నోయిడా గ్యాంగ్‌ రేప్‌ కేసులో మలుపు

25 Apr, 2018 10:17 IST|Sakshi

సాక్షి,  : గ్రేటర్‌ నోయిడాలో 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలికపై సమీప బంధువు, స్నేహితులే అత్యాచారం చేశారని వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని తెలిసింది. తనపై గ్యాంగ్‌ రేప్‌ జరిగిందని ఆరోపించిన బాలికకు నిర్వహించిన వైద్యపరీక్షల్లో ఈ విషయం తేటతెల్లమైంది. బాలికపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు ఏవీ లభించలేదని డాక్టర్లు తెలిపారు. దాంతో పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం...
ఈ నెల 18న స్కూల్‌కి వెళ్లిన బాలిక తిరిగి వచ్చే క్రమంలో స్కూల్‌బస్‌ వెళ్లిపోయింది. దీంతో ఆమె ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఆ సమయంలో అదే దారిలో కారులో వస్తున్న ముగ్గురు అబ్బాయిలు ఆమెను ఇంటి వద్ద దించుతామని కారులో ఎక్కించుకున్నారు. అనంతరం కదులుతున్న కారులోనే తనపై సామూహిక అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాలిక తెలిపింది. స్పృహ కోల్పోయిన తనను గల్గోటియా కళాశాల సమీపంలో వదిలి వెళ్లారని తెలిపింది. తమ కూతురు ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారం‍భించిన పోలీసులు మంగళవారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో కాలేజీ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

చికిత్స అనంతరం బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం ఆ ముగ్గురు నిందితుల్లో ఒకరు తన సమీప బంధువని, మరొకరు తన క్లాస్‌మేట్‌ కాగా, మూడో వ్యక్తి తెలియదని చెప్పింది. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో బాలికకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరగలేదని తేలింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు