వైట్‌హౌస్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌

21 Mar, 2020 11:51 IST|Sakshi

వాషింగ్టన్‌ : మహమ్మారి కరోనా అమెరికా అధ్యక్షుడు నివాసం వైట్‌హౌస్‌ను తాకింది. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వ‌ద్ద ప‌నిచేసే బృందంలో ఓ వ్యక్తికి క‌రోనా వైర‌స్ పాజిటివ్‌గా తేలింది. గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్న అతనికి వైద్యులు నిర్వహించిన పరీక్షలో కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో వైట్‌హౌజ్ అప్రమ‌త్తమైంది. వైట్‌హౌజ్‌లో ప‌నిచేస్తున్న వారిలో వైర‌స్ సోకిన తొలి వ్యక్తిగా అత‌న్ని గుర్తించారు. అయితే వైర‌స్ సోకిన వ్యక్తితో అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ కానీ, ఉపాధ్యక్షుడు పెన్స్ కానీ దరిదాపుల్లోకి రాలేద‌ని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రట‌రీ కేటీ మిల్లర్  ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఇటీవ‌ల ట్రంప్ క‌రోనా ప‌రీక్షలు చేయించుకున్నా.. ఆ టెస్టులో అతనికి వైరస్‌ సోకలేదని తేలింది. కాగా వైరస్‌ ధాటికి అమెరికాలో ఇప్పటి వ‌ర‌కు ఆ వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 230 దాటిపోయింది. క‌రోనా సోకిన వారి సంఖ్య 20 వేల‌కు చేరుకున్నది. (కరోనా మరణ మృదంగం: మృతుల సంఖ్య 11వేలు)

మరిన్ని వార్తలు