ఒకే నెలలో ఆరు ఆడియో ఫంక్షన్లు

4 Jan, 2014 00:04 IST|Sakshi
ఒకే నెలలో ఆరు ఆడియో ఫంక్షన్లు

2014 జనవరి నెల... సంగీత దర్శకుడు చక్రికి జీవితాంతం గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈ నెలలో ఆయన స్వరాలందించిన ఆరు సినిమాల పాటల వేడుకలు జరగబోతున్నాయి. ఈ నెల రెండో వారంలో పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ‘రేయ్’ విడుదల కాబోతోంది. ‘దేవదాసు’ తర్వాత వైవీయస్ చౌదరితో చక్రి పనిచేస్తున్న చిత్రమిది. ఇందులో సాయిధరమ్‌తేజ్ హీరో. దీనికన్నా ముందు 6న ‘తను మొన్నే వెళ్లిపోయింది’ పాటల ఆవిష్కరణ జరగనుంది. వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇళయరాజా తర్వాత వంశీ చిత్రాలకు ఎక్కువ పనిచేసిన సంగీత దర్శకుడు చక్రీనే. వీరిద్దరి కలయికలో ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చాయి.
 
  శ్రీకాంత్-తరుణ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘వేట’ ఆడియో ఫంక్షన్ 8న, నట్టికుమార్ నిర్మించిన ‘యుద్ధం’ పాటల వేడుక 11న జరగనున్నాయి. శ్రీకాంత్ హీరోగా చేసిన ‘వీడికి దూకుడెక్కువ’ పాటలు కూడా అదే వారంలో విడుదల కానున్నాయి. రవిబాబు దర్శకత్వంలో ‘అల్లరి’ నరేష్ నటిస్తోన్న క్రేజీ ఫిల్మ్ ‘లడ్డుబాబు’ పాటలు కూడా ఈ నెలలోనే శ్రోతల్ని అలరించబోతున్నాయి. ఈ విషయమై చక్రి మాట్లాడుతూ -‘‘నా లక్కీ నంబర్ 6. ఒక్క నెలలోనే నా ఆరు సినిమాల ఆడియో ఫంక్షన్లు జరగడం చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో ఎప్పుడూ ఇలా జరగలేదు. అందుకే ఈ జనవరిని ఎప్పటికీ మరిచిపోలేను. 2014లో శ్రోతల్ని మరింత అలరించే విధంగా మంచి మ్యూజిక్ ఇస్తాను’’ అన్నారు.