మూడు విడతలుగా లాక్‌డౌన్‌ ఎత్తివేత

11 May, 2020 16:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇంగ్లండ్‌లో ఒకేసారి కాకుండా మూడు దశల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్ణయించింది. మే 13వ తేదీన మొదటి శ దశ ప్రారంభం అవుతుంది. మూడవ దశ జూలై వరకు కొనసాగుతుంది. మొదటి దశ లాక్‌డౌన్‌ సడలింపు కారణంగా ఇంగ్లండ్‌ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఎండలో కూర్చోవచ్చు. సమీపంలోని స్థానిక పార్కులకు వెళ్లి వ్యాయామాలు చేసుకోవచ్చు. అయితే ఇతరులతో సామాజిక దూరం మాత్రం పాటించాలి. సొంత కుటుంబ సభ్యులతో గ్రామం లేదా పట్టణం వెలుపలికి వెళ్లి సరదాగా గడపి రావచ్చు. వెసులుబాటు ఉన్నవాళ్లంతా ఇంట్లో నుంచే పని చేయాలి. పరిశ్రమలు, కార్యాలయాలకు వెళ్లక తప్పని వాళ్లు బుధవారం నుంచి విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. (సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం)

ఇక రెండో దశ సడలింపులో భాగంగా ఒకటి నుంచి ఆరవ తరగతి విద్యార్థుల వరకు పాఠశాలలు జూన్‌ ఒకటవ తేదీ నుంచి తెరచుకుంటాయి. ఆ తర్వాత సెకండరీ గ్రేడ్‌ పాఠశాలలకు, కాలేజీలు వేసవి సెలవుల తర్వాత తెరవాలని బ్రిటిష్‌ అధికారులు నిర్ణయించారు. అయితే తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. విద్యార్థులందరికి శానిటైజర్లు, బాడీ స్ప్రేలు ఉపయోగించడం తప్పనిసరి చేశారు. జూన్‌ ఒకటవ తేదీ నంచి అన్ని రకాల షాపులను తెరవాలని నిర్ణయించారు. బుధవారం నుంచే ప్రభుత్వ రవాణాను షరతులతో అనుమతిస్తున్నారు. మొత్తం సామర్థ్యంలో పది శాతం ప్రయాణిలను మాత్రమే అనుమతిస్తారు. కచ్చితంగా రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలి. అత్యవసరం ఉన్నవాళ్లు మాత్రమే ప్రభుత్వ రవాణాలో ప్రయాణించాలి. (మహా మంచి విషయం.. కరోనాలో పాజిటివ్..)

మూడవ దశ సడలింపులో భాగంగా జూలై మొదటి వారంలో రెస్టారెంట్లు, కేఫ్‌లు, సినిమా థియేటర్లు, ఆ తర్వాత బార్లు, పబ్బులను ప్రారంభించాలని బ్రిటన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. మూడు దశల్లోనూ సామాజిక దూరం పాటించాలని సూచించింది. ఏ దశలోనూ ఆంక్షలను ఉల్లంఘించిన జరిమానాను విధిస్తామని, దాన్ని కూడా 60 డాలర్ల నుంచి వంద డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. (కొంపముంచిన నైట్‌ క్లబ్‌లు.. పెరిగిన కేసులు)

మరిన్ని వార్తలు