సారూ.. సర్టిఫికెట్!

17 Nov, 2014 02:29 IST|Sakshi
సారూ.. సర్టిఫికెట్!

ప్రభుత్వ  నిర్లక్ష్యం కారణంగా ఫీజు రీరుుంబర్స్‌మెంట్ రాకపోవడంతో వృత్తి విద్యా కోర్సులు పూర్తిచేసిన వేలాదిమంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఫీజులు చెల్లిస్తే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వమంటూ కళాశాలల యాజమాన్యాలు మెలిక పెడుతున్నాయి. ఫీజులు చెల్లించే శక్తిలేక విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. రీరుుంబర్స్‌మెంట్ రెన్యూవల్ దరఖాస్తుకు విధించిన నిబంధనలు సైతం హడలెత్తిస్తున్నాయి.
 

* ఫీజులకు, పట్టాలకు లంకె
* విడుదల కాని రీయింబర్స్‌మెంట్ నిధులు
* వృత్తి విద్యా కోర్సులు పూర్తయినా విద్యార్థులకు దక్కని ఫలితం
* రూ.కోట్లలో బకాయిలు

యూనివర్సిటీ క్యాంపస్: జిల్లాలో వృత్తివిద్యా, సంప్రదాయ కోర్సులు పూర్తిచేసిన వారి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా  తయారైంది. కోర్సు పూర్తి చేసినా ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో ఫలితం దక్కడం లేదు. జిల్లాలో 32 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో అన్ని కళాశాలలు బీటెక్ కోర్సులు అందిస్తున్నాయి. 20 కళాశాలలు ఎంటెక్ కోర్సులు అందిస్తున్నాయి. 25 ఫార్మసీ, 20 నర్సింగ్, 42 డిగ్రీ, 35 ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు ఉన్నాయి. మూడు మెడికల్ కళాశాలలున్నాయి. వీటిలో లక్ష మందికిపైగా విద్యార్థులు ఉన్నారు.

ఏటా కోర్సు పూర్తిచేసి బయటకు వెళ్లేవారి సంఖ్య 30వేలకు పైమాటే. కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడమే ఇందుకు కారణం. ఫీజు చెల్లించలేని  కారణంగా ఏ ఒక్కవిద్యార్థీ ఉన్నత చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రారంభించారు. దీనివల్ల ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకోగలిగారు. ఆయన మరణానంతరం వచ్చిన పాలకులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై శీతకన్ను వేశారు.

అరకొర నిధులను మాత్రమే విడుదల చేస్తున్నారు. తద్వారా విద్యార్థులు  కోర్సులు పూర్తి చేసినా ఫలితం దక్కడం లేదు. కోర్సు పూర్తయినా ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో,  ఫీజులు చెల్లిస్తే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వమంటూ కళాశాలల యాజమాన్యాలు కచ్చితం గా వ్యవహరిస్తున్నారుు. ఫీజులు చెల్లించే శక్తిలేక విద్యార్థులు తీవ్ర ఆవేదన, మానసిక ఆందోళనకు గురవుతున్నారు.
 
మహిళా వర్సిటీకే రూ.2 కోట్ల బకాయిలు
శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలకు 2013-14 విద్యాసంవత్సరానికి రూ.1.8 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ రావాల్సి ఉంది. అలాగే 2010-11లో ఏ ఒక్కరికి ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదు. ఎస్వీయూనివర్సిటీలో సుమారు 50 శాతం మందికిపైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదు. కొందరికి  వచ్చినా పూర్తి శాతం రాలేదు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, పద్మావతి మహిళా డిగ్రీకళాశాలల్లో నూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. ప్రైవేటు కళాశాలల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహిళా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలకే 1.8 కోట్ల నిధులు అందాలి. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సంబంధించి బకాయిలు  ఏ మాత్రం ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
 
ని‘బంధన’లు కఠినతరం
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రెన్యూవల్ చేసుకోడానికి 2014-15 విద్యాసంవత్సరానికి  నోటిఫికేషన్  విడుదలైంది. విద్యార్థులు ఈ నెల 10వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలన్న నిబంధన పెట్టారు. దరఖాస్తు చేయాలంటే పదిరకాల డాక్యుమెంట్లు  జతపరచాలని మడ త పేచీ పెట్టారు. దరఖాస్తు నమూనాతోపాటు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, తల్లిదండ్రుల ఆధార్‌కార్డు, వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, జూన్ 2 తర్వాత  తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ  పత్రాలను జత పరచాలని  నిబంధన విధించారు. దీంతో విద్యార్థులు హడలెత్తుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విడుదల చేయాల్సిన బకాయిలను విడుదల చేయాల ని కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు