తలుపుల: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారంలో ఓ రేషన్ డీలర్ పాల్గొనడం చర్చనీయాంశమైంది. తలుపుల మండలం నూతన కాల్వ గ్రామంలో సోమవారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గెరికపల్లి రేషన్షాపు(21) డీలర్ బి.రామకృష్ణారెడ్డి పాల్గొని, టీడీపీకి ఓటు వేయాలంటూ అభ్యర్థించారు.
కందికుంట అనుచరుడిపై కేసు నమోదు
కదిరి టౌన్: కందికుంట వెంకటప్రసాద్ అనుచరుడు బేల్దారి శ్రీనివాసులుపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పుల్లయ్య తెలిపారు. పట్టణంలోని శివాలయం వీధికి చెందిన శేషగిరి అదే వీధికి చెందిన బేల్దారి శ్రీనివాసులుపై పట్టణ పోలీస్స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. గతంలో వినాయకచవితి పండుగకు చందా ఇవ్వలేదని అక్కసు పెంచుకున్న శ్రీనివాసులు... మార్చి 30న కదిరిలో రథోత్సవం సాగుతుండగా మరొకరిపై దాడి చేస్తున్న అంశాన్ని తేరుపై నుంచి శేషగిరి తన సెల్ఫోన్లో వీడియో తీశాడు. ఈ విషయాన్ని గమనించిన శ్రీనివాసులు ఆ మరుసటి రోజు శేషగిరిపై దాడి చేసి, చంపుతానని బెదిరించాడు. శ్రీనివాసులు నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్లుగా బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు సీఐ తెలిపారు.