గడువు గండం

21 Jun, 2016 01:43 IST|Sakshi

ఈ నెల 27 నాటికి ఉద్యోగులు  తరలిరావాలని సీఎం ఆదేశం
మిగిలింది ఆరు రోజులే
ఒక్క భవనం కూడా పూర్తికాని  తాత్కాలిక సచివాలయం
మరో రెండు నెలలు పడుతుందంటున్న ఇంజనీరింగ్ అధికారులు
‘సాక్షి’ పరిశీలనలో వెల్లడి

 

వెలగపూడిలో ప్రభుత్వం రూ.600 కోట్ల వ్యయంతో 45 ఎకరాల్లో నిర్మిస్తున్న తాత్కాలిక సచివా లయ పనులు ఇంకా కొలిక్కి రాలేదు. ప్రధానమైన ఆరు బ్లాకుల నిర్మాణంలో ఒక్కటీ ఇప్పటివరకూ పూర్తికాలేదు. ఆరో బ్లాకు నిర్మాణం ఇంకా పునాదుల్లోనే ఉంది. తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రెయిన్ల పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. మరో రెండు నెలల వరకు పనులు  పూర్తయ్యే అవకాశం లేదని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.

 

సీఎం కార్యాలయం, సీఎస్, సాధారణ పరిపాలన విభాగం, న్యాయశాఖ, సీఎం హామీల పరిష్కారం కోసం ఈ బ్లాక్‌ను కేటాయించారు. ప్రస్తుతం ఆరు బ్లాకులు పూర్తిచేయలేమని ఇంజినీర్లు చెప్పడంతో మొదటి బ్లాక్ అయినా పూర్తిచేసి ఈనెల 27 నాటికి కార్యక్రమాలు నిర్వహిం చాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అయితే, మొదటి బ్లాకు కూడా 27         నాటికి పూర్తయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం 50శాతం పనే అయ్యింది. లోపల పూర్తిస్థాయిలో గదుల నిర్మాణం జరగలేదు. ఓపక్క ఫ్లోరింగ్, మరోపక్క సీలింగ్, ఇంకోవైపు వైట్‌వాష్, వైరింగ్ పనులు చేస్తున్నారు. అదేవిధంగా.. రెండో అంతస్తులో గోడలు కాకుండా ఫైబర్ ప్లేట్స్‌తో చిన్నచిన్న గదులు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే గానీ ఫ్యాన్లు, సెంట్రల్ ఏసీ పనులు ప్రారంభించే అవకాశమే లేదు.

 

రహదారులు ఛిద్రం
తాత్కాలిక సచివాలయానికి వెళ్లడానికి ఇప్పటివరకు సరైన రహదారి లేదు. ప్రస్తుతం మందడం నుంచి సింగిల్ లైన్ రోడ్డు ఉంది.  అది కూడా గుంతలు పడి దర్శనమిస్తోంది. ఒక వాహనం వస్తే.. ఎదురుగా వస్తున్న వాహనం తప్పించుకు వెళ్లడానికి ఇబ్బందికర పరిస్థితి. వర్షం వస్తే రోడ్డుకిరువైపులా వాహనం ఇరుక్కునే అవకాశం ఉంది. ఈ ఒక్క రోడ్డు తప్ప సచివాలయానికి వెళ్లటానికి మరో మార్గం లేదు.  మంగళగిరి నుంచి ఐనవోలు మీదుగా సచివాలయానికి రహదారి ఉన్నా ఛిద్రమై కనిపిస్తోంది. ఇటీవల ప్యాచ్ వర్క్ పనులు చేపట్టినా ప్రయోజనం లేదు. సచివాలయ ప్రాంగణంలో గ్రావెల్ రోడ్లు శరవేగంగా చేస్తున్నారు. గ్రావెల్ పనులు తాత్కాలిక సచివాలయ పనులు పూర్తయ్యాక తారురోడ్డు లేదా సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఆ పనులు ప్రారంభం కావడానికి మరి కొన్నిరోజులు పట్టే   అవకాశం ఉంది. ప్రస్తుతం కురిసిన వర్షాలకు సచివాలయ ప్రాంగణమంతా బురదగా మారింది.

 

 
హోంశాఖ, విద్యుత్, పరిశ్రమలు, మున్సిపల్ అడ్మిస్ట్రేషన్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రిత్వశాఖ కార్యాలయాలు, ఆర్థికశాఖ, ప్రణాళికా విభాగం ఇందులో ఉంటాయి. ఈ బ్లాక్‌లో పిల్లర్లు, శ్లాబ్ పనులు  పూర్తయ్యాయి. మిగిలిన పనుల్లో ఇప్పుడిప్పుడే గదుల నిర్మాణం ప్రారంభించారు. మిగిలిన ఏ పనీ ప్రారంభం కాలేదు. ఇప్పుడే పనులు ప్రారంభించినా నెలరోజులు పడుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. టెలికం, బీఎస్‌ఎన్‌ఎల్ సర్వర్, ఏపీ టీఎస్ సచివాలయ సపోర్ట్ యూనిట్, పే అండ్ అకౌంట్స్, మీసేవ, ఈసేవ, రైల్వే, బస్ రిజర్వేషన్ కౌంటర్లు, పోస్టాఫీసు, బ్యాంక్, రెండు ఏటీఎంలు, షాపులు, కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యాలయం, ప్లే స్కూల్, మూడు పడకల డిస్పెన్సరీ, రిక్రియేషన్, లైబ్రరీ, రెస్టారెంట్, సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమం, స్కిల్ డెవలప్‌మెంట్, యువజన సంక్షేమం, టూరిజం, సాంస్కృతిక శాఖలు ఇందులో ఉంటాయి. ఇప్పటివరకు ఈ బ్లాక్‌లో పిల్లర్లు, శ్లాబులు మాత్రమే పూర్తిచేశారు. గోడల నిర్మాణం ప్రారంభించారు. గదుల నిర్మాణం పూర్తిచేయాలి. పూత, ఫ్లోరింగ్, సీలింగ్, వైరింగ్, వైట్‌వాష్, వాష్‌రూమ్‌లు పూర్తి చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తికావాలన్నా నెలరోజులు పడుతుంది.

 

రెవెన్యూ, రెవెన్యూ విపత్తుల శాఖ, ఎన్విరాన్‌మెంట్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయం, సహకార శాఖ, పశుసంవర్థక, డెయిరీ, మత్స్య, పౌరసరఫరాల శాఖతో పాటు ఐదుగురు మంత్రులు, ఇద్దరు సలహాదారు కార్యాలయాలు ఇందులో ఉంటాయి. వాటర్ రిసోర్సెస్, రెయిన్ షాడో ఏరియా డెవలప్‌మెంట్, పాఠశాల, ఉన్నత విద్య, ఐటీ డేటా సెంటర్ ఏర్పాటుచేస్తారు. ఈ నాల్గో బ్లాక్‌లో గదుల నిర్మాణం జరుగుతోంది. మిగిలిన పనులన్నీ పూర్తికావాలంటే సుమారు నెలరోజులు పట్టే అవకాశం ఉంది.

 

పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, కార్మిక, ఉపాధి, గృహ నిర్మాణ శాఖలు, ట్రాన్స్‌పోర్ట్, రోడ్లు భవనాల శాఖ, విజిలెన్స్ కమిషన్, కాన్ఫరెన్స్ హాలు ఉంటాయి. బ్లాక్‌లో గదుల నిర్మాణం 60 శాతం పూర్తయ్యింది. మిగిలిన సగంలో ఓవైపు పనులను రెండురోజుల కిందటే ప్రారంభించారు. ఈ బ్లాక్‌లో మొత్తం పనులన్నీ పూర్తిచేసి జులై చివరినాటికి అందజేయగలమని ఇంజినీర్లు చెబుతున్నారు.  అసెంబ్లీ, స్పీకర్ కార్యాలయాలకు వారం కిందటే పునాదులు వేశారు. ఐదు బ్లాకులు పూర్తయితే తప్ప         ఆరో బ్లాక్ పనులుచేసే అవకాశం లేదని ఇంజినీర్లు స్పష్టం చేశారు.

 

నత్తనడకన విద్యుత్ ఏర్పాట్లు
తాత్కాలిక సచివాలయం పనులు పూర్తయ్యాక రోజుకు 6 ఎంవీఏ విద్యుత్ అవసరం అవుతుందని అంచనా. ఇందుకోసం విద్యుత్‌శాఖ తాడికొండ, తాడేపల్లి నుంచి విద్యుత్ లైన్ పనులు ప్రారంభించింది. మొత్తం 42 కిలోమీటర్ల దూరం పూర్తిచేయాల్సి ఉంది. ఈ పనులు 50 శాతం మాత్రం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. రాత్రింబవళ్లూ కష్టపడుతున్నా 27 నాటికి పనులు పూర్తయ్యేలా లేవు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రతి బ్లాక్‌లో పవర్ స్విచ్చింగ్ యూనిట్‌ను నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిసింది. అందుకు అవసరమైన పనులు ఇంకా ప్రారంభం కాలేదు.

 

భూగర్భ డ్రెయినేజీ ఎక్కడ?
హైదరాబాద్ నుంచి తాత్కాలిక సచివాలయానికి వచ్చే అధికారులు మొత్తం సుమారు 2వేల మంది వరకు ఉండొచ్చని సమాచారం. వీరందరూ వినియోగించి వదలివేసే వృథానీరు, మురుగు వెళ్లటానికి భూగర్భ డ్రెయినేజీ, సెప్టిక్ ట్యాంక్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటికి సంబంధించిన పనులేవీ ప్రారంభం కాలేదు. వర్షపు నీరు వచ్చినా వెలుపలకు వెళ్లే అవకాశం లేదు. ఈ పనులు పూర్తి చేయాలంటే సుమారు నెలరోజులకుపైనే పడుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. 

 

నీళ్లెప్పుడొస్తాయి?
ఆంధ్రప్రదేశ్ సచివాలయ సిబ్బంది, కార్యాలయ అవసరాల కోసం రోజుకు 7 లక్షల లీటర్ల నీరు అవసరం ఉంది. ఈ నీటిని ఎక్కడి నుంచి తీసుకురావాలనే విషయంపై ఇంతవరకు అధికారుల్లో స్పష్టత లేదు. కొందరు అధికారులు తుళ్లూరు ఎత్తిపోతల పథకం నుంచి పైపులైన్ ద్వారా తాత్కాలిక సచివాలయానికి తీసుకొస్తామని చెబుతున్నారు. మరికొందరు అధికారులు శాఖమూరు పెలైట్ ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. నీటి విషయంపై అధికారులు ఇప్పటివరకు స్పష్టత లేకపోతే సచివాలయ పనులు పూర్తయినా ప్రయోజనం శూన్యమే.

 

>
మరిన్ని వార్తలు