పాజిటివ్‌లు 648.. డిశ్చార్జ్‌ 735

13 May, 2020 03:46 IST|Sakshi

గత 12 రోజులుగా పెరుగుతున్న కోలుకుంటున్న వారి సంఖ్య 

మొత్తం 2,051 పాజిటివ్‌ కేసుల్లో చికిత్స పొందుతోంది కేవలం 949 మంది మాత్రమే 

దేశంలో చేసిన మొత్తం పరీక్షల్లో 11 శాతం మన రాష్ట్రానివే 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నాయి. ఏప్రిల్‌ 15 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఆందోళన పెంచిన కరోనా కేసులు మే 1 నుంచి క్రమంగా తగ్గుతున్నాయి. గత 12 రోజుల్లో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల కంటే కోలుకుని డిశ్చార్జ్‌ అవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. గత 12 రోజుల్లో 648 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 735 మంది కరోనాను జయించి వారి ఇళ్లకు వెళ్లడం గమనార్హం. ఏప్రిల్‌లో అత్యధికంగా ఒకే రోజు 82 కేసుల వరకు నమోదైన కేసుల సంఖ్య మంగళవారం 33 కేసులకే పరిమితమైంది.

ఓవైపు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఉధృతంగా పెరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అందుకు భిన్నంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీన్నిబట్టి కరోనా వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందో తెలుస్తోంది. విదేశాల నుంచి వచ్చినవారు, ఢిల్లీ నుంచి వచ్చిన వారి ప్రమాదం ఇప్పుడెక్కడా లేదని, కోయంబేడు మూలాలు మాత్రమే చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఉన్నాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ఇలా.. 
► ఈ నెల 12 నాటికి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,051 కాగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది కేవలం 949 మంది మాత్రమే 
► దీన్ని బట్టి 46.2 శాతం మంది మాత్రమే చికిత్స తీసుకుంటున్నట్టు లెక్క 
► 51.49 శాతం మంది చికిత్స తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. 
► భారతదేశంలో మంగళవారం నాటికి నమోదైన మొత్తం కేసుల్లో ఏపీ భాగస్వామ్యం కేవలం 2.9 శాతం మాత్రమే. రాష్ట్రంలో గత 24 గంటల్లో అత్యధికంగా ఒకే రోజు 10,730 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు 
► దేశవ్యాప్తంగా కరోనాతో 2,294 మంది మృతి చెందగా ఏపీలో 46 మంది మాత్రమే మరణించారు. ఈ లెక్కన మృతులు ఏపీలో 2 శాతం మాత్రమే ఉన్నారు. 
► దేశంలో ఇప్పటివరకు 17.59 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 11 శాతం అంటే 1.91 లక్షలకు పైగా టెస్టులు ఏపీలోనే జరిగాయి. 

ఏపీలో 2,051 కేసులు
రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మంగళవారం నాటికి 2,051కి చేరింది. గత 24 గంటల్లో 10,730 శాంపిళ్లను పరీక్షించగా కొత్తగా 33 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 2,051 పాజిటివ్‌ కేసుల్లో ఇప్పటివరకు 1,056 మంది కోలుకున్నారు. కొత్తగా నమోదైన 33 కేసుల్లో 20 కేసులు తమిళనాడులోని కోయంబేడుకు వెళ్లి వచ్చినవారివే. గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో 35, కర్నూలు జిల్లాలో 17, అనంతపురం జిల్లాలో 3, వైఎస్సార్, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 58 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. మొత్తం మీద 949 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

మరిన్ని వార్తలు