అశోక్బాబు కుట్రలు చేస్తున్నారు: దేవీ ప్రసాద్

18 Nov, 2014 13:20 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులు తమపై దాడి చేస్తున్నారంటూ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో దేవీ ప్రసాద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలోనే ఎక్కడా ఏపీ ఉద్యోగులపై ఎలాంటి దాడులు చేయలేదని గుర్తు చేశారు. అలాంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ ఉద్యోగులు ఎందుకు దాడి చేస్తారని ప్రశ్నించారు. 

అంతర్గత కలహాలతో కుస్తీ పడుతున్న ఏపీ ఎన్జీవోలు... తెలంగాణ ప్రభుత్వంతో యుద్దం చేసే ప్రయత్నాలను మానుకోవాలని దేవీ ప్రసాద్ హితవు పలికారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఏపీ ఎన్జీవో సంఘంలోని హైదరాబాద్ ఉద్యోగులు న్యాయమైన వాటా కోసం పట్టుపడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఏపీ ఎన్జీవోను ఏపీకి తరలించే క్రమంలో నిధులు, వాటాల కోసం ఆ సంస్థ ప్రతినిధులకు సమాధానం చెప్పలేక అశోక్బాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
 

మరిన్ని వార్తలు