టిక్...టిక్...టిక్...

3 Jan, 2016 01:34 IST|Sakshi
టిక్...టిక్...టిక్...

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఉత్కంఠ
నేడో... రేపో... రిజర్వేషన్లు
ఆ వెంటనే షెడ్యూల్....నోటిఫికేషన్
 
 సాక్షి, సిటీబ్యూరో:
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రకటన కోసం రాజకీయ పార్టీలతో పాటు వివిధ వర్గాల ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు హైకోర్టుకుఇచ్చిన హామీని అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు?.... వార్డుల రిజర్వేషన్ల ప్రకటన ఎప్పుడు విడుదలవుతుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.  వార్డుల రిజర్వేషన్ల కోసం రాజకీయ పక్షాలతో పాటు ప్రజలూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి మహిళలకు 50శాతం సీట్లు రిజర్వ్ కావడంతో అందరి దృష్టీ వాటిపైనే ఉంది. రిజర్వేషన్లు వెలువడితే తాము పోటీ చేయాల్సిన డివిజన్‌ను ఎంపిక చేసుకోవచ్చనిఎందరో ఎదురు చూస్తున్నారు.  
 
 నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి కావాల్సి ఉన్నం దున ఆది, సోమవారాల్లో వార్డుల రిజర్వేషన్లు, షెడ్యూలు వెలువడగలవని అంచనా వేస్తున్నారు. షెడ్యూలుతో పాటే నోటిఫికేషన్  వెలువరిస్తారనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. వార్డు రిజర్వేషన్లలో అభ్యంతరాలు ఉంటే నోటిఫికేషన్ వచ్చేలోగా ఎవరైనా హైకోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని .. ఆదివారం రిజర్వేషన్లు... సోమవారం షెడ్యూలు... గంటల తేడాతో నోటిఫికేషన్ జారీ కాగలవనే అంచనాలు ఉన్నాయి.
 
  నోటిఫికేషన్ వెలువడితే కోర్టుకు వెళ్లినా చేసేదేమీ ఉండదని.. ఆ మేరకుప్రభుత్వం జాగ్రత్త పడుతోందనేఅభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. నోటిఫికేషన్ నుంచి పోలింగ్‌కు నడుమ ఉండాల్సిన వ్యవధిని తగ్గిస్తూ జీవోకు సవరణ చేయనున్నారనే ప్రచారం  జరుగుతోంది. ప్రస్తుత చట్టం... నిబంధనల మేరకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన రోజు నుంచి పోలింగ్‌కు మధ్య 12 రోజుల వ్యవధి ఉండాలని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
 
  దీనిని వారం రోజులకు కుదించేలా చట్ట సవరణ చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బహుళ స్థాయి వంతెనలకు ఆదివారం శంకుస్థాపనలు జరుగనున్నాయి.  మధ్యాహ్నంలోగా అవి పూర్తి చేశాక... సాయంత్రం రిజర్వేషన్లు.. సోమవారం నోటిఫికేషన్ జారీ కానుందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు షెడ్యూలు వెలువడినప్పటికీ నోటిఫికేషన్ మాత్రం 8వ తేదీ తర్వాత వెలువడనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  
 

మరిన్ని వార్తలు