డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

24 Dec, 2019 10:40 IST|Sakshi
గాండ్ల వంశీ మృత దేహం

కర్నూలు:  నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ(ఎంఎస్‌సీఎస్‌) రెండో సంవత్సరం చదువుతున్న గాండ్ల వంశీ (20) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాల్గో పట్టణ సీఐ శ్రీనివాసరెడ్డి కథనం మేరకు.. నగరంలోని కమలానగర్‌లో నివాసం ఉంటున్న కృష్ణారావు, పద్మావతి దంపతులు స్థానిక సీవీ రామన్‌ కాలేజీలో వంట మనుషులుగా పనిచేస్తున్నారు. వీరి ఏకైక కుమారుడు గాండ్ల వంశీ. చదువుపై శ్రద్ధ చూపకపోవడంతో మొదటి సంవత్సరం కొన్ని సబ్జెక్టులు ఫెయిలయ్యాడు.

అప్పటి నుంచి తాను సినిమాల్లోకి వెళతానని, చదువుపై శ్రద్ధ లేదని తల్లిదండ్రులకు చెబుతుండేవాడు. డిగ్రీ పూర్తయ్యాక సినిమాల్లోకి వెళ్లమంటూ వారు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తలుపులు మూసి ఉండడంతో బద్దలు కొట్టి గదిలోకి వెళ్లి చూశారు. వంశీ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ మేరకు తండ్రి  కృష్ణారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్నూలు నాల్గో పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి..సోమవారం పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు.  

మరిన్ని వార్తలు