-
రోడ్డు ప్రమాదంలో వృద్ధదంపతులు దుర్మరణం
బోనకల్(ఖమ్మం): కుమారుడికి వద్దకు వెళ్తున్న వృద్ధ దంపతులకు అదే ఆఖరి ప్రయాణమైంది. వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్ట డంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన కొత్తూరు సూర్యనారాయణ(92) డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన భార్య రుక్మిణి(85)తో మధిరలోనే స్థిరపడ్డారు. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.వృద్ధాప్యం కారణంగా వారి సంరక్షణ కోసం ఒకే కేర్టేకర్గా నియమించడంతో కుమారుల వద్ద కొన్నేసి రోజుల చొప్పున ఉంటున్నారు. బుధవారం మధిరలోని ఇంటి నుంచి ఖమ్మంలో ఉంటున్న పెద్దకుమారుడు వద్దకు మనవడు కొత్తూరు అనిల్, కేర్టేకర్ నాగరాజుతో కలిసి వెళ్తున్నాడు. కారును అనిల్ నడుపుతున్నాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు.ఈ ఘటనలో సూర్యనారాయణ, రుక్మిణి తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. మనుమడు అనిల్, కేర్టేకర్ నాగరాజు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కారుకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారు లాక్ పడి ఉండడంతో తలుపులు పగులగొట్టి మృతదేహాలు, క్షతగాత్రులను బయటకు తీశారు. కారు తలుపులను పగలగొట్టడంలో ఏమాత్రం ఆలస్యమైనా లోపల ఉన్న వారంతా మంటల్లో కాలిపోయే వారని తెలిసింది. -
వృద్ధులకు ఆరోగ్య ధీమా!
అరవై అయిదేళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఇది అక్షరాలా ఆనందం కలిగించే వార్త. పిల్లలు, విద్యార్థులు, గర్భిణులు, సీనియర్ సిటిజన్లతో సహా అన్ని వర్గాలకూ ఆరోగ్య బీమా పాలసీలు అందివ్వాలనే కొత్త నిర్ణయం వచ్చింది. దేశంలోని బీమా పాలసీలకు సంబంధించి అత్యున్నత నియంత్రణ సంస్థ అయిన ‘భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ’ (ఐఆర్డీఏఐ) ఆ మేరకు బీమా సంస్థలన్నిటికీ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై క్యాన్సర్, హృద్రోగం, మూత్రపిండాల వైఫల్యం, ఎయిడ్స్ లాంటి వ్యాధులున్నాయని ఆరోగ్య బీమా పాలసీలు నిరాకరించడానికి వీల్లేదని తేల్చింది. అదే సమయంలో, నియమ నిబంధనలు పాటిస్తూ ఆ యా వయసుల వారికి తగ్గట్టుగా ప్రత్యేకమైన బీమా పాలసీలు రూపొందించుకొనే స్వేచ్ఛ సంస్థలకు ఇచ్చింది. దీంతో, ఇప్పుడిక 65 ఏళ్ళు, ఆపై బడిన తర్వాత కూడా కొత్తగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకొనే వీలు చిక్కింది. 70 ఏళ్ళ పైబడిన ప్రతి ఒక్కరినీ కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం కిందకు తెస్తామని అధికార పక్షం పేర్కొన్న కొద్ది రోజులకే ఈ నిర్ణయం రావడం గమనార్హం. అలాగే, సీనియర్ సిటిజన్ల సమస్యలు, ఆరోగ్య బీమా క్లెయిమ్ల సత్వర పరిష్కారానికై ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని బీమా సంస్థలకు ప్రాధికార సంస్థ సూచించింది. పాలసీ కొనడానికి ముందే ఆరోగ్య ఇబ్బందులు ఉన్నప్పటికీ వారికి తగిన ఆరోగ్య బీమా పాలసీలు తప్పక ఇవ్వాలని పేర్కొంది. ముందుగానే ఉన్న వ్యాధుల (పీఈడీ) విషయంలో బీమా రక్షణకు నిరీక్షించే కాలాన్ని మునుపటి 48 నెలల నుంచి 36 నెలలకే తగ్గించింది. బీమా అంశంలో ఈ సరికొత్త సంస్కరణలు అటు ఊహించని ఆరోగ్య ఖర్చులు ఎదురైన వృద్ధులకే కాక, వయసు మీద పడ్డ తల్లితండ్రుల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్న ఉద్యోగులకూ పెద్ద ఊరట. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, వ్యాధుల బారి నుంచి తమకు ప్రేమాస్పదులైన వ్యక్తులకు రక్షణనిచ్చేందుకు కొండంత అండ. వయోవృద్ధులకు పరిమిత ప్రయోజనాలే అందిస్తున్న ప్రస్తుత ధోరణి నుంచి బీమా సంస్థలు బయటకొచ్చి, తల్లితండ్రులతో సహా పాలసీదారు కుటుంబం మొత్తానికీ సమగ్ర బీమా వసతి కల్పించేలా కొత్త పాలసీలు తేగలుగుతాయి. ఇప్పటికే ఉన్న పాలసీలను సైతం మార్చగలుగుతాయి.నిజానికి, వయసు మీద పడ్డాకనే ఎవరికైనా ఆరోగ్య బీమా మరింత అవసరం, ఉపయోగం. ఇప్పటి దాకా నిర్ణీత వయసు దాటాక వ్యక్తిగత ఆరోగ్య బీమాకు వీలుండేది కాదు. కానీ, కొత్త సంస్క రణలతో ఆ అడ్డంకి తొలగింది. ప్రత్యేకించి రానున్న రోజుల్లో మన దేశ జనాభాకు ఇది కీలకం. 2011 తర్వాత దేశంలో జనగణన జరగలేదన్న మాటే కానీ, ఐరాస జనాభా నిధి, ఇతర నిపుణుల లెక్క ప్రకారం భారత జనాభా చైనాకు సమానంగా ఉంది. 2023లో ఒక దశలో మనం చైనాను దాటినట్టు కూడా అంచనా. ఈ ఐరాస అంచనాల ఆధారంగా నిరుడు ‘భారత వార్ధక్య నివేదిక – 2023’ను సిద్ధం చేశారు. దాని ప్రకారం దేశంలో 10 శాతమున్న సీనియర్ సిటిజన్ల జనాభా వచ్చే 2050 నాటికి ఏకంగా 30 శాతానికి పెరగనుంది. మరోమాటలో అరవై ఏళ్ళ పైబడిన వారి సంఖ్య 2022 నాటి 14.9 కోట్ల నుంచి 34.7 కోట్లకు చేరుతుంది. అది అమెరికా ప్రస్తుత జనాభా కన్నా ఎక్కువ. ఒక్క భారత్లోనే కాదు... అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో వయోవృద్ధులు దాదాపు 16 నుంచి 28 శాతం దాకా ఉన్నారు. మెరుగైన ఆరోగ్య వసతులు, పెరిగిన ఆయుఃప్రమాణం వల్ల ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సీనియర్ సిటిజన్ల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వ నిధులతో ప్రజారోగ్య వ్యవస్థలున్నా, ఇతర దేశాల్లో మాత్రం ఖరీదైన ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణే దిక్కు. అలాంటి చోట్ల ఖర్చెక్కువ, వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య బీమాకు చెల్లించాల్సిన ప్రీమియమ్లూ ఎక్కువన్నది నిజమే. కానీ, 65 ఏళ్ళు దాటితే కొత్తగా ఆరోగ్య బీమా తీసుకోవడానికి వీలు కాదనే నిబంధన చాలా దేశాల్లో లేదని గమనించాలి. ఇప్పుడు మన దేశమూ ఆ మార్గంలోకి వచ్చి, గరిష్ఠ వయఃపరిమితి షరతు లేకుండా, అన్ని వయసుల వారికీ ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులోకి తెచ్చిందన్న మాట. దానికి తోడు పీఈడీ నిరీక్షణ కాలాన్ని తగ్గించడం, తీవ్ర వ్యాధులున్నా సరే బీమా ఇవ్వాలనడం ప్రజానుకూల, ప్రశంసాత్మక నిర్ణయాలు. ప్రాధికార సంస్థ ఆ మధ్య జీవిత బీమా పథకాల సరెండర్ ఛార్జీల విషయంలో సంస్కరణలు తెచ్చింది. మళ్ళీ ఇప్పుడిలా వినియోగదారుల పక్షాన మరోసారి మరికొన్ని నిబంధనల్ని సవరించడం విశేషం. అయితే, అదే సమయంలో బీమా సంస్థలు తమ ఉత్పత్తులను వినియోగదారులకు స్నేహపూర్వకంగా ఉండేలా చూడడం అవసరం. ప్రాధికార సంస్థ ఆదేశాల స్ఫూర్తిని విస్మరించి, అందుబాటులో లేని అతి ఖరీదైన పాలసీలను సంస్థలు తీసుకొస్తే నిష్ప్రయోజనం. అర్థం కాని సాంకేతిక పదజాలం, సంక్లిష్టతలతో పాలసీలు తీసుకొచ్చినా కస్టమర్లు విముఖత చూపుతారు. పాలసీలలో పారదర్శకత పాటిస్తూ, ఇబ్బంది లేకుండా సులభంగా క్లెయిమ్లు పరిష్కారమయ్యే మార్గాన్ని బీమా సంస్థలు అనుసరిస్తే మంచిది. అప్పుడే వినియోగదారులు ఉత్సాహంగా ముందుకు వస్తారు. తాజా బీమా సంస్కరణల తాలూకు ఫలితమూ సమాజానికి అందివస్తుంది. దేశంలోని సీనియర్ సిటి జన్లలో నూటికి 98 మందికి ఇవాళ్టికీ ఆరోగ్య బీమా లేకపోవడం సిగ్గుచేటు. అంతకంతకూ పెరుగు తున్న వైద్య, ఆరోగ్యసేవల ఖర్చు రీత్యా బీమా ఆపత్కాలంలో బలమైన భరోసా. జీవితం పొడు గునా కుటుంబానికీ, సమాజానికీ తమ వంతు సేవ చేసి, ప్రకృతి సహజపరిణామంగా వయసుపై పడ్డ ఈ పండుటాకుల గురించి పాలకులు లోతుగా ఆలోచించాలి. బీమా పాలసీలొక్కటే సరిపోవు. ఆర్థికంగానే కాక ఆరోగ్యపరంగానూ వారి బాగు కోసం ఇతర ప్రత్యామ్నాయాలనూ అన్వేషించాలి. -
ఇద్దరు ఓటర్లు.. 107 కిలోమీటర్లు.. ఎన్నికల అధికారుల సాహసం!
ముంబై, సాక్షి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో లోక్సభ ఎన్నికల కోసం ఇద్దరు వృద్ధులతో ఓటేయించడానికి ఎన్నికల అధికారులు సాహసం చేశారు. ప్రమాదకరమైన మలుపులు, అడవుల గుండా 107 కిలోమీటర్లు ప్రయాణించారు. వివరాల్లోకి వెళ్తే.. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి-చిమూర్ లోక్సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గంలో 100 ఏళ్లు, 86 సంవత్సరాల వయస్సు గల ఓటర్లు ఇద్దరు ఉన్నారు. ఎన్నికల సంఘం 85 ఏళ్లు పైబడిన వారికి, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. దీంతో ఎన్నికల అధికారులు అహేరి నుండి సిరొంచ వరకు 107 కిలోమీటర్లు ప్రయాణించి 100 ఏళ్ల కిష్టయ్య మదర్బోయిన, 86 ఏళ్ల కిష్టయ్య కొమెర ఇళ్లకు చేరుకున్నారు. వీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసే పరిస్థితిలో లేరు కానీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని ఎన్నికల అధికారి తెలిపారు. గడ్చిరోలి-చిమూర్ నియోజకవర్గంలో 1,037 మంది 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, 338 మంది దివ్యాంగుల దరఖాస్తులను ఆమోదించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 1,205 మంది ఓటర్లు ఇంటి వద్ద నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
గురక పెట్టొద్దన్నందుకు పొడిచేశాడు
మేరీల్యాండ్: చెవులకు చిల్లులు పడేలా గురుక పెట్టకురా అన్నందుకు ఓ పెద్దాయనను పొడిచి చంపిన ఘటన అమెరికాలో జరిగింది. పెన్సిల్వేనియా రాష్ట్రం మోంట్గోమేరీ కౌంటీలో 62 ఏళ్ల రాబర్ట్ వాలెస్ తల్లితో కలిసి ఉంటున్నాడు. అదే డూప్లెక్స్ భవనంలో 55 ఏళ్ల క్రిస్టఫర్ కేసీ ఒంటరిగా ఉంటున్నాడు. క్రిస్టఫర్ పెడుతున్న భారీ గురకను వినలేకపోతున్నానని ఏడాదిన్నరగా రాబర్ట్ చెప్పీచెప్పీ విసిగిపోయాడు. విషయం పోలీసుల దాకా వెళ్లింది. వాళ్లు నచ్చజెప్పినా లాభం లేకపోయింది. క్రిస్టఫర్, రాబర్ట్ల పడక గదులు పక్కపక్కనే ఉండటం, ఒక చెక్క గోడ మాత్రమే అడ్డుగా ఉండటంతో గురక రాబర్ట్కు బాగా ఇబ్బందిపెట్టేది. విసిగిపోయిన పెద్దాయన చివరకు జనవరి 15న సాయంత్రం క్రిస్టఫర్ వరండా దగ్గరికొచ్చి బెదిరించాడు. వినకపోవడంతో అతని కిటికీ స్క్రీన్ను చింపేసి చంపేస్తానని అరిచాడు. ఒకనొక సమయంలో నీ గురక సమస్యకు శస్త్రచికిత్స చేయిస్తానని కూడా మాట ఇచ్చాడు. వాగ్వాదం చాలాసేపు జరిగి ఆగిపోయే సమయానికి క్రిస్టఫర్ తలుపుతీయడంతో రాబర్ట్ మళ్లీ తిట్లపురాణం మొదలెట్టాడు. వీరావేశంతో ఉన్న గురకమహాశయుడు వెంటనే కత్తితో రాబర్ట్ గుండెలపై పలుమార్లు పొడిచి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
బతికే ఉన్నా మహా ప్రభో...దీనానాథ్ దీన గాథ!
బతికి ఉండగానే చనిపోయినట్టు ప్రకటించిన, ఫించను ఆపివేసిన ఘటన వార్తల్లోనిలిచింది. దీంతో నేను బతికే ఉన్నాను( మై జిందా హూం) అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకుని నిరసనకు దిగారు. ఆగ్రాలో 70 ఏళ్ల వృద్ధుడు దీనానాథ్ యాదవ్కు చేదు అనుభవం ఎదురైంది. ఇండియా టుడే కథనం ప్రకారం ఆగ్రా చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ (CDO) కార్యాలయ ఉద్యోగులు ప్రభుత్వ రికార్డుల్లో దీనానాథ్ యాదవ్ చనిపోయినట్టుగా ప్రకటించారు. దీంతో పెన్షన్ఆగిపోయింది. విషయం తెలుసుకున్న దీనానాథ్ సంబంధిత అధికారులను కలిసాడు. గత ఎనిమిది నెలలుగా జిల్ల మెజిస్ట్రేట్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.. అయినా ఫలితం లేదు. దీంతో నేను బతికే ఉన్నాను అనిరాసి వున్న ప్లకార్డు మెడలో వేలాడదీసుకుని నిరసనకు దిగాడు .దీంతో స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్ యాదవ్ అందించిన పత్రాలను పరిశీలించి షాక్ అయ్యారు. విచారణ జరపాల్సింగా సంబంధిత అధికారులకు ఆదేశించారు. అటు తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడిన దీనానాథ్ తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, ప్రతిరోజూ పొలానికి వెళ్తానని, గత రెండేళ్లుగా వృద్ధాప్య పింఛను కూడా తీసుకుంటున్నానని వాపోయాడు. అయితే ఈ ఏడాది మార్చిలో పింఛను ఆగిపోయిందని, తొలుత గ్రామ కార్యదర్శిని, ఆ తరువాత సీడీవో కార్యాలయాన్ని సంప్రదించగా సంతృప్తికర సమాధానం రాలేదని తెలిపారు. నెలల తరబడి పెన్షన్ నిలిచిపోవడంతో పాటు, భవిష్యత్తులో మరిన్ని చట్టపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోఈ నిరసనకు దిగినట్టు వెల్లడించారు. ఇది ఇలా ఉంటే ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ రికార్డులలో బతికి ఉన్నవారిని చనిపోయినట్టు ప్రకటించడంలాంటి ఘటనలు చాలానే ఉన్నాయనీ, ఇలాంటి బాధితులు వందలాది మంది ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
వేస్ట్ అనుకొంటే..రూ. 36 కోట్లు పలికింది: షాకైన జంట కోర్టుకు
ఎందుకూ పనికి రాదులే అనుకుని ఒక వృద్ధ జంట తమ దగ్గరున్న ఒక రేర్ ఆఫ్రికన్ మాస్క్ను చాలా తక్కువ ధరకే ఒక ఆర్ట్ డీలర్ విక్రయించారు. ఆ తరువాత ఆ డీలర్ దానికి కోట్లకు రూపాయలకు విక్రయించడంతో మోసపోయమాని గుర్తించి లబోదిబోమన్నారు. మోస పోయామంటూ కోర్టును ఆశ్రయించారు. ఫ్రాన్స్లోని నిమెస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. MailOnline ప్రకారం 2021లో 81 ఏళ్ల వృద్ధురాలు, ఆమె 88 ఏళ్ల భర్త ఇంటిని శుభ్రం చేస్తుండగా, పురాతన మాస్క్ను గుర్తించారు. పాత సామానుల అమ్ముతున్న క్రమంలోనే ఈ మాస్క్ను కూడా స్థానిక డీలర్కు 158 డాలర్లకు (రూ.13000) విక్రయించారు. అయితే ఆర్ట్ డీలర్ కొన్ని నెలల తర్వాత ఆ మాస్క్ను వేలం వేసి రూ.36 కోట్లు (3.6 మిలియన్ పౌండ్లకు విక్రయించాడు. ఈ విషయాన్ని పేపర్లలో చదివి నివ్వెరపోయారు. మాస్క్ చాలా విలువైనదని అప్పుడు తెలుసు కున్నారు. దీంతో ఆలేస్లోని జ్యుడిషియల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. డీలర్ తమను మోసం చేశాడని, ఉద్దేశపూర్వకంగా ఆ వస్తువు విలువ గురించి తెలిసి కూడా మౌనంగా దాన్ని ఎగరేసుకుపోయాడని వాదించారు. పాత వస్తువుల డీలర్ తమ తోటమాలితో కలిసి కుట్ర పన్నాడని కూడా వీరు ఆరోపించారు. దీనికి పరిహారంగా తమకు సుమారు 5.55 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోరుతూ డీలర్పై దావా వేశారు. ఆఫ్రికన్ రహస్య సమాజంలో ఆచారాలలో ఉపయోగించే అరుదైన ఫాంగ్ మాస్క్ ఇది. 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ పెద్దాయన తాత ఆఫ్రికాలో కొలోనియల్ గవర్నర్గా ఉన్నప్పటిదని తెలుస్తోంది. "కార్బన్-14 నిపుణుడి సహాయం తీసుకున్న డీలర్, తమ తోటమాలి ద్వారా తమ కుటుంబ పూర్వీకుల వివరాలను తెలుసుకుని మాస్క్ను అమ్మి సొమ్ము చేసుకున్నాడని ఆరోపించారు. అయితే తాను సెకండ్ హ్యాండ్ డీలరే కానీ పురాతన వస్తువుల డీలర్ని కాదని కొన్నపుడు అసలు దాని విలువ తెలియదని కోర్టులో వాదించాడు. దీంతో దిగువ న్యాయస్థానం డీలర్ పక్షాన నిలిచింది. ఈ తీర్పుపై దంపతులు నవంబర్లో నిమ్స్లోని హైకోర్టును ఆశ్రయించారు. అంతే కాదు వేలం ద్వారా వచ్చిన సొమ్ములో కొంత తోటమాలికి కూడా ఇచ్చాడని తెలిపారు. అయితే ఈ వివాదం నేపథ్యంలో ఈ కుటుంబంతో రాజీ చేసుకోవాలని డీలర్ ప్రయత్నించాడు. కానీ వారి పిల్లలకు అంగీకరించకపోవడంతో ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు రికార్డుల ప్రకారం, డీలర్ ఈ మస్క్ను కొన్న తరువాత డ్రౌట్ ఎస్టిమేషన్ అండ్ ఫావ్ ప్యారిస్ అనే రెండు ఫ్రెంచ్ వేలం హౌసెస్ వారిని సంప్రదించాడు. దీని విలువ చాలా గొప్పదని తెలుసుకున్న డీలర్ ఆఫ్రికన్ మాస్క్ నిపుణులను సంప్రదించాడు. అలాగే మాస్ స్పెక్ట్రోమెట్రీ విశ్లేషణను , రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా దీని అసలు రేటు తెలుసుకుని మరీ మాంట్పెల్లియర్లో ఎక్కువ ధరకు వేలం వేశాడు. కాగా ది మెట్రో న్యూస్ ప్రకారం, ఆఫ్రికా దేశానికి సంబంధించిన అరుదైన కళా ఖండం. 19వ శతాబ్దానికి చెందిన న్గిల్ మాస్క్ గాబన్లోని ఫాంగ్ ప్రజల వినియోగిస్తారు. వివాహాలు, అంత్యక్రియల సమయంలో ఈ మాస్క్ను ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో ఇలాంటి మాస్క్లు చాలా అరుదుగా దర్శనమిస్తాయి. -
‘నన్ను కొట్టి చంపేస్తున్నాడు’.. కమిషనరేట్లో 105 ఏళ్ల వృద్ధుని రోదన!
యూపీలోని కాన్పూర్లో 105 ఏళ్ల వృద్ధుడు నేరుగా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుని, తన గోడు వెళ్లబోసుకున్నాడు. కార్యాలయానికి వచ్చిన ఆ వృద్ధుడిని చూసిన ఏడీసీపీ అశోక్ కుమార్ ముందుగా ఆతనికి చల్లని నీరు అందించారు. తరువాత అతని బాధేమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫోన్ చేసి, ఆ వృద్దుని తరపున ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే కాన్పూర్కు చెందిన రాజ్ బహదూర్ అనే వృద్ధుని గోడు పోలీసులు పట్టించుకోకపోవడంతో.. చేతికర్ర సాయంతో అతను నేరుగా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చాడు. అతనిని చూసిన పోలీస్ కమిషనర్ స్టాఫ్ ఆఫీసర్(ఏడీసీపీ) అశోక్ కుమార్ అతని దగ్గరకు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. తనను గ్రామానికి చెందిన ఉత్తమ్ కుమార్ అనే యువకుడు వేధిస్తున్నాడని, కొడుతున్నాడని ఆ వృద్దుడు ఫిర్యాదు చేశాడు. తాను ఆంగ్లేయుల పరిపాలనా కాలాన్ని చూశానని, అప్పట్లో తన వయసు 12 ఏళ్లు ఉంటుందని తెలిపాడు. వృద్దుని గోడు విన్న ఏడీసీపీ ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి, సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇది కూడా చదవండి: అన్నల మద్యం అలవాటుకు చెల్లెలు బలి.. సూసైడ్ నోట్లో మరో యువకుని పేరు? -
తాతకు చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు
-
కారు పార్కింగ్ వివాదం.. కొట్టుకున్న రెండు కుటుంబాలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ సంత్ నగర్లోని ఒక అపార్ట్మెంట్లో పార్కింగ్ విషయమై నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఒక పెద్దాయనతో సహా ఆ కుటుంబంలోని మహిళలు పార్కింగ్ చేసిన వ్యక్తిని కర్రతో చితకబాదారు. ఈ వీడియో వైరల్గా మారడంతో నెటిజన్లు వీరు అంతరించిపోతున్న భారతీయ కళకు ఊపిరి పోశారన్నారు. ఒకప్పుడు వీధుల్లో కుళాయి వద్ద సర్వసాధారణంగా బిందెలతో కొట్టుకోవడం చూసుంటాం. కానీ ఇప్పుడు నాగరికత పెరిగిన కారణంగా వీధిలోని సంప్రదాయాన్ని అపార్ట్మెంట్లకు బదిలీచేశారు. వేషధారణ అయితే మారింది కానీ గుణం మారలేదు. సంత్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముండే దుష్యంత్ గోయెల్ కారు పార్కింగ్ చేశాడన్న కోపంతో ఆ కుటుంబ పెద్ద కనీసం వారించకుండా ఒక కర్రతో దాడి తెగబడ్డారు. పాపం భర్తను కాపాడేందుకు అతని భార్య మోనా గోయెల్ తోపాటు వారి కుమార్తె కౌశికి కూడా ఎంత అడ్డుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఆ పెద్దమనిషి ఇంట్లోని వారంతా మూకుమ్మడిగా దాడి చేయడంతో దుష్యంత్ కుటుంబంలోని అందరూ గాయపడ్డారు. అనంతరం దుష్యంత్ స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా పెద్దమనిషి దల్జీత్ సింగ్ అతని కుమారుడు హర్జాప్ ఇద్దరినీ అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అదే కుటుంబంలోని ఆడవాళ్లు కూడా దాడిచేసినటు వీడియోలో స్పష్టంగా కనిపించడంతో వారిపైన కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. వారు ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా కోర్టు రెండుసార్లు నిరాకరించింది. ఒక్కరికి మాతం కోర్టు ఉపశమనం కలిగించినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ మధ్య కార్ పార్కింగ్ వివాదాలు ఒకప్పటి బిందుల ఫైట్ కంటే రసవత్తరంగా సాగుతున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. Kalesh b/w Two Neighbour’s in New Delhi over Car Parking issuepic.twitter.com/A21HCcknf6 — Ghar Ke Kalesh (@gharkekalesh) July 22, 2023 ఇది కూడా చదవండి: మణిపూర్లొ మరో ఘోరం.. ఫ్రీడం ఫైటర్ భార్య సజీవ దహనం -
నమ్మలేని నిజం..'లైఫ్' అంటే చివరికి ఓ పడకమంచం మాత్రమేనా!…
ఆమె వయస్సు 85 ఏళ్లు… ముంబై నుంచి పూణెకు వెళ్లిపోతోంది… పూణెలో ఓ సీనియర్ సిటిజెన్స్ హోమ్కు… అనగా ఓ ప్రత్యేక వృద్ధాశ్రమానికి… ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు… ఆమె చదువుకున్నదే… ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు చేసింది. వాళ్లందరూ అమెరికా పౌరులు. అందరికీ ఇద్దరేసి పిల్లలు… వాళ్లంతా హైస్కూల్, కాలేజీ చదువుల్లో ఉన్నారు… ఈమె అమెరికాకు బోలెడుసార్లు వెళ్లింది… కాన్పులు చేసింది… వెళ్లిన ప్రతిసారీ ఆరు నెలలపాటు ఉండేది… ఇక చాలు అనుకుంది… ఇక తన అవసరం ఎవరికీ ఏమీ లేదు. అమెరికాకు వెళ్లాలని లేదు, రానని చెప్పేసింది… ఆరోగ్యంగా మిగిలిన జీవితం గడపాలి చాలు… అందుకే ఆమె సీనియర్ సిటిజెన్స్ హోంకు వెళ్లిపోతోంది… వాటినే రిటైర్మెంట్ హోమ్స్ అనండి… అమెరికాలో వాటినే నర్సింగ్ హోమ్స్ అంటారుట. ఇక ఆమె కొనసాగిస్తూ.. ‘‘వెళ్తున్నాను… ఇక తిరిగి ఎక్కడికీ రాను… నా విశ్రాంత, చివరి కాలం గడపటానికి ఓ స్థలం వెతుక్కున్నాను… వెళ్లకతప్పదు… తమ పిల్లల బాగోగుల గురించి నా పిల్లలు బిజీ… ఎప్పుడో గానీ నేను వారి మాటల్లోకి రాను… నేనిప్పుడు ఎవరికీ ఏమీ కాను… ఎవరికీ అక్కరలేదు… ఆశ్రమం అంటే ఆశ్రమం ఏమీ కాదు… అది రిటైర్మెంట్ హోం… బాగానే ఉంది… ఒక్కొక్కరికీ ఒక సింగిల్ రూం… మరీ అవసరమైన ఎలక్ట్రికల్ పరికరాలు… టీవీ… అటాచ్డ్ బాత్రూం… బెడ్డు… ఏసీ కూడా ఉంది… కిటికీ తెరిస్తే బయటి గాలి… ఫుడ్డు కూడా బాగుంది… సర్వీస్ బాగుంది… కానీ ఇవేమీ చవుక కాదు… ప్రియమైనవే… నాకొచ్చే పెన్షన్ బొటాబొటీగా ఈ అవసరాలకు సరిపోతుంది… సరిపోదంటే నాకున్న సొంత ఇంటిని అమ్మేయాల్సిందే… అమ్మేస్తే ఇక చివరి రోజులకు సరిపడా డబ్బుకు ఢోకాలేదు… నా తరువాత ఏమైనా మిగిలితే నా కొడుక్కి వెళ్లిపోతుంది… సో, ఆ చీకూచింత ఏమీ లేదు… ‘నీ ఇష్టం అమ్మా, నీ ఆస్తిని నీ అవసరాలకే వాడుకో…’’ అన్నాడు నా వారసుడు… వెళ్లిపోవడానికి సిద్ధమైపోతున్నాను… అకస్మాత్తుగా..అవి నావి ఎలా అవుతాయ్?.. ఓ ఇంటిని వదిలేయడం అంటే అంత సులభమా..? కాదుగా… బాక్సులు, బ్యాగులు, అల్మారాలు, ఫర్నీచర్, రోజువారీ మన జీవితంతో పెనవేసుకున్న బోలెడు పాత్రలు… అన్ని కాలాల్లోనూ మనల్ని కాపాడిన బట్టలు… సేకరణ అంటే నాకిష్టం… లెక్కలేనన్ని స్టాంపులు ఉన్నయ్… చాయ్ కప్పులున్నయ్… అత్యంత విలువైన పెండెంట్లు, బోలెడు పుస్తకాలు… అల్మారాల నిండా అవే… డజన్లకొద్దీ విదేశీ మద్యం సీసాలున్నయ్… బోలెడంత వంట సామగ్రి ఉంది… అరుదైన మసాలాలు… ఇవే కాదు, అనేక ఫోటో అల్బమ్స్… ఇవన్నీ ఏం చేయాలి..? నేను ఉండబోయే ఆ ఇరుకైన గదిలో వాటికి చోటు లేదు… నా జ్ఞాపకాల్ని అది మోయలేదు… అది భద్రపరచదు కూడా… ఏముంది ఆ గదిలో…? మహా అయితే ఓ చిన్న కేబినెట్, ఓ టేబుల్, ఓ బెడ్, ఓ సోఫా ఓ చిన్న ఫ్రిజ్, ఓ చిన్న వాషింగ్ మెషిన్, ఓ టీవీ, ఓ ఇండక్షన్ కుక్కర్, ఓ మైక్రోవేవ్ ఓవెన్… అన్నీ అవసరాలే… కానీ నా జ్ఞాపకాల్ని కొనసాగించే సౌకర్యాలు కావు… నేను నా విలువైన సంపద అనుకున్న ఏ సేకరణనూ నాతో ఉంచుకోలేను… అకస్మాత్తుగా అవన్నీ నిరుపయోగం అనీ, అవి నావి కావనీ అనిపిస్తోంది… అన్నీ నేను వాడుకున్నాను, అంతే… అవి ప్రపంచానికి సంబంధించినవి మాత్రమే… నావి ఎలా అవుతాయి..? నా తరువాత ఎవరివో… రాజులు తమ కోటల్ని, తమ నగరాల్ని, తమ రాజ్యాల్ని తమవే అనుకుంటారు… కానీ వాళ్ల తరువాత అవి ఎవరివో… నిజానికి ప్రపంచ సంపద కదా… మనతోపాటు వచ్చేదేముంది..? వెళ్లిపోయేది ఒక్క దేహమే కదా… అందుకని నా ఇంట్లోని ప్రతిదీ దానం చేయాలని నిర్ణయించాను… అన్నింటితో బంధం తెంచేసుకున్నా.. కానీ అవన్నీ కొన్నవాళ్లు ఏం చేస్తారు..? నేను అపురూపంగా సేకరించుకున్న ప్రతి జ్ఞాపకం వేరేవాళ్లకు దేనికి..? వాటితో వాళ్లకు అనుబంధం ఉండదుగా… బుక్స్ అమ్మేస్తారు… నా గురుతులైన ఫోటోలను స్క్రాప్ చేసేస్తారు… ఫర్నీచర్ ఏదో ఓ ధరకు వదిలించుకుంటారు… బట్టలు, పరుపులు బయటికి విసిరేస్తారు… వాళ్లకేం పని..? మరి నేనేం ఉంచుకోవాలి..? నా బట్టల గుట్ట నుంచి కొన్ని తీసుకున్నాను… అత్యవసర వంట సామగ్రి కొంత… తరచూ పలకరించే నాలుగైదు పుస్తకాలు… ఐడీ కార్డు, సీనియర్ సిటెజెన్ సర్టిఫికెట్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డ్, ఏటీఎం కార్డు, బ్యాంకు పాస్ బుక్కు… చాలు… అన్నీ వదిలేశాను… బంధం తెంచేసుకున్నాను… నా పొరుగువారికి వీడ్కోలు చెప్పాను… డోర్ వేసి, గడపకు మూడుసార్లు వంగి మొక్కుకున్నాను… ఈ ప్రపంచానికి అన్నీ వదిలేశాను… ఎవరో చెప్పినట్టు… ఏముంది..? ఓ దశ దాటాక… కావల్సింది ఒక మంచం… ఓ గది… అత్యవసరాలు… మిగిలినవన్నీ గురుతులు మాత్రమే… ఇప్పుడు అర్థమవుతుంది మనకు… మనకు పెద్దగా ఏమీ అక్కర్లేదు… మనం ఇకపై సంతోషంగా ఉండేందుకు మనకు ఇక ఎటూ పనికిరానివాటిని సంకెళ్లుగా మిగుల్చుకోవద్దు… వదిలేయాలి… వదిలించుకోవడమే… కీర్తి, సంపద, భవిష్యత్తు… అన్నీ ఓ ట్రాష్… లైఫ్ అంటే చివరికి ఓ పడకమంచం మాత్రమే… నిజంగా అంతే… అరవై ఏళ్లు పైబడ్డామంటే ఆలోచన మారాలి… ప్రపంచంతో అనుబంధం ఏమిటో తెలుసుకోవాలి… అంతిమ గమ్యం ఏమిటో, భవబంధాలేమిటో అర్థమవ్వాలి… మన ఫాంటసీలు, మన బ్యాగేజీతో పాటు మనం ఇక తినలేని, అనుభవించలేని, ఉపయోగించలేనివి వదిలేయక తప్పదు… అందుకే బంధం పెంచుకోవడమే వృథా… సో, ఆరోగ్యంగా ఉండండి… ఆనందంగా ఉండండి… ఏదీ మనది కాదు… ఎవరూ మనవాళ్లు కారు… మనిషి ఒంటరి… మహా ఒంటరి… వచ్చేటప్పుడు, పోయేటప్పుడు’’..!! -
అయ్యో.. క్రికెట్ లెజెండ్స్ ఇలా మారిపోయారా?
-
వ్యక్తి ప్రాణాలు తీసిన వందేభారత్-ఆవు ప్రమాదం.. చూస్తుండగానే..
జైపూర్: దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన వందే భారత్ రైలు ప్రారంభం నుంచే పలు సవాళ్లు ఎదుర్కొంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో ఆకతాయిలు రైళ్లపై రాళ్లతో దాడి చేయగా.. మరికొన్ని చోట్ల ప్యాసింజర్లు చెత్తా చెదారం పడేసిన వార్తలొచ్చాయి. మరికొన్ని చోట్ల సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో పశువులు రైళ్లకు అడ్డుగా వచ్చి మృత్యువాత పడ్డాయి. తాజాగా రాజస్తాన్లో ఓ ఆవు వందే భారత్కు అడ్డుగా వచ్చి ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో మరో విషాదం ఏంటంటే.. ఆవు శరీర భాగాలు బలంగా ఢీకొట్టడంతో ఆ సమీపంలో మూత్రవిసర్జన చేస్తున్న వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. అల్వార్లోని అరవాలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న వందే భారత్ రైలు ఆవును ఢీకొనడంతో, దాని శరీర భాగాలు ఛిద్రమై 30 మీటర్ల దూరంలో మూత్రవిసర్జన చేస్తున్న శివదయాల్ శర్మపైపడి అతను అక్కడికక్కడే మృతి చెందడం కలచివేసింది. చదవండి: కోహ్లీ-గంభీర్ గొడవకు రాజకీయ రంగు.. ఎన్నికల్లో బుద్ధిచెబుతామంటున్న కన్నడిగులు..! రైలును ఢీకొనడంతో.. ఆవు శరీర భాగం దూరంలో ఉన్న శివదయాల్పై పడటంతో అతను అక్కడికక్కడే మరణించాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడు భారతీయ రైల్వేలో 23 ఏళ్లు ఎలక్ట్రీషియన్గా పనిచేసి రిటైర్ అయ్యాడని పోలీసులు తెలిపారు. శివదయాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. ఇదిలా ఉండగా సెమీ హై స్పీడ్ వందే భారత్ రైళ్లు ఆవులు, గేదెలను ఢీకొన్న సంఘటనలు ఎక్కువ శాతం ముంబాయి-గుజరాత్ రైల్వే లైన్లో జరిగినట్టుగా ఓ నివేదిక పేర్కొంది. చదవండి: ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే.. రంగంలోకి ఎన్ఐఏ -
తేనెటీగల బీభత్సం.. భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం
రావికమతం(అనకాపల్లి జిల్లా): రావికమతం మండలం గర్నికం గ్రామంలో తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. పొలంలో పనిచేసుకుంటున్న వృద్ధ దంపతులు ఆర్లె కామునాయుడు (61), అతని భార్య నూకాలమ్మ( 57)పై శుక్రవారం సాయంత్రం మూకుమ్మడిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన వీరిని విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భర్త కామునాయుడు శనివారం మధ్యాహ్నం మృతి చెందగా, భార్య నూకాలమ్మ అక్కడే చికిత్స పొందుతోంది. గ్రామానికి సమీపంలో వారి పశువుల పాకలు ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం పొలంలో గొర్రెలు కాస్తూ పనులు చూసుకుంటున్న తరుణంలో మేతకు వెళ్లి వచ్చే పశువులు సమీపంలో ఉన్న ఒక చెట్టు వద్ద ఒకదానితో మరొకటి తలపడి అలజడి చేశాయి. చదవండి: కొడుకును కొట్టి చంపిన తల్లిదండ్రులు దీంతో ఆ చెట్టుపై ఉన్న తేనెపట్టులోని ఈగలు బెదిరి పశువులతోపాటు వృద్ధ దంపతులపైనా గుంపుగా దాడి చేశాయి. దీంతో వారు కేకలు వేయగా సమీపంలోని రైతులు గోనె సంచులు చుట్టుకుని వెళ్లి వారిని రక్షించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ తీసుకువెళ్లారు. కేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కామునాయుడు శనివారం మృతి చెందారు. -
పేరుకే పెద్ద ఆస్పత్రి..కనీసం స్ట్రెచర్ లేక వృద్ధుడి పాట్లు: వీడియో వైరల్
కొన్ని ప్రభుత్వాస్పత్రులు పేరుకే పెద్ద ఆస్పత్రులు గానీ అందులో సౌకర్యాలు మాత్రం నిల్. దీంతో చికిత్స కోసం వచ్చే రోగులు పడే ఇబ్బందులు అంత ఇంత కాదు. చిన చితక పనులు చేసుకునే పేదలకు ఆ ఆస్పత్రులే గతి. దీంతో అక్కడ ప్రభుత్వోద్యోగులు వీళ్లపట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. అచ్చం అలాంటి పరిస్థితి ఓ ప్రభుత్వాస్పత్రిలో వృద్ధుడు ఎదుర్కొన్నాడు. కనీసం రోగిని తీసుకువెళ్లేందకు స్ట్రెచర్లు లేక అతని తీసుకువెళ్తున్న విధానం చూస్తే ఆ ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం రాక మానదు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్లోని గాల్వియర్లో సుమారు వెయ్యి పడకల ప్రభుత్వాస్పత్రికి ఓ వృద్ధుడు వచ్చాడు. అతని కాలు విరిగిపోవడంతో చికిత్స కోసం తన కోడలితో కలిసి ఆస్పత్రికి వచ్చాడు. ఐతే అక్కడ ఆర్థోపెడిక్ విభాగంలోని శ్రీకిషన్ ఓజా(65)ను ట్రామా విభాగానికి తరలించాలని సూచించారు. ఐతే అతన్ని తీసుకువెళ్లేందు కోసం స్ట్రెచర్ కోసం వెళ్లింది కానీ వాటికి చక్రాలు లేవు. దీంతో తన మామను ఒక తెల్లటి క్లాత్లో కూర్చొబెట్టి లాక్కుని వెళ్లింది. అక్కడ నుంచి ఆటో తీసుకుని ట్రామాకేర్ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఐతే అక్కడ రోగులు స్ట్రెచర్లు ఉన్నాయే కానీ పనిచేయనవని చెబతున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. Video: No Hospital Stretcher, Elderly Man With Broken Leg Dragged On Cloth In Gwalior Hospital https://t.co/2NAOIfdZ6W pic.twitter.com/F0uWTMiPk3 — NDTV (@ndtv) March 25, 2023 (చదవండి: మీ ఛాతీపై బీజేపీ బ్యాడ్జి పెట్టుకోండి అంటూ విలేకరిపై రాహుల్ ఫైర్) -
ప్రతికూల ఆలోచనల వల్లే ఆందోళన, కుంగుబాటు
లండన్: వృద్ధుల్లో ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడికి ప్రతికూల భావోద్వేగాలు, ఆలోచనలే కారణమని పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. మనసులో ప్రతికూల ఆలోచనలు మొదలైతే ఆందోళన పెరుగుతున్నట్లు తేల్చారు. భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఒత్తిడి నుంచి బయటపడవచ్చని సూచించారు. పెద్దల్లో మెదడుపై ప్రతికూల ఆలోచనల ప్రభావం, మానసిక ఆందోళనకు మధ్య గల సంబంధాన్ని స్విట్జర్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ జెనీవాకు చెందిన న్యూరో సైంటిస్టులు కనుగొన్నారు. ఇతరుల మానసిక వ్య«థ పట్ల యువకులు, వృద్ధులు ఎలా స్పందిస్తారు? వారి మెదడు ఎలా ఉత్తేజితం చెందుతుంది? వారిలో ఎలాంటి భావోద్వేగాలు తలెత్తుతాయి? అనే దానిపై పరిశోధన చేశారు. మొదటి గ్రూప్లో 27 మందిని(65 ఏళ్లు దాటినవారు), రెండో గ్రూప్లో 29 మందిని(25 ఏళ్ల యువకులు), మూడో గ్రూప్లో 127 మంది వయో వృద్ధులను తీసుకున్నారు. విపత్తుల వంటి ప్రతికూల పరిస్థితుల కారణంగా మానసికంగా బాధపడుతున్న వారి వీడియో క్లిప్పులను, తటస్థ మానసిక వైఖరి ఉన్నవారి వీడియో క్లిప్పులను చూపించారు. యువకులతో పోలిస్తే వయో వృద్ధుల మెదడు త్వరగా ఉత్తేజితం చెంది, ప్రతికూల భావోద్వేగాలకు గురవుతున్నట్లు ఫంక్షనల్ ఎంఆర్ఐ ద్వారా గమనించారు. వారి మనసులో సైతం ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి వంటి విపరీత భావాలు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. అలాంటి ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఆందోళన, ఒత్తిడి సైతం తగ్గుముఖం పడుతున్నట్లు కనిపెట్టారు. అధ్యయనం వివరాలను నేచర్ ఏజింగ్ పత్రికలో ప్రచురించారు. -
Viral Video: భర్తను వెనకాల కూర్చొబెట్టుకొని బండి నడిపిన బామ్మ..
బైక్ రైడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. బైక్ అంటే చాలు కుర్రాళ్లు ఎగిరి గంతులేస్తారు. ఒకప్పుడు మగవారే బైక్లు, కారులు నడిపేవారు. అమ్మాయిలు అసలు రైడింగ్ జోలికి వెళ్లేవారు కాదు. కానీ రాను రాను పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. యువతులు, మహిళలు కూడా అన్ని వాహనాలను డ్రైవ్ చేస్తున్నారు. తాజాగా వయసు పైబడిన పెద్దావిడ బండి నడిపి వావ్ అనిపించింది. అంతేగాక వెనుక సీట్లో తాతను కూర్చోబెట్టి బామ్మ డ్రైవ్ చేయడం మరింత స్పెషల్గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. వీడియోలో సుమారు 60 ఏళ్లు ఉన్న ఓ పెద్దావిడ ఎంతో ఉత్సాహంగా, చలాకీగా ద్విచక్ర వాహనం నడిపింది. భర్తను వెనకాల కూర్చొబెట్టుకొని రోడ్డుపై రయ్ రయ్ అంటూ వెళ్లింది. బామ్మ చక్కగా చీరకట్టుకొని ఉండగా తాత తెల్లటి చొక్కా, పంచె కట్టుకొని కనిపించాడు. దీంతో మాములు బామ్మ కాస్తా బైక్ బామ్మగా మారిపోయింది. ఎలాంటి భయం, బెరుకు లేకుండా బండి నడిపి.. యువకులకు తాను ఎంత మాత్రం తీసిపోనని రుజువు చేసింది. దీనిని వెనకాల వస్తున్న వారు వీడియో తీశారు. సుస్మితా డోరా అనే యువతి తన ఇన్స్టాగ్రామ్లో పోస్టుచేసింది. బామ్మ డ్రైవింగ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘ఈ వయసులో బండి నడపడటం గ్రేట్..చూడటానికి ఎంతో అందంగా ఉంది. నీ డ్రైవింగ్కు తిరుగు లేదు’ అంటూ ప్రశంసిస్తున్నారు. కపుల్ గోల్స్ క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ.. బండి నెంబర్ ప్లేట్ చూస్తుంటే తమిళనాడుకు చెందినదిగా తెలుస్తోంది. View this post on Instagram A post shared by Susmita Dora (@the_aspiring_seed) -
కొడుకు శవంతో 4 రోజులు వృద్ధుడి సహవాసం.. దుర్వాసన రావటంతో..!
చండీగఢ్: పిల్లలు లేకపోవటంతో బాలుడిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు ఓ 82 ఏళ్ల వృద్ధుడు. అమాయకత్వం, ఇతరులతో కలుపుగోలుగా ఉండకపోవటంతో పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఇంట్లో ఇద్దరే ఉంటారు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. అయితే, అనారోగ్యంతో దత్తత తీసుకున్న కుమారుడు నాలుగు రోజుల క్రితం మృతి చెందగా.. ఏం చేయాలో తెలియని వృద్ధుడు శవం వద్దే ఉండిపోయాడు. నాలుగు రోజుల తర్వాత ఇంట్లోంచి దుర్వాసన రావటంతో విషయం వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అపస్మారక స్థితిలో మృతదేహం వద్ద పడిపోయి ఉన్న వృద్ధుడిని సోమవారం రక్షించి ఆసుపత్రికి తరలించారు. ‘సమాచారం అందుకోవటంతో అక్కడికి వెళ్లి ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాం. మృతదేహం వద్దే వృద్ధుడు అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆయన ఏమీ చెప్పటం లేదు. మాట్లాడే పరిస్థితి కనిపించటం లేదు. ఆయనకు అంతగా ఏమీ తెలిసేలా కనిపించటం లేదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.’ అని పోలీసు అధికారి పాల్ చంద్ తెలిపారు. కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు చెప్పారు. మృతి చెందిన సుఖ్విందర్ సింగ్ అనే వ్యక్తి బల్వాంత్ సింగ్కు దత్తపుత్రుడిగా స్థానికులు తెలిపారు. ‘వారిని ఇటీవల ఎవరైనా పలకరించారా అనే విషయం తెలియదు. గత నెల రోజులకుపైగా వృద్ధుడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఎవరితో ఎక్కువగా మాట్లాడడు. దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చింది. ఏం జరిగిందో మాకు తెలియదు. పోలీసులకు ఫోన్ చేసి చెప్పాం.’ అని వెల్లడించారు స్థానికులు. ఇదీ చదవండి: చెల్లి శవంతో 4 రోజులు సహవాసం.. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. -
‘మాతో ఉండండి.. వేధించకండి..వేడుకుంటున్నాం ’
సాక్షి, హైదరాబాద్: తమతో పిల్లలు మరింత సమయం గడపాలని కోరుకుంటున్నారు కొందరు. అదే సమయంలో పిల్లల వేధింపులు తట్టుకోలేకపోతున్నామంటున్నారు. మరికొందరు. ఓ వయసు దాటిన తర్వాత అటు సమాజం ఇటు కుటుంబం రెండు వైపులా నిర్లక్ష్యాన్ని ఎదుర్కుంటున్న వృద్ధాప్యపు స్థితిగతులపై ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల వ్యాప్తంగా ‘హెల్పేజ్ ఇండియా’ ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహించింది. ఇందులో ఎన్నో ఆసక్తికర, ఆలోచించాల్సిన, తప్పకుండా స్పందించాల్సిన అంశాలు వెలుగు చూశాయి. అవి శాతాల వారీగా ఇలా... ఎంతెంత దూరం..ఆరోగ్యం ► కీళ్లు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నవారు 78 శాతం ► డయాబెటిస్ తో 48 శాతం రక్తపోటు సమస్యతో 37 శాతం ► గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు 21 శాతం ► ఆరోగ్యం కోసం రోజూ నడక కొనసాగిస్తున్నారు 76 శాతం ► యోగా, ప్రాణాయామం చేసేవారు 21 శాతం ► సరైన పద్ధతిలో ఔషధాలు వాడుతున్నవారు 71 శాతం ► తమ ఆరోగ్యం పట్ల పిల్లలు శ్రద్ధ తీసుకోవాలంటున్నారు 50 శాతం ► ఆరోగ్య బీమా తమకు అన్ని విధాలా అందుబాటులో ఉండాలంది 43 శాతం ► ఆహారాన్ని నియంత్రిత పద్ధతిలో తీసుకుంటున్నది 69 శాతం ► సరైన ఆరోగ్య సేవలు పొందుతున్నది 32 శాతం ► బలహీనమైన కాళ్ల కారణంగా పడిపోతామని భయపడుతున్నవారు 37 శాతం ► కంటిచూపు తగ్గిందని బాధపడుతున్నవారు 37 శాతం ► ప్రైవేట్ ఆసుపత్రుల్లో, డయాగ్నసిస్ సెంటర్లలోనూ తమకు తక్కువ ధరకు వైద్య సేవలు లభించాలని ఆశిస్తోంది 35 శాతం ఆర్థికం.. అంతంత మాత్రం.. ► ఆర్థిక అవసరాల కోసం కుటుంబంపైనే ఆధారపడింది 67 శాతం ► ఆర్థిక భద్రత కలిగి ఉంది 58 శాతం ► పింఛను తదితరాలపై ఆధారపడ్డవారు 45 శాతం పరివారం.. పరిస్థితి ఇదీ... ► కుటుంబ సభ్యుల నిరాదరణకు గురవుతున్నది 56 శాతం ► తరచూ కుటుంబ సభ్యుల చేత తిట్లు తింటోంది 36 శాతం ► పిల్లల చేతిలో దెబ్బలు తింటున్నవారు 18 శాతం ► తమ ఉనికిని కుటుంబం నిర్లక్ష్యం చేస్తోందంటున్నవారు 9 శాతం ► తమను ఆర్ధిక ఇబ్బందులు పెడుతున్నారంటున్నవారు 9 శాతం ► వేధింపుల నుంచి ఎలా బయటపడాలో తెలియని వారు 24 శాతం ► తమ కుటంబ సభ్యులకు కౌన్సెలింగ్ కావాలంటున్నవారు 71 శాతం ► సామాజిక వేధింపులకు గురవుతున్నామని అంటోంది 42 శాతం ఇలా ఉన్నాం.. అలా ఉండాలనుకుంటున్నాం... ► సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారు 21 శాతం ► సమాజసేవకు సై అంటోంది 25 శాతం ► కుటుంబంతో సమయం గడుపుతున్నవారు 53 శాతం ► సెల్ఫోన్ వాడుతున్న వృద్ధులు 96 శాతం ► వీడియో కాల్ ద్వారా మాట్లాడుతున్నవారు 15 శాతం ► తమ వయసువారిని ముఖాముఖి కలుసుకుంటోంది 45 శాతం ► పిల్లలకు దూరంగా ఉన్న వృద్ధుల్లో పిల్లలకు దగ్గరగా ఉండాలనుకుంటున్నవారు 43 శాతం ► కుటుంబంతోనే ఉన్నప్పటికీ, తమ కుటుంబ సభ్యులు తమతో మరింత సమయం గడపాలని కోరుకుంటున్న వారు 61శాతం ► తమ సమస్యలపై సమాజం స్పందించాలని, ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆశిస్తోంది 53 శాతం -
మహిళా సంఘాల తరహాలో వృద్ధుల సంఘాలు
సాక్షి, అమరావతి: మహిళా పొదుపు సంఘాల మాదిరే ఇప్పుడు కొత్తగా వృద్ధుల సంఘాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ సంఘాలకు ‘ఎల్డర్లీ స్వయం సహాయక సంఘాలు (ఈఎస్హెచ్జీ)’గా పేరు పెట్టారు. మహిళలు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు రివాల్వింగ్ ఫండ్ రూపంలో ఆర్థికసాయం అందజేసినట్లే ప్రభుత్వం వృద్ధుల సంఘాలకు కూడా రెండేళ్లపాటు రూ.25 వేల చొప్పున మొత్తం రూ.50 వేలు ఇవ్వనుంది. రెండేళ్ల తర్వాత ప్రస్తుతం మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నట్లే వృద్ధుల సంఘాలకు బ్యాంకు రుణాలను ఇప్పించే అవకాశం ఉంది. ఈ వృద్ధుల సంఘాల్లో.. 60 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలు ఒకే సంఘంలోనే సభ్యులుగా కొనసాగవచ్చు. అయితే.. పురుషులు, మహిళల వేర్వేరు సంఘాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తారు. ఒక సంఘంలో కనీసం పదిమంది, గరిష్టంగా 20 మంది సభ్యులుగా కొనసాగవచ్చు. కొండ ప్రాంతాలతోపాటు ఇతర గిరిజన ప్రాంతాల్లో అత్యంత వెనుకబాటుతనంతో ఉండే 12 కులాలకు చెందిన వారైతే కనీసం ఐదుగురితోనే సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా 15 మండలాల్లో వృద్ధుల సంఘాల ఏర్పాటును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత దశలో క్రమంగా రాష్ట్రమంతా ఈ కార్యక్రమాలను విస్తరించనున్నారు. మూడు విభాగాలుగా.. సంఘాల ఏర్పాటుకు వృద్ధులను మూడు విభాగాలుగా విభజించారు. 1. తమ వ్యక్తిగత పనులు సొంతంగా చేసుకుంటూ, జీవనోపాధి కోసం ఇతర పనులు కూడా చేసుకునేవారు. 2. తమ పనులు మాత్రమే చేసుకుంటూ, ఇంకేమీ చేయలేని వారు. 3. వ్యక్తిగత పనులకు వేరే వాళ్లపై ఆధారపడే స్థితిలో ఉన్న వారు ► ప్రస్తుతం ప్రయోగాత్మకంగా మొదటి రెండు విభాగాల వారితో మాత్రమే సంఘాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ సంఘాల ఏర్పాటు ఎందుకంటే.. ► వృద్ధాప్యంలో కూడా వారు సమాజంలో గౌరవంగా జీవించేహక్కును ప్రోత్సహించడం. ► కుటుంబ ఇబ్బందుల కారణంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు వారి మనసు బాగుండేలా సంఘ సభ్యులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడాన్ని ప్రోత్సహించడం. ► వృద్ధాప్యంతో వచ్చే ఆరోగ్య సమస్యలపై పరస్పరం మాట్లాడుకోవడం ద్వారా వారిలో అవగాహన పెరిగేలా చూడటం. సాయం ఇలా.. ► వృద్ధులు సొంత ఆదాయం పెంచుకోవడానికి ఆసక్తి చూపితే వారికి ఆసక్తి ఉన్న అంశంలో శిక్షణ ఇచ్చి ముందుకెళ్లేందుకు సంఘాల వారీగా బ్యాంకు రుణం ఇప్పించే అవకాశం ఉంది. ► సంఘం ఏర్పాటు చేసినప్పుడు రూ. 5 వేలు, తర్వాత సభ్యులకు శిక్షణ కార్యక్రమాల సమయంలో రూ.5 వేలు, తొలి ఏడాది పెట్టుబడిగా మరో రూ.15 వేలు, రెండో ఏడాది రూ.25 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. 15 మండలాల్లో 3,017 సంఘాలు మహిళా పొదుపు సంఘాల ఏర్పాటు కార్యకలాపాలను పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలోనే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన 15 మండలాల్లో వృద్ధుల సంఘాల ఏర్పాటు కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది. ఆ 15 మండలాల్లో ఈ ఏడాది ప్రాథమికంగా 3,017 సంఘాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటికే 1,048 సంఘాలు ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో మహిళా పొదుపు సంఘాల ఏర్పాటు ప్రక్రియలో పాల్గొనే గ్రామ సమాఖ్య అసిస్టెంట్ (వీవోఏ)ల ద్వారానే వృద్ధుల సంఘాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుంది. వృద్ధుల సంఘాల ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలో బాధ్యులుగా ఉన్న ఒక్కొక్కరికీ శిక్షణ ఇవ్వగా, ఆ తర్వాత స్థాయిలో ఎంపికచేసిన మండల సెర్ప్ సిబ్బందికి, ఆయా మండలాల పరిధిలోని గ్రామ సమాఖ్యల సిబ్బందికి, వీవోఏలకు ప్రభుత్వం ఒక దశ శిక్షణను కూడా పూర్తిచేసింది. గ్రామాల్లో వీవోఏలు వృద్ధులను కలిసి సంఘాల ఏర్పాటు ఉద్దేశం వివరించి, సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. -
25 ఏళ్ల తరువాత కుటుంబం చెంతకు..
జగ్గయ్యపేట అర్బన్: మతి స్థిమితం కోల్పోయి భార్యా బిడ్డలకు దూరమై అనాథగా జీవిస్తున్న ఓ వృద్ధుడు 25 ఏళ్ల తరువాత తిరిగి కుటుంబం చెంతకు చేరుకున్నాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక చెరువు బజారుకు చెందిన మణిమాల వెంకట్రావు(70) ముఠా కార్మికుడిగా జీవించేవాడు. అతనికి భార్య వెంకాయమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకట్రావుఒకరోజు అతిగా మద్యం తాగి మతి స్థిమితం కోల్పోయాడు. ఇంటికి చేరుకోలేక తిరిగి తిరిగి చివరకు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు అతని కోసం కొన్నాళ్లపాటు వెతికి ఆశలు వదులుకున్నారు. ఇలా 25 ఏళ్లు గడిచిపోయాయి. ఇటీవల వెంకట్రావుకు పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో తోటి వారితో తన ఊరు, కుటుంబ సభ్యుల పేర్లు చెప్పగలిగాడు. దీంతో వృద్ధాశ్రమం నిర్వాహకులు జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి వెంకట్రావు వివరాలు చెప్పారు. జగ్గయ్యపేట ఎస్ఐ రామారావు వెంటనే విచారణ చేసి స్థానిక చెరువుబజారులో వెంకట్రావు కుటుంబ సభ్యులు ఉన్నారని తెలుసుకొని, సమాచారమిచ్చారు. రంపచోడవరంలోని వృద్ధాశ్రమంలో ఉన్న వెంకట్రావును అక్కడి పోలీసుల సహాయంతో జగ్గయ్యపేటకు తీసుకొచ్చారు. ఆదివారం జగ్గయ్యపేట పోలీస్స్టేషన్లో వెంకట్రావును అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
రైళ్లలో వృద్ధులకు రాయితీలను పునరుద్ధరించండి
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో రైళ్లలో వృద్ధులకు నిలిపేసిన చార్జీల రాయితీని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని భారతీయ రైల్వే శాఖను హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో తగిన అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. కాగా, ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు గతంలో ఇచ్చిన రాయితీని పునరుద్ధరించామని ఆర్టీసీ తరఫు న్యాయవాది పి.దుర్గాప్రసాద్ ధర్మాసనానికి నివేదించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. రైల్వే శాఖ కూడా ఈ దశలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంది. రైళ్లు, ఆర్టీసీ బస్సు చార్జీల్లో వృద్ధులకు గతంలో ఇస్తూ వచ్చిన రాయితీని కోవిడ్ సమయంలో రద్దు చేశారని, తర్వాత దాన్ని పునరుద్ధరించలేదని, ఈ విషయంలో అధికారులకు తగిన ఆదేశాలివ్వాలంటూ శ్రీకాకుళానికి చెందిన జీఎన్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. -
విశాఖలో అమానవీయం.. వృద్ధుడిని రోడ్డు పక్కన వదిలేసిన కుటుంబం
సాక్షి, ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): ఎంవీపీ కాలనీలోని వెంకోజిపాలెంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కదలేని పరిస్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని సొంత కుటుంబ సభ్యులు నడిరోడ్డుపై వదిలివెళ్లిపోయారు. కనీసం మాట్లాడే స్థితిలో కూడా లేని ఆ వృద్థుడు కొద్ది రోజులుగా తీవ్రమైన చలిగాల్లోనే బతుకుపోరాటం చేస్తున్నాడు. తొలుత భిక్షాటన చేసుకునే వ్యక్తిగా భావించిన స్థానికులు అతనిని పట్టించుకోలేదు. అయితే రోజులు గడుస్తున్నా అతను అక్కడే ధీనంగా ఉండడం, కదల్లేక రాత్రిపూట చలికి తట్టుకోలేక వణికిపోవడాన్ని గమనించారు. దీంతో స్థానిక పోలీసులకు ఓ పాత్రికేయుడు సహకారంతో సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా తనది అప్పుఘర్ ప్రాంతమని, తన కుటుంబ సభ్యులే (కొడుకు, కోడలు) ఇక్కడ వదిలేసి వెళ్లినట్లు వెల్లడించాడు. అయితే పేరుతో పాటు పూర్తి వివరాలు తెలిపే స్థితిలో అతను లేకపోవడంతో పోలీసులు, స్థానికులు ఇండియన్ రెడ్క్రాస్ సంస్థకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రెడ్క్రాస్ సంస్థ ప్రతినిధి మురళీ, కానిస్టేబుల్ రవినాయక్ సహాయంతో సంస్థ ఆశ్రమానికి ఆయన్ను తరలించారు. పోలీసులకు, రెడ్క్రాస్ ప్రతినిధులను స్థానికులు అభినందించారు. చదవండి: ‘నేను రైస్మిల్ వద్దకు కాపలాకు వెళ్తున్న.. పొద్దున్నే వస్తా’ అని ఇంట్లో చెప్పి.. -
AP: వృద్ధులకు వరం.. ‘వైఎస్సార్ కంటి వెలుగు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కంటిచూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం వరంగా మారింది. ఈ కార్యక్రమం కింద 60 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటోంది. వచ్చే సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని వృద్ధులందరి కంటిచూపు సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో వైద్య, ఆరోగ్యశాఖ చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. చదవండి: మీ ఆనందమే నా తపన: సీఎం జగన్ 13 జిల్లాల్లోని 378 వైద్యబృందాలు ఇప్పటివరకు 15,64,710 (అర్హుల్లో 27.51 శాతం) మందికి కంటిపరీక్షలు చేశాయి. 6.04 లక్షల మందికి మందుల ద్వారా నయం అయ్యే సమస్యలున్నట్లు గుర్తించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 8,23,264 మందికి కళ్లద్దాలు అవసరం ఉండగా 5,33,789 మందికి ఇచ్చారు. వైఎస్సార్ కంటివెలుగు పథకం మొదటి రెండు దశల్లో విద్యార్థులకు కంటిపరీక్షలు చేశారు. మొత్తం 70.36 లక్షల మంది (మొదటిదశలో 66 లక్షల మంది, రెండోదశలో 4.36 లక్షల మంది) విద్యార్థులకు కంటిపరీక్షలు నిర్వహించారు. 796 ఆపరేషన్లు చేసిన మచిలీపట్నం వైద్యుడు భాస్కర్రెడ్డి రాష్ట్రంలో 1,27,632 మంది వృద్ధులు శుక్లాల సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యబృందాలు గుర్తించాయి. వీరందరికి ప్రభుత్వం ఉచితంగా కేటరాక్ట్ ఆపరేషన్లు చేయించింది. రాష్ట్రంలో వారానికి సుమారు ఆరువేల మందికి ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ పథకం కింద అనేకమంది వైద్యులు అత్యధిక సర్జరీలు చేస్తున్నారు. గత ఏడాది నవంబర్ నుంచి 60 ఏళ్లు దాటిన 796 మందికి, 60 ఏళ్లలోపున్న 552 మందికి మొత్తం 1,348 ఆపరేషన్లు చేసి మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి వైద్యుడు భాస్కర్రెడ్డి రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచారు. 964 సర్జరీలతో ఏలూరు ప్రభుత్వాస్పత్రి వైద్యుడు ఎ.ఎస్.రామ్, 921 సర్జరీలతో విజయనగరం జిల్లా ఆస్పత్రి వైద్యుడు కె.ఎన్.మూర్తి తరువాత స్థానాల్లో ఉన్నారు. గుంటూరు జీజీహెచ్లో ఒక ప్రొఫెసర్, పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు ఏరియా ఆస్పత్రి వైద్యుడు ఇప్పటివరకు ఒక్క సర్జరీ కూడా చేయని వారిలో ఉన్నారు. డీఎంఈ, ఏపీవీవీపీ పరిధిలో సర్జరీలు చేయని, మొక్కుబడిగా చేస్తున్న వైద్యులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీచేశారు. సెప్టెంబర్ నాటికి లక్ష్యసాధన వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి వృద్ధులందరికీ కంటిపరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. ఈ లోగానే పరీక్షలు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వేగంగా పరీక్షలు పూర్తిచేయడానికి జిల్లా అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తున్నాం. వైద్యుల వారీగా చేస్తున్న సర్జరీలను సమీక్షిస్తున్నాం. అవసరాన్ని బట్టి వైద్యులకు శిక్షణ ఇప్పిస్తున్నాం. – డాక్టర్ ఆర్.ఆర్.రెడ్డి, జేడీ, రాష్ట్ర అంధత్వ నివారణ, కంటివెలుగు సంస్థ -
అంత్యక్రియల కోసం దాచిన సొమ్ము లూటీ.. పోలీసాఫీసర్పై ప్రశంసలు
SSP Sandeep Chaudhary of Srinagar helped Chana seller with 1 lakh సాక్షి, ఇంటర్నెట్: బోసి నవ్వులు చిందిస్తున్న ఈ తాతను చూడగానే.. మనసుకు ఏదో తెలియని ఆహ్లాదం కలుగుతుంది కదా. కానీ ఈ తాతకు వచ్చిన కష్టం తెలిస్తే.. గుండె బద్దలవుతుంది. కష్టానికి కారకులైన వారి మీద ఎక్కడాలేని కోపం వస్తుంది. కొందరు సోమరిపోతుల మాదిరి కాకుండా.. వయసు మీద పడి.. వృద్ధాప్యంలోకి అడుగుపెట్టినప్పటికి కూడా.. పని చేయడం మానలేదు ఈ తాత. రోడ్డు పక్కన కూర్చుని పల్లీ, బఠాణీలు అమ్ముకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నాడు. ఇప్పటి వరకు పల్లీలు అమ్ముతూ దాదాపు లక్ష రూపాయల వరకు పోగు చేశాడు. తాను చనిపోయాక అంత్యక్రియలకు అక్కరకు వస్తుందని ఈ మొత్తాన్ని దాచుకున్నాడు. కానీ దరిద్రులు తాత కష్టార్జితాన్ని దొంగిలించారు. దీని గురించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఈ విషయం ఓ ఉన్నతాధికారికి తెలిసింది. వృద్ధుడి కష్టం అతడిని కదిలించింది. దాంతో తాత పొగొట్టుకున్న లక్ష రూపాయలను తానే అందించాడు. సదరు ఉన్నతాధికారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. ఆ వివారలు.. (చదవండి: Mrs Vishnoi: నాన్న కావాలని ఉందన్నారు.. కానీ తిరిగి రాలేదు.. అయినా) జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రెహమాన్ అనే వృద్ధుడు రోడ్డు పక్క పల్లీలు, బఠాణీలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. కుటుంబ సభ్యులు ఉన్నారో లేరే తెలియదు. ఒకవేళ ఉన్నా.. బతికున్నప్పుడు, మరణించిన తర్వాత కూడా తన వల్ల వారు ఇబ్బంది పడకూడదని భావించిన రెహమాన్.. రోడ్డు పక్కన పల్లీలు అమ్ముతూ తద్వారా వచ్చిన డబ్బును కూడబెట్టసాగాడు. ఇలా ఇప్పటి వరకు లక్ష రూపాయల వరకు దాచుకున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం కొందరు దుండగులు రెహమాన్ అంత్యక్రియల కోసం దాచుకున్న మొత్తాన్ని దొంగిలించారు. పాపం జీవితాంతం కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ము ఇలా దొంగలపాలవ్వడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు రెహమాన్. పోయిన సొమ్ము తిరిగి వస్తుందనే నమ్మకం ఏ కోశాన లేదు. అయినప్పటికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చదవండి: 20ఏళ్ల అవమానాలు: బారాత్, డీజే, విందుతో వృద్ధ జంట పెళ్లి ) రెహమాన్ వ్యధ, బాధ శ్రీనగర్ సీనియర్ సూపరింటెండెంట్ పోలీసు అధికారి సందీప్ చౌదరీని కదిలించింది. రెహమాన్ వివరాలు తెలుసుకున్న సందీప్.. అతడు పొగొట్టుకున్న లక్ష రూపాయలను రెహమాన్కు అందజేశాడు. దీని గురించి శ్రీనగర్ మేయర్ పర్వైజ్ అహ్మద్ ఖాద్రీ తన ట్విటర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. సందీప్ మంచి మనసును ప్రశంసిస్తున్నారు నెటిజనులు. Appreciative decision by Srinagar police & @Sandeep_IPS_JKP towards the old aged Channa seller to assist him with the money of one lakh that was looted from his home. Abdul Rehman had saved the laborious money for his last rites; he sells snacks and lives all alone! Salute sir pic.twitter.com/FL0tXvoUWB — Parvaiz Ahmad Qadri (@Parvaiz_Qadri) November 14, 2021 చదవండి: దారుణం: కాచుకోవాల్సిన వారే కాటికి పంపారు.. -
ఫ్రిజ్లో వృద్ధుడి శవం.. డబ్బుల్లేక మనవడే..
సాక్షి, వరంగల్ రూరల్/పరకాల: తోడుగా ఉన్న తాత మరణిం చాడు. గొడవలతో బంధువులు దూరమయ్యారు. దీంతో ఏం చేయాలో ఆ మనవడికి తోచలేదు. అంత్యక్రియలు చేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. తాత పెన్షన్ డబ్బులు వచ్చాక అంత్యక్రియలు పూర్తి చేయాలని భావించాడు. మరణించిన విషయం తెలిస్తే పెన్షన్ డబ్బులు రావేమోనని తాత శవాన్ని ఫ్రిజ్లో దాచిపెట్టాడు. కానీ మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో విషయం బయటపడింది. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. కామారెడ్డికి చెందిన బైరం బాలయ్య (90)కు ముగ్గురు కుమారులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ పాఠశాలలో బాలయ్య ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. బాలయ్య కుమారుడు హరికృష్ణ భార్య ప్రమీల తొమ్మిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. భార్య చనిపోవడం, సోదరుల మధ్య గొడవలు ఉండటంతో కుమారుడు నిఖిల్తో కలిసి హరికృష్ణ పరకాలలోని తోరండ్ల కైలాసం కాంప్లెక్స్కు నివా సం మార్చాడు. వాస్తు చెబుతూ వచ్చిన డబ్బులతో జీవిస్తున్నాడు. అయితే బాలయ్య కామారెడ్డిలో ఉంటున్న తన ఇద్దరు కుమారులు పట్టించుకోవడం లేదంటూ భార్య నర్సమ్మతో కలిసి హరికృష్ణ దగ్గరకు వచ్చారు. రెండేళ్ల క్రితం కామారెడ్డిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ చనిపోగా.. ఆయన కుమారుడు నిఖిల్తో కలిసి పరకాలలోనే ఉంటున్నారు. బాలయ్యకు నెలనెలా వచ్చే రూ.40 వేల పెన్షన్తో వీరి జీవితం సాఫీగానే సాగింది. సరిగ్గా ఆరు నెలల క్రితం బాలయ్య భార్య నర్సమ్మ కరోనాతో చనిపోయింది. తల్లి లేకపోవడం, మిగిలిన కుటుంబ సభ్యులు సైతం ఒకరొకరుగా దూరం కావడంతో నిఖిల్ మానసి కంగా కుంగుబాటుకు గురయ్యాడు. అయినప్పటికీ పక్షవాతంతో మంచానపడిన తాతకు అన్ని సపర్యలూ చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో బాలయ్య కూడా మరణిం చాడు. అయితే గత నెలలో బాలయ్యకు వచ్చిన రూ.40 వేల పెన్షన్తో రూ.30 వేల వరకు అప్పు తీర్చడంతోపాటు ఇంట్లో ఖర్చులకు ఉపయోగించాడు. దీంతో చేతిలో డబ్బులు లేకుండా పోయింది. తాత చనిపోయిన విషయం తెలిస్తే పెన్షన్ రాదని, ఆయన అంత్యక్రియలు చేయలేనని భావించిన నిఖిల్ తాత శవానికి శాలువా కప్పి, మడతబెట్టి ఫ్రిజ్లో దాచాడు. దుర్వాసన రాకుండా బ్లీచింగ్ పౌడర్.. బాలయ్య చనిపోయిన ఆదివారం నుంచి ఇప్పటివరకు అ దేఇంట్లో నిఖిల్ ఉంటున్నాడు. శవం దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇంట్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాడు. ఏమీ ఎరగనట్టు ప్రవర్తిస్తూ ఎవరికీ విషయం తెలియ కుండా జాగ్రత్తపడ్డాడు. అయితే ఇంట్లో దుర్వాసన వస్తుండటంతో కాంప్లెక్స్ యజమాని కైలాసం నిఖిల్ను రెండు రోజుల క్రితం ప్రశ్నించాడు. పందికొక్కు చనిపోయిందని నిఖిల్ చెప్పడంతో వెళ్లిపోయాడు. గురువారం దుర్వాసన తీవ్రం కావడంతో అనుమానం వచ్చిన కైలాసం ఇంట్లోకి వెళ్లి ఫ్రిజ్ తెరిచి చూశాడు. లోపల శవం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కుళ్లిపోయిన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. నిఖిల్ని అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే పూర్తి విషయం తెలుస్తుందని పోలీసులు అంటున్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement