ఆలయాలలో సంబరాలా?

2 Jan, 2018 01:56 IST|Sakshi

విశ్లేషణ
కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయాల్లోకి అర్ధరాత్రి భక్తులను అనుమతిం చడంపై నిషేధాన్ని న్యాయస్థానాలు సమ్మతించకపోవచ్చు.. కానీ, మన పూజా స్థలాలను మన కష్టాలు తెలుపుకునే చోటుగా మాత్రమే ఉంచాలి.

నూతన సంవత్సరానికి స్వాగతం పలికే సందర్భంగా భక్తులు ఆలయాల్లో అర్ధరాత్రిపూట చేసే పూజ లను, దైవ సందర్శనలపై నిషేధించడానికి గత వారం మద్రాస్‌ హైకోర్టు తిరస్కరించింది. అదేవిధంగా, హైదరాబాద్‌లోని హైకోర్టు కూడా భక్తుల హక్కులను ఎత్తిపట్టింది. ఈ రెండింటి మధ్య పోలికకు ప్రాధాన్యముంది.

అంతకుముందు హైదరాబాద్‌ సమీపంలోని చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి నూతన సంవత్సరం సందర్భంగా ఆలయం లోపల తనకు ఎవరైనా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినట్లయితే వారిని శిక్షిస్తానని హెచ్చరించారు. ఎందుకంటే నూతన సంవత్సరం అనేది ఇంగ్లిష్‌ సంప్రదాయమే కానీ భారతీయ సంప్రదాయాలతో దానికి సంబంధం లేదట. ఎవరైనా తనకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపితే వారిచేత ఆరు గుంజీళ్లు తీయిస్తానని ఆయన అన్నారు. ఆలయ సందర్శనకు వచ్చేవారు గర్భగుడి చుట్టూ ప్రశాంతతకు భంగం కలిగించకూడదంటూ ఆలయ పూజారి భక్తులను హెచ్చరించడంలో తప్పేమీ లేదు. నూతన సంవత్సరాది నాడు అలాంటి భక్తుల వైఖరి ఇతర భక్తులను ఇబ్బంది పెడుతుంది.

వేడుకలను జరుపుకోరాదని చెప్పడం ఒక ఎల్తైతే , తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలి పినవారిని శిక్షిస్తానని చెప్పడం మరొక ఎత్తు. ప్రపంచవ్యాప్తంగా జార్జియన్‌ కేలండర్‌ ప్రకారం జరుపుకునే కొత్త సంవత్సరాదిని తోసిపుచ్చడం భావ్యం కాదు. మన విశ్వాసాలతో పాటు ఇతర విశ్వాసాలు కూడా ప్రజలపై పనిచేస్తుంటాయి. పైగా మనందరికీ చాలా సులభంగా అర్థమయ్యే కేలండర్‌ అది.
ఈ ప్రపంచంలో వారాంతాలను ఎలా నిర్ణయిస్తున్నారు? మన వారాంతపు సెలవు దినం ఏదో మనం ఎలా తెలుసుకోగలం? మనకు వేతనం వచ్చే రోజు ఎప్పుడని రూఢిగా చెప్పగలం? ఎందుకు ఇప్పుడు గందరగోళం సృష్టించడం? ఇక్కడ కొన్ని కారణాలున్నాయి. ముస్లింలు తమదైన లూనార్‌ కేలండర్‌ని అనుసరిస్తారు. హిందువుల పర్వదినాల్లాగే ముస్లింల పర్వదినాలు కూడా జార్జియన్‌ కేలండర్‌కు భిన్నమైన తేదీల్లో జరుగుతుం టాయి. పంచాంగం ఒక స్వయంసిద్ధ గణకుడిలాగా సమాచారం అందిస్తుంది. ఇది జార్జియన్‌ కేలండర్‌ లాగే రోజులు, తేదీలను లెక్కిస్తుంది.

హిందువులు తమ పంచాంగానికి, ముస్లింలకు తమ సంప్రదాయాలకు కట్టుబడినట్లయితే, ఈద్‌ పండుగ ఏ తేదీన వస్తుందో ఎవరికి తెలుసు? బ్యాంక్‌ సెలవు ఎప్పుడు? పాఠశాలకు, కాలేజీకి, ఆఫీసుకు మనం ఎప్పుడు వెళ్లాల్సిన అవసరం లేదు? లేదా మన అంగడిని ఎప్పుడు తెరువకూడదు వంటివి మనకు ఎలా తెలుస్తాయి? దీపావళి ఎప్పుడు వస్తుందో, తమ పర్వదినం ఎప్పుడు వస్తుందో ముస్లింలు ఎలా తెలుసుకోగలుగుతారు? ఇలాంటి ప్రశ్నలు సాదాసీదాగానే కనిపిస్తాయి కానీ, మన రోజువారీ జీవితాల్లో వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జార్జియన్‌ కేలండర్‌ మినహా మరే ఇతర కేలండర్‌ లేని క్రైస్తవులు వారు భారతీయులైనప్పటికీ తక్షణమే ఇంగ్లిష్‌ వాళ్లయిపోతారా? నిస్సందేహంగా ఇదొక అసంబద్ధ విషయం.

మన దేశం రెండు రకాల జీవితం గడుపుతున్న ఈ సందర్భంలో, మన పంచాంగం ఇస్లాం పర్వదినాలను సూచించడం లేక ఇస్లామిక్‌ పంచాంగం కూడా హిందూ పర్వదినాలను సూచించడం పెద్ద విషయమేమీ కాదు. కాగా, జార్జియన్‌ కేలండర్‌ రెండు మత విశ్వాసాలకు చెందిన పర్వదినాలను తనలో కలుపుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇది సులభంగా ఉపయోగించే కేలండర్‌గా మారింది. మరోవైపున రెండు మతాలకు చెందిన సంకుచిత నాయకులు  మనకంటూ ఒక ఉమ్మడి కేలండర్‌ను అనుమతించనంతగా మనం వేరుపడిపోయాం. నూతన సంవత్సరాదికి కాకుండా ఉగాదికి ఆలయ పూజారి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, మనం జార్జియన్‌ కేలండర్‌ని పాటిస్తున్నందున, ఆయనకు అలా చెప్పే హక్కు, అధికారం ఉంటాయి. అయితే చాలామంది రెండు పర్వదినాలనూ జరుపుకోవాలని భావిస్తున్నారు.

కాగా, డిసెంబర్‌ 31, జనవరి 1 సంబరాల పేరిట తిని, తాగి జనం పాటించే భోగాలను ఆలయంలోకి తీసుకురావడం చిలుకూరు బాలాజీ ఆలయ పూజారికి అభ్యంతరకరమైతే దాన్ని అర్థం చేసుకోవలసిందే మరి. మన పూజా స్థలాలను మనం దేవుడిని అభ్యర్థించే చోటుగా, ప్రశాంతంగా, హుందాగా ఉంచాల్సిన అవసరం ఉంది. పూజా స్థలాల్లో మనం ఇతరులతో గట్టిగా సంభాషించం. పైగా ఆలయ ప్రశాంతతకు అంతరాయం కలిగించకూడదు. అజాన్‌ మనల్ని ఇబ్బంది పెడుతున్నట్లుగా మన సొంత గలాభా అనేది గర్భగుడి ప్రశాంతతను చెదరనివ్వకూడదు. మన ప్రవర్తన వాంఛనీయమైనదిగా ఉండాలి. అలాంటి ప్రవర్తనను పాటించాలి అనుకుంటున్న ఆలయ పూజారికి నా మద్దతు ఉంటుంది.

మహేశ్‌ విజాపుర్కర్‌
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ : mvijapurkar@gmail.com

మరిన్ని వార్తలు