వాట్సాప్ యూజర్లకు శుభవార్త

21 Apr, 2020 16:42 IST|Sakshi

గ్రూపు వీడియోకాలింగ్ పరిమితి పెంపు

ఇకపై ఎనిమిది  మంది ఒకేసారి వీడియో కాల్ చేసుకోవచ్చు

ఇప్పటివరకూ ఈ పరిమితి నలుగురికే

సాక్షి, న్యూఢిల్లీ :  కరోనా  కష్టకాలంలో  ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ శుభవార్త చెప్పింది.  లాక్ డౌన్ సమయంలో ప్రపంచానికి దూరంగా, ఇంటికే పరిమితమవుతున్న తరుణంలో వాట్సాప్ కీలక ఫీచర్ ను అపడేట్ చేసింది.  ఇప్పటివరకు నలుగురికి మాత్రమే అవకాశం వున్న  వీడియో కాలింగ్  పరిమితిని ఇపుడు ఎనిమిదికి పెంచింది.  కరోనా విస్తరణ, లాక్ డౌన్ పరిస్థితుల్లో గ్రూప్ వీడియో, ఆడియో కాలింగ్ కు ఆదరణ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ అవకాశాన్ని వాట్సాప్ సమయానుకూలంగా అప్ డేట్ చేసింది.

వాబేటా ఇన్ఫో అందించిన సమాచారం  ప్రకారం ఈ పెరిగిన పరిమితి ఆండ్రాయిడ్ వాట్సాప్ వీ2.20.133 బీటా, ఐఫోన్ వాట్సాప్  వెర్షన్ 2.20.50.25 బీటాలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. రెండు ప్లాట్‌ఫామ్‌లలోని బీటా వినియోగదారులకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.  దీనికోసం  అయితే యూజర్లు సరికొత్త బీటా వెర్షన్‌ కలిగి ఉండాలని వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్ తెలిపింది. 

వాట్సాప్‌లో గ్రూప్ కాల్ చేయడానికి,  కుడి ఎగువన ఉన్న కాల్ బటన్ పై క్లిక్ చేయాలి. కాల్ అనంతరం యూజర్లను యాడ్ చేసుకోవాలి. గ్రూప్ కి సంబంధించి అయితే ఎనిమిది మందికి  ఒకేసారి  కాల్  చేసుకోవచ్చు. ఒకవేళ గ్రూపులో ఎనిమిదికంటే ఎక్కువ వుంటే.. అపుడు ఎవరికి కాల్ చేయాలనుకుంటున్నారో వాట్సాప్ అడుగుతుంది.  అలాగే కాంటాక్ట్ లో సేవ్ చేయని వారిని  గ్రూపు కాల్ లోకి ఆహ్వానించలేం.

మరిన్ని వార్తలు