-
యూపీ కుర్రాడికి ప్రధాని మోదీ ఎందుకు లేఖ రాశారు?
ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే అవసరమైనప్పుడు కొందరికి లేఖలు కూడా రాస్తుంటారు. తాజాగా యూపీలోని ఒక యువకునికి ప్రధాని మోదీ లేఖరాశారు.ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలోని మొహల్లా పిర్బతవాన్లో నివసిస్తున్న అభయ్ చంద్వాసియాకు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన అభయ్ను ప్రశంసించారు. అభయ్ గత 20 ఏళ్లుగా మోటార్ న్యూరాన్ డిజార్డర్ అనే నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం 95 శాతం మేర శారీరక వైకల్యంతో జీవిస్తున్నాడు.ప్రధాని మోదీ తన లేఖలో అభయ్ చంద్వాసియాను ప్రశంసించారు. ‘ప్రేమతో కూడిన మీ మాటలు దేశం కోసం మనస్పూర్తిగా పని చేసేవారికి కొత్త శక్తిని ఇస్తాయని మోదీ పేర్కొన్నారు. అభయ్ తన స్వీయ రచనలోని ప్రతి పదాన్ని ప్రధాని మోదీకి అంకితం చేశారు. శారీరక వైకల్యంతో మంచం మీదనే ఉంటున్నప్పటికీ అభయ్ పలు స్ఫూర్తిదాయకమైన రచనలు సాగించాడు. అవి చదివినవారు వీటిని రాసిన వ్యక్తి శారీరక వైకల్యంతో బాధపడుతూ, కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైనవాడంటే ఎవరూ నమ్మలేరు.ప్రధాని నరేంద్ర మోదీపై అభయ్కు ఎనలేని అభిమానం. ఈ కారణంగానే ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిత్వం, దేశ ప్రయోజనాల కోసం ఆయన చేసిన కృషి, నాయకత్వ సామర్థ్యాలను వర్ణిస్తూ కవిత్వం రాశాడు. దీనికి స్పందించిన ప్రధాని మోదీ అభయ్కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రధాని నుంచి లేఖ రావడంపై అభయ్ ఆనందం వ్యక్తం చేశారు. -
ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
ఆగ్రా అనగానే అందరికీ ముందుగా తెల్లని పాలరాతి కట్టడం తాజ్ మహల్ గుర్తుకు వస్తుంది. అయితే ఇదే ప్రాంతంలో తాజ్కు పోటీనిస్తూ, దానినే పోలిన మరో పాలరాతి భవనం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇది ఆధ్యాత్మిక పర్యాటకులకు ఆలవాలంగా ఉంది.తాజ్ మహల్కు 12 కి.మీ. దూరంలోని స్వామి బాగ్ వద్ద రాధాస్వామి సత్సంగ్ శాఖ వ్యవస్థాపకుని సమాధి స్థలంలో నిర్మించిన అద్భుత భవనం మరో తాజ్గా పేరొందుతోంది. స్వచ్ఛమైన తెల్లని పాలరాయితో నిర్మితమైన ఈ భవనం పర్యాటకులను అమితంగా అలరిస్తోంది. దీనిని చూసిన పర్యాటకులు ఇది తాజ్మహల్కు పోటీ అని అభివర్ణిస్తున్నారు. మొఘలుల స్మారక కట్టడాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో ఈ ‘తాజ్’ మరో ఆకర్షణగా నిలిచింది.రాజస్థాన్లోని మక్రానా నుండి తెచ్చిన తెల్లటి పాలరాయితో రూపొందిన ఈ 193 అడుగుల ఎత్తయిన ఈ నిర్మాణం భారతదేశ ఖ్యాతిని మరింతగా పెంచుతుందనడంలో సందేహం లేదు. రాధాస్వామి శాఖ వ్యవస్థాపకులు పరమ పురుష్ పూరన్ ధని స్వామీజీ సమాధి స్థలంలో ఈ భవనం నిర్మితమయ్యింది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ సమాధి స్థలిని సందర్శించేందుకు వస్తుంటారు. ఇక్కడి అద్భుత కళాకృతులను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇక్కడ ఫోటోగ్రఫీని అనుమతించరు.రాధాస్వామి అనుచరుల కాలనీ మధ్య ఈ భవనం ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్ణాటక తదితర రాష్ట్రాలతో పాటు విదేశాలలో లక్షలాది మంది రాధాస్వామి అనుచరులు ఉన్నారు. 1904లో అలహాబాద్కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ చేతుల మీదుగా ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. భవనం కొంతమేరకు నిర్మాణం పూర్తయ్యాక ఆగిపోయింది. అయితే 1922లో తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ జరిగే పనులన్నీ హస్త కళాకారుల నైపుణ్యంతో కూడినవే కావడం విశేషం. పైగా వీరు మూడు తరాలుగా ఈ పనుల్లో నిమగ్నమవుతున్నారు. బంగారు పూతతో ఈ భవన శిఖరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ శిఖరం తాజ్మహల్ కన్నా పొడవైనది కావడం విశేషం. -
కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?: ప్రధాని మోదీ
ఢిల్లీ, సాక్షి: దేశం కోసం పని చేసే ఎన్డీయే, దేశంలో అస్థిరత్వం పెంచే ఇండియా కూటమికి మధ్య పోరు జరుగుతోందని.. ఈ పోరులో ఎన్డీయే సర్కార్ హ్యాట్రిక్ కొట్టబోతోందని బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఉత్తర ప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ‘‘ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతు ఇస్తామని మమత(మమతా బెనర్జీ) చెప్పారు. రాయ్బరేలీ ప్రజలు దేశ ప్రధానిని ఎదుర్కొంటారని కొందరు అంటున్నారు. ఇలాంటి కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?. ఓటేసి ఎవరైనా ఓటు వృథా చేసుకుంటారా?. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే.. వాళ్లకు మోదీని తిట్టడమే పనిగా ఇస్తారు. తిట్టడం కోసం మనం ఎరినైనా ఎన్నుకుంటామా?. అలాంటి వాళ్ల వల్ల మీకు పనులు జరుగుతాయా?. మనకు పనులు చేసే వ్యక్తి కావాలి. ఎన్డీయే హ్యాట్రిక్ విజయం తప్పక సాధిస్తుంది. గెలిచాక.. పేదల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. .. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత రామమందిరం కల సాకారమైంది. ఎందరో బలిదానాలు చేసిన తర్వాత మందిర నిర్మాణం జరిగింది. రామ్లల్లాను టెంట్కింద చూసి ఎందరో బాధపడ్డారు. మీ ఓటు వల్లే రామ మందిర నిర్మాణం జరిగింది. బలమైన ప్రబుత్వం ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైంది అని మోదీ అన్నారు. .. ఒకవైపు రామ మందిర నిర్మాణం జరుగుతుంటే వాళ్ల కడుపు మండిపోయింది. ఆలయ ప్రారంభోత్సవాన్ని వాళ్లు బహిష్కరించారు. రాముడితో వాళ్ల శత్రుత్వం ఏంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. రామ మందిరంపై సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్ మార్చాలనుకుంది. కాంగ్రెస్ వస్తే రామ్ లల్లాను మళ్లీ టెంట్ కిందకే మారుస్తారు. వాళ్లు ఎంతటికైనా దిగజారుతారు. వాళ్లకు పరివార్, పవార్.. ఇవే ముఖ్యం’’ అని మోదీ విపక్ష కూటమిపై మండిపడ్డారు. .. బుల్డోజర్ను ఎక్కడికి తీసుకెళ్లాలి.. ఎక్కడకు తీసుకెళ్లొద్దు అనేది యోగి దగ్గర ట్యూషన్ తీసుకోండి. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని అంబేద్కర్ అన్నారు. మత నిర్జవ్స్త్రన్లకు ల్యాబ్గా కర్ణాటకను మార్చాలనుకున్నారు. ఓబీసీల నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్పీ, ఎస్టీ, ఓబీసీల హక్కులు కాలరాస్తే సహిస్తారా?. హిందూ ముస్లిం అంటూ రాజకీయాలు చేస్తున్నారు. తిరిగి నాపై ఆరోపనలు చేస్తున్నారు. ఆ కుట్రలను గమనించి.. తిప్పి కొట్టి బీజేపీని గెలిపించాలి’’అని యూపీ ఓటర్లను ప్రధాని మోదీ కోరారు. -
మొరాయిస్తున్న ఈవీఎంలు.. భారీ వర్షంతో పోలింగ్కు అంతరాయం
ఉత్తరప్రదేశ్లో లోక్సభ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో రాష్ట్రంలోని 13 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 130 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ స్థానం నుంచి పోటీకి దిగారు.లఖీమ్పూర్ ఖీరీ జిల్లాలోని ఫూల్బెహడ్ పరిధిలోని భూఢ్ గ్రామంలో వర్షం కారణంగా బూత్ నంబర్ 259లో పోలింగ్ నెమ్మదిగా జరుగుతోంది. ఉదయం ఎనిమిది గంటల వరకూ ఈ బూత్లో కేవలం 40 మంది మాత్రమే ఓటు వేశారు. భారీ వర్షం కారణంగా పోలింగ్ బూత్ ఖాళీగా కనిపిస్తోంది. మరోవైపు బహరాయిచ్ పరిధిలోని కార్త్నియాఘాట్ అటవీ ప్రాంతంలో ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు ఇక్కడ అత్యధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. కాగా ఓటరు గుర్తింపు కార్డు సరిపోలని కారణంగా నలుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.కాన్పూర్లో పోలింగ్ ప్రారంభానికి ముందే ఈవీఎంలు మొరాయించాయి. ఫలితంగా గంగా గంజ్, బిఠూర్, కల్యాణ్పూర్ తదితర ప్రాంతాల్లో పోలింగ్ కొద్దిసేపు నిలిచిపోయింది. కల్యాణ్పూర్లో ఈవీఎంలు మొరాయించిన విషయాన్ని సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి రాజారామ్ పాల్ ఒక ట్వీట్ ద్వారా ఎన్నికల సంఘానికి తెలియజేశారు. -
మాయావతి పార్టీ మరో లిస్ట్..
లక్నో: ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలకు బహుజన్ సమాజ్ పార్టీ గురువారం మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. బీఎస్పీ ప్రకటించిన అభ్యర్థుల 14వ జాబితా ఇది.ఖుషీనగర్ లోక్సభ స్థానం నుంచి శుభ్ నారాయణ్ చౌహాన్ను, డియోరియా లోక్సభ స్థానం నుంచి సందేశ్ యాదవ్ను తమ అభ్యర్థులుగా బరిలోకి దింపుతున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపింది.ఖుషీనగర్, డియోరియా లోక్సభ స్థానాలకు జూన్ 1న చివరి దశలో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. జాన్పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగు మహిళ శ్రీకళా రెడ్డికి తొలుత అవకాశమిచ్చిన మాయావతి పార్టీ తర్వాత అభ్యర్థిని మార్చి షాకిచ్చింది. ఆమె నామినేషన్ దాఖలు చేసినప్పటికీ సిట్టింగ్ ఎంపీ శ్యామ్ సింగ్ యాదవ్కు బీఎస్పీ బీ-ఫారం ఇచ్చింది. -
Akash Anand: మేనల్లుడికి షాకిచ్చిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత వివాదం బహిర్గతమయ్యింది. పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను రెండు కీలక పదవుల నుంచి తొలగించారు. గతంలో ఆమె ఆకాష్ ఆనంద్ను తన వారసునిగా, జాతీయ సమన్వయకర్తగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఇప్పుడు ఆకాష్ విషయంలో ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆకాష్ ఆనంద్ బహిరంగ సభలలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై విమర్శలు గుప్పించేటప్పుడు ఉపయోగించిన పదాలు మాయావతికి ఆగ్రహం తెప్పించాయి. ఇటీవల సీతాపూర్లో జరిగిన బహిరంగ సభలో ఆకాష్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్ల ప్రభుత్వం అని ప్రతిపక్ష పార్టీలు పేర్కొంటున్నాయని, అయితే ఇది బుల్డోజర్ల ప్రభుత్వం కాదని, ఉగ్రవాదుల ప్రభుత్వమంటూ ఆకాష్ ఆనంద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం దేశ ప్రజలను బానిసలుగా మార్చిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని టెర్రరిస్టుగా అభివర్ణించినందుకు సీతాపూర్లో ఆకాష్ ఆనంద్పై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనితోపాటు ఇటీవల ఆకాష్ ఆనంద్ ఒక సభలో బహుజన సమాజ్ నుండి ఓట్లు కోరుతున్న వారిని బూట్లతో కొట్టి తరమాలని వ్యాఖ్యానించారు. మరో ప్రకటనలో రామ మందిరాన్ని సందర్శించకూడదని తమ పార్టీ నిర్ణయించుకున్నదంటూ ప్రకటించారు. ఆకాష్ చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ పరిణామాల నేపధ్యంలో పార్టీ ఆయన ఎన్నికల ర్యాలీని రద్దు చేసింది.బహిరంగ సభల్లో ప్రసంగించేటప్పుడు ఉపయోగించే భాషపై నియంత్రణ ఉండాలని ఆకాష్ ఆనంద్ను మాయావతి గత నెలలోనే హెచ్చరించారు. అయితే ఆయన దీనిని పట్టించుకోలేదు. ఈ దరిమిలా ఆకాష్ ఆనంద్ ప్రసంగాలపై మాయావతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె తన సోషల్ మీడియాలో ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలు అందిస్తూ ‘పార్టీలో శ్రమిస్తున్నవారిని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఆకాష్ ఆనంద్ను తన వారసునిగా, నేషనల్ కోఆర్డినేటర్గా ప్రకటించాం. అయితే ఆయన పార్టీ చేపట్టిన ఉద్యమంలో పరిపక్వత సాధించే వరకు, అతనిని ఈ రెండు బాధ్యతల నుంచి తప్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు.బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు, పార్టీ ప్రయోజనాలతో పాటు ఉద్యమం కోసం బీఎస్పీ నాయకత్వం ఎటువంటి త్యాగానికైనా వెనకాడబోదని పార్టీ చీఫ్ మాయావతి పేర్కొన్నారు. బీఎస్పీ ఒక పార్టీ మాత్రమే కాదు.. అంబేద్కర్ ఆత్మగౌరవానికి ప్రతీక. సామాజిక మార్పు కోసం చేపడుతున్న ఉదమ్యమని మాయావతి పేర్కొన్నారు. -
రాజ్నాథ్ సింగ్తో పోరుకు దిగిన నీలమ్ ఎవరు?
యూపీలోని లక్నో లోక్సభ స్థానానికి ఐదవ దశలో మే 20న ఓటింగ్ జరగనుంది. ఈ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. అయితే ఒకరి నామినేషన్పై చర్చ జరుగుతోంది. రాష్ట్రీయ ఉదయ్ పార్టీ నుంచి నీలమ్ శర్మ అనే మహిళ తన నామినేషన్ దాఖలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. తాను బీజేపీ తరపున బరిలో దిగిన రాజ్నాథ్ సింగ్ను ఓడించడానికే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు.తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ, పల్లవి పటేల్ల మద్దతు తమ పార్టీకి ఉందని ఆమె పేర్కొన్నారు. నీలమ్ శర్మ సామాజిక కార్యకర్తగా సేవలందించేందుకు ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. నీలమ్ శర్మ గతంలో మేయర్ పదవికి కూడా పోటీ చేశారు.నీలమ్ శర్మ నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినప్పుడు ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. స్టయిలిష్ లుక్లో ఆమె కారు దిగగానే అక్కడున్నవారు ఆమెను చూస్తూ ఉండిపోయారు. ఆమె పోలీసులతో తాను లక్నో లోక్సభ స్థానం నుండి ఎంపీ పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినట్లు తెలిపారు. తాను గెలిచిన తర్వాత మీరే నన్ను సన్మానిస్తారని ఆమె పోలీసులతో అన్నారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం నీలమ్ శర్మ తన నామినేషన్ దాఖలు చేసినప్పటికీ అది తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఆమె తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, దాని అమలు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఈ కారణంగా ఆమె నామినేషన్ చెల్లకపోవచ్చని సమాచారం. -
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహాద్లో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలులో ఒక యువకుడు తన భార్యకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో భార్యపై దాడిచేసి, రైలు నుంచి దూకి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ను వేడుకున్నారు.బాధితురాలు పుఖ్రాయాన్ పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆమె భర్తతో సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదనపు కట్నం డిమాండ్ చేస్తూ తన భర్త విడాకులు ఇచ్చాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.ఈ ఉదంతం గురించి భోగానిపూర్ పోలీసు అధికారి మాట్లాడుతూ బాధితురాలు రాజస్థాన్కు చెందిన మహిళ అని, నఫీజుల్ హసన్ కుమారుడు మహమ్మద్ అసద్ ఆమెను వివాహం చేసుకున్నాడని తెలిపారు. ఆ తరువాత నుంచి భర్త మహ్మద్ అసద్ అత్తామామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా భర్త తనకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఆమె తెలిపారు. -
తరగతి గదిని స్విమ్మింగ్ ఫూల్ చేసిన హెడ్మాస్టర్!
ప్రస్తుతం దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఉక్కపోత, వేడి గాలులకు తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్రమైన ఎండల కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితులను గుర్తించిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినూత్న ఆలోచనతో విద్యార్థులను పాఠశాలకు రప్పిస్తున్నారు.ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలోని ఒక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిల్లలను పాఠశాలకు రప్పించడానికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఆశ్రయిస్తున్నారు. పాఠశాలలోని తరగతి గదిని స్విమ్మింగ్ పూల్గా మార్చివేశారు. ఇది విజయవంతమయ్యింది. దీంతో చిన్నారులంతా పాఠశాలకు క్రమంతప్పక వస్తున్నారు. తరగతి గదిలోని స్విమ్మింగ్ పూల్లో చిన్నారులు సరదాగా ఆడుకుంటున్న వైనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇది కన్నౌజ్ జిల్లాలోని మహసోనాపూర్లోని ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన ఉందంతం. ఇక్కడ ఉష్ణోగ్రతలు 40 నుండి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటున్నాయి. దీంతో ఎండ వేడిమి నుంచి తమ పిల్లలను రక్షించేందుకు తల్లిదండ్రులు వారిని పాఠశాలలకు పంపడం లేదు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిల్లల హాజరు శాతాన్ని పెంచేందుకు తరగతి గదిలోనే స్విమ్మింగ్ పూల్ను ఏర్పాటు చేశారు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైభవ్ రాజ్పుత్ మీడియాతో మాట్లాడుతూ ‘పాఠశాలలోని ఒక తరగతి గదిని నీటితో నింపేసి, స్విమ్మింగ్ పూల్గా మార్చివేశాం. దీనిని చూసి పిల్లలు ముచ్చట పడ్డారు. ఆ స్విమ్మింగ్ ఫూల్లో ఆడుకోవడం మొదలు పెట్టారు. వారి ఆనందానికి అంతులేకుండా పోతోంది. ఆ నీటిలో ఈత కొడుతూ ఆడుకుంటున్నారు. ఇలా ఎంజాయ్ చేసేందుకు విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తున్నారు’ అని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో విద్యార్థులకు వేసవి సెలవులు మే 21 నుంచి జూన్ 30 వరకూ ఉంటాయి. -
బీజేపీ నేత కొడుక్కి బీఎస్పీ టికెట్
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేత కుమారుడికి టికెట్ ఇచ్చింది. ప్రతాప్గఢ్ పార్లమెంట్ స్థానం నుంచి సుప్రీంకోర్టు న్యాయవాది ప్రథమేష్ మిశ్రాను పోటీకి దింపాలని నిర్ణయించింది.ప్రథమేష్ పొరుగున ఉన్న కౌశాంబి పార్లమెంటరీ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల ఇంచార్జి అయిన శివ ప్రకాష్ మిశ్రా సేనాని కుమారుడు. పల్టాన్ బజార్కు చెందిన శివ ప్రకాష్ మిశ్రా సేనాని గతంలో బీఎస్పీలో ఉన్నారు. 1999, 2007, 2012లో కుందా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 2004లో ప్రతాప్గఢ్ లోక్సభ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన భార్య సింధూజా మిశ్రా సేనాని కూడా 2012లో విశ్వనాథ్గంజ్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా, 2022లో కుందా నుంచి బీజేపీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.ఇక ప్రథమేష్ విషయానికి వస్తే సుప్రీంకోర్టులో న్యాయవాది అయిన ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి. ప్రతాప్గఢ్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీజేపీకి చెందిన సంగం లాల్ గుప్తా, సమాజ్వాదీ పార్టీ టిక్కెట్పై ‘ఇండియా’ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎమ్మెల్సీ ఎస్పీ సింగ్ పటేల్పై ఆయన పోటీ చేస్తున్నారు. బీఎస్పీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలన్నది తన కుమారుడి నిర్ణయమని, తాను మాత్రం బీజేపీలోనే ఉంటానని ప్రథమేష్ తండ్రి శివప్రకాశ్ మిశ్రా సేనాని స్పష్టం చేశారు. -
అజంగఢ్ పోటీని ఆసక్తికరంగా మార్చిన మాయావతి!
యూపీలోని అజంగఢ్ లోక్సభ స్థానం రాష్ట్రంలో రాజకీయంగా చాలా ముఖ్యమైనదిగా గుర్తింపు పొందింది. బహుజన్ సమాజ్ పార్టీ తాజాగా ఈ స్థానం నుంచి తన అభ్యర్థిని నిలబెట్టింది. బీఎస్పీ మహిళా అభ్యర్థి సబిగా అన్సారీ అజంగఢ్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఈ సీటుపై ముక్కోణపు పోరు నెలకొంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 45 ఏళ్ల తర్వాత అజంగఢ్ నియోజకవర్గం నుంచి ఓ మహిళా అభ్యర్థి బరిలో నిలిచారు.అజంగఢ్ నుంచి మహిళా అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బీఎస్పీ.. ఈ సీటుకు జరుగుతున్న పోరును మరింత ఆసక్తికరంగా మార్చింది. 1978లో మొహసినా కిద్వాయ్ ఇక్కడ నుండి కాంగ్రెస్ టిక్కెట్పై నాటి లోక్సభ ఉప ఎన్నికల్లో గెలుపొందారు. అయితే ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా అజంగఢ్ స్థానం నుండి మహిళా అభ్యర్థిని నిలబెట్టలేదు. మహిళా రాజకీయ చైతన్యం ఇక్కడ తక్కువే అనే మాట వినిపిస్తుంటుంది.ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చి, కాంగ్రెస్ నుంచి బీఎస్పీలో చేరిన సబీహా అన్సారీని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి మాయావతి అజంగఢ్లో నూతన రాజకీయాలకు తెరలేపారు. ఈ ప్రాంతానికి చెందిన మీరా దేవి మాట్లాడుతూ తమ కష్టాలను అర్థం చేసుకోగల మహిళా అభ్యర్థి ఎన్నికల బరిలో దిగడం సంతోషదాయకమన్నారు. ఇది మహిళలకు గర్వకారణమని మరో మహిళ ఆర్తి అన్నారు. జలంధరి ప్రాంతానికి చెందిన షబీనా కూడా బీఎస్పీ చీఫ్ మాయావతి నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు. -
నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
లక్నో: కేంద్ర రక్షణ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ లక్నో స్థానం నుంచి రానున్న లోక్సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీలతో కలిసి వెళ్లి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు.నామినేషన్ దాఖలుకు ముందు, రాజ్నాథ్ సింగ్ నగరంలో రెండు కిలోమీటర్ల మేర రోడ్షో నిర్వహించి, స్థానిక దక్షిణ్ ముఖి హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు ఐదవ దశ పోలింగ్ మే 20న జరగనుంది. లక్నోతో పాటు మరో పదమూడు నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది.లక్నో లోక్సభ స్థానంలో 2019 ఎన్నికలలో రాజ్నాథ్ సింగ్ 6.3 లక్షల ఓట్లు సాధించి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి పూనమ్ శత్రుఘ్న సిన్హాను ఓడించారు. అలాగే 2014లో కాంగ్రెస్ అభ్యర్థి రీటా బహుగుణ జోషిపై 2.72 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. -
‘మేం గెలిస్తే ప్రత్యేక రాష్ట్రం’
లక్నో: తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్ను ప్రత్యేక రాష్ట్రంగా మార్చేందుకు తమ పార్టీ గట్టి చర్యలు తీసుకుంటుందని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి ప్రకటించారు. ముజఫర్నగర్ లోక్సభ స్థానం బీఎస్పీ అభ్యర్థి దారా సింగ్ ప్రజాపతికి మద్దతుగా మాయావతి ప్రచారం నిర్వహించారు. ఇక్కడ జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాయావతి మాట్లాడుతూ బీజేపీకి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. "పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కావాలని మీరు కోరుకుంటున్నారు. ఇందుకోసం కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం" అని మాయావతి చెప్పారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ఓటింగ్ యంత్రాలను తారుమారు చేయకుంటే ఈసారి బీజేపీ అధికారంలోకి రాదని బీఎస్పీ చీఫ్ అన్నారు. ముజఫర్నగర్లో బీజేపీ నుంచి సంజీవ్ కుమార్ బల్యాన్, సమాజ్ వాదీ పార్టీ నుంచి హరేంద్ర సింగ్ మాలిక్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ తన ర్యాలీకి ముందు, మాయావతి సహరాన్పూర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో కూడా ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్లలో మొత్తం ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న మొదటి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
2018లో రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు.. విచారణ వాయిదా
లక్నో : 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం దావా కేసు విచారణ ఏప్రిల్ 22కి వాయిదా పడింది. ప్రత్యక కోర్టు న్యాయమూర్తి సెలువులో ఉన్న కారణంగా కేసు వాయిదా పడినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ.. హోమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్ పూర్ జిల్లాకు చెందిన బీజేపీ నేత విజయ్ మిశ్రా సుల్తాన్ పూర్ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. మిశ్రా తరపు న్యాయవాది సంతోష్ పాండే మాట్లాడుతూ.. పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ కోర్టుకు దరఖాస్తు చేశామన్నారు. కానీ న్యాయమూర్తి సెలవులో ఉన్నందున విచారణ జరగలేదని, ఏప్రిల్ 22కి వాయిదా వేసినట్లు తెలిపారు. 2018 మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ.. అమిత్ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నిజాయితీ, స్వచ్ఛమైన రాజకీయాలను విశ్వసిస్తుందని చెబుతున్నప్పటికీ, హత్య కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తి పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారని అన్నారు. అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఆగస్టు 4, 2018న రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగుతుంది కాగా, ఈ కేసులో గతేడాది డిసెంబర్లో రాహుల్ గాంధీపై కోర్టు వారెంట్ జారీ చేసింది. తదనంతరం, రాహుల్ గాంధీ ఫిబ్రవరి 20న అమేథీలో భారత్ జోడో న్యాయ్ యాత్రను నిలిపివేసి, కోర్టు నుంచి బెయిల్ పొందారు. -
అయోధ్యలో బంగారు రామాయణం
అయోధ్యకు వచ్చే రామభక్తులకు ఇప్పుడు మరొక కానుక అందనుంది. అదే బంగారు రామాయణ దర్శనభాగ్యం. ఈ రామాయణాన్ని నూతన రామాలయంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఈ ప్రత్యేక బంగారు రామాయణాన్ని మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన మాజీ ఐఎఎస్ అధికారి సుబ్రమణ్యం లక్ష్మీనారాయణన్, అతని భార్య సరస్వతి రామాలయ ట్రస్ట్కు అందించారు. శ్రీరామ నవరాత్రులలో మొదటి రోజున ఈ రామాయణ ప్రతిష్ఠాపన జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నారాయణ్ దంపతులు పాల్గొన్నారు. చెన్నైకి చెందిన వుమ్మిడి బంగారు జ్యువెలర్స్ ఈ బంగారు రామాయణాన్ని తయారు చేసింది. గర్భగుడిలోని రామ్లల్లా విగ్రహానికి 15 అడుగుల దూరంలో ఒక రాతి పీఠంపై ఈ రామాయణాన్ని ప్రతిష్ఠించారు. ఈ రామాయణ గ్రంథం పైభాగంలో వెండితో చేసిన రాముడి పట్టాభిషేక దృశ్యం కనిపిస్తుంది. ఈ రామాయణ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో రామాలయ నిర్మాణ ఇన్చార్జి గోపాల్రావు, పూజారి ప్రేమ్చంద్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. -
ప్రధానిపై పోటీ.. ఈ ట్రాన్స్జెండర్ గురించి తెలుసా?
లక్నో: ప్రస్తుత లోక్సభ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కారణం ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి ఇతర ప్రధాన పార్టీలతో పాటు ఓ ట్రాన్స్జెండర్ కూడా పోటీ చేస్తున్నారు. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై అఖిల భారత హిందూ మహాసభ (ABHM) ఉత్తరప్రదేశ్ విభాగం తరఫున మహామండలేశ్వర్ హేమాంగి సఖి మా పోటీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారణాసితో సహా ఉత్తరప్రదేశ్లోని 20 లోక్సభ స్థానాల్లో ఈ హిందూ మితవాద సంస్థ పోటీ చేయనుంది. ఈ ఎన్నికలలో చివరి దశలో జూన్ 1న వారణాసిలో పోలింగ్ జరగనుంది. వారణాసి నుంచి కాంగ్రెస్ తమ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చీఫ్ అజయ్ రాయ్ను పోటీకి దింపింది. 2019లో వారణాసిలో ప్రధాని మోదీ 63 శాతం ఓట్లతో విజయం సాధించారు . సమాజ్వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్ తర్వాత రాయ్ మూడో స్థానంలో నిలిచారు. ఇండియా కూటమిలో భాగంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మొట్టమొదటి ట్రాన్స్జెండర్ గీతా బోధకురాలు హేమాంగి సఖి గుజరాత్లోని బరోడాలో జన్మించారు. ఆమె తండ్రి సినిమా డిస్ట్రిబ్యూటర్ కావడంతో ఆమె కుటుంబం ముంబైకి మారింది. సఖి కొంతకాలం కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె పాఠశాల వదిలి వెళ్లిపోయారు. కొన్ని చిత్రాలలో నటించిన ఆమె ప్రముఖ టీవీ షోలలో కూడా కనిపించారు. ముంబైలోని తన ఇంటికి సమీపంలో ఉన్న ఇస్కాన్ ఆలయంలో సఖికి శ్రీకృష్ణునిపై భక్తిప్రపత్తులు ప్రారంభమయ్యాయి. చివరికి బృందావనంలో దిగింది. తరువాత, ఆమె హేమాంగి సఖి మాగా మారారు. ఆమె ప్రపంచంలోని మొట్టమొదటి ట్రాన్స్జెండర్ భగవద్గీత బోధకురాలు. తన ఫేస్బుక్ పేజీ ప్రకారం ఆమె ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికలలో భగవద్ కథ , రామ కథ, దేవి భగవత్ కథలను బోధించారు. 2019లో పట్టాభిషేకం 2019 ఫిబ్రవరిలో జరిగిన కుంభంలో ఆచార్య మహామండలేశ్వర్గా ఆమె పట్టాభిషేకం జరిగింది. ఆమెను అఖిల భారతీయ సాధు సమాజ్ భగవత్భూషణ్ మహామండలేశ్వర్ బిరుదుతో సత్కరించింది. ఉత్తర గోదావరి ధామ్లోని ఆద్య శంకర్ కైలాష్ పీఠం ఆమెకు ఆచార్య మహామండలేశ్వర్ బిరుదును ప్రదానం చేసింది. -
నామినేషన్లలోనే సగం మంది అవుట్!
నోయిడా: లోక్సభ ఎన్నికల రెండో దశ నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఉత్తర ప్రదేశ్లోని రెండు స్థానాల్లో దాఖలైన నామినేషన్లలో సగానికి పైగా తిరస్కరణకు గురయ్యాయి. ఘజియాబాద్లో 60 శాతం, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా)లో దాదాపు 56 శాతం మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్లు స్థానిక ఎన్నికల అధికారులు తెలిపారు. ఘజియాబాద్లో 35 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయగా, అందులో 14 మంది అభ్యర్థుల దరఖాస్తులు ఆమోదించినట్లు జిల్లా ఎన్నికల కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పక్కనే ఉన్న గౌతంబుద్ధ్ నగర్లో 34 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్లు వచ్చాయని, వారిలో 15 మంది అభ్యర్థులు చెల్లుబాటయ్యారని పేర్కొంది. రెండు నియోజకవర్గాల్లో కలిపి 69 నామినేషన్లు రాగా అందులో 40 తిరస్కరణకు గురయ్యాయి. ఘజియాబాద్లో నామినేషన్ల తిరస్కరణ 60 శాతం కాగా, గౌతమ్బుద్ధ్నగర్లో 55.89 శాతంగా నమోదైంది. అధికారిక జాబితా ప్రకారం.. ఘజియాబాద్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే గౌతమ్బుద్ధ్నగర్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు నలుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ రెండు స్థానాల్లోనూ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 8 కాగా ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. -
‘వారి అదృష్టం కొన్ని గంటలే’.. మరోసారి ఎస్పీ అభ్యర్థుల మార్పు
లక్నో: ఉత్తర ప్రదేశ్లో లోక్సభ ఎన్నికలకు ప్రకటించిన అభ్యర్థులను సమాజ్వాదీ పార్టీ తరచూ మారుస్తోంది. మీరట్ స్థానానికి అభ్యర్థిని రెండోసారి మార్చింది. అలాగే భాగ్పట్ నియోజకవర్గ అభ్యర్థిని కూడా మార్చింది. ఇప్పుడు అతుల్ ప్రధాన్ స్థానంలో సునీత వర్మ మీరట్ నుంచి పోటీ చేయనున్నారు. సోమవారం రాత్రి ‘ఎక్స్’లో షేర్ చేసిన జాబితాలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ మీరట్, ఆగ్రా (రిజర్వ్డ్) పార్లమెంట్ స్థానాల నుంచి అతుల్ ప్రధాన్ సురేష్ చంద్ కదమ్ అభ్యర్థులుగా ఉంటారని పేర్కొంది. మీరట్ నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్న నటుడు అరుణ్ గోవిల్పై సమాజ్వాదీ పార్టీ మొదట భాను ప్రతాప్సింగ్ను పోటీకి నిలబెట్టింది. పార్టీ అలా తన పేరును ప్రకటించగానే అతుల్ ప్రధాన్ ‘ఎక్స్’ ద్వారా పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్కు కృతజ్ఞతలు కూడా తెలిపారు. తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే మీరట్ అభ్యర్థిని మరోసారి మారుస్తూ అతుల్ ప్రధాన్ స్థానంలో సునీత వర్మను పార్టీ ప్రకటించింది. ఇక భాగ్పట్లో మనోజ్ చౌదరి స్థానంలో అమర్పాల్ శర్మను బరిలోకి దింపింది. ప్రత్యర్థుల విమర్శలు సమాజ్వాదీ పార్టీ తమ అభ్యర్థులను తరచూ మారుస్తుండటంపై ప్రత్యర్థు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకప్పుడు మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్దళ్ అధినేత జయంత్ సింగ్ సమాజ్ వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. "ప్రతిపక్షంలో కొంతమందికి అదృష్టం కొన్ని గంటల పాటే ఉంటుంది” అంటూ ఎద్దేవా చేశారు. -
మీరట్లో సమాజ్వాదీ అభ్యర్థి మార్పు?
యూపీలో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కొత్త నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికలకు మీరట్ స్థానం నుంచి గతంలో ప్రకటించిన అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నదని సమాచారం. అతుల్ ప్రధాన్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ భార్య సునీతా వర్మను ఎస్పీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరట్ అభ్యర్థిని మార్చడంపై జరుతున్న చర్చల మధ్య అతుల్ ప్రధాన్ తన ట్విట్టర్లో ఖాతాలో ఇలా రాశారు. ‘పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నిర్ణయం నాకు సమ్మతమే. త్వరలో పార్టీ నేతలతో కూర్చొని మాట్లాడతాను’ అని రాశారు. కాగా బుధవారం అతుల్ ప్రధాన్ నామినేషన్ దాఖలు చేయగానే మాజీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ మద్దతుదారులు నిరసన గళం వినిపించారు. దీంతో అతుల్ అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసి, మాజీ ఎమ్మెల్యే యోగేశ్ వర్మ భార్య, మేయర్ సునీతా వర్మను మీరట్ అభ్యర్థిగా ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆమె గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారని కూడా అంటున్నారు. 2019లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి సునీతా వర్మ, ఆమె భర్త యోగేశ్ వర్మ బహిష్కరణకు గురయ్యారు. అనంతరం వారు 2021లో సమాజ్వాదీ పార్టీలో చేరారు. పార్టీ హైకమాండ్ తమ అభియాన్ని గౌరవించిందని, తన భార్య సునీతా వర్మను అభ్యర్థిగా ఎంపికచేసిందని అంగీకరించిందన్నారు. -
ఏం చేస్తారో వరుణ్ గాంధీనే అడగండి: మేనకా గాంధీ
లక్నో: లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. పదిరోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ యూపీలోని సుల్తాన్పూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తన కుమారుడికి బీజేపీ ఫిలీభీత్ స్థానాన్ని నిరాకరించిన విషయం తెలిసిందే. బీజేపీ వరణ్గాంధీకి టికెట్ నిరాకరించిన తర్వాత తొలిసారి మేనకా గాంధీ స్పందించారు. ప్రస్తుతం వరణ్గాంధీ చేస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు మేనకా గాంధీ సమాదానం ఇచ్చారు. ‘వరుణ్కు గాంధీ ఏం చేయాలనుకుంటున్నారో.. ఆయన్నే అడగండి. లోక్సభ ఎన్నికల అనంతరం దాని గురించి ఆలోచిస్తాం. ఇంకా చాలా సమయం ఉంది’ అని ఆమె తెలిపారు. ‘నేను బీజేపీలో ఉన్నందుకు సంతోషపడుతున్నా. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా నాకు టికెట్ ఇచ్చారు.అయితే టికెట్ కేటాయించటంలో కొంత జాప్యం జరిగింది. దీంతో నేను ఎక్కడ పోటీ పడతానోనని కొంత అయోమయం మొదలైంది. మళ్లీ అందులో ఈసారి ఫిలీభీత్? లేదా సుల్తాన్పూర్?. అయితే బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవటం సంతోషం. మళ్లీ నేను సుల్తాన్పూర్లో పోటీ చేయటం ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో ఒకసారి గెలిచిన ఎంపీ మళ్లీ గెలవడని చర్రిత చెబుతోంది ’ అని మేనకా గాంధీ అన్నారు. టికెట్ ప్రకటించిన తర్వాత మేనకా గాంధీ సుల్తాన్పూర్లో పర్యటించటం ఇదే మొదిటిసారి. పది రోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా సుల్తాన్పూర్ సెగ్మెంట్లో సుమారు 101 గ్రామాలను పర్యటించనున్నారు. ఇక.. అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వరణ్ గాంధీ సొంత పార్టీపైనే విమర్శలు చేయటంలో ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల వరుణ్ గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిని లేఖ రాశారు. తన కడ శ్వాసవరకు ఫిలీభీత్ ప్రజలతో సంబంధాలను కొనసాగిస్తానని చెప్పారు. -
బీఎస్పీ అభ్యర్థికి గుండెపోటు
బహుజన్ సమాజ్ పార్టీ అలీగఢ్ అభ్యర్థి గుఫ్రాన్ నూర్ గుండెపోటుకు గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. విషయం తెలిసిన వెంటనే బీఎస్పీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకున్నారు. తన తండ్రి ఇప్పటికే హార్ట్ పేషెంట్ అని, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో చేర్చినట్లు గుఫ్రాన్ నూర్ కుమారుడు ఆదిల్ తెలిపారు. బీఎస్పీ రెండు రోజుల క్రితం గుఫ్రాన్ నూర్ను అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ బాబు ముంకద్ అలీ.. గుఫ్రాన్ నూర్ అభ్యర్థిత్వాన్ని వెల్లడించారు. కాగా బీఎస్పీ అలీగఢ్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ మాత్రం ఇంకా దీన్ని ధ్రువీకరించలేదు. 2012లో గుఫ్రాన్ నూర్ బరౌలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి క్వామీ ఏక్తా దళ్ టిక్కెట్పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 2023లో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీ చేశారు. -
కంగనాపై అసభ్య పోస్ట్.. సుప్రియాకు షాకిచ్చిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: సినీ నటీ, హిమాచల్ ప్రదేశ్లోని మండి బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్పై సోషల్ మీడియా వేదికగా చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతే భారీ మూల్యం చెల్లించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బుధవారం విడుదల చేసిన లోక్సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో సుప్రీయా శ్రీనతేకు టికెట్ నిరాకరించింది. 2019లో సుప్రీయా శ్రీనతే ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన విషయం తెలసిందే. అయితే ఈసారి కూడా మహారాజ్గంజ్ నుంచి తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తుందని సుప్రియా శ్రీనతే ఆశాభావం వ్యక్తం చేశారు. 2019లో సుప్రియా శ్రీనతేపై బీజేపీ అభ్యర్థి పంకజ్ చౌదరీ విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి మహారాజ్గంజ్లో వీరేంద్ర చౌదరీని బరిలోకి దింపింది. సుప్రియా శ్రీనతే సోషల్ మీడియా ఖాతా నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్పై వెలువడిన అసభ్యకరమైన విమర్శలు కాస్త వివాదం రేపాయి. అయితే ఈ నేపథ్యంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి తాను లోక్ ఎన్నికల్లో పోటీ చేయనని కాంగ్రెస్ పార్టీని కోరినట్లు తెలిపారు. అయితే తన స్థానంలో మరో అభ్యర్థి పేరును సూచించినట్లు సుప్రియా పేర్కొన్నారు. కంగనాపై చేసిన అసభ్యకరమైన పోస్ట్పై.. సుప్రియా శ్రీనతే వెంటనే స్పందించి వివరణ ఇచ్చారు. తన సోషల్ మీడియా ఖాతాల పాస్వర్డులు పలువురికి తెలుసని తనకు తెలియకుండానే కంగనాపై అసభ్యకరమైన సోస్ట్ వేశారని తెలిపారు. ఈ పోస్ట్ తన దృష్టికి రావటంతో డిలీట్ చేశానని తెలిపారు.‘సుప్రియాపేరడీ’ అనే ‘ఎక్స్’ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారని.. దాని నిర్వాకులు ఎవరో తెలియదన్నారు. తన ‘ఎక్స్’ఖాతా హ్యాక్ అయిందని తెలిపారు. అప్పటికే ఆమె పోస్ట్ వివాదస్పదం కాగా.. బీజేపీ నేతలు ఆమెపై మండిపడ్డారు. ఇలా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతేకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 29 సాయంత్రం 5 గంటలోపు స్పందించాలని కోరింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎన్నికల కోడ్)ని ఉల్లంఘించినట్లు పోల్ ప్యానెల్ తెలిపింది. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలని ఈసీ ఆదేశించింది. -
అక్కా.. వచ్చేస్తున్నా! ఎన్డీఏ వైపు పల్లవి పటేల్
లోక్సభ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఉత్తర ప్రదేశ్లో రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ‘ఇండియా’ కూటమికి షాకిస్తూ అప్నా దళ్ (కామెరవాడి) నాయకురాలు, సిరతు ఎమ్మెల్యే పల్లవి పటేల్ ( Pallavi Patel ) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇక పొత్తుపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బిహార్లో ‘ఇండియా’ కూటమికి నితీష్ కుమార్ ఇచ్చిన షాకే ఉత్తరప్రదేశ్లోని అప్నా దళ్-కామెరవాడి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. "ప్రస్తుతం ఎన్డీఏతో చర్చలు లేవు. ఒకవేళ ఆఫర్ వస్తే తమ పార్టీ పరిశీలిస్తుంది" అని డాక్టర్ పల్లవి పటేల్ చెప్పారు. మరోవైపు అప్నా దళ్ (కామెరవాడి) ఉత్తరప్రదేశ్లోని మూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఒక రోజు తర్వాత సమాజ్వాదీ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల కోసం కృష్ణ పటేల్ నేతృత్వంలోని పార్టీతో పొత్తు లేదని తెలిపింది. “అప్నాదళ్ (కె), సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తు 2022 అసెంబ్లీ ఎన్నికల కోసమే కానీ, 2024 ఎన్నికల కోసం కాదు” అని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. పల్లవి పటేల్ సోదరి, అప్నా దళ్ (సోనేలాల్) అధినేత్రి అనుప్రియా పటేల్ ( Anupriya Patel ) ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. అప్నా దళ్ (కే) ప్రకటించిన మూడు స్థానాల్లో మీర్జాపూర్ స్థానం నుండి అనుప్రియా పటేల్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఫుల్పూర్, కౌశంబి లోక్సభ స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం మూడు స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. -
రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెడితే..ఈ బ్రదర్స్ కారునే ఏకంగా..!
రైట్ బ్రదర్స్ విమానాన్న కనిపెడితే..ఈ బ్రదర్స్ కారుని హెలికాప్టర్గా మార్చారు. అది తమ జీవనోపాధికి ఉపయోగపడుతుందనుకున్నారు. కానీ ఇలా మార్పులు చేయాలంటే అధికారులు అనుమతి తప్పనసరి. అది తెలియక ఈ అన్నదమ్ములూ తయారు చేసిన కారు కమ్ హెలికాప్టర్ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. దీంతో అన్నదమ్ములిద్దరు తలలుపట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు.. పాత మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ను హెలికాప్టర్గా మార్చారు. ఈశ్వర్దీన్, పరమేశ్వర్దీన్ అనే ఈ అన్నదమ్ములు.. వివాహాలకు ప్రత్యేకంగా కనిపించేలా కారును హెలీకాప్టర్లా మార్చారు. వధూవరులను తీసుకుని వెళ్లాలా ప్రత్యేకతగా ఉండాలనుకున్నారు. అందుకోసం హెలికాప్టర్ రోటర్ బ్లేడ్ను కారు పైకప్పుపై వెల్డింగ్ చేసి అతికించారు. కారు బూట్కు హెలీకాఫ్టర్ కు ఉండే తోకను జోడించారు. ఇలా కారు కమ్ హెలికాప్టర్లా విలక్షణంగా రూపొందిచారు. పైగా దీనివల్ల తమ కుటుంబానికి మంచి జీవనోపాధిగా ఉంటుందనేది వారి ఆలోచన. ఆ నిమిత్తమే ఈ ఇద్దరు సోదరులు కారుని హెలికాప్టర్లా మార్పుల చేసి చక్కగా రంగులు వేసేందుకు తీసుకువెళ్తుండగా ఊహించని విధంగా పోలీసుల వారిని అడ్డుకుని వాహనాన్ని చీజ్ చేశారు. అయితే ఈ అన్నదమ్ములు కారుని హెలికాప్టర్గా మార్చారు గానీ అందుకు అనుమతలు తప్పనసరి. ఇది తెలియకపోవడంతోనే ఈ బ్రదర్స్ అధికారులతో సమస్యను ఎదుర్కొన్నారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రవాణా నిబంధనలను పాటించనందుకు, సంబంధిత అధికారుల నుండి సరైన అనుమతి లేకుండా ఇలా మార్పులు చేసినందుకు సీజ్ చేశామని చెప్పారు. ఈ మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాల్ పాండే మాట్లాడుతూ, "మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కారణంగా, పోలీసులు నిరంతరం వాహన తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. అలాంటి ఒక తనిఖీ సమయంలో, ట్రాఫిక్ పోలీసులు ఈ కారును పట్టుకున్నట్లు తెలిపారు. మార్పులకు అనుమతి అవసరం కాబట్టి ఆర్టీవో విభాగం, వాహనాన్ని మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 207 కింద సీజ్ చేసినట్లు వెల్లడించారు." పాండే. అయితే ఈ అన్నదమ్ములు చివరికీ జరిమాన చెల్లించి ఏదోలా వాహనాన్ని విడిపించుకున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. यूपी के अंबेडकर नगर में दो भाईयों ने जुगाड़ से कार को हेलीकॉप्टर बना दिया. डेंट- पेंट कराने जा रहे थे तभी पुलिस ने पकड़ लिया. और गाड़ी(हेलीकॉप्टर) सीज कर दी. pic.twitter.com/wK9QLaFZ1k — Priya singh (@priyarajputlive) March 17, 2024 (చదవండి: పార్కింగ్ స్థలంలో 1800 ఏళ్ల నాటి పురాతన విగ్రహం!) -
ఆలోచించండి ఓ అమ్మానాన్న.. ఈసీ వినూత్న ప్రయత్నం
ప్రస్తుత లోక్సభ ఎన్నికల గురించి ఉత్తరప్రదేశ్లోని పాఠశాల విద్యార్థులు త్వరలో తమ తల్లిదండ్రులకు లేఖలు రాయబోతున్నారు. "నా భవిష్యత్తు దేశంలోని బలమైన ప్రజాస్వామ్యంతో ముడిపడి ఉంది. దీని కోసం ఓటరు జాబితాలో మీ పేర్లను తప్పకుండా చూసుకుని రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసే ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరుకుంటున్నాను" అని పిల్లలు తమ తల్లిదండ్రులను కోరనున్నారు. జాతీయ సగటుతో సమానంగా రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం చొరవతో ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా జిల్లా యంత్రాంగం, విద్యా శాఖల సహకారంతో కృషి చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) చొరవలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఉత్తరప్రదేశ్లోని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు రాయడంలో సహాయం కోరుతూ డైరెక్టర్ జనరల్ (పాఠశాల విద్య)కి లేఖ రాసింది. 2024 లోక్సభ ఎన్నికలలో కుటుంబంలోని అర్హులైన సభ్యులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని పిల్లలు ఇచ్చే "ప్రతిజ్ఞ లేఖ"పై తల్లిదండ్రులు సంతకం చేయాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ సగటు జాతీయ సగటు కంటే చాలా తక్కువగా నమోదవుతూ వస్తోంది. 2019లో జాతీయ సగటు 67.4 శాతం ఉండగా ఉత్తరప్రదేశ్లో 59.21 శాతం పోలింగ్ నమోదైంది. అదేవిధంగా 2014లో దేశ సగటు 66.44 శాతం ఉండగా ఉత్తరప్రదేశ్లో 58.44 శాతం ఓటింగ్ నమోదైంది.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
సూర్యప్రభ వాహనంపై గోవిందుడు
బడి బస్.. ఫిట్నెస్
పది సప్లిమెంటరీ పరీక్షకు 1073 మంది హాజరు
కౌంటింగ్కు పటిష్టంగా భద్రత
No Headline
ఇంటర్ మ్యాథ్స్–బి, హిస్టరీ పరీక్షలు ప్రశాంతం
అవాంఛనీయ సంఘటనలకు తావివ్వొద్దు
తత్కాల్ ఫార్మ్స్పై నంబర్లు వేసి ఇవ్వాలి
రోడ్డు ప్రమాదంలో సిరికల్చర్ ఉద్యోగి మృతి
ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ
తప్పక చదవండి
- గంగానది నుంచి బయటకొచ్చిన భారీ మొసలి.. తర్వాత ఏం జరిగిందంటే
- ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్.. నిందితుడు అరెస్ట్
- అదుపుతప్పి లోయలో పడిన బస్సు.. 28 మంది మృతి
- నీటి వృథాపై ఢిల్లీ జల్బోర్డు కీలక నిర్ణయం
- T20 WC: ఓపెనర్గా రోహిత్ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!
- భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?
- 1,200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ట్యాపింగ్ ఆపింది అప్పుడే!
- 16కు తగ్గదు.. 30కి పెరగదు.. ఏసీతో ఎందుకలా?
- పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండి
- ఏపీ ప్రజా తీర్పు.. ఇంకో 6 రోజులే!
Advertisement