-
సమితిపై సంస్కరణల ఒత్తిడి
భద్రతామండలి సంస్కరణలపై చాలాకాలంగా చర్చ సాగుతోంది. శాశ్వత సభ్యులు కానివారికీ చోటు కల్పించాలని 1960ల నుంచి డిమాండ్ ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ నేపథ్యంలో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై ఇటీవలే న్యూయార్క్ వేదికగా ప్రపంచ ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయి. ఇంకో పక్క భారత్ సభ్య దేశంగా ఉన్న ఎల్–69 కూటమి భద్రతామండలి శాశ్వత సభ్యుల సంఖ్యతోపాటు ఇతర సభ్యులను కూడా పెంచాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో కొత్త సభ్యులకు వీటో అధికారం ఇచ్చే విషయమై ఉదారంగా వ్యవహరించాలని కోరుతోంది. భద్రతా మండలి సంస్కరణలు వేగం పుంజుకోవడం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనలకు అద్దం పడుతోంది..అంతర్జాతీయ స్థాయిలో శాంతి సామరస్యాలను కాపాడే లక్ష్యంతో ఏర్పాటైన ఐక్యరాజ్య సమితిలో ఆసియా, ఆఫ్రికా ఖండాలకు ప్రాతినిధ్యం లేకపోవడం సమితి లక్ష్యసిద్ధిలో పెద్ద అడ్డంకి అని చెప్పక తప్పదు. ఈ అడ్డంకులను అధిగమించేందుకు కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నా అవి ఫలవంతం కావటం లేదు. సమితిలో సంస్కరణలు జరగాలని అధికశాతం దేశాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ వీటో పవర్ ఉన్న దేశాలు సమితి కృషికి పీటముడులు వేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై ఇటీవలే న్యూయార్క్ వేదికగా ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయి. ఎవరికీ పెద్దగా తెలియని, అస్పష్టమైన దౌత్య ప్రక్రియ ఆ చర్చలన్నవి. అయినప్పటికీ ఈ ఏడాది చివరిలోగా ఓ చరిత్రాత్మక అంతర్జాతీయ ఒప్పందం కుదిరే దిశగా ఈ సమావేశం ముందడుగైతే వేసింది. భద్రతా మండలి సంస్కరణలు వేగం పుంజుకోవడం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనలకు కూడా అద్దం పడుతోంది. ఉక్రెయిన్, గాజా పరిణామాలు... ఐరాస వ్యవస్థ ప్రభావం తగ్గిపోతూండటం, అందరికీ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఐరాసకు లేకపోవడం వంటివి మళ్లీ మళ్లీ చర్చకు వచ్చేలా చేస్తున్నాయి. భద్రతా మండలిలోని ఐదు దేశాలకూ వీటో అధికారాలు ఉండటం అన్నది రెండో ప్రపంచ యుద్ధ విజేతలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్లు అవుతోంది. ఇక ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలకు భాగస్వామ్యం లేదు. ఆ ప్రాంత దేశాల ప్రతినిధులు ఐరాసలో నామమాత్రపు పాత్ర పోషిస్తున్నారు అంతే. 1950లో ప్రపంచ జనాభాలో సగం ఆసియాలోనే ఉండగా... ఇరవై శాతం ఆర్థిక లావాదేవీలు ఇక్కడే జరుగుతున్నా భద్రతామండలిలో ప్రాతినిధ్యం మాత్రం ఒక్క దేశానికి మాత్రమే దక్కింది. ఇది అన్యాయమే. అలాగని ఆశ్చర్యపోవడానికీ ఏమీ లేదు. కాగా అప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రపంచం నిస్సందేహంగా చాలా మారి పోయింది. ప్రాతినిధ్యం విషయంలోనూ అన్యాయం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఆసియా జనాభా ప్రపంచ జనాభాలో 60 శాతం. ఆర్థిక వ్యవస్థలో 40 శాతం భాగస్వామ్యం కూడా ఈ ఖండానిదే. ఐరాస సభ్యదేశాల్లో 25 శాతం ఇక్కడివే. కానీ... భద్రతామండలిలో ప్రాతినిధ్యం మాత్రం 20 శాతమే. ఈ నేపథ్యంలోనే భద్రతామండలి సంస్కరణలపై చాలాకాలంగా చర్చ సాగుతోంది. శాశ్వత సభ్యులు కానివారికీ చోటు కల్పించాలని 1960ల నుంచి ఉన్న డిమాండ్ను మనం గుర్తు చేసుకోవాలి. దాదాపుగా ఈ సమయంలోనే ఆర్థిక, సామాజిక కౌన్సిల్ సభ్యత్వాన్ని 18 నుంచి 27కు, ఆ తరువాత 54కు పెంచారు. 2015లో కొన్ని నిర్దిష్ట సూచనలతో భద్రతా మండలి సంస్కరణలపై చర్చలు జరిపేందుకు ఒక అంగీకారం కుదిరింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ అవి ముందుకు కదల్లేదు. చర్చల తీరుతెన్నులపై స్పష్టమైన ప్రణాళిక అన్నది లేకుండా పోవడం దీనికి కారణమైంది. ఈ ఏడాది జరిగిన శిఖరాగ్ర సమావేశం మాత్రమే ఈ ప్రక్రియ కాస్త ముందుకు కదిలేందుకు మార్గం చూపింది. కారణాలు అనేకం!భద్రతా మండలి సంస్కరణలు స్తంభించిపోయేందుకు అనేక కారణాలు కనిపిస్తాయి. ఇండియా, జర్మనీ, జపాన్ , బ్రెజిల్లతో కూడిన జి–4 కూటమి తమను (మరో ఇద్దరు ఆఫ్రికన్ ప్రతినిధులతో కలిపి) భద్రతా మండలి శాశ్వత సభ్యులుగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. భారత్, జి–4 దేశాలు వీటో అధికారం లేకుండానే భద్రతామండలిలో చేరేందుకు ఓకే అనవచ్చు. ఈ అంశంపై 15 ఏళ్ల తరువాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేలా చూస్తారు. ఇంకో పక్క భారత్ కూడా సభ్య దేశంగా ఉన్న ఎల్–69 కూటమి భద్రతా మండలి శాశ్వత సభ్యుల సంఖ్యతోపాటు ఇతరులను కూడా పెంచాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో కొత్త సభ్యులకు వీటో అధికారం ఇచ్చే విషయమై ఉదారంగా వ్యవహరించాలని కోరుతోంది. ఐరాస సభ్యదేశాల్లో అత్యధికులు భద్రతా మండలి శాశ్వత, ఇతర సభ్యుల సంఖ్యను పెంచేందుకు అంగీకారం తెలుపుతూండగా కాఫీ క్లబ్గా పేరుగాంచిన ‘యునైటెడ్ ఫర్ కన్సెన్సస్’ గ్రూపు ఆ ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇటలీ, పాకిస్థాన్ , అర్జెంటీనా వంటి దేశాల నేతృత్వంలో పని చేస్తున్న ఈ గ్రూపు శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచడాన్ని వ్యతిరేకిస్తోంది. భారత్, జర్మనీ, బ్రెజిల్ వంటి స్థానిక శత్రువులది పైచేయి కాకుండా అన్నమాట. ఇదిలా ఉంటే భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాల్లో నాలుగు అమెరికా, యూకే, ఫ్రాన్ ్స, రష్యాలు మాత్రం శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంకో అడుగు ముందుకేసి భద్రతా మండలి సంస్కరణలకు తాను కట్టుబడి ఉన్నట్లు ప్రకటనైతే చేశారు కానీ ఆచరణలో మాత్రం ఆయన ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇంకో విషయం... ఆఫ్రికా గ్రూపులో ఏకాభిప్రాయం లేకపోవడంతో భద్రతామండలి సభ్యదేశంగా ఎవరిని ఎంపిక చేయాలన్నది సమితి నిర్ణయించుకోలేక పోతోంది. వివరంగా చర్చిస్తే భేదాభిప్రాయాలు వస్తాయని ఆఫ్రికా దేశాలు భయపడుతున్నాయి. అడ్డంకి ఉండనే ఉంది!భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం పెరిగేందుకు, ఇతర సభ్యుల చేరికకు ఉన్న అతిపెద్ద అడ్డంకి చైనా. భద్రతామండలి విస్తరణపై వ్యాఖ్య చేయని శాశ్వత సభ్య దేశం ఇదొక్కటే. ఆసియాకు మెరుగైన ప్రాతినిధ్యం లభించేందుకు ఆసియా దేశమే ఒకటి అడ్డుగా నిలవడం విచిత్రం. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే... అసలు రాజీ మార్గమన్నది ఏమాత్రం కనిపించకుండా పోతుంది. శాశ్వత సభ్యుల సంఖ్యను 11కు పెంచడం ఇందుకు ఒక మార్గం. ప్రస్తుత శాశ్వత సభ్యులు ఐదుగురితోపాటు జి–4 సభ్యులు, ఇద్దరు ఆఫ్రికా ప్రతినిధులు అన్నమాట. దీంతోపాటే ఇతర సభ్యుల సంఖ్యను కూడా తగుమాత్రంలో పెంచాల్సి ఉంటుంది. అలాగే పూర్తి వీటో అధికారం స్థానంలో కొంతమంది శాశ్వత సభ్యులకు అభ్యంతరం ద్వారా తీర్మానాన్ని అడ్డుకునే అధికారం కల్పించడం ఒక ఏర్పాటు అవుతుంది. ఇలాంటి ఏర్పాటు ప్రస్తుత శాశ్వత సభ్యులకూ అంగీకారయోగ్యం కావచ్చు. ఈ ఏర్పాటు ఒకటి రూపుదిద్దుకునేలోగా ఐరాస నిష్క్రియాపరత్వం పాటించడం కూడా ఐరాస ఏర్పాటు అసలు ఉద్దేశాన్ని నిర్వీర్యం చేసేదే. యుద్ధనష్టాలు భవిష్యత్ తరాలకు సోకకుండా కాపుకాయాల్సిన బాధ్యత ఐరాసాదే! అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికల అమలు, సామాజిక పురోగతి, మానవీయతలను కాపాడటం కూడా ఐరాస ఏర్పాటు ఉద్దేశాలలో కొన్ని అన్నది మరచిపోరాదు. ఈ లక్ష్యాలన్నీ ఐరాస భద్రతా మండలి శాశ్వత సభ్యులుగా మారే ఆఫ్రికన్ గ్రూపు లేదా జి–20 వంటి వ్యవస్థలకూ వర్తిస్తాయి. గత ఏడాది భారత్ నేతృత్వంలో జరిగిన జి–20 సమావేశాల్లో చాలా అంశాలపై ఏకాభిప్రాయం సాధించగలగడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఐరాస తన పూర్వ వైభవాన్ని మళ్లీ పొందాలంటే ప్రపంచం మొత్తానికి ఏకైక ప్రతినిధిగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంతేకానీ... ఎప్పుడో ఎనిమిది దశాబ్దాల క్రితం నాటి ప్రపంచానికి ప్రతినిధిగా కాదు.ధ్రువ జైశంకర్ వ్యాసకర్త ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్, ఓఆర్ఎఫ్ అమెరికా(‘హిందూస్తాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
అధిక స్థాయిలోనే పెట్రోలు, డీజిల్ రేట్లు..
ముడి చమురు ధరలు రెండేళ్లుగా నిలకడగా ఉన్నా అధిక స్థాయిలోనే పెట్రోలు, డీజిల్ రేట్లు.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల లాభాలు మాత్రం 4 రెట్లు పెరిగాయి!పశ్చిమాసియాలో అడపాదడపా ఉద్రిక్తతలు పెరిగి, వెంటనే చల్లబడుతున్నాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థను ఇప్పటికీ గట్టిగానే నడిపిస్తున్న ముడి చమురు ధరలు ఈ కారణంగా గత రెండేళ్లుగా పెద్ద మార్పులకు గురికాకుండా నిలకడగా ఉన్నాయి. ఫలితంగా దేశంలో శిలాజ ఇంధన మార్కెట్లో మూడొంతులకు పైగా వాటా కలిగి ఉన్న ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎమ్సీలు) లాభాలు మాత్రం 2023–2024 ఆర్థిక సంవత్సరంలో నాలుగు రెట్లు పెరిగాయని వార్తలొస్తున్నాయి.ఓఎమ్సీలకు లాభాలొస్తే వాటిలో అత్యధిక వాటాలున్న కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో కోట్లాది రూపాయలు అందుతాయనే విషయం చెప్పాల్సిన పనిలేదు. ఇతర సరకులు, సేవల ధరలు పెరుగుతున్న ఇలాంటి సమయంలోనైనా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలనే ఆలోచన ఈ ప్రభుత్వరంగ కంపెనీలకు రావడం లేదు. అంతర్జాతీయ క్రూడాయిల్ మార్కెట్లో ధరలు బాగా పైకి ఎగబాగినప్పుడు ఇండియాలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను వెంటనే పెంచేసే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం వంటి ఓఎమ్సీలు దేశంలో పెట్రో ఉత్పత్తుల వినియోగదారులకు అవకాశం వచ్చినప్పుడైనా మేలు చేసే నిర్ణయాలు తీసుకోవచ్చు.ప్రపంచంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, ధరలను శాసించే పశ్చిమాసియా ప్రాంతానికి చెందిన ఒపెక్ దేశాలు జూన్ 1న సమావేశమై ఈ విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటాయని తెలుస్తోంది. దేశం లోపల అత్యధిక మొత్తాల్లో చమురు నిక్షేపాలు ఉన్నా కొన్ని దశాబ్దాలుగా వాటిని వెలికితీయకుండా పశ్చిమాసియా దేశాల నుంచి సరఫరాలపై అమెరికా ఆధారపడేది. అయితే, ఇటీవల ముడి చమురును భారీ స్థాయిలో వెలికితీసి వాడుకుంటోంది అమెరికా. దానికి తోడు కొవిడ్–19 మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి ఏకైక అగ్రరాజ్యం ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం, ద్రవ్యోల్బణం సాధారణ స్థాయికి చేరుకోకపోవడం, నిరుద్యోగం మామూలు స్థాయికి ఇంకా పడిపోకపోవడంతో ముడి చమురుకు డిమాండ్ రెండేళ్ల క్రితంలా లేదు.దీనికి తోడు మరో ప్రపంచ ఆర్థికశక్తి చైనా వేగం తగ్గడం కూడా శిలాజ ఇంథనాల వాడకం తగ్గిపోవడానికి మరో పెద్ద కారణం. దాదాపు 45 నెలలుగా క్రూడాయిల్ టోకు ధరలు నిలకడగా ఉన్నా భారతదేశంలో పెట్రో ఉత్పత్తుల వినియోగదారులకు ఆ నిష్పత్తిలో ప్రయోజనం అందించకపోవడం సబబు కాదనే అభిప్రాయం ఆర్థిక నిపుణుల్లో వెల్లడవుతోంది.- విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
నిబంధనల అమలులోనే అసలు చిక్కు!
భారతీయ మసాలాలపై హాంకాంగ్ ఈమధ్యే నిషేధం విధించింది. మూడు బ్రాండ్లపై ఈ నిషేధం వేటు పడింది. సింగపూర్లోనూ ఇంకో భారతీయ మసాలా కంపెనీపై ఇలాంటి క్రమశిక్షణ చర్యలే తీసుకున్నారు. ఎథిలీన్ ఆక్సైడ్ అనే కేన్సర్ కారక రసాయనం పరిమితికి మించి ఉన్నట్లు తేలడంతో ఆయా దేశాల నియంత్రణ సంస్థలు ఈ చర్యలకు పాల్పడ్డాయి. మాల్దీవులు చర్యలకు సిద్ధమవుతూండగా... అమెరికా, ఆస్ట్రేలియా ఆహార నియంత్రణ సంస్థలు కూడా మసాలాల్లో కలుషితాలపై నివేదికలను అధ్యయనం చేసే పనిలో ఉన్నాయి. నిజానికి ఇలాంటి చర్యలు భారతీయ కంపెనీలకు కొత్తేమీ కాదు. అమెరికా చేరుతున్న భారతీయ ఉత్పత్తుల్లో ఏటా కొన్ని వందలు నాణ్యత ప్రమాణాల లేమి కారణంగా తిరస్కరణకు గురవుతూనే ఉంటాయి. ఆయుర్వేద మందులపై కూడా ఎఫ్డీఏ తరచూ హెచ్చరికలు జారీ చేస్తూంటుంది. సీసం వంటి ప్రమాదకర భారలోహాలు, పదార్థాలు పరిమితికి మించి ఉంటాయన్నది వీరు తరచూ వ్యక్తం చేసే అభ్యంతరం. చిన్న పిల్లల ఆహారం విషయంలో ఇటీవలే అంతర్జాతీయ కంపెనీ నెస్లే భారత్లో మాత్రమే అధిక చక్కెరలు వాడుతున్న విషయం బయటపడ్డ సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు అన్నింటిలోనూ ఒక నిర్దిష్ట క్రమం కనిపిస్తుంది. కంపెనీ భారత్ది అయినా, విదేశీయులది అయినా సరే మా తప్పేమీ లేదని ప్రకటిస్తాయి. తయారు చేసిన దేశం లేదా ఎగుమతి చేస్తున్న దేశం నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తున్నామని కూడా చెబుతాయి. భారతీయ నియంత్రణ సంస్థలు ఇచ్చే సమాధానం కూడా పద్ధతిగా ఉంటుంది. ‘పరిస్థితిని అధ్యయనం చేస్తున్నాం’ అనేసి చేతులు దులిపేసుకుంటాయి. విదేశీ సంస్థలు సమచారం పంచుకోలేదన్న ఆరోపణ కూడా ఉంటుంది. ఎగుమతి ప్రోత్సాహక వ్యవస్థలు, కంపెనీలు రెండూ తాము బాధితులమని వాదిస్తూంటాయి. భారతీయ ఎగుమతులను మాత్రమే పాశ్చాత్య దేశాలు అడ్డుకుంటున్నాయని వాపోతాయి కూడా. ఈ మొత్తం వ్యవహారంలో నిస్సహాయంగా మిగిలిపోయేదెవరూ అంటే... వినియోగదారుడు మాత్రమే. కొంచెం సద్దుమణిగిన తరువాత అంతా షరా మామూలుగానే నడిచిపోతూంటుంది. కల్తీ, హానికారక, కాలుష్యాలతో కూడి ఆహార పదార్థాలు విదేశాలను చేరుతున్న విషయంలో అసలు సమస్య ఏమిటన్నది ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆహార నియంత్రణ వ్యవస్థ నిబంధనల్లోని లోటుపాట్లు సరి చేసే ప్రయత్నం జరగడం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం పరిశ్రమలను, ఎగుమతులను కాపాడుకోవాలనే నెపంతో ప్రభుత్వాలు చేసే ప్రయత్నాలు. తప్పు చేసినా వాటి ప్రభావం నుంచి తప్పించేందుకు ప్రయత్నించడం. ఈ క్రమంలోనే వీళ్లు ప్రజారోగ్యాన్నీ; వినియోగదారులు, పౌర సమాజ నిపుణుల అభిప్రాయాలనూ తోసిపుచ్చుతూంటారు. వివాదాల్లో చిక్కుకున్న కంపెనీలు భారత్లోని ఫుడ్సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)’ నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తున్నట్లు చెప్పుకుని ఎలాగోలా తప్పించుకుంటాయి. నెస్లే విషయంలో ఈమధ్య జరిగింది ఇదే. కాబట్టి... ఆహార రంగంలో ఎగుమతులకు సంబంధించి ప్రమాణాలను స్పష్టంగా నిర్వచించడం చాలా అవసరం. ఎఫ్ఎస్ఎస్ఏఐలో ఆహార ఉత్పత్తుల (పానీయాల నుంచి సముద్ర ఉత్పత్తుల వరకూ) ప్రమాణాలపై సమాచారం ఇచ్చేందుకు, నిర్దేశించేందుకు 26 శాస్త్రీయ కమిటీలు ఉన్నాయి. 2008లో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏర్పాటు జరిగినప్పుడు ఏర్పాటైన ఈ ప్యానెల్స్లో భారతీయ, విదేశీ కంపెనీ ప్రతినిధులు ఉన్నారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో వీటి పునర్వ్యవస్థీకరణ జరిగినప్పటికీ ఆహార కంపెనీల ప్రతినిధుల పెత్తనమే ఇప్పటికీ కొనసాగుతోంది. కొన్నేళ్ల తరువాత ఇది కూడా మారింది. ప్రస్తుతం ఈ ప్యానెళ్లలో ఎక్కువగా శాస్త్రవేత్తలు, రిటైర్ అయిన వాళ్లు ఉంటున్నారు. అయినప్పటికీ నిబంధనల రూపకల్పనలో పరిశ్రమల ప్రభావం లేదని కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. ప్రస్తుతమున్న ప్యానెళ్ల కూర్పును మచ్చుకు తరచి చూస్తే చాలామందికి ఇప్పుడు, లేదంటే గతంలో... పరిశ్రమలతో ఏదో ఒక లింకు కచ్చితంగా కనిపిస్తుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ముందు ఈ ప్యానెళ్ల సభ్యుల పూర్వాపరాలను కచ్చితంగా బహిరంగపరచాలి. దీనివల్ల వినియోగదారుడికి తాను తినే ఆహారానికి సంబంధించి ఎవరు రూల్స్ తయారు చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. అలాగే సీఐఐ, హిందుస్థాన్ లీవర్ వంటి సంస్థలతో ఎఫ్ఎస్ఎస్ఏఐ భాగస్వామ్యం వంటి ఏర్పాటు పలు సమస్యలకు దారితీస్తున్న విషయాన్ని గుర్తించాలి. నిష్పాక్షిక, పారదర్శక సంస్థగా ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేయడం అవసరం, మేలు కూడా. చాలా ఏళ్లు వినియోగదారు సమూహాలు, ఆరోగ్య నిపుణులు ఉప్పు, చక్కెర, కొవ్వులు అధికంగా ఉన్న ఆహార పదార్థాలపై ప్రత్యేకమైన లేబుల్ ఒకటి వేయాలని కోరుతున్నాయి. అయితే ఫుడ్ సేఫ్టీ అథారిటీ, పరిశ్రమ వర్గాలు రెండూ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇంకోవైపు ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిశ్రమలు చేసే డిమాండ్లను నెరవేర్చడంలో చాలా చురుకుగానే ఉంటోంది. విటమిన్లు ఇతర పోషకాలను చేర్చిన ఆహారానికి ప్రత్యేకమైన లేబుల్ ఉండాలన్న పరిశ్రమ డిమాండ్ను ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆగమేఘాలపై ఒప్పేసుకోవడం ఒక ఉదాహరణ.ఆహార పదార్థాల విషయంలో నియంత్రణ అధ్వాన్నంగా ఉంటే... పరిశ్రమ వర్గాల నిబంధనల పాలన కూడా అంతే తక్కువ అని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్వయంగా గుర్తించిన విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. కాగ్ 2017 లోనే ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలను నిర్దేశించేందుకు సమయ బద్ధమైన ప్రణాళిక ఏదీ పాటించడం లేదని విమర్శించింది. అసంపూర్తిగా ఉన్న సమాచారం ఆధారంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ కంపెనీలకు లైసెన్సులు ఇచ్చింది, ఆహార పదార్థాలను పరిశీలించే ల్యాబొరేటరీలు 72లో 56 ల్యాబ్స్కు తగిన అక్రిడిషన్ సర్టిఫికెట్లు కూడా లేనవి ఎత్తి చూపింది. పార్లమెంటరీ కమిటీ ఒకటి కూడా ఆహార పదార్థాలకు సంబంధించిన నియమ నిబంధనల రూపకల్పన విషయంలో మరింత పారదర్శకత తీసుకు రావాల్సిన అవసరాన్ని తన నివేదిక రూపంలో స్పష్టం చేసిన విషయం గమనార్హం. ఆహార పదార్థాల విషయంలో కొంత జాగరూకతతో వ్యవహరించాలన్నది ఇప్పటికైనా గుర్తిస్తే అది ప్రజారోగ్యానికి మంచి చేయగలదని అర్థం చేసుకోవాలి. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రక్షణ కవచం
‘సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలే యువతకు ఉద్యోగాలు కల్పిస్తాయి’ –వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చిన చట్టం ‘ఎంఎస్ఎమ్ఈ డెవలప్మెంట్ చట్టం–2006’. తయారీదారు దగ్గర కొనని వ్యాపారస్తుని ఈ చట్టం ఎలాంటి ఇబ్బందీ పెట్టదు. తయారీదారు వద్ద కొనుగోలు చేసినవాళ్లే ఈ చట్టం పరిధిలోకి వస్తారు. భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత 15 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తూ దేశ ఆర్థిక ప్రగతిలో 40 శాతం మేర పాలు పంచుకోవడం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల విశిష్ఠత.పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా విస్తరించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఆర్థిక అసమానతలను తొలగించేందుకు తోడ్పడుతున్నాయి. పెట్టుబడుల కొరతను ఈ తరహా పరిశ్రమలు అధిగమించడానికి కేవలం వ్యక్తిగత హామీలతో బ్యాంకులు ఋణం అందిస్తున్నాయి. అందుకే ఇవి మనుగడ సాగిస్తున్నాయి. పీఎమ్ఈజీపీ, సీజీటీఎమ్సీ కింద ఇచ్చే రుణాలతో పాటు ముద్రా ఋణాలూ ఇటువంటి పరిశ్రమల స్థాపనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.ఒక వ్యక్తి కాని, వ్యాపార సంస్థ కాని (కొనుగోలుదారు) వస్తువులు లేక సేవలు సూక్ష్మ, చిన్న పరిశ్రమలను నడిపేవారి (అమ్మకందారు) నుంచి పొందినట్లయితే... వారు అమ్మకందారుకు నగదు ఠంచనుగా చెల్లించాలనేది ఈ చట్టం చెప్తుంది. అమ్మకందారుకు, కొనుగోలుదారుకు మధ్య ఒప్పందం ఉండాలి. ఆ ఒప్పందం గడువు 45 రోజులు మాత్రమే ఉండాలి. దాని కోసం అమ్మకందారు ‘ఉద్యమ్ ఆధార్’లో నమోదు పొందిన తయారీదారుడు కావాల్సిన అవసరం లాంటి కొన్ని పరిమితులు నిర్దేశించడం ఈ చట్టంలోని ఒక సుగుణం. అలా ఒప్పంద పత్రం లేకపోతే ‘నియమించిన గడువు’ అనే అంశం పరిగణనలోకి వస్తుంది. వస్తువులను లేదా సేవలను అంగీకరించిన రోజు నుంచి 15 రోజుల లోపల నగదు చెల్లించాల్సి రావడమే ‘నియమించిన రోజు’గా చట్టం చెబుతోంది. సూక్ష్మ, చిన్న పరిశ్రమల తయారీదారుకు కొనుగోలుదారుకు మధ్య ఒప్పంద పత్రం రాతపూర్వకంగా ఉండాల్సి ఉంటుంది. అలా కానప్పుడు కొనుగోలుదారుడు 15 రోజుల్లోపల నగదు చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలుదారుడు భారతదేశంలో ఏ ప్రాంతంలోని వారైనా ఈ చట్టం వర్తిస్తుంది. ఒప్పుదల పత్రంలో గడువు ఎక్కువ రోజులు రాసుకొన్నప్పటికీ ప్రభుత్వం ఎమ్ఎస్ఎమ్ఈ డెవలప్మెంట్ చట్టం –2006 సెక్షన్ 15 ప్రకారం విధించిన గడువు కేవలం 45 రోజులే. ఇది సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుంచి కొనుగోలుచేసిన వ్యక్తులకు, సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. పెట్టుబడి ఒక కోటి రూపాయలు లోపల ఉండి రూ. 5 కోట్ల అమ్మకాలు సాగిస్తే దానిని సూక్ష్మ తరహా పరిశ్రమగా పరిగణిస్తారు. అదే పెట్టుబడి 10 కోట్ల రూపాయల లోపల ఉండి అమ్మకం రూ. 50 కోట్ల లోపల ఉంటే చిన్న తరహ పరిశ్రమగా పరిగణిస్తారు. తయారీ లేకుండా కేవలం అమ్మకం (ట్రేడింగ్) జరిపే వ్యాపారులకు ఈ చట్టం వర్తించదు. కొన్న వస్తువులకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల చట్టప్రకారం వస్తువులు లేక సేవలు పొందిన ఏ వ్యక్తి అయినా సెక్షన్ 15లో చెప్పిన విధంగా చెల్లింపు జరపని కారణంగా అమ్మకందారునికి ‘వడ్డీ’ చెల్లించాలి. అదీ చక్రవడ్డీ! వడ్డీ రేటు రిజర్వు బ్యాంకు, తన కింది బ్యాంకులకు సూచించిన రేటుకు మూడురెట్లుగా నిర్దేశించారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు మూలధన లభ్యత పెరిగి అవి సజీవంగా మనుగడ సాగించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. కొనుగోలుకు చెల్లింపులు జరపడంలో ఆలస్యానికి కట్టే వడ్డీని ఆదాయపు పన్ను లెక్కలో ఖర్చుల క్రింద పరిగణించకపోవడం మరో విశేషం. అయితే బకాయిలు చెల్లించిన సంవత్సరంలో ఖర్చు కింద చూపే వెసులుబాటు చట్టంలో కల్పించారు. ఈ చట్టం భారతదేశ కొనుగోలుదారులకే కాకుండా విదేశీ కొనుగోలు దారులకు సైతం వర్తిస్తుంది. ఇక్కడ వివాదాల్ని పరిష్కరించడానికీ, చట్టాలు అమలు చేయడానికి దేశ దౌత్యవేత్తల కార్యాలయాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఆదాయపు పన్ను సెక్షన్ 43బీ(హెచ్)కు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల చట్టం సెక్షన్ 15ను కలిపి చదివితేనే మనకు ఈ చట్టంపై సంపూర్ణ అవగాహన కలుగుతుంది. ప్రతి సంస్థ చట్టాలకు లోబడి ఆస్తి, అప్పుల పట్టీని తయారుచేసి లెక్కలు తనిఖీ చేయించాల్సి ఉంటుంది. అయితే, ఏ సంస్థ అయితే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు సకాలంలో చెల్లించలేదో, వాటి బకాయిలను చెల్లించాల్సిన వడ్డీని బహిర్గతం చేయాలి. కంపెనీ అయితే కంపెనీ చట్టాలకు లోబడీ, ఇతరత్రా అయితే ఆ చట్టాలను అనుసరించీ!2006 చట్టంగా వచ్చినప్పటికీ, అమలు చేయడంలో చర్యలు ఇప్పుడిప్పుడే ప్రారంభ మయ్యాయి. ఆదాయపు పన్ను చట్టంతో ముడిపెట్టడం వల్ల చట్టం విలువ పెరిగి దాని ప్రాముఖ్యాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుత తరుణంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల మనుగడకు ఈ చట్టం ఒక రక్షణ కవచంగా నిలుస్తున్నదనేది కాదనలేని నిజం.చిన్ని శ్రావణ్ కుమార్ వ్యాసకర్త చార్టర్డ్ అకౌంటెంట్ -
‘బుల్డాగ్’ తీరు వేరుగా ఉండేది!
ప్రధాని తన ప్రసంగంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని వచ్చిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ ఇంతవరకూ చర్య తీసుకోలేదు. మోదీ స్టార్ క్యాంపెయినర్ అనే బలహీనమైన కారణంతో నేరుగా ఆయనకు కాకుండా బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు లేఖ రాసింది. పేర్కొన్న తేదీ లోగా స్పందించటంలో పార్టీ విఫలం అయినప్పుడు, కమిషన్ మరొక వారం పొడిగింపునకు అంగీకరించింది. ఆ తర్వాత ఇంకొక వారం పొడిగించింది. స్పందన వచ్చిన తర్వాత కూడా నిర్ణయం తీసుకోవడానికి తొందర పడటం లేదు. ప్రస్తుత కమిషనర్లు ఎన్నికల కమిషన్కు అప్రతిష్ఠను తెచ్చిపెట్టారు. అదే టి.ఎన్. శేషన్ అయితే ఏం చేసి ఉండేవారు? ప్రధానిని నిష్కర్షగా, నిస్సంకోచంగా పిలిపించి ఉండేవారు.‘‘నేను నిక్కచ్చిగా, నిష్కర్షగా ఉంటే ఉండొచ్చు. అయితే నేను ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉంటాను. మీరు చూసేదే మీకు కనిపిస్తుంది. నాలో మాత్రం ఏ పార్శా్వలూ లేవు.’’ – ఎన్నికల కమిషన్ను తన పనితీరుతో ప్రశంసనీయమైన గట్టి వ్యవస్థగా తయారు చేశారని పేరుగాంచిన ఎన్నికల ప్రధాన అధికారి టి.ఎన్.శేషన్ తన గురించి తాను ఇలా చెప్పేవారు. ‘‘నేను ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు నేను చేయవలసిన పని ఒకటి ఉంటుంది. ఆ పనిని నేను నా సామర్థ్యం మేరకు అత్యుత్తమంగా చేస్తాను. ఏవీ నన్ను ఆపలేవు’’ అనేవారు శేషన్. ఇక ఆయన ‘బుల్డాగ్’ అని ముద్దుగా పేరు పడటంలో ఆశ్చర్యం ఏముంటుంది? పైగా ఇది ఆయనను ఉల్లాసపరిచిన పేరు కూడా!దురదృష్టం... నేటి ఎన్నికల సంఘం ఎంతో భిన్నమైన జంతువులా ప్రవర్తిస్తోంది. ఈ పోలికను పొడిగించాలనుకుంటే కనుక ఇప్పుడది కాపలా కుక్క కంటే కూడా గారాల పెంపుడు కుక్కగానే ఎక్కువగా నడుచుకుంటోంది. నిష్పాక్షికత, పారదర్శకతల అవసరాన్ని అది మరిచిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇకపై తాను – కోరలతో తీవ్రంగా ప్రతిఘటించవలసిన సమయాల్లో సైతం – తన పని తాను చేయవలసి అవసరం లేదని అది నిర్ణయించుకుంది. బదులుగా, బయట పడేందుకు సులభమైన దారులను వెతుకుతోంది. ప్రధానమంత్రి బాంస్వాడా(రాజస్థాన్)లో ప్రసంగించి నెల దాటింది. నిజానికి నేటి నుంచి ఇంకో పదమూడు రోజులలో ఓటింగ్ ముగియనుంది కూడా. ప్రధాని తన ప్రసంగంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని బహిరంగంగా ఉల్లంఘించారని వచ్చిన ఆరోపణలపై కమిషన్ ఇంతవరకు చర్య తీసుకోకుండా ఏం చేస్తున్నదో గమనించండి. కె. చంద్రశేఖరరావు, ఎ. రాజా, సుప్రియా శ్రీనేత్, రణ్దీప్ సూర్జేవాలా కేసులలో మాదిరిగా... మోదీకి ప్రత్యక్షంగా నోటీసు జారీ చేయకూడదని కమిషన్ నిర్ణయించుకుంది. బదులుగా, మోదీ స్టార్ క్యాంపెయినర్ అనే ఒక బలహీనమైన కారణంతో ఆయనకు కాకుండా బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు లేఖ రాసింది. నోటీసులో ప్రధానమంత్రి పేరును, హోదాను పేర్కొనలేదు. అనుబంధ పత్రాలలో మాత్రమే అవి ఉన్నాయి. లేఖలో కమిషన్ పేర్కొన్న తేదీ లోగా స్పందించటంలో పార్టీ విఫలం అయినప్పుడు, కమిషన్ మరొక వారం పొడిగింపునకు వెంటనే అంగీకరించింది. ఆ తర్వాత కూడా గడువును ఇంకొక వారానికి పొడిగించింది. స్పందన వచ్చిన తర్వాత కూడా కమిషన్ ఒక నిర్ణయం తీసుకోవడానికి తొందర పడటం లేదు. ఉద్దేశపూర్వకమైన ఈ వాస్తవ దాటవేత కాలయాపన కోసమేనని అర్థమవుతోంది. ఇంతకీ, ప్రధాని ఏం చేశారు? ఓబీసీలు, ఎస్టీలు, ఎస్సీలకు ఉద్దేశించిన రిజర్వేషన్లను వారి నుంచి లాక్కుని ముస్లింలకు ఇవ్వటం జరుగుతుందని దాదాపు ప్రతిరోజూ ఆయన పదేపదే ఆరోపిస్తూ హిందువుల దృష్టిలో ముస్లింలను దయ్యాలుగా చిత్రీకరిస్తున్నారు. చివరికి మంగళ సూత్రాలు, స్త్రీధనం – మీకు రెండు గేదెలు ఉంటే వాటిలో ఒకటి – మీనుంచి లాక్కుని ముస్లింలకు ఇస్తారు అని కూడా ప్రధాని అన్నారు. ప్రధాని జాగ్రత్తగా, ఉద్దేశపూర్వకంగా పదే పదే ఇలా అనడం నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించటమే కదా? కమిషన్ అధికారాన్ని లెక్కచేయకపోవటం కమిషన్ను పరిగణనలోకి తీసుకోకపోవటమే కదా?ఈ విషయంలో కమిషన్ చేయగలిగిందల్లా వెనక్కు జారగిలబడి కూర్చోవటం, వినటం, చేతి బొటనవేళ్లు నొక్కుకోవటం అన్నట్లే ఉంది. కమిషన్ ఎందుకు కఠినచర్య తీసుకోలేదు? తనకై తాను సూమోటోగా ఎందుకు ముందుకు రాలేదు? ప్రధాన మంత్రిని, కనీసం బీజేపీని ఈ కొనసాగింపు, నిజానికి ఈ నిరంతరాయమైన ఉల్లంఘనపై ఎందుకు పిలిపించలేదు? రాజ్యాంగంలోని 324వ అధికరణం కమిషన్కు అవసరమైన అన్ని అధికారాలనూ ఇస్తోంది. కానీ వాటిని ఉపయోగించటానికే కమిషన్ ఇష్టపడటం లేదు. దానర్థం నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించే నిబద్ధత కమిషన్లో కొరవడింది. న్యాయంగా, సమానంగా, పారదర్శకంగా వ్యవహరించే నైతిక అత్యవసరత కమిషన్లో లోపించింది. అదే టి.ఎన్. శేషన్ అయితే ఏం చేసి ఉండేవారో ఒక్కక్షణం ఊహించండి. ఆయన ప్రధానిని నిష్కర్షగా, నిస్సంకోచంగా, బాహాటంగా పిలిపించి ఉండేవారు. రెండు లేదా మూడు రోజులు ఎన్నికల ప్రచారం నుంచి ఆయన్ని దూరంగా ఉంచేవారు. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి, ఇంటర్వ్యూలు ఇచ్చి తను తీసుకున్న చర్యను సమర్థిస్తూ, వివరణ ఇచ్చేవారు. ప్రతిస్పందనగా దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేసి ఉండేవారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు తక్షణం ఆగిపోయేవి. మనకున్న అత్యంత ప్రామాణిక చరిత్రకారులు, సూక్ష్మగ్రాహ్యత గల ప్రజా వ్యాఖ్యాతలలో ఒకరైన రామచంద్ర గుహ... ‘‘ప్రస్తుత ముగ్గురు కమిషనర్లు ఎన్నికల కమిషన్కు అగౌరవాన్ని, అప్రతిష్ఠను తెచ్చిపెట్టారు’’ అని అన్నారంటే అందులో ఆశ్చర్యం లేదు. కమిషన్ చరిత్ర రాసినప్పుడు ఆ ముగ్గురూ చరిత్రహీనులుగా గుర్తుండిపోతారని ఆయన అన్నారు. అది నిజం. అయితే ఈ చేదు నిజం మరింత లోతైనది. మొదట మన ప్రజాస్వామ్యానికి గాయం అయింది. ప్రపంచంలోనే మనది అది పెద్ద ప్రజాస్వామ్యం అయినందుకు మనం గర్విస్తూ ఉంటాం. కానీ మనకు ఏదైతే గర్వకారణమై ఉన్నదో దానికి ఎన్నికల సంఘం తూట్లు పొడుస్తోంది. ప్రపంచం గమనించలేదని అనుకోకండి! పైనుంచి వేయి కళ్లతో చూస్తూనే ఉంటుంది. అంతిమంగా, ఎలాగూ మూల్యం చెల్లించవలసింది మనమే... ‘భారత ప్రజలమైన మనం’! చర్య తీసుకోవటంలో విఫలం అవటం ద్వారా కమిషన్ మనందరినీ లోకువ చేసేసింది.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
విద్వేష రాజకీయాలను తిప్పికొట్టడమే నివాళి!
భౌతికంగా మన మధ్యలేకపోయినా చరిత్ర పుటల్లో సజీవంగా నిలిచిపోయే వ్యక్తులు కొందరే ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తులలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య (పీఎస్) ఒకరు. నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో 1913 మే 1వ తేదీన భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. తొలినాళ్లలో ఆయన మీద గాంధీజీ ప్రభావం ఉండేది. 1930లో మాలపర్రు గ్రామంలో కాంగ్రెస్ సత్యాగ్రహ కార్యక్రమంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అయితే క్రమంగా ఆయనలో కాంగ్రెస్పై నమ్మకం సన్నగిల్లింది. మద్రాసు లయోలా కాలేజీలో చదువుతున్నప్పుడు కంభంపాటి సత్యనారాయణ, వీకే నరసింహన్, హెచ్డీ రాజాలతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సోషలిస్ట్ సాహిత్యాన్నీ, కమ్యూనిస్ట్ మేనిఫెస్టోనూ అధ్యయనం చేశారు. అపుడే, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అమీర్ హైదర్ ఖాన్ కమ్యూనిస్ట్ పార్టీలో పని చేయాలని ఆహ్వానించారు. దీంతో డిగ్రీ అయిపోయిన తర్వాత పీఎస్ ఫుల్టైమర్గా పార్టీలో చేరారు. 1934లో అమీర్ హైదర్ ఖాన్ అరెస్ట్ కాగా ఆయన బొంబాయి వెళ్లారు. అక్కడే సోషలిస్ట్ భావాలుగల వ్యక్తుల వివరాలు సేకరించి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికీ, విస్తరణకూ కృషి చేశారు. ఆ క్రమంలో 1938–1939లో ఇఎంఎస్ నంబూద్రిపాద్ కమ్యూనిస్ ్టపార్టీలో చేరారు. అలాగే తమిళనాడులో ఎంఆర్ వెంకట్రామన్, రామమూర్తి, తెలుగునాట మోటూరు హనుమంతరావు, లావు బాలగంగాధరరావు, తరిమెల నాగిరెడ్డి, ఈశ్వరరెడ్డి పార్టీలోకి వచ్చారు. 1940 ఆంధ్ర మహాసభ నుండి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చిర్రావూరి లక్ష్మీ నర్సయ్య, దేవులపల్లి వేంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ధర్మబిక్షం, కృష్ణమూర్తి, ఆరుట్ల రామచంద్రారెడ్డి ఇంకా మరెందరో నిజాం స్టేట్లో కమ్యూనిస్ట్ పార్టీ లోకి వచ్చారు. అంతకు ముందే కవి మగ్దూవ్ు మొహియుద్దీన్ కమ్యూనిస్ట్ పార్టీవైపు వున్నారు. 1946–1951 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వేలాది మంది కమ్యూనిస్ట్ యోధులు ప్రాణాలు కోల్పోయారు. 1947 ఆగస్టు 15న దేశం స్వాతంత్య్రం పొందినప్పటికీ తన సంస్థానం ప్రత్యేక రాజ్యంగా కొనసాగాలని నిజాం రాజు పట్టుపట్టాడు. ఈ స్థితిలో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం నిజాం సంస్థానాన్ని విలీనం చేసుకోవడానికి యాక్షన్ ప్రారంభించింది. తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా అప్పటికి ఖమ్మం, వరంగల్, కరీంనగర్లో కొంత భాగం; నల్లగొండ జిల్లాలో మూడు వేల గ్రామాలు నిజాం, దొరల పాలన నుండి విముక్తి పొందాయి. పది లక్షల ఎకరాల భూమిని దేశ్ముఖ్ల, భూస్వాముల నుండి స్వాధీనం చేసుకొని దున్నేవారికి పంచారు. ఆయా గ్రామాలలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన గ్రామ రాజ్యాల ఏర్పాటుతో నిజాం పాలన బలహీనపడింది, మరోవైపు భారతసైన్యం ప్రవేశించడంతో నిజాం రాజు విలీనానికి అంగీకరించాడు. విలీనం తర్వాత భారత సైన్యం కమ్యూనిస్ట్ దళాలతో తలపడి చాలామందిని చంపింది. కమ్యూనిస్ట్ నాయకులు, దళ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారు. అత్యంత శిక్షణ పొందిన భారత సైన్యంతో సాధారణ ఆయుధాలతో పోరాడలేని పరిస్థితి వచ్చింది. ఈ స్థితిలో పోరాట విరమణకు సంబంధించి దళాలతో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి సుందరయ్య మారుపేరుతో రహస్యంగా పోరాట ప్రాంతాలలో పర్యటించారు. పలు మార్లు దళ సభ్యులూ, పార్టీ నాయకులతో మాట్లాడిన తర్వాత సాయుధ పోరు విరమించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 1955 నుంచి 1957 వరకు మొదటి రెండేండ్లు ఆంధ్ర శాసన సభలో, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సభ్యుడిగా, ఇంతకు ముందు రాజ్యసభ సభ్యుడిగా సుందరయ్య పనిచేశారు. ఆయన సునిశిత పరిశీలన, అధ్యయనాలకు ‘సాయుధ తెలంగాణ పోరాటం– గుణ పాఠాలు’, ‘ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర నీటి పథకం’ రచనలు అద్దం పడతాయి.1934లో ఉమ్మడి పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆ తర్వాత 1964లో పార్టీ చీలిక తర్వాత ఏర్పడిన సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శిగా పీఎస్ బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పని చేశారు. జీవితాంతం కమ్యూనిస్ట్ ఉద్యమ విస్తృతికి అవిశ్రాంతంగా పని చేసిన ఆయన 1985 మే 19న భౌతికంగా అస్తమించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న విద్వేష రాజకీయాలను తిప్పికొడుతూ సామరస్య జీవనాన్ని కాపాడుకోవడమే సుందరయ్యకు మన మిచ్చే నిజమైన నివాళి అవుతుంది. జాలకంటి రంగారెడ్డి వ్యాసకర్త సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ‘ 9490098349 -
జగన్కు ఏపీ ఎందుకు జై కొట్టిందంటే..?
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించబోతున్నారు. భారత ఎన్నికల చరిత్రను తిరగ రాయబోతున్నారు. దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేయబోతున్నారు. 'జగన్ జనాలను ఎంత బలంగా నమ్మారో.. జనం కూడా జగన్ను అంతే బలంగా నమ్మారు'. ఇరువురికి ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకమే 81.6 శాతం పోలింగ్. ఇప్పటి వరకు 4 దశల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. ఏ రాష్ట్రంలోనూ ఆ స్థాయి పోలింగ్ నమోదు కాలేదు. 2014లో 78.41 శాతం, 2019లో 79.77 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పుడు అంతకు మించి పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళి, తన పాలనపై ఉన్న నమ్మకం, ప్రజల్లో విశ్వసనీయతే.. ముఖ్యమంత్రి జగన్ 151 సీట్ల మార్కును అధిగమిస్తారన్న ప్రకటనకు మూలం అని కనిపించింది.81.6 శాతం పోలింగ్ నమోదు కావడానికి చాలా కారణాలున్నాయి. పాజిటివ్ ఓటు, నెగిటివ్ ఓటు పోలింగ్ బూతుల్లో పోటీ పడ్డప్పటికీ పాజిటివ్ ఓటు ప్రభావం అధికంగా ఉన్నట్లు పోలింగ్ సరళిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మే 13న ఏపీలో పోలింగ్ జరిగింది. సోమవారం పోలింగ్ జరిగింది. హైదరాబాద్ నుంచే కాక బెంగళూరు, చెన్నై, ఇతర రాష్ట్రాల నుంచి ఓటర్లు శుక్రవారం నుంచే ఆంధ్రప్రదేశ్కు రావడం మొదలు పెట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వారిలో 25 శాతం మంది కార్లలో వస్తే 75 శాతం మంది బస్సులు, రైళ్లలో స్వగ్రామాలకు చేరుకుని ఓట్లు వేశారు. వీరిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ఉద్యోగులు, మధ్ యతరగతి, దిగువ మధ్య తరగతి, బీపీఎల్ ప్రజలున్నారు. హైదరాబాద్లో వాచ్మెన్లుగా పని చేసేవారు, తాపీ పని చేసేవారు కూడా ఆదివారానికే ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. వీరు అత్యధికంగా వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారనే అంచనాలు వెలువడుతున్నాయి.వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఏపీలోని గ్రామాల స్వరూపం మారిపోయింది. గ్రామ స్వరాజ్యం సీఎం జగన్ తీసుకొచ్చారు. గాంధీ జీ కలలు కన్నా స్వరాజ్యాన్ని సీఎం జగన్ అత్యంత వేగంగా అమల్లోకి తీసుకురాగలిగారు. అభివృద్ది అంటే హైటెక్ సిటీ లాంటి బిల్డింగ్లు కాదని, అభివృద్ది అంటే గ్రామాల అభివృద్ధి అని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో సీఎం జగన్ సక్సెస్ అయ్యారు. గ్రామ సచివాలయాలు, 50 నుంచి 70 కుటుంబాలకు ఒక వాలంటీర్, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు ఈ రోజున ఏపీలోని గ్రామాల్లో దర్శనమిస్తున్నాయి.57 నెలల్లో సీఎంగా జగన్ ఇవన్నీ చేస్తే.. 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు అనేది సామాన్యుడు వేసుకున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానమే 81. 6 శాతం ఓటింగ్. ఏపీలోని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ఉన్నాయి. నాడు నేడు కింద 46 వేల ప్రభుత్వ పాఠశాలలను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు సీఎం జగన్. దీని కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేశారు. 8వ తరగతి నుంచి ట్యాబ్లు ఇస్తున్నారు. ఒక్క విద్యా రంగానికే రూ.72 వేల కోట్లు సీఎం జగన్ ఖర్చు చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు 7 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తే.. సీఎం జగన్ ప్రతి ఒక్కరిని చదివించడం తన బాధ్యత అని ప్రకటించి ఫస్ట్ క్లాస్ నుంచే నాణ్యమైన చదవు అందిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ పోలింగ్ సరళిలో కచ్చితంగా కనిపించింది. పేద, దిగువ మధ్య తరగతి తల్లిదండ్రులు సీఎంగా మళ్లీ జగనే రావాలంటూ ఓటు వేసినట్లు కనిపించింది.కూటమిని ప్రజలు నమ్మలేదు. చంద్రబాబును అస్సలు నమ్మలేదు. పవన్ కల్యాణ్ను ప్రజలు ఛీదరించుకునే పరిస్థితి ఏర్పడింది. 2014లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మేనిఫెస్టోలో 10 శాతం హామీలు కూడా అమలు చేయలేదు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీ చేయలేదు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలు ప్రజలు మరిచిపోలేదు. 2014 ఎన్నికల్లో బాబు హామీలు తన బాధ్యతన్న పవన్ తరువాత పట్టించుకోలేదు. ఇవన్నీ ప్రజలు మరిచిపోయారని కూటమి నేతలు అనుకుంటే పొరపాటు.2024లో ఏర్పడిన కూటమిని ప్రజలు నమ్మకపోవడానికి ఇవే కారణాలు. బాబు మేనిఫెస్టోను పట్టుకోవడానికి కూడా ఏపీ బీజేపీ ఇంచార్జి సిద్దార్థ్ ఇష్టంపడలేదంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు.. బాబు సూపర్ సిక్స్ హామీల గురించి ఏపీలో చర్చే జరగలేదు. కానీ.. జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే మాత్రం IPL మ్యాచ్లు చూసినట్లు గ్రామీణ ప్రాంతాల్లో జనం టీవీల ముందు కూర్చొని చూశారు. ఇది జగన్ మీద ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. రైతు భరోసా, అమ్మ ఒడి పథకాలకు డబ్బులు పెంచిన జగన్.. మిగతా పథకాలకు పెంచకుండానే కొనసాగిస్తానన్నారు. అయినా.. ప్రజలు జగన్ వెంటే నిలబడినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు "సంపద సృష్టి" హామీలను ప్రజలు పట్టించుకోను కూడా పట్టించుకోలేదు. చంద్రబాబు కూటమి కట్టింది తమ కోసం కాదని వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడానికే అని ప్రజలు బలంగా విశ్వసించారు.ఇచ్ఛాపురం (శ్రీకాకుళం) నుంచి కుప్పం (చిత్తూరు) దాకా ఫ్యాన్ గాలి బలంగా వీచినట్లు కనిపించింది. అత్యధికంగా దర్శిలో 90 శాతం పోలింగ్ నమోదైంది. కుప్పంలో 89 శాతం నమోదైంది. ఈ పోలింగ్ శాతాన్ని విశ్లేషిస్తే కుప్పంలో చంద్రబాబు పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది. పిఠాపురంలో కూడా 85 శాతం పోలింగ్ నమోదైంది. పథకాల లబ్ధిదారులు ఓటేయ్యడం వల్లనే ఈ స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. అంటే.. పిఠాపురంలో కూడా పవన్ ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువుగా ఉన్నాయి.ఇక.. మంగళగిరి, హిందూపూర్ల్లో మామ, అల్లుళ్లు గెలిస్తారా..? లేదా..? అనే దానిపై సర్వేలు రకరకాలుగా చెబుతున్నాయి. మంగళగిరిలో ఎవరు బయటపడ్డ 2, 3 వేల ఓట్ల తేడా ఉంటుందంటున్నారు. ఇక... ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూటమి అనుకున్నట్లు ఓటు ట్రాన్సఫర్ కాలేదు. జనసేన ఓటర్లు టీడీపీకి వేయలేదు. టీడీపీ ఓటర్లు జనసేనకు వేయలేదు. బీజేపీ ఓటర్లు ఈ రెండు పార్టీలకు వేయలేదు. కొందరు ఎంపీ స్థానాలకు వేయలేదు. బీజేపీ - జనసేన పోటీ చేసిన 30 స్థానాల్లో వైసీపీ 25 స్థానాలు తక్కువ గాకుండా గెల్చుకుంటుందని చెబుతున్నారు. అత్యంత కీలకమైన విషయం ఏంటంటే... కాపులు కీలెరిగి వాతపెట్టారు. తమను ఓటు బ్యాంకు చేసి రాజకీయాలు చేయాలనుకున్నవారికి ఓటుతో సమాధానం చెప్పారు. గోదావరి జిల్లాల్లో కాపుల ఓట్లు సగానికంటే ఎక్కువ ఫ్యాన్వైపు మళ్లినట్టు సర్వేలు చెబుతున్నాయి.సీఎం జగన్ పాజిటివ్ ప్రచారం ముందు.. చంద్రబాబు నెగిటివ్ ప్రచారం నిలవలేకపోయింది. సిద్ధం సభల నుంచి ప్రచారంలో సీఎం జగన్ తన సత్తా చాటితే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యక్తి గత విమర్శలతో ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. వివేకా హత్య గురించి ఒకసారి, దీని కోసం షర్మిల, సునీతలను తీసుకొచ్చినా అనుకున్న ఫలితం చంద్రబాబుకు కనిపించలేదు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా చంద్రబాబును రాజకీయంగా బతికించలేకపోయింది. సీఎం జగన్ టీవీకి ఇచ్చిన 2 గంటల 20 నిమిషాల ఇంటర్వ్యూ చాలా మంది మేధావులు, న్యూట్రల్స్ను ఫ్యాన్కు ఓటు పడేలా చేసింది.జగన్ ఇచ్చిన క్లారిటీ మేధావులను, న్యూట్రల్ పీపుల్ను ఆకట్టుకుంది. సంక్షేమం, అభివృద్ధిని సీఎం జగన్ బ్యాలెన్స్ చేసే విధానం, ఆర్ధిక వ్యవస్థపై ఆయనకున్న పట్టు, ప్రతి అంశంపై ఆయన మాట్లాడిన తీరు హైదరాబాద్ నుంచి చాలా మంది ఏపీకి వచ్చి ఓటేసేలా చేసింది. అదే సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ ఏదో యథాలాపంగా జరిగిందని టీడీపీ నేతలే చెప్పుకున్నారు. జగన్ సంక్షేమ పథకాలకు ఏడాదికి రూ.70 వేల కోట్లు ఇస్తుంటేనే వామ్మో వాయ్యే అని గుండెలు బాదుకున్న టీడీపీ నేతలు, ఎల్లో మీడియా అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానన్న బాబును ప్రశ్నించకపోవడంపై సామాన్యులు పెదవి విరిచారు. చంద్రబాబు చెప్పిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఏడాదికి రూ.1.67 లక్షల కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారన్న సీఎం జగన్ ప్రశ్నకు చంద్రబాబు నుంచి సరైన సమాధానం ఇప్పటికీ లేదు.57 నెలల తన పాలనలో సీఎం జగన్ చేసిన అభివృద్ది కళ్ల ముందు కనిపిస్తుంది. సంక్షేమం ప్రతి గడప తొక్కింది. జగన్ను ప్రజలు తమ బిడ్డ అనుకున్నారు. జగన్తోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని బలంగా నమ్మారు. మహిళలైతే జగన్తోనే తమ పిల్లలు బంగారు భవిష్యత్తు సాధ్యమని బలంగా విశ్వసించారు. కొత్తగా వచ్చిన ఓటర్లు కూడా జగన్ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. విద్యా సంస్కరణలు, గ్రామీణ సచివాలయాలు, ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థను సరిదిద్దడం, కరోనా కాలంలో రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా చూసుకోవడం యువతను ఆకట్టుకున్న అంశాలుగా తెలుస్తుంది. అలానే.. జాబ్ మేళాలు కూడా యువతలో బలమైన ముద్ర వేశాయి.అన్ని వర్గాల ప్రజలు ఓటు వేయడానికి కదిలి రావడం వల్లనే పోలింగ్ 80 శాతం దాటింది. పోలింగ్ సరళిని బట్టి పాజిటివ్ ఓటుగా సెఫాలజిస్ట్లు పరిగణిస్తున్నారు. పోలింగ్ తరువాత వెలువడిన సర్వేలు కూడా వైఎస్ఆర్ సీపీదే గెలుపని చెబుతున్నాయి.- వైవి రెడ్డి, సీనియర్ జర్నలిస్టు -
వెచ్చని హృదయ రాగ సందేశం
ఇది నిన్ననే జరిగినట్లుగా నా జ్ఞాపకంలో స్పష్టంగా ఉంది. నిజానికైతే, నేను తొలిసారి ఫాదర్ టెర్రీ గిల్ఫెడర్ను కలిసింది నలభై ఏళ్ల కిందట! అది 1982 వేసవి చివరిలో... నిషా, నేను మా పెళ్లికి సిద్ధం అవుతున్న సమయం. ఒక క్యాథలిక్గా నిషా తను కోరుకున్న సంప్రదాయబద్ధమైన చర్చి వివాహానికి నేను నా అంగీకారాన్ని తెలిపినప్పుడు, స్థానిక పారిష్ చర్చి ప్రీస్ట్ను కలసి ఆయన చేత మూడు ఉపదేశాలు ఇప్పించుకోవలసి అవసరం ఏర్పడటం నన్ను చీకాకు పెట్టింది. కానీ వేరే దారి లేదు. వెదికితే, అతి దగ్గరగా నార్తంబర్లాండ్ అవెన్యూలో ఉన్న పునీత మేరీ మగ్దలీనా చర్చి ఒక్కటే నిషాకు ఒక క్రైస్తవేతరునితో వివాహం జరిపించేందుకు అంగీకరించింది, నిబంధనలకు లోబడి ఉండే షరతు మీద! సెప్టెంబరులో ఒక శనివారం, సాయంత్రం 6 గంటలప్పుడు నిషా, నేనూ ఫాదర్ టెర్రీ ఇంటి తలుపు తట్టాం. ఆయన తన డెస్క్ ముందు కూర్చొని ఉన్నారు. ఆయన కళ్లజోడు ముక్కు చివరికి దిగి ఉంది. ఆ చిన్న గదికి ఎదురుగా ఉన్న ఒక పాత, వెలసిపోయిన లెదర్ సోఫా మీద మేము కూర్చున్నాం. బయట ఎప్పుడూ లేనంత వేడిగా ఉంటే, లోపల వాతావరణం మంచులో ఉన్నట్లుగా ఉంది. నేను ఊరకే ఉండలేకపోతున్నాను. ‘‘షెర్రీ తీసుకుంటారా?’’ అని ఆయన అనటం నన్ను అమితంగా ఆశ్చర్యపరిచింది. ‘‘మీ ఇద్దరి గురించీ నాకు తెలియదు. కానీ నేను షెర్రీ పట్ల కొంత మొగ్గుగానే ఉన్నాను’’ అన్నారు.అది టియో పెపె. నాకు ఇష్టమైనది. షెర్రీ బ్రాండ్. కానీ ఆ రోజుల్లో లండన్లో అది చాలా అరుదుగా మాత్రమే దొరికేది. ఫాదర్ టెర్రీ వివేచనతో కూడిన అభిరుచి గల వ్యక్తి. నేను ఆయనతో యూఎస్ ఓపెన్ టెన్నిస్, నాటింగ్ హిల్ కార్నివాల్, రష్దీ ‘మిడ్నైట్ చిల్డ్రన్’ వంటివాటిపై చర్చిస్తూ ఉన్నాను– మేము చేసుకోబోయే వివాహం, మాకు పుట్టబోయే పిల్లలు ఏ మతాన్ని అనుసరించవలసి ఉంటుంది– అనేవి తప్ప... అన్నీ. ఫాదర్ టెర్రీ మా గ్లాసులను నింపుతూ సంభాషణను నడిపిస్తున్నారు. ఆయన నా వాదనను గ్రోలుతూనే, తన వాదనను సౌఖ్యంగా నిలిపి ఉంచుకుంటున్నారు. కాలం ఉల్లాసవంతమైన వేగంతో గడిచిపోయింది. వచ్చేవారం కలుద్దాం అనుకున్నాక, బయల్దేరేందుకు మేము లేచి నిలబడ్డాం. ఫాదర్ టెర్రీ మమ్మల్ని ఆపినప్పుడు మేము తలుపు దగ్గర ఉన్నాం. ‘‘మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్న విషయమై ఒక ప్రశ్న నా దగ్గర ఉంది’’ అన్నారు. ఆ ప్రశ్నకు సూచనగా చిరునవ్వొకటి విశాలమైన ఆయన గుండ్రటి ముఖం మీద నాట్యమాడింది. ఆయన కళ్లు సూటిగా మావైపే చూస్తున్నాయి. ‘‘మీరిద్దరూ కలిసి ఎందుకు సహజీవనం చేయకూడదు?’’ అన్నారు ఫాదర్ టెర్రీ. మా ముఖాల్లోంచి రక్తం చివ్వున చిమ్మిందేమో నేను కచ్చితంగా చెప్పలేను కానీ, మేమిద్దరం మాత్రం నోట మాట రాక అలా ఉండిపోయాం. నిజం ఏమిటంటే నిషా, నేను అప్పటికే సహజీవనంలో ఉంటూ ఆ వాస్తవాన్ని దాచటానికి ఉద్దేశపూర్వకంగానే ఫాదర్ టెర్రీకి వేర్వేరు చిరునామాలను ఇచ్చాం. అది ఆయన ఊహించారు. అందుకే తన పద్ధతిలో అదేం పెద్ద విషయం కాదన్నట్లు చెప్పారు. నిషా పూర్తి క్రైస్తవ సంప్రదాయంలో వివాహాన్ని కోరుకుంది. వరుడు క్రైస్తవుడు కాదు అనే విషయాన్ని పట్టించుకోకుండా ఫాదర్ టెర్రీ అందుకు సమ్మతించారు. ఆయన ఉపదేశ వాక్యం అందరి దృష్టిని ఆకర్షించింది. నరకం, అపరాధం, దైవం, çసచ్ఛీలత... వీటి గురించి ఆయన ఉపదేశించలేదు. ‘‘ఐ లవ్ యు’’ అనే మూడు చిన్న పదాల గురించి మాట్లాడారు. ‘‘కరణ్, నిషా...’’, ‘‘గుర్తుంచుకోండి. ‘ఐ’ నీ, ‘యు’నీ ‘లవ్’ జత కలుపుతుంది. కానీ అది వేరు కూడా చేస్తుంది. మీరిద్దరూ వేర్వేరు వ్యక్తులని మీరు మరచిపోయిన రోజున మీ బంధం విడిపోతుంది’’ అన్నారు ఫాదర్ టెర్రీ. అదొక వెచ్చని, తేలికపాటి, హృదయపూర్వక సందేశం. లాంఛనప్రాయమైన తంతు కంటే కూడా నిప్పు చుట్టూ కూర్చొని మాట్లాడుకోవటం వంటిది. కానీ అది పావు శతాబ్దం పాటు నా మదిలో వెలుగుతూనే ఉండిపోయింది. ఆరేళ్ల తర్వాత, ఆసుపత్రిలో నిషా చివరి ఘడియల్లో ఉన్నప్పుడు లైఫ్ సపోర్టును తొలగించటానికి కొన్ని నిమిషాల ముందు ఫాదర్ టెర్రీ ఆమె పక్కనే ఉన్నారు. ఆమెకు చివరి మతకర్మను నిర్వహించారు. అమ్మను కూడా హైందవ సంప్రదాయం ప్రకారం నిషా చెవిలో ప్రార్థనలు వినిపించమని ప్రోత్సహించారు. ఆ తర్వాత యంత్రాలు మెల్లగా, బాధగా మినుకు మినుకుమని కొడిగడుతున్నప్పుడు నిషా అంతిమ శ్వాసలో ఫాదర్ టెర్రీ నా పక్కన నిలబడ్డారు. నాకు తెలిసిన ఏకైక క్రైస్తవ మత గురువు టెర్రీ గిల్ఫెడర్. ఆయన ఒక వింత మనిషి అయినప్పటికీ ఒక గొప్ప వ్యక్తి. ఒరిస్సా, కర్ణాటకలలో క్రైస్తవులపై జరిగిన దాడి గురించి చదివిన ప్రతిసారీ నేను ఆయన గురించి ఆలోచిస్తాను. గాయపడిన హృదయాలను నయం చేసే పదాలను ఆయన కనుగొని ఉంటారని నేను నమ్ముతాను. అందుకు నిస్సందేహంగా ఆయనకు షెర్రీ సహాయపడి ఉంటుంది. కరణ్ థాపర్ – వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నూటికి తొంభై మార్కులు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా నమస్కారం! నా పేరు డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ. నేను పుట్టి పెరిగింది హిందూపురంలో. గత ఇరవై ఏళ్ళుగా అమెరికాలో, గత పదేళ్ళుగా టెక్సాస్లోని డాలస్ నగరంలో ఉంటున్నాం. వృత్తి రీత్యా అమెరికా ప్రభుత్వ వైద్యునిగా పని చేస్తున్నాను. నేను పుట్టి బుద్ధెరిగాక పట్టుకున్న మొదటి జెండా అన్నగారి ‘తెలుగుదేశం’ జెండానే! మా నాన్న హిందూపురంలో తెలుగుదేశం పార్టీ కోసం షామియానా వేసి, మైకుసెట్టు పెట్టి చేసిన ప్రచారం ఇంకా గుర్తుంది. అలాగే నేటికీ నలభై ఏళ్ళుగా గుండెల నిండా నింపుకున్న అభిమానంతో మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిని కూడా! గత జనవరిలో నేను అనంతపురం వచ్చాను. అంతకు ముందు నేను పనిచేసిన పాతూరు ప్రభుత్వాసుపత్రిని సి.డి. ఆసుపత్రి అనేవారు. నేను పనిచేసినప్పుడు కానీ,గత రెండేళ్ళ వరకూ కానీ అది ఒక పాడుపడిన వందేళ్ళ నాటి పెంకుటిల్లులాంటి భవనంలో ఉండేది. రెండేళ్ళ క్రితం కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో రూపొందించిన ఒక నూతన భవనంలో నడుస్తోంది. ఐదారు మంది డాక్టర్లు, పాతికమంది వరకూ ఇతర ఉద్యోగులతో మంచి వైద్యకేంద్రంగా రూపొందింది. ఆ ఆసుపత్రిని ఇలా చూడడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. మరో ముఖ్యమైన అంశం ప్రభుత్వ విద్య. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చినవాళ్ళం... ఏదో కొంత మంది మాత్రమే ఉన్న కొద్ది వనరులను ఉపయోగించుకొని జీవితంలో ఓ స్థాయికి చేరాము. అలా సార్వజనీనమైన అవకాశాలను అందిపుచ్చుకొని అందరూ అదే రకమైన విజయాన్ని అందుకోలేక పోయారు. అలాంటిది, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు జరుగుతున్న విద్యాబోధన, తెలుగుతో పాటు ఆంగ్లమాధ్యమంలో చదివించడం, చిన్న తనం నుంచే డిజిటల్ మీడియాతో వాళ్ళకు విద్యను బోధించడం చాలాచోట్ల చూసి ఆశ్చర్యపోయాను. అలాగే నీటైన యూనిఫాం, బ్యాగులు, పుస్తకాలు, కాళ్లకు షూస్తో సహా వాళ్లకు అందించి పిల్లలలో ఆ వయస్సు నుంచే ఒక ఆత్మ విశ్వాసాన్ని, స్థైర్యాన్ని పెంచి వారి వ్యక్తిత్వానికి మంచి పునాదులు పడేలా చేసింది. అభివృద్ధి అనేదానికి – పెద్ద నగరాల్లో ఓ పెద్ద ఐకియా స్టోర్, ఎంజాయ్ చేయడానికి పబ్బులు, పెద్ద పెద్ద బిల్డింగులు, విశాలమైన రోడ్లు – ఇవి మాత్రమే సూచికలు కాకూడదు. అభివృద్ధికి ఒక సూచిక ఏమిటంటే దారిద్య్ర రేఖ దిగువన ఉన్న ప్రజలు ఎంతవరకూ బాగుపడ్డారు? అది గత ఐదేళ్ళలో చూసుకుంటే సగటు ఆటోరిక్షా నడిపే కార్మికుడు, అరటికాయలు అమ్మి పొట్టపోసుకునే కార్మికురాలు, రోడ్డుసైడు మెకానిక్కు, ఒక సన్నకారు రైతు – వీళ్ళకు కనీస భరోసా లభిస్తోంది. ‘మా పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోంది, మాకు రోగమొస్తే ప్రభుత్వ ప్రాథమిక వైద్యకేంద్రాల్లో కనీస వైద్యం అందుతుంది, నాకు క్యాన్సర్ వచ్చినా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం దొరుకుతుంది’ అన్న భరోసా గత ఐదేళ్ళలో దొరికింది. మొన్ననే ధర్మవరంలో జిలేబీలు అమ్ముకునే కార్మికురాలి కూతురుకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడింది. దీనిపై నేనొక చిన్న ట్వీట్ పెడితే, సీఎంవోలో డా.హరికృష్ణారెడ్డి గారు స్పందించి రూ.20 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించే ఏర్పాటు చేశారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు నాకు తెలిసే ఉన్నాయి.2019 మేలో జగన్మోహన్రెడ్డి ఎన్నికలలో ఘన విజయం సాధించినప్పుడు నేను సామాజిక మాధ్యమాల్లో ‘మీ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యాలుగా ‘‘విద్య’ – ‘వైద్యా’లను ఎన్నుకొని, వాటి రూపురేఖల్ని సమూలంగా మారుస్తూ ప్రజలకు అందుబాటులోనికి తేవాలని’ కోరాను. ఈనాడు ప్రభుత్వం ఆ ముఖ్యమైన రెండు విషయాల్లోనూ చాలా సమర్థంగా పనిచేసిందని ప్రత్యక్షంగా గమనించాను. ‘పల్లెటూళ్ళే పట్టుగొమ్మలని’ మహాత్మాగాంధీ గారన్నారు. పల్లెల్లో అత్యంత దారుణమైన స్థితిలో ఉన్న దరిద్రనారాయణుడికి చేసే సేవే నిజమైన సేవ అని ఆయన భావించారు. అలా ప్రస్తుత ప్రభుత్వంలో సామాన్యుడికి కనీస అవసరాలైనా తీరుతున్నాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పేదేమిటంటే – నేనేదైతే ప్రభుత్వ ప్రాధమ్యాలుగా ఉండాలని, ప్రజలకు మెరుగ్గా సేవ చేయాలని భావించానో అవి నెరవేరాయి. నాకు తెలిసిన కొద్దిమందికి కూడా ఎంతో కొంత మేలు జరిగింది కాబట్టే ఇలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఏతావతా, చెప్పొచ్చేదేమిటంటే – అటూ ఇటూ జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నా, విద్య–వైద్య పరంగా స్థూలంగా నేను ఈ ప్రభుత్వానికి వందకు 80–90 మార్కులు వేయ గలుగుతాను.ధన్యవాదాలు, జైహింద్.డా‘‘ ఇస్మాయిల్ పెనుకొండ వ్యాసకర్త అమెరికాలో వైద్యుడు -
ఆదర్శనీయం... ఆచరణీయం
‘అనుచిత ఉచితాలకు నేడో రేపో భారీ మూల్యం చెల్లించడం ఖాయం’ అంటారు అమెరికన్ రచయిత విల్లీమన్. ఎన్నికల సమయంలో ఆ యా రాజకీయ పార్టీలు ఉచితాలతో కూడిన హామీలిస్తున్నాయి. అయితే పేదవారి కనీస అవసరాలు తీర్చే సముచిత ఉచితాలు కొంతకాలం అవస రమే. కానీ కేవలం అధికారంలోకి రావడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే అనుచిత ఉచితాల పట్ల ప్రజలు ఆకర్షితులైతే ఆర్థిక సంక్షోభ సునామీలో కొట్టుకు పోవడం ఖాయం. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సముచిత ఉచితాలతో గరిష్ఠ స్థాయిలో సంక్షేమ పథకాల రూపంలో ఏటా సుమారు రూ. 80 వేల కోట్లు వ్యయం చేసినప్పటికీ... కొందరు కోరుకున్నట్లుగా రాష్ట్రం శ్రీలంక కాలేదు.అధికార దాహార్తితో అల్లాడుతున్న చంద్రబాబు వచ్చే ఎన్ని కల్లో ఎలాగైనా గెలవాలనే కోరికతో అనేక అనుచిత ఉచితాలు ప్రకటించారు. జగన్ ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూ చంద్రబాబు ఇచ్చిన అనుచిత ఉచితాలను అమలు చేయడానికి యేటా మరో రూ.70 వేల కోట్ల ఖర్చవుతుంది. అంటే వీటివల్ల రాష్ట్ర ఖజానాపై సుమారు రూ. లక్షా 50 వేల కోట్ల భారం పడుతుంది. నిజానికి రాష్ట్రానికి పన్ను, పన్నేతర ఆదాయాలు, కేంద్ర గ్రాంట్లు అన్నీ కలిపితే ఏడాదికి వస్తోంది సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు. దీనిలో ఉచితాలకు లక్షా 50 వేల కోట్ల రూపాయలు పోతే మిగిలేది రూ. 50 వేల కోట్లు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు ఏడాదికి సుమారు రూ.70 వేల కోట్లు అవసరమవుతాయి. ఇవి కాక వ్యవసాయం, ఇరిగేషన్, విద్య, వైద్యం లాంటి 21 శాఖలకు సుమారు లక్షా 30 వేల కోట్లు కేటా యించాలి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ ఎకౌంట్లో సుమారు 56 వేల కోట్ల రూపాయల ద్రవ్య లోటు చూపించారు. చంద్రబాబు అనుచిత పథకాలను కూడా అమలు చేయాల్సి వస్తే ఈ లోటు లక్షా 26 వేల కోట్లకు పెరుగుతుంది. ఇదే జరిగితే ఈ లోటు రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం ఖాయం.మేనిఫోస్టోలకు మాతృక 1848లో లండన్లో కార్ల్మార్క్స్– ఫ్రెడెరిక్ ఏంగెల్స్ ప్రచురించిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. అట్టడుగు శ్రామిక , పేద వర్గాలకు సంపద పంచడం, ఆర్థిక అసమానతలు తగ్గించడం ఈ మేనిఫెస్టోలోని అంశాల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ చేసింది ఇదే. ముందు వారి ఆర్థిక అవస రాలు తీర్చడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అందజేశారు. దీనిలో సుమారు రూ. 2.70 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా అందజేశారు. మోదీ ప్రభుత్వం గత ఐదేళ్ళుగా ఈ పద్ధతి ద్వారా దేశ వ్యాప్తంగా సుమారు రూ. 22 లక్షల కోట్లు బదిలీ చేయగా దానిలో పదో వంతు పైనే ఏపీలో పంపిణీ జరగడం విశేషం. ఇలా ఇవ్వడం వల్ల ఈ నాలుగు లక్షల కోట్ల రూపాయలు నేరుగా స్థాని కంగా ఖర్చు చేయడంతో వస్తు, సేవలకు గిరాకీ ఏర్పడింది. ఫలితంగా ఉత్పత్తి, ఉపాధి పెరిగింది. ప్రతి లావాదేవీలోనూ కేంద్ర, రాష్ట్రాలకు పన్నుల రూపంలో రాబడి పెరిగింది. ఇదే మొత్తం బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల చేతికి వెళితే దానిలో అత్యధికం నల్లధనంగా మారేది. పేదలను ఆర్థికంగా ఆదుకున్న జగన్ తర్వాత వారి సంపదను పెంచారు. సుమారు 31 లక్షల మంది మహిళలకు ఇళ్ళ స్థలాలు, లక్షన్నర గృహాలు ఉచితంగా అందజేశారు. పేదలకు ఇచ్చిన ఒక్కో ఇళ్ళ స్థలం విలువ కనీసం మూడు లక్షలు, ఇంటి విలువ పది లక్షల రూపాయల చొప్పున లెక్కిస్తే వాటి మొత్తం విలువ సుమారు పది లక్షల కోట్ల రూపాయలు. అంటే రాష్ట్ర బడ్జెట్ కన్నా ఇది నాలుగు రెట్లు ఎక్కువ. దేశంలో మరే రాష్ట్రం పేదల కోసం ఇటువంటి ఆలోచన చేయలేదు, ఇంత సంపద సమకూర్చలేదు.రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదంటూ విపక్షాలు, వారి అనుకూల మీడియా విషప్రచారం చేశాయి. 2023–24లో దేశ జాతీయోత్పత్తి వృద్ధి రేటు సుమారు 8 శాతం కాగా రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 16.5 శాతం. దేశంలో ఎక్కువగా వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. 2018–19లో స్థూల జాతీయోత్పత్తి విలువ రూ. 8.73 లక్షల కోట్లు కాగా అది 2023–24 నాటికి రూ. 16 లక్షల కోట్లకు పెరిగింది. తలసరి ఆదాయం రూ. 1,54,031 నుంచి రూ. 2. 60 లక్షలకు పెరిగింది. ఈ ఐదేళ్ళలో 122 భారీ పరిశ్రమలు, 5 లక్షల చిన్న తరహా పరి శ్రమలు వచ్చాయి. క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండియా లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా గత నాలుగేళ్లుగా సుమారు రూ. 75 లక్షల కోట్ల రూపాయల మౌలిక వసతుల పనులు జరుగుతుంటే వాటిలో ఏపీలోనే సుమారు రూ. 6 లక్షల కోట్ల పనులు జరుగుతున్నాయి. దేశ ఎగుమతుల్లో 10.42 శాతం ఏపీ నౌకాశ్రయాల నుంచే జరుగుతున్నాయి. సామాజిక రంగ వ్యయం, ఫుడ్ ప్రాసెసింగ్, కోక్, పొగాకు, మత్స్య ఉత్పత్తులు, పండ్ల తోటల విస్తీర్ణం, పౌల్ట్రీ , ప్రభుత్వ ఆస్పత్రుల సంఖ్య , సినిమా హాళ్ళు, ఇంజనీరింగ్ టాలెంట్ తదితర రంగాల్లో ఏపీ దేశంలోనే అగ్ర స్థానంలో ఉంది. దేశంలో అతి తక్కువ నిరుద్యోగం (4.2 శాతం) ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. కాని రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవంటూ ప్రచారం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి లభించింది. దానికి ఉదాహరణ రాష్ట్రంలో పెరిగిన ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలే. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2019లో రాష్ట్రంలో 44,85,974 పీఎఫ్ ఖాతాలుంటే అవి 2024 నాటికి 60,73,000కు పెరిగాయి. రాష్ట్రంలో గత మూడేళ్ళుగా కొత్తగా 18 లక్షల ఆదాయ పన్ను చెల్లింపుదారులు చేరారు. ఇదో జాతీయ రికార్డు.దేశంలో అత్యధిక సంఖ్యలో ఏడు వందలకు పైగా పౌర సేవలందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ ఐదేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 12 కోట్ల పౌర సేవా అర్జీలను పరిష్కరించి జాతీయ రికార్డు నెలకొల్పింది. నిజానికి ఈ ఐదేళ్ళలో అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. జగన్ ప్రభుత్వం మేనిఫోస్టోను పవిత్ర గ్రంథంగా భావించి త్రికరణ శుద్ధిగా అమలు చేసిందనడంలో సందేహం లేదు. గతంలో పసుపు– కుంకుమ వంటి తాయిలాలను తిరస్కరించిన రాష్ట్ర ఓటర్లు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం– జనసేన కూటమి అనుచిత ఉచితాల వలకు చిక్కే అవకాశం కనిపించడం లేదు.వి.వి.ఆర్. కృష్ణంరాజు వ్యాసకర్త ఎ.పి. ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్మొబైల్: 89859 41411 -
వారికి ‘విధ్వంసం’గా కనిపిస్తున్నది ఏమిటి?
రాష్ట్రంగా ఏర్పడిన పదేళ్ళ తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నది అని చూసినప్పుడు ఈ ఐదేళ్ళలో ఆసక్తికరమైన పరిణామ క్రమం కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సభల్లో ‘రాష్ట్రంలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నది అందులో నేను అర్జునుణ్ణి’ అంటుంటారు. ఏదో ఒక ప్రతీకగా అన్నట్టుగా ఇది ఉన్నప్పటికీ, ఈ మాట వెనుక ఎంతో లోతైన విషయం ఉంది.అందులో పైకి కనిపించని రాజకీయ, ఆర్ధిక, భౌగోళిక, సామాజిక శాస్త్రముంది. దాని లోతులు-లూయిస్ టెల్లిన్ రాసిన ఆక్సిఫర్డ్ యూనివర్సిటి ప్రెస్ ప్రచురణ ‘రీ మ్యాపింగ్ ఇండియా: న్యూ స్టేట్స్ అండ్ దెయిర్ పొలిటికల్ ఆరిజన్స్’ గ్రంధం చూసినప్పుడు, మనకు అర్ధం అవుతుంది. అందులో ముందుమాటలోనే ఆమె- ‘రాష్ట్రాల సరిహద్దులు మన జీవితాల్లోని రాజకీయ, ఆర్ధిక అంశాల విషయంలో ఏ వర్గాల మధ్య పరస్పరం పోటీఉంది? ఏవి ఎవరి చేజారిపోతున్నాయి.. అనేది నిర్ధారిస్తుంది’ అంటారు.ఇటువంటి ‘ఇరు వర్గాల మధ్య పరస్పరం పోటీ’ గురించే,కొంతకాలంగా సీఎం జగన్ కూడా మాట్లాడుతున్నారు. ఆయన పరిపాలనలో సంక్షేమం అమలుకు ‘ఆన్ లైన్’ సాంకేతికతను, యుద్దభూమిలో ‘డాలు’ మాదిరిగా వాడుతూ విమర్శకుల దాడి తనను తాకకుండా చూసుకున్నారు. దాంతో ఒకప్పుడు ఆ ‘టెక్నాలజీ’ గురించే 24X7 మాట్లాడిన వారికి ఇప్పుడు దాన్ని తప్పుపట్టడానికి నోరు పెగలడం లేదు. ప్రతిపక్షవర్గాలకు ఇటువంటి నిస్సహాయతలో నుంచి వచ్చిందే ‘విధ్వంసం’ వంటి ఏకవాక్య వ్యాఖ్య. వాళ్ళు అ మాటకు వివరం ఏమిటో ఇంకా చెప్పలేదు.అయితే, జగన్ దాన్ని-‘పేదలకు పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం’ అంటారు. రాజనీతి శాస్త్రంలో ఈ ‘పరస్పర పోటీ’సూత్రాన్ని ప్రతిపాదిస్తున్న ఈ రచయిత్రి ప్రస్తుతం లండన్ కింగ్స్ కాలేజిలో ‘ఇండియా ఇనిస్టిట్యూట్’తో పాటుగా ‘కేంబ్రిడ్జి’ ‘లండన్ స్కూల్ ఆఫ్ఎకనామిక్స్’ వంటి ప్రపంచ ప్రసిద్ద యూనివర్సిటిల్లో బోధిస్తున్నారు. ఈమె గతంలో బీబీసీ సౌత్ ఆసియా అనలిస్ట్ గాపనిచేసారు. ఈమె ఈ రచన 2014లోమన రాష్ట్ర విభజన నాటికివెలువడింది. ఉత్తరాదిలో ‘ఇండియా రీమ్యాపింగ్’కు దారితీసిన పరిస్థితులే దక్షణాదిలో మన వద్ద కూడా స్థూలంగా అవే చారిత్రిక, రాజకీయ, ఆర్ధిక, భౌగోళిక, సామాజిక పరిస్థితులు కారణం కావడం ఈ రచనలో చూస్తాము.ఇప్పుడు ఏమైంది 2000లో కొత్తగా ఉత్తరాఖండ్, చత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటుతో- ‘రీ మ్యాపింగ్ ఇండియా’వర్తమాన రాజకీయ నిర్ణయంగా ‘అకడమిక్’ చర్చగా మారి తెరమీదికి వచ్చింది. ఏమైంది, పదేళ్లకు ఇక్కడా అదే ‘సీన్ రిపీట్’ అయింది. అప్పుడు ఏమి జరగాలి? ‘రీ మ్యాపింగ్ ఆంధ్రప్రదేశ్’ మొదలవ్వాలి. ఎందుకంటే, ‘సరిహద్దులు మన జీవితాల్లోని రాజకీయ, ఆర్ధిక అంశాల విషయంలోవర్గాల మధ్య పోటీకి కారణం అవుతాయి’ అనేది సూత్రం అయినప్పుడు, నాయకుడు దాన్ని విధిగా ‘అడ్రెస్’ చేయాలి. అయితే నాయకుడు అక్కడ ఉత్పన్నం అయ్యే సవాళ్ళను ఎదుర్కోవాలి, అందుకు అతడు ధైర్యస్తుడై ఉండాలి.ఆ పనే జగన్ చేశాడు. ఆయన 13 జిల్లాలను 26 చేసి ఆ పని పూర్తిచేసాడు. రేపు చిన్నవో పెద్దవో సమస్యలు వస్తే వాటిని కూడా పరిష్కరిస్తాడు. ఒకప్పటి విజయనగరం జిల్లాలోని పార్వతీపురంను కొత్త జిల్లా చేయడానికి ఒడిస్సా సరిహద్దున ఉన్న 22 కొటియా గ్రామాల వివాదం ఒకటి చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. దాని పరిష్కారం కోసం నవంబర్ 2021లో మన ముఖ్యమంత్రి జగన్.. ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను కలిసి రెండు రాష్ట్రాల మధ్య ‘పెండింగ్’ ఉన్న సరిహద్దు గ్రామాలు, నదీజలాల అంశాలు గురించి మాట్లాడాక, ఏప్రిల్ 2022న కొత్త జిల్లాలను ప్రకటించారు. తన మొదటి ‘టర్మ్’లోనే ఇటువంటి ‘రీ మ్యాపింగ్’ కసరత్తు తర్వాత ఈ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళబోతున్నది. ఔఏప్రిల్ మూడో తేదీన ‘నవ్యాంధ్ర పదేళ్ళ ప్రస్థానం’ అంశంపై బీబీసీ తెలుగు విజయవాడలో చర్చావేదిక ఏర్పాటుచేసి, నన్ను కూడా పిలవడంతో వెళ్ళాను. అన్ని పార్టీల ప్రతినిధులు సీనియర్ జర్నలిస్టులు వచ్చారు. సమన్వయకర్త చర్చ నాతోనే ప్రారంభిస్తూ ‘మీరీమధ్య తరుచూ ఇక్కడి అభివృద్దిపై వ్యాసాలు రాస్తున్నారు కదా, ‘డాట్స్’ ను కలిపి చూడాలి అంటారు. నవ్యాంధ్ర ఈ పదేళ్ళలో ఏమైనా ముందుకు వెళ్ళిందా? లేక వెనక్కి వెళ్ళిందా? మీరు ఏమనుకుంటున్నారు?’ అని అడిగారు.నేను చెప్పాను.. ‘వైఎస్సార్ కాలంలో మన్మోహన్ సింగ్ ఏపీలో తరచూ ‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ ‘ఏపీ మోడల్’ వంటి వ్యాఖ్యలు చేసేవారు. విభజన తర్వాత, అదే ఇక్కడ మరింత మెరుగైన రీతిలో కొనసాగుతూ, దాంతోపాటుగా-‘కోర్స్ కరక్షన్’ కూడా జరుగుతోందని చెప్పాను. ప్రస్థానం అనగానే అది ముందుకే వెళ్ళాలి అనుకుంటాం. అన్నిసార్లు అది అలాగే ఉండనక్కరలేదు. ఉన్నచోటే కొన్నాళ్ళు ఆగి, ప్రజల అవసరాలు చూస్తూ.. రేపు మనం వెళ్ళవలసిన మార్గాన్ని ముందుగా సరిచేసుకోవడం కూడా ఉంటుంది. అది ఆగిపోవడం కాదు, అది వెళ్ళాల్సిన మార్గంలో ఉన్న వ్యత్యాసాల ఎత్తుపల్లాలు సరిచేయడం అవుతుంది.కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం సరిహద్దులు (బోర్డర్స్) గురించిన స్పృహ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ ఉండడం అనేది, ఎవ్వరు పెద్దగా గుర్తించలేదు గానీ అది అసాధారణమైన అంశం. అది ఉన్నప్పుడే- ‘రీ మ్యాపింగ్’ సాధ్యం అవుతుంది. మన సమాజంలో ‘బోర్డర్స్’లో ఉండేది ఎవరు? ఒక ఊళ్ళో ఊరి చివర ఉండేది ఎవరు? ఇటువంటి చివరి సమాజాల కోసం, ఈ ప్రభుత్వం కొత్త జిల్లాల కేంద్రాలను వీరి సమీపానికి చేర్చింది. కొందరు ఉంటారు, వారు ‘బోర్డర్స్’ను మరోలా చూస్తారు. వారు భద్రమైన నియోజకవర్గాల కోసం ‘బోర్డర్స్’కు వెళ్లి ఆ ప్రాంతం ఎదగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని, దశాబ్దాలుగా ఆ ప్రజలమీద పడి బ్రతికేస్తుంటారు.ఉత్తరాంధ్ర ప్రముఖ కధకుడు అట్టాడ అప్పల నాయుడు 2007లో ‘షా’ అనే కథ రాసారు. ఇరిగేషన్ కాంట్రాక్టులు చేయడానికి కోస్తా నుంచి శ్రీకాకుళం వచ్చిన చౌదరి స్థానిక సంస్థల రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాడు. దాని గురించి ఒక రాత్రి మందు పార్టీ వద్ద కొందరు రాజకీయ స్పృహ ఉన్న స్థానికులు మాట్లాడుకోవడం ఈ కథ. అయితే, ఇప్పుడు అది కథ కాదు. సరిహద్దుల్లో పరిష్కారం మొదలయింది. అదే ఇప్పుడు కొందరికి విధ్వంసంగా కనిపిస్తున్నది. రచయిత: అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత జాన్ సన్ చోరగుడి -
రంగును బట్టి రాజకీయాలా?
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లను పోలి ఉంటారన్న శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆధునిక మానవుని ఆవిర్భావం తొలుత ఆఫ్రికాలోనే జరిగిందనీ, అక్కడి నుంచి వారు వివిధ ప్రాంతాలకు వలస పోయారనీ, అందులో ప్రస్తుత భారతదేశం కూడా ఒకటనీ శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు ఆఫ్రికన్లతో పోలిక ఎవరికైనా ఎందుకంత ఉలికిపాటుకు గురి చేయాలి? వలసలు, సాంకర్యాల క్రమంలో మనుషులు తమ ఒరిజినల్ లక్షణాలలో కొన్నింటిని నిలుపుకొన్నారు, కొన్నింటిని కోల్పోయారు. ఇందుకు అనుగుణంగా దక్షిణ భారతీయుల రంగు ఉత్తరాదివారితో తేడాగా ఉండటం సహజం. ఆ చర్మపు రంగును గురించి, ‘వీరంతా ద్రవిడులు’ అనే ఈసడింపులు తెలిసిన విషయమే. ఈ విధమైన భావనలు ఏవీ దేశానికి మంచివి కావు.దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లను పోలి ఉంటా రంటూ శామ్ పిట్రోడా (ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్గా రాజీనామా చేశారు) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం సాగుతున్నది. రాజకీయాలను పక్కన ఉంచి మానవ వికాస శాస్త్రాన్ని, మానవ వలసల కోణాలను పరిశీలిస్తే ఆ వ్యాఖ్యలలో తప్పే మిటో అర్థం కాదు. వానరాల నుంచి ఆధునిక మానవుని ఆవిర్భావం తొలుత ఆఫ్రికాలోనే జరిగిందనీ, అక్కడి నుంచి వారు భూగోళంలోని వివిధ ప్రాంతాలకు వలస పోయారనీ, అందులో ప్రస్తుత భారతదేశం కూడా ఒకటనీ శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. ఈ సూత్రీకరణను ప్రపంచమంతా కూడా ఆమోదిస్తున్నది. మనకు మాత్రం సైన్సు కన్నా రాజకీయాలు ముఖ్యం గనుక పిట్రోడా మాటలపై భూమ్యాకాశాలను ఏకం చేసే హంగామాను సృష్టిస్తున్నాము.ఇంతకూ పిట్రోడా అన్నదేమిటి? ఆయన దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లను పోలి ఉంటారని మాత్రమే అనలేదు. దేశంలోని తూర్పు ప్రాంతాల వారు చైనీయులవలె, పశ్చిమ ప్రాంతాల వారు అరబ్బుల వలె, ఉత్తరాది వారు శ్వేతజాతీయులవలె ఉంటారని కూడా అన్నారు. ఈ పోలికలలో తక్కిన మూడింటిని వదలి, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్ల వలె ఉంటారన్న మాట ఒక్కటే వివాదమైంది. వివాదమైంది అనటంకన్న వివాదంగా మార్చారనటం సరైనదవుతుంది. ఈ చర్చ లోకి వెళ్లే ముందు ఒక విషయం గుర్తు చేసుకోవాలి. స్వయంగా బీజేపీకి చెందిన తరుణ్ విజయ్ అనే నాయకుడు, తను రాజ్యసభ సభ్యునిగా, ‘పాంచజన్య’ పత్రిక సంపాదకునిగా ఉండినపుడు, ‘‘మనం (అనగా ఉత్తరాది వారం) దక్షిణాది వారితో కలిసి ఉండటం లేదా?’’ అని వ్యాఖ్యానించారు. అనగా, తాము తెల్లగా ఉంటామని, ఉత్తమ స్థాయి వారమని, దక్షిణాది వారు నల్లగా ఉంటారని, అధమ స్థాయి వారని, అయినప్పటికీ తమది ఉదార స్వభావం గనుక అటువంటి వారితో కలిసి జీవిస్తున్నామని అర్థం. వాస్తవానికి దక్షిణాది వారి చర్మపు రంగును గురించి, కను ముక్కుల తీరు గురించి, భాషా సంస్కృతుల గురించి, ‘వీరంతా ద్రవి డులు’ అనే పద్ధతిలో ఈసడింపులు చేయటం అందరికీ తెలిసిన విషయమే. ఎన్టీఆర్ రాక వరకు అందరూ కట్టగట్టి ‘మద్రాసీ’లే. ఈ ధోరణికి బీజేపీ, సంఘ్ పరివార్ సైతం మినహాయింపు కాదన్నది ఇక్కడ గుర్తించవలసిన విషయం. ప్రస్తుత వివాద సందర్భంలోనూ ఈ సంగతి గుర్తించాలి. పిట్రోడా కాంగ్రెస్ నేత అయినందున, ఆయన మాటలను వివాదం చేస్తే తమకు రాజకీయంగా లాభిస్తుందనే సంకుచిత ఆలోచన తప్ప, ఇందులో బీజేపీ వివేకం ఏమీ కన్పించదు. మనకు తెలిసి మానవ వికాస శాస్త్రం, ప్రపంచవ్యాప్తంగా వలసల చరిత్ర, ఇటీవలి సంవత్సరాలలో జరిగిన డీఎన్ఏ పరిశోధనలు చెప్తున్న విషయాలు కొన్నున్నాయి. ఇండియా, చైనా, ఉత్తర యూరప్లలో ప్రాథమిక స్థాయి మానవ జాతులు స్వల్ప స్థాయిలో రూపుదిద్దుకున్న ప్పటికీ, ఆధునిక మానవుని ఆవిర్భావం తొలుత జరిగింది ఆఫ్రికాలోని తూర్పు భాగాన గల రిఫ్ట్ వ్యాలీలో. వేలాది సంవత్సరాల కాలంలో అటువంటి ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో శాస్త్రీయమైన పురావస్తు అధ్యయనాలు చెప్పాయి. వాటిపై కెన్యా రాజధాని నైరోబీ, ఇథియో పియా రాజధాని అడ్డిస్ అబాబాలలోని జాతీయ మ్యూజియాలలో గొప్ప ప్రదర్శనలున్నాయి. ఈ రెండింటినీ నేను స్వయంగా చూడటమే గాక, రిఫ్ట్ వ్యాలీలోని కొంత భాగంలో ప్రయాణించాను. ఆధునిక మానవుని ఆవిర్భావం పరిస్థితి ఇది కాగా, ఆ ప్రాంతం నుంచి మాన వులు రెండు లక్షల సంవత్సరాల క్రితం నుంచి మొదలుకొని ప్రపంచం నలువైపులా ఎట్లా వలస వెళ్లారో, ఆ విధంగా 70 వేల ఏళ్ల క్రితం ప్రస్తుతం మనం అంటున్న భారతదేశంలోకి ఏ విధంగా ప్రవేశించారో అనేక అధ్యయనాలున్నాయి.తర్వాత వేల సంవత్సరాలలో ప్రపంచమంతటా జరిగినట్లేఇండియాలో కూడా లెక్కలేనన్ని జాతి సాంకర్యాలు జరిగాయి. పైన చెప్పుకున్నట్లు అప్పటికే ఇక్కడ స్వల్ప స్థాయిలో ప్రాథమిక మానవులు ఉండగా, తర్వాత కాలాలలో తూర్పు ఆసియా నుంచి మంగోలాయిడ్లు, మధ్య ఆసియాలోని కాస్పియన్ సముద్ర ప్రాంతం నుంచి ఆర్యులు, పశ్చిమాసియా నుంచి అరబ్బులు, పారశీకుల పూర్వీకులు ఇటువైపు వలసలు వస్తూ పోయారు. తిరిగి వీరందరి మధ్య సాంక ర్యాలు, వలసలు వేలకు వేల సంవత్సరాల పాటు సాగాయి. దేశంలోని అన్ని ప్రాంతాల స్త్రీ, పురుషుల డీఎన్ఏలపై జరిగిన ఆధునిక శాస్త్ర పరిశోధనలు, పురావస్తు పరిశోధనలు తేల్చిన విషయాలివి. అయితే ఈ వలసలు, సాంకర్యాల క్రమంలో వేర్వేరు జాతులు, ప్రాంతాల మనుషులు తమ ఒరిజినల్ లక్షణాలలో కొన్నింటిని తరతరాలుగా నిలుపుకోవటం, కొన్నింటిని ఒక మేర కోల్పోవటం జరుగుతూ వస్తు న్నదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఉదాహరణకు అండమాన్, నికో బార్ ఆదిమవాసి తెగలు, దేశంలోని మారుమూల అడవులలో నివసించే ఆటవిక జాతులకు ఇతరులతో సాంకర్యం దాదాపు లేనందున, వారిలో ఇప్పటికీ ఆఫ్రికన్ డీఎన్ఏ యథాతథంగా కనిపిస్తుందంటారు. అటువంటి స్థితిలో ఆఫ్రికన్లతో పోలిక ఎవరికైనా ఎందుకంత ఉలికి పాటుకు, వ్యతిరేక భావనకు గురి చేయాలి?దక్షిణాది ప్రజలు, ఈశాన్య భారత లేదా తూర్పు భారత వాసులు, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల వారి రంగు తేడాలకు మూలాలు దీనంతటిలో ఉన్నాయి. దక్షిణ–ఉత్తర భారత భాషలు, సంస్కృతులు, దేవతలు, ఆలోచనా ధారల మధ్య, చివరకు రాజకీయాల మధ్య కనిపించే వ్యత్యాసాలకు గల మూలాలను శాస్త్రీయంగా శోధిస్తూ పోతే బోధపడేది ఇదే. ఆధునిక మానవుల ఆవిర్భావానికి, వారి వలసలకు, పరస్పర సాంకర్యాలకు లక్షలాది, వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. ఇందుకు ప్రపంచంలోని ఏ ప్రాంతంగానీ, భారతదేశంగానీ ఎంత మాత్రం మినహాయింపు కావు. పైన చెప్పుకొన్నట్లు, ఈ పరిణామ క్రమం ఒకవైపు అనంతంగా సాగుతూనే, మరొకవైపు అనేకులు తమ ఒరిజినల్ డీఎన్ఏలోని, ఒరిజినల్ లక్షణాలలోని కొన్ని భాగాలను అదేవిధంగా నిలుపుకొన్నారు. అట్లా ఎవరెంత నిలుపుకొన్నారు, అవి ఏ మేరకు నిలిచి ఉన్నాయనేది అనేక పరిస్థితులపై ఆధారపడి సాగుతూ వస్తున్నది.ఇందుకు అనుగుణంగా దక్షిణ భారతీయుల రంగు కన్నా ఉత్తరాదివారు, పశ్చిమ, తూర్పువాసుల రంగు తేడాగా ఉండటం సహజం. కానీ దానినిబట్టి వివక్షలు ఏర్పడాలంటే, తక్కిన ముగ్గురి లోనూ ఆఫ్రికన్ డీఎన్ఏ ఉంది. వారి పూర్వీకులు సైతం ఆఫ్రికన్లే. అటువంటపుడు, ఇంకా ఒక మేర మిగిలి ఉన్న రంగును బట్టి తరుణ్ విజయ్ అనే పెద్దమనిషి గానీ, మరొకరుగానీ, తమవంటి పూర్వీకులే గల దక్షిణ భారత ప్రజలను చిన్నచూపు చూడటం విజ్ఞతగల పని అవుతుందా? ఇంతకూ పిట్రోడా ఆ మాటలన్నది ఎందుకో తెలియదు గానీ, మానవ వికాస శాస్త్రం దృష్టితో, ప్రపంచవ్యాప్త వలసల చరిత్ర దృష్టితో, డీఎన్ఏ పరిశోధనల దృష్టితో సరిగా ఇవే మాటలను ఇప్పటికి ఎందరో అన్నారు, రాశారు. ఎన్నికల సమయం గనుక ఇది అధికార పక్షానికి ఒక మంచి ఆయుధంగా మారింది.ఈ సందర్భంలో మరొకటి గుర్తుకు వస్తున్నది. ఆర్యుల, ఉత్తరాది వారి ఆధిపత్యంగల పార్టీలు, ప్రభుత్వాలు ద్రవిడుల దక్షిణాదిని రాజకీయంగా జయించాలని, తమ ఆధిపత్యం కిందకు తెచ్చుకోవా లని ప్రయత్నిస్తున్నాయని, నిరంతరం వివక్షకు గురి చేస్తున్నాయనే వాదనలు పెరియార్ రామస్వామి తర్వాత, హిందీ వ్యతిరేక, ఉత్తరాది వ్యతిరేక ఉద్యమాల తర్వాత ఇప్పటికీ ముందుకు వస్తుంటాయి. ఈ విధమైన భావనలు ఏవీ దేశానికి మంచివి కావు. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
ఇది... భూ హక్కుకు భరోసా!
ప్రజల భూమి హక్కును కాపాడటం ప్రభుత్వాల రాజ్యాంగ బాధ్యత. ప్రస్తుతం చాలా ఉన్న సివిల్ కేసులకు, క్రిమినల్ కేసులకు కారణం భూమిపై యజమానికి వున్న హక్కును లేక టైటిల్ ను గుర్తించే చట్టబద్ధమైన వ్యవస్థ లేకపోవటం. వారసత్వం, కొనుగోలు, బదిలీ, కేటాయింపు ద్వారా భూమిపై యాజమాన్య హక్కు మార్పిడి జరుగుతుంది. రిజిస్ట్రేషన్ వ్యవస్థ భూమికి సంబంధించిన ఈ బదలాయింపు లావాదేవీలను రిజిస్టర్ చేస్తుంది. అంతేకాని లావాదేవీల ద్వారా పొందిన హక్కును రిజిస్టర్ చేయదు. అందువలన రిజిస్ట్రేషన్ విధానం భూమిపై సంపూర్ణ హక్కుకు రుజువు కాదు. అందుకే ఒకరు భూమిని కొని రిజిస్టర్ చేయించుకుంటే అదే భూమిని మరొకరు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ‘డబుల్ రిజిస్ట్రేషన్’ అనే సమస్య ఎక్కువగా వింటున్నాం. ‘లాండ్ టైటిలింగ్ చట్టం –2022’ ఈ సమస్యకు పరిష్కారం. పట్టాదారు పాస్ బుక్, టైటిల్ డీడ్, 1బీ ఆడంగల్, మరే ఇతర రెవెన్యూ రికార్డులు కూడా భూమిపై యజమానికి ఉన్న యాజమాన్య హక్కును నిరూపించే పత్రాలు కావు (పి. కిశోర్ కుమార్ వర్సెస్ విట్టల్ కె పట్కర్, 2023). రెవెన్యూ రికార్డుల్లో వివరాలు పొందుపరచే ‘మ్యుటేషన్’ కేవలం భూమిశిస్తు కట్టటానికి ఉపయోగపడే పత్రం. ఈ మ్యుటేషన్ వలన భూమిపై హక్కులు కల్పించబడవు, ధ్రువీకరించ బడవు (సవర్ణి వర్సెస్ ఇందర్ కౌర్, 1996). ఆంధ్ర ప్రదేశ్ (భూమి హక్కులు మరియు పట్టాదార్ పాస్ పుస్తకాలు) చట్టం, 1971 చట్ట బద్ధంగా భూములకు సంబంధించిన హక్కుల రికార్డులను తయారు చేయడానికీ, ఆ రికార్డులను నిర్వహించడానికీ ఉద్దేశించిందే కాని యజమానికి భూమిపైన ఉన్న హక్కులను ధ్రువీకరించదు (సీతారామ్ పాటిల్ వర్సెస్ రాంచంద్ర నాగో పాటిల్, (1977). పట్టాదారు పాస్ బుక్ కూడా యాజమాన్య హక్కును నిర్ధారించదు (గౌసియా బేగమ్ వర్సెస్ బసిరెడ్డి రుక్మిణమ్మ, 2013). ఈ దేశంలో ఏ రెవెన్యూ రికార్డు కూడా భూమిపైన యజమానికి వున్న హక్కును లేదా టైటిల్ను సంపూర్ణంగా నిర్ణయించదు, నిర్ధారించదు. భూమిపైన యజమానులకు ఉన్న హక్కులను లేక టైటిల్ కాపాడే విధంగా, భూ యజమానికి ఉన్న హక్కును ధ్రువీకరించి, హక్కు భద్రతకు హామీని ఇచ్చే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘లాండ్ టైటిలింగ్ చట్టం’ చేసింది. ఇది విప్లవాత్మకమైనది. భారత దేశంలో భూ యజమాని హక్కు(టైటిల్)ను చట్టబద్ధంగా గుర్తించిన మొట్ట మొదటి చట్టం ఇది. ఈ చట్టం లాండ్ టైటిలింగ్ అథారిటీనీ, స్థిరాస్తిపై హక్కునూ రిజిస్టర్ చేసే వ్యవస్థనూ ఏర్పాటు చేసి, టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిని నియమిస్తుంది. ఈ చట్టం ప్రకారం నోటిఫై చేసిన ప్రాంతంలో ఉన్న భూమి వివరాలకు సంబంధించిన రికార్డును సిద్ధం చేసి, స్థిరాస్తి గుర్తింపు సంఖ్య కేటాయించి, దాని సరిహద్దులతో రికార్డ్లో నమోదు చేసుకోవాలి. ఈ రికార్డులు మూడు రకాలు. 1. రికార్డు ఆఫ్ టైటిల్ 2. రికార్డు ఆఫ్ చార్జ్ 3. వివాదాలలో వున్న భూమి రికార్డు. ప్రారంభంలో తాత్కాలిక టైటిల్ రికార్డును సిద్ధంచేసి, నోటిఫై చేసి, భూ హక్కు దారులకు ఆ రికార్డు పైన వున్న అభ్యంతరాలను స్వీకరించి, ఆ అభ్యంత రాలను నివృత్తి చేస్తారు. ఏ అభ్యంతరం లేని భూముల టైటిల్ను రికార్డు ఆఫ్ టైటిల్లో నమోదు చేస్తారు. ఈ రికార్డులో నమోదు చేసిన రెండు సంవత్సరాల తరువాత ఆ భూమిపై ఉన్న హక్కు యజమాని సంపూర్ణ హక్కుగా గుర్తించబడుతుంది. భూమికి సంబంధించి సివిల్ కోర్ట్లో లేక రెవెన్యూ కోర్ట్లో అయినా కేసు వుంటే, దాని తీర్పు ప్రకారం రెండు సంవత్సరాల తరువాత కూడా హక్కును నమోదు చేస్తారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న అన్ని రెవెన్యూ రికార్డుల స్థానంలో ఒకే ఒక్క రికార్డు ‘రికార్డు ఆఫ్ టైటిల్’ అమలులోకి వస్తుంది. ఈ రికార్డు భూ యజమానికి వున్న హక్కును సంపూర్ణ హక్కుగా ఈ చట్టం గుర్తిస్తుంది. భారత దేశంలో భూ యజమాని హక్కును (టైటిల్) చట్టబద్ధంగా గుర్తించిన మొట్టమొదటి చట్టం ఇది. చట్టంలోని సెక్షన్ 38... భూమి టైటిల్ హక్కుకు సంబంధించిన వివాదాలను సివిల్ కోర్ట్ పరిధి నుండి మినహాయించి, రెవెన్యూ కోర్ట్కు బదలాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తమవుతున్నది. ఈ సెక్షన్ రాజ్యాంగ బద్ధతను గూర్చిన వివాదం ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయ స్థాన పరిధిలో వుంది. సివిల్ కోర్ట్ అధికారాలను కొనసాగిస్తూ మధ్యంతర వుత్తర్వులు వెలువరించింది హైకోర్ట్. మరో వివాదాస్పద అంశం సెక్షన్ 14 ప్రకారం టైటిల్ రిజిస్టర్లో నమోదు కాబడిన లేక నమోదుకాని భూములకు సంంబంధించి అభ్యంతరాలు వున్నట్లయితే, సంబంధిత వ్యక్తులు టైటిల్ రిజిస్ట్రేషన్ అప్పీలేట్ అధికారికి అర్జీ పెట్టుకోవాలి. రెవెన్యూ అధికారి అప్పీలేట్ అధికారిగా వుంటాడు కాబట్టి ఈ చట్టం దుర్వినియోగం అవుతుంది అనేది ఒక వాదన. సివిల్ కోర్ట్లో భూవివాద పరిష్కారం ఆలస్యం అవుతుంది అని ఈ విధానాన్ని ఈ చట్టంలో అమలు చేశారు. రెవెన్యూ న్యాయస్థానాలు ఈ చట్టంలో కొత్తగా ఏర్పాటు చేసినవి కావు. అనేక ఏళ్లుగా అమలులో వున్న ఈ రెవెన్యూ కోర్టులను ఎప్పుడు ప్రజలు, న్యాయవాదులు వ్యతిరేకించలేదు. అమలుచేసే అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తారనే అభియోగంతో చట్టాన్ని కొట్టి వేయటం న్యాయ శాస్త్ర ప్రాథమిక సూత్రానికి వ్యతిరేకం. భూమిని కొనుగోలు చేసినప్పుడు ఆ కొనుగోలు లావాదేవీలను రిజిస్టర్ చేయించినట్లే, సంబంధిత అధికారి దగ్గర హక్కును లేక టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ విధానం భూ యజమానికి వున్న భూమిపై వున్న హక్కుకు రక్షణ, భద్రత. కొనిన స్థలం చుట్టూ కంచ వేయించు, గోడ కట్టు అని మన శ్రేయోభిలాషులు చేసే హెచ్చ రికలు ఇక అవసరం లేదు. స్థిరాస్తిని టైటిల్ రికార్డులో నమోదు చేసిన తరువాత, హక్కును కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే. ఈ దేశంలో భూమి కొని దానిని టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసుకొని విదేశాలకు వెళ్ళి ఎన్ని సంవత్సరాల తరువాత తిరిగి భారతదేశానికి వచ్చినా,వారి భూమి అన్యాక్రాంతం కాదు. ముఖ్యంగా ఈ చట్టం ’సెకండ్ రిజిస్ట్రేషన్’ సమస్యకు పరిష్కారం. దీనికి కారణం భూమి కొనిన యజమాని హక్కుకు ఈ చట్టం ప్రభుత్వాన్నే కాపలాదారునిగా చేస్తుంది. ప్రభుత్వం భూమిని పరిరక్షించటంలో విఫలమైనా, టైటిల్కి సంబంధించి సమస్య వచ్చినా భూమి యజమానికి ప్రభుత్వం బీమా చెల్లిస్తుంది. రెవెన్యూ రికార్డు లేకుండా చాలా కాలంగా భూమిని పండించుకుంటున్న బలహీన వర్గాలకు పంపిణీ చేసిన భూమిని కూడా వెంటనే రికార్డు ఆఫ్ టైటిల్లో నమోదు చేయాలి. వారి హక్కుకు భద్రత మరియు బీమా కల్పించాలి. ఈ చట్టం అమలు వలన బలహీన వర్గాల ప్రజలకు వారి అనుభవంలో వున్న భూమికి, వారికి బదలాయించే భూమి హక్కుకు భద్రత కల్పించ వలసిన బాధ్యత ప్రభుత్వంపై వుంటుంది. ఆ విధంగా పేద, బలహీన వర్గాల వారికి కూడా ఈ చట్టం వలన మేలు జరుగుతుంది.డా‘‘ నేలటూరి జేసు రత్న కుమార్ వ్యాసకర్త పూర్వ సహాయ సంచలకులు,ఏపీ జ్యుడీషియల్ అకాడెమీ ‘ 98857 20777 -
బీద పిల్లల గురించి ఆలోచించండి!
ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ వాళ్లు గ్రామీణ విద్యా వ్యవస్థను ప్రాంతీయ భాషామయం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇంగ్లిష్ను క్రమంగా తీసేసి ప్రాంతీయ భాషను, ముఖ్యంగా హిందీని రుద్దుతున్నారు. కానీ పెట్టుబడిదారుల యూనివర్సిటీల్లో ఇంగ్లిష్ భాష, విదేశీ సిలబస్ ద్వారా చదువు చెప్పి తిరిగి దేశ నాయకత్వాన్ని మొత్తం వారి చేతికి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది. జగన్ ప్రభుత్వం విద్యా సమానత్వం కోసం అన్ని రకాల కుట్రలకూ వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసి స్కూలు విద్యను మార్చింది. తెలుగుకు ప్రాధాన్యమంటూ ఇంగ్లిష్ మీడియం తీసివేస్తే పూర్తిగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. జాగ్రత్తగా ఆలోచించి ఓటెయ్యకపోతే, బీద పిల్లల భవిష్యత్ అంధకారమౌతుంది.దేశంలో ఎన్నికలు మొదటిసారి ఓబీసీల (వెనుకబడిన తరగతుల) చుట్టూ తిరుగు తున్నాయి. ఓబీసీల్లో అన్ని శూద్ర కులాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని శూద్ర వ్యవసాయ కులాలు రిజర్వేషన్లలో లేకపోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఉండొచ్చు. ఉదాహరణకు రెడ్డి, కమ్మ, కోస్తా కాపు కులాలు రిజర్వేషన్లలో లేవు. కర్ణాటకలో, తమిళనాడులో అన్ని శూద్ర కులాలు రిజర్వేషన్లలో ఉన్నాయి. లింగాయత్, వక్కళిగ, నాయకర్ (పెరియార్ కులం) కులాలు కూడా ఆ రాష్ట్రాల్లో రిజర్వేషన్లలో ఉన్నాయి.చారిత్రకంగా వర్ణ వ్యవస్థలో నాలుగవ వర్ణం శూద్రులు. వేద కాలంలో వారు బానిసలు. తరువాత వ్యవసాయ, కుటీర పరిశ్రమ, పశుపోషణ వంటి అన్ని ఉత్పత్తి పనులు చేసి దేశాన్ని ఈ స్థితికి తెచ్చింది ఈ కులాలే. క్రమంగా వీరి నుండి విడగొట్టబడి అంటరాని వారుగా అణగదొక్కబడ్డవారు దళితులు. వీరు కాక అరణ్య జీవనం నుండి అందరిలో కలిసే ప్రయత్నం చేస్తున్నవారు ఆదివాసులు.ఇంగ్లిష్ మీడియం వంటి సమాన విద్యే ఈ కుల వ్యవస్థను కూల్చుతుందని మనకు ఈమధ్య కాలంలోనే అర్థమవుతోంది. అందుకు మంచి ఉదాహరణ ఈ సంవత్సరం 10వ తరగతిలో ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నవారు ఆంధ్రలో 91 శాతం పాస్ అయితే, తెలంగాణలో 93 శాతం పాసయ్యారు. తెలుగు మీడియంలో చదువుకున్నవారు 80 శాతంగానే పాసయ్యారు.రిజర్వేషన్ల మాటేమిటి?అయితే 2024 ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడం, అందులో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లను క్రమంగా ఎత్తివేసే సవరణ చెయ్యడం గురించి చర్చ జరుగుతోంది. ఈ భయం బీజేపీ బయట ఉన్న వారికే కాదు, బీజేపీలో ఉన్నవారికి కూడా ఉన్నది. అయితే మరి మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే ఆయన బీసీ అని చెబుతున్నారు కనుక ఎలా తీసేస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది? ఆరెస్సెస్ 1950లో రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేడ్కర్ ఆనాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్కు అందించి అమలు చేసిన నాటి నుండి ఎస్సీ, ఎస్టీలకు అందులో పొందుపర్చిన రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకతతో ఉంది. అంతకంటే ముఖ్యంగా 1955లో కాకా కాలేల్కర్ బీసీ రిజర్వేషన్ రిపోర్టును ఆనాటి నెహ్రూ ప్రభుత్వం తిరస్కరించినప్పుడు ఆరెస్సెస్ మంచి పని జరిగింది అనే ధోరణిలో ఉంది.అయితే 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం బీపీ మండల్ రిపోర్టును అమలు చేసినప్పుడు ఆరెస్సెస్/బీజేపీ వ్యతిరేకించాయి. ఆనాడు కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులు కొంతమందైనా బీసీ రిజర్వేషన్లను సపోర్టు చేశారు. కానీ బీజేపీలో ఉన్న బీసీల్లో ఒక్క ఉమాభారతి తప్ప వేరే ఏ ఒక్క బీసీ లీడర్ కూడా బీసీ రిజర్వేషన్లను సపోర్టు చెయ్యలేదు. నరేంద్ర మోదీ ఆనాడు రిజర్వే షన్లను సపోర్టు చెయ్యలేదు. ఆయన బీసీ అని కూడా ఎవ్వరికీ తెలియదు. గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే ఆయన బీసీగా ప్రచారం ప్రారంభించారు.2014 ఎన్నికలకు ముందు ఆ ప్రచారాన్ని బాగా పెంచారు. ప్రధానంగా ఆనాడు బీసీల ఓట్లతో ఆయన గెలిచారు. అందుకు ఫలితంగా ఆయనగానీ, బీజేపీ/ఆరెస్సెస్ ప్రభుత్వంగానీ గత పదేండ్లలో బీసీలకు ఏమి ఇచ్చారు? మొత్తం శూద్ర సమాజం బతికేది వ్యవసాయ రంగం మీద. దాన్ని మొత్తంగా గుజరాత్–ముంబయి బడా పెట్టుబడిదారులకు అప్పగించేందుకు ఘోరమైన వ్యవసాయ వ్యతిరేక చట్టాలు తెచ్చారు. శూద్ర/బీసీలు ఇంతో అంతో బతికేది వ్యవసాయ ఉత్పత్తి, వ్యవసాయ మార్కెట్ల మీద. వాటిని బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని చట్టాలు చేస్తే శూద్ర/బీసీ రైతులు ఎంత పోరాటం చేశారో వ్యవసాయదారులందరికీ తెలుసు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లల స్కాలర్షిప్లు మొత్తం తగ్గించివేశారు. వీరు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇంగ్లిష్ను క్రమంగా తీసేసి ప్రాంతీయ భాషను ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో హిందీని రుద్దుతున్నారు. కానీ పెట్టుబడిదారుల యూనివర్సిటీల్లో కేవలం ఇంగ్లిష్ భాష, విదేశీ సిలబస్ ద్వారా చదువు చెప్పి తిరిగి దేశ నాయ కత్వాన్ని మొత్తం వారి చేతికి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది.చాలా విచిత్రంగా ఈ ఎన్నికల్లో ముస్లిం రిజర్వేషన్లను తీసేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామంటున్నారు. మోదీ, అమిత్ షా ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. అసలు ముస్లింలకు రిజర్వేషన్లు యూపీ ఎస్సీలో ఉన్నాయా? కొన్ని రాష్ట్రాల్లో 4 శాతం లేదా అంతకంటే తక్కువ ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక రంగాన్ని ప్రైవేటీకరిస్తూ, బీసీ, ఎస్సీ, ఎస్టీల పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడాన్ని వ్యతి రేకిస్తూ ముస్లింలకు తగ్గించేది ఎక్కడ? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చేది ఎక్కడ?ప్రధానమంత్రి బీసీని అని చెబుతూ నా సిద్ధాంతం ‘సనాతన ధర్మం’ అంటే ‘వర్ణధర్మం’ అంటున్నారు. బీసీలు శూద్ర వర్ణం వారు కదా! సనాతన ధర్మం వారిని దైవ పాదాల నుండి పుట్టించింది కదా! అయినా మళ్ళీ ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా శూద్రులందరినీ ఏ దేవుని పాదాల్లో పుట్టిస్తారు? ఈ రాజ్యాంగం ఆ పాదాల, తొడల, భుజాల, తల పుట్టుకను రద్దు చేసి అందరి పుట్టుకను సమానం చేసింది. బీసీ ప్రధానమంత్రి చిన్నప్పుడు చాయ్ అమ్మి ఉండవచ్చు. కానీ మట్టి మోసి, మనుషుల మలాన్ని ఎత్తివేసే పనులు చేసే పిల్లల్ని కనీసం చాయ్ వ్యాపారంలోకి కూడా రానియ్యలేదే! దళితులు చాయ్ చేస్తే ఈ దేశంలో పై కులాలు ఇప్పటికీ తాగడం లేదే! మానవ మను గడకు మూలం వ్యవసాయం; ఆ పని చేసేవారంతా శూద్ర బీసీలు. వారికి బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, ఖత్రీలు, కాయస్తులతో సమాన విద్య, సమాన పని హక్కు కల్పించే ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా మళ్ళీ సనాతన ధర్మాన్ని స్థాపించడం సాధ్యం కాదు. ఇక్కడే బీసీలు జాగ్రత్తగా ఆలోచించాలి. మే 5న ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ, తమ ప్రభుత్వం రాగానే తెలుగుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలుగుకు ప్రాధాన్యమంటే, ఇంగ్లిషు మీడియం తీసేయడమా? మరి అమిత్ షా తన కొడుకు జయ్ షాను గుజరాతీ మీడియంలో ఎందుకు చదివించలేదు? అదే అమిత్ షా... ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో మరాఠీ/గుజరాతీ మీడియం ఎందుకు పెట్టించలేదు? ఆంధ్రప్రదేశ్ బీసీ, ఎస్సీ, ఎస్టీలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వెయ్యకపోతే, బీద పిల్లల భవిష్యత్ అంధకార మౌతుంది.ఓటు వేసే ముందు... జగన్ ప్రభుత్వం విద్యా సమానత్వం కోసం అన్ని రకాల కుట్రలకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసి స్కూలు విద్యను మార్చింది. ఇంగ్లిష్ మీడియం తీసివేస్తే పూర్తిగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. అమిత్ షా ప్రకటన చాలా ప్రమాదకర హెచ్చరిక. ఈ మధ్య కాలంలోనే మోదీ తమ ఎంపీ అభ్యర్థులందరికీ ఉత్తరాలు రాస్తూ అమిత్ షాను ఆకాశానికి ఎత్తారు. మోదీ తరువాత అమిత్ షానే ప్రధానమంత్రి అనే డైరెక్షన్ ఇచ్చారు. ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంగ్లిష్ విద్య రానియ్యకూడదనే పట్టుదలతో ఉన్న వ్యక్తి.ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో గ్రామీణ విద్యా వ్యవస్థను ప్రాంతీయ భాషామయం చేశారు. కానీ పెద్ద పెట్టుబడిదారులు వారి పిల్లల్ని ఇంగ్లిష్ తప్ప మరో భాష రాకుండా చూసుకుంటున్నారు. వీరి నేతృత్వంలో రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిస్తే, సమస్త భవిష్యత్ దెబ్బతింటుంది. గుజరాత్లో ఎప్పుడైనా ఆంధ్ర పాలకుల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నడవగా చూశామా! ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఓటు వేసే ముందు మొత్తం ప్రజలు ఆలోచించాల్సింది ఇదే.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
రిజర్వేషన్లకు ఎవరు భరోసా?
రిజర్వేషన్ల మీద జాతీయ స్థాయిలో ఇంతటి ప్రస్తావన చోటు చేసుకోవడం ఒక మంచి పరిణామం. ఇది ప్రస్తావన మాత్రంగానే సాగుతున్న వ్యవ హారం కాబట్టి దీనిని చర్చ అనడం లేదు. ప్రస్తుతం జరుగు తున్న ఎన్నికల్లో (లోక్సభ ఎన్ని కలు–2024) బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందనీ, రిజర్వేషన్లను రద్దు చేస్తుందనీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి కమలనాథులు తీవ్ర కలవర పాటుకు గురౌతున్నారు. అర్ఎస్ఎస్ చేత కూడా ఖండన ప్రకటనలిప్పిస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం కానీ, రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన కానీ ఏ కోశానా లేవని చెప్పుకుంటున్నారు. రిజర్వేషన్లు జనాభాలో అత్య ధిక శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి నవి కాబట్టి బీజేపీ ఇంతగా ఇది అయిపోతోందని అర్థమవుతోంది. సామాజికంగా అణగారిన వర్గాలకు–అంటే సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అందుకు విరుద్ధంగా ఆర్థిక వెనుకబాటుతనాన్ని రాజ్యాంగంలో చేర్పించి ఆ వర్గానికి ఏకంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర బీజేపీ పాలకులది. ఇందు కోసం అగ్ర వర్ణాలనుంచి ఒత్తిడి వర్గాలను రంగంలో దింపిన ఘనత బీజేపీది. దేశంలో శతాబ్దాలుగా కఠోరంగా అమల్లో గల కుల వ్యవస్థ, బ్రాహ్మణీయ వివక్ష వల్ల చదువుకీ, ఆస్తికీ, ఆత్మగౌరవానికీ బహు దూరంగా బతుకుతూ... అదే సమయంలో సకల శ్రామిక, సేవక వృత్తులు చేస్తూ సమాజ రథాన్ని నడిపిస్తున్న వేలాది కింది కులాల ప్రజలను చేయి అందించి ముందుకు తీసుకురావలసిన కర్తవ్యాన్ని గుర్తించి రాజ్యాంగ కర్తలు సానుకూల వివక్షకు అవకాశం కల్పించారు. విద్య, ఉద్యోగాల్లో కొంత శాతాన్ని ప్రత్యేక పరిగణన ద్వారా వారికి కేటాయించాలని నిర్ణయించారు. రాజ్యాంగ అధికరణలు 15(4), 46 ఇందుకే చోటు చేసుకున్నాయి. ప్రమోషన్లలో, భర్తీ కాకుండా మిగిలిపోయిన బ్యాక్ లాగ్ ఉద్యోగాలలో కూడా ఈ రిజర్వేషన్లు వర్తింపజేయడానికి వేర్వేరు రాజ్యాంగ సవరణల ద్వారా అవకాశం కల్పించారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ అందరికీ సమానంగా ఓటు హక్కును కల్పించడంతో దేశంలో సమతా భావన బలపడడం ప్రారంభించింది. అయినా ఇప్పటికీ వెలి గ్లాసులు, వెలి బావులు వంటివి కొనసాగుతున్నాయి. అగ్రవర్ణాలకు కేటాయించిన మంచినీటి కుండలోని నీరు తాగేడనే నెపం మీద పాఠశాలలో దళిత బాలుడిని కొట్టి చంపిన మాదిరి దారుణ ఉదంతాలు జరుగతున్నాయి. రిజర్వేషన్లు కల్పించి ఏడు దశాబ్దాలు దాటినా అణగారిన వర్గాల– ఎస్సీ, ఎస్టీ, బీసీల బతుకులు చాలీ చాలని గుడిసెల్లోనే కొనసాగుతున్నాయి. నిరుద్యోగం, అధిక ధరలు వారి బతుకులను మరింతగా అంచులకు ఈడ్చివేశాయి. అందుకే జనాభాలో తామెందరో... విద్య, ఉద్యోగాల్లో అంత శాతం వాటా తమకు రావాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. కులగణన నినాదం బలం పుంజుకున్నది. కాంగ్రెస్ పార్టీ దీనిని ప్రధాన వాగ్దానంగా చేసుకుంది. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషాను బట్టి రిజర్వేషన్లు వర్తిస్తుండగా దేశ జన సంఖ్యలో సగానికి పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లను 27 శాతానికే కుదించారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీం కోర్టు గీచిన హద్దు గీత, క్రీమీ లేయర్ నిబంధన బీసీల పాలిట శాపాలయ్యాయి. ఆర్థిక వెనుకబాటుతనం పేరిట అగ్రవర్ణ పేదలకు రాజ్యాంగ సవరణ ఆయుధంతో 10 శాతం కోటా కల్పించిన మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని, క్రీమీ లేయర్ను తొలగించడానికి రాజ్యాంగ సవరణ ఎందుకు చేయలేదు? కులగణను బీజేపీ ఎందుకు వ్యతి రేకిస్తోంది? బీసీల దయనీయస్థితి అంకెల్లో అచ్చు గుద్ది నట్టు బయటపడి వారిని వాడుకుంటూనే తాను వారిని ఎంతగా వంచిస్తున్నదో బహిర్గతమవుతుందనే భయంతోనే కదా! బీజేపీ చరిత్రంతా రిజర్వేషన్ల వ్యతిరేక చరిత్రే. దశాబ్దాల క్రితం మండల్ నివేదిక అమలుకు తలపెట్టిన ప్పుడు చెలరేగిన రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం, మందిర్ ఆందోళన పరివార్ శక్తుల ప్రమేయంతో చెలరేగినవే కదా! సమ్మిళిత లక్షణంతో సెక్యులర్ సదాశయంతో వారి వారి అణగారినతనం ఆధారంగా హిందూయేతర మత స్థులలోని వారికీ రిజర్వేషన్ల కల్పనకు రాజ్యాంగం వీలు కల్పించింది. 2005 లో యూపీఏ ప్రభుత్వం నెలకొల్పిన జస్టిస్ రాజిందర్ సచార్ కమిటీ దేశంలో ముస్లింలు దయనీయ స్థితిలో ఉన్నారనీ, వారికి విశేష స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనీ సిఫారసు చేసింది. ఇప్పుడు ముస్లింలకు అరకొరగా ఉన్న రిజర్వేషన్లను కూడా రద్దు చేస్తామని ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రచార సభల్లో కఠోర స్వరంతో ప్రకటిస్తున్నారు. రాజ్యాంగ ధర్మాన్ని కాల రాస్తున్నారు. ముస్లింల రిజర్వే షన్లను తెగనరుకుతానంటున్న బీజేపీ, ఆ తర్వాత వారికి దగ్గరగా ఉన్న ఎస్సీ, ఎస్టీల కోటాకు టాటా చెప్పాబోదనే హామీ ఎక్కడిది? ఈ ఎన్నికల్లో తమ పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి లోక్సభలో 400 సీట్లు వస్తే రిజర్వేషన్లను తొలగిస్తామనీ, రాజ్యాంగాన్ని మారుస్తామనీ రాజస్థాన్ మంత్రి కిరోరి లాల్ మీనా ప్రకటించినట్టు చూపించిన ఒక వీడియో గత నెలలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. బీజేపీ తన అభిమతాన్ని అధికారికంగా కాకుండా అనధికారిక మార్గాలలో వ్యక్తం చేస్తూ ఉంటుందనే అభిప్రాయం ఉంది. రిజర్వేషన్ల జోలికి వెళ్ళబోమనీ, అది తప్పుడు ప్రచారమనీ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పదే చేస్తున్న ప్రకటనలను, ఇస్తున్న హామీలను నమ్మలేం. అర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ కూడా రంగ ప్రవేశం చేసి రిజర్వేషన్ల రద్దు జరగబోదని స్పష్టంగా ప్రకటించారు. అయితే గతంలో ఆయనొకసారి రిజర్వేషన్లను సమీక్షించాలని అన్నారు. 2015 లో బిహార్ ఎన్నికలకు కొద్ది వారాల ముందు మాట్లాడుతూ రిజర్వేషన్ విధానంపై సామాజిక సమీక్ష జరగాలని ప్రకటించారు. దాని మీద వివాదం చెలరేగడంతో ఇతర పేద వర్గాలకు కూడా మేలు చేసే ఉద్దేశంతోనే ఆయన అలా అన్నారని వివరణ వచ్చింది. ఆచరణలో బీజేపీ పదేళ్ల పాలనలో రిజర్వేషన్లు కను మరుగయ్యేలా ప్రైవేటైజేషన్ ముమ్మరించింది. సామా జికంగా, విద్యా విషయకంగా వెనుకబడిన బీసీలకు విధానపరంగా అది ఉపయోగపడింది శూన్యమే. బడు గులను కేవలం పేదలుగా, పైనుంచి నెలకు 5 కిలోల బియ్యం ‘ముష్టి’ వేస్తే అదే మహా ప్రసాదమని కళ్ళకు అద్దుకొనేవారుగా మాత్రమే బీజేపీ పరిగణిస్తూ ఉంది.హిందూ కుల వ్యవస్థ దశాబ్దాలుగా అణగదొక్కగా చదువు, ఆత్మగౌరవం పిసరంతైనా అంటని బానిస బతు కులు బతికినవారికి పరిహారంగా రిజర్వేషన్లను కల్పించడాన్ని తాము నెత్తిన పెట్టుకునే సనాతన నీతికి అవమా నమని వారు భావిస్తున్నారు. ఉదాహరణకు మహిళలపై గతంలో మోహన్ భాగవత్ వెలిబుచ్చిన అభిప్రాయా లను గమనించవచ్చు. ‘పెళ్లి ఒక కాంట్రాక్టు అని ఈ ఒప్పందం ప్రకారం నువ్వు నా ఇంటి బాధ్యతలు నెరవేరిస్తే నీ అవస రాలాన్నిటినీ నేను తీరుస్తాను, నిన్ను భద్రంగా కాపాడుతాను అని భర్త భార్యకు చెబుతాడు, భార్య ఈ ప్రకారం నడుచుకున్నంత కాలం భర్త ఆమె బాధ్యత వహిస్తాడు, ఆమె ఈ కాంట్రాక్టును ఉల్లంఘిస్తే ఆమెను అతడు వదిలేయవచ్చు’అని ఆయన అన్నారు. గ్రామీణ భారతంలో రేప్లు తక్కువనీ, పట్టణాల్లో, నగరాల్లోనే ఎక్కు వని కూడా అన్నారు. మహిళ ఆస్వతంత్రురాలుగా, పురుషుడి చేతుల్లో ఉండాలని ఆయన ప్రవచించారు. ఇటువంటి భావాలు గలవారి అధిపత్యంలో దేశం సెక్యులర్ రాజ్యాంగానికీ, రిజర్వేషన్లకూ స్వస్తి చెప్పి మనుస్మృతిని అమల్లోకి తెస్తుందనే భయాలు కలగడం సహజాతి సహజం.జి. శ్రీరామమూర్తి వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
ఎన్నో ఆటుపోట్లను భరించి ఒంటరిగా రాజకీయ పార్టీని స్థాపించారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన నిజాయితీ గల ప్రజానాయకుడిగా ఎదిగారు. కనీవినీ ఎరుగని మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. కరోనా వల్ల రెండేళ్లు కలిసిరాక పోయినా ప్రజల్ని కంటిరెప్పల్లా కాపాడుకున్నారు. మిగిలిన కాలంలోనే పేద బిడ్డలకు కార్పొరేట్ స్థాయి ఆంగ్ల విద్యను అందుబాటులోకి తెచ్చారు. పేద తల్లిదండ్రులకు అద్భుతమైన ఆరోగ్య సేవలను అందించారు. వలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాల ద్వారా పాలనను ప్రజల గడప వద్దకు తెచ్చారు. పెట్టుబడులను ప్రోత్సహించి పరిశ్రమలు వచ్చేట్టు చూశారు. ఒక్కమాటలో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారు. అందుకే జగన్ అంటే జనాల్లో అంత ఆదరణ! జగన్ అంటే ఒక నిజం, ఒక భావోద్వేగం, ఒక విజయ సంకేతం.వై.ఎస్. జగన్మోహన్రెడ్డి రాజకీయ ప్రవేశం చేసినప్పటినుంచీ పది సంవత్సరాలు ఆటుపోట్లతో నడిచింది. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తరువాత రాజకీయంగా కాకలు తీరిన, కుట్రలు కుతంత్రాలు తెలిసిన నాయకులను ఎదిరించి ఒంటరిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అప్పుడే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్కు బీజం పడింది. తరువాతి కాలంలో సోనియా గాంధీ కుట్రలకు బలైపోయి పదహారు నెలలు జైలు జీవితం గడిపారు. 2017 జూలైలో తూర్పు గోదావరి జిల్లా, వైరా మండలం చాపరాయి గ్రామంలో పదహారు మంది ఆదివాసీలు విషజ్వరాలతో వైద్య సదుపాయం అందక మరణించిన విషయం తెలిసిందే. అప్పుడు జగన్ పది కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో పోలీసు రక్షణ కూడా లేకుండా నడక దారిన వెళ్లి ఆ విషయాన్ని వెలుగులోకి తెచ్చి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. పేదల పక్షాన శాసనసభలో గళం వినిపించారు. ఇక జగన్ రాజకీయ జీవితంలో మరువలేని ప్రధాన ఘట్టం ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 3,648 కిలోమీటర్లు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు నడిచిన పాదయాత్ర. ఈ పాదయాత్రలో జగన్ ప్రజలతో మమేకమై వారి కష్టాలు చూసి చలించి ‘నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను’ అంటూ ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కలిగించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక బలమైన నిజాయితీ గల ప్రజానాయకుడిగా ఎదిగారు. 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 175 స్థానాల్లో 151 గెలిచి ఏపీ ముఖ్యమంత్రిగా అశేష జన వాహిణి మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న యాభై ఎనిమిది నెలల పాలనా కాలంలో కరోనాతో 24 నెలలు ప్రజలను కంటికి రెప్పలా కాపాడు కోవడంలోనే గడిచింది. మిగిలిన దాదాపు మూడు సంవత్సరాల కాలంలో తన మేనిఫెస్టోలోని పథకాల ద్వారా ప్రజల ఆర్థిక అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఈ పథకాల ద్వారా మహిళా సాధికారతకు అడుగులు పడ్డాయి. వై.ఎస్.ఆర్. చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో పేద ప్రజల బతుకులలో వెలుగులు ప్రసరించాయి. వడ్డీ లేని రుణాలు ఇప్పించడం వలన గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక పుష్టి కలిగింది. ముప్పై ఒక్క లక్షల మంది నిరుపేద మహిళలకు జగన్ ప్రభుత్వం ఇంటి పట్టాలు మంజూరు చేసింది.అందులో ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లతో పదహారు లక్షల ఇల్లు... రోడ్లు, డ్రైనేజి, నీటి వసతి, వీధి దీపాలు వంటి పూర్తి మౌలిక సదుపాయాలతో ఏర్పాటయ్యాయి. ఒక్కో ఇంటి విలువ స్థలంతో కలిపి పది లక్షలనుండి పదుహైదు లక్షల వరకు చేరి, పేదవారికి సొంత ఇంటి కల నెరవేరింది.జగన్ సుపరిపాలనలో మరో ముందడుగు 2019 ఆగస్ట్ 15 నుంచి ప్రారంభమైన వలంటీర్ వ్యవస్థ. ఇక 2019 అక్టోబర్ 2న ప్రారంభించిన గ్రామ వార్డు సచివాలయాలు ఒక సువర్ణ అధ్యాయం. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే పెన్షన్, బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతోంది. సచివాలయాల ద్వారా ప్రజలకు రెవెన్యూ రికార్డులు, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, భూముల సర్వే సేవలు, ఆరోగ్యసేవలు ఏమాత్రం వ్యయ ప్రయాసలు లేకుండా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా వేగవంతంగా లభిస్తున్నాయి. గ్రామ స్థాయిలో తెచ్చిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్ర సామగ్రి సేవలు మార్కెట్ కంటే తక్కువ ధరలకు అందుతున్నాయి.వైద్య రంగంలో జగన్ ప్రభుత్వం తెచ్చిన గొప్ప మార్పు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు పైసా ఖర్చు లేకుండా అందించడం. నాడు నేడు పథకం కింద ప్రభుత్వ హాస్పిటల్స్ను ఆధునీకరించారు. మహానేత రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ సేవల పరిమితిని రూ.ఇరవై ఐదు లక్షలకు పెంచారు. చికిత్స సేవలు 1,059 నుంచి 3,250 వరకు పెంచారు. జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్ ద్వారా ప్రజలకు గడప గడపకు వైద్య సేవలు అందు తున్నాయి. ఇవి కాక శ్రీకాకుళం జిల్లాలో దశాబ్దాలుగా ఉద్దానం ప్రాంతంలో ఉన్న కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా వంశధార నది నుంచి 100 కిలోమీటర్లు పైప్లైన్ ద్వారా 807 గ్రామాలలోని ఏడు లక్షల మంది ప్రజలకు రక్షిత మంచినీరు అందించడం జరుగుతోంది. పలాసలో జగన్ తన పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారం 200 పడకల సూపర్ స్పెషాలిటీ మరియు కిడ్ని పరిశోధన హాస్పిటల్ నిర్మించడంతో అక్కడి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందుతున్నాయి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేసేనాటికి రాష్ట్రంలో 7 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండేవి. ఆయన శ్రీకాకుళం, కడప, ఒంగోలులో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించడానికి కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే నంద్యాల, ఏలూరు, రాజ మండ్రి, మచిలీపట్నం, విజయనగరంలలో ప్రారంభించారు. మిగిలిన 12 వైద్య కళాశాలలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.పేద పిల్లల అభివృద్ధికి విద్య అత్యవసరం అని జగన్ విశ్వసించారు. ఈ దిశగా జగన్ ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. నాడు నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసింది. పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులు ఐక్యరాజ్యసమితిలోని అధి కారులతో స్థిరమైన ఆర్థికాభివృద్ధిపై చర్చలో పాల్గొనడం సామాన్య మైన విషయం కాదు.పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చే సులభతర విధానంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో ఏపీకి రూ.32,800 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాగా, ప్రస్తుత ప్రభుత్వంలో రూ.1.03 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. చిత్తూరు జిల్లా కోటర్ల పల్లె గ్రామం దగ్గర స్మార్ట్ డీవీ ప్రాజెక్ట్, అనకాపల్లి అచ్యుతా పురం దగ్గర టైర్ల తయారీ కంపెనీ, తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురం దగ్గర బిర్లా క్యాస్టిక్ సోడా యూనిట్, వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ దగ్గర సెంచ్యురీ ప్యానల్స్ లాంటి పరిశ్రమలు వచ్చాయి.ఇంకా, అరబిందో, దివీస్ సంస్థల విస్తరణలతో కాకినాడ ఫార్మా యూనిట్గా ఎదుగుతోంది. విశాఖపట్నంలో ఇన్పోసిస్, విప్రో, భారత్ ఎలక్టాన్రిక్స్ తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఆంధ్ర రాష్ట్రానికి 972 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉన్నా కొత్తగా పోర్టులు గానీ, ఫిషింగ్ హార్బర్లు గానీ ఇదివరకు రాలేదు. ప్రస్తుతం జువ్వలదిన్నె, నిజాంపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటి వలన మత్స్యకార కుటుంబాల వారు చేపల వేటకు గుజరాత్ తీర ప్రాంతానికి వలసలు పోనవసరం లేదు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాలనలో పేద ప్రజలకోసం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. తన ప్రభుత్వం వలన తమ కుటుంబాలకు మంచి జరిగితేనే తనకు తోడుగా నిలవమని అడుగుతున్నారు. జగన్ ఒక సంఘ సంస్కర్తగా, ప్రజారంజక పాలకుడిగా పేరు పొందిన మాట వాస్తవం. ప్రజలతో జగన్ బంధం భావోద్వేగాలతో ముడిపడి ఉంది. అందుకే సిద్ధం యాత్రలో లక్షలాది మంది పిల్లలు, యువతీ యువకులు, వృద్ధులు, మహిళలు ఎర్రటి ఎండల్లో కూడా జగన్ కోసం నిరీక్షిస్తున్నారు. ఆయన కనబడితే కేరింతలు కొడుతూ జై జగన్ అని నినాదాలు చేస్తున్నారు. ఇవి జగన్ విజయానికి సంకేతాలు.– అమూరు రాఘవరెడ్డి ‘ జె.డి.ఎస్.డబ్ల్యూ. (రిటైర్డ్),– జి.సాంబశివారెడ్డి ‘ రిటైర్డ్ ప్రిన్సిపల్,యోగి వేమన యూనివర్సిటీ, కడప -
పుట్టుకతోనే మతం ముద్రా?!
డీఎన్ఏ వల్ల కలిగే శారీరక, మానసిక వైకల్యాలను సాంకేతికత ద్వారా గుర్తించవచ్చు, సరిదిద్దవచ్చు. కానీ ఒకరి విశ్వాస వ్యవస్థ వల్ల కలిగే బలహీనతలు శాశ్వతంగా ఉంటాయి. ఒక బిడ్డ జన్మించిన మతపు నమ్మకాలే అతడికి వాస్తవికంగా, నిజంగా మారిపోతాయి. పిల్లలు పెరిగే వాతావరణమే వారి మనస్తత్వాన్ని మలచే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే పుట్టినప్పుడే పిల్లలకు మతాన్ని అంటగట్టడం అనేది తిరోగమనంతో కూడిన, ప్రమాదకరమైన పద్ధతి. పిల్లల మతాన్ని నమోదు చేయడాన్ని తప్పనిసరి చేసే చట్టం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది. అది పితృస్వామ్యాన్నీ, మెజారిటీ వాదాన్నీ ప్రోత్సహిస్తుంది. వారి స్వేచ్ఛపై పరిమితులను విధిస్తుంది. వారి ఎదుగుదలను ఆపివేస్తుంది. ఆ కోణంలో చూస్తే ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. అందుకే మతాన్ని ‘వయోజనులకు’ సంబంధించిన అంశంగానే చూద్దాం.ఏప్రిల్ 5 నాటి ప్రముఖ వార్తాపత్రికలోని ఒక ప్రధాన శీర్షిక, ‘జననాల నమోదు కోసం తల్లిదండ్రుల మతాన్ని పొందుపరచనున్న ప్రభుత్వం’ అని చెబుతోంది. జనన మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023ను గత ఏడాది ఆగస్టు 11న పార్లమెంటు ఆమోదించింది. జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్), ఓటర్ల జాబితాలు, ఆధార్ నంబర్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆస్తి నమోదు, నోటిఫై చేసిన ఇతర అంశాలతో సహా వివిధ డేటాబేస్లను అప్డేట్ చేయ డానికి ఉపయోగించే జాతీయ స్థాయిలో జనన, మరణ డేటాబేస్ నిర్వహణను ఈ చట్టం తప్పనిసరి చేస్తోంది. పిల్లల మతానికి చెందిన కాలమ్లో తల్లిదండ్రులు వేర్వేరు మతాలకు చెందినవారైతే వారిద్దరి మతాన్ని నమోదు చేయడాన్ని కూడా ఈ సవరణ చట్టం తప్పనిసరి చేస్తోంది. ఇది, మోసపూరితంగా చట్టానికి ఉదారమైన రూపాన్ని ఇస్తోంది. కానీ మాకు సంబంధించి, పుట్టినప్పుడే పిల్లలకు మతాన్ని అంటగట్టడం అనేది తిరోగమనంతో కూడిన, ప్రమాదకరమైన పద్ధతి.వయోజనులు అనే అంశాన్ని ముందు స్పష్టం చేద్దాం. ఇది ఓటు వేయడానికి లేదా వివాహం చేసుకోవడానికి కావాల్సిన చట్టబద్ధమైన వయస్సు కాదు. ఇక్కడ వయోజనుడు అంటే వ్యక్తిగత నైతిక చట్రాన్ని అభివృద్ధి చేసుకునేంత స్థాయిలో ఎదిగిన వ్యక్తి అని అర్థం. మతం అనే పదం వ్యవస్థీకృతమైన మతాలను సూచిస్తుంది.చట్టపరంగా, వయోజనులు భౌతిక స్వభావం గల లక్షణాలను కలిగి ఉంటారు. అయితే, మతం పాక్షికంగా ఆధిభౌతికమైనది. పిల్లలు పొందిన డీఎన్ఏతో దానిని కలపడం అనేది వారి స్వేచ్ఛపై పరి మితులను విధిస్తుంది. వారి ఎదుగుదలను ఆపివేస్తుంది. ఆ కోణంలో చూస్తే ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. ఇది ప్రమాదకరమైన చట్టం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యపు విలువలను దెబ్బతీస్తుంది. అంతే కాక, మతతత్వం, పితృస్వామ్యం, మెజారిటీతత్వాలను ప్రోత్సహిస్తుంది. కొన్ని రాష్ట్రాలు ‘లవ్ జిహాద్’కు (హిందూ అమ్మాయితో ముస్లిం పురుషుడి సంబంధం లేదా వివాహం) వ్యతిరేకంగా చట్టాన్ని ఆమోదించిన వాస్తవాన్ని గమనిస్తే, ఆ నిబంధన అంత అమాయ కమైనది కాకపోవచ్చు. కనీసం, ఇది పితృస్వామికతతో కూడుకుని ఉన్నది.మొదటిది, మానవ హక్కులకు సంబంధించిన ప్రశ్న. ఓటింగ్ లేదా వివాహం గురించిన అవకాశాన్ని ఎంపిక చేసుకోవడానికి ఒక పిల్లవాడు యుక్తవయస్సుకు ఎదగవలసి ఉంటుంది. అయితే, ఓటు వేయమని లేదా వివాహం చేసుకోవాలని ఎవరినీ బలవంతం చేసే చట్టం లేదు. వయోజనుడైన బిడ్డకు ఎంపిక చేసుకోకుండా ఉండటానికి స్వేచ్ఛ ఉంది. కానీ వ్యవస్థీకృత మతం కొన్నిసార్లు ప్రచ్ఛన్నంగా, కానీ తరచుగా నేరుగానే చేయవలసినవీ, చేయకూడనివీ చెబుతుంటుంది. వాటితోపాటు, తప్పు ఒప్పులను విధిస్తుంది. పౌరాణిక సత్యాలు, తల్లిదండ్రులు, ఇతర పెద్దల సాంప్రదాయిక జ్ఞానం, సామాజిక ఒత్తిళ్లు, ‘సంస్కారం’ ఆశించే నియమాలు, ఆచారాలు, సంప్రదాయా లను అంగీకరించడం తప్ప అభాగ్యుడైన బిడ్డకు వేరే మార్గం లేదు. ఇటువంటి సూక్ష్మమైన, కానీ తీవ్రమైన బ్రెయిన్ వాష్ వల్ల, పిల్లల సహజసిద్ధమైన శాస్త్రీయ ఉధృతికి, ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ పరమైన ఎదుగుదలకు ఆటంకం కలుగుతుంది.పిల్లల మెదడు అభివృద్ధిలో 80 శాతం జీవితంలో మొదటి 1,000 రోజులలోనే జరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ కాలంలో ఛాందస, ఉదారవాద పరిసరాలు పిల్లల జీవితకాలం చెరగని వైఖరులకు కారణమవుతాయి. పైగా అవి స్థూలంగా తిరోగ మనం, అణచివేత, అమానవీయమైనవి కూడా కావచ్చు. ఏది సరైనది ఏది తప్పు అనే సొంత నైతిక చట్రం ఆధారంగా పిల్లల అభివృద్ధిని వారి పరిసరాలు ప్రభావితం చేస్తాయి. డీఎన్ఏ వల్ల కలిగే శారీరక, మానసిక వైకల్యాలను సాంకేతికత లేదా వైద్య శాస్త్రాల ద్వారా గుర్తించవచ్చు, సరిదిద్దవచ్చు. అయితే ఒకరి విశ్వాస వ్యవస్థ, మానవత్వం, సున్నితత్వం, ప్రవర్తన, ముందుగా నిర్ణయించిన ‘సత్యాల’ వల్ల కలిగే బలహీనతలు శాశ్వతంగా ఉంటాయి. ఒక బిడ్డ జన్మించిన మతపు నమ్మకాలే అతడికి వాస్తవికంగా, నిజంగా మారిపోతాయి.30 ఏళ్ల వయస్సు తర్వాత తాను సాగించిన ప్రయాణంలో, గౌతమ బుద్ధునికి ‘నేను ఇంకా జీవించాల్సిన జీవితం, అది నా స్వభావానికి ప్రతిబింబంగా ఉండితీరాలి’ అనిపించింది. ‘నా భ్రాంతిమయమైన కచ్చితత్వాల ఆశ్రయం నుండి, నా సొంత సరి హద్దుల నుండి నేను విముక్తి పొందాల్సి ఉంటుంది’ అని ఆయన భావించాడు.గౌతముడు ఆధ్యాత్మిక పరిపక్వత సాధించకుంటే, ఆయన తన అసలైన స్వభావాన్ని గుర్తించడంలో విఫలమై, నిజంగా తన సొంతం కాని నమ్మకాలు, అంతర్దృష్టిలో తెలియకుండానే చిక్కుకుని ఉండే వాడు. పర్యవసానంగా, ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యా కులైన వ్యక్తులకు ఓదార్పును అందించి దిశానిర్దేశం చేసిన మానవీయ జీవిత తత్వశాస్త్రం ప్రపంచానికి నిరాకరించబడి ఉండేది. ప్రతి ఒక్కరూ గౌతమ బుద్ధుడిని అనుకరించలేరు కాబట్టి, వారి సొంత ప్రత్యేక మార్గాన్ని ఏర్పరచుకునే పిల్లల సామర్థ్యానికి సామాజిక నిబంధనలు, చట్టం అధిగమించ లేని అడ్డంకులను సృష్టించకూడదు.స్థాపితమైన మతం శాస్త్రీయ ఆలోచనాపరులు, స్వేచ్ఛా ఆలోచనా పరులు, మేధావుల పట్ల విపరీతమైన క్రూర త్వాన్ని ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు, రోమన్ క్యాథలిక్ చర్చి, ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త అయిన గెలీలియోను మతవిశ్వాసిగా ముద్ర వేసి శిక్షకు గురిచేసింది. 1633లో, గెలీలియోపై చర్చి... సూర్యుడు ప్రపంచానికి కేంద్రం మరియు నిశ్చలమనీ; భూమి దాని చుట్టూ తిరుగుతుందనీ... తప్పుడు, మత గ్రంథాలకు విరుద్ధంగా భావించే నమ్మకాన్ని ఆమోదించాడనీ ఆరోపించింది. హాస్యాస్పదంగా, గెలీ లియో పేర్కొన్న ఈ సంచలనాత్మక ఆవిష్కరణలు న్యూటన్, ఐన్ స్టీన్ సిద్ధాంతాలకు పునాది వేయడమే కాకుండా, ఈ రోజు మనకు తెలిసిన ఆధునిక భౌతికశాస్త్ర అభివృద్ధికి మార్గం సుగమం చేశాయి.‘ద చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ద మ్యాన్’ అనే పదబంధం, విలియం వర్డ్స్వర్త్ కవిత ‘మై హార్ట్ లీప్స్ అప్’ నుండి ఉద్భవించింది. ఇది కేవలం కవిత్వ వ్యక్తీకరణ మాత్రమే కాదు. వరుసగా తరాలను రూపొందించడంలో పిల్లలు కీలకమైన పాత్ర పోషిస్తారనే లోతైన సత్యాన్ని ఇది వ్యక్తీకరుస్తుంది. పిల్లలు పెరిగే వాతావరణమే వారి మనస్తత్వాన్ని మలచే శక్తిని కలిగి ఉంటుంది. అంటే అదే వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ఈ ప్రభావం ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది స్వధర్మం ముసుగులో ఉన్న మతతత్వం, కులతత్వం, ద్వేషపు తాలూకు హింసాత్మక వ్యక్తీకరణల వంటి విభజన భావజాలాలను పిల్లల్లో శాశ్వతంగా కలిగించడంలోనో లేదా బాధితులుగా మార్చడంలోనో గణ నీయమైన ప్రభావాన్ని కలిగివుంది. ఇటువంటి ధోరణులు మెజారిటీ వాదాన్ని పెంపొందించవచ్చు. సామాజిక, ఆర్థిక అసమానతలకు వ్యక్తులను స్పందించకుండా చేయవచ్చు. శతాబ్దాల తరబడి వారసత్వంగా వచ్చిన నమ్మకాల్లో స్థిరపడిన మంచి ఉద్దేశం ఉన్న తల్లిదండ్రులు కూడా అనుకోకుండా తమ పిల్లల నిజమైన సారాన్ని అణచివేయవచ్చు. ఇక, చట్టసభ సభ్యులు క్రూరత్వానికి చెందిన అటువంటి రూపాలను శాశ్వతం చేసి సంస్థాగతీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.– అశోక్ లాల్ ‘ రచయిత, నాటకరంగ కళాకారుడు– నసీరుద్దీన్ షా ‘ హిందీ, ఉర్దూ నాటక రచయిత, నటుడు -
జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
పేదరికం అత్యంత బాధాక రమైనది. ప్రపంచంలో అత్యధి కులు పేదవారే. వారిని పేద రికం నుండి బయట పడేయ గలదీ, అభివృద్ధి వైపు నడప గలిగేదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే. దీనిని అర్థం చేసుకొన్నారు కాబట్టే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. ప్రజల విశ్వసనీయతను చూరగొన్నారు. ఇప్పుడు మరోమారు ప్రజా సేవ చేయడానికి అవకాశం ఇవ్వమని ఎన్నికల బరిలో దిగారు. పలు పబ్లిక్ మీటింగులూ, సుదీర్ఘ రాజకీయ యాత్రలతో విజయం వైపు నడుస్తున్నారు.ఇక ప్రతిపక్ష కూటమి నాయకుడు చంద్రబాబు మాత్రం అభద్రతా భావంతో ఎన్నికల్లో నానా తిప్పలు పడుతున్నారు. చెప్పుకోవడానికి ప్రజలకు తాను చేసింది ఏమీ లేదు కాబట్టి జగన్ ప్రభుత్వంపై దుష్ప్ర చారాలు చేస్తున్నారు. ఆయనకు ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు. జనసేన – బీజేపీ నాయకులూ, ఆ యా పార్టీల పరిస్థితీ కూడా ఇదే. అందుకే, టీడీపీ 2024 ఎన్నికల్లో ఘోరంగా మరలా ఓడిపోవడం తథ్యం. పెన్షనర్లలో 90 శాతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ఆర్థిక లాభాలు పొందుతున్న 40–60 ఏళ్ల వయస్సు స్త్రీలలో 90 శాతం, డ్వాక్రా మహిళల్లో 80 శాతం, మొత్తంగా స్త్రీలలో 90 శాతం వైఎస్సార్సీపీకే ఓటు వేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎస్సీ, ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లింలు, రెడ్లు, బ్రాహ్మణులు, అత్యధిక మంది బీసీలు వైఎస్సార్సీపీకే ఓట్లు వేసే పరిస్థితి ఉంది. కొంతమంది మధ్యతరగతి అర్బన్ ఓటర్లు మాత్రమే టీడీపీ కూటమికి ఓట్లు వేస్తారని అంటున్నారు. కాంగ్రెస్కు గతం కంటే అర శాతం మాత్రమే ఓట్లు పెరగవవచ్చు.అయోధ్యలో గుడి నిర్మాణం, కొన్ని జాతీయ రహదారులను నిర్మించడం తప్ప బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఏపీకి సంబంధించి... ఏపీకి స్పెషల్ స్టేటస్, రాయలసీమ – ఉత్తరాంధ్రకు ప్యాకేజీ, పోల వరానికి ని«ధులు వంటి అనేక వాగ్దానాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నెరవేర్చలేదు. ఇదీ బీజేపీ క్రెడిబిలిటీ!జVýæన్ మాత్రం పేదల ముఖ్య అవసరాల్ని తీరుస్తూ, అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని కూడా చేపడుతున్నారు. పేదల కొనుగోలు శక్తిని కోవిడ్ లాంటి క్లిష్ట సమయాల్లో కూడా పెంచగలిగారు. అందుకే 2019లో 12 శాతం ఉన్న పేదరికం 2024 నాటికి దాదాపు 4 శాతానికి తగ్గిపోయింది. జీఎస్టీ చెల్లింపుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచారు జగన్. జగన్ ప్రభుత్వం పేదలకు డీబీటీ కింద రూ. 2,70,000 కోట్లను, నాన్–డీబీటీ కింద ఇండ్లు, స్థలాలు వంటి రూపాల్లో రూ. 1,00,000 కోట్లకు పైగా ఇచ్చారు. మొత్తంగా నాలుగున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వం. అంతేగాక పాలనా వ్యవస్థలో, సంక్షేమ సేవల్లో, అభివృద్ధిలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిచేట్లు చేశారు వైఎస్ జగన్. ముఖ్యంగా గ్రామ/వార్డు సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ, ఆరోగ్య శ్రీకి రూ. 25 లక్షల వరకూ ప్రభుత్వ సాయాన్ని పెంచడం, వృద్ధాప్య పింఛన్ను రూ. 3 వేల వరకు పెంచడం, స్త్రీ సాధికారత కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడం; రాజకీయాల్లోనూ, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లోనూ... మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం; వలంటీర్ వ్యవస్థ, రైతుభరోసా, ఉచిత పంటల భీమా, ఆక్వా రైతులకు తక్కువ ధరకు విద్యుత్, అమూల్ ద్వారా ఎక్కువ పాల ధర ఇవ్వడం, భూముల సర్వే, భూపట్టాల ధ్రువీకరణ, నాడు – నేడుతో పాఠశాలల రూపు మార్చడం, ఇంగ్లీష్ మీడియం విద్య, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా కానుక... ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల మనసులను జగన్ దోచుకున్నారు.మరి చంద్రబాబు ఇలాంటి వేటినీ చేపట్టలేదు. ఇలాంటివి ఏ ఒక్కటీ చేశానని ఆయన చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఆయన ప్రతి ఎన్నికలప్పుడూ పలు పథకాల్ని ప్రకటించడం, ఎన్నికలు అయిపోయాక వాటి అమలు మరచిపోవడం చేసేవారు. అంతేగాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల విషయంలో మాట్లాడ కూడని మాటలు మాట్లాడేవారు. అందుకే ఆయన జనంతో సంబంధాల్ని మానసికంగా కోల్పోయారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయక పోవడం, పొదుపు సంఘాలకు రుణమాఫీ అమలు పరచక పోవడం, కొత్తగా జన్మించిన ఆడబిడ్డకు ‘మహాలక్ష్మి’ పథకం కింద ఇస్తానన్న డబ్బు ఇవ్వక పోవడం, ఇంటింటికీ ఒక ఉద్యోగం – ఉద్యోగం ఇవ్వలేకుంటే నెలకు రూ. 2 వేలు ఇస్తానని ఇవ్వక పోవడం; పేదలకు మూడు సెంట్ల నేల, ఇల్లు, బీసీలకు సబ్ ప్లాన్, స్త్రీ రక్షణ ఫోర్స్ ఏర్పాటు, పసుపు–కుంకుమ పథకం లాంటి వాటిని అమలు చేయకుండా జనాన్ని మోసగించారు. విద్యను, వైద్యాన్ని వ్యాపారీకరణ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బాబు వైఫల్యాలు ఎన్నో!బాబు ఘోర వైఫల్యం చెందిన అనంతరం పరి పాలనా పగ్గాలు చేపట్టిన జగన్ ఏపీలోని ప్రతి కుటుంబానికీ ఏదో ఒక రూపంలో మేలు చేశారు. అందుకే తాను ఏదైనా మేలు చేశానని నమ్మితేనే తనకు ఓటు వేయమని ఆయన ధైర్యంగా ప్రజలను అడుగు తున్నారు.ప్రొ‘‘ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి వ్యాసకర్త ఎస్వీ యూనివర్సిటీ చరిత్ర శాఖవిశ్రాంత ఆచార్యులు ‘ 98495 84324 -
ఇలాగేనా మాట్లాడేది?
‘‘ఇంతకుముందు వారి (కాంగ్రెస్) ప్రభుత్వం ఉన్నప్పుడు, దేశ సంపదపై మొదటి హక్కు ముస్లింలదే అని చెప్పారు. అంటే దీనర్థం ఈ సంపదనంతా పోగేసి, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి, చొరబాటుదారులకు పంచుతారని అర్థం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును చొరబాటుదారులకు ఇవ్వాలా? అది మీకు సమ్మతమేనా?’’ అని ఒక లౌకికవాద దేశానికి ప్రధానమంత్రి తోటి పౌరుల గురించి మాట్లాడడం తగినదేనా? ‘వారు’ కూడా సమాన హక్కులు, సమాన స్వేచ్ఛ ఉన్న మనందరిలోని వారు కారా? లేదంటే వారు విదేశీయులు, గ్రహాంతరవాసులూనా? అలా మాట్లాడటాన్ని ఆయన్ని అభిమానించేవారు సమర్థిస్తున్నట్లు్ల అనిపిస్తోంది. లేకుంటే ఆయన అలా అనటాన్ని ఆపి ఉండేవారా? తనను సరిదిద్దుకునేవారా?ప్రధానమంత్రులు ఎల్లవేళలా సరైన, గౌరవ ప్రదమైన పనే చేస్తారన్న భావన ఉన్న యుగంలో నేను పెరిగాను. అంతేకాదు, ప్రధాని చెప్పారంటే ఇక అది సరైనది అయినట్లే! మాటల్లో పొల్లుపోవటం అత్యంత సహజం అయి నప్పటికీ, జవహర్లాల్ నెహ్రూకు కూడా అలా జరిగేదంటే నా తల్లి తండ్రులు అస్సలు నమ్మేవారు కారు. ఆ పాతకాలపు ప్రామాణికతకు ఆయనొక శ్రేష్ఠమైన నమూనాగా పరిగణన పొందారు. ‘యాభైలు’, ‘అరవైల’ నుంచి మనం చాలా దూరం ప్రయాణించి వచ్చాం. ఈ రోజుల్లో ఒక రాజకీయ నాయకుడి గురించి మీరు ఊహించరానిదేమీ ఉండదు. ఏ ఉత్కృష్టులైన వారినో పక్కన పెడితే ప్రధానమంత్రులూ ఇక ఏమాత్రం భిన్నమైన వ్యక్తులుగా మిగిలి లేరు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి దశాబ్దంలో వారి పట్ల కనిపించిన సహజమైన గౌరవభావన, వారంటే ఉండే కొద్దో గొప్పో ఆరాధన పూర్తిగా కనుమరుగయ్యాయి. ‘సబ్ చోర్ హై’ (అందరూ దొంగలే) అన్నదే ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న నమ్మకం అయింది.ఇప్పటికి కూడా, నా అత్యంత నిరాశావాద, చీకటిమయ మనః స్థితుల్లో సైతం– తన సొంత, తోటి పౌరులలో ఒక గణనీయమైన వర్గం మీద ఒక ప్రధాని దాడి చేస్తూ, వారిని పిశాచాలుగా చూపటం వింటానని నేనెప్పుడూ అనుకోలేదు. అదేపనిగా అందుకోసం మార్గా లను కనుగొంటారని కూడా! ఆయనను అభిమానించేవారు తెలివిగా దీనిని... అదేపనిగా అని కాక, అనేకసార్లు అని అనవచ్చు. ఆయన అలా చేయటాన్ని వారు ఆనందిస్తున్నట్లు, సమర్థిస్తున్నట్లు, సహేతుక మేనని భావిస్తున్నట్లు అనిపిస్తోంది. లేకుంటే కచ్చితంగా ఆయన అలా చేయటాన్ని ఆపి ఉండేవారా? తనను తను సరిదిద్దుకునేవారా? బహుశా పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేసేవారా? కానీ అలా జరగక పోగా, అవి పునరుద్ఘాటనలు అవుతున్నాయి. బహిరంగంగా, శక్తిమంతంగా, స్థానాలను మార్చుకుంటూ కొనసాగుతున్నాయి. మొదట చెప్పినదానినే ఉన్నది ఉన్నట్లుగా మళ్లొకసారి చెబుతాను. నా ప్రతిస్పందన అర్థంచేసుకోదగినదా లేక అతిశయోక్తితో కూడినదా అని మీకై మీరు ఆలోచించండి. ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ పత్రికలో వచ్చిన దానిని బట్టి హిందీలో ఆయన మాట్లాడిన మాటలు సరిగ్గా ఇవే: ‘‘పెహ్లే జబ్ ఉన్కీ సర్కార్ థీ, ఉన్హోనే కహా థా కీ దేశ్ కీ సంపతీ పర్ పెహ్లా అధికార్ ముసల్మానోం కా హై. ఇస్కా మత్లబ్, యే సంపతీ ఇకఠ్ఠీ కర్కే కిస్కో బాటేంగే? జిన్కే జ్యాదా బచ్చే హై, ఉన్కో బాటేంగే, ఘుస్పైఠియోన్ కో బాటేంగే. క్యా ఆప్కీ మెహనత్ కీ కమాయి కా పైసా ఘుస్పైఠియోన్ కో దియా జాయేగా? ఆప్కో మంజూర్ హై యే?’’ (‘ఇంతకుముందు వారి (కాంగ్రెస్) ప్రభుత్వం ఉన్నప్పుడు, దేశ సంపదపై మొదటి హక్కు ముస్లింలదే అని చెప్పారు. అంటే దీనర్థం ఈ సంపదనంతా పోగేసి, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి, చొరబాటుదారులకు పంచుతారని అర్థం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును చొరబాటుదారులకు ఇవ్వాలా? అది మీకు సమ్మతమేనా?’)మరి, ‘ఎక్కువమంది పిల్లలను’ కలిగివున్న ఆ వ్యక్తులు ఎవరు? ‘చొరబాటుదారులు’ అని పిలవబడుతున్న ఈ వ్యక్తులు ఎవరు? స్పష్టంగానే ఉంది కదా, మొదటి వాక్యాన్ని బట్టి ఇంకా స్పష్టంగా లేదా? ఇంకా ఏమైనా సందేహమా? అలాగే పైన పేర్కొన్న ‘ముసల్మా నులు’ ఎవరు? వారు భారతదేశ ముస్లింలు కారా? మన తోటి పౌరులు కారా? సమాన హక్కులు, సమాన స్వేచ్ఛ కలిగి ఉన్న మనందరిలోని వారు కారా? లేదంటే వారు విదేశీయులు, బయటి వ్యక్తులు, గ్రహాంతరవాసులూనా?ఇప్పుడు చెప్పండి, నా ప్రశ్నకు మీ సమాధానం ఏమిటి? దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తే నేను అమాయకుడిని అవుతానా? ఇంకా చెప్పాలంటే కదిలిపోవటానికి ? లేదా ఆ విధమైన ఆరోపణలను మీరు మన ప్రధా నులు ఎవరినుంచైనా విని ఉన్నారా?డోనాల్డ్ ట్రంప్ తరచూ ఇలా మాట్లాడ్డం నాకు తెలుసు. ఆయన అలా మాట్లాడినప్పుడు మనకు వికారం పుడుతుంది. 1960లలో బ్రిటన్లో ఇనాక్ పావెల్ ఇలాగే మాట్లాడితే అక్కడి ఆధిపత్య సమాజ సమూహం ఆయన మాటల్ని పట్టించుకోలేదు. కానీ మన తరంలోని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్లు, సాధ్వీ రుతంభరలు ఇటువంటి వాక్చాతు ర్యాన్ని ఆస్వాదిస్తారనడంలో సందేహమే లేదు. అయితే అందుకు వారు తిరిగి పొందేది ధిక్కారాన్ని, ఎగతాళిని మాత్రమే! నా బోళాతనం బహుశా మీ దృష్టిలో తీవ్రంగా దెబ్బతిని ఉంటుందని నేను అంగీకరిస్తున్నప్పటికీ, ఇప్పటికైతే నన్ను ఆశ్చర్యపరిచే విషయం వేరొకటి ఉంది. అది మన మీడియా స్పందన. ఒకవేళ అలాంటిదేమైనా ఉండివుంటే, నాకైతే ఆందోళన కనబడలేదు, ఏహ్యభావం కనబడలేదన్నదైతే నిశ్చయం. బహుశా నేను చదవాల్సిన పత్రికల్ని చదవలేదేమో! చూడాల్సిన టీవీ చానెళ్లను చూడలేదేమో! కానీ నాకు అనిపించింది ఏమిటంటే, చెప్పినదాన్ని మౌనంగా అంగీ కరించారని! అంగీకరించకపోయినా, కనీసం దానిమీద వ్యాఖ్యానించ నైనా లేదు. విమర్శ అయితే అసలు చేయలేదు. అది ఖండనార్హమైనది కాదని నేను అనుకుంటే తప్ప నాకది దాదాపుగా నమ్మకశ్యంగా లేదు. దీన్ని కూడా మీరు అంగీకరిస్తారా?క్షమించండి. నేను ఈరోజు చాలా ప్రశ్నలు సంధించి మీకు అతి కొద్ది సమాధానాలు మాత్రమే ఇచ్చాను. కానీ నా అభిప్రాయాలను మీపై రుద్దడం నాకు ఇష్టం లేదు. బదులుగా, మీరేం అనుకుంటున్నారో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. కనుక మరొక చివరి ప్రశ్నకు నన్ను మన్నించండి: ఒక లౌకిక ప్రజాస్వామ్య దేశానికి ప్రధాన మంత్రి అయిన వారు భిన్న మత విశ్వాసాన్ని కలిగిన తోటి పౌరుల గురించి ఇలా మాట్లాడడం తగినదేనా? మరింత కచ్చితంగా అడగాలంటే, నైతికంగా సరైనదేనా?కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
శ్రామిక వర్గ మహోపాధ్యాయుడు
ప్రపంచాన్ని మలుపుతిప్పిన ఘటనల్లో ఒకటి కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ జననం. జర్మనీ (ప్రష్యా)లో పుట్టిన ఆయన విద్యాభ్యాసం అనంతరం పాత్రికేయ వృత్తిని ఎంచుకున్నారు. కొంతకాలం తర్వాత ఫ్రాన్స్ వెళ్ళారు. అక్కడే ఆయన జీవితకాల ఉద్యమ సిద్ధాంత మిత్రుడు ఫ్రెడరిక్ ఏంగిల్స్ను కలుసు కున్నారు. ఫ్రాన్స్ ఆయన్ని దేశం నుంచి బహిష్కరించడంతో ముందు బెల్జియం ఆ తర్వాత ఇంగ్లండ్ (లండన్) వెళ్లి మిగిలిన జీవితమంతా తన భార్యాబిడ్డలతో అక్కడే గడిపారు. మార్క్స్ తన జీవితకాల మిత్రుడు, సహచరుడు, సిద్ధాంతకర్త అయిన ఫ్రెడరిక్ ఏంగిల్స్తో కలిసి ‘కమ్యూ నిస్టు లీగు’ ఏర్పాటు చేసి 1848లో ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను ఏంగిల్స్తో కలిసి రాశారు. 1867లో ‘దాస్ క్యాపి టల్’ మొదటి వాల్యూమ్ను ప్రచురించారు.మానవ సమాజ సమూహ సంబంధాలు అన్నిటినీ కార్ల్ మార్క్స్ ‘ఫ్రెడరిక్ ఏంగిల్స్లు శాస్త్రీయంగా నిరూ పించారు. ఆదిమ కమ్యూనిస్టు సమాజం నుండి బానిస సమాజం, బానిస సమాజం నుండి ఫ్యూడల్ సమాజం, ఫ్యూడల్ భూస్వామ్య సమాజం నుండి పెట్టుబడిదారీ సమాజం, పెట్టుబడిదారీ సమాజం నుండి సోషలిస్టు సమాజానికి మానవ సమాజం ఎలా పరిణామం చెందు తుందో... సోషలిస్టు సమాజం నుండి అంతిమంగా కమ్యూనిస్టు సమాజం వైపు వర్గహిత సమాజం వైపు ఎలా మానవ సమాజం ప్రయాణిస్తుందో శాస్త్రీయంగా మార్క్స్–ఏంగెల్స్లు నిరూపించారు, సిద్ధాంతీకరించారు. మానవ సమాజ పరిణామ క్రమంలో శ్రమ పాత్రనూ, శ్రమ ఔన్నత్యాన్నీ, సర్వసంపదలకు శ్రమే మూలం అన్న విషయాన్నీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో సిద్ధాంతీకరించిన తత్వవేత్తలు కారల్ మార్క్స్, ఏంగెల్స్లు. కార్మికుని అదనపు శ్రమే ‘పెట్టుబడి’ అనే విషయాన్ని బహుముఖ కోణాల నుంచి పరిశోధన చేసి ‘దాస్ క్యాపిటల్’ను ప్రపంచానికి అందించారు. గతి తర్కాన్ని, చారిత్రిక భౌతిక వాదాన్నీ, తలకిందులుగా ఉన్న హెగెల్ తత్వ శాస్త్రాన్నీ, అందులోని భావవాదాన్నీ సరిదిద్ది భౌతిక వాదం తన కాళ్ళ మీద తను నిలబడే టట్లుగా రూపొందించారు మార్క్స్. అభివృద్ధి నిరోధకమైన పాత వ్యవస్థ, అభివృద్ధి కరమైనటువంటి కొత్త వ్యవస్థను అనుమతించదు. అందుచే బల ప్రయోగం ద్వారా పాత అభివృద్ధి నిరోధక వ్యవస్థను నెట్టివేయాలనీ, కూలదోయాలనీ మార్క్స్ శాస్త్రీయంగా వివరించారు. మార్క్స్ తదనంతరం పెట్టుబడిదారీ వ్యవస్థ సామ్రాజ్యవాద రూపం తీసుకున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నత రూపమే సామ్రాజ్యవాదం అని లెనిన్ సిద్ధాంతీకరించారు. మార్క్సిజాన్ని రష్యా పరిస్థితులకు అన్వయించి కార్మిక వర్గ నాయకత్వాన, కర్షకవర్గం మైత్రితో లెనిన్ సోషలిస్ట్ విప్లవాన్ని విజయవంతం చేశారు.– మన్నవ హరిప్రసాద్, సీపీఐ (ఎమ్ఎల్) రెడ్ స్టార్ పాలిట్ బ్యూరో సభ్యుడు(నేడు కారల్ మార్క్స్ జయంతి) -
సాంఘిక విప్లవ నాయకుడు
ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డికి లభి స్తున్న అపూర్వ ప్రజా స్పందనను చూస్తుంటే... తెలుగు రాష్ట్రాలను ఇంతవరకూ పాలించిన ముఖ్యమంత్రులెవరికీ ఇంతటి ప్రజాదరణ లేదని పిస్తోంది. దీనికంతటికీ ఆయన ప్రజల కోసం చేసిన పనులే కారణం అన్నది స్పష్టం. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు సంక్షేమ పథకా లను ప్రవేశపెట్టి వాటిని అవసరమున్న ప్రజలకు అందజేయడం మంచి పాలకుల లక్షణం. మధ్య దళారుల వ్యవస్థ లేకుండా వారికి అందజేయవలసిన డబ్బును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసి అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా చేసిన ఘనత జగన్దే. ప్రజాస్వామ్యానికి సరైన నిర్వచనమైన ‘ప్రజల యొక్క, ప్రజల కొరకు. ప్రజల చేత’ పాలన సాగించడం జగన్ సాధించిన అద్భుత విజయం. గ్రామ వలంటీర్ వ్యవ స్థను ప్రవేశపెట్టి ప్రజల ముంగిట్లోకి పాలనను, ప్రభుత్వ పథకాలను చేరేట్టు చేయడం మరో గొప్ప విజయం. కార్పొరేట్ శక్తులు, రాజకీయ అహంభావ నిరంకుశ శక్తులను మినహాయిస్తే... జగన్ వల్ల లాభపడని ఒక్క కుటుంబమూ ఆంధ్రప్రదేశ్లో కనబడదు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిన కుటుంబానికి ఆర్థిక సాయం చేయడమే కాకుండా... పిల్లలకు ఉచితంగా నాణ్యమైన ఆంగ్లమాధ్యమ విద్యను అందిస్తున్న ఘనత జగన్దే. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కార్పొరేట్ విద్యను తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే అందించడం ఏపీలోనే కనిపిస్తున్నది. ఇది ప్రభుత్వ విద్యా విధానానికీ గౌరవం కల్పించడంతోపాటూ బహుజన వర్గాలకు పట్టాభిషేకం చేయడం లాంటిదే. సామాజిక న్యాయం తద్వారా సామాజిక మార్పుకు దోహదం చేసే అందరికీ ఉచిత కార్పొరేట్ విద్య, ఉచితౖ వెద్యం, పాలనా రంగంలో బహుజన వర్గాలకు సముచిత స్థానం ఇవ్వడం లాంటివన్నీ ఈ ఐదేళ్ళ పాలనలో సాగాయన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఎన్నికల ప్రచారానికి జగన్ ఎక్కడికి వెళ్ళినా అసంఖ్యాక జనం! మండుటెండ ల్లోనూ రోడ్లపై నిలబడి ఎదురుచూస్తూ నీరాజనాలు!!బసవేశ్వరుడు, నారాయణగురు, రవిదాస్ చమార్, పెరియార్ రామ స్వామి, ఫూలే, అంబేడ్కర్ లాంటి తత్త్వవేత్తలను చూశాము. జాషువా లాంటి సాంఘిక విప్లవ కవులను చూశాము. సాహు మహరాజ్ లాంటి సామాజిక విప్లవ పాలకులను చూశాము. నెహ్రూ లాంటి సెక్యులర్, సెమీ సోషలిస్ట్ నాయకులను చూశాము. జగన్ ఐదేళ్ల పాలన వీళ్లందరి సమాహారంగా కనిపిస్తోంది. అందుకే ఏపీలో సామాజిక మార్పుల దిశగా బలమైన పునాదులు పడి గుణాత్మక మార్పులు వస్తున్నాయి. అయితే టీడీపీ–జనసేన–బీజేపీల కూటమికి జగన్ పాలన నచ్చడంలేదు. ఆయనపై అసత్య ప్రచారంతో దాడి చేస్తోంది. తమ అసంబద్ధ మేనిఫెస్టోతో ప్రజ లను మభ్యపెడుతోంది. జగన్ మాత్రం ఐదేళ్ళలో తాను చేసిన పనులను నమ్ముకొనే ప్రజాస్వామిక పద్ధతిలో ప్రచార రథాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలు జగన్ మరోసారి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని నమ్మి జగనన్ననే అఖండ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్కు లభిస్తున్న జనాదరణను సహించలేక ఆయన్ని భౌతికంగా తొలగించాలనుకునే రాజకీయ దివాలాకోరుతనాన్ని ప్రతిపక్షాలు ప్రదర్శించడం శోచనీయం. ఎవరెన్ని దాడులు చేసినా, రాజనీతిని రాజభీతిగా మార్చినా జగన్ విజయాన్ని ఆపలేవు. ఎందుకంటే జగన్ ‘సెక్యులరిజం, సోషలిజం’ భావాలను హృదయానికి హత్తుకొని అన్ని వర్గాల, అన్ని వర్ణాల ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కోసం ప్రజాస్వామిక పాలనను అందిస్తున్న సాంఘిక విప్లవ నాయకుడు!!డా‘‘ కాలువ మల్లయ్య వ్యాసకర్త ప్రముఖ కథారచయిత ‘ 91829 18567 -
గెలవలేని యుద్ధం చేసిన పాక్
కార్గిల్ యుద్ధం జరిగి పాతికేళ్లవుతోంది. మే 3న పాక్ చొరబాట్లను మొదటిసారి కనుగొన్న తర్వాత, జూలై 26న భారత్ తన విజయాన్ని ప్రకటించ డానికి ముందు దాదాపు మూడు నెలలు నెత్తుటి యుద్ధం కొనసాగింది. 18,000 అడుగుల ఎత్తులో, ఎన్నో సవాళ్లతో కూడిన ఈ ప్రాంతంలో యుద్ధం అనేది సైన్యం లాఘవానికి నిజమైన పరీక్ష. అధికారులు, సైనికులు మానవాతీత దృఢత్వాన్ని ప్రదర్శించడం, దేశం కోసం ప్రాణాలు ధారపోయడానికి కూడా సిద్ధమైనందునే విజయం సాధ్యపడింది. భారత్కు వ్యతిరేకంగా పాక్ సైనిక పంథాను అనుసరించడం వల్ల ఎటువంటి లాభం లేదని కార్గిల్ విధ్వంసం గట్టిగా బయటపెట్టింది. స్థాయిలోనూ, విస్తృతిలోనూ పరిమితమే అయినప్పటికీ, కార్గిల్ రెండు దేశాలలో లోతైన విశ్లేషణను ప్రేరేపించింది.1999 ఫిబ్రవరి 20న, నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్లో చరిత్రాత్మక దౌత్య పర్యటనకు బయలుదేరారు. మరుసటి రోజు, ఇద్దరు ప్రధానులు లాహోర్ డిక్లరేషన్ పై సంతకం చేశారు. రెండు దేశాల మధ్య శాంతి, స్థిరత్వం, తమ ప్రజల పురోగతి, శ్రేయస్సు గురించిన భాగస్వామ్య దార్శనికతను ఇరువురు నేతలూ ప్రతిబింబించారు.ఉద్రిక్తతలను పెంచిన 1998 అణు పరీక్షల ఛాయల నుండి ఉద్భవించిన ఈ ప్రకటన, సరిహద్దుకు ఇరువైపులా చక్కటి ప్రశంసలు పొందింది. అయితే విచారకరంగా, ఈ ఆశావాదం భ్రమగా మారింది. వాఘా సరిహద్దులో వాజ్పేయికి షరీఫ్ అభివాదం చేస్తున్నప్పుడే, పాకిస్తాన్ సైనికులు కార్గిల్ సెక్టార్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)ను దాటి ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయిన టోలోలింగ్, టైగర్ హిల్ వంటి పర్వత శిఖరాల్లో కందకాలు తవ్వుతున్నారు.18,000 అడుగుల ఎత్తులో ఉన్న కార్గిల్ భౌగోళికపరంగా అసాధారణమైన సవాళ్లతో కూడినది. అటువంటి విపరీతమైన పరిస్థి తులలో యుద్ధం అనేది సైన్యం లాఘవానికి నిజమైన పరీక్ష. అయితే అధికారులు, సైనికులు మానవాతీత దృఢత్వాన్ని ప్రదర్శించడం, దేశం కోసం ప్రాణాలు ధారపోయడానికి కూడా సిద్ధమైనందునే విజయం సాధ్యపడింది.మే 3న పాక్ చొరబాట్లను ప్రాథమికంగా కనుగొన్న తర్వాత, జూలై 26న భారతదేశం విజయాన్ని ప్రకటించడానికి ముందు దాదాపు మూడు నెలల కాలం కార్గిల్లో నెత్తుటి యుద్ధం కొనసాగింది. పాకిస్తాన్ సైన్యం ఈ పోరాటంలో తన ప్రమేయాన్ని నిరాకరించింది, నేలకొరిగిన తన సైనికులను గుర్తించడానికి నిరాకరించింది. ఇది వారి త్యాగానికి అంతిమ అవమానం అని చెప్పాలి.స్థాయిలోనూ, భౌగోళిక విస్తృతిలోనూ పరిమితమే అయినప్ప టికీ, కార్గిల్ యుద్ధం రెండు దేశాలలో లోతైన వ్యూహాత్మక విశ్లేషణను ప్రేరేపించింది. వేసుకున్న లెక్కలు తప్పడంపై పాక్లోనూ; నిఘా వైఫల్యం కారణంగా చొరబాట్లను గుర్తించలేక పోవడంతో సహా, జాతీయ భద్రతా అంతరాలపై భారత్లోనూ పెద్ద చర్చ జరిగింది.యుద్ధం ముగిసిన మూడు రోజుల తర్వాత, పాకిస్తాన్ దురాక్ర మణకు దారితీసిన సంఘటనలను సమీక్షించడానికీ, సాయుధ చొర బాట్లకు వ్యతిరేకంగా జాతీయ భద్రతను కాపాడే చర్యలను సిఫార్సు చేయడానికీ భారత ప్రభుత్వం కార్గిల్ సమీక్షా కమిటీ (కేఆర్సీ)ని ఏర్పాటు చేసింది. రాజకీయ, అధికార, సైనిక, నిఘా సంస్థలు యథా తథ స్థితిపై స్వార్థ ఆసక్తిని పెంచుకున్నాయని ఈ కమిటీ పేర్కొంది. కార్గిల్ అనుభవం, కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం, అణుబాంబుతో కూడిన భద్రతా వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని జాతీయ భద్రతా వ్యవస్థపై సమగ్ర సమీక్ష అవసరమని కమిటీ నొక్కి చెప్పింది.కేఆర్సీని అనుసరించి వచ్చిన మంత్రుల బృందం నివేదిక, జాతీయ భద్రతా సమస్యలపై స్వతంత్ర భారతదేశంలో చేపట్టిన అత్యంత సమగ్ర పరిశీలన అని చెప్పవచ్చు. గూఢచార యంత్రాంగం, అంతర్గత భద్రత, సరిహద్దు నిర్వహణ. రక్షణ నిర్వహణను అంచనా వేయడానికి నాలుగు టాస్క్ఫోర్స్లను ఏర్పాటు చేశారు.ఈ రెండు నివేదికలు జాతీయ భద్రతా నిర్వహణలో అనేక మార్పులకు దారితీశాయి. కేంద్రీకృత కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ను నిర్వహించడానికి 2004లో జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థను ఏర్పర్చారు. సైన్యం నిర్దిష్ట గూఢచార అవసరాలను తీర్చడానికి రక్షణ నిఘా సంస్థ ఏర్పడింది. మెరుగైన ఇంటర్–ఏజెన్సీ సమాచారం భాగస్వామ్యాన్ని, సమన్వయాన్ని పెంపొందించడానికి బహుళ ఏజెన్సీ కేంద్రం కూడా ఏర్పాటయింది. రక్షణ వ్యవస్థ కొంత పునర్ని ర్మాణానికి గురైంది. ఇందులో సమీకృత రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయడం, వ్యూహాత్మక బలగాలు, అండమాన్ నికోబార్ కమాండ్ల స్థాపన, త్రివిధ బలగాలకు ఆర్థిక, పరిపాలనా అధికారాలు పంపిణీ చేయడం వంటివి ఉన్నాయి. మంత్రుల బృందం సిఫార్సు చేసిన విధంగా 2020లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం జరిగింది.కొన్ని సిఫార్సులు పాక్షికంగా మాత్రమే అమలైనాయి. ‘ఒకే సరి హద్దులో అనేక బలగాలు ఉండటం కూడా బలగాల జవాబు దారీతనం లోపానికి దారితీసిం’దని మంత్రుల బృందం నివేదిక పేర్కొంది. ‘జవాబుదారీతనాన్ని తేవడానికి, సరిహద్దు వద్ద బలగాల మోహరింపును పరిగణనలోకి తీసుకునేటప్పుడు ‘ఒక సరిహద్దు, ఒక బలగం’ సూత్రాన్ని అవలంబించవచ్చు’ అని సూచించింది. ఈ సూత్రాన్ని ఇంకా చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర వర్తింపజేయాల్సే ఉంది. ఇక్కడ భారత సైన్యం, ఇండో–టిబెటన్ సరిహద్దు పోలీసులు వేర్వేరు కమాండ్ ఏర్పాట్లలో మోహరించారు.జాతీయ భద్రతా సిద్ధాంతం లేకపోవడం, ఆర్థిక సంవత్సరానికి మించి సైన్యానికి నిధుల నిబద్ధత లేకపోవడం వంటి బలహీనతలను మంత్రుల బృందం ఎత్తి చూపింది. పరిష్కరించాల్సిన ఇతర సమస్యలు ఏవంటే, త్రివిధ బలగాల హెడ్క్వార్టర్స్ను ప్రభుత్వంలో మరింతగా ఏకీకృతం చేయడం, సాయుధ దళాలు ఉమ్మడిగా ఉండటం. ఇప్పటికీ ఈ లోటుపాట్లు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ వైపు కూడా, కార్గిల్ పరాజయంపై చాలా బహిరంగ చర్చ జరిగింది. ఆ యుద్ధం పౌర–సైనిక సంబంధాల వక్ర స్వభావాన్ని బహిర్గతం చేసింది. సైనిక లక్ష్యాలను రాజకీయ, దౌత్యపరమైన పరిశీలనలు లేకుండా రూపొందించారు. నసీమ్ జెహ్రా రాసిన ‘ఫ్రమ్ కార్గిల్ టు ది కూ’ పుస్తకంలో, మే 17న సైన్యం అప్పటి ప్రధాని షరీఫ్కు కార్గిల్ సైనిక చర్యపై తొలి వివరణాత్మక సమాచారాన్ని అందించిందని రాశారు. ఆ సమయానికి, సైనికులు అప్పటికే నియంత్రణ రేఖ వెంబడి స్థానాలను ఆక్రమించారు.యుద్ధం తరువాత, దానికి పన్నాగం పన్నిన జనరల్స్ పాత్ర పరిశీలనలోకి రావాలి. దీనికి బదులుగా, పాకిస్తాన్ సైన్యం రాజకీయ నాయకత్వానికి నిందను ఆపాదించడానికి ప్రయత్నించింది. పెరుగుతున్న ఈ అపనమ్మకం చివరకు 1999 అక్టోబర్లో షరీఫ్ను అధికారం నుండి తొలగించిన సైనిక కుట్రకు దారితీసింది.భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ సైనిక పంథాను ఉపయోగించడం వల్ల ఎటువంటి లాభం లేదని కార్గిల్ విధ్వంసం గట్టిగా బయట పెట్టింది. భారత్తో ఉద్రిక్తతలను తగ్గించడానికి మార్గాలను కనుగొనే బదులు, పాకిస్తాన్ సైన్యం వెనక్కితగ్గి ఉగ్రవాదులను ఉపయోగించింది. యుద్ధం తర్వాత జమ్మూకశ్మీర్లో హింస పెరిగింది. కశ్మీర్పై మక్కువ పెంచుకోవడం మానుకోవాలనీ, బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణంపై పాకిస్తాన్ దృష్టి పెట్టాలనీ పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. దేశం తన పరిమితులు, ప్రాధాన్యతల గురించి నిర్దాక్షిణ్యంగా వాస్తవికంగా మారాలని పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త షాహిద్ అమీన్ రాశారు. ఏమైనప్పటికీ, పాకిస్తాన్ను గెలవలేని సంఘర్షణలోకి నెట్టిన ప్రధాన సమస్యలు పెద్దగా పరిష్కారం కాలేదు. సైన్యం ఇప్ప టికీ దేశ పగ్గాలను నియంత్రిస్తోంది. కశ్మీర్పై వాగాడంబరం కొనసాగు తోంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. పైగా, ఉగ్రవాద సంస్థ లకు పాక్ ప్రభుత్వ మద్దతు కొనసాగుతోంది.నేడు, భారతదేశం చాలా శక్తిమంతమైన దేశం. ఇప్పుడు కార్గిల్ తరహా ఘటన అసంభవంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, 1999 సంఘర్షణ పాకిస్తాన్ రాజ్యయంత్రాంగపు నిర్లక్ష్య స్థాయిని వెల్లడి చేసింది. ఆ దేశంలోని ప్రస్తుత పరిస్థితులు ఆ ముద్రను తొలగించ డానికి పెద్దగా అనుకూలించవు.లెఫ్ట్నెంట్ జనరల్ డీఎస్ హుడా (రిటైర్డ్) వ్యాసకర్త మాజీ నార్తర్న్ ఆర్మీ కమాండర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
దీనికి జవాబు లేదా బాబూ?
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి కొత్త చిక్కు వచ్చిపడింది. ముస్లిం మైనారిటీలకు అమలు చేస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ బీజేపీ అగ్రనేత ఒకరు ప్రకటించడం ఇందుకు కారణం. బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ ఈ ప్రకటనను ఖండించకపోవడం ముస్లిమ్ మైనారి టీలు గమనిస్తున్నారు. అందుకే ఇప్పటికే అరకొ రగా ఉన్న ముస్లిమ్ల మద్దతు తమ పార్టీ పూర్తిగా కోల్పోతుందని టీడీపీ భయపడుతోంది.ఇటీవల ఓ బహిరంగ సభలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ముస్లిమ్ మైనారిటీలకు అమలు చేస్తోన్న నాలుగు శాతం రిజర్వేషన్లను తప్పుపట్టారు. ఈసారి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లిమ్ల రిజ ర్వేషన్లను రద్దు చేస్తామని తెగేసి చెప్పారు. లోక్ సభకు ఇప్పటికే జరిగిన రెండు విడతల పోలింగ్లో బీజేపీకి నిరాశే ఎదురైనట్లు సంకేతాలుఅందుతున్నాయి. దీంతో కులాలకతీతంగా యావత్ హిందూ ఓటు బ్యాంకును కమలం పార్టీ వైపు మళ్లించడానికి బీజేపీ అగ్రనేతలు ముస్లిమ్ల రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించారని భావిస్తున్నారు.ముస్లిమ్ల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయడానికి 2005లో కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేందర్ సచార్ నాయకత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం ఏడుగురు సభ్యులున్న సచార్ కమిటీ 2006లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సచార్ కమిటీ నివేదిక ప్రకారం భారతదేశ జనాభాలో ముస్లిమ్లు 14 శాతం ఉన్నారు. అయితే అధికార యంత్రాంగంలో ముస్లిమ్ల శాతం కేవలం 2.5 శాతం మాత్రమే. దళితులు, ఆదివాసీల కంటే దారుణ పరిస్థితుల్లో ముస్లి మ్లు ఉన్నారు. చదువు లేకపోవడమే ముస్లిమ్ సమాజం ఎదుర్కొంటున్న సకల సమస్యలకు ప్రధాన కారణమని జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ కుండబద్దలు కొట్టింది. ముస్లిమ్ సమాజం మేలు కోసం మొత్తం 76 సిఫార్సులు చేసింది ఈ కమిటీ. అయితే వీటిలో అమలుకు నోచుకున్నవి అతి తక్కువ. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ముస్లిమ్ల జీవితాల్లో వెలుగులు నింపడానికి నాలుగు శాతం రిజర్వేషన్లు ప్రవేశ పెట్టారు. విభజన తరువాత కూడా ఆంధ్రప్ర దేశ్లో ముస్లిమ్లకు నాలుగుశాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు ఈ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నా చంద్ర బాబు నోరు మెదపకపోవడం విడ్డూరం. నెత్తి మీద టోపీ పెట్టుకుని... ముస్లిమ్లతో ఆత్మీయ సమావేశాలంటూ సందడి చేసే చంద్రబాబు అసలు రంగు బయటపడింది. వాస్తవానికి రాయలసీమలో ముస్లిమ్ మైనా రిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కర్నూలు,నంద్యాల, కడప, రాయచోటి, కదిరి లాంటి అనేక ప్రాంతాల్లో గెలుపు ఓటములను ప్రభా వితం చేయగల స్థాయిలో ముస్లిమ్లు ఉన్నారు. రాయలసీమే కాదు కోస్తా జిల్లాల్లో కూడా వీరి జనాభా భారీగానే ఉంది. గుంటూరు తూర్పు, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావు పేట, చిలకలూరిపేట, విజయవాడ పశ్చిమం, బందరు, పెడన వంటి అనేక ప్రాంతాల్లో కూడా ముస్లిమ్ మైనారిటీలు అభ్యర్థుల జయాపజయా లను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తారు.అటువంటి ముస్లిమ్ల రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటే తెలుగుదేశం నిశ్శబ్దంగా ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ముస్లిమ్ల రిజర్వే షన్ రద్దు ఖాయం అని ముస్లిమ్లు బలంగా నమ్ముతున్నారు. దీంతో ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్న ముస్లి మ్లు పోలింగ్ నాటికి జగన్కి జై కొడతారని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.ఎస్. అబ్దుల్ ఖాలిక్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్మొబైల్: 63001 74320 -
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
ఏపీలో ప్రైవేటీకరణ అభిమాని చంద్రబాబు జాతీయ ప్రైవేటీకరణ అభిమాని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అన్ని ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటు ఏకస్వామ్య కంపెనీలకు అప్పజెప్పాలన్నది వారి ఆలోచన. ఇక్కడ రిజర్వేషన్లు అమలు కావు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ కూటమికి ఓటు వేయడమంటే, ప్రైవేటీకరణకు ఓటు వేయడమే. కానీ నిరుపేదలకు ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఉద్యోగ అవకాశం మొదటి తరంలో చాలా ముఖ్యం. మన దేశ భవిష్య త్తుకు పునాది స్కూలు విద్యను పూర్తిగా ప్రభుత్వ రంగంలోకి తెచ్చి, ప్రైవేట్ స్కూలు విద్యను రద్దు చెయ్యడంలో ఉంది. ఉద్యోగస్థులు మొత్తం సమాజ భవిష్యత్ గురించి ఆలోచించకుండా ప్రైవేటీకరణకు, మత తత్వానికి ఓటు వేస్తే ప్రజాస్వామ్యం కాదుకదా, మానవీయ విలువలు కూడా బతకవు.ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటీకరణ అభిమాని చంద్రబాబు నాయుడు జాతీయ ప్రైవేటీకరణ అభిమాని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. దేశంలోని మొత్తం కేంద్ర ప్రభుత్వ కంపెనీలను, అతి పెద్దదైన రైల్వేతో సహా ప్రైవేట్ ‘మోనోపలి’ (ఏకస్వామ్య) కంపెనీలకు అప్పజెప్పి ప్రభుత్వం కేవలం సూపర్వైజ్ చెయ్యాలనేది ఆరెస్సెస్/బీజేపీ సిద్ధాంతం. దేశంలో రిజర్వేషన్ వ్యవస్థను కూడా క్రమంగా రద్దు చెయ్యాలన్నది వారి సిద్ధాంతం. నరేంద్ర మోదీ ఓబీసీ పేరుతో ప్రధానమంత్రి అయ్యారు కనుక గత పదేండ్ల పాలనలో వాళ్ళు రిజర్వేషన్ పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ రిజర్వేషన్ వ్యతిరేక విధానం రిజర్వేషన్ ద్వారా కాక జనరల్ కోటాలో ఉద్యోగాలు తెచ్చుకున్న వారికి నచ్చ వచ్చు కూడా. కానీ విద్యా అసమాన వ్యవస్థ ఉండగా రిజర్వేషన్లు ఎత్తేస్తే దేశంలో అంతర్యుద్ధం జరుగుతుందని చాలామందికి అర్థం కాని విషయం. దేశంలోని ఉత్పత్తి కులాలు రిజర్వేషన్లు రద్దు చెయ్య డాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాయి.బీజేపీతో పొత్తుతో చంద్రబాబు అధికారంలోకి వస్తే మొట్ట మొదట ప్రైవేట్ స్టీల్ కంపెనీకి అప్పజెప్పే అతిపెద్ద స్టీల్ కంపెనీ ‘విశాఖ ఉక్కు’. ఆ తరువాత బీజేపీ తెలంగాణలోని బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ వంటి అతిపెద్ద కంపెనీలను ప్రైవేట్ గుజరాతీ, ముంబై కంపెనీలకు అమ్మకానికి పెడుతుంది. బీజేపీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ చేతుల్లోని సంస్థల్లో దొడ్డిదారిన ఏ సెలక్షన్ కమిటీని ఫేస్ చెయ్యకుండా అధికారులను, యూనివర్సిటీ ప్రొఫెసర్లను సైతం నియమిస్తోంది.ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు బీజేపీకి ఓటు వేయడమంటే ప్రైవేటీకరణకు అనుకూలంగా ఓటు వేయడమే. చంద్ర బాబు 2014 నుండి 2019 వరకు చూపిన స్వతంత్రతను కూడా చూపలేడు. ఆయన పూర్తిగా బీజేపీ ఏమి చెబితే అది చెయ్యాల్సిందే. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఈ కూటమికి ఓటేస్తే ముందు ప్రైవేటీకరణ సమస్యను కొని తెచ్చుకుంటారు.బీజేపీ ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టారు ఎంప్లాయిమెంట్ను అమెరికా మోడల్లోకి మార్చాలనే ఆలోచనతో ఉన్నట్లు వాళ్ళ ఆర్థికవేత్తల రచనలు చదివితే స్పష్టంగా అర్థమౌతుంది. ఆంధ్రప్రదేష్ సుదీర్ఘ తీర ప్రాంతం గల రాష్ట్రం. విశాఖ పోర్టు మాత్రమే కాక క్రమంగా ఇతర సీ–పోర్టులను అక్కడ అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని కొత్త పోర్టుల నిర్మాణం జరుగుతోంది. అయితే బీజేపీ ప్రభుత్వం వాటి నిర్మాణం మాత్రమే కాక వాటి మేనేజ్మెంట్ మొత్తాన్ని ప్రైవేట్ సెక్టా రుకు అప్పజెప్పే ఆలోచనలో ఉన్నది. ఈ పని ఇప్పటికే ఎయిర్పోర్టుల విషయంలో చేశారు. దేశంలోని పెద్ద, పెద్ద ఎయిర్పోర్టులన్నిటినీ ప్రైవేటు మేనేజ్మెంట్కు – అదీ పెద్ద పెద్ద మోనోపలి కంపెనీలకు అప్పజెప్పారు. ఇక్కడి ఉద్యోగాలన్నీ ప్రైవేట్ కంపెనీల చేతిలోనే ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగాలన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలే. అక్కడ పెద్ద ఉద్యోగాలన్నీ పెద్ద కంపెనీల బంధువులకు మాత్రమే వస్తాయి. యూపీఎస్సీ పరీక్షల్లో పోటీపడి ఎవరైనా ఉద్యోగం తెచ్చుకునేది అక్కడ ఉండదు. కమ్మ, రెడ్డి కులాలకు కూడా పెద్ద ఉద్యోగాలు రావు.ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకొని తీరాన్నంతా అభివృద్ధి చేసుకుంటే అది ముంబైకి మించిన నగరమయ్యే అవకాశ ముంది. కోల్కతా కూలిపోతున్న నగరం. ఇటు చెన్నై దేశపు చివరి మూలన ఉంది. దానికి ఇంకా అభివృద్ధి అవకాశం తక్కువ. ఇంగ్లిష్ విద్యలో ఆదివాసులు, దళితులు, బీసీలు, ఇతర బీద పిల్లలు చదువు కుంటే వైజాగ్ నగరాన్ని అత్యాధునిక నగరంగా మార్చే అవకాశం వారికొస్తుంది. ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ విద్య నాణ్యంగా కొన సాగితే అడవుల్లోని ఆదివాసులు పక్షులుగా ఎదిగి విమానాలుగా మారుతారు. వారికి ఎంత పోడు భూమి ఇచ్చినా, ఎంత పంట సహాయం చేసినా ఒక్క తరంలో అడవి నుండి విశాఖ నగరంలోకి, అక్కడి నుండి అమెరికాకో, ఆస్ట్రేలియాకో పోలేరు. అయితే ఈ ఆదివాసులకు ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఉద్యోగ అవకాశం మొదటి తరంలో చాలా ముఖ్యం. ప్రైవేట్ సెక్టారు వీరికి అవకాశాలివ్వదు. వారిని ఉన్నత ఉద్యోగాల్లోకి రానివ్వదు. ఆంధ్రలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాణ్యమైన ఇంగ్లిష్ విద్య ఈ ఆదివాసుల్లో కొనసాగితే, 20–30 సంవత్సరాల్లో అమెరికాలో నల్లజాతీయులను మించిన మేధా వులు ఆదివాసుల నుండి వచ్చి విశాఖ పట్టణాన్ని ప్రపంచ నగరంగా మారుస్తారు. ఈ ఆదివాసుల నుండి ఎంతోమంది ఎలాన్ మస్క్లు వచ్చే అవకాశముంది. ఇటువంటి మార్పు భారతదేశపు గుజరాతీ క్యాపిటలిస్టులకు, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, ఆరెస్సెస్కు ఏ మాత్రం ఇష్టం లేదు. వీరికి ప్రభుత్వ ఉద్యోగులు ఓటువేసి గెలిపించే ప్రయత్నం చేస్తే వ్యవస్థనంతా గుజరాత్–ముంబై క్యాపిటలిస్టులకు అప్పజెప్పడమే.భారతదేశం అమెరికా కాదు, యూరప్ కాదు, ఆస్ట్రేలియా కాదు, కెనడా కాదు. ఇది 140 కోట్ల జనాభా కలిగిన చిన్న దేశం. దీన్ని చిన్న దేశం అని ఎందుకు అంటున్నానంటే భూపరిమాణంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, చైనాతో పోలిస్తే ఇది చాలా చిన్న భూమి కలిగిన దేశం. ఈ దేశ జనాభా ఇంకా ముందు, ముందు పెరుగుతుంది. ఆధునిక సైన్స్ను ఇంగ్లిష్ భాషతో ముడేసి గొప్ప, గొప్ప శాస్త్ర పరిశోధనల ద్వారానే మనం ఇంతమందికి తిండి, బట్ట, ఇల్లు ప్రపంచంలో తలెత్తుకుని బతికే ఆత్మ గౌరవాన్ని ఇవ్వగలం. అందుకు భావితరాలు – ముఖ్యంగా ఆదివాసులు, దళితులు, ఓబీసీలు – ఇంగ్లిష్లో చదువుకొని ప్రపంచ జ్ఞానాన్ని సాధించకుండా ఈ దేశానికి మనుగడ ఉండదు. మన దేశ భవిష్యత్తుకు పునాది స్కూలు విద్యను పూర్తిగా ప్రభుత్వ రంగంలోకి తెచ్చి, ప్రైవేట్ స్కూలు విద్యను రద్దు చెయ్యడంలో ఉంది; అన్ని రకాల ఎంట్రన్స్లను, కోచింగ్లను రద్దు చేసి నేరుగా 12వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా, విద్యార్థి శ్రమ గౌరవ పనుల్లో పాల్గొన్న సర్టిఫికెట్ల ఆధారంగా ఉన్నత చదువులకు పోవడంలో ఉంది. అమెరికా, యూరప్ ఇదే చేస్తాయి. బీజేపీ, చంద్రబాబు ఇటువంటి విద్యకు పూర్తిగా వ్యతిరేకం. కనుక ఇప్పుడు ఉద్యోగాలు ఏ కులస్థులైనా మొత్తం సమాజ భవిష్యత్ గురించి ఆలో చించకుండా ప్రైవేటీకరణకు, కుల తత్వానికి, మత తత్వానికి, వర్గ తత్వానికి ఓటు వేసుకుంటే సమాజంలో తిరుగుబాటు మొదలైతే దేశం కుప్పకూలుతుంది.భారతదేశపు ప్రైవేట్ రంగం అమెరికాలో, యూరప్లో ఉన్నట్టు మానవతా విలువలతో ఏర్పడినది కాదు. గ్రామాల్లో రైతులను, కూలీలను దోచుకొని వారితో బడిలో, గుడిలో ప్రేమతో పెరిగిన మనుషులుగా కాక మేం కులానికి ఎక్కువ, మేం కంచం–మంచం పొత్తును అంగీకరించం అనే వారి చేతిలో పెరిగింది. ఈ దేశంలో అతిపెద్ద పెట్టుబడిదారులు కుష్ఠు రోగులకు, కుంటి వారికి, గుడ్డి వారికి ఒక ఆశ్రమం కట్టించి ఆదుకున్నట్టు చూశామా! అమెరికా తెల్లజాతి ధనవంతులు, నల్లజాతి స్త్రీలను తమ ఇంట్లో వంట మనిషిగా పెట్టుకొని వారి పిల్లలను చదివించి మేధావులను చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. నల్లవారికి ప్రత్యేక స్కూళ్ళు, కాలేజీలు పెట్టి ముందు చదివించింది తెల్లజాతి పెట్టుబడిదారులు. ఈ దేశంలో అతిపెద్ద పెట్టుబడిదారులు దళితుల కోసం, ఆదివాసుల కోసం ఒక్క స్కూలు కట్టి చదివించారా!అందుకే దిక్కులేని రోడ్డుమీద బతికే పిల్లల్ని దగ్గరకు తీసి ‘నిన్ను ఇంగ్లిష్ మీడియం బడిలో చదివిస్తాన’ని హామీ ఇచ్చిన వ్యక్తిని దింపేసి నారాయణ స్కూలును వెనుక ఉండి నడిపించే వ్యక్తికి ఓటు వేస్తే, ప్రజాస్వామ్యం కాదు గదా మానవ విలువలే బతకవు. అందరికంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నేను చెప్పే ఈ మాట గురించి ఆలోచించండి.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
వందల సంవత్సరాలుగా ప్రపంచ శ్రామిక ప్రజలు చిందించిన నెత్తుటి త్యాగాల గుర్తుగా అరుణ పతాకం రెపరెపలతో ప్రపంచ వ్యాప్తంగా సభలు ప్రదర్శనలతో... మే డే వచ్చింది. సకల దేశాల జాతుల మతాల, కులాల కార్మికులంతా ఒకటేనని ఈ ప్రపంచమే మనదని చాటి చెప్పిన కార్మిక వర్గ అంతర్జాతీయ దినమే మే డే. 19వ శతాబ్దం రెండవ అర్ధ భాగంలో ఇంగ్లండ్ కేంద్రంగా యూరప్ అమెరికా లలో సంభవించిన పారిశ్రామిక విప్లవ ఫలితంగా కార్మిక వర్గం పుట్టుకతోనే సంఘటిత సమరశీల పోరాటాలకు నాంది పలికింది.ఆవిరి యంత్రం, జౌళి యంత్రాలు, రైళ్లు, టెలిగ్రాఫ్, మర మగ్గం తదితర అనేక యంత్ర సాధనాలను కనిపెట్టడంతో పారిశ్రామిక విప్లవం జరిగింది. దీని వలన అంతకు ముందు ఉన్న భూస్వామ్య ఉత్పత్తి వ్యవస్థ నిర్మూలించబడి పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థ అమలులోకి వచ్చింది. కార్మిక వర్గంపై పెట్టు బడిదారీ వర్గ దోపిడీ తీవ్రంగా కొనసాగుతున్న కాలంలో కార్మిక వర్గం తమ సమస్యల కోసం సంఘటితంగా పోరాడవలసిన పరిస్థితులు ఏర్పడినాయి. ఈ పరిస్థితుల మధ్య 18 – 16 గంటల పని నుండి 8 గంటల పని దినం కోసం కార్మిక వర్గం రక్తతర్పణ చేసిన దినమే మే డేగా ప్రసిద్ధి చెందింది. 1923 మే 1వ తేదీన లేబర్ కిసాన్ పార్టీ నాయకుడు (ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ) సింగార వేలు ఎర్రజెండాను ఎగరవేయడంతో ఆనాటి నుండి భారతదేశంలో కార్మిక వర్గం మే డేను జరపడం కొనసాగుతూ వస్తున్నది. రష్యాలో మేడే ఉత్సవాల్లో అక్కడి కమ్యూనిస్ట్ నాయకులు 8 పని గంటల డిమాండ్తో పాటు చిన్న చిన్న ఆర్థిక డిమాండ్లను చేర్చడాన్ని లెనిన్ నిరసించినాడు. మే డే రాజకీయ స్వభావాన్ని తక్కువ చేసే ఆర్థిక డిమాండ్లు చేర్చ డాన్ని లెనిన్ వ్యతిరేకించారు. మే డే సందర్భంగా కార్మిక వర్గం రాజకీయ లక్ష్య సాధన కోసం ప్రతిన పూనాలని ఆయన చెప్పారు.ఆ తర్వాత కాలంలో మే డే అంతర్జాతీయ కార్మిక వర్గానికి కేంద్ర బిందువు అయింది. ఎన్నో రాజకీయ డిమాండ్లు వివిధ సందర్భాల్లో చేర్చబడ్డాయి. అంతర్జాతీయ కార్మిక వర్గ సంఘీ భావం, అందరికీ ఓటు హక్కు, సామ్రాజ్యవాద యుద్ధ వ్యతిరేకత, వలసవాద అణచివేత వ్యతిరేకత, రాజకీయార్థిక సంఘాలు ఏర్పర చుకునే హక్కు, రాజకీయ ఖైదీల విడుదల వంటివి అందులో కొన్ని.మే డే రాజకీయ చరిత్ర ప్రాముఖ్యాన్ని రూపుమాపేందుకు అమెరికా బూర్జువా సంస్కరణ వాద, అవకాశవాద సంఘ నాయ కులు మే డే నాడు ప్రదర్శనలు కాకుండా సెలవు రోజు అయిన ఆది వారం జరపాలని 1890 లోనే నిర్ణయించారు. ఇటువంటి కుట్ర తోనే అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ అవకాశవాద నాయకులు మే డేకు ప్రతిగా సెప్టెంబర్ ఒకటిని లేబర్ డేగా నిర్ణయించారు. అమెరికన్ ప్రభుత్వ కుట్ర పూరితంగా మే మొదటి తేదీని బాలల ఆరోగ్య దినంగా ప్రకటించింది.భారతదేశంలో మతోన్మాద అనుబంధ కార్మిక సంఘం అయిన భారతీయ మజ్దూర్ సంఘ్ మే డేని గుర్తించకుండా ‘విశ్వ కర్మ దినం’ జరుపుతు న్నారు. మే డేకు ఉన్న వర్గ స్వభా వాన్ని మొద్దుబార్చడానికి మే డే రాజకీయ స్వభావాన్ని దెబ్బతీయ డానికి ప్రభుత్వాలు, వివిధ సంస్కరణ వాద అవకాశవాద ట్రేడ్ యూనియన్లు మే డేను రికార్డింగ్ డ్యాన్సులతో పండుగలుగా జరుపుతున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మే నెల మొదటి రోజున ప్రపంచ కార్మిక వర్గం కమ్యూనిస్టు పార్టీలు అంతర్జాతీయ కార్మిక పోరాట దినోత్సవాన్ని జరుపుతూనే ఉన్నారు.శ్రామిక ప్రజల దోపిడీకి, అణచివేతకు, మానవ సమాజం ఎదుర్కొంటున్న సకల ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలకు మూల కారణంగా ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించి సోషలిస్ట్ సమాజ నిర్మాణానికి కార్మిక వర్గం సంసిద్ధం కావాలనే మే డే చారిత్రక పిలుపును శ్రామిక వర్గం ఎత్తి పట్టాలి.కార్మిక వర్గ అంతర్జాతీయత వర్ధిల్లాలి!ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి!! – జంపన్న ‘ మార్క్సిస్ట్–లెనినిస్ట్ నాయకుడు(నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం – మే డే)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
‘నాగి..నిన్ను కొట్టాలి.. ‘బుజ్జి’ గ్లింప్స్పై ప్రభాస్ రియాక్షన్
ఏడు చోట్ల EVM ధ్వంసలు జరిగాయి..కృష్ణం రాజు రియాక్షన్
మాలీవుడ్లో 1000 కోట్ల క్లబ్ సినిమాలు
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ మూసివేత? రైళ్ల మళ్లింపునకు సన్నాహాలు?
భార్యతో హార్దిక్కు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటషా పోస్ట్!
డ్రగ్స్ పార్టీలో ట్విస్ట్.. నటి హేమ రక్త నమూనా రిపోర్ట్ విడుదల
YS Raja Reddy: ప్రజల గుండెలలో పెద్దాయన
ప్రపంచంలోనే 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాలో రెండు భారతీయ రెస్టారెంట్లకు చోటు!
వైష్ణవి చైతన్య లేటెస్ట్ మూవీ అప్డేట్
గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఆ ఓటీటీ అన్ని కోట్లు పెట్టిందా?
తప్పక చదవండి
- YS Raja Reddy: ప్రజల గుండెలలో పెద్దాయన
- నిందితుని కోసం ఆసుపత్రిలోకి దూసుకొచ్చిన పోలీస్ వ్యాన్
- జీహెచ్ఎంసీలో కామ పిశాచి!
- ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!
- అందుకే నా పేరుకి బ్లూ చేర్చా: ‘పుష్ప పుష్ప..’ సింగర్
- ‘బీజేపీ చేయలేని పని రాహుల్ చేస్తున్నారు’
- అంబానీల అతిథులకు కరీంనగర్ కానుకలు
- కన్హయ్యకు రూ. 52 లక్షలు? ఎవరెవరిచ్చారు?
- తెలుగు రాష్ట్రాల్లో డెత్ ట్రావెల్స్
- ‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్
Advertisement