మద్యం చుక్క గొంతులోకి జారగానే..!

8 Aug, 2017 08:22 IST|Sakshi
మద్యం చుక్క గొంతులోకి జారగానే..!

మహాలక్ష్మి పుట్టిందనే తొలి జ్ఞాపకం.
నాన్నా.. అంటూ బుడిబుడి అడుగులతో గుండెలపై చిట్టితల్లి ఆటాడిన సంబరం.
రేయ్‌.. అన్నా.. పెద్దయ్య..
‘నీ కూతురు అచ్చం
మీ అమ్మలాగే ఉం’దంటూ.. ఊరోళ్లిచ్చిన కితాబు...
కూతురు కళ్లెదుట ఎదుగుతుంటే..
భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే బాధ్యత..
ఇవేవీ గుర్తుకు రాలేదు. మద్యం చుక్క గొంతులోకి జారగానే..
మంచి, చెడూ మత్తులోకి జారుకున్నాయి.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే అత్యాచారానికి తెగించాడు.....
పాము తన పిల్లల్ని తానే తిన్నట్లు.. కన్నతండ్రే కాటేశాడు.
నాన్నా! వదలమని ఏడ్చినా ఆ పశువు మనసు కరగలేదు..
పాపం! ఆ బంగారు తల్లి గొంతు మూగబోయింది.
ఘోరం తల్లికి చెప్పుకోలేక..
తండ్రి ముఖం చూడలేక..
ఇంట్లో ఓ మూలన కూర్చొని మౌనంగా రోదించింది.
దారుణం దాగలేదు.
అఘాయిత్యం బట్టబయలయింది.
పోలీసుస్టేషన్‌కు చేరింది.
ఈ తప్పెవరిది? మనిషి
ముసుగులోని మృగానిదా?
రాక్షసుడిని చేసిన మద్యం
మహమ్మారిదా?


► కూతురిపై తండ్రి అత్యాచారం!
►పోలీసుల అదుపులో కామాంధుడు

కంబదూరు: కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు.. మండల కేంద్రం కంబదూరుకు చెందిన బాలిక (14), కేజీబీవీలో 8వ తరగతి చదువుకుంటోంది. ఆదివారం మధ్యాహ్నం ఆ బాలిక తండ్రి పాఠశాల వద్దకెళ్లి తమ బంధువుల పెళ్లి ఉందని కుమార్తెను పంపాలని ఉపాధ్యాయులను అభ్యర్థించారు. దీంతో ఉపాధ్యాయులు బాలికను తండ్రితో పాటు పంపారు. అప్పటికే బాలిక తల్లి ఊరెళ్లిపోయింది. ఇంటిలో ఎవరూ లేరు.

బాలికను ఇంటి వద్ద వదిలిన తండ్రి కాసేపు బయటకెళ్లి ఫుల్‌గా మద్యం సేవించి, మత్తులో ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తలుపులు మూసి, బాలిక అరవకుండా నోటిలో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనతో బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. విషయాన్ని గుర్తించిన కామాంధుడు ఇంటి నుంచి పారిపోయాడు. సోమవారం ఉదయం ఇంటి వద్దకు చేరుకున్న బంధువులు బాలిక పరిస్థితి గమనించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ వెంకటరమణ, సీఐ శివప్రసాద్‌ విచారణ జరిపి, కామాంధుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, గతంలో కూడా ఓసారి కూతురిపై అత్యాచార యత్నానికి నిందితుడు పాల్పిడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కామాంధుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు