ముద్ర పడితేనే ముద్ద!

8 Oct, 2018 03:01 IST|Sakshi

ఈ–పాస్‌ వేలిముద్రలు సరిపోలకుంటే 15 దాకా ఆగాల్సిందే

వీరికి రేషన్‌ పంపిణీపై ఆ తర్వాతే సర్కారు నిర్ణయం  

వీఆర్వో అథెంటికేషన్‌ సదుపాయం ఈ–పాస్‌ నుంచి తొలగింపు

సాక్షి, అమరావతి: ఈ–పాస్‌ విధానం అమల్లోకి వచ్చి నాలుగేళ్లయినా చౌక ధరల దుకాణాల్లో పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. వివిధ కారణాలతో వేలి ముద్రలు సరిగా పడని కార్డుదారులకు రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ లేదా వీఆర్వో ధ్రువీకరణ ద్వారా సబ్సిడీ బియాన్ని ఇస్తున్నారు. అయితే ఈ నెల నుంచి ఈ–పాస్‌ మిషన్‌లో ఈ అవకాశాన్ని తొలగించారు. వేలి ముద్రల సమస్య ఉన్న కార్డుదారులకు రేషన్‌ ఎప్పుడు, ఎలా ఇవ్వాలనే అంశంపై ఈనెల 15వ తేదీ తర్వాత నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

పని చేయని ఐరిష్‌...
రాష్ట్రంలో 1.44 కోట్ల మంది తెల్ల రేషన్‌కార్డులుండగా 48.62 లక్షల మంది లబ్ధిదారులకు వేలి ముద్రలు సరిగా పడటం లేదు. ఈ–పాస్‌ వీరిని అనుమతించడం లేదు. ఐరిష్‌ మిషన్లు ఏర్పాటు చేసినా ఆర్నెళ్ల నుంచి పని చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. 2015 సెప్టెంబర్‌ నుంచి అమలు చేస్తున్న ఈ–పాస్‌ విధానం వల్ల ఇప్పటివరకు రూ.1,850 కోట్ల విలువైన దాదాపు 6 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఆదా అయినట్లు అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు