పదో తరగతితోనే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

5 Dec, 2013 16:23 IST|Sakshi

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ).. పదో తరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది.. వివిధ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రూప్-సి కేటగిరీ కింద మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్) నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నేపథ్యంలో నియామక విధానం, ప్రిపరేషన్ ప్లాన్ తదితర అంశాలపై ఫోకస్..

 

 ఎంపిక విధానం:

 రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇందులో పేపర్-1, పేపర్-2 అనే రెండు పేపర్లు ఉంటాయి.

 

 పేపర్-1 ఇలా:

 పేపర్-1ను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రశ్నలను ఇంగ్లిష్, హిందీ భాషల్లో రూపొందిస్తారు. కమిషన్ విచక్షణాధికారం మేరకు స్థానిక భాషలో కూడా ప్రశ్నలను ఇచ్చే అవకాశం ఉంది. ఈ పేపర్‌లో నాలుగు విభాగాలు ఉంటాయి. వీటిల్లో 150 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు కేటాయించారు. సమాధానాలను గుర్తించడానికి 2 గంటల సమయం ఉంటుంది.

 విభాగం   ప్రశ్నలు   మార్కులు

 జనరల్ ఇంటెలిజెన్స్ - రీజనింగ్      25   25

 న్యూమరికల్ ఆప్టిట్యూడ్   25   25

 జనరల్ ఇంగ్లిష్       50   50

 జనరల్ అవేర్‌నెస్    50   50

 మొత్తం   150   150

 సంబంధిత విభాగాల్లోని ప్రాథమిక భావనలపై పట్టు సాధించడం ద్వారా ఈ పరీక్షలో సులభంగానే విజయాన్ని నమోదు చేసుకోవచ్చు. నెగిటివ్ మార్కింగ్ కూడా అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు (0.25) మార్కు కోత విధిస్తారు.

 

 విశ్లేషణకు పరీక్ష:

 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం అభ్యర్థిలోని విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించింది. ఈ క్రమంలో రెండు గుర్తుల మధ్య ఉండే సంబంధాన్ని గుర్తించడం, సామాన్య గణిత సమస్యలు వంటి నాన్ వెర్బల్ ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో చిత్రాల వర్గీకరణ (ఫిగర్ క్లాసిఫికేషన్), సంబంధాలు (రిలేషన్ కాన్సెప్ట్స్), నిర్ణయాత్మక సామర్థ్యం (డెసిషన్ మేకింగ్, జడ్జ్‌మెంట్), భేదాలను గుర్తించడం (డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్), సమస్య సాధన, ఇచ్చిన సమస్యను విశ్లేషించడం, నంబర్ సిరీస్, నాన్-వెర్బల్ సిరీస్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అంతేకాకుండా అమూర్త చిత్రాలు-గుర్తులు-వాటి మధ్య సంబంధాల పట్ల అవగాహనను పరీక్షించే విధంగా కూడా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అడిగే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ సులభంగానే ఉంటాయి. కాబట్టి సంబంధిత అంశాలపై ప్రాథమిక అవగాహన ఉంటే వాటిని సులభంగానే సాధించవచ్చు. మిగతా అంశాల విషయానికొస్తే.. ఆయా అంశాలు అకడమిక్ పరంగా ఎక్కడా ఎదురు కావు. కేవలం మన విశ్లేషణ సామర్థ్యాన్ని ఉపయోగించి మాత్రమే సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువగా ఈ తరహా ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం మంచిది. మరో విషయం ప్రశ్నలు చూడగానే సులభంగానే అనిపిస్తాయి. కానీ కొంచెం క్లిష్టతతో కూడి ఉంటాయి. కాబట్టి సమాధానాన్ని గుర్తించే ముందు ఒకటికి రెండు సార్లు ప్రశ్నను చదవడం మంచిది.

 

 ప్రాథమిక పరిజ్ఞానం:

 ఇంగ్లిష్‌లో అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో ఇంగ్లిష్ భాషకు సంబంధించిన ప్రాథమిక భావనల ఆధారంగా అధిక శాతం ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో వొకాబ్యులరీ, వ్యాకరణం, వాక్య నిర్మాణం (సెంటెన్స్ స్ట్రక్చర్), సినానిమ్స్, యాంటో నిమ్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సాధారణంగా అభ్యర్థుల్లో ఇంగ్లిష్ అంటే కొంచెం క్లిష్టం అనే భావన నెలకొని ఉంటుంది.

 

 

 వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ భావన నుంచి త్వరగానే బయటపడొచ్చు. ఈ క్రమంలో వ్యాకరణ (గ్రామర్) విభాగంపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఇంగ్లిష్ ప్రిపరేషన్‌లో సగ భాగం వరకు ఈ అంశానికే కేటాయించడం మంచిది. వేగంగా చదవడం అలవర్చుకోవాలి. రీడింగ్ కాంప్రెహెన్షన్‌లో మెరుగైన మార్కులు సాధించేందుకు ఇది దోహద పడుతుంది. అంతేకాకుండా ప్రశ్నను ముందు చదివి.. తర్వాత పేరాగ్రాఫ్‌ను చదవడం చక్కని ఎత్తుగడ. తద్వారా పేరాగ్రాఫ్ చదువుతున్నప్పుడే సంబంధిత ప్రశ్నలకు కావల్సిన సమాధానాలపై ఒక స్పష్టత ఏర్పడుతుంది. దాంతో సమాధానాన్ని తేలిగ్గా గుర్తించవచ్చు.

 

 జనరల్ టిప్స్

 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ విభాగాల్లోని ప్రతి అంశం నుంచి కనీసం 30 ప్రశ్నలను సాధించాలి.

 మాదిరి/గత ప్రశ్నపత్రాలను సాధించేటప్పుడు ముందుగా సులభమైన వాటిని.. తర్వాత క్లిష్టమైన ప్రశ్నలను సాధించడానికి ప్రయత్నించాలి.

 మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ విషయంలో షార్ట్‌కట్ మెథడ్స్‌ను రూపొందించుకోవాలి. తద్వారా పరీక్షల్లో చాలా సమయం ఆదా అవుతుంది.

 పరీక్షలో ముందుగా జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్ విభాగాలతో ప్రారంభించడం మంచిది. ఎందుకంటే ఈ రెండు విభాగాలకు కలిపి అత్యధిక వెయిటేజీ (100 మార్కులు) కేటాయించారు.

 

 గణిత సామర్థ్యం:

 న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అభ్యర్థిలోని గణిత సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగం. ఇందులో నంబర్ సిస్టమ్, దశాంశమానం, వివిధ భిన్నాలు, శాతాలు, నిష్పత్తులు, అనుపాతం, సగటు, లాభం-నష్టం, క్షేత్రమితి, కొలతలు, సరళ వడ్డీ, చక్ర వడ్డీ, కాలం-పని, కాలం-దూరం, వైశాల్యం, ఘనపరిమాణం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులో మెరుగైన స్కోర్‌కు తక్కువ సమయంలో ఎక్కువ సమస్యలను సాధించే విధంగా షార్ట్‌కట్ మెథడ్స్, కొండ గుర్తులను నేర్చుకోవాలి. సూత్రాల ఆధారంగా లెక్కలను సాధించడం అలవర్చుకోవాలి.

 

 ఈ విభాగంలో అడిగే ప్రశ్నలు తార్కికంగా, లోతుగా కాకుండా కనీస పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. కాబట్టి గణితంలో కీలకమైన గుణకారం, భాగహారం, కసాగు, గసాభా వంటి ప్రక్రియల్లో పట్టు సాధించాలి. పరీక్షలో సాధ్యమైనంత వరకు ఈ అంశాన్ని చివర్లో ప్రయత్నించడం మంచిది. ఎందుకంటే ఈ విభాగానికి తక్కువ వెయిటేజీ ఉంటుంది.

నోటిఫికేషన్ సమాచారం

ఎస్‌ఎస్‌సీ-మల్టీటాస్కింగ్ స్టాఫ్

పేబాండ్: రూ.5,200-రూ. 20,200+1,800(గ్రేడ్‌పే).

 అర్హత: మెట్రిక్యులేషన్/తత్సమానం.

 వయసు: 18-25 ఏళ్లు (జనవరి 1, 2014 నాటికి)

 పరీక్ష ఫీజు: రూ.100 (మహిళా, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు).

 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో లేదా వెబ్‌సైట్ దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలి.

 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:డిసెంబర్ 13, 2013

 రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, గుంటూరు, తిరుపతి, కర్నూలు, విశాఖపట్నం, రాజమండ్రి.

 వివరాలకు: http://ssc.nic.in, sscsr.gov.in

 

 జనరల్ అవేర్‌నెస్:

 పరీక్షలో..  ముందుగా ఈ అంశం నుంచి పరీక్షను ప్రారంభించడం మంచిది. ఎందుకంటే ఇందులో ప్రశ్నలు తేలిగ్గా అనిపించడమేకాకుండా నేరుగా కూడా ఉంటాయి. అంతేకాకుండా సమాధానాన్ని గుర్తించడానికి తక్కువ సమయం సరిపోతుంది. మరో విషయం ఈ విభాగానికి అధిక వెయిటేజీ ఇచ్చారు. ఈ విభాగానికి సంబంధించి స్టాక్ జనరల్ నాలెడ్జ్ (జీకే), కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, క్రీడారంగం తదితర విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.  కరెంట్ అఫైర్స్ కోసం ప్రతి రోజూ వార్తా పత్రికలను చదువుతుండాలి. కీలకమైన సమాచారాన్ని నోట్స్ రూపంలో పొందుపరుచుకోవాలి.

 

 ఈ విభాగం చూడ్డానికి విస్తృతంగా ఉన్నప్పటికీ..  సీబీఎస్‌ఈ ఆరు నుంచి పదో తరగతి వరకు సైన్స్, సోషల్ పుస్తకాలను చదవడం లాభిస్తుంది. ముఖ్యంగా అందులోని శాస్త్ర పరిశోధన సంస్థలు, ప్రముఖ శాస్త్రవేత్తలు, వివిధ శాస్త్రసాంకేతిక కార్యక్రమాలు-వాటి పురోగతి, ఎకానమీకి సంబంధించి జీడీపీ, ఫిస్కల్ పాలసీస్ వంటి అంశాలపై అధికంగా దృష్టి సారించాలి. ఈ విభాగంలో చక్కని స్కోర్ చేయాలంటే దృష్టి సారించాల్సిన అంశాలు: దేశాలు- రాజధానులు- కరెన్సీ-భాషలు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సంస్థలు, జాతీయ పార్కులు, అబ్రివేషన్స్, అంతరిక్ష పరిశోధనలు, భారత రక్షణ వ్యవస్థ, సమాచార రంగం, రవాణా వ్యవస్థ, భారతదేశం- రాజ్యాంగం, భారతదేశ చరిత్ర- ముఖ్యాంశాలు, ఇండియన్ నేషనల్ మూమెంట్, జనరల్ సైన్స్, వివిధ పరిశోధనలు- శాస్త్రవేత్తలు, శాస్త్రీయ పరికరాలు,  దేశాలు పూర్వపు పేర్లు-మారు పేర్లు, సరిహద్దు రేఖలు, అవార్డులు, క్రీడలు, విశ్వం- పుట్టుక,  తొలి వ్యక్తులు, బిరుదులు, నాట్యాలు- నృత్యాలు, ప్రముఖ రచయితలు- రచనలు, నదీ తీర నగరాలు, జాతీయ చిహ్నాలు, వివిధ సంస్థలు- నెలకొల్పిన ప్రదేశాలు, ప్రముఖుల నినాదాలు మొదలైనవి.

 

 సమానంగా వస్తే

 

 పేపర్-1లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను పేపర్-2 కోసం షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి మాత్రమే పేపర్-2కు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు. చివరగా పేపర్-1, 2లలో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకం ఖరారు చేస్తారు.

 పరీక్షలో ఇద్దరు అభ్యర్థులకు మార్కులు సమానంగా వస్తే కింది పేర్కొన్న ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుని నియామయం ఖరారు చేస్తారు. అవి..

 ఆబ్జెక్టివ్ పేపర్‌లో పార్ట్-3లో వచ్చిన మార్కులు

 ఆబ్జెక్టివ్ పేపర్‌లో పార్ట్-2లో వచ్చిన మార్కులు

 పుట్టిన తేదీ

 పేరులోని ఆంగ్ల అక్షర క్రమం (ఆల్ఫాబెటికల్ ఆర్డర్)

 

 డిస్క్రిప్టివ్‌గా:

 పేపర్-2 డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది. అభ్యర్థిలోని భాషా సామర్థ్యాలను పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో భాగంగా వ్యాసం (షార్ట్ ఎస్సే) లేదా లెటర్ రైటింగ్ అంశాలపై ప్రశ్న ఉంటుంది. ఇందులో సమకాలీన అంశాలు లేదా వ్యక్తిగత నేపథ్యం ఆధారంగా ప్రశ్నలు అడగొచ్చు. ఈ విభాగాన్ని అభ్యర్థుల ఆసక్తిని బట్టి వారి స్థానిక భాషలోనూ సమాధానాలు రాయొచ్చు. ఈ విభాగానికి 50 మార్కులు కేటాయించారు. సమాధానాల కోసం 30 నిమిషాల సమయం ఉంటుంది. ఈ విభాగాన్ని కేవలం అర్హత పరీక్షగా మాత్రమే పరీక్షిస్తారు.

 

 రిఫరెన్స్ బుక్స్

 

 ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్-ఎస్.చాంద్ పబ్లికేషన్స్

 మల్టీస్టాఫ్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్-

 అర్హింత్ పబ్లికేషన్స్

 మోడ్రన్ అప్రోచ్ టు వెర్బల్-నాన్ వెర్బల్ రీజనింగ్-ఆర్‌ఎస్ అగర్వాల్

 ఇండియా ఇయర్ బుక్

మరిన్ని వార్తలు