‘స్టార్‌ చంద్రు’.. రెండో దశ పోలింగ్‌లో రిచ్‌ ఈయనే.. | Sakshi
Sakshi News home page

‘స్టార్‌ చంద్రు’.. రెండో దశ పోలింగ్‌లో రిచ్‌ ఈయనే..

Published Fri, Apr 26 2024 7:58 AM

Lok Sabha Election 2024 Phase 2 Richest Candidate

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ శుక్రవారం జరుగుతోంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలు , కర్ణాటకలోని 28 స్థానాలకు గాను 14, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో 8 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 6 సీట్లు, అస్సాం, బీహార్‌లలో 5 సీట్లకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌లో మూడు సీట్లు, మణిపూర్, త్రిపుర, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కో స్థానానికి పోలింగ్‌ జరుగుతోంది.

అత్యంత ధనిక అభ్యర్థులు వీళ్లే..

  • అభ్యర్థుల ఎలక్షన్‌ అఫిడవిట్లపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్‌ వాచ్‌ చేసిన విశ్లేషణ ప్రకారం.. 'స్టార్ చంద్రు'గా ప్రసిద్ధి చెందిన కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు వెంకటరమణే గౌడ ఫేజ్ 2 పోలింగ్‌లో అత్యంత ధనవంతుడు. హెచ్‌డీ కుమారస్వామిపై పోటీ చేస్తున్న ఈయన రూ.622 కోట్ల ఆస్తులను ప్రకటించారు .
  • ఇక రూ. 593 కోట్లతో రెండవ అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు ప్రస్తుత కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్. ఈయన కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు.
  • మథుర లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ హేమమాలిని రూ. 278 కోట్ల ఆస్తులతో మూడో అత్యంత ధనిక అభ్యర్థిగా ఉన్నారు.
  • మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత సంజయ్ శర్మ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన రూ.232 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించారు .
  • కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నారు. ఆయన ప్రకటించిన మొత్తం ఆస్తులు రూ.217.21 కోట్లు.

వీళ్లే పేద అభ్యర్థులు

  • మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్ష్మణ్ నాగోరావ్ పాటిల్ రెండో దశలో అత్యల్ప ఆస్తులు కలిగిన అభ్యర్థిగా నిలిచారు. ఆయన కేవలం రూ.500 విలువైన ఆస్తులను ప్రకటించారు.
  • రెండో స్థానంలో కేరళలోని కాసరగోడ్ నుండి పోటీ చేస్తున్న మరొక స్వతంత్ర అభ్యర్థి రాజేశ్వరి కేఆర్ రూ.1,000 విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. 
  • అమరావతి (SC) నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ప్రవేశించిన పృథ్వీసామ్రాట్ ముకిందరావ్ దీప్వాన్ష్ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. ఈయన మొత్తం ఆస్తులు రూ.1,400. 
  • రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న దళిత క్రాంతి దళ్ నాయకుడు షహనాజ్ బానో రూ. 2,000 ఆస్తులను ప్రకటించారు. 
  • కేరళలోని కొట్టాయం నుండి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) తరపున పోటీ చేస్తున్న వీపీ కొచుమోన్ రూ.2,230 ఆస్తులతో జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నారు.

Advertisement
Advertisement