15తో ముగిసిన గడువు.. అపరాధ రుసుముతో దరఖాస్తుకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్–2017 పరీక్ష దరఖాస్తుకు గడువు ముగిసింది. శనివారం సాయంత్రానికి 2,13,741 దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగానికి 1,35,732, అగ్రికల్చర్, మెడిసిన్ కేటగిరీకి 75,263, రెండు విభాగాల్లో 1,373 మంది దరఖాస్తు చేసుకున్నవారున్నారు. దరఖాస్తు చేసుకోనివారు అపరాధరుసుము రూ. 500తో ఈ నెల 21 వరకు, రూ. వెయ్యితో ఈ నెల 27 వరకు, రూ. 5 వేలతో మే 3 వరకు, రూ.10 వేలతో మే 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మే 1 నుంచి 9 లోపు eamcet.tsche.ac.in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 12న ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు నిర్వహించనున్నట్లు కన్వీనర్ తెలిపారు.
దరఖాస్తులో సమస్యలు
ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియ విద్యార్థులకు చుక్కలు చూపింది. ఆన్లైన్ దరఖాస్తు పూరించే సమయంలో పలువురు విద్యార్థులకు హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం కనిపించలేదు. హైదరాబాద్ పరిధిలోని ఏ ఒక్క జోన్ కనిపించకపోవడం విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అలాగే విద్యార్థులు ఫీజు చెల్లించిన వెంటనే ఆ మేరకు ట్రాన్సాక్షన్ ఐడీ విద్యార్థి మొబైల్ నంబర్కు మెసేజ్ రూపంలో రావాలి.
కానీ చాలామంది విద్యార్థులకు రిఫరెన్స్ ఐడీ నంబర్ వచ్చినా.. ట్రాన్సాక్షన్ ఐడీ మాత్రం రాలేదు. చివరి తేదీకి వారం రోజుల ముందే ఫీజు చెల్లించినా కొందరికి ట్రాన్సాక్షన్ ఐడీ రాలేదు. రిఫరెన్స్ ఐడీ, ట్రాన్సాక్షన్ ఐడీతో పాటు ఇంటర్ హాల్టికెట్ నంబర్ నమోదు చేస్తేనే ఆన్లైన్ దరఖాస్తు ఓపెన్ అవుతుంది. కానీ పలువురు విద్యార్థులకు ట్రాన్సాక్షన్ ఐడీ అందకపోవడంతో దరఖాస్తు ప్రక్రియను మధ్యలోనే వదిలేశారు.