పాజిటివ్‌ ఉన్నా లక్షణాల్లేవా!

6 Jul, 2020 05:00 IST|Sakshi

అయితే భయపడాల్సిన పనిలేదు.. 

అలాంటి వారిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్టు 

సాక్షి, అమరావతి: కరోనా పాజిటివ్‌ వచ్చినప్పుడు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం తదితర లక్షణాలు బయటపడతాయి. అయితే చాలా మందికి వైరస్‌ సోకినా ఆ లక్షణాలేవీ కనిపించవు. ఆ తర్వాత కోలుకుంటారు. అయితే అలాంటి వారికి ఎలాంటి ప్రమాదం ఉంటుందనే అనుమానాలు పలువురిలో ఉన్నాయి. వీరి నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాపించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? లక్షణాలు కనిపించని వారికి ఇన్ఫెక్షన్‌ కారణంగా శరీర భాగాలేమైనా దెబ్బతినే అవకాశం ఉందా.. అన్నదానిపై కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వీటిపై నిపుణులు ఏమంటున్నారంటే..  

► అసింప్టమాటిక్‌ (ఎలాంటి లక్షణాలు కనిపించని) వారు కంగారుపడాల్సిన పనిలేదు. కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీస్‌ ఎక్కువగా ఉన్నందునే అది ప్రభావం చూపలేకపోయిందని అర్థం.  
► శ్వాసకోశ సమస్య ఉంటే తప్ప వారికి ఆస్పత్రి వైద్యం అవసరం లేదు. ఇంట్లో ఉండి వైద్యం చేసుకుంటే సరిపోతుంది. 
► ఇలాంటి వారి నుంచి వైరస్‌ ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. వైరస్‌ సోకిన 10 రోజుల్లోపే అలాంటి వారి నుంచి వైరస్‌ ఇతరులకు సోకుతుంది. ఆ తర్వాత అది బలహీన పడిపోతుంది. 
► ఎలాంటి వైద్యమూ లేకుండానే కోలుకున్నా వారి శరీర భాగాలేవీ దెబ్బతినవు 

కోలుకునే అవకాశాలే ఎక్కువ 
చాలామంది అసింప్టమాటిక్‌ వ్యక్తులు తమకు పాజిటివ్‌ అని తెలిశాక డీలా పడుతున్నారు. వీళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ భయపడాల్సిన పనిలేదు. మిగతా వారితో పోలిస్తే వీరికి త్వరగా కోలుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.      
– డా.రాంబాబు,నోడల్‌ ఆఫీసర్, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

>
మరిన్ని వార్తలు