త్వరలో తొలి స్లీపర్‌ వందేభారత్‌.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? | Sakshi
Sakshi News home page

First Sleeper Vande Bharat: త్వరలో తొలి స్లీపర్‌ వందేభారత్‌.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?

Published Sun, Apr 7 2024 8:54 AM

India First Sleeper Vande Bharat Express may run between Gorakhpur New Delhi - Sakshi

దేశంలోని తొలి ‍స్లీపర్‌ వందేభారత్‌ త్వరలో పట్టాలపై పరుగులు తీయనుంది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్- న్యూఢిల్లీ మధ్య  స్లీపర్ వందే భారత్‌ను నడపడానికి ఈశాన్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 

ఇండియన్ రైల్వే టైమ్ టేబుల్ కమిటీ (ఐఆర్‌టీటీసీ) ఏప్రిల్ 10 నుంచి 12 వరకు జైపూర్‌లో సమావేశం కానుంది. దీనిలో ఈ రైలుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని రైల్వే జోన్ల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు.. కొత్త రైళ్లను నడపడం, ట్రిప్పులను పెంచడం, రూట్లను మార్చడం తదితర అంశాలపై చర్చించనున్నారు. 

ఈశాన్య రైల్వే రూపొందించిన ప్రతిపాదన ప్రకారం నూతన స్లీపర్‌ వందేభారత్‌ రైలు వారానికి మూడు రోజులు నడవనుంది. గోరఖ్‌పూర్ నుంచి రాత్రి వేళల్లో ఈ రైలును నడపాలని ప్రతిపాదించారు. ఈ రైలు గోరఖ్‌పూర్ నుండి న్యూఢిల్లీకి 12 గంటల్లో చేరుకుంటుంది. ఈ సమావేశంలో ఈ రైలుకు ఆమోదం లభిస్తే 2024, జూలై నుంచి ఈ రైలు రాకపోకలు సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

గోరఖ్‌పూర్ నుంచి న్యూఢిల్లీకి నేరుగా రైలు నడపాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రస్తుతం గోరఖ్‌పూర్ నుండి ప్రయాగ్‌రాజ్ వరకు వందే భారత్ రైలు నడుస్తోంది. నూతన ప్రతిపాదనల ప్రకారం స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గోరఖ్‌పూర్ నుండి రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. అంటే గోరఖ్‌పూర్‌ నుంచి ఢిల్లీకి కేవలం 12 గంటల్లోనే చేరుకోవచ్చు. 

Advertisement
Advertisement