అక్కడ నన్నెవరూ గుర్తుపట్టరు!

20 Jun, 2014 01:12 IST|Sakshi
అక్కడ నన్నెవరూ గుర్తుపట్టరు!

 ‘‘అక్కడికెళ్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ‘నేను’ అనే భావన అక్కడ నాలో ఉండదు. ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు నేను అందరిలో ఒక్కదాన్నే. ఆ అనుభూతి నన్ను తెలీని ఆనందానికి లోనుచేస్తుంటుంది’’ అంటున్నారు ఐశ్వర్యరాయ్. ఇంతకీ ఐష్‌కి అంతటి ప్రశాంతతనిస్తున్న ఆ ప్రదేశం ఏంటా? అనుకుంటున్నారా! ముంబయ్‌లోని జుహూ అనే ప్రాంతంలో ఉన్న శనిదేవుని ఆలయం. ఈ ఆలయాన్ని ప్రతి శనివారం దర్శించుకుంటారు ఐష్. ఆ సమయంలో తనకు కలిగే అనుభూతుల గురించి మాట్లాడుతూ -‘‘సాధారణంగా నేను ఎక్కడకెళ్లినా అక్కడ హంగామా ఉంటుంది.
 
  సెలబ్రిటీని కాబట్టి అవన్నీ తప్పవు. కానీ... శని దేవాలయానికి వెళ్లేటప్పుడు మాత్రం అలాంటి హంగామా ఏమీ ఉండకుండా చూసుకుంటాను. ఎందుకంటే... అక్కడ నేను సెలబ్రిటీని కాను. అక్కడ దేవుడు మాత్రమే సెలబ్రిటీ. నేను సాధారణమైన భక్తురాలిని అంతే. అక్కడి భక్తులు కూడా నన్ను ఎప్పుడూ గుర్తు పట్టలేదు కూడా. ఎవరో సాధారణ స్త్రీ అని అనుకుంటారు. మా అమ్మాయి ఆరాధ్య పుట్టాక, తనను కూడా ప్రతి శనివారం వెంటబెట్టుకొని శనిదేవుని ఆలయానికి వెళ్తున్నాను. ఆ అలయంలో దొరికిన ప్రశాంతత నాకు ఇంకెక్కడా దొరకదు’’ అన్నారు.