కమనీయం.. రమణీయం | Sakshi
Sakshi News home page

కమనీయం.. రమణీయం

Published Thu, Apr 18 2024 2:00 PM

నాచగిరిలో  సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న పురోహితులు, చిత్రంలో ఈఓ అన్నపూర్ణ తదితరులు - Sakshi

గురువారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2024
వైభవంగా సీతారాముల కల్యాణం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట)/చిన్నకోడూరు(సిద్దిపేట): శ్రీరామనవమి సందర్భంగా జిల్లా కేంద్రంలో బుధవారం సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని రామాలయం, హనుమాన్‌ ఆలయాలు, వెంకటేశ్వర ఆలయాలు, శివాలయాలు, వైష్ణవ ఆలయాలు, గణపతి ఆలయం, శివాలయాలు, షిర్డీ సాయి ఆలయం, సంతోషిమాత ఆలయం, పార్వతీదేవి ఆలయం, కన్యకా పరమేశ్వరి ఆలయం, మార్కండేయ ఆలయంతో పాటుగా అమ్మవార్ల ఆలయాలలో కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న, తీర్థ ప్రసాదాలు అందించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో నిర్వహించిన రాములోరి కల్యాణానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రామ నామం సకల పాపాలను హరించి వేస్తుందన్నారు. హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం బోధిస్తుందన్నారు. కష్టంలో భర్తతో కలిసి నడవాలన్నది సీతతత్వమన్నారు. రాముడు కష్టాల్లో మనో నిబ్బరంతో ముందుకు సాగి విజయం సాధించారన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ రాముడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాముని అనుగ్రహంతో అన్నింటా శుభం జరగాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. కాగా, పట్టణంలోని ఆలయాల వద్ద పోలీస్‌లు గట్టి బందోబస్తు నిర్వహించారు. చిన్నకోడూరులో..

చిన్నకోడూరు మండలం మాచాపూర్‌, కస్తూరిపల్లి, మేడిపల్లి, రామన్నపల్లి గ్రామాల్లో బుధవారం జరిగిన సీతారాముల కల్యాణ వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రత్యేక పూజలు చేశారు.చంద్లాపూర్‌లోని హనుమాన్‌ దేవాలయంలో జరిగిన వేడుకల్లో జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నాచగిరి నవమి శోభితం

వర్గల్‌(గజ్వేల్‌): సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. బుధవారం శ్రీరామనవమి పర్వదిన వేళ నాచగిరి మహామండపం వేదికగా నిర్వహించిన కల్యాణోత్సవం భక్తజనావళికి నేత్రపర్వం చేసింది. ఉదయం 10.30 గంటలకు పురోహిత, భక్తజన పరివారం నడుమ సర్వాలంకార శోభితులైన సీతారామచంద్రమూర్తులు గర్భగుడి నుంచి కల్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు. ఆలయ ఈఓ అన్నపూర్ణ, కల్యాణ దాతలు గంప శివకుమార్‌ దంపతులు స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. పురోహితులు గోపాలకృష్ణ శర్మ, రమేష్‌శర్మ నేతృత్వంలో శ్రీసీతారాముల ఎదుర్కోలు ఘట్టం, యజ్ఞోపవిత ధారణ, కంకణ ధారణ తదితర వివాహ తంతు నిర్వహించారు. సుముహుర్త వేళ ముక్కోటి దేవతల సాక్షిగా శ్రీరామచంద్రమూర్తి.. సీతమ్మ మెడలో మంగళ సూత్ర ధారణ గావించారు.

సిద్దిపేట: రామాలయంలో నిర్వహించిన సీతారాముల కల్యాణంలో హరీశ్‌రావు
1/1

సిద్దిపేట: రామాలయంలో నిర్వహించిన సీతారాముల కల్యాణంలో హరీశ్‌రావు

Advertisement
Advertisement