-

జిల్లాకొక కంట్రోల్‌ రూమ్‌

20 Jul, 2020 02:51 IST|Sakshi

కరోనా లక్షణాలున్నా, వైద్యం వివరాలు కావాలన్నా సంప్రదిస్తే చాలు

చికిత్స పొందుతున్న వారి సమాచారం ఎప్పటికప్పుడు కుటుంబీకులకు

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ వేగంగా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం

24 గంటలూ కంట్రోల్‌ రూమ్‌లు పనిచేసేలా ఏర్పాట్లు

సమాచార లోపంతో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేలా చర్యలు

కంటైన్మెంట్‌ జోన్లలో కోవిడ్‌ లక్షణాలున్న వారందరికీ పరీక్షలు 

చేర్చుకోకుంటే ఫిర్యాదు చేయవచ్చు
ప్రస్తుతం 104 కాల్‌ సెంటర్‌ ఉండగా కొత్తగా జిల్లా కేంద్రానికి ఒకటి చొప్పున 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తారు. 3 షిఫ్టుల్లో షిఫ్ట్‌కు ఐదుగురు చొప్పున సిబ్బంది పనిచేస్తారు. జిల్లా పరిధిలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, ఆస్పత్రుల సమాచారం ఇస్తారు. టెస్టుకు వెళ్లిన వారి ఫలితాల సమాచారమిస్తారు. బాధితులు ఎక్కడ, ఏ ఆస్పత్రిలో చికిత్స పొందాలో సూచిస్తారు. కోవిడ్‌ కేర్‌లోగానీ, ఆస్పత్రిలోగానీ చేర్చుకోకుంటే వెంటనే ఫిర్యాదు స్వీకరించి అధికారులకు తెలియజేస్తారు.  (అమ్మో.. ఆఫీసుకా?)

సాక్షి, అమరావతి: కరోనా లక్షణాలు కనిపిస్తే ఎక్కడికి వెళ్లాలో తెలియక సతమతం.. వైరస్‌కు వైద్య చికిత్స ఎక్కడో అవగాహన లేక ఆందోళన.. ఆస్పత్రుల్లో చేరిన వారి యోగక్షేమాలపై కుటుంబీకుల బెంగ... సమాచార లోపం కారణంగా తలెత్తుతున్న ఇలాంటి పరిస్థితులన్నీ అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చికిత్స పొందుతున్న బాధితులకు భరోసా కల్పిస్తూ వారి కుటుంబీకులు, బంధువులకు క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియచేసి ఆందోళన తొలగించేలా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కోవిడ్‌ కంట్రోల్‌ రూంలు వేగంగా అందుబాటులోకి తెస్తోంది. విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసి మరిన్ని సేవలు అందుబాటులోకి తేవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.  (24 గంటల్లో 2.6 లక్షల మందికి)

కంటైన్మెంట్‌ జోన్లపై ప్రత్యేక కార్యాచరణ..
► కంటైన్మెంట్‌ జోన్లలో హైరిస్క్‌ కేటగిరీ వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించారు.
► ఆ ప్రాంతాల్లో కోవిడ్‌ లక్షణాలున్న వారందరికీ పరీక్షలు నిర్వహిస్తారు.
► పల్సాక్సీ మీటర్ల ద్వారా ఆక్సిజన్‌ శాతాన్ని పరీక్షించి తక్కువగా ఉన్నవారిని చికిత్సకు పంపుతారు. 
► స్థానికంగా నమూనాల సేకరించి ఫలితాలు తెలియజేస్తారు. 
► ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టు ద్వారా పరీక్షలు నిర్వహించి వెంటనే నిర్ధారిస్తారు.

ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెస్క్‌లు.. 
► కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, రాష్ట్ర కోవిడ్‌ ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటవుతున్నాయి.
► పాజిటివ్‌ బాధితుల బంధువులు, సంబంధీకులు ఫోన్‌ చేయగానే ఇవి సమాచారం అందిస్తాయి.
► అడ్మిషన్లు, డిశ్చార్జ్‌లకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలియ చేస్తాయి.
► హెల్ప్‌ డెస్క్‌ల పర్యవేక్షణకు ప్రతి ఆస్పత్రిలోనూ నోడల్‌ అధికారి ఉంటారు.
► హెల్ప్‌ డెస్క్‌కు ప్రత్యేక నంబర్‌ కేటాయించి ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తారు. 

ఇంటి నుంచి ఫోన్‌లోనే సమాచారం..
► పాజిటివ్‌ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఆస్పత్రులకు వారి బంధువులు నేరుగా వచ్చి యోగక్షేమాలు విచారించే అవకాశం లేనందున ఇంటి నుంచి ఫోన్‌ చేసినా బాధితులకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని చేరవేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 
► ప్రస్తుతం విజయవాడలో స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ ఉండగా ఇకపై ప్రతి జిల్లాలోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తక్షణం చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఎప్పుడు ఫోన్‌ చేసినా కరోనాకు సంబంధించి ఎలాంటి సమాచారమైనా తెలియచేసేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

ఎవరూ ఇబ్బంది పడకూడదనే కంట్రోల్‌ రూమ్‌లు
కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచార లోపంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక, ఎక్కడ వైద్యం లభిస్తుందో అవగాహన లేక ఎవరూ ఇబ్బంది  పడకూడదనే ఉద్దేశంతో ఈ కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేస్తున్నాం. వీటిల్లో 24 గంటలూ పనిచేసేలా సిబ్బందిని సమకూర్చాలని, అదనపు టెలిఫోన్‌ లైన్‌లు ఏర్పాటు చేయాలని, తక్షణమే వీటిని అమల్లోకి తేవాలని కలెక్టర్లను ఆదేశించాం – డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

మరిన్ని వార్తలు