వినోద పన్నుపై వివరణ ఇవ్వండి

29 Mar, 2017 02:21 IST|Sakshi

నిర్మాతలు గుణశేఖర్, రాజీవ్‌రెడ్డి, నటుడు బాలకృష్ణలకు హైకోర్టు నోటీసులు

సాక్షి, హైదరాబాద్‌: వినోద పన్ను మినహాయింపు ప్రయోజనాలు సినీ ప్రేక్షకులకు అందడంలేదని, ఆ ప్రయోజనాలు వారికి వర్తింప చేసేలా ప్రభుత్వాలను ఆదేశించాలని దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, రుద్రమదేవి సినిమా నిర్మాత గుణశేఖర్, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా నిర్మాత రాజీవ్‌రెడ్డితో పాటు నటుడు నందమూరి బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది.

పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వాల నుంచి పొందిన వినోదపన్ను మినహాయింపు ప్రయోజనాలను నిర్మాతలే అనుభవిస్తున్నారని ఆ ప్రయోజనాలు ప్రేక్షకులకు కూడా వర్తింప చేయడానికి నిర్మాతల నుంచి ఆ మొత్తాలను రాబట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం కార్యదర్శి ఎం.వేణుగోపాలరావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు