యాక్టివ్‌ కేసులు 50 క్లస్టర్లలోనే

30 Apr, 2020 04:23 IST|Sakshi

70 క్లస్టర్లలో 14 రోజులుగా కేసులే లేవు

ఎక్కువ టెస్టులు చేస్తున్నాం కాబట్టే కేసులు వస్తున్నాయి

పాజిటివ్‌ కేసులు 1.5 శాతమే

‘సాక్షి’ టీవీతో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా. కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం వల్ల కంగారు పడక్కర్లేదని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’టీవీతో మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఎక్కువ టెస్టులు చేస్తున్నాం కాబట్టే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని,  అయితే కేసుల సంఖ్య ముఖ్యం కాదని,  ఇన్ఫెక్షన్‌ ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి వారిని.. ఆస్పత్రిలో వైద్యం అందిస్తే మిగతా వారికి వైరస్‌ సోకకుండా కాపాడుకోగలమని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

► ప్రస్తుతం 200 క్లస్టర్లలోనే కేసులు నమోదు. 
► వాటిలో 50 క్లస్టర్లలోనే యాక్టివ్‌ కేసులు.
► 70 క్లస్టర్లలో 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
► మరో 50 క్లస్టర్లలో ఐదు రోజులుగా కేసులు నమోదు కాలేదు.
► 90% కేసులు కంటెయిన్‌మెంట్‌ క్లస్టర్లలోనే నమోదవుతున్నాయి.. దీన్ని బట్టి చూస్తే వైరస్‌ వ్యాప్తి ఇతర ప్రాంతాలకు తక్కువగా ఉంది
► ఎక్కువ టెస్టులు చేస్తున్నా పాజిటివ్‌ శాతం 1.5 మాత్రమే.
► మే 3 తర్వాత గ్రీన్‌జోన్‌లలో లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశాలున్నాయి. ఈలోపు ఎక్కడ ఇన్ఫెక్షన్‌ ఉన్నా కనుక్కునేందుకు ముమ్మరంగా టెస్టులు చేస్తున్నాం.
► ఎక్కువ మందిని గుర్తిస్తే వారిని క్వారంటైన్‌ చేసే అవకాశం ఉంది.
కరోనా వైరస్‌ వచ్చే నాటికి మన రాష్ట్రంలో 90 టెస్టులు మాత్రమే చేశాం..ఇప్పుడు 7500 టెస్టులు చేసే స్థాయికి వచ్చాం.
► 9 వైరాలజీ ల్యాబొరేటరీలు ఉన్నాయి.. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరుల్లో కొత్త ల్యాబొరేటరీలు ఏర్పాటు చేస్తున్నాం.
► 240 ట్రూనాట్‌ మెషీన్ల ద్వారా టెస్టులు చేస్తున్నాం.. మరో 100 మెషీన్లు కొనుగోలు చేశాం.
► టెలీ మెడిసిన్‌కు ఫోన్‌ చేసిన వారు స్పందించే వరకూ కనీసం 9సార్లు ఫోన్‌ చేయాలని సీఎం ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు