లాక్ డౌన్ : రీటైల్ దుకాణాలు, లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో

28 Mar, 2020 12:19 IST|Sakshi
ఫైల్ ఫోటో

30 శాతం రీటైల్ దుకాణాలు మూత పడే అవకాశం

18 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఫిబ్రవరి మొదట్లో ఆరంభమైన కరోనా మహమ్మారి (కోవిడ్-19) సంక్షోభంతో దేశీయంగా అనేక వ్యాపార సంస్థలు గణనీయంగా కీణించాయి. ముఖ్యంగా షాపింగ్ మాల్స్, రిటైల్ దుకాణాల ఆదాయం భారీగా క్షీణించింది. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ పరిస్థితులు రానున్ననెలల్లో కూడా కొనసాగితే 30 శాతం మోడ్రన్ దుకాణాలు మూతపడతాయని, లక్షలమంది ఉపాధి కోల్పోతారని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ  అసోసియేషన్ అందించిన తాజా నివేదిక ప్రకారం ఫిబ్రవరి చివరి నాటికి, వ్యాపారం 20-25 శాతం పడిపోయింది.  లాక్ డౌన్ తో ఈ నష్టాలు మరింత విస్తరించాయి.

భారతదేశంలో 15 లక్షలకు పైగా ఉన్న ఆధునిక రిటైల్ దుకాణాల ద్వారా రూ .4.74 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుంది. దాదాపు 60 లక్షల మంది ఉద్యోగులున్నారు. అయితే గత ఒకటిన్నర నెలల్లో వ్యాపారం 15 శాతానికి తగ్గింది. లాక్ డౌన్ సమయంలో తెరిచి ఉంచడానికి అనుమతించబడిన అవసరమైన వస్తువులను విక్రయించే దుకాణాలకు నష్టాలు తప్పడం లేదని తెలిపింది. ఇతర సాధారణ సరుకులను విక్రయించడానికి అనుమతి లేకపోవడంతో ఆయా సంస్థలను నష్టాలను చవిచూస్తున్నాయని తెలిపింది. మొత్తంమీద, దుస్తులు, ఆభరణాలు, బూట్లు  (కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, డ్యూరబుల్స్, ఐటి, టెలిఫోన్లు) రిటైల్‌పై గణనీయమైన ప్రభావం చూపిందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈవో కుమార్ రాజగోపాలన్ చెప్పారు.

జూన్ వరకు లాక్ డౌన్ కొనసాగితే, 30 శాతం రిటైల్ దుకాణాలను మూసివేసే పరిస్థితి వస్తుందని, దీనివల్ల 18 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని రాజగోపాలన్  ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సింగపూర్, కెనడా,  అమెరికా ప్రభుత్వాల మాదిరిగానే రిటైల్ పరిశ్రమకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించాలని కోరుతున్నారు. దీనిపై భారత ప్రభుత్వానికి లేఖ రాశామని  చెప్పారు.  అలాగే  తమ కంపెనీల్లో చాలా మంది  చిల్లర వ్యాపారులు తమ ఉద్యోగులకు 35-40 రోజుల చెల్లింపు సెలవు ఇస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. తమ ఉద్యోగులు, వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పామని, లాక్ డౌన్ సమయంలో వారికి వేతనం లభించేలా చూస్తామని వి-మార్ట్ రిటైల్ సీఎండీ లలిత్ అగర్వాల్ చెప్పారు. ఉద్యోగులకు జీతాల భరోసా ఇవ్వడంతో పాటు, సంస్థ తన అమ్మకందారులకు మద్దతుగా రూ .1.5 కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని  హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే   ఎండీ కవి మిశ్రా చెప్పారు. 

మరిన్ని వార్తలు