సౌదీ రాజ కుటుంబంలో కరోనా కలకలం

9 Apr, 2020 17:22 IST|Sakshi

రియాద్‌ : ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి సౌదీ రాజ కుంటుంబంలో కలకలం రేపింది. సౌదీ రాజ కుటుంబంతో కొన్ని వారాల క్రితం సన్నిహితంగా మెలిగిన ఆ దేశ ప్రతినిధుల్లో 150 మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో అప్రమత్తమయ్యారు.రియాద్‌ గవర్నర్‌ ఫైసల్‌ బిన్‌కు కరోనా సోకడంతో ఇప్పటికే ఆసుపత్రికి తరలించారు. ఫైసల్‌ బిన్‌(72) వయసులో పెద్దవాడు కావడంతో అతన్ని ఐసీయుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఇప్పటికే సౌదీ రాజు సల్మాన్‌, యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌లతో పాటు మిగతావారు ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే సౌదీలో ప్రఖ్యాత మక్కా, మదీనాలను ప్రజలెవరు సందర్శించకుండా మార్చి మొదటివారంలోనే మూసివేశారు.(దేశంలో 5,734కు చేరిన కరోనా కేసులు)

సౌదీ రాజులు వేల సంఖ్యలో ఉన్న నేపథ్యంలో వారు క్రమం తప్పకుండా యూరోప్‌ దేశాలకు వెళ్లివస్తుంటారు. కాగా విదేశాల్లో వైరస్ బారిన పడే అవకాశం ఉండడంతో ఇప్పటికే వారందరిని సౌదీకి తీసుకువచ్చి క్వారంటైన్‌లో ఉంచారు. కరోనా విజృంభిస్తోన్నసమయం కావడంతో దేశం వెలుపల, అలాగే సౌదీ ప్రావిన్సుల మధ్య ప్రయాణాలు చాలావరకు పరిమితం చేశారు. అలాగే సౌదీలోని నాలుగు గవర్నెన్పెలతో పాటు ఐదు ప్రధాన నగరాలు 24 గంటల లాక్‌డౌన్‌లో ఉంచబడినట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. కాగా ఇప్పటివరకు సౌదీలో 2932 కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 41కి చేరింది.

మరిన్ని వార్తలు