కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో కరోనా కేసులు మంగళవారం 516కు చేరాయి. కొత్తగా 25 మందికి వైరస్ సోకింది. ఇందులో కర్నూలు నగరంలోనే 18 మంది, నంద్యాలలో ముగ్గురు, చిప్పగిరి మండలంలో ముగ్గురు, కర్నూలు మండలంలో ఒకరు వైరస్ బారిన పడ్డారు. మొత్తంగా కర్నూలు నగరంలో 324 మంది, నంద్యాల పట్టణంలో 104 మంది కరోనా బాధితులు ఉన్నారు. కాగా.. రాష్ట్ర కోవిడ్ హాస్పిటల్ (పెద్దాసుపత్రి)లో అత్యాధునిక వసతులతో పది పడకల ఐసీయూ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విభాగాన్ని మంగళవారం కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.చంద్రశేఖర్..ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ విజయ్భాస్కర్, డీఈ రాజగోపాల్రెడ్డి, జేఈ నరేంద్రతో కలిసి పరిశీలించారు.
♦ కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మా సేకరణకు కర్నూలు పెద్దాసుపత్రి రక్తనిధికి అనుమతి ఇస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
శాంతిరాం నుంచి 12 మంది డిశ్చార్జ్
నంద్యాల: కరోనాను జయించిన 12 మందిని శాంతిరాం కోవిడ్ ఆసుపత్రి నుంచి మంగళవారం డిశ్చార్జ్ చేశారు. వీరిలో నంద్యాల పట్టణానికి చెందిన 8 మంది, బనగానపల్లె, కర్నూలుకు చెందిన ఒక్కొక్కరు, ఆత్మకూరుకు చెందిన ఇద్దరు ఉన్నారు. వీరితో కలిపి జిల్లాలో ఇప్పటివరకు 127 మంది కరోనాను జయించారు.