శ్రీదేవి కల నెరవేర్చాను : బోనీ కపూర్‌

6 Aug, 2019 18:02 IST|Sakshi

తమిళ స్టార్‌ హీరో అజిత్‌కు ఉన్న మాస్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతికి విశ్వాసం చిత్రంతో అభిమానులను పలకరించాడు. ఇక ఈ చిత్రం తమిళ నాట దాదాపు రెండు వందల కోట్లను కలెక్ట్‌ చేసి.. రికార్డులను క్రియేట్‌ చేసింది. ఇదే ఏడాది మరో చిత్రంతో అజిత్‌.. తన ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు. హిందీలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన.. పింక్‌ చిత్రాన్ని తమిళ్‌లో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ విడుదలవుతున్న సందర్భంగా.. నిర్మాత బోనీ కపూర్‌ భావోద్వేగానికి లోనయ్యారు.

ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ సమయంలోనే.. అజిత్‌తో ఓ చిత్రాన్ని నిర్మించాలని శ్రీదేవి భావించడం.. ఆమె కోరిక మేరకే ఈ రీమేక్‌లో నటించేందుకు అజిత్‌ ఒప్పుకోవడం  అందరికీ తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా విడుదలకు సిద్దం కావడం.. అంతేకాకుండా సింగపూర్‌లో ప్రీమియర్‌ షోలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత బోనీ కపూర్‌ స్పందిస్తూ.. శ్రీదేవి కలను నెరవేర్చాను అంటూ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. 

‘సింగపూర్‌లో ఉదయం 9 గంటలకు ప్రీమియర్‌ షో ప్రారంభమైంది.  శ్రీదేవి కల నెరవేర్చాను. అజిత్‌, దర్శకుడు వినోద్‌, ఇతర సాంకేతిక నిపుణులు లేకుంటే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. దీన్ని ఎప్పటికీ  గుర్తుంచుకుంటాను’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సినిమాకు హెచ్‌వీ వినోద్‌ దర్శకత్వం వహించారు.

మరిన్ని వార్తలు