్తోంది. పంట ఉత్పత్తుల నాణ్యతను ధ్రువీకరించేందుకు వీలుగా దేశంలోనే తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీకి అనుబంధంగా ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీని ఏర్పాటు చేసింది. తొలి దశలో పొలం బడులు, తోట బడుల ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్న రైతులకు గ్యాప్ సర్టిఫికేషన్, రెండో దశలో సేంద్రియ సాగు పద్ధతుల్లో పండించే ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీ చేయాలని సంకల్పించింది. క్వాలిటీ కౌన్సిల్ గుర్తింపుతో గ్యాప్ సర్టిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అవగాహనా ఒప్పందం మేరకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీకి ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా దేశంలోనే తొలి అక్రిడిటేషన్ జారీ చేసింది. సర్టిఫికేషన్ పొందేందుకు సాగులో అనుసరించాల్సిన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు మండల వ్యవసాయ అధికారులను టెక్నికల్ అడ్వైజర్లుగా, వ్యవసాయ, ఉద్యాన సహాయకులను ఫీల్డ్ ఆఫీసర్లుగా, తనిఖీలు చేసేందుకు అగ్రికల్చర్ డిప్లమో చేసిన వారిని ఇంటర్నెల్ ఇన్స్పెక్టర్స్గా ప్రభుత్వం నియమించింది. సర్టిఫికేషన్ జారీ కోసం అనుసరించాల్సిన పద్ధతులపై అధికారులు, సిబ్బందికి రైతులు పాటించాల్సిన ప్రమాణాలపై ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) సౌజన్యంతో శిక్షణ ఇచ్చారు. క్వింటాల్కు రూ.7,500 లభించింది రెండెకరాల్లో వేరుశనగ సాగు చేశా. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి తగిన మోతాదులో ఎరువులు వినియోగించాను. ఒకే ఒక్కసారి పురుగు మందులు పిచికారీ చేశాను. ఎకరాకు రూ.19,400 పెట్టుబడి అయ్యింది. రెండెకరాలకు 14 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గ్యాప్ సర్టిఫికేషన్తో వేరుశనగ క్వింటాల్కు రూ.7,500 చొప్పున ధర లభించింది. పెట్టుబడి పోగా రూ.66 వేల నికర ఆదాయం వచ్చింది. – బి.రామ్మోహన్, ఎం.వేముల, అన్నమయ్య జిల్లా నంద్యాల జిల్లా డోన్ మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ఎస్.లక్ష్మీదేవి నాలుగేళ్లుగా పొలంబడుల ద్వారా ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన పంటల్ని పండిస్తోంది. ఖరీఫ్–2023 సీజన్లో రెండెకరాల్లో కొర్రలు సాగు చేసింది. ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ కోసం శాస్త్రవేత్తలు, అధికారులు సూచించిన మేలైన యాజమాన్య పద్ధతుల్ని పాటించింది. వర్షాభావ పరిస్థితుల ప్రభావం వల్ల ఎకరాకు 4 క్వింటాళ్ల చొప్పున మాత్రమే దిగుబడులొచ్చాయి. కానీ.. ఈమె గ్యాప్ సర్టిఫికేషన్ పొందటం వల్ల క్వింటాల్ కొర్రలకు రూ.7 వేలకు పైగా ధర లభించిందని సంతోషంతో చెబుతోంది. ఇప్పటికే 1,673 మంది రైతులకు లబ్ధి ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 250 ఎకరాల చొప్పున 20 జిల్లాలో గ్యాప్ క్లస్టర్స్ ఎంపిక చేశారు. ఆయా క్లస్టర్లలో 990 ఎకరాల్లో వరి, కొర్రలు, రాగులు, వేరుశనగ వంటి వ్యవసాయ.. 2,534 ఎకరాల్లో మామిడి, అరటి, పసుపు, మిరప, కూరగాయల వంటి ఉద్యాన పంటలను గుర్తించారు. 1,673 మంది రైతులతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేశారు. ఇండిగ్యాప్ సరి్టఫికేషన్కు అనుసరించాల్సిన విధి విధానాలు, ఆహార ప్రమాణాలపై కృషి గ్యాప్ ప్లాట్ఫామ్ ద్వారా ఎంపిక చేసిన రైతులకు శిక్షణ ఇచ్చారు. నాణ్యత పర్యవేక్షణకు సాంకేతిక బృందం ద్వారా దశల వారీగా తనిఖీలు, అంతర్గత ఆడిట్ నిర్వహించారు. సేకరించిన నమూనాలను పరీక్షించి పురుగు మందుల అవశేషాల గరిష్ట పరిమితికి లోబడి ఉన్నట్టుగా నిర్ధారించిన పంట ఉత్పత్తులకు ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ జారీ చేశారు. సర్టిఫికేషన్ పొందిన రైతులు వారి పంట ఉత్పత్తులను మార్కెట్ ధరల కంటే మిన్నగా ప్రీమియం ధరకు విక్రయించుకుని అదనపు ఆదాయాన్ని ఆర్జించగలిగారు. గ్యాప్ సర్టిఫికేషన్తో వ్యాపారులూ పోటీపడి రైతు క్షేత్రాల నుంచే కొనుగోలు చేయడంతో కోతకొచ్చిన పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరల కంటే అధిక ధరలకు రైతులు అమ్ముకోగలిగారు. కొర్రలకు మద్దతు ధర రూ.2,500 ఉండగా.. గ్యాప్ సర్టిఫికేషన్ పొందిన రైతులు క్వింటాల్ కొర్రల్ని ధర రూ.7 వేలకు అమ్ముకోగలిగారు. వరి ధాన్యానికి మద్దతు ధర రూ.2,203 కాగా.. రైతులు రూ.4 వేలకు పైగా పొందగలిగారు. వేరుశనగ మద్దతు ధర రూ.5,850 ఉండగా.. గ్యాప్ సర్టిఫికేషన్తో రూ.8,300కు పైగా ధర లభించింది. రాగుల మద్దతు ధర క్వింటాల్కు రూ.3,846 ఉండగా.. సర్టిఫికేషన్ పొందిన రైతులు క్వింటాల్కు రూ.5 వేలకు పైగా ధర పొందగలిగారు. -
వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు బీమా
ఖలీల్వాడి/నిజామాబాద్ /కామారెడ్డి నెట్వర్క్: వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు బీమా అమలు చేస్తామని, ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురు వారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వడగళ్ల వానలతో పంటలు దెబ్బ తిన్న రైతులను ఆదుకుంటామన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 40 వేల ఎకరాల వరకు నష్టం జరిగిందన్నారు. అధికారులు సర్వే పూర్తి చేసిన తర్వాత ఎకరానికి రూ.10 వేలు నష్ట పరిహారం అందిస్తామన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు ఆధికారంలో ఉన్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రుణమాఫీ, మహిళలకు జీరో వడ్డీ, దళితులకు మూడెకరాల పంపిణీ వంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాలను అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే బీఆర్ఎస్ సర్కార్ రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. వీటికి రూ.60 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందన్నారు. దీనికోసం మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మహా అయితే ఒక సీటు రావొచ్చునని అన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అ«ధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, ఎన్డీసీసీబీ చైర్మన్ రమేశ్రెడ్డి పాల్గొన్నారు. రైతులు అధైర్యపడవద్దు : వడగళ్ల వానలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూర్, పెద్దవాల్గోట్ గ్రామాలు, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం లింగుపల్లి, భిక్కనూరు మండలం అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి, జంగంపల్లి, బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామాల్లో పర్యటించారు. వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు. -
దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి
ముస్తాబాద్/గంభీరావుపేట(సిరిసిల్ల): వడగళ్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని, ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో సర్వేలు, సమీక్షలు, నివేదికల పేరుతో కాలయాపన చేయొద్దన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, ముస్తాబాద్, పోతుగల్, గన్నెవారిపల్లెల్లో ఇటీవల వడగళ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను బండి సంజయ్ బుధవారం పరిశీలించి, రైతులను ఓదార్చారు. గత ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలుచేసి ఉంటే ఇప్పుడు అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడేవారు కాదని అభిప్రాయపడ్డారు. పంటల బీమా పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడయినా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయకుండా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.25 వేల పరిహారం చెల్లించాలని కోరారు. ఎన్నికల కోడ్ వచ్చిందన్న కారణం చెప్పకుండా.. రైతులను ఆదుకునేందుకు ఎన్నికల కమిషన్తో మాట్లాడి సాయం చేయాలని సూచించారు. కాగా, ఈ ప్రభుత్వమైనా ఫసల్బీమాను అమలు చేస్తుందో.. లేదో చెప్పాలని కోరారు. కౌలు రైతులకు రూ.12 వేల సాయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్తంభం కూలి మృతిచెందిన ముస్తాబాద్కు చెందిన రైతు ఎల్సాని ఎల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల బీజేపీ ఇన్చార్జి రాణిరుద్రమ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మట్ట వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి, పలువురు స్థానిక నేతలు బండి సంజయ్ వెంట ఉన్నారు. -
దద్దరిల్లిన సరిహద్దులు
చండీగఢ్: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, వ్యవసాయ రుణాల రద్దుతో సహా ఇతర డిమాండ్లపై రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. రెండు రోజుల విరామం తర్వాత బుధవారం నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా తమ పోరాటం ఆగదని తేలి్చచెప్పారు. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణలతో పంజాబ్–హరియాణా సరిహద్దులోని శంభు, ఖనౌరీ బోర్డర్ పాయింట్లు దద్దరిల్లిపోయాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో ట్రాక్టర్ ట్రాలీలు, మినీ వ్యాన్లు, జేసీబీలపై నిరసనకారులు తరలివచ్చారు. సరిహద్దుల్లో వేలాది మంది గుమికూడారు. రక్షణ వలయాన్ని ఛేదించుకొని ముందుకు దూసుకెళ్లడానికి ప్రయతి్నంచారు. వాహనాలతో బారీకేడ్లను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని పోలీసులు అనుమానించారు. నిరసనకారులను చెదరగొట్టడానికి హరియాణా పోలీసులు డ్రోన్తో బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. శంభు బోర్డర్ పాయింట్ వద్ద బుధవారం మూడుసార్లు బాష్పవాయువు ప్రయోగం చోటుచేసుకుంది. డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెంచారు. ఖనౌరీలోనూ రైతుల ఆందోళన కొనసాగింది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఢిల్లీ వెళ్లడానికి తమను అనుమతించడానికి డిమాండ్ చేశారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, వారిని చెదరగొట్టారు. బాష్పవాయువు ప్రభావం నుంచి తప్పించుకోవడానికి చాలామంది రైతులు మాసు్కలు, కళ్లద్దాలు ధరించారు. -
fact check: అండగా ఉన్నా ఆర్తనాదాలే..
సాక్షి, అమరావతి: వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని పెద్దలంటారు. దీనినే స్ఫూర్తిగా తీసుకున్న రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఇదే సిద్ధాంతంతో లక్షలాది అబద్ధాలు ఆడైనా సరే సీఎం వైఎస్ జగన్ను గద్దె దించాలని కంకణం కట్టుకున్నాయి. అందుకే నిత్యం ఉన్నవీ లేనివీ పోగేసి ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం మీద నిరంతరం దుమ్మెత్తి పోస్తున్న ఈనాడు దినపత్రిక కథనాల్లోని అంశాలనే తీసుకుని కొన్ని రాజకీయ పార్టీలు పాచిపోయిన ఆరోపణలనే చేస్తున్నాయి. తాజాగా.. రైతుల మద్దతు ధర విషయంలోనూ వాటి రంకెలు తారాస్థాయికి చేరాయి. రైతులకు అడుగడుగునా అండగా ఉన్నా విపక్షాల ఆర్తనాదాలు మామూలుగా లేవు. ఎందుకంటే.. రైతుకు తాను పండించిన ప్రతీ పంటకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) దక్కేలా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి.. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను 99.5 శాతం తుచ తప్పకుండా అమలుచేస్తున్న ప్రభుత్వంపై నిరంతరం బురద జల్లుతూ ఈనాడు అబద్ధాలను అచ్చేస్తోంది. ఈ క్షుద్ర పత్రిక రాసిన అంశాలనే పట్టుకుని కొందరు అవగాహన, అర్థంపర్థంలేకుండా అదే పనిగా ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలపై ‘ఫ్యాక్ట్చెక్’ ఏమిటంటే.. మార్కెట్లో జోక్యంతో రైతులకు మేలు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేయడమే కాదు సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మద్దతు ధర దక్కేలా సీఎం జగన్ సర్కారు చేస్తోంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేయడం ద్వారా రైతులకు మద్దతు ధర దక్కేలా చేసింది. పొగాకు, పత్తితో జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశనగ, పసుపు, ఉల్లి, టమాటా తదితర పంట ఉత్పత్తులకు మద్దతు ధర దక్కని ప్రతీసారి మార్కెట్లో జోక్యం చేసుకుని కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని మిర్చి, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, చీనీ వంటి పంటలకు దేశంలో మద్దతు ధర ప్రకటించడమే కాదు..ఆ ధరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తగ్గకుండా చూసింది. ఉదా.. మిరపకు రూ.7వేలు, పసుపుకు రూ.6,850, ఉల్లికి రూ.770, చిరుధాన్యాలకు రూ.2,500, అరటికి రూ.800, బత్తాయికి రూ.1,400 వచ్చేలా చూస్తోంది. మద్దతు ధర కల్పనకు పంచసూత్రాలు.. మద్దతు ధర కల్పించే విషయంలో ధాన్యంతో సహా పంట ఉత్పత్తులను ఆర్బీకేల ద్వారానే రైతుల నుంచి మాత్రమే కొనేలా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ తీసుకోవటం, కొనుగోళ్లలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యమివ్వడం, నాణ్యతకు పెద్దపీట వేయడం, నేరుగా రైతు ఖాతాల్లోకే నగదు జమ అనే పంచ సూత్రాలను నిక్కచ్చిగా అమలుచేస్తూ విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. ఇలా ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా ప్రస్తుతం వ్యవసాయ, వాణిజ్య పంట ఉత్పత్తులకు మార్కెట్లో ఎమ్మెస్పీకి మించి ధరలు పలుకుతున్నాయి. దీంతో ఈ ఏడాది కొనుగోలు చేయాల్సిన అవసరం పెద్దగా కన్పించడంలేదు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఈ 57 నెలల్లో ధరలు పడిపోయినపుడు ఈ రకమైన భరోసా ఇవ్వడంతో మార్కెట్లో ధరలు స్థిరపడ్డాయి. చంద్రబాబు హయాంలో రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఐదేళ్లలో ఏ ఒక్క బడ్జెట్లోనూ పైసా కూడా ప్రత్యేకంగా కేటాయించిన పాపాన పోలేదు. గతంలో అరకొరగా ధాన్యం సేకరణ.. నిజానికి.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ గతంలో సేకరణ కేంద్రాలకే పరిమితం అయ్యేది. అవికూడా అరకొరగానే ఉండేవి. దీన్ని పూర్తిగా మారుస్తూ నేరుగా ఫాంగేట్ వద్దే ఆర్బీకేల పర్యవేక్షణలో రైతుల భాగస్వామ్యంతో ధాన్యం కొనుగోలు ఈ ప్రభుత్వంలో హయాంలోనే జరుగుతోంది. రైస్మిల్లు ఎంపికలో మిల్లర్లను సంప్రదించాల్సిన అవసరంలేకుండా చేసింది. కొనుగోలు కేంద్రం వారే బ్యాంకు గ్యారంటీ లభ్యత, ధాన్యం రకం, మిల్లు లక్ష్యము, మిల్లు దూరం వంటి అంశాల ఆధారంగా ఆటోమేటిక్ పద్ధతిలో ఎంపిక చేసి రవాణా చేస్తోంది. బాబు కంటే రెట్టింపు కొనుగోలు.. ఇక పంట ఉత్పత్తుల కొనుగోలు విషయానికి వస్తే టీడీపీ తన ఐదేళ్లలో 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేస్తే.. సీఎం వైఎస్ జగన్ హయాంలోని ఈ 57 నెలల్లో 6.18 లక్షల మంది రైతుల నుంచి రూ.7,757.87 కోట్ల విలువైన 21.61 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేసింది. అంటే.. రెట్టింపు కన్నా అధికం. చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పోనీ ధాన్యం రైతులకైనా చంద్రబాబు మేలు చేశాడా అంటే అదీలేదు. టీడీపీ ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ 57 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు క్షేత్రాల నుంచి ఆర్బీకేల ద్వారా 37.34 లక్షల మంది రైతుల నుంచి 3.38 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రూ.65 వేల కోట్లు చెల్లించింది. టీడీపీ హయాంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోలుకు రూ.43,559 కోట్లు వెచ్చిస్తే, ఈ ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఏకంగా రూ.72,445 కోట్లు ఖర్చుచేసింది. అంటే.. సగటున ఏడాదికి చంద్రబాబు హయాంలో రూ.8,711 కోట్లు వెచ్చిస్తే, జగన్ ప్రభుత్వం ఏటా సగటున రూ.16,099 కోట్లు వెచ్చించింది. అంటే.. బాబు ఐదేళ్లతో పోలిస్తే ఈ 57 నెలల్లో రెట్టింపు విలువైన పంట ఉత్పత్తులను వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ‘జీఎల్టీ’ భరిస్తున్న ఏకైక ప్రభుత్వం.. మరోవైపు.. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతు పొలం నుంచే నేరుగా కొనుగోలుకు అయ్యే జీఎల్టీ (గన్నీ బ్యాగ్లు, లేబర్, ట్రాన్స్పోర్టు) ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. ధాన్యం కొనుగోలు సందర్భంలో టన్నుకు రూ.2,523 (గోనె సంచులకు రూ.1,750, కూలీలకు రూ.220, రవాణా ఛార్జీలకు రూ.468తో పాటు ఒకసారి వాడిన గోనె సంచులకు రూ.85), ఇతర పంట ఉత్పత్తుల సేకరణ సందర్భంలో క్వింటాకు రూ.418 చొప్పున భరిస్తోంది. ఇక గోనె సంచుల, హమాలీ, రవాణా చార్జీలకు సంబందించి 2022–23 పంట కాలానికి 15,74,285 మంది రైతుల ఖాతాలకు రూ.237.11 కోట్లు జమచేయగా, ఖరీఫ్ 2023–24 పంట కాలానికి సంబంధించి ఇప్పటివరకు 6,83,825 మంది రైతుల ఖాతాలకు రూ.91.47 కోట్లు జమచేశారు. గతంలో ఈ పరిస్థితిలేదు. ఇలా గోతాలు, కూలీలు, రవాణా ఖర్చుల (జీఎల్టీ) రూపంలో ఎకరాకు రూ.10 వేల వరకు ప్రభుత్వమే భరిస్తోంది. కానీ, గతంలో రైతులకు గోనె సంచులను సమకూర్చే పనిని గతంలో మిల్లర్లకు వదిలేసేవారు. అవి సరిపడా దొరక్క రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దీనికి చెక్ పెట్టింది. ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, పీఎస్ఏలు రైతులకు గోనె సంచులను సమకూరుస్తున్నాయి. పైగా.. సేకరించిన ధాన్యాన్ని గతంలో రవాణా అనేది గందరగోళంగా ఉండేది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందుల్లేవు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొన్ని ఏజెన్సీలను, రవాణాదారులను నియమించింది. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సజావుగా కొనుగోలు చేసిన ధాన్యం రవాణా కొనసాగుతోంది. ఇంత చేస్తున్నా దీన్ని మొక్కుబడిగా కొనుగోలు, నామమాత్రపు కొనుగోలు అంటారా? ధరల స్థిరీకరణ ద్వారా మద్దతు ధర కల్పన విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉంది. -
Fact Check: ధీమాగా 'బీమా'
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఎగ్గొట్టిన పాత బకాయిలను సైతం చెల్లించి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తుంటే ఈనాడు రామోజీ మాత్రం పరిహారం చెల్లింపుల్లో కోతలు విధించారంటూ అబద్ధాలను అచ్చేశారు. నిజంగానే పరిహారం భారాన్ని తగ్గించుకోవాలనుకుంటే గత సర్కారు ఎగ్గొట్టిన పాత బకాయిలతో సహా ప్రభుత్వం ఎందుకు చెల్లిస్తుంది? రైతులపై పైసా భారం పడకుండా దేశానికే ఆదర్శంగా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలియదా? ఆరోపణ: గతంలో స్వచ్ఛందంగా చేరేవారు.. వాస్తవం: 2016 నుంచి అమలవుతున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎం ఎఫ్బీవై)లో చేరాలంటే నోటిఫై చేసిన పంటలకు రుణం తీసుకున్నప్పుడు తప్పనిసరిగా ప్రీమియం వసూలు చేసే వారు. ఇష్టపూర్వకంగా చేరాలంటే ప్రీమియం చెల్లింపులు తలకు మించిన భారంగా పరిణవిుంచాయి. నమోదు ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటంతో మెజార్టీ రైతులకు పంటల బీమా అందని ద్రాక్షగా మారింది. మంజూరైన పరిహారం రుణ ఖాతాలకు సర్దుబాటు చేయడంతో సరిపుచ్చడంతో నష్టపోయిన రైతుకు భరోసా లభించేది కాదు. పైగా ఏనాడూ ఖరీఫ్ సీజన్ పరిహారాన్ని మరుసటి ఏడాది ఆగస్టు లోపు చెల్లించిన దాఖలాలు లేవు. ఆరోపణ: రైతులకు భారంగా ఉచిత పంటల బీమా వాస్తవం: పంటల బీమా అన్నదాతలకు గుదిబండ కాకూడదన్న సంకల్పంతో డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖరీఫ్ 2019 సీజన్ కోసం కేవలం రూపాయి మాత్రమే ప్రీమియంతో పథకాన్ని అమలు చేయగా రైతుల వాటా రూ.468 కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.503 కోట్లు కలిపి మొత్తం రూ.971 కోట్లను తానే భరిస్తూ బీమా కంపెనీలకు చెల్లించింది. అవగాహన లేనందున కొద్దిమంది రైతులు బీమా పరిధిలోకి రాలేదని గుర్తించిన ప్రభుత్వం 2020 ఖరీఫ్ నుంచి పైసా కూడా భారం పడకుండా పూర్తిగా ఉచితంగా పంటల బీమాను వర్తింప చేసింది. ఇందుకు పీఎంఎఫ్బీవై నిబంధనలు అడ్డంకిగా మారడంతో ఆ పథకం నుంచి బయటకొచ్చి 2020–21, 2021–22 సీజన్లలో సొంతంగానే బీమా పరిహారం చెల్లించింది. 2022–23 నుంచి పీఎం ఎఫ్బీవైతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఆరోపణ: 2022–23 ఖరీఫ్లో కోతలు ఎందుకు విధించారు? వాస్తవం: దేశంలో ఏ కంపెనీ అయినా ఒక జిల్లాలో కనీసం 5 వేల ఎకరాల్లో సాగయ్యే నోటిఫైడ్ పంటలకు మాత్రమే బీమాను వర్తింప చేస్తున్నాయి. ఇలా ఖరీఫ్–2022–23లో 21, రబీ 2023–24లో 17 పంటలను నోటిఫై చేశారు. గతేడాది అక్టోబర్ 31 నాటికి ఈ – క్రాప్ ప్రాథమిక డేటా ఆధారంగా ఖరీఫ్ 2022లో తొలుత 34.70 లక్షల మంది రైతులు సాగు చేసిన 70.80 లక్షల ఎకరాల్లోని పంటల వివరాలను కేంద్రానికి పంపగా డూప్లికేషన్, సాంకేతిక కారణాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఈ – కేవైసీ ప్రామాణికంగా 33.02 లక్షల మంది రైతులు సాగు చేసిన 68.20 లక్షల ఎకరాల పంటల వివరాలను డిసెంబర్లో తిరిగి కేంద్రానికి పంపారు. ఇప్పటివరకు 64.60 లక్షల ఎకరాల్లో పంటలు, 29.3 లక్షల మంది రైతుల వివరాలను నేషనల్ క్రాప్ ఇన్స్రూెన్స్ పోర్టల్లో అప్లోడ్ చేశారు. ఆరోపణ: కప్ క్యాప్ మోడల్తో రైతులకు అన్యాయం.. వాస్తవం: పరిహారం తగ్గిన సందర్భాలలో అధిక ప్రీమియం వసూలు ద్వారా బీమా కంపెనీలు భారీగా ప్రయోజనం పొందుతున్నాయనే విమర్శల నేపథ్యంలో ప్రీమియం రేట్లను హేతుబద్ధీకరించగా కేంద్రం సూచించిన ఫార్మాట్లలో విజయవంతమైన కప్ అండ్ క్యాప్ (80–110 మోడల్ను 2023–24 సీజన్ నుంచి దిగుబడి ఆధారిత పంటల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఖరీఫ్ సీజన్లో 9 క్లస్టర్ల పరిధిలో దిగుబడి ఆధారిత పంటలకు ఈ విధానం అమలు చేస్తోంది. 110 శాతం కన్నా ఎక్కువ నష్టం సంభవిస్తే ఆ మేరకు సొంతంగా భరిస్తూ అదనపు పరిహారాన్ని రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే జమ చేస్తుంది. పరిహారం చెల్లింపులో ఎలాంటి కోతలు ఉండవు. మరోవైపు వాతావరణ ఆధారిత పధకానికి పాత పద్ధతిలోనే టెండర్లను ఖరారు చేశారు. దేశవ్యాప్తంగా అత్యల్ప ప్రీమియం రేట్లకు టెండర్లను ఖరారు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం విడ్డూరం. ఆరోపణః గతంలో ఘనంగా పంటల బీమా.. వాస్తవం: టీడీపీ హయాంలో 2016–18 మధ్య పీఎంఎఫ్బీవై పథకంలో చేరిన 74 లక్షల మంది రైతులు తమ వాటాగా రూ.871.26 కోట్ల ప్రీమియం చెల్లించగా 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల పరిహారం లభించింది. అయితే గత నాలుగున్నరేళ్లలో రైతులపై పైసా భారం పడకుండా 54,48,344 మందికి రూ.7,802.05 కోట్ల పరిహారాన్ని జమ చేశారు. టీడీపీ హయాంతో పోలిస్తే 23.63 లక్షల మంది రైతులు, రూ.4,390.85 కోట్లు అదనంగా లబ్ధి పొందారు. అంతేకాకుండా చంద్రబాబు 6.19 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల పంటల బీమా పరిహారాన్ని సైతం చెల్లించి రైతుల పట్ల సీఎం జగన్ తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. టీడీపీ హయాంలో 2.32 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పిస్తే గత నాలుగున్నరేళ్లలో 3.98 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ వర్తించింది. నాడు 74.40 లక్షల మందికి బీమా రక్షణ కల్పిస్తే నేడు 1.71 కోట్ల మందికి బీమా రక్షణ దక్కుతోంది. అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకాన్ని పలు సందర్భాల్లో కేంద్రంతో పాటు అంతర్జాతీయ సంస్థలు సైతం ప్రశంసిస్తుంటే ఈనాడు రామోజీ భరించలేకపోతున్నారు! -
fact check: పంటల‘కేసీ’ కళ్లెట్టుకు సూడు..
కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో సాగు చేసిన పంటలు ఎండిపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను జల వనరుల శాఖ ఇంజినీర్లు పక్కాగా అమలు చేస్తున్నారు. ఇది చూసిన పచ్చ పత్రిక ఈనాడు తట్టుకోలేక నీటి తడులపై తప్పుడు కథనాన్ని ప్రచురించింది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా కేసీ రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండించడం, కర్షకులు ఆనందంగా ఉండడాన్ని ఓర్వలేని రామోజీ తన అక్కసు వెళ్లగక్కారు. శ్రీశైలం నీళ్లు అమ్ముకుంటున్నారంటూ కి‘రాత’కానికి దిగారు. కర్నూలు సిటీ/ఆళ్లగడ్డ: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా వర్షాభావం నెలకొంది. ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత తక్కువగా ఉంది. దీంతో అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు కేసీ కెనాల్ పరిధిలోని ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లోని 2.65 లక్షల ఎకరాల ఆయకట్టులో వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. సాగు నీటి సలహా మండలి సమావేశంలోనూ తీర్మానం చేశారు. ఆ మేరకు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించారు. దీంతో రైతులూ ఆరుతడి పంటలను సాగు చేశారు. ఆ తరువాత సెప్టెంబరు, నవంబరు నెల చివరి వారాల్లో కొంత మేర వర్షాలు పడ్డాయి. దీంతో నవంబరు నెల 25న మరోసారి సాగు నీటి సలహా మండలి సమావేశం నిర్వహించి కేసీ కెనాల్కు డిసెంబరు 15 వరకు నీటిని ఇవ్వాలని తీర్మానించారు. రైతులు కలెక్టర్, ప్రజాప్రతినిధులను కలిసి శ్రీశైలంలో లెవెల్ పర్మిట్ చేసేంత వరకు నీటిని ఇవ్వాలని కోరారు. దీంతో నంద్యాల కలెక్టర్, జేసీ ఆదేశాల మేరకు వారాబందీ ప్రకారం నీరు విడుదల చేస్తున్నారు. నీరు వృథా కాకుండా జలవనరుల శాఖ అధికారులు రాత్రీపగలు కెనాల్పై గస్తీ కాసి ప్రతి ఎకరాకూ నీరు అందించారు. మంచి దిగుబడులు రావడంతో రైతులు సంబరపడ్డారు. జలవనరుల శాఖ ఇంజినీర్లను సన్మానిస్తున్నారు. అన్నీ తప్పుడు రాతలే రామోజీ పచ్చ పత్రిక బడా వాణిజ్య రైతులతో కుమ్మక్కై రబీలోని మిరప పంటకు నీటిని అమ్ముకుంటున్నారని కథనం వండివార్చింది. ఇదంతా అవాస్తవం. కేసీ కెనాల్ పరిధిలో మిరప సాగుచేసిన రైతుల్లో బడా రైతులు లేరు. ఒకరికి మాత్రమే పది ఎకరాలు ఉంది. మిగిలిన వారందరూ ఎకరా, ఎకరన్నర ఉన్న సన్నకారు రైతులే. కానీ అనధికారికంగా 20 వేల ఎకరాల్లో సాగు చేశారంటూ తప్పుడు గణాంకాలు ప్రచురించింది. ఇకపోతే పోతిరెడ్డిపాడు నుంచి తీసుకునే నీటిలో 5 టీఎంసీలు కేసీ కెనాల్కు తీసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడి నుంచి తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతోనే ముచ్చుమర్రి నుంచి నీటిని తీసుకుంటుంటే ఈనాడు తప్పుడు రాతలు రాసింది. ‘‘నీటి కేటాయింపులు లేవు. రైతులకు నీరు ఎలా ఇస్తారు? రైతులకు అన్యాయం జరుగుతుందనేలా విషపు కథనాన్ని కక్కింది. రైతుల నుంచి వసూళ్ళు చేసిన సొమ్ము రాష్ట్ర స్థాయి అధికారికి చేరిందంటూ అవాస్తవాలతో పైత్యం ఒలకబోసింది. దీనిపై ఇంజినీరింగ్ వర్గాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అది ముమ్మాటికీ తప్పుడు కథనమే ఉయ్యాలవాడ: శ్రీశైలం నుంచి ఎస్సార్బీసీ కేసీ కెనాల్కు వచ్చే సాగు నీటికి రైతులు డబ్బులు ఇచ్చారని ఈనాడులో వచ్చిన వార్తా కథనాన్ని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు బుడ్డా చంద్రమోహన్రెడ్డి, ఆళ్లగడ్డ మార్కెట్యార్డ్ డైరెక్టర్ గజ్జెల క్రిష్ణారెడ్డి, మాజీ గ్రామ సర్పంచ్ ఆరికట్ల శివరామక్రిష్ణారెడ్డి రైతులతో కలిసి తీవ్రంగా ఖండించారు. సోమవారం స్థానిక ఎంపీపీ బుడ్డా భాగ్యమ్మ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రైతుల అభ్యర్థన మేరకు రాష్ట్ర సాగునీటి జలవనరుల సలహాదారులు గంగుల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి నీరు విడుదల చేయించారని పేర్కొన్నారు. అనంతరం ప్రధాన రహదారిపై రైతులు ఈనాడు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈనాడుది తప్పుడు కథనం కేసీ కెనాల్ పరిధిలో కర్నూలు, కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల్లో ఆయకట్టు ఉంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్లో 97 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఆగస్టు, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన ఐఏబీ సమావేశాల్లో డిసెంబర్ 15 వరకు నీటిని అందించాలని తీర్మానం జరిగింది. రైతుల విన్నపం మేరకు శ్రీశైలంలో లెవెల్ పర్మిట్ చేసేంత వరకు నీటి విడుదలకు చర్యలు తీసుకున్నాం. ముచ్చుమర్రి ద్వారా వారాబందీ ప్రకారం రాత్రి, పగలు గస్తీకాసి నీరు అందిస్తుంటే ఇంజినీర్లు డబ్బులు వసూలు చేశారంటూ తప్పుడు కథనం రాయడం బాధాకరం. – వి.తిరుమలేశ్వర రెడ్డి, కేసీ ఈఈ సాగునీరు కొనుక్కొనే దుస్థితి లేదు సాగునీటి కోసం అధికారులకు లంచాలిచ్చి కొనుక్కొనే దుస్థితి రైతుకు దాపురించలేదు. వర్షాభావంలోనూ మా పంటలకు నీరు ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు వచ్చి పంటలు పండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తుగా కుంటలను నింపుకునేందుకు కేసీ కెనాల్కి నీరు వదిలారు. – రామాంజనేయరెడ్డి, రైతు, గుండుపాపల చివరి పంటలకు సాగునీరు ఇచ్చారు ప్రభుత్వం రైతులకు సాగునీరు ఇచ్చి ఆదుకుందనే చెప్పాలి. ఎందుకంటే జలాశయాల్లో నీరు అంతంత మాత్రమే. అయినా మా పంటలు ఎండకూడదనే ఉద్దేశంతోనే వారాబందీగా నీరు అందించారు. ప్రస్తుతం చివరి ఆయకట్టు పంటలకు సాగునీరు అందింది. – వాసుడు, రైతు, చాకరాజువేముల -
శాస్త్రీయ వ్యవసాయ ప్రణాళిక ఏది?
గత ప్రభుత్వం వ్యవసాయ ప్రణాళికలను తయారు చేయకుండా రైతుల ఇష్టా నిష్టాలపై వ్యవసాయ ఉత్ప త్తులను సాగించింది. అంత కుముందు ఉన్న వ్యవసాయ ప్రణాళికలను 2021 –22 నుండి పూర్తిగా ఎత్తి వేసింది. మార్కెట్ ధరలను బట్టి రైతులు పంటలు పండించడమే తప్ప ప్రణాళికా బద్ధంగా వ్యవసాయ ఉత్పత్తి జరగలేదు. వ్యవసాయ ప్రణాళిక ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు చేయాలని జరిపిన ఆందోళనలు ప్రభుత్వం పట్టించుకోలేదు. వరి, పత్తి పంటలకు ఇచ్చిన ప్రాధాన్యం ఇతర పంటలకు ఇవ్వలేదు. రాష్ట్రంలో సాగుభూమి 163 లక్షల ఎకరాలు కాగా, వాస్తవంగా సాగుచేసింది 123 లక్షల ఎకరాలు మాత్రమే. అందులో యాసంగి 70 లక్షల ఎకరాలు మాత్రమే సాగయింది. అనగా వానాకాలం, యాసంగి కలిసి 200 లక్షల ఎకరాలు మాత్రమే సాగయింది. చాలామంది రైతులు చవిటి భూములలో కూడా పత్తి లాంటి పంటలు వేసి నష్టపోతున్నారు. ఏ భూమిలో ఏ పంటలు వేయాలన్నది భూసార పరీక్షలు నిర్వహించి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించాలి. భూసార పరీక్షలు జరిపి రైతులకు ‘సాయిల్ హెల్త్ కార్డు’ ఇవ్వాలి. భూసార పరీక్షలు జరపడం గత పదేళ్లుగా అమలు చేయనందున రైతులు తమకు తోచిన పంటలు పండిస్తున్నారు. పప్పులు, నూనెలు, ముతకధాన్యాల ఉత్పత్తులు హెచ్చుతగ్గులకు గురవు తున్నాయి. ముతక ధాన్యాల ఉప ఉత్పత్తులు (రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు) దిగుమతులు చేసుకుంటున్నాము. ఒకవైపున జనాభా 1.9 శాతం పెరుగుతుండగా వ్యవసాయ భూమి విస్తీర్ణం తగ్గుతున్నది. పెరుగు తున్న జనాభాకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతలు నిరంతరం పెరగాలి. ఇందుకుపంటల పరిశోధనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. 2014 తర్వాత నుంచి వ్యవసాయ పరిశోధనా ఫలితాలను కూడా దిగుమతి చేసు కున్నాము. మోన్శాంటో, డ్యూపాంట్, కార్గిల్, సింజెంటా, బేయర్ లాంటి సంస్థలు వ్యవసాయ పరిశోధనలు చేసి లాభాలు సంపాదిస్తున్నాయి. రాష్ట్ర వాతావారణానికి అనుకూలంగా ప్రాంతీయంగా వ్యవసాయ పరిశోధనలు జరగాలి. ఇతర దేశాలలోని పరిశోధనా ఫలితాలను వినియోగించడం ద్వారాపంటల ఉత్పత్తులు దెబ్బతిని రైతులు నష్ట పోతు న్నారు. ప్రతి మూడువేల ఎకరాలకు ఒక ఏఈఓను (వ్యవసాయ విస్తరణాధికారి) నియమించాలని రైతులు ఆందోళన నిర్వహించారు. అయినప్పటికీ నేటికీ తగినంతమంది వ్యవసాయ అధికారులను గత ప్రభుత్వం నియమించలేదు. హార్టికల్చర్ శాఖలో 2179 పోస్టులకు గాను 901 ఖాళీగా ఉన్నాయి. వ్యవసాయ శాఖలో 2,800 పోస్టులు ఖాళీలున్నాయి. రాష్ట్రంలో 1,167 గోదాముల ద్వారా 24.74 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సౌకర్యాన్ని కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 2014 వరకు 710 గోదాములలో 7.39 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. ఆ తర్వాత ప్రకటించిన 457 గోదాముల నిర్మాణం నేటికీ పూర్తికాలేదు. వ్యవసాయ ఉత్పత్తులను గ్రేడింగ్ చేసి బాక్సులు లేదా సంచులలో నింపి గోదాములలో నిల్వ చేయాలి. వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి అదనపు ఆదాయం వచ్చేవిధంగా ప్రణాళికను రూపొందించి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. వ్యవసాయ ప్రణాళికలో పంట రుణాలుఅత్యంత కీలకమైనవి. రిజర్వు బ్యాంకు ఆదేశాల ప్రకారం బ్యాంకుల వాణిజ్య వ్యాపారంలో 40 శాతం వ్యవసాయ రంగానికి రుణాలివ్వాలి. అందులో 18 శాతం పంటరుణాలు ఇవ్వాలి. అందుకు తగినవిధంగా ప్రతి ఏటా మే నెలలో వ్యవసాయ రుణ ప్రణాళికను తయారుచేయాలి. కానీ వ్యవసాయ శాఖ ఆగస్టులో రుణప్రణాళికను విడుదల చేస్తున్నది. వ్యవసాయ బడ్జెట్ తగినంత కేటాయించకపోవడం వల్ల వ్యవసాయా భివృద్ధికి, నూతన టెక్నాలజీని వినియోగించడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. 2023–24లో రూ. 18,370 కోట్లు కేటాయింపులు చూపారు. కానీఇందులో రైతుబంధు రూ. 11,704 కోట్లు, రైతు బీమా రూ. 1,167 కోట్లు, వ్యవసాయ రుణమాఫీ రూ. 4,692 కోట్లు, మ్తొతం రూ. 17,565 కోట్లు కేటాయించారు. ఈ పథకా లను మినహాయిస్తే వ్యవసాయానికి కేటాయించింది రూ. 807 కోట్లు మాత్రమే. వ్యవసాయ ప్రణాళికను శాస్త్రీయంగా రూపొందించడం వలన వ్యవసాయ ఉత్పత్తులు పెరగడానికి రాష్ట్రంలో వాతావరణ అనుకూలత ఉంది. సమ శీతోష్ణ వాతావరణం వలన రాష్ట్రంలో విత్తనోత్పత్తితో పాటు వాణిజ్య పంటలకు, హార్టికల్చర్ పంటలకు అవకాశాలున్నాయి. వాతావరణాన్ని బట్టిపంటలు పండించేందుకు తగిన శిక్షణనివ్వాలి. ప్రభుత్వ రంగంలోని పరిశోధనా కేంద్రాలకు శాస్త్ర వేత్తలను, నిధులను కేటాయించి అధికోత్పత్తికి దోహదం చేయాలి. - వ్యాసకర్త రైతుసంఘం తెలంగాణ ఉపాధ్యక్షులు - సారంపల్లి మల్లారెడ్డి -
రబీలోనూ ప్రత్యామ్నాయ పంటలు
సాక్షి, అమరావతి : రబీ సీజన్లోనూ నెలకొన్న వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. సీజన్లో నెలకొన్న బెట్ట పరిస్థితులకనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుచేసేందుకు కార్యాచరణ సిద్ధంచేసింది. సీజన్ ఆరంభమై నెలన్నర రోజులైన నేపథ్యంలో.. రబీసాగు లక్ష్యం 55.96 లక్షల ఎకరాలుగా కాగా, ఇందుకు 3,64,372 క్వింటాళ్ల విత్తనం అవసరమని వ్యవసాయ శాఖ ఇండెంట్ పెట్టింది. దీంతో 3,78,200 టన్నులను ఆర్బీకేల్లో పొజిషన్ చేయగా, ఇప్పటివరకు 2,49,647 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. ప్రధానంగా 2.45 లక్షల క్వింటాళ్ల శనగ, 3,500 క్వింటాళ్ల వేరుశనగ, 500 క్వింటాళ్ల చొప్పున వరి, పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశారు. గతేడాది ఇదే సమయానికి 10.81 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 8.5 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై వ్యవసాయ శాఖ దృష్టిసారించింది. ఇప్పటికే ఆ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీజన్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులను ప్రతీ 15 రోజులకోసారి సమీక్షిస్తూ తదనుగుణంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. అలాగే, అచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సిఫార్సులకనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించారు. గోదావరి ప్రాజెక్టు కింద సాగునీరు గోదావరిలో పుష్కలంగా నీరుండడంతో ఈ ప్రాజెక్టు పరిధిలో వ్యవసాయ, ఆక్వా అవసరాలకు తగినంత నీరివ్వనున్నారు. ఐఏబీ–డీఏఏబీ సమావేశంలో ఏ మేరకు సాగునీరు ఉందో అంచనావేస్తూ ఎంత విస్తీర్ణంలో సాగుకు నీరు ఇవ్వగలమో రైతులకు ముందుగానే చెబుతున్నారు. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు కాలువల కింద నీటి సరఫరాను నిలిపివేసే తేదీలపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం కల్పింస్తున్నారు. ఇక శివారు ప్రాంతాల్లో (టెయిల్ ఎండ్ ఏరియాస్) సాధ్యమైనంత త్వరగా నాట్లు వేసుకునేలా అవగాహన కల్పింంచడంతో పాటు నీటి యాజమాన్య పద్ధతులు విధిగా పాటించేలా రైతులను అప్రమత్తం చేయనున్నారు. గోదావరి డెల్టా పరిధిలో వెదజల్లు సాగును ప్రోత్సహించడంతో పాటు అత్యధిక నీటి వినియోగమయ్యే పంటల్లో ఒకటైన మొక్కజొన్న సాగును కాలువల కింద ప్రోత్సహించకూడదని నిర్ణయించారు. వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఐఏబీ, డీఏఏబీ సమావేశాలను సంయుక్తంగా నిర్వహించనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మెట్ట ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా అపరాల సాగును, కాలువల ఎగువ ప్రాంతాల్లో అపరాలతో పాటు మొక్కజొన్న సాగును ప్రోత్సహిస్తారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకనుగుణంగా 14 జిల్లాల పరిధిలో కనీసం 60వేల ఎకరాల్లో కంటిజెంట్ ప్లానింగ్ అమలుచేస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం 6,229 క్వింటాళ్ల విత్తనం అవసరమని గుర్తించారు. వీటిని సబ్సిడీపై రైతులకు అందించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం స్వల్పకాలంలో చేతికొచ్చే పంటల సాగును ప్రోత్సహించేలా రూపొందించిన ఈ కార్యాచరణను ఆర్బీకేల ద్వారా కరపత్రాలు, వాల్ పోస్టర్లతో ప్రచారం చేస్తున్నారు. అంతేకాక.. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికనుగుణంగా సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులకు సంబంధించి శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో కూడిన చిన్నపాటి వీడియో, ఆడియో సందేశాలతో రైతులకు అవగాహన కల్పింస్తున్నారు. -
వాస్తవ రూపంలో ‘దున్నేవాడిదే భూమి’
‘ఎవరెన్ని చెప్పినా పేద ప్రజల ప్రయోజనాలకు మాత్రం రక్షణ లేదు. మన ప్రభుత్వం నమ్రతతో ఈ సత్యాన్ని అంగీకరించి తీరాలి’ అని ఒకప్పుడు కఠోర సత్యం చెప్పారు మహాత్మా గాంధీ. కానీ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా కూడా ఆ ధోరణిలో మార్పు రాలేదు. తరాలుగా పేద ప్రజలు కాయకష్టం చేసి సంపద సృష్టిస్తున్నారు. అలాంటి పేద ప్రజలకు నిర్ణయాధికారం లేదు. వారి యాజమాన్య హక్కులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రాణం పోశారు. అసైన్డ్ భూముల మీద వారికి పూర్తి హక్కులు కల్పించడం ఒక చారిత్రక నిర్ణయం. దశాబ్దాలుగా పోరాటాల రూపంలో వెల్లడైన పేదల కాంక్షలకు నేటి ఈ నిర్ణయం అంతిమ విజయంగా భావించుకోవాలి. ‘‘కోట్లాది దేశ ప్రజలకు ఆహార పంటలు అందించే రైతులకన్నా దేశంలోని పెట్టుబడి దారులకే ప్రభుత్వాలు సర్వ సౌకర్యాలు కల్గిస్తున్నాయి. ఇది కంటికి కన్పించే నగ్న సత్యం. నేను పెట్టుబడిదారులకు వ్యతిరేకిని కాదు. నిజం చెప్పాలంటే, నేను ఒక పెట్టుబడిదారుడికి చెందిన ఇంట్లోనే ఉంటు న్నాను. కానీ పెక్కుమంది పెట్టుబడిదారుల వైఖరి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రభుత్వాలు మాత్రం తాము పేద ప్రజలకు చేయవలసిందంతా చేస్తున్నామని పైకి చెప్పొచ్చుగాక. ఆ మాటకొస్తే వలస పాలకు లైన బ్రిటిష్ వాళ్ళు కూడా అలాగే చెబుతూండేవాళ్లు. అసలు సత్యం ఏమంటే – ఎవరెన్ని చెప్పినా పేద ప్రజల ప్రయోజనాలకు మాత్రం రక్షణ లేదు. మన ప్రభుత్వం నమ్రతతో ఈ సత్యాన్ని అంగీకరించి తీరాలి. అంతేగాదు, ఏ ప్రయివేట్ ఆస్తి అయినా సరే, అది సిగ్గుఎగ్గూ లేకుండా దొంగిలించిన ఆస్తిగానే నేను పరిగణిస్తాను. ఎవరైనా సరే తన కాయకష్టం ద్వారా సంపాదించని ఆస్తి, లేదా బతుకుతెరువుకు అవసర మైన కనీస శ్రమ ఫలితంగా దక్కని సొమ్ము... సిగ్గూ ఎగ్గూ లేని సంపా దన అవుతుంది.’’ – మహాత్మా గాంధీ (11.12.1947). వి. రామ్మూర్తి ‘హిందూ’ పత్రిక తరఫున ఎడిటర్గా సంకలనం చేసి ‘కస్తూరి అండ్ సన్స్ లిమిటెడ్ (చెన్నై) తరఫున 2003లో ప్రచురించిన గ్రంథం నుంచి. తరాలుగా పేద ప్రజలు కాయకష్టం చేసి సంపద సృష్టిస్తున్నారు.ఆ బడుగు, బలహీన వర్గాలకు చెందిన హక్కులను మొట్టమొదటి సారిగా సాధికారికంగా క్రోడీకరించి... ‘దున్నేవాడిదే భూమి’ అన్న దశాబ్దాల వామపక్ష ఉద్యమాల స్ఫూర్తిని కొలది రోజుల నాడు ఆచరణలోకి తెచ్చారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. పేద ప్రజల సాగు హక్కులకు ప్రాణం పోశారు. దీనితో పది రకాల వ్యాఖ్యా నాల ద్వారా పేదల భూమి హక్కులను, సాగు హక్కులను తారు మారు చేసే మోతుబరుల ప్రయత్నాలకు స్వస్తి పలికారు. రాష్ట్రంలో మరే ప్రభుత్వం వచ్చినా, దీన్ని చెదరగొట్టే ప్రయత్నాలు చెల్లవు. ఆ ప్రయత్నాల్ని తిప్పికొట్టే శక్తినిచ్చేదే ఈ ముందడుగు. వామపక్షాలు దశాబ్దాల తరబడిగా ఆంధ్ర, తెలంగాణలలో కౌలు దారీ చట్టాల కోసం చేస్తూ వచ్చిన పోరాటాలతో సాధించిన పాక్షిక విజయాలకు... నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు అసైన్డ్ భూములపై హక్కులు ఇచ్చిన తీరు భూ చరిత్రలో అంతిమ విజయంగా భావించుకోవాలి. పేదలకు ఈ యాజమాన్య హక్కులు రావడం వలన వారు అవసరం అయితే తమ భూమిని విక్రయించుకోవచ్చు. ఇక, ఇంతకుపూర్వం కౌలు రైతులకు రుణాలు పొందే అర్హత కార్డులు ఉండేవి కావు. ఈ కార్డులు లేకనే బ్యాంకులు రుణాలివ్వలేదు. ఎంతసేపూ భూములకు పట్టాలున్న రైతుల్నే గుర్తిస్తారు. కౌలు రైతులను గుర్తించేది లేదన్న వైఖరిని కేసీఆర్ లాంటి నాయకులు కనబరిచారు. ఏదైనా ఇంట్లో అద్దెకు ఉంటే, ఆ ఇంటిపై హక్కు అతనికి ఇవ్వగలమా అని కూడా ప్రశ్నించారు. కానీ ఒకప్పుడు వై.ఎస్. రాజ శేఖర రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో నాలుగు లక్షల మందికి పైగా కౌలు రైతులు రుణ అర్హత కార్డులు పొందారు. తద్వారా అనేకమంది బ్యాంకు రుణాలు పొందగలిగారు. కౌలుదారులకు విధిగా వర్తించాల్సిన రక్షణ చట్టాల కోసం సుదీర్ఘ పోరాటాలు జరిగిన చరిత్ర ఉంది. ఆంధ్ర–తెలంగాణ వామపక్ష నాయకులు ఆ యా ప్రాంతాలలో విడివిడిగానూ, ఉమ్మడి గానూ కలిసి పోరాటం జరిపారు. చండ్రరాజేశ్వర్రావు, చలసాని వాసుదేవరావు, రావి నారాయణరెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మగ్దుం మొహియుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, ఎస్వీకే ప్రసాద్– సుగుణ దంపతులు లాంటివాళ్లు ఇందులో ఉన్నారు. ఉభయ రాష్ట్రాల చరిత్రలో తొలి భూపోరాటాలు, పాక్షిక విజయాలన్నీ వామపక్షాల నేతృత్వంలోనే సాధ్యమయ్యాయి. ఒక్క ముక్కలో, పాత ఫ్యూడల్ శక్తులకు ముగుదాడు వేసి సాధించిన విజయాలన్నీ వామపక్షాలు బలంగా ఉన్నప్పటివే. అవి ఎప్పుడు బలహీనపడ్డాయో అప్పటినుంచీ పటిష్ఠమైన పార్టీగా ఉమ్మడి వామపక్షాల మాట గతకాలపు ‘ముచ్చట’గానే మిగిలి పోయింది. కానీ ప్రస్తుత దశ వేరు. కార్పొరేట్ శక్తుల చేతిలో దేశం నడుస్తున్నది. చాలక, వారి ఆధ్వర్యంలో ప్రసార మాధ్యమాలు కూడా లొంగిపోతున్నాయి. దేశీయ, విదేశీయ ఆశ్రిత పెట్టుబడుల పెత్తనం స్వతంత్ర భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను పాతి పెట్టింది. ఈ దుఃస్థితిని కనిపెట్టిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్, ‘రానున్న రోజుల్లో ప్రజలు పార్లమెంట్ను కూల్చేస్తా’రని ముందుగానే హెచ్చరించారు. గత పదేళ్లుగా ప్రతియేటా భారత పరిశోధనా సంస్థ ‘ఏడీఆర్’ నివేదికలు విషాద వాస్తవాన్ని చెబుతున్నాయి. అటు పార్లమెంట్ సభ్యులలో (అన్ని రకాల పార్టీల వాళ్ళు), ఇటు రాష్ట్రాల శాసన సభ్యులలో, మంత్రులలో ఎంత భారీ స్థాయిలో అవినీతి పేరుకు పోయిందో, సవరణకు వీలుకాని స్థాయిలో అవినీతి ఎలా రాజ్య మేలుతోందో ఏడీఆర్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందుకే మన పాలకుల్ని ఉద్దేశించి ఒక మహాకవి ఇలా హెచ్చరించాడు:‘విజ్ఞానం వికసించదు విదేశాలు తిరిగొస్తేనే పరిణతమతి ప్రసరించదు పురాణాలు తిరగేస్తేనే!’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాకులు abkprasad2006@yahoo.co.in -
Andhra Pradesh: లంక భూములు గట్టెక్కాయి
మా తాత నుంచి నాకు అర ఎకరం పొలం వచ్చింది. కాగితాలు లేకపోవడంతో ఆ భూమిపై మాకు ఎలాంటి హక్కు లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇందుకోసం చాలా డబ్బు ఖర్చు చేశాం. జగన్ ప్రభుత్వం వచ్చాక పైసా ఖర్చు లేకుండా మా భూమికి పట్టా ఇస్తున్నారు. ఆయనకు రుణపడి ఉంటాం. – తోడేటి నాంచారయ్య, చింతల్లంక, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా ((బాపట్ల జిల్లా కొల్లూరు, భట్టిప్రోలు నుంచి సాక్షి ప్రతినిధి బి.ఫణికుమార్)): ఇది నిన్న, మొన్నటిది కాదు.. కొన్ని దశాబ్దాలు, తరాల సమస్య. గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాల్లో లంక భూములను సాగు చేసుకుంటున్న రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏడాదికి మూడు పంటలు పండే ఈ భూములు ఎంతో విలువైనవి. అయితే వాటికి కాగితాలు, పాస్ బుక్లు లేకపోవడంతో రైతులు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. వ్యవసాయ రుణాలు, రైతులకు అందే ఇతర ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు లభించేవి కావు. తమ సమస్యను పరిష్కరించాలని రైతులు దశాబ్దాల నుంచి ప్రజాప్రతినిధులను, అధికారులను కలుస్తూనే ఉన్నారు. అయితే ప్రయోజనం శూన్యం. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక లంక రైతుల సమస్యపై దృష్టి సారించింది. మొత్తం 8 జిల్లాల్లో ఏకంగా 9,062 ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయంతో 17,768 మంది లబ్ధిదారుల కుటుంబాల్లో వెలుగులు ప్రసరించనున్నాయి. వీరు సాగుచేసుకుంటున్న భూములకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 17న పట్టాలివ్వనున్నారు. సాక్షి బృందం బాపట్ల జిల్లా కొల్లూరు, భట్టిప్రోలు మండల్లాలోని దోనేపూడి, జువ్వలపాలెం, సుగ్గునలంక, చింతల్లంక, చిలుమూరు లంక, వెల్లటూరు, పెదపులివర్రు, పెదలంక, ఓలేరు తదితర లంక గ్రామాల్లో పర్యటించినప్పుడు అక్కడి రైతులు ఇన్నేళ్లుగా తాము పడిన బాధలను పంచుకున్నారు. తమ జీవితకాలంలో ఈ సమస్య పరిష్కారమవుతుందని అనుకోలేదని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీన్ని సులువుగా పరిష్కరించారని కొనియాడారు. ఆయన మేలును మరిచిపోలేమని భావోద్వేగానికి గురయ్యారు. దళితులంటే ఆయనకు ఎంత అభిమానమో లంక భూముల సమస్య పరిష్కారంలోనే అర్థమవుతోందని కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ఒక్క కొల్లూరు మండలంలోనే 710 మంది రైతులకు 295 ఎకరాలకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ పట్టాలు అందించనున్నారు. లంక భూముల కథ ఇది.. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో ఒండ్రు మట్టి ఒక చోటకు చేరడంతో ఏర్పడ్డ సారవంతమైన భూములే.. లంక భూములు. కృష్ణా, ఎనీ్టఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో తరతరాలుగా రైతులు వాటిని సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ భూములకు సంబంధించి వేలాది మంది రైతులకు పట్టాలు లేవు. తమకు పట్టాలు ఇవ్వాలని కొన్ని దశాబ్దాలుగా అక్కడి రైతులు ప్రభుత్వాలను కోరుతూ వచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షణలు చేసినా ఫలితం శూన్యం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు సిద్ధమైంది. వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలు ఇచ్చేందుకు వీలుగా లంక భూముల అసైన్డ్ నిబంధనలు సవరించింది. ఈ భూములను మూడు కేటగిరీలుగా గతంలోనే విభజించింది. గట్టుకు దగ్గరగా ఉండి వరద వచ్చినా కొట్టుకుపోని భూమిని ఏ కేటగిరీగా, ఏ కేటగిరీకి ఆనుకుని కొంత నదిలోకి ఉన్న భూమిని బి కేటగిరీగా, ఏ, బీ కేటగిరీకి ఆనుకుని వరదలు వస్తే పూర్తిగా మునిగిపోయే భూమిని సీ కేటగిరీగా వర్గీకరించింది. ఏ, బీ కేటగిరీ భూములకు పట్టాలు, సీ కేటగిరీ భూములకు లీజు పట్టాలు ఇవ్వనుంది. మా ఇంటికి వెలుగు తెచ్చారు.. 50 ఏళ్లకు ముందు నుంచి ఎకరం భూమిని లంకలో సాగు చేసుకుంటున్నాం. కానీ కాగితాల్లో మాత్రం అది మా భూమి కాదని ఉంది. దానిపై కనీసం బ్యాంకు రుణం ఇమ్మన్నా ఇచ్చేవారు కాదు. ప్రజాప్రతినిధులను, అధికారులను ఎన్నోసార్లు కలిసి న్యాయం చేయాలని అడిగినా పట్టించుకోలేదు. ఇప్పుడు జగనన్న వచ్చాక మా ఇంటికి వెలుగు తెచ్చారు. మా భూమికి పట్టా ఇస్తున్నారు. – తోడేటి రత్నాకరరావు, చింతల్లంక, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా నాలాంటి ఎంతోమంది కష్టాలను తీర్చారు.. నాకున్న ఎకరం భూమికి కాగితాలు, పాస్బుక్లు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు జగనన్న నా భూమికి పట్టా ఇస్తున్నారు.. ఎంతో ఆనందంగా ఉంది. లంకల్లో నాలాంటి ఎంతో మంది కష్టాలను తీరుస్తున్నారు. ఆయన మేలు మర్చిపోలేం – ఈపూరి ఏబేలు, చింతల్లంక, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా ఎప్పటికీ మా బాధ తీరదనుకున్నాం.. మేం సాగు చేసుకుంటున్న లంక భూములంటే అందరూ చిన్నచూపు చూసేవారు. ఎంతో విలువైన భూమి ఉన్నా దానికి కాగితాలు లేవు. ఎప్పటికీ మా బాధ తీరదనుకున్నాం. జగన్ సీఎం అయ్యాకే లంక భూముల సమస్యపై దృష్టి పెట్టారు. ఆయన వచ్చినప్పటి నుంచి మా సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకం ఉండేది. మేం ఆశించినట్లుగానే ఎవరూ చేయని పనిని ఆయన చేసి మాకు న్యాయం చేశారు. – బొజ్జా రమేశ్, వెల్లటూరు, భట్టిప్రోలు మండలం, బాపట్ల జిల్లా పేదల దేవుడినని నిరూపించారు.. మేం జీవించి ఉండగా ఈ సమస్య పరిష్కారమవుతుందని అనుకోలేదు. ఇంత క్లిష్టమైన సమస్యను సీఎం జగన్ చాలా తేలిగ్గా పరిష్కరించారు. లంక భూములకు దారి చూపించి తాను పేదల దేవుడినని నిరూపించారు. – ఏలూరి శేషగిరిరావు, వెల్లటూరు, భట్టిప్రోలు మండలం, బాపట్ల జిల్లా -
వ్యర్థాలూ ఆదాయ మార్గం కావాలి!
పంట వ్యర్థాలను సేకరించే శ్రమను తీసుకోవాలంటే రైతులకు ఒక ప్రేరణ అవసరం. అన్ని రకాల వ్యవసాయ వ్యర్థాలూ ఎరువులను ఉత్పత్తి చేయడానికి అనువైనవి. దీని నుంచే వచ్చే ఘన ఎరువు స్వయంగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న సేంద్రియ ఎరువు. ఇందులో వెలువడే మీథేన్ను వెంటనే వాడుకునే వీలుగా వేరే చోటికి పైపుల ద్వారా తరలించాలంటే, దానిలోని ఇతర వాయువులను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రాంతంలో లభించే పంట అవశేషాలు, ఇతర వ్యవసాయ వ్యర్థాల పరిమాణంపై ప్రభుత్వం నమ్మదగిన అంచనాలతో ముందుకు వస్తే, వ్యవస్థాపకులు తగిన పరిమాణాలలో బయోడైజెస్టర్లను ప్లాన్ చేయవచ్చు. అప్పుడు కాలుష్యానికి కారణమయ్యేలా పంట వ్యర్థాలను వృథాగా కాల్చే పనివుండదు. ప్రభుత్వ సీనియర్ అధికారులు కచ్చితంగా క్వాంటమ్ కణాలకు చాలా భిన్నమైనవారు. అయినప్పటికీ, కణాలకూ, అధికారులకూ ఒక సారూప్యమైన గుణం ఉంటుంది. గమనించినప్పుడు స్థితి మార్చుకోవడం! పరిశీలనకుసంబంధించిన తక్షణ చర్యే మార్పును ప్రేరేపిస్తుంది. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం పంట అవశేషాల దహనానికి స్వస్తి చెప్పాలని ఉత్తర భారత రాష్ట్రాల అధికారులను ఆదేశించినందున, అది ఎలా చేయాలో వారికే వదిలేస్తే, మనం ఎంతో కొంత చర్యను ఆశించవచ్చు. తదుపరి పంటను వేయడానికి తమ పొలాల్లోని పంట అవశేషాలను తొలగించాల్సిన రైతులతో విభేదాలు లేకుండా కోర్టు ఆదేశాలపై ఎలా చర్య తీసుకోవాలనే విషయంపై ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి. ప్రపంచంలోని ఐదు అత్యంత కాలుష్య నగరాలలో నాలుగు దక్షిణాసియా నగరాలే. అవి: లాహోర్, ఢిల్లీ, ముంబై, ఢాకా. భారత దేశం, పాకిస్తాన్ సరిహద్దుకు ఇరువైపులా ధాన్యాన్ని వేరుచేసిన తర్వాత పొలాల్లో మిగిలినదాన్ని తగుల బెట్టే ఆచారం సమస్యలకు కారణం అవుతోంది. వాస్తవానికి, గాలిలో సాంద్రతలో ఈ మసి గరిష్ఠంగా 40 శాతం వరకు ఉంటుంది. దీంతో గాలి వేగాన్ని తగ్గించే వాతావరణం ఏర్పడడం వల్ల, కురుస్తున్న వర్షాన్ని అరికట్టడం వల్ల ఈ కాలుష్య కారకాలు చాలాకాలం పాటు అలా గాలిలో నిలిచివుంటాయి. ఇది గాలి నాణ్యతను గణనీయంగా క్షీణింపజేస్తుంది. వాహనాల పొగ, నిర్మాణపరమైన పనుల వల్ల ఏర్పడే దుమ్ము కాలుష్య కారకాలలో ఎక్కువ భాగంగా ఉంటున్నాయి. ఈ కాలుష్య మూలాలను అరికట్టడం చాలా కష్టం. వాహనాల కాలుష్యాన్ని తొల గించాలంటే, శిలాజ ఇంధనాలను వినియోగించే అంతర్గత దహన యంత్రాల స్థానంలో వాహనాలకు విద్యుచ్ఛక్తిని ఇవ్వాల్సి ఉంటుంది. శుభ్రపర్చిన ఇంధనాలు, మెరుగైన ఇంజన్లు తాత్కాలికంగా సహాయ పడతాయి. కాలుష్య కారక వాహనాలను శుభ్రపరిచి వాటిని మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దీనికి సమయం పడుతుంది. రోడ్డుపై నుండి వాహనాలు వెలువరించే ధూళిని ఎలా తగ్గించవచ్చు అంటే... అన్ని రోడ్ల పక్కన బహిర్గతమైన నేల, బహిరంగ ప్రదేశాలను కప్పడానికి గడ్డిని నాటడం ద్వారా. వెంటనే మొదటి గాలికే దుమ్మును దులిపే రకం చెట్లను కాకుండా, ఆ దుమ్మును నిలుపుకోగలిగే పచ్చద నాన్ని నాటడం కూడా మేలుచేస్తుంది. అయితే ఎడారి నేల మీదుగా వీచే గాలుల ద్వారా కొట్టుకువచ్చే దుమ్మును తగ్గించడానికి చేయ గలిగేది తక్కువ. నగరాల్లో జరిగే నిర్మాణ పనుల్లో దాని స్థానిక రూపంలోని పొడి సిమెంట్ను కాకుండా ముందే కలిపిన కాంక్రీట్ను మాత్రమే ఉపయో గించేట్టు చేయాలి. కాంక్రీట్ కలపడం కూడా బహిరంగంగా కాకుండా పరివేష్టిత ప్రదేశాలలో జరగాలని పట్టుబట్టడం ద్వారా చాలావరకు నిర్మాణాల పరమైన ధూళిని అరికట్టవచ్చు. ఇవి అవసరమైన చర్యలు. సంపూర్ణంగా ఆచరణీయమైనవి. అలాగని 19వ శతాబ్దానికి చెంది నట్లుగా ఇంకా పంట అవశేషాలను తగులబెట్టడం కొనసాగాలని అర్థం కాదు. ఆ అలవాటు అంతరించిపోవాలి. కానీ ఎలా? పంట వ్యర్థాలు, అలాగే అన్ని రకాల వ్యవసాయ వ్యర్థాలు, జీవ జీర్ణక్రియలో చిక్కుకున్న శక్తిని విడుదల చేయడానికీ, ఎరువులను ఉత్పత్తి చేయడానికీ అనువైనవి. నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, పేడనీళ్లతో కలిపిన మొక్కల అవశేషాలు మీథేన్గా కుళ్లిపోతాయి. దీని నుండి అవసరమైతే ఘన ఎరువులను తీయవచ్చు. దీనికిదే స్వయంగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న సేంద్రియ ఎరువు. ఇందులో వెలువడే మీథేన్ను వెంటనే వాడుకునే వీలుగా వేరే చోటికి పైపుల ద్వారా తరలించాలంటే, దానిలోని ఇతర వాయువు లను శుభ్రం చేయాల్సి ఉంటుంది. బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించడం, వాటిని నిర్వహించడం అనేవి వ్యవసాయానికి భిన్నమైన కార్యకలాపాలు. బయోగ్యాస్ ప్లాంట్ నిర్వాహకులు కొనుగోలు చేయగలిగిన పంట అవశేషాలను కుప్పలుగా సేకరించడానికి రెతుకు ఒక ప్రేరణ అవసరం. పంట వ్యర్థా లను వదిలించుకోవడానికి ఒక మార్గం ఏమిటంటే, హ్యాపీ సీడర్ అనే యంత్రాన్ని ఉపయోగించడం. ఇది పొలాల నుండి వ్యర్థాలను అటు తీస్తూనే, ఇటు తదుపరి పంట విత్తనాలను నాటుతుంది. ఆ వ్యర్థాలను పొలంలోనే నశించేట్టు చేస్తుంది. అయితే ఈ పరికరం విస్తృతమైన కొనుగోలుకు లేదా అద్దెకు నోచుకోలేదు. తదుపరి పంటను నాటడా నికి ఉన్న విరామం చాలా స్వల్పం. రైతులందరికీ ఆ వ్యవధిలో పని చేయడానికి సరిపడా హ్యాపీ సీడర్లు అందుబాటులో లేవు. బయోగ్యాసును ఉత్పత్తి చేసే శక్తిమంతమైన కొత్త పరిశ్రమకు ముడి పదార్థంగా ఈ పంట అవశేషాలను అందించడమే మేలైన ప్రత్యామ్నాయంగా కనబడుతోంది. దీనిద్వారా రైతులు తమ పంట అవశేషాలను విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందు తారు. పైగా సింథటిక్ ఎరువుల ధరతో పోల్చదగిన ధరకు సేంద్రియ ఎరువులు అందుబాటులో ఉంటాయి. కానీ పంట అవశేషాలు అనేవి చురుకైన కాలుష్య కారకాల నుండి అదనపు వ్యవసాయ ఆదాయానికి పనికొచ్చే ప్రయోజనకరమైన ప్రవాహంగా మారడం దానంతటదే జరగదు. దానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బయోడైజెస్టర్లు వివిధ స్థాయుల సాంకేతిక అధునాతనత్వంతో రావచ్చు. ఇది ఎక్కువగా ముడి పదార్థంగా ఉపయోగించే వివిధ రకాల సేంద్రియ పదార్థాల ముందస్తు చికిత్సపై ఆధారపడి ఉంటుంది. ఒక భారతీయ బహుళజాతి సంస్థ బయోగ్యాస్ కోసం పెద్ద ప్రణాళికలను కలిగి ఉంది. బహుశా అధునాతన బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించి సరఫరా చేస్తుంది. ఇది ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో చెరకు పంట వ్యర్థాలను నిర్వహిస్తోంది. ప్రతి ప్రాంతంలో లభించే పంట అవశేషాలు, ఇతర వ్యవసాయ వ్యర్థాల పరిమాణంపై ప్రభుత్వం నమ్మదVýæ్గ అంచనాలతో ముందుకు వస్తే, వ్యవస్థాపకులు తగిన పరిమాణాలలో బయోడైజెస్టర్లను ప్లాన్ చేయవచ్చు. ఈ ప్రక్రియ పట్ల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఆలో చించి సబ్సిడీతో బలం చేకూర్చినప్పటికీ, ప్లాంట్లను నిర్మించడం, గ్యాçసు కోసం పైప్లైన్ నెట్వర్క్ వేయడం, గ్యాసును ఎలా ఉపయోగించాలో నిర్ణయించడం వంటి వాటికి కాస్త సమయం పడుతుంది. అయితే ఇప్పుడు పంట వ్యర్థాలను తగలబెట్టడం ఆపేయాలని కోర్టు ఆదేశం. దీని వల్ల మంటలను ఎలాగైనా ఆర్పడానికి పోలీసులను ఉపయోగించాలనే ఆలోచన కలిగించవచ్చు. ఇది ఓటర్లుగా కూడా ఉన్న రైతుల్లో భిన్నమైన మంటలను రేకెత్తిస్తుంది. అందువల్ల పంట వ్యర్థాలను సేకరించడం, నిల్వ చేయడమే సరైన పరిష్కారం. వ్యర్థా లను బయటకు తీయడానికి, రవాణా చేయడానికి రైతులకు అయ్యే ఖర్చును భరించడానికి ఒక సేకరణ ఏజెన్సీ సరిపోతుంది. భాక్రానంగల్ డ్యామ్ నిర్మిస్తున్నప్పుడు, దాని నిర్మాణానికి చెల్లించాల్సిన పన్ను గురించి రైతులు నిరసన వ్యక్తం చేసినప్పుడు, రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులు ఆ ప్రాంతాన్ని రైతులు సందర్శించేలా చూశారు. తమ ముందు రూపుదిద్దుకుంటున్న ఆధునిక అద్భుతాన్ని స్వయంగా చూసేందుకు రైతులను ప్రాజెక్ట్ స్థలానికి తీసుకెళ్లారు. ప్రతాప్ సింగ్ ౖకైరోన్(పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి), అప్పటి వ్యవసాయ కార్యదర్శి ఆర్ఎస్ రంధావా, అప్పటి శాఖ డైరెక్టర్ డాక్టర్ అర్జున్ సింగ్ వంటి వారు గ్రామీణ ప్రాంతాలలో పర్యటించారు. రైతులు మరింత ఆహా రాన్ని పండించాలనీ, మార్పునకు ఏజెంట్లుగా ఉండాలనీ కోరారు. నేడు పంజాబ్లోని రాజకీయ, పరిపాలనా నాయకులు మార్పుకు ఏజెంట్లుగా మారడానికి అవకాశం ఉంది. అయితే వారు ఈ సంద ర్భానికి తగినట్టుగా ప్రవర్తించగలరా అనేది ప్రశ్న. టి.కె. అరుణ్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఒక్క రోజులోనే మార్కెట్కు 6వేళ క్వింటాళ్ల వరి ధాన్యం
జనగామ: వానాకాలం సీజన్లో ముందస్తు సాగు చేసిన వరి ‘కోతలు’ ముమ్మరంగా సాగుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు మార్కెట్ బాట పట్టారు. దీంతో రికార్డు స్థాయిలో వస్తున్న ధాన్యం రాశులతో జనగామ వ్యవసాయ మార్కెట్ నిండి పోతున్నది. గురువారం ఒక్కరోజే ఆరువేల క్వింటాళ్లకు పైగా ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రూ.500 తక్కువగా వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో మరో రూ.200 పెచేలా చూడాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్ 1.72 లక్షల ఎకరా ల్లో వరి సాగు చేశారు. ఏటా ఈ సీజన్లో కత్తెర సాగుతో పాటు రెగ్యులర్ పంట వేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. సెప్టెంబర్ రెండవ వారం వరకు కత్తెర కోతలు పూర్తి కాగా.. ప్రస్తుతం ముంద స్తు నాట్లు వేసిన రైతులు వరి కోతలు ప్రారంభించారు. ధాన్యంతో జనగామ మార్కెట్కు ఉదయం వచ్చిన రైతులు, సాయంత్రాని ఇంటికి వెళ్లేలా పాలకమండలి, అధికారులు చర్యలు చేపట్టారు. రోజూ ఉదయం 5 నుంచి 10 గంటల వరకు సరుకును లోనికి అనుమతిస్తూ.. మధ్యాహ్నం రెండు గంటల వరకు మార్కెట్ గేటు మూసి వేస్తున్నారు. ఎంట్రీ చేసిన సరుకుకు ఈ–నామ్లో టోకెన్ కేటాయించి గేట్ ఎంట్రీ వద్ద లాట్ నంబర్ ఇస్తున్నారు. ఉద యం బిడ్డింగ్ మొదలైన తర్వాత ఆలస్యంగా వచ్చిన ధాన్యం వాహనాలను అనుమతించి మరుసటి రోజు కొనుగోలు చేస్తున్నారు. 43 లక్షల క్వింటాళ్ల ధాన్యం వానాకాలం సీజన్లో 43 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్లో ప్రభుత్వం 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతుండగా.. ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. 2023–24 సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వరి పంటకు కనీస మద్దతు ధర ఏ–గ్రేడ్ రూ.2,203, సాధారణ గ్రేడ్కు రూ.2,183 ప్రకటించింది. కత్తెర, ముందస్తు సాగు చేసిన వరి కోతలు మొదలై మార్కెట్లోకి పెద్ద ఎత్తున సరుకు వస్తున్నప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు నేటికి ప్రారంభం కాలేదు. దీంతో మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధరకు సుమారు రూ.500 తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. తేమ అధికంగా ఉండడం వల్లే ధర ఇవ్వలేక పోతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. 56వేల క్వింటాళ్ల కొనుగోళ్లు ఈ ఏడాది ఆగస్టు 30 నుంచి గురువారం వరకు జనగామ వ్యవసాయ మార్కెట్లో 1,262 మంది రైతుల వద్ద 56,074(85,169 బ్యాగులు) క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. క్వింటాకు ధర గరిష్టంగా రూ.2,079, రూ.1,961, రూ.1,859, కనిష్టంగా రూ.1,911, 1,720, రూ,1,609, రూ.1,405, మోడల్ ప్రైజ్ రూ.1,899, రూ.1,913, రూ.1,779, రూ.1,889 ధర పలికింది. ధర తక్కువగా వచ్చింది పదెకరాల్లో వరి సాగు చేసినం. పెట్టుబడికి రూ.2.50లక్షలు ఖర్చయింది. ముందుగా నాట్లు వేసిన ఆరు ఎకరాల్లో కోతలు పూర్తి చేసినం. 180 బస్తాల దిగుబడి రాగా జనగామ మార్కెట్కు వచ్చినం. ప్రభుత్వ మద్దతు ధరకంటే.. తక్కువగా కొనుగోలు చేశారు. సరుకు పచ్చిగా ఉందని క్వింటాకు రూ.1,765 మాత్రమే ధర ఇచ్చారు. విధిలేక అమ్ముకున్నాం. ధర మరో రూ.150 ఎక్కువ వస్తే బాగుండేది. శ్రమకు ఫలితం రావడం లేదు. – బాలోతు కళమ్మ, మహిళా రైతు, పెద్దపహాడ్(ఎర్రకుంటతండా) కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి ఐదెకరాల్లో వరి సాగు చేస్తే రెండు ఎకరాల్లో కోతలు పూర్తయ్యా యి. 90 బస్తాల దిగుబడి రాగా మార్కెట్కు తెచ్చిన. క్వింటాకు రూ.1,708 ధర పెట్టిండ్లు. రూ.1,800 ఇవ్వాలని కొట్లాడినా ఫలితంలేదు. ధాన్యానికి సరైన ధర రావాలంటే ప్రభుత్వం వెంట నే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. – భూక్యా సరక్రూ, రైతు, మచ్చుపహాడ్, నర్మెట ధర పడిపోకుండా చూస్తున్నాం.. మార్కెట్కు వచ్చిన ప్రతి గింజకు మంచి ధర వచ్చేలా చూస్తున్నాం. ఈ–నామ్ పద్ధతిలో విక్రయాలు జరుగుతున్నాయి. ఎక్కువగా పచ్చి సరుకు రావడంతో ధర పడిపోకుండా చూస్తున్నాం. ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా పర్యవేక్షిస్తున్నం. – బాల్దె సిద్ధిలింగం, మార్కెట్ చైర్మన్ -
కాంగ్రెస్, బీజేపీలను పాతర పెట్టాలి
గజ్వేల్: ‘పీసీసీ అంటేనే పేమెంట్ కలెక్షన్ సెంటర్. బీజేపీని నమ్ముకుంటే అధోగతే. ఈ రెండు పార్టీలను పాతాళంలో పాతర పెట్టాలి. ఉచిత కరెంటు, మూడు పంటలు, ధాన్యపు రాశులు కావాలంటే కేసీఆర్ వెంటే నడవాలి..’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రూ.540 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీల తీరుపై మండిపడ్డారు. గత కాంగ్రెస్ హయాంలో ఎరువులు, విత్తనాల కోసం చెప్పులతో క్యూలు కట్టిన రోజులు రైతులు నేటికీ మరిచిపోలేదన్నారు. కరెంట్ సక్రమంగా రాక పంటలు ఎండిపోయి అన్నదాతలు అప్పుల పాలయ్యారని హరీశ్రావు విమర్శించారు. తప్పుదారి కాంగ్రెస్కు ఓటేస్తే ఉచిత కరెంట్ ఆగమైతదని రైతులు గుర్తించారని చెప్పారు. బీజేపీ వల్ల కూడా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. కేసీఆర్ రైతే రాజు అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు సాగటం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని, ఆయన గజ్వేల్లోనే ఉండాలనుకుంటే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ కానుకగా అందించే బాధ్యత ఇక్కడి ప్రజలపై ఉందని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ గృహలక్ష్మి పథకం కింద 10 వేల ఇళ్లను మంజూరు చేశారని ప్రకటించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్కు పలు సంఘాల మద్దతు గజ్వేల్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు పలు సంఘాలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాయి. గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం, కుమ్మరి సంఘం, రైస్మిల్లర్స్ అసోసియేషన్, పద్మశాలి సంఘాలు ఈ మేరకు చేసిన తీర్మానాలను మంత్రి హరీశ్రావుకు అందించాయి. -
మరింత మంది రైతన్నలకు లబ్ధి
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే ఆదర్శవంతంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంలో మరింత మంది రైతులకు మేలు చేకూర్చేలా మరిన్ని సంస్కరణలు తెచ్చారు. నోటిఫై చేసిన పంటలు ఏ కేటగిరీ కింద సాగైనా ఒకే రీతిలో బీమా రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టారు. మరో వైపు కొన్ని జిల్లాల్లో పెరిగిన సాగు విస్తీర్ణాన్నిబట్టి కొత్త పంటలను బీమా పరిధిలోకి తెచ్చారు. ఈ మేరకు మార్గదర్శకాల్లో మార్పులు చేయడమే కాకుండా, ప్రస్తుత వ్యవసాయ సీజన్ నుంచే అమల్లోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులపై పైసా భారం పడకుండా ఈ క్రాప్లో నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు యూనివర్సల్ బీమా కవరేజ్ను కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఒక సీజన్కు సంబంధించిన బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే చెల్లిస్తోంది. ఇలా 2019లో శ్రీకారం చుట్టిన ఈ పథకం ద్వారా గడిచిన 4 ఏళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల పరిహారం చెల్లించింది. పరిహారం లెక్కింపులో పారదర్శకత కోసమే సాధారణంగా ఇరిగేటెడ్, నాన్ ఇరిగేటెడ్ కేటగిరీల్లో పంటలు సాగవుతుంటాయి. పూర్వం నుంచి ఇరిగేటెడ్ (నీటి వసతి కల్గిన) విభాగంలో సాగయ్యే పంటలను దిగుబడి ఆధారితంగా, నాన్ ఇరిగేటెడ్ (వర్షాధారం) కేటగిరిలో సాగయ్యే పంటలను వాతావరణ ఆధారితంగా పరిగణనలోకి తీసుకొని బీమా కవరేజ్ కల్పిస్తున్నారు. దిగుబడి ఆధారిత పంటలకు వాస్తవ, హామీ దిగుబడిలోని వ్యత్యాసాల ఆధారంగా, వాతావరణ ఆధారిత పంటలకు ప్రతికూల, సాధారణ వాతావరణ పరిస్థితుల్లోని వ్యత్యాసాలను బట్టి బీమా పరిహారం లెక్కిస్తారు. స్థానికంగా ఉండే నీటి వసతినిబట్టి కొన్ని జిల్లాల్లో ఒకే పంట రెండు కేటగిరిల్లోనూ సాగవుతుంటుంది. దీంతో ఒకే జిల్లాలో ఒకే పంటకు సాగయ్యే విధానాన్ని బట్టి రెండు విధాలుగా బీమా కవరేజ్ కల్పిస్తూ నోటిఫై చేయాల్సి వచ్చేది. ఫలితంగా పక్క పక్క సర్వే నంబర్లలో సాగయ్యే ఒకే పంటకు ఒకే పంట కాలంలో కొంత వాతావరణ, మరికొంత దిగుబడి ఆధారంగా లెక్కించి పరిహారం చెల్లించాల్సి వచ్చేది. ఫలితంగా జరిగిన పంట నష్టం ఒకటే అయినా, పరిహారంలో వ్యత్యాసాలు ఉండేవి. ఉదాహరణకు నోటిఫైడ్ జిల్లాల్లో ప్రధానంగా పత్తి, వేరుశనగ పంటలు 95 శాతం విస్తీర్ణంలో వర్షాధారం, 5 శాతం నీటి వసతి కింద, మిరప 85 శాతం నీటి వసతి, 15 శాతం వర్షాధారం కింద సాగవడం వలన ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో పరిహారం ఉండేది. ఖరీఫ్లో నోటిఫై చేసిన పసుపు పంటకు కృష్ణా జిల్లాలో వాతావరణ ఆధారంగా, అల్లూరి సీతారామరాజు, వైఎస్సార్ జిల్లాల్లో దిగుబడి ఆధారంగా పరిగణించేవారు. ఇలా మిరప, పత్తి, పసుపు, జొన్న, వేరుశనగ వంటి పంటల విషయంలో పూర్వం నుంచి రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పరిహారం లెక్కింపు, పంపిణీలో అసమానతలు తొలగించడమే లక్ష్యంగా పంటల బీమా మార్గదర్శకాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇక నుంచి నోటిఫై చేసిన జిల్లాల్లో ఖరీఫ్లో మిరప, పసుపు జొన్న పంటలు ఏ కేటగిరీ కింద సాగైనా పూర్తిగా దిగుబడి ఆధారంగానే పరిగణిస్తారు. పత్తి, వేరుశనగ పంటలను పూర్తిగా వాతావరణ ఆధారితంగా పరిగణిస్తారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విస్తారంగా సాగవుతున్న ఆముదం పంటను కొత్తగా పంటల బీమా పరిధిలోకి తెచ్చారు. నోటిఫైడ్ జిల్లాల్లో దానిమ్మ, బత్తాయి, నిమ్మ, జీడిమామిడి పంటలను వాతావరణ ఆధారిత బీమా పరిధిలోకి తీసుకొచ్చారు. నాటిన మూడో ఏడాది నుంచి దానిమ్మకు, నాలుగో ఏడాది నుంచి బత్తాయి పంటకు ఖరీఫ్లోనూ, మూడో ఏడాది నుంచి జీడిమామిడి, నాలుగో ఏడాది నుంచి నిమ్మ తోటలకు రబీలోనూ బీమా రక్షణ కల్పిస్తారు. 2023–24 సీజన్ కోసం నోటిఫికేషన్ జారీ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక తొలి ఏడాది పీఎంఎఫ్బీవైతో కలిసి బీమా పథకం అమలు చేయగా, యూనివర్సల్ కవరేజ్కు కేంద్రం విముఖత చూపడంతో ఆ తర్వాత రెండేళ్ల పాటు కంపెనీలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించింది. ఈ క్రాప్ ప్రామాణికంగా యూనివర్సల్ కవరేజ్కు కేంద్రం దిగి రావడంతో 2022–23 సీజన్ నుంచి దిగుబడి ఆధారిత పంటలకు పీఎంఎఫ్బీవైతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేస్తోంది. వాతావరణ ఆధారిత పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా బీమా రక్షణ కల్పిస్తోంది. 2023–24 సీజన్ కోసం దేశంలోనే అత్యల్ప ప్రీమియంతో బీమా కవరేజ్కు ముందుకొచ్చిన కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. జిల్లాలవారీగా కవరేజ్ కల్పించే కంపెనీలతో పాటు నోటిఫైడ్ పంటల వివరాలతో ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది. ఖరీఫ్–2023లో 15 పంటలకు దిగుబడి ఆధారంగా, 6 పంటలకు వాతావారణ ఆధారంగా, రబీ 2023–24లో 13 పంటలకు దిగుబడి ఆధారంగా, 4 పంటలకు వాతావరణ ఆధారంగా నోటిఫికేషన్ జారీ చేసింది. దిగుబడి ఆధారిత పంటలకు ఖరీఫ్లో గ్రామం, మండల, జిల్లా యూనిట్గా బీమా కవరేజ్ కల్పిస్తుండగా, వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం మండలం యూనిట్గా బీమా కవరేజ్ కల్పిస్తున్నారు. అసమానతలకు తావులేకుండా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పంటల బీమా లెక్కింపు, పరిహారం చెల్లింపుల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు పంటల బీమా మార్గదర్శకాల్లో కీలకమైన మార్పులు తీసుకొచ్చాం. నీటి వసతి, వర్షాధారం ప్రాతిపదికన కాకుండా ఇక నుంచి పూర్తిగా వాతావరణ, దిగుబడి ఆధారంగానే పంటలకు బీమా రక్షణ ఉంటుంది. నోటిఫై చేసిన జిల్లాల్లో నోటిఫై చేసిన పంటలు నష్టపోయే రైతులకు ఒకే రీతిలో పరిహారం దక్కు తుంది. లెక్కింపులో, చెల్లింపుల్లో ఎలాంటి అసమానతలు ఉండవు. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
పంటలకు ‘డ్రైస్పెల్’ దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: నెల రోజులుగా చినుకు జాడలేక, ఎండలు పెరిగిపోయి రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి. తొలుత రుతుపవనాల ఆలస్యం, తర్వాత జూలై భారీ వర్షాలు, మళ్లీ ఆగస్టులో డ్రైస్పెల్తో పంటల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టులో 63శాతం వరకు లోటు వర్షపాతం నమోదైంది. పలుచోట్ల కరువు ఛాయలు కూడా నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి వానాకాలం పంటలు గట్టెక్కుతాయా అన్న సందేహాలు ముసురుకుంటున్నాయి. ముఖ్యంగా ఈసారి ఆరుతడి పంటలు ఆగమవుతాయన్న ఆందోళన రైతులు, వ్యవసాయ అధికారుల్లో కనిపిస్తోంది. మొక్కజొన్న, పత్తికి నష్టం! వానలు పడటంలో ఎక్కువ విరామం రావడం మొ క్కజొన్నపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే పంట ఎండిపోతోంది. అధిక ఉష్ణోగ్రతలతో చీడపీడల దాడి పెరిగింది. అనేకచోట్ల మొక్కజొన్నపై కత్తెర పురుగు దాడిచేస్తోందని వ్యవసాయశాఖ బుధవా రం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. పత్తిలో పేనుబంక, రసం పీల్చే పురుగుల దాడి పెరిగిందని.. వరిపై కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు, కాండం కుళ్లు తెగులు, ఆకు ముడత తెగుళ్లు వస్తు న్నాయని హెచ్చరించింది. ఎండల కారణంగా సో యాబీన్ పంట ఎండిపోతోందని అధికారులు చెప్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే పత్తి, మొక్కజొన్న పంటలు చేతికి రావడం కష్టమేనని.. దిగుబడులు పడిపోతాయని అంటున్నారు. వరి ఫుల్.. పప్పులు డల్ రాష్ట్రంలో ఈసారి వానాకాలం పంటల సాగు విస్తీర్ణం కోటి ఎకరాలు దాటింది. సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం ఆగస్టు చివరినాటికి 1.24 కోట్ల ఎకరాలుకాగా.. ఈసారి ఇప్పటివరకు 1.16 కోట్ల ఎకరాల్లో (93.61 శాతం) పంటలు సాగయ్యాయి. వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలైతే.. ఈసారి ఇప్పటివరకు 55.90 లక్షల ఎకరాల్లో (112.12 శాతం) నాట్లు పడ్డాయి. గత నెల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వరిసాగు జోష్ పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 5.32 లక్షల ఎకరాల్లో (56.39%) మాత్రమే సాగయ్యాయి. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలైతే.. ఇప్పటివరకు 5.21 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 44.70 లక్షల ఎకరాల్లో (88.36 శాతం) వేశారు. వాస్తవంగా ఈ ఏడాది 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయించాలని వ్యవసాయశాఖ భావించింది. ఈ మేరకు రైతులకు పిలుపునిచ్చింది. కానీ సకాలంలో రుతుపవనాలు రాకపోవడం, కీలకమైన జూన్ నెల, జూలై రెండో వారం వరకు వర్షాలు లేకపోవడంతో అదను దాటిపోయింది. పంటలను కాపాడుకోవాలి: వ్యవసాయ వర్సిటీ జిల్లాల్లో నీటి వసతి గల రైతులు పత్తి, మొక్కజొన్న, కంది, సోయాచిక్కుడు వంటి పంటలకు నీటి తడులివ్వాలి. పూతదశలో ఉన్న మొక్కజొన్న పంటకు జీవసంరక్షక నీటి తడి ఇవ్వాలి. ప్రస్తుతం వరి పంట పిలక దశ నుంచి అంకురం దశలో ఉంది. కాండం తొలుచు పురు గు, అగ్గి తెగులు కలగచేసే కారకాలు కలుపు మొక్కలపై నివసించి వరి పంటను ఆశిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వరిలో ఆకు నల్లి ఆశించే అవకాశం ఉంది. పత్తి పంట పూత నుంచి కాయ అభివృద్ధి దశలో ఉంది. ఈ పంటలో పేనుబంక, రసం పీల్చే పురుగుల నివారణకు ప్లునికామిడ్ 0.4 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మొక్కజొన్న పంట మోకాలి ఎత్తు దశ నుంచి కంకి ఏర్పడే దశల్లో ఉంది. మొక్కజొన్న లో కత్తెర పురుగు ఆశిస్తోంది. నివారణకు 0.4 మి.లీ.క్లోరంట్రానిలిప్రోల్ లేదా 0.5 మి.లీ. స్పైనటోరంను లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల పిచికారి చేయాలి. రాష్ట్రంలో సోయా పంట పూత నుంచి పిందె, కాయ అభివృద్ధి దశలో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పంటలో పెంకు పురుగు, కాండం ఈగ ఆశించేందుకు కారణమవుతాయి. ముందు జాగ్రత్తగా పురుగులు ఆశించకుండా 0.4 మి.లీ. థయోమిథాక్సిం లాంగ్డా సైలోత్రిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. -
ఎందుకంత తొందర రామోజీ!?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలుచేస్తున్నామని చెప్పారు. అంతేకాక.. అన్నదాతలకు రైతుభరోసా సాయాన్ని అందజేయడంతోపాటు 60వేల క్వింటాళ్ల విత్తనాలను ఆర్బీకేల్లో పొజిషన్ కూడా చేశామన్నారు. డిమాండ్ మేరకు మరిన్ని విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లుచేస్తున్నామని ఆయన చెప్పారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రైతులను భయభ్రాంతులకు గురిచేసేలా ఈనాడులో వస్తున్న కథనాలపై ఆయన మండిపడ్డారు. గతంలో ఎన్నడూలేని విధంగా రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అహరహం శ్రమిస్తున్నారని చెప్పారు. ఎన్నో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో రైతులకు ముఖ్యమంత్రి అండగా నిలుస్తుంటే ఎల్లో మీడియా ఓర్వలేక విషం కక్కుతోందన్నారు. సాధారణంగా ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉంటుందని, ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎలా అని రామోజీని కాకాణి ప్రశ్నించారు. ఆగస్టు నెలాఖరులోగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడితే విత్తుకోవాలని రైతులు ఎదురుచూస్తున్నారని మంత్రి చెప్పారు. ఆ దిశగా ఆర్బీకేల ద్వారా అవగాహన కూడా కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో రైతులు ఆర్బీకేల ద్వారా విత్తనాలు తీసుకుంటున్నారని మంత్రి చెప్పారు. వచ్చే నెలాఖరు తర్వాత సమీక్ష.. మరోవైపు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఖరీఫ్ సీజన్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు తగిన ఆదేశాలు జారీచేస్తున్నారని.. ఈ విషయంలో ఇప్పటికే సమీక్ష కూడా నిర్వహించారని ఆయన గుర్తుచేశారు. ఈ విషయం రామోజీకి తెలియకపోవచ్చని.. ఎందుకంటే ఆయన నిత్యం చంద్రబాబు పల్లకీ మోయటంలో మునిగితేలుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక సెప్టెంబర్ నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ ఇంతలోనే రైతులకు లేని బాధ మీకెందుకని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. సెప్టెంబర్ నెలాఖరు తర్వాత పూర్తిస్థాయిలో పరిస్థితిని సమీక్షించి ఆ తర్వాత రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. నిజానికి.. చంద్రబాబు, కరువు కవల పిల్లలని, టీడీపీ ఐదేళ్లూ కరువు విలయతాండవం చేసిన విషయాన్ని మంత్రి కాకాణి గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో ఏటా కరువు మండలాలు ప్రకటించినా ఏ ఒక్క ఏడాది రైతులకు పైసా కూడా పరిహారం ఇవ్వలేదని.. అయినా ఏనాడు ఈనాడు సింగిల్ కాలమ్ వార్త కూడా రాసిన పాపాన పోలేదన్నారు. రైతులకు రూ.2,558 కోట్లు ఎగ్గొట్టిన బాబు ఐదేళ్లలో 24.80 లక్షల మంది రైతులకు రూ.2,558 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం) బకాయిలు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైపరీత్యాల వేళ జరిగే పంట నష్టపరిహారాన్ని ఆ సీజన్ ముగియకుండానే ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని కాకాణి చెప్పారు. అలాగే, ఇప్పటివరకు 22.74 లక్షల మంది రైతులకు రూ.1,965 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించామన్నారు. ఇక టీడీపీ ఐదేళ్లలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల బీమా పరిహారం ఇస్తే.. ఈ నాలుగేళ్లలో రైతులపై పైసా భారం పడకుండా 54.48 లక్షల మందికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.7,802 కోట్ల బీమా పరిహారం చెల్లించిందన్నారు. ఈ నాలుగేళ్లలో రైతులకు ప్రత్యేకంగా రూ.1,70,769 కోట్ల లబ్ధిచేకూర్చిన ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలని మంత్రి కాకాణి హితవు పలికారు. -
కష్టాల కడలిలో ‘గోదావరి’ రైతులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రంలోని గోదావరి పరీవాహక ప్రాంత రైతులను నిండా ముంచాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో వరిపైర్లు వరదల తీవ్రతకు కొట్టుకుపోవడంతోపాటు పొలాలు కోతకు గురై ఇసుక మేటలు వేశాయి. చాలాచోట్ల పొలాల్లోనే విద్యుత్ తీగలు, స్తంభాలు పడిపోగా ట్రాన్స్ఫార్మర్లు వరదలో మునిగాయి. సుమారు లక్షన్నర ఎకరాల్లో పంటలు దెబ్బతినగా ఇసుక మేటలు తొలగించలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వరదలకు ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో 22 మంది గల్లంతవగా ఇంకా ముగ్గురి ఆచూకీ లభించలేదు. తేలని నష్టపరిహారం లెక్కలు... వరదల్లో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ. 10 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించినా ఆ ప్రకియ ఇంకా కార్యరూపం దాల్చలేదు. కేంద్ర, రాష్ట్ర బృందాలు ఐదు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించినా అధికారికంగా నష్టాలను తేల్చలేదు. పంట నష్టం 33 శాతంపైన ఉంటేనే వరద నష్టం అంచనా వేస్తామని మండలస్థాయి అధికారులు చెబుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. దీంతో నాట్ల దశలో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం వర్తించదన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణవ్యాప్తంగా సుమారు రూ. 2,400 కోట్ల మేర నష్టం ఉంటుందని ప్రాథమిక అంచనా కాగా.. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనే రూ. 1,000 కోట్లపైన నష్టం ఉంటుందని చెబుతున్నారు. ఇంత నష్టం జరిగినా అధికారులు మార్గదర్శకాలతో మల్లగుల్లాలు పడుతుండగా ఏం చేయాలో తెలియక రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అయినోళ్ల కోసం కళ్లలో వత్తులు వేసుకొని... బండ్ల సారయ్య–సారమ్మ... సారయ్య తల్లి రాజమ్మ... ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బూరుగుపేటకు చెందిన ఈ ముగ్గురిని వరద మింగేసింది. జూలై 27న కురిసిన అతిభారీ వర్షంతో మారేడుగొండ చెరువుకు గండిపడి వరద ప్రవాహానికి సారయ్య ఇల్లు కొట్టుకుపోయింది. ఇంట్లో ఉన్న సారయ్య, సారమ్మ, రాజమ్మ గల్లంతయ్యారు. వారికి కొంతదూరంలో నివసించే సారయ్య కొడుకు, కోడలు ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. వరద తగ్గాక సారయ్య మృతదేహం లభించినప్పటికీ అత్తా కోడళ్లయిన రాజమ్మ, సారమ్మల ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. వరదలతో ఆగమయ్యాం.. నాలుగు ఎకరాల్లో ఇసుకమేటలు వేసినా ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా మా ముఖం చూడలేదు. వరదలతో ఆగమయ్యాం. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. – కొక్కిరాల తిరుపతిరావు, రైతు, పరకాల ఈ ఫొటోలోని యువరైతు పేరు కూతురు భూపాల్రెడ్డి. హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన ఈయనకు చలివాగు వంతెన సమీపంలో 2.26 ఎకరాల పొలం ఉంది. ఈసారి సన్నరకం నారు అలికి సాగుకు సిద్ధపడుతున్న సమయంలో చలివాగు ప్రవాహానికి కొట్టుకుపోయి పొలమంతా ఇసుకమేటలు వేసింది. దీంతో రూ. లక్ష నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నాడు. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి చెందిన ఈ రైతు పేరు శ్రీపతి తిరుపతి. రెండెకరాల సాగుభూమిలో భారీగా ఇసుక మేటలు వేసింది. ఇసుక మేటను తీయాలంటే కనీసం రూ. 20 వేల ఆదనపు ఖర్చయ్యేలా ఉంది. తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేనందున పంట వదిలేయడం తప్ప వేరే మార్గం లేదంటున్నాడు. ఈయన పేరు చల్ల రవీందర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన రైతు. మానేరు వరద ఉధృతికి ఆయన మూడెకరాల పొలంలో పూర్తిగా ఇసుక మేటలు వేసింది. ఇప్పటికే పొలం దున్నడానికి రూ.10 వేల వరకు ఖర్చు చేశాడు. ప్రభుత్వం తక్షణమే పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నాడు. -
రైతులేమైనా బిక్షగాళ్లా..?
శంకరపట్నం (మానకొండూర్)/రామడుగు(చొప్పదండి): భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్ట్ గండిని పరిశీలించారు. గండి పడటానికి దారితీసిన కారణాలను డీఈ కవితను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద ఎనిమిదేళ్లలో తెలంగాణకు రూ.3వేల కోట్ల సాయం చేసిందన్నారు. అయితే అందులో సగం నిధులను దారిమళ్లించారని ఆరోపించారు. సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ఈ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 30 వేల ఎకరాలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 7వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. రోడ్లు, కల్వర్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, 50 ఏళ్లనాటి కల్వల ప్రాజెక్ట్కు గండిపడితే అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించలేదని మండిపడ్డారు. ‘రైతు లేమైనా భిక్షగాళ్లు అనుకుంటున్నవా? ప్రతీసారి చేయిచాచి సాయం చేయాలని అడుక్కోవాలా? వారిని ఆదుకోని ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత’అని ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. కాగా, ఆగ మేఘాలపై ఆర్టీసీ బిల్లును పంపి గవర్నర్ సంతకం చేయలేదంటే ఎలా? ఆ బిల్లులో ఏమైనా లోపాలు ఉన్నాయా? న్యాయపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అని పరిశీలన చేయకుండానే సంతకం పెట్టమంటే ఎలా? అని సంజయ్ ప్రశ్నించారు. నివేదికలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం.. భారీవర్షాలతో దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఆస్తి నష్టాలు తెలుసుకునేందుకు కేంద్రబృందం పరిశీలనకు వస్తే ప్రభుత్వం నివేదికలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని బండి సంజయ్ విమర్శించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓటింగ్ను బహిష్కరించిన గ్రామస్తులు
సత్తెనపల్లిలో సిట్ టీమ్
నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
KKR vs RR: రాయల్స్ జట్టును ముంచేసిన వర్షం
'నిజాయితీ'..! ఒక రాజు.. అంతు చిక్కని రోగంతో..
అది పచ్చ బ్యాచ్ పనే.. రేవ్ పార్టీ కథనాలపై కాకాణి ఫైర్
SRH vs PBKS: రెండో స్థానంలో సన్ రైజర్స్
సౌదీ అరేబియా రాజుకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్! ఎందువల్ల వస్తుందంటే..?
అయ్యో దేవుడా! అంత్యక్రియలకు రూ. 30 లక్షలా?
తెలంగాణలో వీసీల పంచాయితీ
తప్పక చదవండి
- అతడొక క్లాస్ ప్లేయర్.. ఎంత చెప్పుకున్న తక్కువే: ప్యాట్ కమ్మిన్స్
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
- సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
- రష్మికకు ఆఫర్ల వరద.. చేతిలో ఇన్ని సినిమాలున్నాయా?
- డయాగ్నస్టిక్ వ్యవస్థను కుప్పకూల్చడం బాధాకరం: హరీశ్ రావు
- హెలికాఫ్టర్ క్రాష్.. ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం
- ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం
- Jr NTR Birthday: 'మ్యాన్ ఆఫ్ మాసెస్'గా ఎన్టీఆర్ ఎలా ఎదిగాడు..?
- రాత్రైతే నా భార్య రాక్షసిలా ప్రవర్తిస్తోంది
- ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్
Advertisement