సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ బాధితుడి ఇంటికి కన్నం వేశారు దొంగలు. ఈ సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అల్వాల్ ప్రగతి శీల కాలనీకి చెందిన వంశీకృష్ణ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. అతడికి కరోనా వైరస్ సోకడంతో గత నెల 11వ తేదీన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతనితో పాటు భార్య, పిల్లల్ని సైతం ప్రభుత్వ క్వారంటైన్లో ఉంచారు. వారు పూర్తిగా కోలుకున్న తర్వాత ఇంటికి తిరిగివచ్చారు. ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో అవాక్కయ్యారు. వెంటనే లోపలికి వెళ్లి చూసే సరికి పరిస్థితి అర్థం అయిపోయింది. ఇంట్లో దొంగలు పడి దోచారని గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పది తులాల బంగారు ఆభరణాలు 30 వేల రూపాయల నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. చదవండి : పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులకు ఆర్థికసాయం