మెకానిక్ అనుమానాస్పద మృతి

14 Jan, 2014 03:05 IST|Sakshi

వేమగిరి (కడియం), న్యూస్‌లైన్ : డబ్బు విషయమై కుటుంబ సభ్యులతో గొడవపడ్డ ఓ లారీ మెకానిక్ ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కడి యం పోలీసుల కథనం ప్రకారం.. వేమగిరితోట కు చెందిన కుడిపూడి సురేష్ (26) లారీ మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. ఆదివారం రాత్రి 10 గం టల సమయంలో అతడు మద్యం తాగొచ్చి, కు టుంబ సభ్యులతో ఆర్థిక లావాదేవీలపై గొడవ పడ్డాడు. ఇంట్లో వాళ్లపై గొడవ ఎందుకని స్థానికులు అతడికి నచ్చజెప్పారు. వెంటనే అతడు ఇంట్లోకి వెళ్లిపోయాడు.

అప్పటి వరకు హడావిడి చేసిన సురేష్ గదిలోకి వెళ్లిన తర్వాత అతడి నుంచి స్పందన లేదు. కొద్దిసేపటి తర్వాత స్థానికులు, కుటుంబ సభ్యులు అతడి గదిలోకి వెళ్లిచూశారు. ఫ్యాన్‌కు చీరను కట్టి ఉరి వేసుకున్న పరిస్థితిలో సురేష్ కనిపించాడు. వెంటనే అతడిని కిందకు దింపి స్థానిక వైద్యుడిని పిలిపించారు. వైద్యుడు అతడిని పరీక్షించి.. అప్పటికే చనిపోయినట్టు ధ్రువీకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వరప్రసాద్ తెలిపారు.

 పండగకు వస్తాడనుకుంటే..
 పసలపూడిలోని సర్వారాయ నగర్‌కు చెందిన మాధురితో సురేష్‌కు ఐదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి నాలుగేళ్ల పాప ఉండగా, ప్రస్తుతం మాధురి ఏడో నెల గర్భిణీ. వైద్య పరీక్షల కోసం శనివారం ఆమె పుట్టింటికి వెళ్లిందని బంధువులు తెలిపారు. ఆదివారం ఆస్పత్రికి సెలవు కావడంతో సోమవారం వేమగిరి రావాల్సి ఉంది. అయితే పండగకు తానే వస్తానని ఆదివారం సాయంత్రం సురేష్ ఆమెకు ఫోన్ చేసి చెప్పాడు. అదేరోజు అర్ధరాత్రి స్థానికులు ఫోన్ చేసి సురేష్ మరణవార్త చెప్పారని ఆమె విలపించింది.

మరిన్ని వార్తలు