అపోహలకు చెక్ పెట్టిన ఏపీ సర్కార్ 

16 May, 2020 19:45 IST|Sakshi

గరికపాడు సరిహద్దు వద్ద మైగ్రేషన్‌ యాప్‌ ప్రారంభం

సాక్షి, గరికపాడు : లాక్‌డౌన్ ‌నేపథ్యంలో ఉపాధి, చదువుల కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లిన వారు తిరిగి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. దీంతో అధికారులూ అప్రమత్తమవుతున్నారు.. వీరందరినీ క్వారంటైన్‌లకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం అపోహలకు చెక్‌ పెట్టింది. కృష్ణాజిల్లా గరికపాడు చెక్‌పోస్ట్‌ సరిహద్దులో స్పందన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. (24 శ్రామిక్‌ రైళ్లలో 27,458 మంది తరలింపు)


 
ఇందులో భాగంగా రాష్ట్ర సరిహద్దు గరికపాడు చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన (మైగ్రేషన్‌ యాప్‌) స్పందన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ సెంటర్‌ను కలెక్టర్‌ ఇంతియాజ్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా నుంచి రాష్ట్రానికి వచ్చే వారి వివరాలను మైగ్రేషన్‌ యాప్‌లో పొందుపరుస్తారన్నారు. ఆధార్‌ వివరాలతో పాటు వ్యక్తికి సంబంధించిన వివరాలను నమోదు చేస్తారన్నారు. వైద్య సిబ్బందితో ధర్మల్‌ స్కానింగ్‌ చేసి కరోనా వైరస్‌‌ లక్షణాలుంటే క్వారంటైన్‌ సెంటరుకు లేని వారికి స్టాంప్‌ వేసి హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించి పంపటం జరుగుతుందన్నారు. (జాగ్రత్తలు పాటిస్తూ తిరిగి కార్యకలాపాలు: సీఎం జగన్)

స్క్రీనింగ్‌ టెస్ట్‌ తరువాత వైద్య బృంధం క్లీన్‌ చిట్‌ ఇచ్చినా హోం క్వారంటైన్‌లో ఉండాలన్నారు. రెండు రాష్ట్రాల అధికారులు ఇచ్చిన పాస్‌లున్న వారిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్‌ వినియోగించాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఇబ్బందులు పడకుండా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వలస కూలీలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌ నుంచి వస్తున్న ఉత్తరప్రదేశ్‌ వలస కూలీలతో మాట్లాడి సూచనలు చేశారు. (సీఎస్ చొరవతో స్వస్థలాలకు..)

మరిన్ని వార్తలు