కరోనా : ఉద్యోగులను తొలగిస్తున్న టెక్‌ దిగ్గజం

23 May, 2020 16:50 IST|Sakshi

అమెరికాలో వేలాదిమందిపై వేటు  వేయనున్న ఐబీఎం

ఇండియాలో వందలమంది ఉద్యోగులపై వేట

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (ఐబీఎం) ఉద్యోగాల కోతకు నిర్ణియించింది.  ప్రత్యేకమైన, క్లిష్ట  పరిస్థితి నేపథ్యంలో  ఉద్యోగులను  ఇంటికి పంపించేందుకు నిర్ణయించింది. శుక్రవారం అర్థరాత్రి మీడియాకు ఇచ్చిన ఒక ప్రకటనలో తొలగింపులను కంపెనీ ధృవీకరించింది. ఈ నిర్ణయం తమ ఉద్యోగులలో  సృష్టించే  కష్టమైన పరిస్థితిని గుర్తించి, జూన్ 2021 నాటికి బాధిత యుఎస్ ఉద్యోగులందరికీ ఐబీఎం సబ్సిడీ వైద్య కవరేజీని అందిస్తుందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

కోవిడ్-19, లాక్‌డౌన్‌ కారణంగా సంభవించిన నష్టాలతో భారత సంతతికి చెందిన అరవింద్‌ కృష్ణ నేతృత్వంలోని టెక్ దిగ్గజం ఐబీఎం కూడా   ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల లీగ్‌లో చేరింది.  అయితే తాజా నిర్ణయంతో  ఎంతమంది ప్రభావితమవుతున్నారో  ఐబీఎం వెల్లడించలేదు.  కానీ వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని మీడియా నివేదికలు తెలిపాయి. ముఖ్యంగా మధ్య స్థాయి ఉద్యోగులపై వేటు వేయనుంది.  అమెరికాలో కనీసం ఐదు రాష్ట్రాల్లో వేలాది మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. వీరిలో భారతదేశంలో కొన్ని వందల ఉద్యోగులు కూడా ప్రభావితం కానున్నారు.  బాధిత ఉద్యోగులకు మూడు నెలల  వేతనాన్ని  చెల్లించనుంది.

మరిన్ని వార్తలు