మత భోధకుడు కృష్ణస్వరూప్ దాస్జీ మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యాలపై బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, నటి లిసా రే స్పందించారు. స్వామి నారాయణ్ భుజ్ మందిర్కు చెందిన కృష్ణస్వరూప్ దాస్జీ.. నెలసరి సమయంలో భర్తలకు వండిపెట్టిన స్త్రీలు వచ్చే జన్మలో కుక్కలై పుడతారని, ఆ వంట తిన్న భర్తలు ఎద్దులై పుడతారంటూ వ్యాఖ్యానించిన వీడియోలు తాజాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నటి లిసా రే ఓ కుక్క ఫోటోను ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘దీని పేరు జిన్ని.. తను గత జన్మలో తను ఓ మహిళ. నెలసరి సమయంలో భర్తకు వండిపెట్టింది. అంతేగాక ఓసారి తన భర్తను కూడా వండి తినేసింది. అందుకే ఈ జన్మలో ఇలా కుక్కలా పుట్టి తన జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. ఇక స్త్రీలంతా జిన్నిలా చేసి జీవితాన్ని ఆనందంగా గడపండి’ అంటూ ట్వీట్ చేశారు. ఇక ఆమె ట్వీట్కు కొంత మంది బాలీవుడ్ నటులు ఫన్నీ మీమ్స్తో సమాధానం ఇస్తున్నారు. ఈ ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(‘నెలసరిలో వంట చేస్తే కుక్కలుగా పుడతారు’)
This is Ginni.
She was a woman in her past life.
Ginni used to cook for her husband while she was menstruating.
Once she cooked her husband and ate him as well.
Now Ginni is born as Kutri and enjoying her life at fullest.
Be like Ginni.Via Mamta Jaswal pic.twitter.com/pvtemTl5tQ
— Lisa Ray (@Lisaraniray) February 21, 2020
అలాగే హీరో ఆయుష్మాన్ ఖురానా ‘అవునా.. తనని అనుకరించే ముందు ప్రజలు కూడా ఎవరిని అనుకరిస్తున్నారో ముందుగా తెలుసుకోవాలి. అంతేకాదు ప్రస్తుతం మనం అభివృద్ధి చెందుతున్న సమాజంలో ఉన్నాం. కాలానుగుణంగా మన ఆలోచనలు మారాలి. అయితే ఈ సమాజంలో రెండు రకాలుగా ఆలోచించే మనుషులు ఉన్నారు. కొంతమంది మారుతున్న కాలానుగుణంగా తమ ఆలోచనలను మార్చుకుంటుంటే.. మరికొందరు పాత పద్దతులనే ఆచరిస్తూ.. అవే సరైనవని బలంగా నమ్ముతారు. ఏదేమైనా ప్రజలు ప్రస్తుత సమాజాన్ని, మారుతున్న కాలాన్ని బట్టి నడుచుకోవాలన్న విషయాన్ని తప్పక అంగీకరించాల్సిందే’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక మత భోధకుడు కృష్ణస్వరూప్ దాస్జీ పురాణాల కాలం నుంచి నెలసరితో ఉన్న మహిళలు కొన్ని కట్టుబాట్లను పాటిస్తున్నారని, అవి పాటించని పక్షంలో వాళ్లను ద్వేషించినా తప్పు లేదని తన అనుయాయులకు చెప్పిన వీడియోలు బయటకు రావడంతో ఆయనపై ప్రగతిశీల వాదులు మండిపడుతున్నారు.