శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ ఛాంపియన్‌గా శ్రీలంక | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ ఛాంపియన్‌గా శ్రీలంక

Published Wed, May 8 2024 4:13 PM

Sri Lankan Women Are The Champions Of T20 World Cup 2024 Qualifier

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌-2024 పోటీల్లో శ్రీలంక జట్టు విజేతగా అవతరించింది. అబుదాబీలో నిన్న (మే 7) జరిగిన ఫైనల్లో లంక జట్టు స్కాట్లాండ్‌పై 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లంక కెప్టెన్‌ చమారీ ఆటపట్టు మెరుపు శతకంతో (63 బంతుల్లో 102; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక చమారీ రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో చమారీ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. నీలాక్షి డిసిల్వ 26 నాటౌట్‌, కవిశ దిల్హరి 15, విశ్మి గుణరత్నే 9, హర్షిత మాధవి 8, హాసిని పెరెరా 0 పరుగులు చేశారు. స్కాట్లాండ్‌ బౌలర్లలో రేచల్‌ స్లేటర్‌ 2, ప్రయనాజ్‌, కేథరీన్‌ ఫ్రేజర్‌, అబ్తహా మక్సూద్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం​ 170 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో​కి దిగిన స్కాట్లాండ్‌ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 101 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉదేషిక ప్రబోధని 3 వికెట్లతో చెలరేగగా.. ఇనోశి ప్రియ, సుగందిక కుమారి, కవిశ దిల్హరి తలో వికెట్‌ పడగొట్టారు. 

స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌లో ప్రియనాజ్‌ (30) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలంక, స్కాట్లాండ్‌ జట్లు ఈ ఏడాది అక్టోబర్‌లో జరుగబోయే మహిళల టీ20 ప్రపంచకప్‌కు క్వాలిఫై అయ్యాయి. మహిళల పొట్టి ప్రపంచకప్‌ బంగ్లాదేశ్‌ వేదికగా అక్టోబర్‌ 3న ప్రారంభమవుతుంది.

 

Advertisement
Advertisement