చిన్నారిపై లైంగిక దాడి

1 Aug, 2019 12:07 IST|Sakshi

మైలార్‌దేవ్‌పల్లి: కుటుంబ తగాదాలతో కక్షగట్టిన ఓ యువకుడు వరసకు మరదలయ్యే మూడున్నరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా  మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. బిహార్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం కాటేదాన్‌కు వలస వచ్చి స్థానిక శాంతినగర్‌లో నివాసముంటోంది. ఆమెకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె తన పెద్దకూతురును మేనల్లుడైన రాజుకు ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేసింది.

అల్లుడు, కూతురు కూడా మహిళ ఇంటికి సమీపంలోనే ఉంటున్నారు. ఆమె చిన్నకూతురు శాంతినగర్‌ అంగన్‌వాడీ పాఠశాలలో చదువుకుంటోంది. అయితే, మంగళవారం రాజు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి తన చిన్న మరదలను వెంట తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి సాయంత్రం అత్త ఇంటి వద్ద వదిలేశాడు. విషయాన్ని గమనించిన బాలిక తల్లి పోలీసులకు సమాచారం అందించింది. అయితే, కొంతకాలంగా రాజు అత్తతో గొడవపడుతున్నాడు. ఇటీవల పనికి వెళ్లకుండా మద్యానికి బానిసై ఇంటి వద్దే ఉంటున్నాడు. నిత్యం భార్యతో గొడవపడుతూ తల్లి వద్ద నుంచి డబ్బులు తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నాడు. ఈక్రమంలో కుటుంబ కలహాల నేపథ్యంలో రాజు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని ఇన్‌స్పెక్టర్‌ సత్తయ్యగౌడ్‌ తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు