దర్శకుడిపై నటి ఆరోపణలు

7 Oct, 2016 13:00 IST|Sakshi
దర్శకుడిపై నటి ఆరోపణలు

చెన్నై: దర్శకుడు సెల్వకణ్ణన్ వేధింపులకు గురి చేయడం వల్లే ఆత్మహత్యాయత్నం చేశానని సినీ నటి అతిథి అలియాస్ అథిరా సంతోష్ వెల్లడించింది. తనను చంపుతానని బెదిరించాడని వాపోయింది. గత నెల 28న విషం తాగి ఆమె ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ఆమె కోలుకుంది. సెల్వకణ్ణన్ పై నడిగర్ సంఘానికి ఫిర్యాదు చేశానని మీడియాతో అతిథి చెప్పింది. నడిగర్ సంఘంలో సభ్యుడు కానందున అతడిపై చర్య తీసుకోలేమని అధ్యక్షుడు విశాల్ చెప్పారని వెల్లడించింది. దీంతో సెల్వకణ్ణన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

మలయాళంలో ఇప్పటికే పలు టీవీ సీరియల్స్ లో నటించిన అతిథి, తమిళంలో 'నెదునల్వాడై' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రేమిస్తున్నానంటూ సెల్వకణ్ణన్ తన వెంటపడి వేధించాడని ఆమె ఆరోపించింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని వాపోయింది. తాను ఒప్పుకోకపోవడంతో చంపుతానని బెదిరించాడని తెలిపింది. అతడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించినట్టు వెల్లడించింది.